5, జూన్ 2022, ఆదివారం

లాభమెంత? నష్టమెంత? – భండారు శ్రీనివాసరావు


(ఈరోజు 05-06-2022 ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)


పెట్రోలుకు మండే గుణం సహజం. మరి వాటి ధరలు మండిపోతూ వుండడం అంతకంటే సహజం. 

చాలా చాలా కాలం క్రితం  మొదటి గల్ఫ్ యుద్ధం సమయంలో కాబోలు, పెట్రోలు లీటరు ధరను, మూడు రూపాయలనుంచి తొమ్మిది రూపాయలకు ఒకేసారి మూడు రెట్లు పెంచారు. ఆ దెబ్బకు బొంబాయి (ఇప్పుడు ముంబై) లో కార్లలో ఆఫీసులకు వెళ్ళే బడా ఆసాములు రోజుకొకరి కారు చొప్పున వంతులవారీగా ప్రయాణాలు చేసేవారని పత్రికల్లో బాక్స్ ఐటం లు వచ్చాయి. ఇప్పుడు దాన్నే 'కార్ పూల్' అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఆ ముచ్చట కొద్ది రోజులే. తరువాత కధ మామూలే. పెరిగినధరకు అలవాటుపడ్డ జనం మళ్ళీ ఎవరి కారులో వారు వెళ్ళడం మొదలయింది. పెంచినా ఏం కాదు, పెరిగిన ధరలకు ప్రజలే అలవాటు పడతారు అనే భరోసా పాలకుల్లోకలిగింది. దాంతో పెట్రో ధరలు ఇన్నేళ్ళలో ఎన్ని రెట్లు పెరిగాయో లెక్క తెలియనంతగా పెరుగుతూ వచ్చాయి. కాకపోతే పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా ప్రతిపక్షాలకు అదో ప్రచారాస్త్రంగా ఉపయోగపడుతూ వచ్చింది. కారు దిగి కాలు కిందపెట్టని నేతలు, ఆ ఒక్క రోజు కారు దిగి కాలినడకన ఊరేగింపులు చేసుకుంటూ వార్తల్లోకి ఎక్కడం ఓ మొక్కుబడి తంతుగా మారిపోయింది.

కీర్తిశేషులు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రో ధరలను పెంచింది. దానికి నిరసనగా ఎన్టీయార్ తన అధికార వాహనాన్నిఒదిలిపెట్టి ఆబిడ్స్ లోని తన నివాసం నుంచి సచివాలయం వరకు ఆటోలో ప్రయాణం చేయడం ఆ రోజుల్లో సంచలనం కలిగించింది. వారి వాహనశ్రేణి మాత్రం  ఖాలీగా ఆ ఊరేగింపు వెనుకనే వచ్చింది. ముఖ్యమంత్రి కారు ఒదిలి ఆటో ఎక్కడం నిరసనకు సంకేతంగా తీసుకోవాలని, అంతే కాని అనునిత్యం అలానే ఆటోలో ప్రయాణాలు చేయరని అధికార పార్టీ వారు పరోక్షంగా పత్రికలకు తెలియచేసారు.

పెట్రోధరలు మండినప్పుడల్లా ప్రతిపక్షాలు ఒక్క తాటిపై లేచి మండిపడడం కూడా కొత్తేమీ కాదు. ఒకే పార్టీ, తాను కేంద్రంలో అధికారంలో వున్నప్పుడు ఒకతీరుగా, ప్రతిపక్షాల పాత్రలో వున్నప్పుడు మరో విధంగా స్పందించడం షరా మామూలుగా మారిపోయింది. వాటి తీరు చూస్తుంటే, ఆ పార్టీల్లో చిత్తశుద్దికన్నా ఏదో మొక్కుబడి నిరసన ప్రకటనలు చేసి వూరుకోవడం అన్న ధోరణే బాగా కనబడుతోంది. నాటకీయంగా నాలుగురోజులు ఎడ్లబండ్ల ప్రయాణాలు, ధర్నాలు , రాస్తారోఖోలు చేయడం మినహా పెట్రోధరలను అదుపు చేయడం అంత సులభం కాదని రాజకీయాల్లో అక్షరాభ్యాసం చేసిన వారికి కూడా ఆ పాటికి వొంటబట్టే వుండడం అందుకు కారణం కావచ్చు.

పెట్రోలు ధరలు పెంచాల్సినప్పుడల్లా, దానికి కారణమయిన కేంద్ర ప్రభుత్వం చెప్పే సంజాయిషీ ఒక్కటే. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం వల్ల ధరలు పెంచక తప్పడంలేదన్న పడికట్టు పదాన్నే అటుతిప్పీ ఇటు తిప్పీ వారు జనం మీదికి వొదులుతుంటారు.

