10, ఏప్రిల్ 2020, శుక్రవారం

ఓ పాత వృత్తాంతం నెమరు వేసుకోవడానికి మాత్రమే


ఏదో జరుగుతుంది. వెంటనే అప్పుడెప్పుడో ఇలాగే జరిగింది అంటారు పెద్దవాళ్ళు, దానికీ దీనికీ పెద్దగా పోలికలేకపోయినా.
అలాగే ఇది. జరిగింది ఏమిటో మీకు తెలుసు, విడిగా అదేమిటో చెప్పక్కర లేదు. పోలిక అంటారా! మాయాబజార్ సినిమాలో ప్రియదర్శిని  పేటిక మాదిరే. అందులో ఎవరికి కావాల్సింది వాళ్లకు కనబడుతుంది. అక్కరలేదు అనుకున్నది కనబడదు. మన రాజకీయాల సంగతి చెప్పేది ఏముంది.
ఇక చిత్తగించండి!
ఈ వ్యాసం ఇండియా టుడే పత్రికలో 1993 అక్టోబర్ సంచికలో వచ్చింది. రాసిన జర్నలిస్టు పేరు మనోజ్ మిత్తా. ఆ వ్యాసానికి ఇది స్వేచ్చానువాదం. ఆ పత్రిక వారికి కృతజ్ఞతలు.
ఆ రోజుల్లో ఎన్నికల చీఫ్ కమిషనర్ టి.ఎన్. శేషన్ అంటే జనాలకు ఎనలేని ఆదరణ అభిమానం. రాజకీయులకు సింహస్వప్నం.
అయితే ఎంతటి వారికి కూడా ఒక రోజు వస్తుందనేది నానుడి. అది సెషన్ విషయంలో కూడా జరిగింది.
అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక నిర్ణయం తీసుకుంది. అది ఆయన్ని ఇరకాటంలోనే కాదు ఆశ్చర్యంలో కూడా ముంచివేసింది. ఎందుకంటే ఇలాటి రోజు ఒకటి వస్తుందని ఆయన కూడా ఎప్పుడూ ఊహించి వుండరు.
అప్పటివరకు ఎలెక్షన్ కమిషన్ అంటే శేషన్ ఒక్కరే. ఆయనే దానికి కర్తా కర్మా క్రియా అన్నీను. అలాంటిది మరో ఇద్దరు ఎలెక్షన్ కమిషనర్లను ప్రభుత్వం అదనంగా నియమించింది. అది ఎంతటి ఆకస్మిక నిర్ణయం అంటే కొత్తగా నియమితులయిన ఇద్దరు కమిషనర్లు శ్రీ జీవీజీ కృష్ణమూర్తి, శ్రీ ఎం.ఎస్. గిల్ లకు కూడా ఆ సమాచారం ఆఖరి నిమిషంలోనే తెలిసింది. అప్పుడు వ్యవసాయ శాఖ కార్యదర్శిగా ఉన్న గిల్ అధికారిక పర్యటన నిమిత్తం ఆ రోజు ఉదయమే గ్వాలియర్ వెళ్ళారు. ఆయన్ని మళ్ళీ ఢిల్లీ తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఒక  ప్రత్యేక విమానాన్ని పంపింది.  పుణేలో సెలవులు గడపడానికి వెళ్ళిన శేషన్ కు ఈ విషయం తెలిసింది. “ఇంకా నూటొక్క మంది కమిషనర్లను వేసుకోమనండి, నాకేమీ ఫరకు పడదు” అన్నది ఆయన మొదటి స్పందన.
