5, జనవరి 2012, గురువారం

సంగీతం మధుర సంగీతం



సంగీతం మధుర సంగీతం – ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

'సంగీతము చేత బేరసారములుడిగెన్'

చిన్నప్పుడు సంగీతం నేర్చుకొందామనుకొనే  వారందరికీ  కాషన్ గా ఈ సామెత చెప్పేవారు.  అయితే కొంతమంది పెళ్ళిచూపుల్లో అదనపు అర్హత కోసం చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇళ్ళల్లో నాలుగయిదేళ్లపాటు  సంగీతం చెప్పించేవారు.  దొంగరాముడు సినిమాలో  వీరభద్రయ్య {రేలంగి} తన కూతురుకి ఇలాగే పెళ్లి సంగీతం చెప్పిస్తాడు.  పెళ్లి చూపుల్లో 'జార చోరా భజన చేసితిరా' అని 'దారిని తెలుసుకొంటి' అనే త్యాగరాజ కీర్తనలో  ఓ  చరణాన్ని పెళ్లి కూతురు చేత  పాడిస్తారు దర్శకుడు కేవీ రెడ్డి గారు.

అదలా వుంచితే,

తెలుగునాట  ద్వారం వెంకటస్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, దాలిపర్తి పిచ్చిహరి, హరి నాగభూషణం, తూమాడ సంగమేశ్వర శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మహావాది వెంకటప్పయ్య  వంటి పాటా తరానికి చెందిన సంగీత విద్వాంసులు ప్రసిద్ధిచెందారు. పోతే, సుసర్ల దక్షిణా మూర్తి గారు త్యాగరాజు శిష్య పరంపరలోని వారు.  ఈ మహా విద్వాంసుల శిష్యకోటిలో తెలుగు వారికి అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టిన వారు మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణ మూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, షేక్ చిన్న మౌలా, ఈమని శంకర శాస్త్రి .  ఇంకా ఎందరో  విద్వాంసులు కర్నాటక సంగీతంలో  అగ్రశ్రేణిలో నిలిచారు.  ఈ విషయంలో మనం ఎంత గొప్పవాళ్ళ మైనా  తమిళులు కర్నాటక సంగీతం వాళ్లదేనని అనుకొంటారు. కొంత వాస్తవం కూడా. కర్నాటక సంగీతానికి  తమిళనాట ఉన్నంత ఆదరణ మన ప్రాంతంలో లేదు. మద్రాసులో కచేరి చేసి అక్కడి వాళ్ళ చేత ‘సెహభాష్’ అనిపించుకొంటేనే ఇక్కడ కూడా గౌరవం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న సూత్రం ఇక్కడ పని చెయ్యదు.  సంగీతంలో మాత్రం రచ్చ  గెలిస్తేనే  ఇంట్లో గౌరవిస్తాం.
  ఫిడేలు నాయుడు గారి నుంచి ఈతరం మాండొలిన్ శ్రీనివాస్ దాకా ఇదే వరస, ఇదే బాణీ.



  
ఈ మధ్య  ముగిసిన చెన్నై  మ్యూజిక్ సీజనులో ఈ వాస్తవం మరోమారు బోధపడింది.  మార్గశిర మాసం వచ్చిందంటే చెన్నై వాసులకు  ఓ పండగ. డిసెంబర్ పదిహేనో తారీకు నుంచి జనవరి ఒకటో  తారీకు దాక చెన్నైలో సంగీతం తప్పితే ఏమీ వుండదు.  నగరంలో నలుమూలలా కనీసం ఓ  పది పదిహేను ప్రాంతాల్లో ప్రతి  రోజూ హీనపక్షం  అయిదారు సంగీత  కచేరీలయినా  జరుగుతూ వుంటాయి. ఎక్కడ చూసినా హడావుడే. ఎక్కడెక్కడినుంచో  కర్నాటక సంగీత అభిమానులు చెన్నై చేరుకుంటారు.  ప్రొద్దుట తొమ్మిది నుంచి రాత్రి పది దాకా కచ్చేరీలు  వినడమే వారి పని. చెవుల తుప్పు వొదిలిపోతుంది. మరో ఏడాదికి సరిపడా ఆనందాన్ని మనస్సులో నింపుకుని సంగీతాభిమానులు తిరుగుమొగం పడతారు.

