5, సెప్టెంబర్ 2011, సోమవారం

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు

గురుద్దేవో నమో నమః ! - భండారు శ్రీనివాసరావు


‘సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః’


మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.

ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ పడనివాడే ఉత్తమ గురువు. ‘నేను పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా వుంటుంది. అలాగే ‘పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడు’ అని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.

గురు శిష్యుల గురించి చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న కధ (?) గుర్తుకువస్తోంది.

“ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.

“తమరు నాకు పనికి వచ్చే చదువు చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు”

ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.”

మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.

1921 వ సంవత్సరం. అంటే దాదాపు తొంభయ్ ఏళ్ళ పైమాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.”

పంతుళ్ళ చెవులకు శిష్యులు తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.

ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకునే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.

అక్షర బిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నాకు మా వూరిలో అక్షరాభ్యాసం చేసినదెవరో తెలియదు. తెలిసినదల్లా మాష్టారంటే అప్పయ్య పంతులు గారు. నిస్వార్ధంగా పిల్లలకు చదువు చెప్పిన పుణ్యమే ఆయన్ని ఈ రోజుకు కూడా ఆరోగ్యవంతుడిగా కాపాడుతోంది. ఆయన దగ్గర చదువుకున్న వాళ్లు కొంతమంది జీవితంలో పెద్దవాళ్ళయ్యారు. మరికొందరు వయస్సులో పెద్దవాళ్ళయ్యారు. కానీ ఆయన ఇప్పటికీ అప్పటిమాదిరిగానే సాధారణ జీవనం సాగిస్తున్నారు.

గురుపూజా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ మహానుభావుడికి మరోసారి మనః పూర్వకంగా -

“గురుద్దేవో నమః”

(05-09-2011)

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు -11 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు -11 - భండారు శ్రీనివాసరావు


‘కని పెంచుట’ లేదు!

డిష్యుం డిష్యుం



పక్కింటి పిల్లల రాక్షసి గోల 
విని గుండెల్లో బాంబులు పేల
అనుకుంది కొత్త కోడలు రమాబాల
ఇక కని పెంచుట ఏల ?



(మే, 29, 1975 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక)



కాయ 'గోరా'లు



కుయ్యో మొర్రో



ఇంట్లోనే కూరగాయలు పెంచండని శ్రీ గోరా
ఇచ్చిన పిలుపును విని మా శ్రీవారా
రోజంతా పట్టుకు పలుగూ పారా
పెరడంతా తవ్వేస్తే రాత్రికి వొళ్ళు పట్టేది నేనా వారా



(జూన్, 11, 1975 నాటి ఆంధ్రజ్యోతి దినపత్రిక)



కార్టూనిష్టు/ఇమేజ్ సొంతదారుకు ధన్యవాదాలు – రచయిత


4, సెప్టెంబర్ 2011, ఆదివారం

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 10 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్ర జ్యోతి వాక్టూన్లు - 10 - భండారు శ్రీనివాసరావు

ముద్రారాక్షసం




క్రిమినల్ లాయర్ శ్రీ కేజీ విమల్
తెల్లారి పేపర్లో మాజీ క్రిమినల్
ఎన్నివేస్తే మాత్రమేం సవరణల్
ఎంతమందికివ్వాలో ఆయన వివరణల్


(జూన్ - 4, 1975 - ఆంధ్ర జ్యోతి దినపత్రిక)


మైకేరియా







పేర్మోసిన మహావక్త రంగ రంగ భజరంగం
మైకు ముందు నిలవగానె పిల్లికూతలారంభం
పనిచేయని మైకు చూసి సభాసదుల సంరంభం
స్టేజి మీద భజరంగం – మొదలెట్టును వీరంగం

(జూన్, 10, 1975 - ఆంధ్ర జ్యోతి దినపత్రిక)





(కార్టూనిష్టులకు /ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)