ఇక కృష్ణమూర్తి గారి విషయం తీసుకుంటే ఆయన కొన్నింటిలో శేషన్ కు ఏ మాత్రం తీసిపోరు. ఆయన కేంద్రంలో న్యాయ శాఖ కార్యదర్శిగా పనిచేసారు. ఆయన శేషన్ రక కోసం ఎదురు చూడకుండా ఎలక్షన్ కమిషన్ కార్యాలయంలో తనకంటూ ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు.  శేషన్ కు నమ్మకస్తుడిగా  ఎలెక్షన్ కమిషన్ లో కోర్టు వ్యవహారాలు చూస్తున్న మాజీ అటార్నీ జనరల్  జి. రామస్వామి, ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఒక కేసులో కమిషన్ తరపున వాదించడానికి వీలులేకుండా ఆర్డరు వేసారు. ఎందుకంటే అనదరి కంటే ముందు ఇలాముగ్గురు సభ్యులను నియమించడం రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించింది ఆ రామస్వామి కాబట్టి.
“ఇక నుంచి  ఎలెక్షన్ కమిషన్ అంటే మేము ముగ్గురం.” అని ఇండియా టుడే తో తేల్చి చెప్పారు. అయినా శేషన్ పట్టుబట్టి ఆ కేసును మళ్ళీ రామస్వామికే అప్పగించారు. అది వేరే విషయం. అప్పటి నుంచి ఈ ఇరువురి నడుమ విబేధాలు పెరిగిపోయాయి. తనకు ఆఫీసులో తగిన గౌరవం లభించడం లేదని ఒకసారి శ్రీ కృష్ణమూర్తి ఆఫీసు నుంచి బయటకు వెళ్ళిపోయారు కూడా. తను కూర్చుండే గదికి తాళం వేసి వుండడం, ఫోను వైర్లు తెగిపోయి వుండడం గమనించిన శ్రీ కృష్ణమూర్తి అవమానంగా భావించారు. భద్రతా హర్యాల కారణంగా ఒక రోజు ఆ గదికి తాళం వేసినట్టు శేషన్ విలేకరులకు వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మెత్తపడని కృష్ణమూర్తి ఆ విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని శేషన్ హామీ ఇచ్చిన తర్వాతనే ఆయన ఆఫీసులోకి అడుగుపెట్టారు.
మూడో సభ్యుడైన గిల్ మాత్రం ఈ వ్యవహారాలను తేలిగ్గా తీసుకున్నారు. ‘మనం ఏ కుర్చీలో కూర్చున్నాం, మన గదిలో ఎన్ని సోఫాలు వున్నాయి అన్నది ప్రధానం కాదు. రాజ్యాంగం మనకు ఒప్పగించిన బాధ్యతలను ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అన్నదే ప్రధానం’ అనేది ఆయన అభిప్రాయం.
ఇదిలా ఉండగానే ప్రభుత్వం మరో ఆర్డినెన్స్ తెచ్చింది. ముగ్గురు కమిషనర్లలో  ఒకరుఎక్కువా కాదు, మరొకరు తక్కువా కాదు, హోదాలో, అధికారాల్లో అందరూ సమానమే” అన్నది దాని సారాంశం.
(ఇండియా టుడే సౌజన్యంతో)