ఇక చెన్నైలో  మ్యూజిక్ అకాడమీది  ఓ ప్రత్యేకత. మొన్న ముగిసిన డిసెంబరులోనే ఈ అకాడమీ  85 వ సంగీతోత్సవం  జరుపుకొంది. నిజానికి పాశ్చాత్య ధోరణులు అన్ని రంగాలను ముప్పేటలా ముసురుకుంటున్న ఈ రోజుల్లో ఇది  ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.


 అకాడమీలో కచేరి చెయ్యడం అంటే ఆర్టిస్టులకు  అంతకంటే  గొప్ప గౌరవం ఇంకోటి  వుండదు. అలాగే సంగీత అభిమానులకు అకాడమీలో  కచేరి వినడం.  అంత కంటే గొప్ప అనుభవం వుండదు.  జీవితంలో వొక్కసారైనా అకాడమీలో  కచ్చేరి వినాలన్నది వారి నరనరాల్లో జీర్ణించుకుపోయే కోరిక. మంచి సంగీతం వినాలనుకునే వారికి   మ్యూజిక్ అకాడమీ హాలు ఒక వరప్రసాదం లాటిది. ఎందుకంటె అక్కడి ఏర్పాట్లు అలాటివి. ఎక్కడ కూర్చున్నా కూడా  చక్కగా, శ్రావ్యంగా వినిపించే సౌండ్ సిస్టం.  మన రవీంద్ర భారతి అధికారులు ఓ సారి వెళ్లి చూడాలి.  ఆ సీటింగ్ ఆరెంజిమెంటు,  సౌండ్ సిస్టం దేనికదే ప్రత్యేకం.  వాళ్ళను పొగడడం, మన వాళ్ళను కించబరచడం అని  కాదు.  మనకు కూడా ఇక్కడ అటువంటి చక్కటి  అనుభూతి కలగాలని మాత్రమె.

అకాడమీ  టీటీకె ఆడిటోరియంలో అడుగు పెట్టగానే ‘హాల్ అఫ్ ఫేం’ లో అకాడమీ  వార్షిక ఉత్సవాలకు అద్యక్షత  వహించిన విద్వాంసుల ఫోటోలు.  అలా అద్యక్షత వహించినవారికే ఆ ఏడాది ‘సంగీత కళానిధి’ బిరుదు  ఇస్తారు. నిజమయిన సంగీత కళాకారులకు దీన్ని మించిన సత్కారం వుండదు. కళానిధి బిరుదును మించిన పురస్కారం వుండదు. పద్మ విభూషణ, పద్మ భూషణ, పద్మశ్రీ  పురస్కారాలు కూడా  సంగీత కళానిధికి సాటిరావని భావించే సంగీత విద్వాంసులు వున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ 85  ఏళ్లలో సంగీత కళానిధిపొందిన తెలుగు వారు చాలా తక్కువ.  ద్వారం వెంకట స్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , (ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు  మృణాలిని  మాతామహులు),  మంగళంపల్లి బాల మురళి కృష్ణశ్రీపాద పినాక పాణి, నేదునూరి కృష్ణ మూర్తి, షేక్ చిన్న మౌలా మాత్రమే  ఈ అరుదయిన సంగీత  పురస్కారం పొందిన కొద్దిమంది తెలుగువారిలో వున్నారు. సంగీత చక్రవర్తులుగా పేరొందిన ఎందరో  మహామహుల సరసన   వీళ్ళ ఫోటోలు చూస్తూ వుంటే తెలుగువాళ్లకు  వొళ్ళు పులకరించడం ఖాయం.

