26, డిసెంబర్ 2011, సోమవారం

పాటా పద్యం కలబోస్తే ఈలపాట రఘురామయ్య


పాటా పద్యం కలబోస్తే ఈలపాట రఘురామయ్య
–ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

షణ్ముఖి ఆంజనేయ రాజు అని తణుకులో వుండేవారు.  జీళ్ళపాకం సంగీతం’ అని కొందరు విమర్శించినా ఆయన పద్యం వినడం కోసం వేలాదిమంది  తహతహలాడేవారు.  గరికిపాటి  నరసింహరావు గారు ఈ మధ్య ‘భక్తి ఛానల్’లో ‘భారతం’ ఫై ప్రసంగిస్తూ, షణ్ముఖికి గొప్పగా నివాళులర్పించారు. ‘ఆయన నాటకాలు చూడడానికి   తాడేపల్లి గూడెం నుంచి సైకిళ్ళు వేసుకొని భీమవరం వెళ్లడం బాగా గుర్తు. రాయబారం సీనులో  ఆంజనేయరాజు పాడే ఆ నాలుగు పద్యాల కోసం వెళ్లి  ఒన్స్ మోర్ లు కొడుతూ  మళ్ళీ మళ్ళీ పాడించుకొనేవాళ్లమ’ని ఆయన గుర్తు చేసుకున్నారు.



ఈల పాట రఘురామయ్య గారు సినిమాల్లో  కృష్ణుడుగా, నారదుదుగా పేరుతెచ్చుకున్న నటుడు. కురుక్షేత్రంలో మొదటి కృష్ణుడుగా వేసేవారు. 'బావా ఎప్పుడు వచ్చితీవు’  ఎక్కడ నుండి రాక’ అనే పద్యాలు చాలా బాగా పాడే వారు. పాండవుల సందేశం తీసుకొనే సీన్ లో ' అయినను పోయి రావలయు హస్తినకు' అన్న పద్యాన్ని పాపులర్  చేసింది రఘురామయ్య గారే. నాటకంలో  ఆయన పోర్షన్ అయిపోయిన తర్వాత స్టేజి మీదకు వచ్చి పది పదిహేను నిమిషాల సేపు  ఈల పాట వినిపించేవారు,  కుడిచేయి మధ్య వేలు నోట్లో  పెట్టుకొని.  ఇప్పుడు శివ ప్రసాద్ ఈల పాట కచ్చేరీలు చెయ్యడానికి ప్రేరణ బహుశః ఇదే కావచ్చు. వేమూరు గగ్గయ్య గారి కుమారుడు  రామయ్య కూడా చాలా రోజులు కృష్ణ వేషం వేసేవారు. రామయ్య మొదటి కృష్ణుడుగా, అబ్బూరి రెండో కృష్ణుడుగా, పృథ్వీ వెంకటేశ్వరరావు మూడో కృష్ణుడుగా చాలాకాలం ఆడేవారు. అబ్బూరి ‘ఆంధ్రా ఆర్టిస్ట్  అసోసియేషన్’ పేరిట సొంత సమాజం నడిపారు.  తర్వాత  కర్ణుడి పాత్ర మీద శ్రద్ధ చూపి కర్ణుడిగా  పేరు పొందారు.  కర్ణ సందేశం’ లో పీసపాటి కృష్ణుడు, రామయ్య కర్ణుడు వేషాలు వేసి చాలామందిని మెప్పించారు.
ఏ.వీ. సుబ్బారావు తెనాలికి చెందిన నటుడు. కుప్పా సూరి,  కుప్పా గాంధీ అని ఇద్దరు సోదరులు వుండే వారు. సూరిగారు హరిశ్చంద్ర వేసేవారుట.  సుబ్బారావు గారు తెనాలి నుంచి ప్రస్తానం ప్రారంభించి టాప్ నటుడుగా పేరు పొందారు.  సుబ్బారావు గారి చేత మొదట వేషం కట్టించింది నేనే’ అని గాంధి వో సారి చెప్పారు. ఈ గాంధీ తర్వాత నాటకాలు మానేసి బెజవాడ బావాజీ మఠంలో గుమస్తాగా చేరాడు. కెనాల్ రోడ్డులో ఈ మఠానికి చాలా ఆస్తులు ఉండేవి .  సత్యనారాయణ పురం దగ్గర బావాజీ పేట అనే పేట  వుండేది. అక్కడ వుండే ఇళ్ళ నుంచి రెండు మూడు రూపాయిలు అద్దెగా వసూలు చేసే వాడు. తర్వాత అక్కడ  ఇళ్లు కట్టుకున్న వాళ్లకు ఆ  స్థలాలు అమ్మేసారు. బావాజీ మఠం ఆస్తులన్నీ పోయాయి, గవర్నమెంట్ నిర్వాకం వల్ల. (26-12-2011)

25, డిసెంబర్ 2011, ఆదివారం

మరోసారి తెరలేచిన ‘నాటకం’



మరోసారి తెరలేచిన ‘నాటకం’ – ఆర్వీవీ కృష్ణారావు,భండారు శ్రీనివాసరావు

కురుక్షేత్రం లో  శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహ మూర్తి గారు.