3, సెప్టెంబర్ 2011, శనివారం

నండూరివారు ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

నండూరివారు ఇక లేరు – భండారు శ్రీనివాసరావు


కీర్తిశేషులు నండూరి రామమోహనరావు గారు


పందొమ్మిదివందల డెబ్భయ్ ఒకటి ఆగస్టులో నేను విజయవాడ ఆంధ్ర జ్యోతి దినపత్రికలో చేరిన కొత్తల్లోనే ఎడిటర్ నార్ల వేంకటేశ్వర రావు గారు తమ మకాంని హైదరాబాదుకు మార్చుకోవడంతో ఆయన బాధ్యతలు చాలావరకు నండూరి రామమోహన రావు గారిపై పడ్డాయి. జర్నలిజం లో నాకు అక్షరాభ్యాసం చేసిన తొలి గురువు ఆయనే. పేరులో వున్న ‘రామ’ శబ్దానికి తగినట్టుగా ఆయన గారి మాట మహా మృదువు. కోపం వచ్చిన సందర్భాలలో కూడా అది ఆయన కళ్ళలో కానీ, నోటిమాటల్లో కానీ ఎంతమాత్రం కానవచ్చేది కాదు. కఠినంగా చెప్పాల్సివచ్చినా మాటలో మృదుత్వం తొంగి చూసేది. ఈ విషయంలో నాకొక అనుభవం వుంది. ఆ రోజుల్లో సబ్ ఎడిటర్లం రాసిన వార్తలు అచ్చుకు పోయేముందు ఎస్ గ్యాలీ రూపంలో మళ్ళీ మా దగ్గరకే వచ్చేవి. చివరిసారిగా సరిచూసి తిరిగి కంపోజింగ్ సెక్షన్ కు పంపేవాళ్ళం. ఎస్ గ్యాలీ కాపీ ఒకటి నండూరి వారి టేబుల్ మీదకు కూడా వెళ్ళేది. ఒకసారి ఓ వార్తను అనువదిస్తూ ‘బాధ’ కు ‘భాద’ అని రాశాను. అది ఆయన దృష్టిలో పడింది. ఎస్ గ్యాలీ పట్టుకు వచ్చిన అటెండర్ నాగేశ్వరరావు - రామ్మోహన్ రావు గారు పిలుస్తున్నారని నాకు కబురు మోసుకొచ్చాడు. తీరా వెడితే, ఆయన నేను రాసిన ‘భాద’ అనే పదాన్ని చూపించి - ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత ‘భాద’ ఏమిటండీ!’ అని ‘వొత్తు’ ఎక్కడ పెట్టాలో నేను మనసు కష్టపెట్టుకోకుండా చెప్పారు. తప్పును ఎత్తి చూపడంలో కూడా నండూరి రామమోహనరావు గారి తరహానే వేరు. అందుకే ఈ ఉదంతం ఇన్నేళ్ళ తరవాత కూడా నా మనసు మడతల్లో భద్రంగా వుండిపోయింది.

అటువంటి ఆ మహా మనీషికి నా అశ్రు నివాళి!

(02-09-2011 – 10-30 PM)

