10, డిసెంబర్ 2022, శనివారం

ఇద్దరు అచ్చమాంబలు - భండారు శ్రీనివాసరావు

మా కుటుంబంలో ఇద్దరు ప్రసిద్దులయిన స్త్రీ మూర్తులు వున్నారు. ఇద్దరి పేర్లు ఒకటే అచ్చమాంబ. ఒకరు భండారు అచ్చమాంబ. రెండవవారు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ. మొదటి ఆవిడ రెండో అచ్చమాంబకు స్వయానా మేనత్త.

డాక్టర్ అచ్చమాంబ కొమర్రాజు లక్ష్మణ రావు గారనే సుప్రసిద్ధ సాహితీవేత్త కుమార్తె. లక్ష్మణ రావు గారు భండారు అచ్చమాంబ గారి సోదరులు. వారిది కృష్ణా జిల్లా నందిగామ వద్ద పెనుగంచి ప్రోలు. ఆకాలపు ఆచారాల దృష్ట్యా అచ్చమాంబ గారికి తలితండ్రులు చదువు చెప్పించలేదు. అయితే ఎమ్మే వరకు చదివిన సోదరుడి పక్కనే వుండి సొంతంగా చదువు నేర్చుకుని అనేక భాషల్లో పండితురాలు కాగలిగిన పట్టుదల అచ్చమాంబ గారిది. తెలుగులో మొదటి కధ రాసింది భండారు అచ్చమాంబ అనే ప్రచారం ఒకటి వుంది. ఆవిడ మేనకోడలు డాక్టర్ కొమర్రాజు అచ్చమాంబ బెజవాడలో పేరెన్నికగన్న వైద్యురాలు. విజయ టాకీసు ఎదురుగా ఉన్న రామచంద్ర రావు రోడ్డు ( ఆయన మా పెద్ద మేనమామ, గొప్ప వకీలు)లో అచ్చమాంబ గారి ఆసుపత్రి వుండేది.
మా ఇళ్ళల్లో పురుళ్ళూ పుణ్యాలు అన్నీ అక్కడే. ఆవిడ పుణ్యమే!




విని వూరుకున్నంత సుఖం లేదు - భండారు శ్రీనివాసరావు

 

ఒకానొక కాలంలో నేను టీవీ చర్చలకు క్రమం తప్పకుండా అనుదినం వెడుతుండే బంగారు కాలంలో ఒకానొక రోజు...
టీవీ చర్చల విరామసమయంలో లేదా చర్చలకు, ముందూ తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో చర్చలకు వచ్చిన రాజకీయ పార్టీల ప్రతినిధులు అనేక ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటారు. వాటిల్లో నిజంపాలెంతో తెలియదు కాని, విన్నప్పుడు నిజమేనేమో అనిపించేలా వుంటాయి ఆ కబుర్లు. అలాటి ఉదంతం ఒకటి.
చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార పార్టీలో పైకి వచ్చిన బడా నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో ఛోటా నాయకుడికి రాజకీయ గీతాబోధ చేసాడిలా.
'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా మేనేజిమెంటు'
'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు ఛోటా నాయకుడు.
'అది తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్ పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని చెప్పి ఈ ఇరవై వేలు అతడికి ఇచ్చిరా. అలాగే, మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.
ఛో.నా., బ. నా. చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట పెట్టాడు.
'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా మట్టి బుర్రకు అర్ధం అయి చావలేదు'
'అదేమరి. నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా! మామూలు వాళ్ళకి అవకాశం అలాటప్పుడే దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి కారు కాసేపు అక్కడే ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి అంటే డ్రైవర్ ని మనం మంచి చేసుకోవాలి. అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్ కాలును, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం అయిందా? సమ్జే! అండర్ స్టాండ్!' అన్నాడు అన్ని భాషల్లో బ. నా.
'అయింది మహాప్రభో!' అనేసాడు ఛో.నా.
(తోకటపా: ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ ఎవరా రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి. చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే అలవాటులేని నేనూ అడగలేదు, విని వూరుకున్నంత సుఖం మరోటి లేదు. ఇలాంటి వాటినే మీడియా పరిభాషలో ఆఫ్ ది రికార్డ్ అంటారు)

4, డిసెంబర్ 2022, ఆదివారం

శనివారం రాత్రి వాట్సప్ రాలేదు

 ప్రతి శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూడూ మూడున్నర ప్రాంతంలో వాట్సప్ మెసేజ్ చప్పుడు చిన్నగా వినపడేది. నాకు తెలుసు అది ఖమ్మం నుంచి దుర్గా ప్రసాద్ పంపింది అని.