శ్రీ పీసపాటి 


విజయనగరం దగ్గర రాముడు వలస అనే చిన్న వూళ్ళో వుండేవారు.  ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయ మైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన వరకే సంగీతం పద్యంలో చొప్పించి పాడే వారు. ఎంత గొప్పగా ఉండేదో.
ఆయన నాటకం చూడలేకపోతే జీవితంలో వో మంచి అవకాశం  పోగొట్టుకున్నట్టే.  రెండేళ్ళు అయిందేమో ఆయన పోయి.  తెలుగు వారంతా బ్రహ్మరథం పట్టడంతో పాటు నటుడిగా ఆయనకు రావల్సిన గౌరవాలన్నీ దక్కాయి వొక్క పద్మ అవార్డు మినహా.



శ్రీ పీసపాటికి సన్మానం 

ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ, కేంద్ర సంగీత నాటక అకాడెమి ఫెలో షిప్, తెలుగు విశ్వ విద్యాలయం విశిష్ట పురస్కారం, రాజా లక్ష్మి ఫౌండేషన్ అవార్డు వగైరా.  వోసారి  తిరుపతి వెంకట కవుల సమక్షంలో ‘ఉద్యోగ విజయాలు’ పోటీలు జరిగాయి.  అందులో కృష్ణ పాత్రధారి  పీసపాటి బంగారు కీరీటం బహుమతిగా పొందారు. 'మామా సత్యవతీ పౌత్రా!  ధాత్ర రాష్ట్రులకు పాండవులకు సంధి చేసి ఈ రాజలోకమ్మును కాపాడుమని యాచించుటకయి పాండవదూతగా నీ వద్దకు వచ్చితి’ అంటూ ఆయన రాయబారం సీన్ లో ప్రవేశించడం వో మధురాతి మధురమైన జ్ఞాపకం. పతితులు కారు నీయెడల భక్తులు శుంఠలు కారు విద్యలన్ చతురులు’ అని పాండవుల గొప్పతనం గురించి కౌరవుల సభలోచెప్పడం కూడా ఎంతో రమ్యంగా వుండేది.  ఒన్స్ మోర్’ లు పట్టించుకునే వారు కాదు. ఇక తప్పని సరి అయితే సంభాషణలు మార్చి కొత్తదనంతో అదే పద్యాన్ని కొద్దిగా మార్చి పాడేవారు.  ప్రేక్షకులంతా హర్ష ధ్వానాలు చేసేవారు.



తెలుగు సంస్కృతిని సుసంపన్నం చేసిన తెలుగు నాటకం 


పాతికేళ్ళ పాటు తెలుగు నాటక రంగాన్ని ఏలిన మరో వ్యక్తి అబ్బూరి వరప్రసాద రావు గారు. పద్యాన్ని రాగ యుక్తంగా పాడడం ఈయనతో ఒక మోడల్ గా మారిందని  చెప్పొచ్చు. ఆయన చనిపోయినప్పుడు ‘ఆంధ్ర జ్యోతి’  తెలుగు దిన పత్రిక సంపాదకీయం రాసిందంటే ఆయన ఎంత గొప్పవాడో  అర్థ మవుతుంది.  ఒకేరోజు  రోజు మూడు చోట్ల వేషాలు వేసేవాడు.బెజవాడలో  ద్వారక సీను,, మంగళగిరిలో రాయబారం, పెద కాకానిలో మూడో కృష్ణుడు ఇలా వుండేది ఆయన బిజీ షెడ్యూలు. ‘చెల్లియో చెల్లకో, అలుగుటయే యెరుంగని, జెండాఫై కపిరాజుసంతోషమ్మున  సంధి సేయవో’ అనే ఆయన పద్యాలు గ్రామ ఫోన్  రికార్డులు గా వచ్చాయి. పదిహేను రోజులకోసారి రేడియోలో మధ్యాహ్నం ‘కార్మికుల కార్యక్రమం’ లోనో, సాయంత్రం ‘గ్రామ సీమల కార్యక్రమం’ లోనో ఈ రికార్డు వేసేవారు. అప్పట్లో అందరి ఇళ్ళల్లో రేడియోలు వుండేవి కావు. వినాలనుకున్నవాళ్లు  రాఘవయ్య పార్కుకు వెళ్లి వినేవాళ్ళు. లేదా ‘మాతా కేఫ్  హోటల్’  రేడియోలోనో  వినేవాళ్లు.
యెంత పేరొచ్చినా, జనం నీరాజనాలు పట్టినా  నాటకాల్లో వేసేవారు ఎలా చెడిపోతారో అనడానికి  ‘అబ్బూరి వారి  జీవితం ఓ ఉదాహరణ’.  మద్యానికి బానిస కావడంవల్ల ఆరోగ్యం చెడింది. మదనపల్లి శానిటోరియంలో ‘టీబీ’కి  వైద్యం చేయించుకున్నా కొన్నాళ్ళకు అది మళ్ళీ తిరగ బెట్టింది.  ఎలా సంపాదించాడో అల్లాగే పోయింది ఆయన డబ్బంతా. (25-1202011)

24, డిసెంబర్ 2011, శనివారం

నాటకంలో మరో అంకం – ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు


నాటకంలో మరో అంకం – ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు 

నాటక చరిత్ర అంతా తెలుసుకోవడం అంత  సులభం ఏమీ కాదు. అలాగే తెలుగు రంగస్థల నటుల గురించి కూడా.  మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు ‘నట రత్నాలు’ అని ఆంధ్ర ప్రభ వీక్లీ లో ఓ  శీర్షిక నడిపే వారు.  ఆరోజుల్లో అవి చదివే వాళ్లము.