5, ఏప్రిల్ 2020, ఆదివారం

పెద్ద గీత గీద్దాం రండి – భండారు శ్రీనివాసరావు



(Published in నమస్తే తెలంగాణ daily on 5th April, SUNDAY)
ఒక తరం వారు కనీవినీ ఎరుగని ఒక మహా విపత్తు నేటి తరం అనుభవంలోకి వస్తోంది. గతంలో మన పెద్దవాళ్ళు రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి పరిస్తితులను గురించి చెప్పడం పాత తరం వారికి గుర్తుండే వుంటుంది. అది ప్రపంచదేశాల మధ్య జరిగిన యుద్ధం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ప్రపంచదేశాలన్నీ కలిసి ఉమ్మడిగా ఒక మహమ్మారి వైరస్ తో సాగిస్తున్న సమరం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించినట్టు ‘కనపడని శత్రువుతో ఎడతెగని యుద్ధం’ ఇది. ఏ యుద్ధంలోనైనా గెలుపోటములు వుంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో గెలిచి తీరాల్సిన అవసరం వుంది. ఎందుకంటే సమస్త మానవాళి మనుగడ ఈ విజయం మీదనే ఆధారపడి వుంది.
కాకలు తీరిన రాజకీయ విశ్లేషకులందరూ ఇంతకాలం మూడో ప్రపంచ యుద్ధం గురించే ముచ్చటిస్తూ వచ్చారు. వారు ఏనాడు కూడా ఇటువంటి ముప్పొకటి యావత్ ప్రపంచాన్ని ఉడ్డుగుడుచుకునేలా చేస్తుందని లేశమాత్రం కూడా ఊహించలేదు. ఏదేశం ఎన్ని మారణాయుధాలను కలిగివున్నది, ఏ అగ్రరాజ్యం వద్ద నిమేష కాలంలో శత్రు దేశాలను భస్మీపటలం చేసే అణ్వాయుధాలు పోగుపడి వున్నది లెక్కలు కట్టి చెప్పి మూడో ప్రపంచయుద్ధం అంటూ జరిగితే అందులో విజేతలు, పరాజితులు అంటూ ఎవ్వరూ మిగలరని, ఆ సంగ్రామంలో మొత్తం మానవ సమాజం తుడిచి పెట్టుకు పోవడం మినహా నిర్దిష్ట ఫలితం శూన్యమని హెచ్చరిస్తూ వచ్చారు.
సరే! ఈ సంగతులు ఇలా ఉంచుదాం.
ఈ ఉదయం మా పనిమనిషి మూతికి గుడ్డ కట్టుకుని పనులు చేయడానికి వచ్చింది. ఆవిడ మా వాచ్ మన్ భార్య. బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. రాగానే సానిటైజర్ తో చేతులు కడుక్కుని పనులన్నీ పూర్తి చేసుకుని వెడుతోంది. మామూలు రోజుల్లో అయితే, పక్కనే వున్న మరో రెండు ప్లాట్లలో పనిచేస్తుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా వెళ్ళడం లేదు. ‘రేణుకా! ఏదైనా డబ్బు ఇబ్బందిగా వుంటే చెప్పు’ అన్నాను, వెళ్లిపోయేటప్పుడు.
ఆవిడ చెప్పిన జవాబు నా కళ్ళు తెరిపించింది. ‘డబ్బుకు ఇబ్బంది ఉన్న మాట నిజమే కాని కష్టంగా లేదు’
ఇబ్బందులు వేరు, కష్టాలు వేరు అనే భగవద్గీత ఆమె నాకు బోధించింది.
చదువుకున్న వాళ్ళం, ఇంట్లో వొంట్లో కాస్త వున్నవాళ్ళం ఈ వారం పది రోజులకే నానా హైరానా పడిపోయి ఎందుకు పరిస్తితుల్ని తిట్టుకుంటూ కూర్చున్నాం. అంతే కాదు ఈ కష్టాలకు ఎవరినో బాధ్యులను చేసి వాళ్ళ చేతకానితనం వల్లనే దేశం ఇన్ని ఇబ్బందుల్లో చిక్కుకుపోయిందని హాయిగా తీరి కూర్చుని ఫేసుబుక్కుల్లో పోస్టులు పెడుతున్నాం. నిజానికి మనం ఇబ్బందులు అనుకునేవి ఇబ్బందులేనా!