గత రెండు మూడు ఏళ్లుగా ప్రతి ఆదివారం ఆంధ్ర ప్రభలో నా ఆర్టికల్ వస్తోంది. E Paper చూడడం వస్తుంది కానీ దాన్ని క్రాప్ చేయడం తెలియదు. ఆ పని దుర్గా ప్రసాద్ చేసేవాడు. చాలా తేలిక ఈసారి హైదారాబాద్ వచ్చినప్పుడు నేర్పుతాను అని కిందటి వారమే చెప్పాడు .
రాత్రి మెసేజ్ చప్పుడు రాలేదు. కానీ మెలకువ వచ్చింది. ఇక ముందు అది రాదు అని అర్థం అయి మనసు ఆర్ధ్రం అయింది.
బై పెద్దబాబు బై!
మామయ్య.
రాజకీయ భీష్ముడు రోశయ్య – భండారు శ్రీనివాసరావు
(డిసెంబరు నాలుగు రోశయ్య ప్రధమ వర్ధంతి)
Published in Andhra Prabha today, Sunday.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కానీ, ఆ పిమ్మట తమిళనాడు గవర్నర్ పదవి కానీ కొణిజేటి రోశయ్యకు కోరుకుంటే వచ్చినవి కావు. ఈ పదవులను కోరుకునేవారు, కోరుకున్నవారు ఎంతోమంది ఉన్నప్పటికీ, అవే వెతుక్కుంటూ వచ్చి ఆయన్ని వరించాయి అంటే సబబుగా ఉంటుందేమో.
కీర్తిశేషులు సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ఆచార్య రంగా వంటి ఉద్దండ రాజకీయ నేతలతో సాహచర్యం చేసి, రాజశేఖరరెడ్డి వంటి యువతరం నాయకులతో కలసి మెలిసి పని చేసి, అనేక సంవత్సరాలపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు సారధ్యం వహించి, సర్వం వ్యాపారపరమయిన ప్రస్తుత రాజకీయరంగంలో ఇక ఇమడ లేనని తెలుసుకుని, ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసే వయసే కాదు, 'ఆ శక్తులూ, ఆ యుక్తులూ' తనకు లేవని అర్ధం చేసుకుని తనకు తానుగా తప్పుకున్న తత్వం రోశయ్య గారిది. అయినా ఆయన సుదీర్ఘ అనుభవం, అవినీతి మరకలు అంటని రాజకీయ జీవితం అక్కరకు వచ్చి మళ్ళీ ఆయనను రాజకీయ ప్రధాన యవనికపై నిలబెట్టాయి.
ఒక పెనువిషాదం రాష్ట్రాన్ని కమ్ముకున్న దురదృష్ట సమయంలో, మేరు పర్వతం లాంటి ఒక నాయకుడిని రాష్ట్ర కాంగ్రెస్ కోల్పోయిన విపత్కర తరుణంలో ఏ అండా లేని రోశయ్య, ఎవరూ ఊహించని రీతిలో ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు.
ఈ పదవి శాశ్వతం కాదని, అధిష్టానం ఆదేశిస్తే అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా తప్పుకుంటాననీ అంటూ, కావమ్మ మొగుడు సామెతను ఉటంకిస్తూ ఆయనే స్వయంగా అనేక పర్యాయాలు బాహాటంగా ప్రకటించారు. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే నీడలా వెంటపడి వచ్చే 'హంగూ ఆర్భాటాలను' సయితం ఆయన చాలా రోజులు దూరం పెట్టారు. అంతేకాదు, లోగడ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పాటిస్తూ వచ్చిన సంప్రదాయానికి విరుద్ధంగా, పదవిని స్వీకరించిన వెంటనే ఢిల్లీ విమానం ఎక్కని 'అరుదయిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి' అనే రికార్డ్ కూడా ఆయన ఖాతాలో చేరింది. ఇంకా చెప్పాలంటే, కొరకరాని కొయ్య అని పేరుగాంచిన 'పోలీసు బాసు'ని రాత్రికి రాత్రే మార్చేసారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, అంతకుముందు కొందరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులతోను అతి సన్నిహితంగా పనిచేసిన అధికారిని కేవలం సమర్ధత పాతిపదికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించగలిగారు. చిన్న పదవిని భర్తీ చేయాల్సి వచ్చిన ఢిల్లీ పెద్దలను సంప్రదించే సాంప్రదాయానికి స్వస్తి చెప్పిన ఘనత కూడా రోశయ్యదే. అనేక జిల్లాలలో కలెక్టర్లను, ఎస్పీలను బదిలీ చేశారు. రాజకీయ పార్టీలు అన్నింటికీ 'ఓట్ల వనరు'గా ఉంటూ వస్తున్న తెల్ల రేషన్ కార్డుల ప్రక్షాళనకు సయితం నడుం కట్టారు. జనాకర్షక పధకాలలోని ఆర్దికపరమయిన మంచి చెడుల పట్ల దృష్టి సారించారు.