గతంలో ఒకసారి లీటర్ ఒక్కింటికి ధరను మూడు రూపాయల పైచిలుకు ఒక్కమారుగా పెంచారు. ఆ సందర్భంలో పాలకులు ఇచ్చిన వివరణ వేరుగానే కాకుండా వింతగాను వుంది. మన రూపాయి మారకం విలువ అతి దారుణంగా పడిపోయిందట. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్, రూపాయి మారకం విలువలో వచ్చిన తేడాల వల్ల భారత ఆయిల్ కంపెనీలకు లీటరుకు రెండు రూపాయల పైచిలుకు నష్టం వస్తున్నదట. ఆ కారణంగా పెట్రోల్ రిటైల్ ధరను లీటరుకు మూడు రూపాయలు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు దయతో అనుమతి ఇచ్చిందట. అందువల్ల భారీగా పెంచిన ధరను జనం మంచిమనసు చేసుకుని భరించాలట. పెట్రోధరలు పెరిగినప్పుడల్లా గ్రామఫోన్ రికార్డులా పాలకులు వినిపించే వివరణే ఇది. ఇక ఏమి చెప్పుదు సంజయా అని విలపించడం ఒక్కటే పాలితులకు మిగిలింది. రూపాయివిలువ పడిపోయినప్పుడు ఎగుమతుల ద్వారా ఆదాయం పెరగాలి. కానీ ఈ విషయం ఏ వివరణల్లోను కానరాదు. సమయానుకూల మతిమరపుకు ఇది చక్కని ఉదాహరణ.


సరే ఇదంతా పాత కధ. 

ఇప్పుడు రోజులు మారిపోయాయి. కోడిగుడ్ల ధరల మాదిరిగా ఏరోజుకారోజే పెట్రో ధరలు మారిపోతున్నాయి. ఒక పూట పెట్రోలు ధర లీటరుకు ఇన్ని పైసలు తగ్గించామంటారు. డీసెలు ధర ఇన్ని పైసలు పెంచామంటారు. వారం తిరిగేసరికి పెరిగిన ధర తగ్గించామంటారు. తగ్గించిన ధర పెంచామంటారు. దీనికి కారణం క్రూడాయిలు ధరల్లో హెచ్చు తగ్గులంటారు. వెనుకటి రోజుల్లో ఈ ధరల హెచ్చింపు, తగ్గింపు ధరల ప్రకటన రాత్రి చాలా పొద్దుపోయిన తరువాత చేసేవారు. పలానా తేదీనుంచి అమల్లోకి వస్తుందనే వాళ్ళు. ఇప్పుడలా కాదు. లేడికి లేచిందే పరుగన్నట్టు ఏపూటకు ఆ పూటే ప్రకటనలు. టీవీల్లో స్క్రోలింగులు. దాన్నిబట్టే బంకుల్లో ధరలు. అంతా మాయ. విష్ణుమాయ.

ఇప్పుడు ఇది కూడా పాత కధల జాబితాలోకి చేరిపోయింది.

ఇప్పుడు మరో కొత్త విష్ణు మాయ మొదలయింది.

పెట్రో ధరలు లీటరుకు ఇన్ని రూపాయలో, పైసలో తగ్గించినట్టు ప్రకటన వస్తుంది. జనం అమ్మయ్య అనుకునే లోగా దాని వెంటే మరో స్క్రోలింగు పరుగులు తీస్తుంది, తగ్గిన మందానికి మరికొంత కలిపి ఎక్సయిజు డ్యూటీ పెంచారని. ఈతపండు చేతికిచ్చి తాటిపండు లాక్కోవడం అంటే ఇదే కాబోలు. 

పెట్రోలు ధరలు మళ్ళీ పెంచారు అని పత్రికల్లో వస్తుంటుంది. మళ్ళీ పెంచారు అనడంకంటే ఇంకోసారి పెంచడానికి వీలుగా మరోసారి పెంచారు అనడం సబబుగా వుంటుంది. ఎందుకంటె పెంచడం అది ఆఖరు సారీ కాదు, మళ్ళీ పెంచరన్న పూచీ లేదు.


చమురు కంపెనీలకు నష్టాలు వస్తున్నాయని, ఆ నష్టాలను భరిస్తూ రావడం వల్ల సర్కారు ఖజానాకు గండి పడుతోందని, అప్పుడప్పుడు ఇలా ధరలను పెంచడం ద్వారా ఆ గండిని ఓ మేరకయినా పూడ్చుకోవాలని ప్రభుత్వం వాదిస్తుంటుంది. నిజమే నష్టాలు వచ్చే వ్యాపారం చేయమని ఎవరూ కోరరు. కానీ ఈ వాదనలో వున్న పస ఎంతన్నదే సాధారణ జనం అడిగే ప్రశ్న. పెట్రో ఉత్పత్తుల రిటైల్ ధరల్లో సగభాగానికి పైగా వున్న పన్ను భారాన్నితగ్గించి సామాన్యులకు ఎందుకు వూరట కలిగించరు? అన్న ప్రశ్నకు కూడా ప్రభుత్వాలనుంచి సమాధానం దొరకదు. విభిన్న పార్టీలు పాలిస్తున్న  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం మోపుకోవడం మినహా ప్రజలకు దక్కే ఉపశమనం ఏమీ లేదు. 