రోజూ ఆర్డరు వేసి తెప్పించుకునే పిజ్జాలు దొరక్క పోవడం, పనివున్నా లేకపోయినా బైకో, కారో వేసుకుని నాలుగు బజార్లు చక్కర్లు కొట్టిరావడానికి వీలులేకపోవడం, చేతి సంచీ పట్టుకుని మార్కెట్టుకు వెళ్లి గీసి గీసి బేరాలు చేసి కూరలు కొనుక్కువచ్చే అవకాశం లేకపోవడం, పెద్ద పెద్ద మాల్సుకు వెళ్లి, కలయతిరుగుతూ అవసరమైనవీ లేనివీ సమస్తాన్ని ట్రాలీల్లో నింపుకుంటూ షాపింగ్ చేసే వీలు లేకపోవడం, అర్ధరాత్రి దాకా బార్లలో, పబ్బుల్లో గడుపుతూ డ్రంకెన్ డ్రైవింగ్ లో పట్టుపడి పోలీసులతో యాగీపడుతూ, టీవీల్లో కనబడే సందర్భాలు కోల్పోవడం ఇవేనా మనం అనుకునే ఇబ్బందులు, కష్టాలు. నిజానికి ఇవన్నీ చిన్న గీతలు.
పగలూ రాత్రీ ఇళ్ళల్లోనే వుండి, కాలుమీద కాలువేసుకుని టీవీలు చూస్తూ కరోనాపై సాగిస్తున్న యుద్ధంలో వైద్య సిబ్బంది, పోలీసులు పడే కష్టాలను చూస్తూ మన తలలో దూరిన ప్రతి ఐడియాను సలహాల రూపంలో సాంఘిక మాధ్యమాల్లో గుప్పించడం, వాటికి లైకులు తగినన్ని రాలేదనో, లేదా వాటిని ఖండిస్తూ కామెంట్లు వచ్చాయనో జుట్టు పీక్కుంటూ కూర్చోవడం ఇవేనా మనం పడే కష్టాలు, ఇబ్బందులు. నిజానికి ఇవన్నీ చాలా చిన్న గీతలు.
మనం ఇలా ఇళ్ళల్లో వున్నామంటే ఎవరో మనకోసం వీధుల్లో మండుటెండలో నానా కష్టాలు పడుతున్నారని అర్ధం చేసుకోవాలి. రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి కాసేపు కరెంటు పొతే, అసలే ఎండాకాలం, కరెంటు లేకపోతే ఎల్లాగా, ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అని విమర్శలు చేసే నైతిక హక్కు మనలో ఎవరికైనా ఉందా!
తగినన్ని సంఖ్యలో క్వారంటైన్ కేంద్రాలు లేవు, మాస్కుల ఉత్పత్తి సరిపోను లేదు అంటూ సన్నాయినొక్కులు నొక్కుతూ కాలక్షేపాలు చేయడం బాధ్యత అనిపించుకుంటుందా!
ఇంటికి నిప్పు అంటుకుంటుంది. అప్పుడు తక్షణం చేయాల్సిన పని ఏమిటి? ఆ మంటల్ని ఆర్పడం లేదా అవి పక్క ఇళ్ళకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అంతే కాని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఆ ఇంట్లో తగినన్ని ముందు జాగ్రత్తలు తీసుకోలేదని, అందుకే ఈ ప్రమాదం సంభవించిందని నోళ్ళు పారేసుకోవడం వల్ల ఉపయోగమేమిటి? ముందు నష్ట నివారణ చర్యలు తీసుకుని, ప్రాణ నష్టం నివారించి ఆ పిదప తీరిగ్గా ఈ విషయాలు చర్చించి బాధ్యులను నిర్ధారించి శిక్షలో జరిమానాలో వేయిస్తే ఆక్షేపించేవారు ఎవరుంటారు? నిజానికి ప్రభుత్వాలు చేస్తున్నది అదే! ఆ ప్రయత్నాలను ఆక్షేపించడం వల్ల ఉపయోగం ఏమిటి?
ఈ లాక్ డౌన్ వల్ల సమాజంలో కష్టపడేవాళ్ళు, ఇబ్బందులు పడేవాళ్ళు వేరే వున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, రోజు కూలీ చేసుకుని జీవనం గడిపే వాళ్ళు, రెక్కాడితేకాని డొక్కాడనివాళ్ళు ఎందరో వున్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ కూడా. కానీ వాళ్ళని గురించి మాట్లాడేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటోంది. ఎంతసేపూ ఇఎంఐలు, వాయిదాలు, వడ్డీ గొడవలు ఇవే రోజువారీ చర్చల్లో కనబడుతున్నాయి. వీటిని తక్కువ చేసి చెబుతున్నానని అనుకోవద్దు. కానీ ఇవి ఇబ్బందులు మాత్రమే, కష్టాలు కాదు.
మా పనిమనిషి మాటలతో నాకు జ్ఞానోదయం అయిందని అనుకుంటున్నాను. నేను వెంటనే నా గీత పక్కనే పెద్ద గీత గీసుకున్నాను. దాంతో నాది చిన్న గీత అయింది. మనసు తేలికపడింది.
అందరం పెద్ద గీత గీసుకుందాం రండి! కష్టాలు అనుకున్నవి ఇబ్బందులుగా మారతాయి. మనసు తేలికపడ్డకొద్దీ ఇబ్బందులు కూడా దూదిపింజల్లా ఎగిరిపోతాయి.