స్వల్పకాలంలోనే ఇన్ని చేసినా ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రి’, 'అసమర్ధ ముఖ్యమంత్రి' అన్న ముద్ర నుంచి తప్పించుకోలేకపోయారు. కాంగ్రెస్ రాజకీయాలు అవపోసన పట్టిన రోశయ్యకు ఈ ప్రచారానికి వెనుక వున్న రాజకీయ కారణాలు తెలియవని కాదు. కానీ గుంభనంగా వుండిపోయారు.
ప్రయత్నం చేయని పదవి అయాచితంగా లభించినా అందులో ఆయన ప్రశాంతంగా గడిపిన సమయం బహు తక్కువ. ఒక దానివెంట మరొకటి చొప్పున సమస్యలు వరదల్లా వెల్లువెత్తాయి.
ఆంద్రప్రదేశ్ వంటి అతి ముఖ్యమయిన రాష్ట్రానికి ముఖ్య మంత్రిగా వుండడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అందరి కళ్ళు నిశితంగా గమనిస్తుంటాయి. రాజకీయ లబ్దినీ, రాజకీయుల ద్వారా లబ్దినీ పొందాలని చూసే శక్తుల 'శక్తియుక్తులు' అన్నీ ముఖ్యమంత్రి పీఠం చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. ఈ రకమయిన కుయుక్తి రాజకీయాలు నడిపే శక్తుల స్తాయినీ, స్తోమతనీ, సామర్ధ్యాన్నీ తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు.
రోశయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు, తలలు పండిన రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన్ని 'రోజులు,వారాల ముఖ్యమంత్రి' గానే లెక్కవేశారు. తాత్కాలిక ప్రాతిపదికపైన శాశ్వతంగా కొనసాగే వీలుచాళ్ళు కానరావడంతో సొంత పార్టీలోని ప్రత్యర్దుల నుంచి ముప్పేట దాడులు మొదలయ్యాయి. బయటి పోరుకు ఇంటిపోరు తోడయింది.
ఫలితం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తన పాత బాటలోనే ముఖ్యమంత్రి మార్పుకు సిద్ధపడింది. దరిమిలా రోశయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. చాలా రోజుల తర్వాత హాయిగా నిద్రపోయాను అని ఆయన తన సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు.
ముళ్ళకిరీటం వంటి ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత రోశయ్య చాలాకాలం మాజీ ముఖ్యమంత్రిగా వుండి పోయారు. పదవి లేకుండా క్షణం గడవని షరా మామూలు రాజకీయ నాయకుల మాదిరిగా కాకుండా ఆయన తన పార్టీకి వీర విధేయుడిగా ఎంతో ఓపిక ప్రదర్శించారు. ఆ నిరీక్షణ ఫలించింది. తమిళనాడు వంటి కీలక రాష్ట్రానికి గవర్నర్ అయ్యారు. జయలలిత వంటి ప్రాంతీయ పార్టీ అధినేత్రి ముఖ్యమంత్రిగా వున్న రాష్ట్రానికి గవర్నర్ గా నెగ్గుకు రావడంలో కూడా రోశయ్యకు వున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం అక్కరకు వచ్చింది.
ఒక సాధారణ పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ, భగవంతుడు ఇచ్చిన అసాధారణ ధారణ శక్తి, ప్రసంగ పాటవాలను సమయస్పూర్తితో వాడుకుంటూ శిఖరాగ్రాలకు చేరుకున్న కొణిజేటి రోశయ్య ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుతూ నిరుడు డిసెంబరు నాలుగో తేదీన తన 88వ ఏట కన్నుమూశారు.
ఆయన మరణంతో నిబద్ధత కలిగిన రాజకీయాల శకం ముగిసింది.
(04-12-2022)
ఆంధ్ర ప్రభ : Andhra Prabha Telugu News Paper | Andhra Prabha ePaper | Andhra Prabha Andhra Pradesh | Andhra Prabha Telangana | Andhra Prabha Hyderabad
EPAPER.PRABHANEWS.COM
ఆంధ్ర ప్రభ : Andhra Prabha Telugu News Paper | Andhra Prabha ePaper | Andhra 