ఈ స్తాయి కలిగిన మరికొందరు సంగీత కళాకారులు తెలుగునాట లేకపోలేదు. కారణం తెలియదు కాని వారికి ఈ మహత్తర గౌరవం దక్కలేదు. పారుపల్లి,  పిచ్చి హరి,  ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబు ఈ గౌరవం అందుకోకుండానే అందరాని తీరాలకు తరలిపోయారు. ఇక సంగీత  కురువృద్ధుడు  నూకల చిన్న సత్యనారాయణ ఇప్పటికీ అంత వయస్సులో కూడా కచ్చేరీలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే వున్నారు. మల్లాది బ్రదర్స్, హైదరాబాదు సిస్టర్స్, మాండొలిన్ శ్రీనివాస్ ఎప్పుడో ఒకనాడు చెన్నై  మ్యూజిక్ అకాడమీలో తెలుగు బావుటా ఎగురవెయ్యకపోరు. అదే సంగీతాభిమానుల ప్రగాఢ అభిలాష.

చెన్నై సంగీతోత్సవం వివరాలు మరోసారి. (05-01-2012)

31, డిసెంబర్ 2011, శనివారం

HAPPY NEW YEAR – 2012 - నూతన సంవత్సర శుభాకాంక్షలు


HAPPY NEW YEAR – 2012 - నూతన సంవత్సర శుభాకాంక్షలు- 2012



చలచల్లగా  తీయతీయగా 



                                       


వొత్తిలా వెలగండి
కత్తిలా మెరవండి
కొత్త ఏడాదిలో
ఎత్తుగా ఎదగండి                           
                                                             అత్తరువు గంధమై
                                                             చిత్తరువు చందమై
                                                             కొత్త ఏడాది
                                                             మిము హత్తుకోవాలి!
                 
      నిర్మలాదేవి, భండారు శ్రీనివాసరావు, హైదరాబాదు  
             NIRMALADEVI,   BHANDARU   SRINIVASA  RAO

30, డిసెంబర్ 2011, శుక్రవారం

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు



ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

తమ శ్వాస,ధ్యాస కళామతల్లి మాత్రమేనని,  తుది శ్వాస వొదిలేవరకు  వరకు నటిస్తూనే వుంటామని  చెప్పుకునే వారు చాలామంది కనిపిస్తారు. కాని అలాటి అరుదయిన కోవలో చేర్చాల్సిన మహా నటులు కూడా తెలుగు నాటకరంగంలో  వున్నారు.
వల్లూరు వెంకట్రామయ్య చౌదరి బాలనాగమ్మ నాటకం ఆయన పోయే వరకు బాగా నడిచింది.  మాయల ఫకీరుగా ఆయన నటన గొప్పగా వుండేది అనే వారు. ఓ నాటకంలో నటిస్తూనే   స్టేజీ  మీదే చనిపోయారు. అలాగే రామాంజనేయ యుద్ధంలో ఆంజనేయుడి పాత్ర ధరించే   బేతా వెంకటరావు గారు కూడా వేషం మీదే చనిపోయారు. మహానుభావులు. కళామతల్లి సేవచేస్తూనే కన్నుమూశారు. వెంకటరావు గారి అబ్బాయి  బేతా రామచంద్రరావు తండ్రి కళను పుణికిపుచ్చుకున్నాడు. అతడు కూడా ఆంజనేయుడి వేషం వేసేవాడు.
నెల్లూరుకు  చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు.  హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు. మందపాటి రామలింగేశ్వర రావు  విశ్వామిత్రుడుగా  వేసేవారు. గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. సావిత్రి ప్రస్తావన వచ్చింది కాబట్టి కొందరు మహిళా నటీమణులను సంస్మరించుకుని ఈ వ్యాసపరంపరకు భరతవాక్యం పలుకుదాం.   

ద్రౌపదిగా పూర్ణిమ వేసేవారు ఎక్కువగా. కొంచెము లావుగా వున్నా ఆవిడ నటన, పద్యం పాడే విధానం నచ్చిన ప్రేక్షకులు అవేవీ   పట్టించుకోకుండా అభిమానించేవారు. పువ్వుల అనసూయపీసపాటి సత్య వతి కూడా ద్రౌపది వేసే వారు.