శ్రీ మిక్కిలినేని 



అప్పటికి ఇప్పటికి పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి ఆయన ఈ  రెండూ విడివిడిగా రాశారు,  పాండవోద్యోగం, పాండవ విజయం అని.  ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని  పద్యాలు జోడించి ‘కురుక్షేత్రం’గా ప్రచారంలోకి తీసుకు వచ్చారు.  ఎన్ని వేలసార్లో,  వేలేమిటి లక్షసార్లు  అని కూడా చెప్పొచ్చు  ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా  వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈనాటకం ఉపాధి కల్పించింది.  పేరు తెచ్చి పెట్టింది.
బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర’,  చిలకమర్తి వారి ‘గయోపాఖ్యనం’ కూడా ప్రసిద్ధి పొందినవే.



గయోపాఖ్యానం 


తర్వాత వచ్చినవి  కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘చింతామణి’,  తాండ్ర సుబ్రహ్మణ్యం గారి ‘రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి ‘బాల నాగమ్మ’.  మిగతావన్నీ  చెదురుమదురగా ఆడేవి,  ‘పాదుక పట్టాభిషేకం’ వంటివన్న మాట.
పౌరాణిక నాటకాలకు నిజానికి పెద్ద పెద్ద సెట్టింగులూ  అవీ వుండాలి.  కానీ,  పద్యం రాగం  ముఖ్యం కావడంతో హంగులను  ఎవరూ పట్టించుకొనేవారు కాదు. గుంటూరు అరండల్ పేటలో గుళ్ళపల్లి ఆదిశేషయ్య అని వొకాయన నాటకానికి కావాల్సిన డ్రెస్సులు, తెరలు సప్లయి  చేస్తూవుండేవాడు. అన్ని ప్రాంతాలకి, అన్ని నాటక సమాజాలకి ఈయనే దిక్కు. అలాగే బెజవాడ  గవర్నరుపేటలో జైహింద్ లాడ్జ్, జైహింద్ ప్రెస్ ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసేవారందరికి ఇదే స్థావరం. ఇక్కడ నుంచే నాటకాలు, నటులను  బుక్ చేసుకొనేవారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇక్కడే ప్రింట్ చేసేవారు. ‘జైహింద్’ సుబ్బయ్యగారు వీటన్నిటికి కంట్రాక్టర్.
స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా  మంచి  మైకు సెట్టు.  మైకు  బాగా లేకపోతే  జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు.  వెనక వైపు  ఓ  తెరా, ముందు మరో  తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను  కప్పీ మీద  లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన  ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో  ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి  కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే  ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి  పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది.  ఆయన కూర్చోడానికి  ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా   పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో  ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది.  ఆ మధ్యన ఓ  అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు.  సమాధానం ఏమి వచ్చిందో  గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే  తెలిస్తే చెప్పండి.  రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత,  ‘శ్రీకృష్ణ పరమాత్మకీ  జై!’ అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు.  ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని,  మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ  పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి  వెళ్లి  జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు  కనపడుతూనే వుండేది.  బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో  ‘రామకృష్ణ మైక్  సర్వీసు’ అని వుండేది.  ఆయన దగ్గర మంచి మైకులు  ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు.  బాగా  లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా.  కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.

బెజవాడలో  ఇప్పటి నవరంగ్ థియేటర్ని   1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు.  యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు.  దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే  గాంధీ  నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు.  అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం  పైన వున్నచిన్న  హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక  మర్నాడు ఆదివారం పడుకోవచ్చని  కాబోలు. (24-12-2011)

23, డిసెంబర్ 2011, శుక్రవారం

నాటకాలు ఆడొద్దురా........ ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు


నాటకాలు ఆడొద్దురా........ ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

చింతామణి  నాటకాన్నినిషేధించాలి లేకపోతే మేమంతా పెద్ద ఉద్యమం చేస్తాము. ఎంతకయినా తెగిస్తాము.అంటూ ఈ మధ్య జరిగిన ఆర్య వైశ్య మహాసభలో కొందరు వక్తలు సింహ గర్జన చేశారు. ఛానళ్ళు అన్నీ వివరంగా కవర్ చేశాయి. ప్రతిగా నాటక సమాజాలకు చెందిన మరికొందరు  ఆర్టిస్టులు ‘నాటకం నిషేధిస్తే ఉద్యమం చేస్తాం’ అంటూ ఎదురు దాడి ప్రారంభించారు. ఇప్పటికే ఆదరణ కరువై  కళాకారులు వీధిన పడ్డారు. ఇప్పుడీ ఆందోళనల పుణ్యమా అని నిజంగానే వీధికెక్కే పరిస్తితి.  కొద్దో గొప్పో ఉపాధి కల్పిస్తున్న నాటకాన్ని నిషేధిస్తే ఎలా’ అన్నది వారి బాధ. ‘చింతామణి నాటకంలో మా కులం వారిని హేళన చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఎలాగో ఓపికపట్టి  భరించాము. ఇక వూరుకోమ’న్నది ఆర్య వైశ్య ప్రతినిధుల ఆవేదన. ఉభయులదీ కరక్టే. ఇరుపక్షాల వాదంలో సహేతుకత లేకపోలేదు.