3, డిసెంబర్ 2022, శనివారం

ఆఖరి ప్రయాణానికి అంతా సిద్ధం.

 పుట్టినప్పుడే టిక్కెట్టు కొన్నాను, ఏం లాభం అంత ముందుగానే కొన్నా, ఆర్ ఏ సీ పొమ్మన్నారు. రైలు బయలు దేరడానికి కొద్ది ముందుగా వచ్చి ఎవరైనా కేన్సిల్ చేసుకుంటే ఆ బర్త్ ఖాయం చేస్తారుట. చాలా కాలం వెయిట్ చేసి ఇక లాభం లేదనుకుని ప్రతి రోజూ వెళ్లి నా అదృష్టం పరీక్షించుకుంటున్నాను. ఏం లాభం. ఎక్కడెక్కడి వాళ్ళో వస్తున్నారు. నాకంటే ముందే రైలు ఎక్కుతున్నారు. ఎలా అంటే అదేదో ఈ క్యూ అంటారు. అదేదో తెలియకే ఇన్నాళ్ళు ఇలా ప్లాట్ ఫారం మీదే గడ్డాలు పెంచుకుంటూ వేచి వున్నాను. వెంట తీసుకువెళ్ళే లగేజ్ లేదు, అదో అదృష్టం. నేనొక్కడినే కాదు. ఎక్కడ చూసినా అదే జనం. వారిలో కొందరికి ఎలాగైనా రైలు ఎక్కాలని వుంది. కొందరికి ఈ రైలు తప్పిపోతే బాగుండు అనిపిస్తోంది.

 కానీ రైలు రావడం, బెర్త్ కన్ఫర్మ్ కావడం ఎవరి చేతిలో లేదుగా!

(ఈ రాతలు ఇప్పుడు పిచ్చిగా అనిపించినా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మంచిగా అనిపిస్తాయి, జీవితం అంటే అదే!, నేనూ అలాగే అనుకున్నాను వయసులో వున్నప్పుడు)

03-12-2022

ఆగిపోయిన దరహాసం – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు  శనివారం ఉదయం ఎప్పటిలాగే ఇంటి ముందు వరండాలో (మామూలుగా అపార్ట్ మెంట్ కల్చర్ లో వరండాకు వీలుండదు, కానీ ఏరికోరి ఆ ఏర్పాటు చేసుకున్నాడు) కుర్చీలో కూర్చుని ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నాడు మా మేనల్లుడు కౌటూరి దుర్గా ప్రసాద్. అలా మాట్లాడుతూనే ఓ పక్కకు ఒరిగిపోయాడు. దగ్గరలో ఆస్పత్రికి తీసుకు వెళ్ళారు కానీ ఫలితం దక్కలేదు. ఏకాదశి పుణ్య తిధినాడు అనాయాసంగా కన్ను మూశాడు నా మేనల్లుడు, ఆప్త మిత్రుడు పెద్దబాబు. పెద్ద బాబు ఇక లేడు అనే వార్తతో ఇంటిల్లిపాదీ ఒక్కసారి ఉలిక్కి పడ్డారు.