(తెలుగు నాటక రంగానికి సేవ చేసిన మహామహులను గుర్తున్నంతవరకు మాత్రమే కాకుండా గుర్తు తెచ్చుకుని


 కూడా మరోమారు  సంస్మరించుకోవడానికి  చేసిన చిరు ప్రయత్నం ఇది. ఈ క్రమంలో ఎవరినయినా పొరబాటున

 మర్చిపోతే ఆ తప్పిదాన్ని మన్నించాలని మనవి. – ఆర్వీవీ కృష్ణారావు,భండారు శ్రీనివాసరావు) 

29, డిసెంబర్ 2011, గురువారం

మరపురాని మరికొందరు మహానటులు


మరపురాని మరికొందరు మహానటులు 
-ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

నాటకాలు ఆడేవారిలో సూరిబాబు,రాజేశ్వరి నిజజీవితంలో భార్యాభర్తలు. సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం  అనేవారు. చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా.  స్టేజి మీద  ఆయన ధర్మరాజు వేసేవారు. 

పాచికలు ఆడే సీనులో  తమ్ములనుద్రౌపదిని వొక్కొక్కరినీ పణంగా  పెట్టి వోడిపోతున్న ఘట్టంలో  పద్యాలు గొప్పగా ఉండేవి.  రాజేశ్వరితో కలసి తారాశశాంకం’ ఆడేవారు.
బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా  రైలు పట్టాలకు ఆవతలి వయిపు  ‘రాజేశ్వరి మేడ వుండేది. కందుకూరి చిరంజీవి రావు మరో ధర్మరాజు.  రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు.

సి.డి. కృష్ణమూర్తి అనే ఆయన కూడా ధర్మరాజుకృష్ణుడు వేషాలు  వేస్తూ వుండేవారు. జైహింద్ టాకీసు లక్ష్మీ టాకీసుల మధ్య సోమిదేవమ్మ గారింట్లో వెనుక పోర్షన్ లో అద్దెకు వుండేవారు.  పుట్టుకతో అరవ వాడు అయినా తెలుగులో సుస్వరంతో రాగయుక్తంగా పద్యాలు పాడేవారు. కిరీటం వెనుక గుండ్రటి వెలుగు ప్రసరిసున్నట్టుగా కృష్ణుడి వేషంలో ట్రిక్ ఫోతోగ్రఫీతో తీయించుకున్న అనేక  ఫోటోలు సీడీ కృష్ణమూర్తి గారింట్లో గోడలమీద దర్శనమిచ్చేవి.

దుర్యోధనుడుగా ధూళిపాళ సీతారామ శాస్త్రి గారి పేరు  అందరికీ  తెలిసిందే. నాటకాల్లో ప్రారంభించి సినిమాలకు వెళ్లి అడపా తడపా మళ్ళీ నాటకాలు వేస్తూ వుండేవారు. చివరగా అవసాన దశలో  గుంటూరులో వో పెద్ద ఆంజనేయ స్వామి గుడి కట్టించి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ రాముల వారిలో ఐక్యం  పొందారు.
ఎన్. వి. ఎల్. నరసింహాచార్యులు, తుర్లపాటి రాధాకృష్ణమూర్తి , వెంట్రప్రగడ నారాయణరావుదుర్యోధన వేషాలకు ఖ్యాతి గడించారు. కురుక్షేత్రంలో భీముడిదో మంచి పాత్ర.  వేమవరపు శ్రీధరరావు గారు భీముడి పాత్రకి  మరోపేరుగా  నిలిచారు. ఈయనకూడా రేడియో స్టేషన్ లో స్టాఫ్ ఆర్టిస్ట్  గా వుండేవారు. టి. శేషా రావువిన్నకోట సాంబయ్య  భీముడిగా గుర్తుండిపోయే పేర్లు. అబ్బూరి ఆదినారాయణ శర్మ,  అబ్బూరి వర ప్రసాద రావు తమ్ముడు. ఈయన కర్ణుడిగా వేసేవారు.  అలాగే అబ్బూరి వెంకటప్పయ్య. హెచ్. ఎం. వి. వారి గ్రామఫోను   రికార్డుల్లో  అబ్బూరితో కలసి పాడారు.