ఆయిల్ కంపెనీలు లాభాల్లో నడుస్తున్నాయా, నష్టాలను మూటగట్టుకుంటున్నాయా అనేది వినియోగదారుడికి సంబంధించినంత వరకు ఒక ప్రశ్నే కాదు. వాటి నిర్వహణ శైలి గమనించే వారికి అవి నష్టాల్లో వున్నాయంటే ఒక పట్టాన నమ్మబుద్ది కాదు. అసలిన్ని కంపెనీలు అవసరమా అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఒక్కొక్క కంపెనీ, తన అధికారులు, సిబ్బంది జీత భత్యాలపై పెడుతున్న ఖర్చు చూస్తుంటే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయి. అలాగే, పెట్రో కంపెనీలు ప్రకటనలపై పెడుతున్న ఖర్చు అంతాఇంతా కాదని ఓ మోస్తరు లోకజ్ఞానం వున్న వాళ్లకు కూడా ఇట్టే అర్ధం అవుతుంది. పత్రికల్లో, మీడియాలో ప్రకటనలు ఇచ్చి వ్యాపారాభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఏ మేరకువుందో ఆ కంపెనీలే ఆలోచించుకోవాలి. నిజంగా నష్టాలు వస్తున్నప్పుడు ఆధునికీకరణ పేరుతొ పెద్దమొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఎంత వుంది? నష్టాలు వస్తున్నప్పుడు వాటినుంచి బయటపడడానికి ఖర్చు తగ్గించుకోవడం ఒక్కటే సులువయిన మార్గం. ఇది తెలుసుకోవడానికి అర్ధశాస్త్రంలో పట్టాలు అక్కరలేదు. నష్టాలు, సబ్సిడీల పేరుతొ ప్రభుత్వ ఖజానాపై మోయలేని భారం పడుతున్నట్టు చేస్తున్న ప్రకటనల్లో ఏదో డొల్లతనం వున్నట్టు ఎవరయినా అనుమానిస్తే వారిని తప్పు పట్టలేము.

లెక్కలు,డొక్కలు అన్నవి సాధారణ వినియోగదారుడికి అక్కరలేని విషయాలు. అతనికి తెలిసిందల్లా ధర పెంచినప్పుదల్లా అతడి జేబుకు ఎంత చిల్లి పడుతున్నదన్నదే. దాన్నిబట్టే అతడి స్పందన వుంటుంది. కానీ అది అరణ్య రోదనే కూడా అతడికి తెలుసు. అతడి అసహాయత సర్కారుకు తెలుసు. తరుణం వచ్చేవరకు జనం ఏమీ చెయ్యలేరన్న ధీమా పాలకుల చేత చెయ్యకూడని పనులు చేయిస్తుంటుంది. కానీ, విషాదం ఏమిటంటే ఆ తరుణం అంటే వోటు ద్వారా పాలకులను మార్చే సమయం ఆసన్నమయినప్పుడు అప్పటి సమస్యలు తెరమీదకు వస్తాయి. ఇప్పటి సమస్యలు తెర మరుగుకు వెడతాయి. సామాన్యుడి ఈ బలహీనతే సర్కారు బలం. ఈ సూక్ష్మం తెలిసినవారు కనుకనే రాజకీయ నాయకులు వారు ఏ పార్టీ వారయినా ఇన్ని నాటకాలు యధేచ్చగా ఆడగలుగుతున్నారు.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గృహ వినియోగదారులకోసం ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని పూర్తిగా ఎత్తివేసింది.

పిల్లలను,  ప్రజలను  జీవితాంతం కనిపెట్టుకుని చూడాల్సిన బాధ్యత తలితండ్రులది, ప్రభుత్వాలది అని గట్టిగా నమ్మే సంస్కృతిలో జీవిస్తున్నాం. 

మొన్నీమధ్య ఒక కార్టూను కళ్ళబడింది. పెట్రోలు బంకు ముందు సూటూ బూటూ వేసుకున్న వ్యక్తి చేతిలో ఓ ప్లకార్డు పట్టుకుని నిలబడి అడుక్కుంటూ వుంటాడు. దానిమీద ఇలా రాసివుంటుంది. "భార్యతో పాటు రెండు కార్ల భారం కూడా నేను మోయాలి"

భారం మరొకరు మోసినంత కాలం బాధ్యత తెలియదు.   

అది తెలియనంత కాలం ఇలాంటి  కార్టూన్లే వస్తుంటాయి.


తోకటపా 

లాభ శాతమెంత? నష్ట శాతమెంత?

“నాలుగు పెంచు, మూడు తగ్గించు, మరో రెండు తగ్గించి అయిదు పెంచు. అలానే ఒకటి తగ్గించి ఇంకోటి పెంచు. ఆరు తగ్గించి అయిదు పెంచు.”

“ఏవిటీ లెక్క అర్ధం లేకుండా!”

“అర్ధం చేసుకోవాలి నాయనా! ఈ లెక్కల్ని తెలుగులో పెట్రోధరలు అంటారుష.



4, జూన్ 2022, శనివారం

ఎవరు మేజరు? ఎవరు మైనరు? – భండారు శ్రీనివాసరావు

ఇప్పటి విషయమే కాని కొంత పాత కధ చెప్పాలి.