ఇదిలా వుంటే మరోపక్క హైదరాబాదు చిక్కడపల్లి త్యాగరాజ గానసభలో దాదాపు వారానికి ఒక రోజయినా ఏదో ఒక నాటకం వేస్తుంటారు. ఈవిధంగా  రంగ స్తల రంగానికి గానసభ చేస్తున్న సేవ మెచ్చుకోతగ్గదే. కాకపొతే నాటకానికి ముందు ఏదో ఒక సభ పెట్టి వక్తల ప్రసంగాలతో, ముఖ్య అతిధుల అభిభాషణలతో ప్రేక్షకుల ఓర్పును పరీక్షిస్తుంటారన్న అపప్రధ వుంది. ఓ పక్క  నాటకం ఎప్పుడు మొదలవుతుందా’ అని ప్రేక్షకుల ఎదురు చూపులు చూస్తుంటే, మరోపక్క  ఇవేమీ పట్టించుకోకుండా సుదీర్ఘంగా సాగే సభలో పాల్గొనే వక్తలు  ‘నాటకానికి పూర్వ వైభవం తేవాలంటూ’ అంటూ  దీర్ఘోపన్యాసాలు దంచుతుంటారు. వారు కోరుకునే  పూర్వవైభవం ఎప్పుడూ వస్తుందో తెలియని నాటకాభిమానులు అప్పటికే చాలా పొద్దుపోయిందనుకుని నిట్టూర్పులు విడుస్తూ బయటకు జారుకుంటూ వుంటారు. ఇక ఆడిటోరియంలో మిగిలేవారు పల్చబడుతుంటారు.


శ్రీ కె.వి.రమణాచారి 

‘ఈ నాటకాలు చాలు. వాటిని కట్టిపెట్టు’ అని చాలా సార్లు నిజజీవితంలో అనుకుంటూ వుండడం కద్దు. నిజంగా జరుగుతున్నది కూడా  అదే.  నాటకానికి పూర్వ వైభవం మాటలతో రాదు.  అలాగని చేతలు కూడా పని చెయ్యడం లేదు.  పదేళ్ళ క్రితం కే.వీ. రమణాచారి గారు ( (సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి, రెవెన్యూశాఖ ప్రిన్సిపల్  కార్యదర్శిగా మొన్నీమధ్యనే స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు) ‘రసరంజని’ సంస్త  ద్వారా ‘నాటకానికి ప్రాణం పొయ్యాలి’  అని నానా తంటాలు పడ్డారు. బోల్డంత ఖర్చు పెట్టారు. విసుగెత్తి మానేశారు.

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నాడు కాళిదాసు. తెలుగు వారికి పద్య నాటకాలు ఎంతో ఇష్టం.  ఎనభయ్యో  దశకంలో కూడా నాటకాలు బాగా చూసే వారు. ఉద్యోగ విజయాలు’ నాటకంలో ‘చెల్లియో చెల్లకో’, ‘జెండాపై కపిరాజు’ ‘అలుగుటయే యెరుంగని’  పద్యాలు కంఠతా   రానివారు, అవి  తెలియని వారు తెలుగునాట అరుదు. పొద్దున్నే  చద్దన్నం తిని,  గొడ్లను మేపు కోవడానికి వెళ్ళిన పాలేర్లు,  పశువులు మేస్తూ వుంటే చెట్టుకింద పడుకొని ఈ పద్యాలు పాడుకొంటూ, రాగాలు తీస్తూ  రోజంతా హుషారుగా గడిపేవారు. అలా గాలివాటంగా పద్యాలు  పాడేవారే తదనంతర కాలంలో రంగస్థల నటులుగా మారిన దృష్ట్యాంతాలు కూడా వున్నాయి.