నాకంటే వయసులో చాలా చిన్న. కానీ ఆ చిన్నవయసులోనే ఒక మనిషి సాధారణ  జీవితంలో ఏమి సాధించవచ్చో అన్నీ సాధించే ప్రయత్నం చేశాడు.

డిగ్రీ పాసవుతూనే ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం, ఏడాది తిరగకుండానే ఖమ్మం నాగార్జున గ్రామీణ బ్యాంకులో ఆఫీసరు కొలువు, అది వదిలేసి ప్లీడరు ప్రాక్టీసు, ఆ పిదప రాజకీయ రంగ ప్రవేశం, జలగం వెంగళరావుకు అత్యంత ఆత్మీయుడుగా మారి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరో అవతారం, ఢిల్లీ దాకా వెళ్లి నానా ప్రయాస పడినా అసాధ్యం అనుకునే  కాంగ్రెస్ టిక్కెట్టు, అదీ ఎమ్మెల్యే టిక్కెట్టు ఇంటికే వచ్చి వొళ్ళో పడడం, రాజకీయం రంగూ రుచీ వాసనా తెలియని వయసులో అసెంబ్లీకి పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోవడం  అలా అన్నీ పాతిక ముప్పయి వయసు లోపలే జరిగిపోయాయి.

ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వర్ లింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక ఇందిరాగాంధి చాలా ఇబ్బంది పడ్డారు. దీనికి దుర్గాప్రసాద్  ప్రత్యక్ష సాక్షి. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావు తండ్రి) వున్నారు.  

ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెసు (కాంగ్రెస్ ఓ) లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?

ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి   ప్రభ్రుతులు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి వసతి సరిపోకనో యేమో మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడ బ్రేక్ ఫాస్ట్ బాధ్యత చోటా మోటా స్థానిక నాయకుల మీద పడింది.


(కౌటూరి దుర్గాప్రసాద్)


 

రాజకీయాల్లో ఆటుపోట్లన్నీ తట్టుకుని నిబ్బరంగా నిలబడ్డాడు. అందులో పైకి రాలేకపోయినా మొత్తం కుటుంబానికి మంచీచెడూ కనుక్కునే పెద్ద దిక్కుగా మారాడు.  

తనపై తనకు అంతులేని ఆత్మ విశ్వాసం, దాన్ని వ్యక్తీకరిస్తున్నట్టు ఎన్నడూ చెరగని దరహాసం. పెద్దబాబును చూస్తుంటే ఒక్కోసారి ఆశ్చర్యం వేసేది, ఒక్కోసారి భయం వేసేది. చాలాసార్లు  ధైర్యం కలిగేది.

ఎవరు ఏ సమస్యలో వున్నా సరే, అదో సమస్యా అని తేలిగ్గా అంటూ మనసుల్ని తేలిపరిచేవాడు. తనకు చేతనైన సాయం అడగకుండానే చేసేవాడు. తన సమస్యలను ఎవరి వద్దా ప్రస్తావించేవాడు కాదు.

1992 లో వివాహ రజతోత్సవం నాడు, ఖమ్మం నుంచి హైదరాబాదుకు ఓ గజమాలతో వచ్చి, దండలు లేని పెళ్లి చేసుకున్నానని అదే పనిగా గొప్పలు చెబుతుంటావు కదా! ఈరోజు మీ పెళ్లి నేను దగ్గర వుండి జరిపిస్తాను” అన్న పెద్దబాబును మరచిపోవడం సాధ్యం అయ్యే పనికాదు, వాడి మాటల్ని పదేపదే గుర్తు చేసుకోవడం తప్ప.

“అనాయాసేన మరణం, వినా ధైన్యేన జీవనం” ఈ సూక్తికి పెద్దబాబే పెద్ద ఉదాహరణ.