అప్పుడెప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం సినిమా రివ్యూలు రాసేందుకు ఫ్రీ వ్యూలు (Free View) చూడడానికి  ధియేటర్లకి డుతుండేవాడిని. రిలీజ్ కు ముందు వేసే  Preview లకి ఇవి అదనం. మన వీలూసాలూ చూసుకుని వెళ్ళడానికి వీలైన ఏర్పాటు అన్నమాట.

ఒక రోజు అలా ఓ సినిమాకి వెళ్ళాను, గుప్త జ్ఞాన్ అనుకుంటా. బాగా రష్ గా వుంది. టిక్కెట్లు కొనుక్కుని వచ్చిన వాళ్ళు నిమిషం ఆలస్యం అయితే ఏ సీను మిస్సవుతామో అన్నట్టుగా తోసుకుని వెడుతున్నారు. కొంత నిమ్మళించిన తర్వాత అడిగాను గేటువాడిని. లోపలకి వెళ్ళిన వాళ్ళలో చాలామంది చిన్న పిల్లల మాదిరిగా వున్నారు. ఇది ఏ సర్టిఫికేట్ సినిమా. ఎలా పంపిస్తున్నావు అని.

అతడు నవ్వి చెప్పాడు. ‘ఏ అనగానే వచ్చేది వీళ్ళే. వీళ్ళను నీ వయసు ఎంత అని అడిగితే ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్న ఫాయిదా ఏముంటుంది. వీళ్ళే కదా మహారాజ పోషకులు

యాభయ్ ఏళ్ళ క్రితమే ఇలా వుంది. తెలియంది తెలుసుకోవాలని, చూడంది చూడాలని ఆ వయసులో తప్పకుండా అనిపిస్తుంది.  దాన్ని క్యాష్ చేసుకోవాలని సినిమా వాళ్ళ తాపత్రయం.

మేజరు ఎవరు , మైనర్ ఎవరు అని కదా చెప్పుకుంటున్నాం.

పద్దెనిమిది లోపల మైనరు, దాటితే మేజరు అని ఓ సర్కారు వారి లెక్క వుంది. కానీ ఆ లెక్కను ఎవరు లెక్క పెడతారు. అదీ ఈ రోజుల్లో. చిన్నాపెద్దా అందరూ ఐ నో పీ ఎం, ఐ నో సీ ఎం  బాపతు అయినప్పుడు అసలు కుదరదు.

అప్పటికీ ఇప్పటికీ కొట్టవచ్చినట్టు కనబడే కొన్ని మార్పులు వున్నాయి.

పిల్లలు ఒక వయసు వచ్చేవరకు తలితండ్రుల కనుసన్నల్లో వుండేవాళ్ళు. బయట ప్రపంచంలో తిరిగేది తక్కువ. ఇంట్లో గడిపేది ఎక్కువ. టీవీలు లేవు, పత్రికలు లేవు. లేవని కాదు, పిల్లల చేతిలో ఉండేవి కావు. దాంతో చదువే వారికి లోకం. ఇతరేతర లోక జ్ఞానం పూజ్యం. అమ్మాయిల వైపు  చూడడానికి భయపడే వారు. ఇక ఆడపిల్లలు బోలెడు సిగ్గుపడే వారు. అలానే వుండి పోవాలని రచయిత ఉద్దేశ్యం కాదు. మార్పుల గురించి ప్రస్తావనలో భాగంగా చెప్పింది మాత్రమే. పేరెంట్స్ కూడా పిల్లల పట్ల బాధ్యతగా వుండేవాళ్ళు. ఇది కాక మంచీ చెడూ చెప్పడానికి ఇళ్ళల్లో తాతయ్యలు, నాయనమ్మలు వుండేవాళ్ళు.  ఆ కాలంలో ఇంత పొడగరి పిల్లలు అరుదు. చూడగానే చిన్నవాడు అని తెలిసి పోయేది. ఇప్పుడలా కాదు. తినే తిండ్లూ, పెరిగే వాతావరణం వారిలో శారీరకపరమైన మార్పులకు కారణం అవుతున్నాయి.  చిన్న వయసులోనే పెద్దగా కనబడుతున్నారు. ఇళ్ళల్లో పెద్దల భయం బొత్తిగా లేదు. అసలా పెద్దలే ఇళ్లకు చేరే సరికే నడి ఝాము అవుతోంది. ఇక పిల్లల సంగతి కనుక్కునే తీరిక, ఓపిక  వారికి ఎక్కడుంది కనుక.

దానికి తోడు ప్రపంచం వారి గుప్పిట్లోకి వచ్చేసింది మొబైల్ రూపంలో. అందులో చూడాల్సింది,  చూడకూడనిది అంటూ ఏమీ లేదు. మేజరు, మైనరు అనే వివక్ష అసలే లేదు. దీనికి తోడు నాగరికత పేరుతొ వస్త్ర ధారణలు, నియమాలు లేని ఆహారవిహారాలు, ఆడా మగా తేడాలేని స్నేహాలు. ఇక వారికి వయసుతో నిమిత్తం లేని  లేనిపోని ఆలోచనలు వస్తే అది వారిది తప్పా!