2, ఏప్రిల్ 2020, గురువారం

రాజుగారి పెద్ద భార్య చిన్న భార్య


“మీరు పాత కాలంవాళ్ళు. ఇవన్నీఈ  రోజుల్లో చాలా  మామూలు. తేలిగ్గా తీసుకోవాలి” అన్నాడు ఓ మిత్రుడు.
నిజమే. కానీ ఆ మిత్రుడు అన్నట్టు పాత కాలపు వాసనలు కదా! త్వరగా వదలవు.
ఈ మధ్య ఫేస్ బుక్ లో  ప్రతి విషయంలో అనవసరమైన నిందారోపణలు, వ్యాఖ్యలు దర్శనమిస్తున్నాయి.
చిన్నప్పుడు మా బామ్మ అనేది, ఇష్టం లేని వాడి పాపిడి వంకర అని. అలాగే వున్నాయి ఇవి కూడా.
ఏదో ఎవరూ అనుకోని  తెలియని ఉత్పాతం వచ్చి పడింది. అందరూ తలో చేయీ వేస్తున్నారు. కానీ వీళ్ళ చేతులు ఊరుకోవు కదా! సోషల్ మీడియాలో సన్నాయి నొక్కులు మొదలయ్యాయి.
“టాటా సాయం చేస్తే బిర్లా ఎందుకు చేయడు? (బిర్లాలు చేసారో లేదో నేను పత్రికల్లో చదవలేదు, ఎందుకంటే పత్రిక మొహం చూసి రమ్యమైన రెండో వారం నడుస్తోంది)
“హీరోలు ఒక్కళ్ళేనా హీరోయిన్లకు బాధ్యత లేదా”   
“అందరూ కోట్లు లక్షలు ఇస్తుంటే ఈయనకు ఏమైంది వేలతో సరిపుచ్చాడు”
 “ఇంకా వాళ్ళు మొదలు పెట్టలేదేమిటి? గతంలో ఏదైనా ఉపద్రవం వస్తే చాలు చందాల వసూలుకు జనం మీద పడేవాళ్ళు. వసూలు చేసిన వాటికి ఇంతవరకు లెక్కా డొక్కాలేదు”
“ఈ ముఖ్యమంత్రిని నమ్మి వందల కోట్లు ఇస్తున్నారు, అదిగో ఆ ముఖ్యమంత్రిపై నమ్మకం లేక ఎవరూ చేయి విదల్చడం లేదు”
అంటే ఏమిటి? రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే చిన్న భార్య చెడ్డదనేనా?
ఈ విషమ సమయంలో ఇవేనా మనం మాట్లాడుకోవాల్సింది.
వెనక చైనా యుద్ధం అప్పుడు దేశ రక్షణ నిధికి విరాళాలు పోగుచేస్తుంటే మా రెండో అక్కయ్య కూతురు శాంత, అప్పటికి చాలా చిన్నపిల్ల, తన చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులు తీసి జోలెలో వేసింది. మా బావగారు ‘మంచి పనిచేశావ్ అమ్మాయి’ అని మెచ్చుకున్నారు. అంతే! అప్పటితో మరచిపోయారు. ఇరుగూ పొరుగు వాళ్లకి కూడా చెప్పుకోలేదు.   