పాత రోజుల్లో నాటకం పోష్టరు

‘పౌరాణిక నాటకాలు అంటే చెవి కోసుకొంటాము’ అనేవాళ్ళు ఇరవయి ఏళ్ళ క్రితం దాకా. ఇది పూర్తిగా నిజం. ఆ నాటకాల్లో  పాత్రధారి ఎలా వున్నా పద్యం  పాడడానికే ప్రాధాన్యం.  ఎంత రాగం తీస్తే అంతగా   తలలూపేవాళ్ళు. ‘ఒన్స్ మోర్’ అనే ఇంగ్లీష్ మాట నిరక్షరాస్యులకు కూడా  తెలుసు.  పద్యం పాడగానే ‘ఒన్స్ మోర్’ అని అరిచే వారు.  ఆ పద్యం మళ్ళీ పాడే వరకు నాటకాన్ని ముందుకు సాగనిచ్చేవారు కాదు. ఓ  సీన్లో పద్యం పాడిన  తర్వాత ఆ పాత్రధారి  పాత్రోచితంగా కింద పడిపోవాల్సిన సందర్భంలో కూడా ప్రేక్షకులు ఎవరయినా ‘ఒన్స్ మోర్’   అంటే చాలు అతగాడు మళ్ళీ లేచి నిలబడి పద్యం పాడి రాగం తీసి  మళ్ళీ పడిపోయేవాడు. ఔచిత్యమా కాదా అనేది అక్కడ అనవసరం.  అలా సాగేవి నాటకాలు. జనం విరగబడి చూసే వారు.  ఊళ్ళల్లో,  ఉత్సవాలు అవీ జరిగినప్పుడు ‘టికెట్ నాటకాలు’ ఆడేవారు. ‘ఫలానా హాలులోనో లేక ఫలానా వారి దొడ్లోనో’ అని కర పత్రాలు వేసే వారు. ఒకళ్ళవో ఇద్దరివో  నటుల ఫోటోలు కూడా ఉండేవిపాంఫ్లెట్ చివర్లో   రేట్లు ఉండేవి. రిజర్వుడు, కుర్చీ,  బెంచీ, నేల ఇలా విడివిడిగా టిక్కెట్లు వుండేవి.  మహా అయితే టికెట్ ఖరీదు  రూపాయి, అర్ధ, పావలా అలా వుండేది. ‘ప్యాట్రన్ టిక్కెట్లు కలవు’ అని రాసే వారు. ‘స్త్రీలకు ప్రత్యేక స్థలం. ఆలసించిన ఆశాభంగం, షరా మామూలే! త్వరపడండి. ముందుగా టిక్కెట్లు రిజర్వ్ చేసుకోండి! ఏ కారణం చేతనయినా ప్రదర్శన నిలిపివేసినయెడల టికెట్ డబ్బు వాపసు ఇవ్వబడదు’ ఇలా  ఏవేవో రాసేవారు. (23-12-2011)



22, డిసెంబర్ 2011, గురువారం

ఎన్టీఆర్ కి ఫైళ్ళు చూడడం అంటే ఇష్టం వుండేది కాదు


ఎన్టీఆర్ కి  ఫైళ్ళు చూడడం అంటే ఇష్టం వుండేది కాదు


(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను అనే పుస్తకం నుంచి)
 
స్పెషల్ టీ పట్రా !

“ఎన్టీఆర్ ఆఫీసు ఫైళ్ళు చూస్తున్నారంటే అదొక అష్టావధానమే. రాఘవేంద్రరావు టూకీగా విషయం చెప్పి ఫైల్ ఆయన చేతికి ఇచ్చేవారు. ఆయన సంతకం పెట్టేవారు. ఇంతలో నేనో, మరొకరో వచ్చేవారు. ఆయన ‘ఈ పూటకి ఫైల్స్ చాలండీ!’ అంటూ వంటవాడిని పిలిచి ‘స్పెషల్ గా టీ చేసి పట్రా!’  అని పురమాయించేవారు. అంతే! ఫైళ్ళు చూసే 
కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయేది. అసలు విషయం ఫైల్స్ చూడడం అంత ఇష్టం వుండేది కాదు....

“....బెజవాడలో టీడీపీ మహానాడు జరిగిన ప్రదేశంలోనే ‘కాపు నాడు’ నిర్వహించాలని కాపు సంఘం నేతలు నిర్ణయించారు. కాపునాడు జరిగే ప్రదేశానికి నేను ఒక సాధారణ పౌరుడిగా వెళ్లాను. జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. వంగవీటి రంగా జైల్లో వున్నందున రాలేదు. ఆయన భార్య రత్నకుమారి వచ్చారు. కాపునాడు విశేషాలను, నాయకులు చేసిన హెచ్చరికలను హైదరాబాదు రాగానే ముఖ్యమంత్రికి వివరించాను....

.
“.....ఆ రోజుల్లో బెజవాడలో కమ్యూనిష్టుల ప్రాబల్యం ఎక్కువగా వుండేది. విశాలాంధ్ర పేపర్ కూడా ఇక్కడే, కమ్యూనిష్టులు చెప్పిందే ఇక్కడ వేదం. కమ్యూనిష్టుల్ని ఎదుర్కోవాలంటే బలమయిన ఓ ప్రత్యామ్నాయం కావాలి. అలా ఆలోచించేవారు వన్ టౌన్ వ్యాపారులు.....

“.....వంగవీటి మోహన రంగా అన్న రాధాకృష్ణ 
టాక్సీ డ్రైవర్ల అసోసియేషన్ లో వుండేవాడు. విజయవాడ నుంచి నలుగురయిదుగురు పాసింజర్లను ఎక్కించుకుని టాక్సీలు హైదరాబాదు పోతుండేవి. చొరవగలవాడు కావడంవల్ల త్వరలోనే అతను టాక్సీ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు కాగలిగాడు. నెహ్రూ అన్న గాంధీ కూడా అప్పట్లో రాదా దగ్గర పనిచేసేవాడు. యూనియన్ వ్యవహారాలే తప్ప కులాల గొడవలు లేవు.......

“.......’ రాధ ఒకసారి రాష్ట్ర మంత్రి మండలి వెంకట కృష్ణారావును కలుసుకుని రాజకీయాల్లో ఎంట్రీ ఇప్పించమని  అడిగాడు. విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గట్టిగా వ్యతిరేకించారు. సంఘ వ్యతిరేక శక్తుల్ని రాజకీయాల్లోకి రప్పిస్తే వాటిని కూడా కలుషితం చేస్తారని స్తానిక నాయకులను కోపడ్డారు.....