తప్పదు. చట్టాలు మార్చాలి. మేజరు, మైనరు అనే తేడా లేకుండా చేసిన తప్పుడు పనులకు తగిన శిక్షలు పడాలి. చేసింది మేజరు నేరం, తప్పించుకునేది మైనర్ పేరుతొ.

ఢిల్లీ ఉదంతం గుర్తుంది కదా! రాత్రి వేళ బస్సులో వస్తున్న అమ్మాయిపై జరిగిన ఘాతుకం. ఇనుపరాడుతో మర్మాంగాలను హింసించిన పశువు మేజరు కాదు, మైనరు. ఆ పేరుతొ పడాల్సిన శిక్ష నుంచి చట్టమే అతడిని కాపాడింది.

ఈ పరిస్థితి మారాలంటే  ముందు తలితండ్రులు మారాలి. వారికి చదువు చెప్పే విద్య సంస్థలు కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. చట్టాలు మారాలి.

ఇవేవీ జరగకుండా ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ బుల్లి తెరలపై చర్చలు చేస్తే జరిగేది ఏముంటుంది. జనం ఆ సంఘటన గురించి మాట్లాడుకుంటారు. ఎప్పటి వరకు? మరో ఇలాంటి సంఘటన జరిగే వరకు.

(04-06-2022)

నా మొదటి స్కూటరు – భండారు శ్రీనివాసరావు

కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను హైదరాబాదు వచ్చి అప్పటి ఏకైక ఫైవ్ స్టార్ హోటల్ బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని భాస్కరులు (పత్రికా రచయితలు) ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవదానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర) వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల, అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు. ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం.

రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను. బాంకు అధికారి స్కూటరు లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే, ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా, కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే, గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు.
1987లో మాస్కో వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు జరిగిన ‘హెల్మెట్ ధరించని జర్నలిస్ట్ అరెస్ట్’ అనే సంచలన ఉదంతానికి కారణమైన ‘నేను’, ఆరోజు వెడుతున్నది ఈ గిర్నార్ స్కూటర్ మీదనే.
ఆ కధ అనేక మలుపులు తిరిగి సుఖాంతం అయింది కానీ ఆనాటి నుంచి స్కూటర్ ఎక్కలేదు.
ఇక హెల్మెట్ ఉపాఖ్యానం ఏమిటంటే:
హెల్మెట్ నిబంధన పాటించనందుకు నన్ను ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పట్టుకుని హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ లో పెట్టారు. ఈ సంగతి తెలిసి వివిధ పత్రికల్లో పనిచేసే విలేకరులు, సీనియర్లు స్టేషన్ బయట ధర్నా చేశారు. మర్నాడు అసెంబ్లీ ఈ కారణంగా వాయిదా పడింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటన పై దర్యాపుకు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్ గా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పోలీసు అధికారిని బదిలీ చేశారు ఈ క్రమంలో..
చిత్రంగా ఈ కధ మరో మలుపు తిరిగింది. రాయలసీమకు చెందిన ఆ న్యాయమూర్తికి గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడ కలుసుకోవాలని నాకు వర్తమానం పంపారు.
తీరా వెడితే, తెలిసింది, ఆ రిటైర్డ్ జడ్జి గారి అమ్మాయి రేడియోలో నా జీవన స్రవంతి కార్యక్రమానికి అభిమాని. నన్ను చూస్తాను అంటే ఆయన వెంటబెట్టుకుని వచ్చారు. హెల్మెట్ లేదని నన్ను పట్టుకున్న ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు. ఆయన మా ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగికి చుట్టం. అతడ్ని తీసుకుని మా ఇంటికి వచ్చి తన ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా చూడమని కోరాడు. ఆ విషయం నేను అప్పుడే మరచిపోయాను కాబట్టి మీకు అపకారం చేసే ఉద్దేశ్యం నాకు లేదని అతడికి భరోసా ఇచ్చాను.
తర్వాత అదే మాట జడ్జి గారెతో చెప్పాను. త్వరలోనే నేను మాస్కో పోతున్నాను కాబట్టి, ఎవరూ నా కారణంగా బాధ పడడం ఇష్టం లేదని అన్నాను. జరిగింది దురదృష్టకర సంఘటన కాబట్టి మరచిపోవడమే దీనికి పరిష్కారం అని కూడా చెప్పాను.
ఆయన నా మాట మన్నించారు. ఆవిధంగానే కేసు మూసేశారు.
తర్వాత చాలా కాలానికి (అప్పుడు నేను ఇండియాలో లేను) అసెంబ్లీకి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది.
కధకు ఆవిధంగా శుభం కార్డు పడింది



3, జూన్ 2022, శుక్రవారం

సైకిళ్ళ రోజు – భండారు శ్రీనివాసరావు

  

(ఈరోజు ప్రపంచ సైకిళ్ళ దినోత్సవం అంటున్నారు) 

అదేమిటో ఒకానొక కాలంలో ప్రతివాడికి ఒక తీరని కల వుండేది. జీవితంలో ఒకసారి అయినా సైకిల్ తొక్కాలని. ఆ కోరిక నాకూ వుండేది. అది తీరాలి అంటే ముందు రెండు వుండాలి. సైకిల్ వుండాలి. అది తొక్కడం రావాలి. ఆ రోజుల్లో మన ఎత్తు చూస్తే సైకిల్ లో సగం. అంచేత చాలా కాలం అది తీరని కోరిక గానే వుండి పోయింది. అది తీరడానికి హై స్కూలు చదువు దాకా వేచి ఉండాల్సి వచ్చింది. 