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అర్ధం కాని విషయం


అర్ధం కాని విషయం

అజ్ఞాని : మాకు తెలియని ఎన్నెన్నో ఊసులు చెబుతున్నారు. చాలా సంతోషం. వింటున్నకొద్దీ వినాలని వుంది గురూ గారూ.
విజ్ఞాని: విషయాలేవీ తెలియవంటున్నావు. కొంపతీసి వైయస్సార్ మాట విని ఆ రెండు పేపర్లు చదవడంలేదా! అందుకే కాబోలు ఇలా అజ్ఞానిగా వుండిపోయావు.
అ: ఇంతకీ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర ముగిసిపోయిందంటారు.
వి: అవును శిష్యా. అతగాడికి భవిష్యత్తే కాదు వర్తమానం కూడా లేనట్లే.
అ: ఏం జరగబోతోందని మీ అంచనా?
వి: ఏముంది? అతడి చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇవ్వాళో రేపో అరెస్ట్ చేస్తారు. బ్యాంకు అక్కౌంట్స్ సీజ్ చేస్తారు. పొట్లంలో బెల్లం లేదని తెలిసాక చుట్టూ చేరిన చీమలన్నీ తప్పుకుంటాయి. హీనపక్షం పదేళ్లన్నా జైల్లో వుండక తప్పదు. ఇక అలాటి వాడిని నమ్ముకుని ఎవరు వెనకాల వేళ్ళాడుతారు చెప్పు.
అ: ఇవన్నీ ఆ రెండు పేపర్లూ చాన్నాళ్ళ నుంచి రాస్తూనే వున్నాయి. ఇందులో కొత్తేమీ లేదు గురూ గారూ. ఏదయినా సరి కొత్త సంగతి చెప్పండి.
వి: ప్రతి రోజూ కొత్త విషయం ఎక్కడనుంచి వస్తుంది. పాత విషయాన్నే మార్చి మార్చి రాస్తుండాలి. చెబుతుండాలి. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా. జగన్ పోట్లాటెట్టుకుంది ఎవర్తో. సాక్షాత్తు కాంగ్రెస్ అధిష్టాన దేవతతో. ఢిల్లీ లో, గల్లీలో అధికారం చేతిలోవున్న కాంగ్రెస్ పార్టీ తో. ఎదురు తిరక్కుండా, నీ బాన్చెను అంటూ మోచేతినీళ్ళు తాగే ఎంతమందినయినా, వాళ్లు ఎంత లంచగొండులయినా సరే అధిష్టానం చూసీ చూడనట్టు వొదిలేస్తుంది కానీ ఎదురుతిరిగిన వాళ్ళను మాత్రం వూరికే వొదిలిపెట్టదు. పార్టీలో కింద నుంచి పైదాకా ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పిల్లోడు పార్టీకి కొత్తకదా. వాళ్ల నాయనలాగే ఉడుకు రక్తం. అందుకే అలా ఆవేశపడిపోయి ఢిల్లీ పెద్దలతో గిల్లికజ్జా పెట్టుకున్నాడు. గిల్లి వూరుకున్నా అదో సంగతి. ఏకంగా అధినేత్రి పైనే నోరు చేసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్లు వాళ్ల పెళ్ళాలనన్నా ఎవరన్నా ఏమన్నా అంటే వూరుకుంటారేమోకానీ, సోనియాపై పల్లెత్తు మాట తూలినా చాలు వొంటి కాలు మీద లేస్తారు. తమ ఇంట్లో వోట్లు కూడా నమ్మకంగా తమకు వేయించుకోలేని కొందరు నాయకులు కేవలం ఈ ఒక్క లక్షణం కారణంగానే ఢిల్లీలో ఇన్నేళ్ళుగా నెగ్గుకువస్తున్నారు.
అ: కొత్త విషయం అంటూ మళ్ళీ ఆ పేపరోళ్లలాగానే పాతపాటే పాడుతున్నారు. మీరంటే ఆ రెండు పేపర్లు తెగ చదివేసి ఇలా విషయాలన్నీ ఇడమరచి చెబుతున్నారు. ఇన్ని ఇన్నాక కూడా ఓ సంగతి మాబోటోళ్లకు అర్ధం కావడం లేదు. మొన్న రేత్రి మా పక్కింటికి పోలీసోడు వచ్చి ఏవో రాసుకుపోయాడు. అంతే. ఉప్పుకీ, పప్పుకీ
పక్కింటి తలుపు తట్టే మా ఇంటిది కూడా మర్నాడు ఆ యింటి మొహం చూస్తే వొట్టు. పోలీసు బయం అంటే అల్లాగుంటది. అలాటిది జగన్ బాబు మీద అదేదో సెంటర్ పోలీసోళ్లు దిగిపోయారు. మీరన్నట్టు, ఆ రెండు పేపరోళ్ళు రాస్తున్నట్టు ఈ పొద్దో, రేపటిసందో ఆ బాబుని పట్టుకెళ్ళి చర్లపల్లి జెయిల్లో వేస్తారు. అల్లాగే,  బ్యాంకుల్లో ఆయన డబ్బు చెలామణీ కాకుండా చూస్తారు. మరి, ఆయనదగ్గర మరేటి వుంటాదని పాతికమందో, ముప్పయిమందో ఎమ్మెల్యేలు ఆయన వెంట వెడుతున్నట్టు. సీటు పోయిందని టీవీల్లో రాతలు వచ్చీ రాకముందే మన వెనకున్నోళ్లు అయిపు ఆజా లేకుండా పోయే రోజులివి. పోనీ, సొమ్ములకు కక్కుర్తి  పడ్డారనుకుంటే ఇవతల ఇంకా రెండేళ్ళ అధికారం వుందాయె. పదవిలో వుంటే పది పనులు చేసుకుని పది కాలాల పాటు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకొచ్చు. అంకెల మీద రోజులు వెళ్ళదీసే సర్కారు తన అవసరానికి అందించే తాయిలాలకు ఆశ పడే వాళ్ళుంటారు కానీ, జగన్ ఎప్పుడో సీ ఏం అవుతాడని, అప్పుడు ఆదుకుంటాడని, వున్నదాన్ని వూడగొట్టుకునే వాళ్ళుంటారా ఎక్కడయినా. పదవిని వొదులుకుని, సర్కారు చేసే సాయాలు వొదులుకుని ఏం బావుకుందామని జగనెంట ఇంతమంది వెడుతున్నట్టు? మాకర్ధం కాని ఈ ఒక్క విషయం అర్ధం అయ్యేలా చెప్పండి గురువు గారూ. (02-09-2011)

