26, మే 2021, బుధవారం

‘నా బలమా! నీ నామ బలమా!’

 

నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప ఆ తర్వాత గుర్తుండదు.

నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి, ఆర్వీవీ కృష్ణారావు, అమెరకా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు  రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు. నాకు రాయకపోతే తోచదు. కానీ చెప్పాను కదా! పాడు మతిమరపు. వెంటనే రాసుకుంటే సరి. లేకపోతె ఇంతే సంగతులు.

మొన్న రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.

ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.

ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.

నారాయణ గారెకి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.

భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారెతో అన్నారు. ‘నారాయణ గారి చవులూరించే విందు, మరి వీనుల విందుగా మీ విందు మాత్రమే  మిగిలింది

ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా అనే త్యాగరాయ విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి రాగం వుంది.

సరే ఇదలా ఉంచితే ..

ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు.  దాదాపు ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం గుర్తుండే వుంటుంది.

ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారెకి భవిష్యత్ వాణి తెలుసల్లె వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.

చిన్న నాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి ఒక మందు చీటీ రాసిచ్చి  పట్రంమంటాడు. చిల్లి కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు పరిగెత్తుకుంటూ ఆయుర్వేదం మందులు అమ్మే షాపుకి పరిగెడతాడు. షాపు వాడు  చీటీ చూసి మందుల అలమరా తెరిచి, ఓ సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో ఉందంటారు కృష్ణారావు గారు.

పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు.  కస్తూరి మాత్రలు, సువర్ణ శూర్యావతి, పైత్యాంతక రసం, కాశీ దారాలు, ఇత్తడి పిన్నీసులు, పేల దువ్వెనలు  వగైరా వగైరా. ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవాడు.

వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు. అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా  కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న మాట వాస్తవమే అయినా, అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు నయం చేసే శక్తి క్రమంగా  లోపిస్తోంది.

(26-05-2021)

ఏఎన్నారా! ఎన్టీఆరా !

 

ఢిల్లీ నుంచో, తన నియోజకవర్గం నుంచో ఏదో సమాచారం రేడియో వార్తలకోసం ఫోనులో చెప్పి నేను రాసుకున్న తర్వాత అడిగేవారు ఏఎన్నారా! ఎన్టీఆరా అని, ఒకప్పటి పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ మల్లు రవి. ఎన్టీఆరే అని జవాబు చెప్పేవాడిని నవ్వుతూ. ‘అయితే సాయంత్రం రేడియో వింటాను’ అని ఫోను పెట్టేసేవారు ఆయన కూడా నవ్వుతూనే.
ఏఎన్నార్ అంటే వార్త రావచ్చు, రాకపోవచ్చు. కానీ ఎన్టీఆర్ అంటే వచ్చి తీరుతుందని ఒక కోడ్ భాష అన్నమాట.
మా ఇద్దరికీ నవ్వు తెప్పించిన ఈ ఇద్దరు అగ్ర హీరోల ప్రస్తావనకు ఒక నేపధ్యం వుంది.
ఇది కూడా ఆయన విన్న కధే!
మల్లు రవికి ఎవరైనా చెప్పారో లేక ఆయన కూడా విన్న మాటో తెలియదు కానీ ఆయన మాటల సందర్భంలో చెప్పిన విషయమే ఇది.
ఏఎన్నార్ దగ్గరికి ఎవరైనా నిర్మాత వెళ్లి కధ చెబితే ఆ కధతో సినిమా తీస్తే సూపర్ హిట్టు అయ్యే అవకాశాలు ఎంత బాగా వున్నాయో ఆయన పూసగుచ్చినట్టు చెప్పేవారట. నిర్మాత సంతోష పడేలోగా ఆయనే మళ్ళీ ఆ కధలో ఎన్నెన్ని లోపాలు వున్నాయో వాటిని కూడా విశదంగా వివరించి, ఆ కధని సినిమా తీస్తే నిర్మాత నెత్తిన చెంగే మిగులుతుందని అనేవారట. ఇక ఎన్టీఆర్ దగ్గర కధే వేరు. ‘సినిమా చేస్తున్నాను, చెయ్యను’ అనే రెండే రెండు మాటలతో ఆ నిర్మాత కధకు శుభం కార్డు వేయడమో లేక ఇక మీ పని చూసుకోండి అని సమయం వృధా చేయకపోవడమో జరిగేదట. దీన్నే ఆయన బాబుకు, వైఎస్ కు వాళ్ళు ముఖ్యమంత్రులుగా వున్నప్పుడు అన్వయించి చెప్పేవారు.
బాబుగారి దగ్గరకు ఎవరైనా పనిమీద వెడితే, చివరికి ఆయన ఆ పనిచేసినా, చివరివరకు పని అవుతుందో లేదో అనే అనుమానం ఉండేదట. అదే వై.ఎస్ వద్ద నిమిషాల్లో ఆ పని అయ్యేది కానిదీ తెలిసిపోయేదట.
ఈ ‘ఏఎన్నారా! ఎన్టీఆరా’ అనే కోడ్ రేడియో వార్తల వరకు పాకింది. వార్త వస్తుందా రాదా అనే విషయంలో ‘ఏఎన్నార్’ అంటే రావచ్చు, రాకపోవచ్చు, ఎన్టీఆర్ అంటే వచ్చి తీరుతుంది.
ఇదీ అప్పట్లో మా ఇద్దరి నడుమా నడిచిన కోడ్ భాష.
(25-05-2021)