వల్లూరు వెంకట్రామయ్య చౌదరి బాలనాగమ్మ నాటకం ఆయన పోయే వరకు బాగా నడిచింది.  మాయల ఫకీరుగా ఆయన నటన గొప్పగా వుండేది అనే వారు. ఓ నాటకంలో నటిస్తూనే   స్టేజీ  మీదే చనిపోయారు. అలాగే రామాంజనేయ యుద్ధం’ లో ఆంజనేయుడి పాత్ర ధరించే   బేతా వెంకటరావు గారు కూడా వేషం మీదే చనిపోయారు. మహానుభావులు. కళామతల్లి సేవచేస్తూనే కన్నుమూశారు. వెంకటరావు గారి అబ్బాయి  బేతా రామచంద్రరావు తండ్రి కళను పుణికిపుచ్చుకున్నాడు. అతడు కూడా ఆంజనేయుడి వేషం వేసేవాడు.
కుందేరు కృష్ణ శర్మ అని విజయవాడలో కనక దుర్గ కళాసమితి గుమస్తాగా వుండే వారు. చాలా నాటకాల్లో వేసేవారు.  కృష్ణుడు దగ్గర్నుంచి సహదేవుడి దాకా.  ప్రతి నాటకంలోను ఆయన తప్పని సరిగా కనపడే వారు. ఎంతో సహృదయులు. చాలా మంది నటులు అవసాన దశలో కష్టాలు పడుతుంటే చూడలేక  వాళ్ళకోసం వో నాటకం పెట్టి ఇంటింటికీ  వెళ్లి టికెట్లు అమ్మి డబ్బు పోగు చేసి ఇచ్చేవారు. కర్రి అబ్బులు, ద్వారపూడి సూర్యారావు, కే. హరి ప్రసాద రావు, అయ్యదేవర పురుషోత్తమరావు కూడా కృష్ణుడి  వేషం వేసి  పేరు తెచ్చుకున్నవారే.  
హరిశ్చంద్ర పాత్రకు డి. వి. సుబ్బారావు గారని బందరు  వాస్తవ్యులు వుండే వారు.  వింధ్యారాణి ఫేంఅని చెప్పుకొనేవారు.  మల్లాది సూర్యనారాయణ గారు కూడా హరిశ్చంద్ర  వేసే వారు.  తర్వాత వేటపాలెం నుంచి  మరో డి. వి. సుబ్బారావు వచ్చారు.  హరిశ్చంద్ర వొకటి  ఆడేవారు. ఐదో  తరగతి కూడా చదివి వుండరు కానీ  ఆయన వేసిన   టికెట్ డ్రామా అంటే చాలు డబ్బులు బాగా  వచ్చేవి. నెల్లూరుకు  చెందిన పొన్నాల రామసుబ్బారెడ్డి మరో ప్రసిద్ధి చెందిన నటుడు.  హరిశ్చంద్ర పాత్రకు పెట్టింది పేరు.  గూడూరి సావిత్రి అనే ఆవిడ ఈయన టీంలో చంద్రమతి గా పేరు పొందారు. మందపాటి రామలింగేశ్వర రావు  విశ్వామిత్రుడుగా  వేసేవారు.  

(29-12-2011)

27, డిసెంబర్ 2011, మంగళవారం

చిక్కుల్లో ‘చింతామణి'

చిక్కుల్లో  ‘చింతామణి' - ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు
  

  
కాళ్ళకూరు  నారాయణ రావు గారు రెండు నాటకాలు రాసారు వొకటి ‘చింతామణి’  రెండోది ‘వర విక్రయం’. ఇవి రాసి    ఎనభయి ఏళ్ళు అయిందేమో.  ఇంకా వందేళ్ళు పూర్తి కాలేదు.  ఆ రోజుల్లో జటిలంగా వుండే రెండు సామాజిక సమస్యలను తీసుకుని ప్రజల్లో చైతన్యం రగిలించేందుకు  వీటిని రాసారు.  గురజాడ అప్పారావుగారి కాలంలో ‘కన్యాశుల్కం’ వుంటే కాళ్ళకూరి వారి సమయంలో వరకట్నం సమస్య బాగా ప్రబలివుంది.  ‘వర విక్రయం’ ఎందుకో కాని, స్టేజి మీద పాపులర్ కాలేదు. బెజవాడ  రేడియోలో నండూరి సుబ్బారావు,  శ్రీరంగం గోపాలరత్నం, చిరంజీవిరావు వాళ్ళు వేసారు.  చాలా సార్లు  ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు వర విక్రయం నాటకం ప్రసారం చేశారు.  సింగరాజు లింగరాజు మరిచిపోలేని లోభి క్యారెక్టర్ వేసేవారు. రెండో నాటకం ‘చింతామణి’ బాగా పాపులర్ అయింది.  కురుక్షేత్రం’, ‘రామాంజనేయ యుద్ధం’ వంటి నాటకాలు పోయినా అడపా తడపా ఇంకా  ఆడుతున్న నాటకం ‘చింతామణి’.