(03-12-2022)

 

 

27, నవంబర్ 2022, ఆదివారం

బుధజన దర్శనం

 నిన్న శనివారం అంతా బంధుజన, బుధజన దర్సనాలతో గడిచిపోయింది.

జ్వాలాతో కలిసి మా కుటుంబపు 108 (పిలిస్తే పలకడమే కాదు, వచ్చే పిల్లల డాక్టరు, మేనల్లుడు) డాక్టర్ ఏవీ మనోహర్ రావును అశోక్ నగర్ లోని వాళ్ల ఇంటికి వెళ్లి కలుసుకున్నాము.  పిచ్చాపాటి అనంతరం అక్కడే భోజనం చేసి, గాంధీ నగర్ లో ఉంటున్న డాక్టర్  మాడభూషి శ్రీధర్ ఇంటికి  ఫోన్ చేసి వెళ్ళాము. మా కోసం వరండాలో ఎదురుచూస్తూ వున్న శ్రీధర్ ని చూడగానే ప్రాణం లేచొచ్చింది. నన్నూ, జ్వాలాను, జ్వాలా శ్రీమతి విజయలక్ష్మిని చూడగానే శ్రీధర్ మొహం వెలిగిపోయింది. శ్రీధర్  శ్రీమతి కల్యాణి గారు చాలా ఆపేక్షగా పలకరించారు. శ్రీధర్, కల్యాణి కబుర్లు చెబుతుంటే అలా వింటూ పోయాము. ఇన్నాళ్లుగా పెదాలు దాటకుండా, కడుపులో దాచుకున్న మాటలన్నీ శ్రీధర్ నోట వెంట ధారాపాతంగా వెలువడుతుంటే చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా తన తల్లిగారు గురించి చెబుతుంటే కంటి వెంట నీళ్ళు తిరిగాయి.  కొడుకుని గుర్తు పట్టలేని అమ్మ, అమ్మ ఏమంటున్నదో అర్ధం కాని కొడుకు, వీళ్ళ పరిస్థితి ఏమిటో అర్ధం కాని కోడలు. నిజంగా సినిమా కధను తలదన్నేలా జరిగిపోయాయి వారి జీవితాల్లో సంఘటనలు. కల్యాణి గారు తమ జీవితంలో అత్యంత దురదృష్టపు ఘడియలను గుర్తు తెచ్చుకుని చెప్పారు. మొత్తం మీద శ్రీధర్ ఆధ్యాత్మిక భావాలు, కల్యాణి గారి మనో ధైర్యం శ్రీధర్ ని మళ్ళీ మామూలు మనిషిని చేసాయి.

(ఇదంతా ఏమిటి అయోమయంగా వుంది అనుకునే వాళ్ళు ఈమధ్య శ్రీధర్ రాసిన పెదవి దాటని మాటలు వ్యాసం చదవండి)

దంపతులిద్దరూ  నాకంటే వయసులో చిన్నవాళ్లు. లేకుంటే కల్యాణి గారి పాదాలకు నమస్కారం చేసేవాడిని.

అదే రోజు సాయంత్రం ఒక మిత్రుని కుమారుడి పెళ్లి రిసెప్షన్. ప్రముఖ సీ పీ ఎం నాయకుడు శ్రీ సీతారాం ఏచూరి కలిశారు.


(శ్రీ సీతారాం ఏచూరితో నేను, జ్వాల)

(శ్రీ మాడభూషి శ్రీధర్ తో నేను, జ్వాలా) 




(26-11-2022)

   

తెగుతున్న తీగెలు

 