25, మే 2021, మంగళవారం

రామజోగి మందు

 కొద్దిసేపటి క్రితం ఆలిండియా రేడియోలో నా సీనియర్ సహచరుడు ఆర్వీవీ కృష్ణారావు గారు ఫోన్ చేశారు. ఆయన మాట్లాడినప్పుడల్లా నాకు రాసుకోవడానికి ముడి సరుకు లభిస్తుంది. ఆయన ఫేస్ బుక్ లో లేరు. అమెరికాలో వున్న వారి పెద్దమ్మాయి శారద అప్పుడప్పుడూ ఫోన్ చేసి నా పోస్టుల ప్రస్తావన కూడా తెస్తుంటుంది. ఆవిధంగా కృష్ణారావు గారెకి  జ్వాలా దంపతులు కరోనాకు గురై రామనామంతో క్షేమంగా బయట పడడం తెలిసింది.

ఆయనే ఈ రామజోగి మందు గురించి చెప్పారు. భక్త రామదాసు కీర్తనలలో ఇదొకటి.

రామజోగి మందు కొనరే ఓ జనులారా అంటూ రామదాసు పాడిన ఓ కీర్తనలో  రామనామం ఓ మంచి ఔషధం అని పేర్కొన్నట్టు తెలిపారు.

ఫోన్లో మాట్లాడుతూ రాసుకోవడం వల్ల కొన్ని పదాలు తప్పిపోయాయేమో తెలియదు కానీ మొత్తం మీద భావం బోధపడేలా రాసుకున్న రామదాసు కీర్తన ఇది:

“రామజోగి మందు కొనరే! ఓ జనులారా! రామజోగి మందు కొనరే!

రామజోగి మందు మీరు ప్రేమతో పూజించరయ్య

కామక్రోధముల నెల్ల కడకు పారద్రోలు మందు

రామజోగి మందు కొనరే! ఓ జనులారా!

కాముక కర్మములనెల్ల ఎడబాపే మందు

సాటిలేని జగమునందు స్వామిదాస యోగి మందు  

రామజోగి మందు కొనరే!

భద్రాద్రి యందు తుదకు ముక్తిని పొందించే మందు

రామదాసు సద్భక్తితో కొలిచే మందు

రామజోగి మందు కొనరే! ఓ జనులారా!

ఇదీ కొంచెం అటూఇటుగా రామదాసు గారు పాడిన కీర్తన

రామదాసుగారు చెప్పిన రామజోగి మందు (కరోనా చికిత్స  సమయంలో సతతం రామ రామ అని భజించడం) జ్వాలాకు కరోనా నుండి రక్షణ కవచం మాదిరిగా పనిచేసిందని కృష్ణారావు గారు ఉవాచ.

(25-05-2021)

  

ఫ్రాడ్ ని మించిన ఫ్రాడ్

 “సేల్ డీడ్ పత్రాలు పోగొట్టిన బ్యాంక్ – రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా కమిషన్ తీర్పు”

ఇది ఈరోజు పత్రికలో వచ్చిన వార్త

ఇప్పుడు ఈ వార్త వెనక కధ చెప్పుకుందాం.