“ విజయవాడలో నిరాహార దీక్షలో వున్న వంగవీటి రంగా హత్యానంతరం కోస్తాలోని  చాలా  జిల్లాల్లో దాడులు, ప్రతి దాడులు మొదలయ్యాయి. అనేక  పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది. బాధితులను ఓదార్చేందుకు ఎన్టీఆర్ విజయవాడ పయనమయ్యారు. రంగా భార్య రత్నకుమారిని కలిసి పరామర్శించడానికి వెళ్లారు.  ఇంటి ముందు కారు ఆగింది.  రంగా అభిమానులు అడ్డుకున్నారు. ఇక లాభం  లేదనుకున్న ఎన్టీఆర్ కిందకు దిగి రంగా ఇంటి వైపు చూస్తూ నమస్కరింఛి తిరిగి వచ్చేశారు.........

1989,  ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి నివాసంలో మంత్రి మండలి సమావేశం జరిగింది. బడ్జెట్ లీక్ అయిందని, దీనికి బాధ్యత వహిస్తూ మంత్రులందరూ రాజీనామా చేయాలని ఎన్టీఆర్ బాంబు లాంటి ప్రకటన చేశారు. రాజీనామాలు స్వీకరించడం గవర్నర్ ఆమోదించడం జరిగిపోయాయి. అదే రోజు డీజీపీ పీ.ఎస్. రామ్మోహన్ రావును ఆ స్తానం నుంచి మార్చారు. ఈ పరిస్తితి ఎదురు కాకూడదనే ఆయన ముందుగానే సెలవులో వెళ్ళిపోయారు.....

“అంతా కొత్తవారితో ఆ తరువాత కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వారెవరన్నది చివరి దాకా సస్పెన్స్. చివరికి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రెండవ స్తానంలో వున్న చంద్రబాబు నాయుడు దగ్గర కూడా విషయం దాచారు.
“.....ఎమ్మెల్యేలంతా విస్తు పోయారు. పార్టీ శ్రేణులన్నీ కలవరపడ్డాయి. (అయినా ఎన్టీఆర్ తొణకలేదు. ఎందుకంటె) ఆత్మ విశ్వాసానికి ప్రతీక ఎన్టీఆర్. తనపై రాళ్ళ వర్షం కురుస్తున్నా ఏరుకుని వాటితో దుర్గం నిర్మించుకోగల ధీశాలి ఆయన......
 (22-12-2011)

21, డిసెంబర్ 2011, బుధవారం

"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు"



"ఎన్టీఆర్ కి దేవుడన్నా, పూజలన్నా నమ్మకం లేదు" 


(మాజీ డీజీపీ హెచ్.జె.దొర రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం నుంచి మరి కొన్ని భాగాలు)


“......ఎన్టీఆర్ కు అసలు దేవుడన్నా, పూజలన్నా పెద్దగా నమ్మకం లేదు. ఆయన ఇంట్లో ఎప్పుడూ  ఏ వ్రతం కానీ, పూజలు కానీ జరగ్గా నేను చూడలేదు. ఒక్క వేంకటేశ్వరస్వామి ఫోటో మినహా మరే దేవుడి ఫోటో ఆయన ఇంట్లో కనిపించేది కాదు. తిరుమలకు తప్ప రాష్ట్రం లోని మరే ఇతర దేవాలయానికి ఆయన వెళ్లగా చూడలేదు......

“.......పూజలు పునస్కారాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినా, ఎన్టీఆర్ జ్యోతిష్యాన్ని, వాస్తుని మాత్రం బాగా నమ్మేవారు. ఎవరయినా జ్యోతిష్కుడు వచ్చి పలానా రాయి వున్న వుంగరం పెట్టుకొమ్మని చెబితే దాన్ని తు చ తప్పకుండా పాటించేవారు. అలా ఆయన చేతి వేళ్లకి ఏడెనిమిది ఉంగరాలు వచ్చి చేరాయి.......

“..... సినిమా షూటింగులకి బయట వూళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద హోటళ్ళలో బస చేసేవారు కాదు. హైదరాబాదు వస్తే , సారధీ స్టూడియోలో ఓ మూల చిన్న గదిలో సర్దుకునేవారు. చిన్నపాటి పరుపు, ఓ దిండు ఇస్తే చాలు, కింద వేసుకుని పడుకునేవారు.....

“.....ఎన్టీఆర్ కి బాగా దగ్గరగా మసలిన వ్యక్తి బీవీ మోహనరెడ్డి. ఒకసారి దైవ దర్శనం కోసం ఎన్టీఆర్- బీవీ తో కలసి తిరుపతి వెళ్లి వస్తున్నారు. వీళ్ళ కారు వెనకనే వస్తున్న వీఐపీ కారు ఒకటి సైరన్ చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయిందట. ఆ వీఐపీ కారుకు  అటూ ఇటూ మరికొన్ని కార్లు. ఈ హంగామాను ఎన్టీఆర్ ఆసక్తిగా గమనిస్తున్నప్పుడు, బీవీ కలగచేసుకుని ‘మీ కారు కూడా ఎనభైలో ఇలాగే సైరన్, పైలట్ హంగామాలతో ముందుకు దూసుకుపోతుంది. ఇది తధ్యం అని జోస్యం చెప్పారట........