ఖమ్మం రిక్కబజార్ స్కూల్లో చేరినప్పుడు దగ్గర్లో ట్రంక్ రోడ్డు మీద తాత కొట్టు వుండేది. అక్కడ జీళ్లు, నువ్వుండలు దొరికేవి. వాటికోసం వెళ్ళేవాళ్ళం.  ఆ షాపు ముందు వరసగా కొన్ని సైకిళ్ళు ఉండేవి. తర్వాత తెలిసింది. అవి అద్దెకు ఇచ్చే సైకిళ్ళు అని. దాంతో జీళ్లు, రంగు సోడాల డబ్బులు మిగిల్చి ఒక సైకిల్ అద్దెకు తీసుకునే వాడిని. గంటకు అణా. అది తీసుకుని తోసుకుంటూ మామిళ్ళ గూడెంలోని పెవిలియన్ గ్రౌండ్ కు వెళ్ళే వాడిని. అయితే సైకిల్ తొక్కడం నేర్పేదెవరు?  మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారిల్లు పక్కనే. అప్పుడు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అనుకుంటా. నమ్మరు కానీ ఆయన కుమారుడు జలగం ప్రసాద రావు ఈ విషయంలో చాలా సాయం చేశారు. కింద పడడం, మోచేతులు, మోకాళ్లు గీసుకోవడం ఇత్యాది కష్టాల తర్వాత రోడ్డు మీద సైకిల్ నడిపే సామర్ధ్యం వచ్చింది.

ఖమ్మం ఎస్ ఆర్ అండ్ బీ జీ ఎన్ ఆర్ ఆర్ట్స్ అండ్  సైన్స్ కాలేజీలో పీయూసీ చదివేటప్పుడు కాలేజీకి సైకిల్ మీద వెళ్ళే వాడిని. అది మా పెద్ద బావగారు అయితరాజు రాం రావు గారిది. మామిళ్ళ గూడెం మొత్తంలో సొంత  సైకిల్ వున్న మొనగాడు. ఆయన ఊళ్ళో లేనప్పుడు ఆ సైకిల్ తీసుకుని కాలేజీకి వెళ్ళేవాడిని. అది గుట్టల బజార్ అవతల వుండేది. ఆ దోవ అంతా నిటారుగా వుండేది. ఆ బాటలో సైకిల్ తొక్కలేక చేతితో తోసుకుంటూ పైకి వెళ్ళే వాడిని. నా కాలేజి రోజులలో ఒకే ఒక అమ్మాయి, అదీ నా క్లాసు మేట్, అరుణ అనుకుంటా  సైకిల్ మీద వచ్చేది. ఎత్తు ఎక్కలేక సైకిల్ ని భారంగా తోసుకుంటూ గుట్ట ఎక్కుతున్న నన్ను చూసి ఆమె  సైకిల్ మీద వెడుతూ విలాసంగా ఓ అరనవ్వు నవ్వింది.

అంతే! అప్పటి నుంచి సైకిల్ మీద యావ, ధ్యాస రెండూ పోయాయి.   

(03-06-2022)

వీణ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 పొద్దున్నే వీణ శ్యామ సుందర్ నుంచి ఫోను. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో నాకు డిగ్రీలో సహాధ్యాయి.

వీణ ఆయన ఇంటి పేరు కాదు, అయ్యగారి అసలు ఇంటిపేరు. సదా వీణాధారి కనుక వీణ ఇంటి పేరుగా మారిపోయింది. వైణికుడిగా ఇంటాబయటా  మంచి పేరు ప్రఖ్యాతులు, బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి విదేశాల్లో స్థిరపడిన సంతానం, పుట్టుకతోనే వడ్డించిన జీవితం కాకపోయినా స్వయం కృషితో తన జీవితాన్ని వడ్డించిన విస్తరిగా మార్చుకున్నారు. ఈ క్రమంలో, ఆయన భార్యగా  శ్రీమతి జయలక్ష్మి అందించిన తోడ్పాటును కూడా సతతం గుర్తు చేసుకుంటూ వుంటారు. ఈరోజు ఆవిడ పుట్టిన రోజు కాబట్టి శుభాకాంక్షలు తెలిపాను. ఈ సందర్భంలో శ్యామసుందర్ ఒక మాట చెప్పారు, ఫిబ్రవరి తొమ్మిది ప్రేమ పుట్టిన రోజు అని.