రవి, కళావతి ఇద్దరు వృద్ధ దంపతులు. ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపారు. ఓ పాతికేళ్ళ క్రితం కాబోలు ఇప్పుడు మేముంటున్న అపార్ట్ మెంటులో ఒక వాటా కొనుక్కున్నారు. ఆర్ధిక ఇబ్బందులతో ఇంటి మీద రుణం తీసుకున్నారు. అప్పు ఇచ్చింది  బ్యాంకు ఆఫ్  మైసూరు. తీర్చే టైముకు దాన్ని స్టేట్ బ్యాంకులో విలీనం చేశారు.

అసలు ఫాయిదాలు కట్టాము కనుక మా ఇంటి పత్రాలు మాకు వాపసు చేయమని కోరారు. అవి కనబడడం లేదన్నారు బ్యాంకు వాళ్ళు. వున్న ఒక్క ఇంటికీ పత్రాలు లేకపోతె ఎల్లా అని బ్యాంకు  చుట్టూ తిరిగారు. ఫలితం శూన్యం.

ఎవరో సలహా ఇస్తే ఇంటికి దగ్గరలో వున్న ప్రమోద్ అనే ఒక లాయర్ను పట్టుకుని వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు.

తీర్పు వీరికి అనుకూలంగా వచ్చింది.

అయితే అసలు కధ ఇక్కడే మొదలయింది.

రెండు రోజుల క్రితం బ్యాంకు వాళ్ళం అంటూ ఎవరో ఫోన్ చేశారు. మీ కాగితాలు దొరికాయి, మీరు బ్యాంకుకు రాయనక్కరలేదు, మేమే వచ్చి ఇస్తాము అన్నారు.

వీళ్ళ సంతోషానికి అవధులు లేవు.

అన్నట్టే వచ్చారు. పత్రాలు ఇచ్చారు. ముట్టినట్టు సంతకాలు చేయించుకుని వెళ్ళిపోయారు.

ఇది జరిగింది నిన్న. అంటే మే ఇరవై మూడున.

ఈరోజు ఈనాడు దినపత్రిక పదమూడో పేజీలో పైన చెప్పిన వార్త వచ్చింది.  వీళ్ళు పడిన మానసిక సంక్షోభానికి పరిహారంగా అయిదు లక్షలు బ్యాంకు చెల్లించాలని.

వీళ్ళు ప్రతిరోజూ ఈనాడు పత్రిక తెప్పించుకుంటారు. కోవిడ్ బారిన పడినప్పటి నుంచి ఇంటి ముందు దాన్ని కొన్ని గంటలు ఎండలో వుంచి ఆ తరువాత చదువుతారు. ఆవిధంగా అయిదు లక్షల నష్టపరిహారం వార్త ఆలస్యంగా తెలిసింది.

ఇన్నాళ్ళు కనబడని కాగితాలు నిన్న మొన్నట్లో ఎలా దొరికాయి. సాధారణంగా బ్యాంకుకు వచ్చి తీసుకువెళ్ళమనే వాళ్ళు ఇంటికే వచ్చి ముట్టినట్టు  ఎందుకు రాయించుకు వెళ్ళారు. 

ఈ ప్రశ్నలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.

కొద్దిసేపటి క్రితమే నాకీ సంగతి తెలిసింది. విషయం కనుక్కుందామని ఈనాడు బ్యూరోలో పెద్ద బాధ్యతలు చూస్తున్న  ఉండ్రు నరసింహారావు గారెకి ఫోన్ చేశాను.  నా  గురించి ప్రవర చెప్పకుండానే,  ఆయన నన్ను గుర్తుపట్టి విషయం విని మా వాళ్ళ చేత మీకు ఫోన్ చేయిస్తామని చెప్పారు. కొద్దిసేపటికే ప్రశాంత్ గారు ఫోన్ చేశారు. ఆయన కూడా ప్రశాంతంగా నేను చెప్పింది విన్నారు.

చూడాలి ఈ కధ ఏ మలుపులు తిరుగుతుందో! 