మనం చేయాల్సింది మనం చేద్దాం ! – భండారు శ్రీనివాసరావు


అజ్ఞానం, అవగాహన లేమి అని అనుకున్నా పర్వాలేదు కాని కరోనాను కట్టడి చేయడానికి ప్రస్తుతం  అందుబాటులో ఉన్న ఆచరణ సాధ్యమైన మార్గం మనుషుల నడుమ కొంత దూరం ఉండేలా చూసుకోవడం ఒక్కటే. ఇందుకోసం లాక్ డౌన్  ఒక్కటే పరిష్కారం. ఒకరకంగా ఇది ప్రధమ చికిత్స లాంటిది.
ఈ కరోనా వ్యాధి కధాకమామిషు ఏమిటి, దీన్ని అరికట్టడానికి ఎలాంటి వాక్సిన్ తయారు చేయాలి, ఎలాంటి మందులు వాడాలి, ఇలాటివన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలే. ఎవరు చెప్పినా కొన్ని అవి ముందు జాగ్రత్తలే. ఆ జాగ్రత్తలో ఒకటి ఈ సామాజిక దూరమో, భౌతిక దూరమో ఏ పేరుతొ అన్నా పిలవండి అది పాటించడమే. ముందు వ్యాధి వ్యాప్తిని అరికట్టడం ప్రాధమిక బాధ్యత. ప్రభుత్వాలు ఈ దిశగానే అడుగులు వేస్తున్నాయి. కొన్ని ఫలితాలు కూడా వస్తున్నాయి.
ఉదాహరణకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలోని సియాటిల్ లోనే ముందు ఈ వ్యాధి పొడసూపింది. పాజిటివ్ కేసులు, కొరానా మరణాలు సంభవించింది కూడా ఈ నగరంలోనే. ఒకరకంగా అమెరికాలో కోరానా వ్యాధికి ఈ నగరాన్ని ఎపిసెంటర్ గా మొదటి రోజుల్లో అనుకున్నారు. దేశంలో లాక్ డౌన్ పెట్టాలా అక్కరలేదా అని ఫెడరల్ ప్రభుత్వం మీన  మేషాలు లెక్క పెడుతున్నప్పుడే వాషింగ్టన్ స్టేట్ గవర్నర్ తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. రోజులు గడిచిన తర్వాత దాని సత్ఫలితాలు ఇప్పుడు క్రమంగా అనుభవంలోకి వస్తున్నాయి. పాజిటివ్ కేసులు తగ్గలేదు కాని వాటి సంఖ్య పెరగకుండా ఆపగలిగారు.
కరోనాకు ఏదైనా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేలోగా మానవాళి ముందు ఉన్న పరిష్కారం ఒక్కటే అది సెల్ఫ్ క్వారంటైన్. దానికి దోహద పడేదే ఈ  లాక్ డౌన్.
ఒక చిన్న నిప్పు రవ్వ గాలికిలేచి దూరంగా వున్న గడ్డి వాములపై పడి అవి భస్మీపటలం అయిన సందర్భాలు అందరి అనుభవం లోనివే. కాబట్టి ఈ కరోనా నిప్పురవ్వ యావత్ సమాజాన్ని దహించకుండా వుండాలంటే బహుముఖ చర్యలు అవసరం. అవన్నీ ఆచరణలోకి వచ్చేలోగా లాక్ డౌన్ ఒక్కటే పరిష్కార మార్గం.
ఈ క్రమంలో ప్రజలకు సాధ్యమైనంత తక్కువ అసౌకర్యం కలగకుండా ప్రభుత్వాలు చూసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులను పెద్ద మనసు చేసుకుని భరిస్తూ అనవసరమైన ఆరోపణలు, విమర్శలు చేయకుండా ప్రభుత్వాలకు సహకరించడం ప్రజలు అలవాటు చేసుకోవాలి. కొన్నాళ్ళు ఇది తప్పదు.
కరోనా గురించి ప్రస్తుతం వేగంగా విస్తరిస్తున్న వదంతులకు అడ్డకట్ట వేయాలి. నిజానికి ఇవన్నీ అర్ధ సత్యాలే. వాతావరణంలో వేడి వుంటే ఈ వైరస్ నశిస్తుందని కొందరు అంటున్నారు. కానీ ఈ వ్యాధి బాగా విస్తరించిన దేశాల్లో చలి వాతావరణం ఉన్న దేశాలతో పాటు ఉష్ణ దేశాలు కూడా వున్నాయి. ఏదీ నిర్ధారణ కానీ నేపధ్యంలో ఈ ఊహాగానాలు ప్రజల్లో భయ సందేహాలను మరింత పెంచుతాయి.  కాబట్టి చదువుకున్నవాళ్ళు తమకు తెలిసిన అరకొర జ్ఞానాన్ని నలుగురికీ పంచాలనే అతి ఉత్సాహాన్ని తగ్గించుకోవాలి.
తెలియని కొరానా గురించి తెలిసీ తెలియని మాటలు చెప్పేవారిని చూస్తుంటే, చిన్నప్పుడు చదువుకున్న  నలుగురు దృష్టి లేనివాళ్ళు, ఏనుగు కధ గుర్తుకురాక మానదు.        
        