“......రామారావుది మొదటి నుంచి ఒకటే ఫిలాసఫీ. ఏదయినా వ్యాపారం అంటూ చేస్తే సొంత డబ్బు పెట్టాలి. ప్రభుత్వ రాయితీలు, ఉచిత స్తలాలు ఎందుకనే వారు. అక్కినేని నాగేశ్వరరావుకు స్టూడియో నిర్మాణానికి (ప్రభుత్వం) ఉచితంగా ఇచ్చిన స్తలంలో వేరే వ్యాపారాలు చేయడం ఎన్టీఆర్ కి నచ్చలేదు. ‘వారికి నోటీసులు పంపండి. ఏం పర్వాలేదు’ అని ఆదేశాలిచ్చారాయన......

“.......తన సినీ జీవితం తొలినాళ్ళలో ఆత్మాభిమానం మెండుగా వున్న ఈ నిండు మనిషి, ఒకసారి నడుచుకుంటూ షూటింగుకు వెళ్లడం చూసి ఆ సినిమా నిర్మాత ఆయనకు ఒక కొత్త కారు కొని ఇంటికి పంపారట. ఆ రోజుల్లో కొత్త కారు ఖరీదు పదిహేను వందల రూపాయలు. తరువాత తనకు డబ్బు సమకూరాక నందమూరి ఆ నిర్మాత ఇంటికి వెళ్లి కారు డబ్బులు తిరిగి ఇచ్చేశారట......

ఎమ్జీఆర్ (అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం జీ రామచంద్రన్ ) ఢిల్లీ వెళ్ళే సందర్భాలలో ఆయన విమానం హైదరాబాదులో నలభై అయిదు నిమిషాల పాటు ఆగేది. ఎన్టీఆర్  టిఫిన్ క్యారియర్ పట్టుకుని నేరుగా బేగం పేట ఎయిర్ పోర్ట్ కి తీసుకువెళ్ళేవారు. అక్కడ తన మద్రాసు మిత్రుడితో కాసేపు ఆప్యాయంగా కబుర్లు చెప్పేవారు. ఇలా చాలా సార్లు జరిగింది.......(21-12-2011)
         