కథా వస్తువు చిన్నదే.  చింతామణి  ఓ  సంస్కారమున్న వేశ్య.   చదువు కొన్నది. విద్యా వంతులంటే వల్లమాలిన అభిమానం. ఆ ఊళ్లోనే భవానీ శంకరుడనే జల్సా రాయుడు వుంటాడు. అతను తనకున్నదంతా చింతామణికి సమర్పించుకొని జులాయిగా తిరుగుతూ ఉంటాడు.  చింతామణి అమ్మ శ్రీహరి.  వాళ్ళ ఇంటికి వచ్చే విటులందరికి శ్రీహరి అంటే భయం. ఏ రోజు ఎకౌంటు ఆ రోజే తేల్చి వేస్తుంది. మర్నాడు మళ్ళీ డబ్బు దశకం తెస్తేనే ఇంట్లోకి  అడుగు పెట్టనిచ్చేది.  కొన్నాళ్ళకు భవాని శంకరుడి దగ్గర మొత్తం సొమ్ము  అయిపోవడంతో వెళ్ళగొడుతుంది.  ఇతనికో మిత్రుడు వున్నాడు బిల్వమంగళుడు. అందమైన వాడు. విద్యా వంతుడు. ఆస్తి పరుడు. అన్నిటికి మించి మంచి ప్రవర్తన వున్నవాడు. భవానీ  శంకరుడు ఓ సారి చింతామణి దగ్గర బిల్వమంగళుడి ప్రసక్తి తీసుకు రావడం, అతన్ని ఎలాగయినా ఓ మాటు  ఇంటికి తీసుకురమ్మని ఆమె కోరడం, చింతామణి ప్రాపకం కోసం భవానీ శంకరుడు ఒక రోజు  బిల్వ మంగళుడిని చింతామణి ఇంటికి తీసుకురావడం, క్రమేపీ  వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడడం, చివరికి చింతామణి పశ్చాత్తాప పడడం ఇలా  నాటకం నడుస్తుంది. పెద్ద పాత్రలు ఏమీ లేవు  కూడా.  చింతామణి, బిల్వమంగళుడు, భవానీ శంకరుడు, చింతామణి తల్లి శ్రీహరి, చెల్లెలు చిత్ర, బిల్వమంగళుడి భార్య రాధ, అతడి  స్నేహితుడు దామోదరుడు. ఇంతవరకు బానే వుంది సుబ్బిశెట్టి అనే మరో పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది. అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. చింతామణి మీద మోజుతో వున్నదంతా పోగొట్టుకున్న  సుబ్బిశెట్టి చివర్లో  తిరగేసిన జల్లెడలో పెసర పునుకులు, మసాలా వడలు పెట్టుకుని బజార్లవెంట తిరుగుతూ అమ్ముకునే దుస్తితికి  దిగజారిపోతాడు. భవాని శంకరుడు బ్రాహ్మణుడు కాబట్టి నీళ్ళకావిళ్ళు మోస్తూ ‘తాతలనాటి