(Published in Andhra Prabha today Sunday, 27-11-2022)
‘ఎందుకు అంకుల్ బ్యాంకు దాకా రావడం, ఇంట్లోనే కూర్చుని నెట్లో ట్రాన్సాక్షన్స్ చేసుకునే వీలుందిగా’ అన్నదా అమ్మాయి ఓచరుపై సంతకం చేయడానికి పెన్ను అడిగినప్పుడు. నిజమే. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా అన్ని పనులు చేసుకునే సదుపాయాలు వున్నాయి. అయితే బ్యాంకుకు వస్తే నాలుగు మొఖాలు కనబడతాయి. ఏమండీ ఎలా ఉన్నారని పలకరిస్తారు ఎవరో ఒకరు. ఈ బ్యాంకుతో నలభయ్ ఏళ్ళ అనుబంధం. ప్రమోషన్లు కాదనుకుని ఉండిపోయిన బ్యాంకు ఉద్యోగులు ఎంతో మంది గుర్తు పడతారు. అయితే కాలం తెచ్చే మార్పులు వింతగా వుంటాయి. నా కళ్ళ ముందే ఆ బ్యాంకు బ్రాంచి ఎన్నో హంగులు సమకూర్చుకుంది. కార్పొరేట్ ఆఫీసును తలదన్నేలా తయారయింది. కార్యకలాపాలు కూడా పెరిగాయి. అందుకు తగ్గట్టు ఉద్యోగులూ పెరిగారు. కంప్యూటర్ తెర వైపే చూస్తూ పనులు చేసుకుంటున్నారు. వచ్చిన కష్టమర్ మొఖాలను కూడా గుర్తు పట్టే పరిస్తితి లేదు. నన్ను ఏళ్ళ తరబడి చూస్తున్న వాళ్ళు మాత్రం పలకరింపుగా నవ్వుతారు. కాస్త వీలు చిక్కితే వారితో మాట కలుపుతాను. అయితే అది కూడా ఈ మధ్య తక్కువే. కాస్త విరామం దొరికినా వాళ్ళు కష్టమర్ల మొహం చూడ్డం లేదు. సెల్ ఫోను కబుర్లే సరిపోతున్నాయి.
‘ఎందుకు బాబాయ్ హైరానా పడుతూ దుకాణాలకు వెళ్లి సరుకులు కొంటావ్? సెల్లో ఆర్డరు చేస్తే వాళ్ళే మీ ఇంటికి తెచ్చి పడేస్తారు’ అంటాడు మా పక్క పోర్షన్ అబ్బాయి. అది నిజమే కానీ ఈ వయస్సులో మరి కాలక్షేపం ఎలా! కాలం దొర్లించాలంటే ఇలా ఏదో ఒక వ్యాపకం వుండాలి కదా! షాపు అతనికి నా అభిరుచులు తెలుసు. నా ఇష్టా ఇష్టాలు తెలుసు. సారుకు పలానా బ్రాండు కారం ఇవ్వాలిరా. మరచిపోకు అంటాడు తన పనబ్బాయితో. చేసేది వ్యాపారం అయినా ఎక్కడో సుతారంగా మనసుకు తాకుతాయి అతడి మాటలు. మొన్నీ మధ్య వెడితే ఆ షాపు కూల్చేశారు. దగ్గర్లో వున్న మాల్ కే వెళ్లాలి. అంతా కలయ తిరుగుతూ, ట్రాలీ తోసుకుంటూ, దాన్ని నింపుకుంటూ, అవసరం లేని వాటిని కూడా కనబడ్డాయని కొనుక్కుంటూ ....అలా అలా కాలం దొర్లించడమే. మనుషులు కనబడుతూనే వుంటారు, మాటలకే కరువు.
ఒక్క ఫోన్ కొడితే అన్నీ ఇంటికే వచ్చి పడుతున్నాయి. వెనకటి బేరసారాలు లేవు. ఎందుకో యాంత్రికం అనిపిస్తుంది. అలా మార్కెట్టుకు వెళ్లి బెండకాయలు లేతవా కావా అని చివర్లు విరుస్తూ, దోసకాయలు వగరువో కాదో ఒకటికి పదిసార్లు పరీక్షగా చూస్తూ, మరీ అంత మండిపోయే రేటేమిటి, కాస్త తగ్గించరాదయ్యా బాబూ అని చనువు తీసుకుని మాట్లాడడం, సర్లెండి