పూతరేకుల దొరవారు



పూతరేకుల దొరవారు



శ్రీ హెచ్.జె.దొర 

దొర గారు ఎంత హుందాగా ఉంటారో ఆయన రాసిన  ‘ఎన్టీఆర్ తో నేను’ పుస్తకావిష్కరణ కూడా  అంత హుందాగా  ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది.  ఆదివారం (18-12-2011) కావడంతో  బుక్ ఎగ్జిబిషన్ కిటకిటలాడింది. అంత జనసందోహంలో కూడా ఆవిష్కరణ సభ చక్కగా  నిర్వహించారు.  వేదిక మీద గవర్నర్ నరసింహన్ తోపాటు  ప్రభుత్వ మాజీ  ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు,   సీనియర్ పాత్రికేయులు  పొత్తూరి వెంకటేశ్వర రావు, కే.రామచంద్రమూర్తి, మాజీ ఐజీ రావులపాటి సీతారామా రావు, ఎమెస్కో విజయ కుమార్ వుంటే  సభకు హాజరయిన వారిలో మాజీ  డీజీపీలు అరవింద రావు, ఆర్. ప్రభాకర రావు, మాజీ ఐపీఎస్ అధికారులు శివశంకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఇంకా అనేకమంది  పోలీసు అధికారులు, జర్నలిస్టులు వున్నారు. 
గవర్నర్ నరసింహన్ గారి ప్రసంగం ఆత్మీయంగా సాగుతూ భేషజాలు లేని  మనసులోని మాటలతో సభికులను ఆసాంతం ఆకట్టుకుంది. ఆ ఉపన్యాసం విన్న ఆర్వీవీ కృష్ణారావు గారు దాన్నిలా అక్షరాల్లో పరిచారు.
“అనంతపురంలో దొర గారు ఎస్పీ గా పనిచేస్తున్నప్పుడు  నరసింహన్ గారు  ట్రైనీ  ఏఎస్పీ గా జాయిన్ అయ్యారట.  దొరగారి శ్రీమతి కూడా తనను ఎంతో బాగా చూసుకొనేవారని చెప్పారు.   ఓ సారి ఆయన తీవ్రంగా అస్వస్తులు అయినప్పుడు పుట్టపర్తి నుంచి సత్య సాయిబాబా విభూతి తీసుకువచ్చి పెట్టారుట. ఈ మాటలు చెబుతూ గవర్నర్ నరసింహన్ గారు సభలో వున్న దొరగారి శ్రీమతికి వేదికపై నుంచే ప్రత్యేకంగా అభివాదం చేసారు.  వాళ్ళ ఆత్మీయత  ఎప్పటికీ మర్చిపోలేననన్నారు.  ఇంటికి వెళ్తే పూత రేకులు పెట్టేవారని గుర్తు చేసుకొన్నారు.  దొర గారు ఎప్పుడు ‘అముల్ బేబీ’ మాదిరిగా చిరునవ్వులు నవ్వుతూ వుంటార’ని అంటూ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. అయితే   అంత మాత్రాన  ఆయన దగ్గర చొరవ తీసుకోలేమమని అన్నారు.  పూత రేకులు పెట్టిన కొంత సేపటికే ‘నైట్ పెట్రోలింగుకు  ఎందుకు వెళ్ళలేద’ని  కేకలేసేవారని చెబుతూ,  డిపార్ట్ మెంట్ లో వున్న అప్పటి భయ భక్తులను సభికులకు ముఖ్యంగా సభలో వున్న  పోలీసు అధికారులకు జ్ఞాపకం చేసారు. రావులపాటి  సీతారామా రావు గారిని గురించి చెబుతూ ‘ఆయనతో పాటు పన్నెండు మంది ట్రెయినీ  డీఎస్పీలు అనంతపురం పోలీసు ట్రైనింగ్ కాలేజీలో వుండేవారని,  మద్రాస్  నుంచి తాను తెచ్చిన తినుబండారాలన్నీ వాళ్ళే   తీసేసుకునేవార’ని చురక వేసారు. తనకు తెలుగు రాకపోయినా పుస్తకం టైటిల్ ‘ఎన్టీఆర్ తో నేను’ అనే బదులు ‘ఎన్టీఆర్ నేనే’ అని పెడితే సరిపోయేదని చతురోక్తి విసిరారు.  గవర్నర్ స్థాయిలో వుండి కూడా  అనుబంధాలకు, ఆత్మీయతకు నిదర్శనంగా నిలిచారు నరసింహన్ గారు.
“పుస్తకావిష్కరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరికి ఆ పుస్తకం కావాలని అనిపించింది.    కొంత మందికి ఎమెస్కో విజయ్ కుమార్ గారు కాంప్లిమెంటరీగా ఇచ్చారు.  అందరికి ఇవ్వడం సాధ్యం కాదు కదా.  నాతో పాటే పుస్తక ప్రదర్శనకి వచ్చిన మా అల్లుడు వేణు గోపాల్ ‘అంకుల్!  మీరు పుస్తకం కొని దానిమీద దొర గారి ఆటో గ్రాఫ్ తీసుకోండి!’ అని సూచించాడు.  వెంటనే  బుక్ ఎగ్జిబిషన్ లో వున్న ఎమెస్కో స్టాల్ కి వెళితే ‘లేవు’ అని చెప్పారు.  అప్పటికే అందరూ వెళ్లిపోతున్నారు.  దొరగారితో ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ లు తీసుకుంటూ వుండడంతో ఆయన బిజీగా వున్నారు. ఈలోగా  ఎవరో చెప్పారు ‘నవోదయ స్టాల్ లో  ట్రై చెయ్యండి’ అని. అక్కడకి వెడితే  కొద్ది కాపీలే వున్నాయి.  రెండు కాపీలు కొని దొర గారి దగ్గకి వచ్చి సార్! మీ సంతకం  కావాలి” అంటే  వెంటనే గుర్తు పట్టి సంతకం చేసిచ్చారు. రెండో పుస్తకం మీద కూడా కావాలి సార్! ఇది  భండారు శ్రీనివాస రావుకి’  అంటే ‘శ్రీనివాసరావు ఎలా వున్నాడు?’ అని ఎంతో అభిమానంగా అడుగుతూ  ఆటోగ్రాఫ్  ఇచ్చారు.  నేను, శ్రీనివాసరావు ఇదివరలో రేడియోలో పనిచేసే రోజుల్లో దొరగారితో   చాలా సన్నిహితంగా వుండే వాళ్ళం.  నక్సలైట్  సమస్య ఉధృతంగా వున్న రోజుల్లో రేడియో ప్రభావం బాగా వుండేది.  ఢిల్లీ నుంచి వచ్చే స్పాట్ లైట్ వంటి ముఖ్యమయిన కార్యక్రమాల్లో సయితం ఈ సమస్యకు ఎక్కువ ప్రాధాన్యం వుండేది.  మా న్యూస్ విని మేము కలిసినప్పుడు,  ముఖ్యంగా  కొత్త సంవత్సరం ఆరంభంలో డీజీపీ సంప్రదాయంగా ఇచ్చే పార్టీల్లో మమ్మల్ని గుర్తుంచుకుని  అభినందించేవారు. ఇప్పుడు ఆయన జ్ఞాపకాలు పుస్తక రూపంలో  వచ్చిన సమయంలో నేను శ్రీనివాసరావు  కలిసి మా రేడియో రోజులను మరోమారు  నెమరు వేసుకోవడం కూడా ఓ  మధురానుభూతి.”
ఈ విధంగా దొరగారు రాసిన ‘ఎన్టీఆర్ తో నేను’ అనే పుస్తకం మా ఇంటికి చేరింది. వెంటనే దాన్ని ఆమూలాగ్రం చదవడం పూర్తిచేసాను. అందులో దొర గారు పేర్కొన్న కొన్ని ఆసక్తికరమయిన అంశాలను పేర్కొంటూ ‘బ్లాగు’ రాసి పోస్ట్ చేసాను. ఆ పుస్తకంలోని  మరికొన్ని అంశాలను బ్లాగులోకి ఎక్కించే పనిలో వున్నాను. (21-12-2011)