క్షేత్రములు తెగనమ్మి దోసిళ్ళతో తెచ్చి ధారపోసినాను, అత్తవారిచ్చిన అంటు  మామిడితోట నీవు కోరగనే  రాసి ఇచ్చినాను’ అంటూ గతాన్ని తలచుకుంటూ పద్యాలు పాడుకుంటూ వుంటాడు. ఇంతవరకు బానే వుంది సుబ్బిశెట్టి అనే పాత్ర ఈ నాటకానికి జీవం పోసింది. అదే ఇప్పుడు చింతామణి నాటకాన్ని వివాదాస్పదం చేస్తోంది. కాళ్ళకూరి వారు రాసిన ఉద్దేశ్యం మంచిదే అయివుండవచ్చు కానీ, కాలక్రమంలో జనాలను ఆకట్టుకోవడం కోసం సుబ్బిశెట్టి, చిత్ర, శ్రీహరి పాత్రల నడుమ మోటు సరసం,  ముతక హాస్యం ప్రవేశపెడుతూ వచ్చారు.ఓ దశలో అది సభ్యత హద్దులు దాటిపోయి కుటుంబపరంగా చూడడం సాధ్యం కాకుండా పోయింది. కాళిదాసు కోటేశ్వరరావు అనే ఆయన సుబ్బిశెట్టి వేషం వేసేవారు.  సూరవరపు వెంకటేశ్వర్లు శ్రీహరి వేషం కట్టేవారు. నాటకాల తొలి రోజుల్లో ఆడ పాత్రలు  నటీమణులు దొరక్క  మొగవాళ్ళే ఆడవేషాలు వేయాల్సివచ్చేది.  సూరవరపువారు  హరిశ్చంద్ర’ లో కాలకౌసికుడి  భార్య కలహకంటిగా, ‘సక్కుబాయి’లో అత్తగా పెద్ద పేరు సంపాదించుకొన్నారు. కాళిదాసు, సూరవరపు కాంబినేషన్ ఎప్పుడు హద్దులు దాటలేదు. శ్రీ రామనవమికి బెజవాడ బీసెంటు రోడ్డులో ఏటా ‘చింతామణి’ నాటకం వేసేవారు. ఆ రోడ్డులో నిజానికి ఎక్కువమంది వ్యాపారుల దుకాణాలు ఆర్య వైశ్యులవే. అరవపల్లి సుబ్బారావు అనే ఆయన సుబ్బిశెట్టి వేషం వేసేవారు. కాకపొతే, కారణాలు ఏమయినా  ఈ నాటకంలో పోను పోను అశ్లీల సంభాషణలు, సినిమా డైలాగులు, పాటలు పెట్టి నాటకం స్తాయిని దిగజార్చారు.  ఇప్పుడు ఆర్య వైశ్య మహా సభ అభ్యంతరం చెప్పిందంటే నిజమే మరి. నాటకాన్ని నిషేధించాలా లేక  ఇటువంటి ద్వందార్ధ సంభాషణలు లేకుండా చూస్తామని ఆపేస్తామని నాటక సమాజాలు, నటులు హామీ ఇస్తారా చూడాలి. అంత వరకు కాళ్ళకూరి వారికి క్షమాపణలు చెప్పి ‘చింతామణి’కి కొన్నాళ్ళు రెస్ట్ ఇవ్వడం మంచిదేమో! (28-12-2011)