(ఈనాడు దినపత్రిక- 24-05-2021)


(24-05-2021)      

23, మే 2021, ఆదివారం

పరమాచార్య పావనగాధలు


మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాల రావు గారు రాసిన పరమాచార్య పావన గాథలు పుస్తకాన్ని ఆయన రెండో కుమార్తె కొలిపాక  కృష్ణవేణి ఆడియో రూపంలోకి తీసుకు వచ్చింది. ఆసక్తి ఉన్నవారు వినవచ్చు.

కోర్టు గుమ్మం జైలు గడప

 

“మీ కేసులో బలం వుంది, కానీ ఈ కేసును కడకంటా తీసుకువచ్చే శక్తి మీలో లేదని అనుకుంటున్నాను” అన్నాడా లాయరు గారు.

అనుకుంటాం కానీ ప్లీడర్లలో, వైద్యుల్లో అందరూ పీడించేవాళ్లే వుండరు. ఈయన కూడా అలాంటి అరుదైన వాడే అనిపించింది.

నేను 1975లో ఆలిండియా రేడియోలో చేరినప్పుడు ఏడాది తిరగకుండానే పే కమిషన్ సిఫారసులు అమలు చేశారు. ఆ చేయడంలో ఎక్కడో పొరపాటు జరిగి నాకు రావాల్సిన గ్రేడు రాలేదు. కొన్నేళ్ళ తర్వాత న్యూస్ ఎడిటర్ గా వచ్చిన ఆకిరి రామకృష్ణా రావు నాకు జరిగిన అన్యాయం తెలుసుకుని సర్వీసు వ్యవహారాల్లో దిట్ట అయిన ఒక ప్లీడరు గారి దగ్గరకు తీసుకువెళ్లాడు.
విషయం మొత్తం తెలుసుకుని ఆ వకీలు గారు చెప్పిన మాట ఇది.
అంతే కాదు కొన్ని పాయింట్ల రూపంలో గీతా బోధ కూడా చేశారు.
“మీ ప్రొబేషన్ పూర్తి కాలేదు. అంచేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసు వేస్తె కొన్ని ఇబ్బందులు రావచ్చు. ప్రభుత్వం ఒక కాంక్రీటు గోడ లాంటిది. దాన్ని డీకొడితే గోడ పగలడం కంటే డీ కొట్టిన తల పగిలే అవకాశాలే ఎక్కువ. మనం ఒక కోర్టులో గెలిస్తే వాళ్ళు పై కోర్టుకు వెడతారు. అలా మనం ఎక్కలేనన్ని మెట్లు వాళ్ళు సులువుగా ఎక్కేస్తారు. మనమూ ఎక్కే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఆ శక్తి ఉందా లేదా అని ఆలోచించుకోవాలి. ఇటువంటి పొరబాటే ఓ వందా రెండు వందల మందికి జరిగి వుంటే తలా కాస్త ఖర్చు పెట్టుకుని పోరాడవచ్చు. కానీ ఇది ఇండివిడ్యువల్ కేసు. పొరబాటు జరిగినా అది అంగీకరించరు. అంచేత వాళ్ళు లిటిగేషన్ కొనసాగిస్తారు. అంత ఆర్ధిక స్థోమత మీకు వుందని అనుకోను. ప్రొబేషన్ పూర్తి కాలేదు కాబట్టి కేసు తేలే వరకు మీకు పే కమిషన్ ప్రయోజనాలు నిలిపేసినా ఆశ్చర్యం లేదు. కేసు తేలడానికి ఏండ్లూ పూండ్లు పట్టవచ్చు. అప్పటిదాకా తట్టుకోగల శక్తి మీకు వుందని నేను అనుకోవడం లేదు.”

వచ్చిన క్లయింట్లని ఇలా నిరుత్సాహ పరిచే లాయర్లు ఉంటారని నాకు తెలియదు. ఆయన నా మీద సానుభూతితో చెప్పాడా లేక ఈ జర్నలిస్టులు అడిగిన ఫీజు ఇవ్వరు అనే అనుమానంతో చెప్పాడా అదీ తెలియదు. తెలిసినదల్లా అతడిలో సందేహించడానికి ఏమీ లేదనే. ఓ నమస్కారం పెట్టి వచ్చేసాము.