పూర్తిగా బోధ పడలేదు. అయినా కొంత అర్ధం అయింది. ఆరోజు మా ఆవిడ పుట్టిన రోజు.  ఈ ప్రేమ పుట్టిన రోజు ఏమిటి? ఆయనే విడమరిచారు. మిమ్మల్ని ప్రేమించడానికే  ఆమె పుట్టింది అన్నారు.

ఇవతల నా పరిస్థితి అధ్వాన్నం. నోరు పూడుకుపోయింది.  గొంతు పెగల్లేదు. బలవంతాన పెకిలించుకుని అన్నాను.

‘మన్నించండి శ్యామ సుందర్! మరోసారి నేనే ఫోన్ చేసి మాట్లాడుతాను

కింది ఫోటో:

2019 ఫిబ్రవరి తొమ్మిదో తేదీన తన చివరాఖరి పుట్టిన రోజున మా ఆవిడ నిర్మలకు కేక్ తినిపిస్తూ.  తరువాత ఆరుమాసాలకే తీవ్రమైన గుండె పోటుతో ఆగస్టులో ఆకస్మికంగా కన్నుమూసింది  





(03-06-2022)

     

2, జూన్ 2022, గురువారం

కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలన – భండారు శ్రీనివాసరావు

 (జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం)

తెలంగాణా పంచాయతీ రాజ్,  ఐ.టీ. శాఖల మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు, తండ్రి కేసేఆర్  లాగే చక్కని మాటకారి.

కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదు ప్రెస్ క్లబ్  ఏర్పాటు చేసిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో పాల్గొంటూ ఆయన ఒక మాటన్నారు, కోటి  ఆశలు, కోటి  అనుమానాల నేపధ్యంలో కొత్త రాష్ట్రంగా తెలంగాణా  ఆవిర్భవించిందని. నిజమే. తెలంగాణ కోరుకున్నవారు కోటి  ఆశలు పెట్టుకున్నారు. కోరుకోనివారు కోటి  అనుమానాలు పెంచుకున్నారు. ఆశలు, అనుమానాల సంగతేమో కానీ, తెలంగాణా రాష్ట్రం ఏర్పడడం మాత్రం జరిగిపోయింది. నీటిమీద రాత కాకుండా  రాతిమీద గీత మాదిరిగా  తెలంగాణా అనేది ఇప్పుడు  ఒక చెరగని నిజం. చెరపలేని సత్యం. ఎదురుగా నిలబడి, కనబడుతున్న ఓ వాస్తవం. 

తెలంగాణా రాగానే కొత్త రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకు పోతుందని అనుకున్నవారు వున్నారు. కరెంటు కొరతతో కొత్త రాష్ట్రం చీకటిమయం  అవుతుందని  అంచనాలు కూడా వేసారు.  కాలం గడుస్తోంది. కానీ వారనుకున్నట్టు మాత్రం  జరగలేదు. పైపెచ్చు,  కనీవినీ ఎరుగని విధంగా వేసవికాలంలో రాష్ట్రం నిప్పుల కొలిమిలా తయారయినా కూడా అధికారిక   కోతలు లేకుండా విద్యుత్ సరఫరా జరుగుతోంది. ప్రత్యర్ధులు కూడా పరోక్షంలో అంగీకరిస్తున్న కేసీఆర్ సాధించిన అద్భుతం ఇది.

సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీ,  తెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్న నీళ్ళూ, నిధులూ, ఉద్యోగాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని  అనుకున్నవారూ వున్నారు. వారి అనుమానాలకు ప్రాతిపదిక కూడా వుంది. ఉమ్మడి రాష్ట్రంలో అదే పరిస్థితి.  అయితే,  వారనుకున్నట్టూ జరగలేదు. అలా అని రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోనూలేదు.

అంటే  ఈ ఎనిమిదేళ్ల  కాలంలో ఏమీ జరగలేదా  అంటే, జరుగుతుందని 'చాలామంది' భయపడ్డ ఒక విషయం మాత్రం జరగలేదు. హైదరాబాద్ ప్రత్యేకత ఏదీ చెరిగిపోలేదు, అదొక్కటే ఊరట కలిగించే విషయం. ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.

'డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో pచేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.

సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు అన్నీ కాకపోయినా కొన్నయినా తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

'అన్నీ ఆలోచనలేనా? ఆచరణలో ఏవీ?' అని అడిగే సందేహాస్పదులు కూడా వుంటారు. ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుగా పరిగణించి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు.

కేసీఆర్ ఆంతరంగిక సమావేశాల్లో చెప్పేదేమిటో  తెలియదు కాని బహిరంగంగా ఎప్పుడూ మాట్లాడినా ఆయన మాటల్లో తొంగి చూసేది ఒకే ఒక్క విషయం. అది బంగారు తెలంగాణా. ఆ దిశగా ఆయన చేయని ఆలోచన లేదు. వేయని పధకం లేదు. చర్చించని విషయం లేదు.   