29, ఆగస్టు 2011, సోమవారం

భారతంలో అవినీతి మూలాలు – భండారు శ్రీనివాసరావు

భారతంలో అవినీతి మూలాలు – భండారు శ్రీనివాసరావు


మహా భారత యుద్ధ పరిసమాప్తి కాలంలో అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం - అభిమన్యుడి అర్ధాంగి ఉత్తర గర్భంలో పెరుగుతున్న పాండవ వంశాంకురాన్ని తుదముట్టించబోయేటప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లీకొడుకులను కాపాడతాడు. ఉజ్వల తేజస్సుతో జన్మించిన ఆ శిశువుకు విష్ణురాతుడు అని నామకరణం చేస్తారు. 


తల్లి కడుపులో వున్నప్పుడే తనకు రక్షకుడుగా వున్న ఆ దైవం (కృష్ణ భగవానుడు) సర్వవ్యాపకుడా అన్న సందేహం అతడికి చిన్ననాటినుంచే కలుగుతుంది. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికి పరీక్షగా పరికించి చూసే విష్ణురాతుడికి పరీక్షిత్తు అనే పేరు స్తిరపడుతుంది. యుక్తవయస్సు రాగానే అతడికి ఐరావతి అనే కన్యను ఇచ్చి వివాహం జరిపిస్తారు. ఒకసారి అరణ్యానికి వేటకు వెళ్లి ఒక క్రూర మృగాన్ని వెంటాడుతూ శమీక మహర్షి ఆశ్రమం చేరుకుంటాడు. ఆ వేళలో తపస్సమాధిలో వున్న శమీకముని, రాజు రాకను గమనించడు. డస్సిపోయిన స్తితిలోవున్న చక్రవర్తి ,క్షణికావేశంలో, చచ్చిపడి వున్న ఒక పాముని ముని మెడలో వేసి, కసి తీర్చుకుని తనదారిన వెడతాడు. కాసేపటికి ఆశ్రమానికి తిరిగివచ్చిన శమీక మహర్షి కుమారుడు తండ్రి మెడలో వేలాడుతున్న మృత సర్పాన్ని గమనించి కుపితుడయి- ‘ఈ దుష్కార్యానికి వొడిగట్టినవాడు ఏడు రోజుల్లో పాము కాటు చేతనే మరణిస్తాడ’ని శపిస్తాడు. ఆ శాపం గురించి తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాపపడతాడు. మృత్యువు సమీపంలో వున్నందున వున్న కొద్దికాలాన్ని జ్ఞానబోధకుల సత్సాంగత్యంలో గడపాలని నిర్ణయించుకుంటాడు. వ్యాసుడి కుమారుడయిన శుకమహర్షి భాగవత సప్తాహ బాధ్యతను స్వీకరిస్తాడు. పవిత్ర గంగా తీరంలో పరమాత్మ లీలలను తెలుసుకుంటూ మోక్షమార్గ అన్వేషణలోవున్న పరీక్షిత్తు ప్రాణాలు హరించడానికి నాగుల రాజయిన తక్షకుడు బయలుదేరుతాడు. మార్గమధ్యంలో అతడికి ఒక పండితుడు పరిచయమవుతాడు. మాటల మధ్యలో, అతడో మంత్రశాస్త్రవేత్త అనీ, ఎటువంటి కాలకూట విషానికయినా విరుగుడు ప్రసాదించగల మహిమాన్వితుడనీ తక్షకుడు తెలుసుకుంటాడు. కానీ, నిజానికి అతడికా శక్తియుక్తులున్నాయో లేదో, వుంటే అవి ఏపాటివో తెలుసుకోవాలని అనుకుంటాడు. దారిపక్కన పచ్చటి కొమ్మలు ఆకులతో అలరారుతున్న ఓ వృక్షాన్ని కాటు వేస్తాడు. తక్షక విషాగ్నికి ఆ పచ్చటి వృక్షం కాస్తా క్షణకాలంలో మాడి మసి అవుతుంది. పండితుడు చిరునవ్వుతో ఆ దృశ్యాన్ని పరికించి తన దగ్గరవున్న మంత్రజలాన్ని ఆ బూడిద కుప్పపై చల్లుతాడు. కనురెప్పపాటులో అ ఆ చెట్టు పచ్చటి కొమ్మరెమ్మలతో యధారూపును సంతరించుకుంటుంది. ఈ అద్భుతాన్ని గమనించిన తక్షకుడికి మతిపోతుంది. ఈ పండితుడు తనవెంట రాజువద్దకు వస్తే తను తలపెట్టిన లక్ష్యం నెరవేరదు. తన విషంతో పరీక్షిత్తు ప్రాణం తీయడం అనేది తనకు తృణప్రాయం. కానీ ఏం లాభం? మరణించిన మహారాజును బతికించడం అన్నది ఈ పండితుడుకి చిటికె లోని పని. అందుకే ఆలోచించి ఆ మంత్రగాడిని వెనుకకు మళ్లించే ఆలోచన చేస్తాడు. పునర్జీవితం ప్రసాదించినందుకు మహారాజు నుంచి అందబోయే ధనధాన్యకనకవస్తువాహనాలకు రెట్టింపు ఇస్తానని ప్రలోభపెడతాడు. వచ్చిన పని మార్గమధ్యంలోనే అయిపోతున్నందున ఆ పండితుడు కూడా ఎంతమాత్రం సందేహించకుండా తక్షకుడు ఇవ్వదలచిన బహుమానాలను స్వీకరించి తిరుగు ముఖం పడతాడు. చేయి తడపడం ద్వారా పనులు చేయించుకునే ఒక దుష్ట సంప్రదాయానికి తక్షకుడు ఆ విధంగా తొలి బీజం వేశాడు.