26, డిసెంబర్ 2011, సోమవారం

అలనాటి నటుల్లో మరో ఘనాపాటి – శ్రీ పులిపాటి


అలనాటి నటుల్లో మరో ఘనాపాటి – శ్రీ పులిపాటి 
-ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 

పులిపాటి వెంకటేశ్వర్లు అర్జున పాత్ర కోసమే పుట్టాడా! అనిపించేలా అద్భుతంగా నటించే వాడు. 'హరిశ్చంద్ర' లో నక్షత్రకుడు, 'చింతామణి'లో భవాని  శంకరుడు వేసే వారు.  ఓసారి బెజవాడ  రామ్మోహన్ గ్రంధాలయం హాల్లో పీసపాటి కృష్ణుడుగా, పులిపాటి అర్జునుడుగా ‘గయోపాఖ్యానం’ వేసారు.కృష్ణార్జున సంవాదంలో భాగంగా వొకరి నొకరు దెప్పి పొడుచుకొనే పద్యాలు పోటాపోటీగా ఆలపించి అందర్నీ అలరింపచేశారు.


శ్రీ పులిపాటి 

బీవీ రంగారావు బెజవాడ మునిసిపాలిటీలో  పని చేస్తూ  నాటకాలు వేసేవారు. అర్జున వేషంతో పాటు ‘రాయబారం సీను’లో  అశ్వథామ వేసేవారు.  అదిగో ద్వారక’  పద్యం ఈయన పాడితేనే వినాలి సుమా  అన్నట్టుగా పాడేవారు. 'హరిశ్చంద్ర' కూడా వేసేవారు.బెజవాడ  జింఖాన గ్రౌండ్స్ లో చేనేత సప్తాహాలు జరిగేవి. చేనేత వస్త్రాలు ప్రదర్శించేవారు.  జనం రావడం కోసం రోజుకో నాటకం వేయించే వారు.  సారి రంగారావు 'హరిశ్చంద్ర' పెట్టారు. ప్రేక్షకులకు వెసులుబాటు ఏమిటంటే నాటకం ఆరుగంటలకే మొదలెట్టే వారు.  రంగారావుతో పాటు పులిపాటి కూడా వున్నారు.  కాటి సీనులో  'మాయా మేయ జగంబు, ఇచ్చోటనే కదా, చతురంభోది పయోధి’ పద్యాలు ఎంతో హృద్యంగా పాడారు. దాదాపు  నాలుగైదు వేలమంది అలా నిశ్శబ్దం గా కూర్చొని నాటకం చూసారు.
ఏలూరు దగ్గర  కలపర్రు వెంకటేశ్వర్లు - పద్యాలు వినీ వినీ  నటుడుగా మారిన  కోవలోకి  వస్తారు. అర్జునుడు వేసేవారు. 'కురుక్షేత్రం' ఆఖరి సీనులో  అభిమన్యుడు చనిపోయినట్లు తెలిసిన తర్వాత అర్జునుడు పాడే పద్యాలు, కృష్ణుడి   ఊరడింపుల మధ్య  పగ తీర్చుకొంటానని చేసిన ప్రతిజ్ఞలు బాగా పాడేవారు.
అలాగే కొచ్చెర్లకోట సత్యనారాయణ అని చాలా ముందు తరం నటుడు.  అర్జునుడు, కృష్ణుడు, రాముడు వేసేవారు. షణ్ముఖితో కలసి  ద్వారక సీను   రికార్డు ఇచ్చారు.


శ్రీ అద్దంకి శ్రీరామమూర్తి

సంగీత విద్వాన్ అద్దంకి శ్రీరామ మూర్తి గారు ధర్మరాజు వేషానికి ప్రసిద్ధులు.  'కురుక్షేత్రం'తో పాటు 'పాదుకా పట్టాభిషేకం' కూడా ఈయనకి పేరు తెచ్చి పెట్టింది.  తొలి తరం సినిమాల్లో కూడా వేశారు. మంగళంపల్లి బాల మురళీకృష్ణకి ముందు పారుపల్లి రామకృష్ణయ్య గారి దగ్గర సంగీతం నేర్చుకొన్నారు.  గాంధీ నగరం సెంటర్ లో ‘యెర్నేని మాన్షన్’  పక్క బిల్డింగ్ వీరిదే.  గేటు దగ్గర ‘సంగీత విద్వాన్ అద్దంకి శ్రీ రామమూర్తి’ అనే బోర్డు వుండేది. వేమూరి విమలాదేవికి అమ్మేసారు.
పి. సూరిబాబు, రాజేశ్వరి రంగస్థల నటులలో భార్యాభర్తలు. సూరిబాబు కంఠం అదోరకంగా వుంటుంది. కంచు కంఠం  అనేవారు. చాలా సినిమాల్లో వేషాలు వేసారు. ఎక్కువగా నారదుడిగా.  స్టేజి మీద  ఆయన ధర్మరాజు వేసేవారు. పాచికలు ఆడే సీనులో  తమ్ములను, ద్రౌపదిని వొక్కొక్కరినీ పణంగా  పెట్టి వోడిపోతున్న ఘట్టంలో  పద్యాలు గొప్పగా ఉండేవి.  రాజేశ్వరితో కలసి ‘తారాశశాంకం’ ఆడేవారు.బెజవాడలో శరభయ్య గుళ్ళకు ఎదురుగా  రైలు పట్టాలకు ఆవతలి వయిపు  రాజేశ్వరి మేడ’ వుండేది. కందుకూరి చిరంజీవి రావు మరో ధర్మరాజు.  రేడియోలో స్టాఫ్ ఆర్టిస్ట్ గా వుండేవారు. పద్యంతో పాటు నటనకు ప్రాధాన్యం ఇచ్చేవారు. (27-12-2011)