ఆకాశ హర్మ్యాలు, ఆరు లేన్ల రహదారులు, హరితహారాలు, ప్రతి గడపకు  నల్లా నీళ్ళు, ప్రతి పొలానికీ సాగు నీళ్ళు, కనురెప్పపాటు కూడా పోని  కరెంటు, గొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి చిన్నారి లోగిళ్ళు, చదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువు, చదువయిన వారికి కొలువు, చదువంటని వారికి తగిన ఉపాధి, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి .......ఒకటా రెండా? ఇవన్నీ చదువుతున్నప్పుడు, వీటన్నిటి గురించి వింటున్నప్పుడు, ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవా? రావా? అనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా?



ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.

అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం, వారి జీవితాలు  అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి.






అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో!

1, జూన్ 2022, బుధవారం

హీరో కృష్ణతో డీజే టిల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ – భండారు శ్రీనివాసరావు

 

కొన్నేళ్ళ క్రితం  ఆంధ్రజ్యోతి దినపత్రిక 'ఆదివారం పుస్తకం'లో 'స్పందన' శీర్షిక కింద 'దారి చూపిన దేవుడు' అనే పేరుతొ  సినీ నటుడు కృష్ణ గురించి మా మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్  రాసిన ఓ కధనం ప్రచురించారు. 1971 నాటి వృత్తాంతం అది. చిన్న వయస్సులో ఇంటి నుంచి  పారిపోయి మద్రాసులో కృష్ణ - విజయనిర్మల ఇంట్లో కొన్ని నెలలు తలదాచుకోవడం,  తిరిగివచ్చిన తరువాత తదనంతర కాలంలో ఆ పిల్లవాడే ప్రభుత్వ భీమా కంపెనీలో ఓ పెద్ద ఆఫీసరు కావడం - అంతా ఓ సినిమా కధలా నడిచిపోయింది. ఈ ఉదంతం సుఖాంతం కావడంలో  ఒకప్పుడు  నేను పనిచేసిన 'ఆంధ్రజ్యోతి'కి కూడా కొంత పాత్ర వుంది. ఆ రోజుల్లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. సీ.బీ.ఐ. డైరెక్టర్ గా పనిచేసిన కే.విజయరామారావు గారు కృష్ణా జిల్లా  ఎస్పీ. వారిని కలిసి 'మిస్సింగ్ అప్లికేషన్' ఇచ్చాము. ఆంధ్రజ్యోతిలో పిల్లవాడి ఫోటోతో ఒక ప్రకటన ఇచ్చాము.  మూడున్నర మాసాలు శ్రవణ్ మద్రాసులో కృష్ణ గారింట్లోనే వున్నాడు. ఆ సంగతి మాకు తెలియదు. కళా దర్శకుడు రామలింగేశ్వర రావు గారి తల్లి తెనాలి వెళ్ళినప్పుడు  ఆంధ్రజ్యోతిలో ఫోటో చూసి కృష్ణ గారింట్లో ఉంటున్న శ్రవణ్ పోలికలను గుర్తుపట్టి మాకు కబురు పెట్టారు. మా బావగారు వాళ్ళు మద్రాసు వెళ్లి పిల్లవాడిని తీసుకువచ్చారు. 'బాగా చదువుకో, ఆ తరువాతే సినిమాలు' అని కృష్ణ గారు ఇచ్చిన సలహాని మావాడు తుచ తప్పకుండా పాటించాడు. బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చాడు.  హీరో కృష్ణ  పుట్టినరోజు సందర్భంగా కృష్ణగారి గురించి ఆంధ్రజ్యోతిలో మా మేనల్లుడు శ్రవణ్ రాసిన వ్యాసంలో ముగింపు వాక్యాలు - "కృష్ణ గారిని రోజూ నేను తలచుకుంటూనే ఉంటాను. ఎంతలా అంటే - నా కొడుకు పేరు 'విమల్ కృష్ణ, నా కూతురు పేరు 'రమ్య కృష్ణ' - మా కుటుంబంలో చాలామందికి నచ్చాయి. అది హీరో కృష్ణ దృష్టికి వెళ్లి శ్రవణ్ కుటుంబాన్ని ఓ రోజు తన ఇంటికి ఆహ్వానించారు.

మా మేనల్లుడు  శ్రవణ్ ఏకైక కుమారుడు విమల్ కృష్ణ   పెరిగి పెద్దయి, బీ టెక్ పాసయి కూడా ఉద్యోగాల జోలికి పోకుండా సినిమాల మీద మక్కువ పెంచుకుని అదే ధ్యాసలో ఉంటూ తనను తాను నిరూపించుకునే రీతిలో  డీ జె టిల్లు సినిమా డైరెక్ట్ చేసి మంచి విజయం సాధించాడు. ఒకప్పుడు వాళ్ళ నాన్న పెంచుకున్న సినిమా కోరికను ఈ విధంగా తీర్చాడు.

కింది ఫోటో: కృష్ణ దంపతులతో శ్రవణ్ కుటుంబం. డీజే టెల్లు డైరెక్టర్ విమల్ కృష్ణ కూడా ఫోటోలో వున్నాడు