మీకు ఎప్పుడూ ఇచ్చే ధరే ఇది, కాదంటే ఇంటికి వెళ్లి అమ్మగార్ని అడగండి అంటూ అంతకంటే చనువుగా మాట్లాడుతూ కూరలు తను అనుకున్న రేటుకే అమ్మడం, పోనీలీ తెలిసిన మొహం అని మనసుకు సర్దిచెప్పుకుని ఇంటి మొహం పట్టడం. ... అదో వ్యాపకం, అదో కాలక్షేపం, నిజం చెప్పాలి అంటే మనం ఇంకా మనుషుల లోకంలోనే ఉన్నాము అని మనకు మనం సర్ది చెప్పుకోవడం.
యాభయ్ ఏళ్ళ క్రితం ఆ మనుషులే. ఇప్పుడూ ఆ మనుషులే. తేడా ఎక్కడ వస్తోంది.
ఒకానొక కాలంలో ఊళ్ళో ఆడవాళ్ళు అలా భుజాన బిందెలు పెట్టుకుని మంచి నీళ్ళ బావి నుంచి నీళ్ళు పట్టుకుని వచ్చేవారు. ఇంట్లో మొదటిసారి నీళ్ళ పంపు పెట్టించినప్పుడు, అమ్మయ్య నీళ్ళ మోత బాధ తప్పిందని అనుకున్న వాళ్లకు, కాలం గడుస్తున్న కొద్దీ తాము కోల్పోయింది ఏమిటో తెలిసివచ్చింది. ఊరిబావి నీళ్ళు పట్టుకుని వచ్చేటప్పుడు నూతి దగ్గర అమ్మలక్కలు మంచీ చెడూ మాట్లాడుకునే వారు. కష్టం సుఖం ఒకరితో మరొకరు పంచుకునే వారు. నీళ్ళు మోసిన కష్టం దానితో ఆవిరి అయిపోయేది.
అలాగే పిల్లల్ని బడికి తీసుకువెళ్ళే రిక్షా అంకుల్, ఇంటి దగ్గరి గుడికి వెడితే మనం చెప్పకముందే మన పేరూ గోత్రం తానే చెప్పేసి స్వామి వార్లకు అర్చన చేయించే పూజారి, ఇలాంటి వాళ్ళు ఒకరా ఇద్దరా. ఇందిరతో పెంచుకున్న బంధాలు, అనుబంధాలకు కళ్ళముందే కట్లు తెగిపోతుంటే..
పోస్టు అనే పదం అటు పల్లెల్లోనే కాదు, పట్టణాల్లో కూడా ఒకరోజుల్లో అమృతతుల్యమైన పదం. పోస్ట్ మన్ బయట నుంచి పోస్ట్ అని కేక వేయగానే ఎవరో ఆపద్బాంధవుడు వచ్చినంత సంబరపడి పోయేవారు ఇంటిల్లిపాదీ. దూరాన ఉన్న కొడుకు ఉత్తరం రాశాడేమో అని గృహస్తు, మొగుడి నుంచి ఉత్తరం వచ్చిందేమో అని పుట్టింట్లో ఉన్న గర్భిణి, ఇలా ఎవరికి వారు ఆత్రంగా బయటకి వచ్చేవారు. తాము అనుకున్నది కాదు అని తెలియగానే నిరాశగా నిట్టూరుస్తూ లోపలకి పోయేవారు. ఇప్పుడేముంది? ఇలా ఫోన్ నొక్కగానే అమెరికాలో వున్న పిల్లలు కో అని పలుకుతున్నారు. కానీ ఆనాటి మధురిమ ఏదీ! ఆ ఎదురు చూపులు ఏవీ!
ఒకప్పుడు ఇంట్లో లాండ్ ఫోన్ మోగితే నేనంటే నేను ముందు అనుకుంటూ ఇంట్లో వాళ్ళు అందరూ ఫోన్ వద్దకు పరిగెత్తుకుని వెళ్ళే వాళ్ళు. ఒకప్పుడు అందరికీ ప్రియమైన ఫోన్ దిక్కు లేనిదానిలా ఇప్పుడు ఇంట్లో ఓ మూల పడివుంటోంది. మూగనోము నోచుకుంటోంది. పొరబాటున మోగినా దానిని పట్టించుకునే నాధుడు వుండడు ఇంట్లో. ఎవరి సెల్ ఫోన్లో వాళ్ళు తలదించుకుని కాలక్షేపం చేస్తూ వుంటారు.
ఎక్కడో ఏదో తెగిపోతోందని తెలుస్తూనే వుంది. అతకడమే తెలియడం లేదు.



(27-11-2022)