భారత కాలంలో బహుమానం పేరుతొ తొలిసారి రూపుదిద్దుకున్న ఈ ‘ఇచ్చిపుచ్చుకునే’ వ్యవహారానికి కాలక్రమంలో అవినీతి, లంచగొండితనం అనే వ్యవహార నామాలు స్తిరపడ్డాయి.

చిలుకూర్ బాలాజీ


(చిలుకూరులో వెలసిన ‘వీసా బాలాజీ’ అనే వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వంశ పారంపర్య ధర్మకర్తగా వుంటూ ఆలయ పరిరక్షణ ఉద్యమాన్ని వొంటి తాటిపై సాగిస్తున్న ‘వన్ మ్యాన్ ఆర్మీ’ , పట్టువొదలని అపర విక్రమార్కుడు సౌందర్ రాజన్ కుమారుడు రంగరాజన్ భక్తులకు అందిస్తున్న అనుగ్రహభాషణం ఆధారంగా – రచయిత - 29-08-2011)





28, ఆగస్టు 2011, ఆదివారం

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు - 9 - భండారు శ్రీనివాసరావు

ఆంధ్రజ్యోతి వాక్టూన్లు - 9 - భండారు శ్రీనివాసరావు

ఎవ్వరికీ పట్టకపోతే ....


రెన్నెళ్ల నాటి కార్యక్రమం బాగుందంటూ 
రాసినవారికి హార్దిక అభినందనలంటూ 
శ్రోతల ఉత్తరాల ప్రోగ్రాం లో వినిపించిందంటే 
ఖచ్చితంగా అది ఆ రచయిత వొండిన వొంటే 

(జూన్, 29, 1975 - ఆంధ్రజ్యోతి దినపత్రిక) 


ఎప్పుడూ ఇంతే !



పొద్దున్నే లేవడమా! లేదెన్నడు అలవాటు 
ఆలశ్యం అవడంతో అన్నిట్లో తడబాటు 
ఫ్రెంచ్ బాతుతో పాటు అసలుడకని సాపాటు
హడావిడిగ పరిగెత్తి  ఆఫీసుకు లేటు 

(జూన్,2, 1975  -ఆంధ్రజ్యోతి దినపత్రిక)



కార్టూనిష్టులకు/ఇమేజ్ సొంతదారులకు ధన్యవాదాలు - రచయిత