తర్వాత అనేక పే కమిషన్లు వచ్చాయి. నా సర్వీసు చివరాఖర్లో వచ్చిన పే కమిషన్ సిఫారసులతో కేంద్ర సిబ్బంది వేతనాలు ముందెన్నడూ లేని విధంగా పెరిగాయి. కాకపొతే, 2005 డిసెంబరు 31 సాయంత్రం నేను రిటైర్ అయ్యాను. మర్నాడు అంటే 2006 జనవరి ఒకటి నుంచి ఆ సిఫారసులు అమల్లోకి వచ్చాయి. అంటే ఒక్క రోజు తేడాతో పెన్షన్ లో పెద్ద వ్యత్యాసం వచ్చింది.

కానీ నేను ఆకాశవాణిలో గడించిన అనుభవాలు, మాస్కో జీవితం, పిల్లలు ఎదిగిరావడం ఇవన్నీ ఇచ్చిన తృప్తిని ఎన్ని పే కమిషన్లు ఇవ్వగలుగుతాయి? ఆనాడు ఆ లాయరు నన్ను ఆ కేసు గెలిపించి వుంటే నాకీ అవకాశాలు లభించి ఉండేవి కావేమో! ఒకటి తీసుకోవడం అంటే మరోటి ఇవ్వడం అనే లెక్క ఆ పైవాడిది.
“గోదావరిలో ఎన్ని నీళ్లున్నా మనం చెంబు తీసుకువెడితే చెంబెడు, బిందె తీసుకువెడితే బిందెడు. ఏదైనా ప్రాప్తాన్నిబట్టే” అనే మా అన్నయ్య మాటలు నాకు ఊరట. ఆయన ఇంకో మాట అనేవారు.
‘కోర్టు గుమ్మం ఎక్కకుండా, జైలు గడప తొక్కకుండా వెళ్లదీయగలిగితే దాన్ని మించిన ప్రశాంత జీవితం మరోటి వుండదు”
అదృష్టవశాత్తు ఈ రెండూ నా అనుభవంలోకి రాలేదు.


(23-05-2021)

‘మరుపు’ మంచిదే!

   

గుర్తు పట్టారా అంటూ సరిగా  తెల్లవారకుండానే ఫోన్లో పలకరిస్తుంది ఓ గొంతు. మధ్యాన్నం ఏ కూరతో అన్నం తిన్నానో సాయంత్రానికి గుర్తుండని గొప్ప  జ్ఞాపక శక్తి నాది. జుట్టు పీక్కున్నా గుర్తు రాదు.

కానీ కధ అంతటితో ఆగదు.

‘నేనెవరో చెప్పుకోండి చూద్దాం’ అంటుందా గొంతు అవతల నుంచి.

పొద్దున్న పొద్దున్నే ఈ అగ్ని పరీక్ష ఏవిటని వాపోవడం ఇవతల మన వంతు.  

మనం గుర్తు పట్టడం, మనల్ని గుర్తు పట్టడం ఈ రెండూ ఏదో ఒకరోజున అందర్నీ వేధించే సమస్యలే అనిపిస్తుంది ఈ పాడు లోకంలో.

నిన్న సాయంత్రం ఒక పెద్దాయన ఫోన్ చేశారు, ఓ అరవై మంది అనాథాశ్రమం వాళ్లకు వాక్సిన్ వేయించాలి ఎలా అని.

ఒకప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్నారు.  ఇంకా ఏదో సేవ చేయాలనే తపన.

ఆయన చెప్పిన మాటలు  వింటుంటే బాధ వేసింది.

గతంలో అలవాటు చొప్పున పెద్ద అధికారులకి ఫోన్ చేసి చెబుదామని ప్రయత్నిస్తే ‘సారు బిజీగా వున్నారు, మీరు ఫోన్ చేశారని తర్వాత చెబుతాను’ అన్నాడట ఆ అధికారి పియ్యే.

ఆయన కంటే ముందు రిటైర్ అయినవాడిని నేను. కనీసం ఆయనకీ ఫోన్ నెంబర్లు అన్నా తెలుసు, నాకదీ తెలియదు.

రోలు, మద్దెల సామెత జ్ఞాపకం వచ్చింది.

ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా చేసిన వీవీ శాస్త్రి గారు ఒక మాట చెప్పేవారు. ‘మనం సర్వాధికారాలు చెలాయించిన ఆఫీసుకి రిటైర్ అయిన తర్వాత తరచుగా, అదీ పని లేకుండా  పోకూడదు అని.

ఎందుకంటే కొత్త అధికారులు వస్తారు. పాత అధికారులని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం పాత సిబ్బందికి వుండదు. అది సహజం అని సరిపెట్టుకుంటే పర్వాలేదు, లేకపోతె మిగిలేది మనస్తాపమే.  

ఓ యాభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా రెవెన్యూ వంటి కీలక శాఖలను నిర్వహించిన శ్రీ పీ. నరసారెడ్డి   చాలా కాలం క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు.  రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా ఏళ్ళ తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే  గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ఎలా వున్నారుఅనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.

హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసుకు వెడతాను. నేను ఎవరన్నది మా  పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. కానీ ఇందిరాగాంధి వంటి  గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే నా  పరిస్తితి చాలా మెరుగు’

ఇలాంటిదే మరో వ్యధాభరిత కధ

ఆయన చాలా కాలం ఒక పెద్ద కార్యాలయానికి ప్రధానాధికారిగా పనిచేశారు. ఆయన కనుసన్నల్లో వందలాదిమంది సిబ్బంది పనిచేసేవారు.  రిటైర్ అయిన తర్వాత కొన్నాళ్ళకు ఏదో పని వుండి ఆ ఊరు వెళ్ళారు. తన పొజిషన్ లో పనిచేస్తున్న మరో అధికారి బాగా తెలిసిన వాడు కావడంతో వాళ్ళ ఇంటికి వెళ్లి కాసేపు కూర్చుని పాత విషయాలు తిరగేసుకున్నారు.

ఈలోగా ఆఫీసు టైం కావడంతో కొత్త అధికారి పాత అధికారిని మీరు కూడా రండి మన ఆఫీసును చూద్దురు కాని అని కోరడంతో ఆయన కూడా కారెక్కి వెంట వెళ్ళాడు.

ఆ ఆఫీసులో ఒక పద్దతి ఏళ్ళ తరబడి పాటిస్తూ వస్తున్నారు.

ప్రధానాధికారి ఇంటి నుంచి బయలుదేరగానే ఆయన పర్సనల్ స్టాఫ్ అలర్ట్ అవుతారు. ఆఫీసుకు చేరగానే సెక్యూరిటీ చీఫ్ ఫుల్ సెల్యూట్ తో ఆయన్ని  కారు వద్దనే రిసీవ్ చేసుకుని, బ్రీఫ్ కేసు తీసుకుని   వెంట వుండి లిఫ్ట్ దగ్గరకు తీసుకువేడతాడు. ఆ అధికారి వచ్చేదాకా లిఫ్ట్ ను   గ్రౌండ్  ఫ్లోర్ లోనే నిలిపి సానిటైజ్  చేసి ఉంచుతారు. లిఫ్ట్ బాయ్ నమస్కారం పెట్టి పైకి తీసుకువెడతాడు.

సరే! ఇదంతా ఆ రోజు అక్కడ పద్దతి ప్రకారం జరిగింది. విచిత్రం ఏమిటంటే అప్పటికి కొన్నేళ్ళ క్రితం ఆ పాత అధికారిని కూడా  సకల లాంఛనాలతో ఇలాగే రిసీవ్ చేసుకునేవారు. ఆయనా ఈ వైభోగం అనుభవించిన వాడే.

ఇవ్వాళ కూడా  అదే మనిషి. అదే అధికారులు. అదే సిబ్బంది. కనీసం వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ని గుర్తు పట్టినట్టు కనీసం నటించను కూడా లేదు.  

భగవద్గీతలో చెప్పిన మాదిరిగా మానవుడు  జీర్ణమై పోయిన పాత ఉడుపులు వదిలేసి కొత్త వస్త్రాలు ధరించినట్టు, ఉద్యోగాలు కూడా.

కావున, ఓ పార్దా! పాత ఉద్యోగాల వైభోగం  కోసం వర్తమానంలో శోకించుట తగదు. మరచిపోవుట మేలు.

(23-05-2021)