30, మార్చి 2020, సోమవారం

వెలుగు చూడని వార్తలు - 2 -


రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రెండో దఫా ఎన్నికలకు సిద్ధం అవుతున్న రోజులు.
ఏదో కార్యక్రమానికి వెళ్లి బేగంపేట లోని సీఎం క్యాంపు ఆఫీసుకు తిరిగివస్తున్నారు. ముందు సీట్లో కూర్చుని వున్న వై.ఎస్. ఆర్., యదాలాపంగా వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిగత సిబ్బందిని అడిగారు రాష్ట్రంలో పరిస్తితి ఎలావుందని. ఐ.ఏ.ఎస్. అధికారి తడుముకోకుండా చెప్పేశారు, పరిస్తితులు పాలక పక్షానికి అనుకూలంగా వున్నాయని.
‘ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు జనంలోకి బాగా వెళ్ళాయి. అలాగే సేద్యపు నీటి ప్రాజెక్టులు. ప్రజల్లో రవంత కూడా వ్యతిరేకత ఉన్నట్టుగా నాకనిపించడం లేదు. ధైర్యంగా ఉండొచ్చు’
మాట్లాడుతుండగానే క్యాంపు ఆఫీసు వచ్చింది. కారు దిగబోతుండగా ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రవిచంద్ ఇలా అన్నారు.
‘దేనికయినా బుల్లెట్ ప్రూఫ్ వుంటుంది, పొగడ్తలకు తప్ప’
వై.ఎస్.ఆర్. కి రవిచంద్ మాటల్లో భావం బోధపడింది.
పెద్దగా నవ్వేశారు, తనదయిన స్టైల్లో.

వెలుగు చూడని వార్తలు – 1 -


అప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ సీపీ ఎం నాయకుడు రాఘవులు ఒక ఆరోపణ చేశారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో వంద కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందన్నది ఆ ఆరోపణ సారాంశం.
మర్నాడు ఒక ప్రముఖదినపత్రిక ఒక కార్టూన్ ప్రచురించింది. వై ఎస్ బొమ్మ పెద్దగా, పక్కనే చంద్రబాబు బొమ్మ చిన్నగా వుంటుంది. ఆయన వై ఎస్ ని ఉద్దేశించి ఏదో అంటుంటాడు. సీపీఎం నాయకుడు రాఘవులు వైఎస్ఆర్ నోట్లో చేయిపెట్టి ఒక డబ్బు మూట బయటకు తీస్తుంటాడు. వై ఎస్ ఆర్ అవినీతిని టీడీపీ కన్నా సీపీఎం బాగా బయట పెడుతోందన్న అర్ధం అందులో అంతర్లీనంగా వుంది.
అది చూసిన వై ఎస్ కి పట్టరాని కోపం వచ్చింది. దాన్ని ఆయన దాచుకోలేదు. ఆ కార్టూన్ వేసిన పత్రిక యజమానిపై మండిపడ్డారు. అప్పుడు అక్కడే వున్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ నచ్చ చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు. ఆ పత్రిక రాసేవన్నీ అభూత కల్పనలు అనే పద్దతిలో ఎదురు దాడి మొదలు పెట్టడమే మంచిదని వైఎస్ నిర్ధారణకు వచ్చారు. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి వున్నప్పుడు ఇప్పటి నుంచే పత్రికలతో తగాదా ఎందుకన్నదికిరణ్, కేవీపీ ల అభిప్రాయం. కానీ వైఎస్ ఒప్పుకోలేదు. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎన్నికల నాటికి ప్రజలు నమ్మే పరిస్తితి వస్తుందని ఆయన నమ్మకం. అప్పటి నుంచి వైఎస్ సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పత్రిక రాతల్ని ఎండగట్టే ప్రయత్నం ప్రారంభించారు. తరువాత అది ఆ రెండు పత్రికలూ..అంటూ రెండు తెలుగు దిన పత్రికలని ఎద్దేవా చేసే ప్రచార కార్యక్రమంగా రూపు దిద్దుకుంది.

జస్ట్ ఫర్ చేంజ్


రాత్రి అమెరికా నుంచి మా పెద్దవాడు సందీప్ నుంచి వీడియో కాల్. చూస్తే వేరే మనిషి లాగా వున్నాడు.
‘నేనే డాడ్. ఎలా వున్నారు?’
‘ఇదేం వేషంరా!’
‘వేషం కాదు ఇదే ఒరిజినల్. సెల్ఫ్ ఐసొలేషన్. అందరం వర్క్ ఫ్రం హోం. పిల్లల చదువులు కూడా ఇంటి నుంచే కంప్యూటర్ లో. మొదటి వారం రోజులు మాత్రం ఆఫీసుకు పోయేవాళ్ళ లాగా పొద్దున్నే లేచి తయారై కంప్యూటర్ ముందు కూచునే వాళ్ళం. పోను పోను విసుగనిపించింది. జస్ట్ ఫర్ చేంజ్. గడ్డం పెంచుతున్నాను. కాదు అదే పెరుగుతోంది’ అన్నాడు వాడు నవ్వుతూ.