20, డిసెంబర్ 2025, శనివారం

చిన్న చిన్న సంతోషాలు



రాత్రి జ్వాలా పుస్తకం ఆవిష్కరణ సభకు వెళ్లి ఇంటికి చేరే సరికి పన్నెండు గంటలు దాటింది. సభ నిరాడంబరంగా జరిగినా దానికి హాజరైనవారు ఆషామాషీ బాపతు కాదు. జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ శ్రీ రామ సుబ్రమణియన్, మంత్రి శ్రీ శ్రీధరబాబు, బీజేపీ అధ్యక్షులు శ్రీ రామచంద్ర రావు, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ శ్రీ ఘంటా చక్రపాణి, ఎమ్మెల్సీ శ్రీమతి వాణి మొదలైన వారితో వేదిక కళకళ లాడింది.  వేదిక మీద వారే కాదు, ఆహూతులుగా వచ్చి వేదిక కింద కూర్చున్న వారు కూడా తమతమ రంగాల్లో సుప్రసిద్దులు.  తెలంగాణా ఆవిర్భావ తులాభారంలో  తులసి దళంలా ఉపయోగ పడ్డ ప్రముఖ రాజకీయ కురువృద్ధుడు శ్రీ కే. కేశవ రావు,  తెలంగాణా మొట్టమొదటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్. వీ. సుబ్రహ్మణ్యం, మాజీ మంత్రులు శ్రీ పెద్దిరెడ్డి, శ్రీ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ అధికారులు శ్రీ లక్ష్మీనారాయణ,  శ్రీ రావులపాటి సీతారామారావు, ఇన్ కం టాక్స్ ప్రధాన కమిషనర్ గా పదవీ విరమణ చేసిన భాస్కర రెడ్డి, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ శ్రీ దేవులపల్లి అమర్, స్టేట్ బ్యాంక్ మాజీ సీజీఎం భండారు రామచంద్ర రావు,  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విజయ రాఘవాచారి, తొలి పుస్తక గ్రహీత మా మేనల్లుడు, జ్వాలా బావమరిది డాక్టర్ అయితరాజు వేణు గోపాల రావు మొదలైన వారు సభాకార్యక్రమానికి కొత్త సొగసులు అద్దారు.
వక్తలు జ్వాలా గురించి ప్రశంశల వర్షం కురిపిస్తుంటే బాల్య స్నేహితుడిగా గొప్పగా గర్వపడ్డాను. 

వచ్చిన వాళ్ళు అందరూ కార్యక్రమం జయప్రదంగా జరిగిన తీరును, జ్వాలా నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ తిరుగుముఖం పట్టారు. 
 ఇరవై ఏళ్లుగా కలవని వ్యక్తులు, అధికారులు చాలా మంది కలిసి గుర్తుపట్టి పలకరించడం నాకు కూడా సంతోషాన్ని కలిగించింది. ఇంతమందిని ఒక్కచోట చేర్చిన గొప్పతనం దండలో దారం జ్వాలాదే. సందేహం లేదు. 

ఎన్నో ఏళ్ళ తర్వాత కలిసిన మాజీ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి వాత్సల్యంతో ఏర్పాటు చేసిన విందును ఆస్వాదించాము.

'ఎనభయ్ ఏళ్ళా నమ్మలేము' అని పాత పరిచయస్తులు నాతో అంటుంటే  ఓ రెండు అంగుళాలు పెరిగిన ఛాతీ, ఇంటి దగ్గర కారు దిగినప్పుడు అర అంగుళానికి కుంచించుకు పోయింది.

మా ఇంటి ఎదుట రోడ్డు నిర్మాణంలో ఉన్నందున అడ్డంగా వేసిన కాంక్రీటు స్థంభాలకు తగిలి కాలి బొటన వేలు చిట్లి దేవతలు కనపడ్డప్పుడు వయసు చేసే వింతలు అనుభవం లోకి వచ్చాయి. 

అంతటితో సరి అనుకోకుండా
లిఫ్ట్ నాలుగో అంతస్తులో ఇరుక్కుపోయి పనిచేయడం లేదు. ఈసురోమంటూ ఆ రాత్రి వేళ మూడు అంతస్తులు ఎక్కి ఫ్లాటు తాళం తీయబోతే అది తెరుచుకోలేదు. ఇంట్లో మా పెద్ద కోడలు భావన, కటక్ నుంచి వచ్చిన చిన్నకోడలు కజిన్ నందిక మంచి నిద్రలో వున్నారు. నా దగ్గర తాళం చెవి వుందని చెప్పాను కానీ లోపల నుంచి తలుపు గడియ పెట్టవద్దని చెప్పలేదు. ఇద్దరికీ కొత్త. తెలియక గడియ పెట్టుకుని పడుకున్నారు. ఇన్నాళ్లు కాలింగ్ బెల్ తో అవసరం పడక, అది సరిగా పనిచేయడం లేదన్న సంగతి అప్పుడు తెలిసింది. ఇద్దరూ ఐ టీ రంగం వాళ్ళు కాబట్టి మొబైల్స్ సైలెంట్ మోడ్ లో పెట్టుకుని పడుకున్నట్టున్నారు. బయట చలి. ఏం చేయాలో తెలియలేదు. ఈ పరిస్థితిలో తెల్లార్లు జాగారం చేయడం ఎల్లారా అనుకుంటూ మధ్య మధ్య కాలింగ్ బెల్ నొక్కుతున్నాను. వేడి పెనం మీద నీళ్లు పడితే సువ్వు మన్నట్టు అది నీరసంగా వినీవినపడని చప్పుడు చేస్తోంది. పట్టు విడవని విక్రమార్కుడిలా ప్రయత్నం చేస్తూ పోయాను. 
కొంతసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. మధ్యలో నిద్ర లేచిన నందికకు కాలింగ్ బెల్ చప్పుడు లీలగా వినపడి తలుపు తీసింది.

బతుకు జీవుడా అనుకుంటూ లోపలకు వెళ్లి కాలి బొటన వేలికి ఆయింటు మెంటు రాసుకుని మంచం మీద నడుం వాల్చిన తర్వాత తెలిసి వచ్చింది వయసు నిజంగా ఎనభయ్యే అని, లేనిపోని బడాయిలు పనికి రావని.

ఇలాంటివన్నీ ఇబ్బందులే, కష్టాలు కావని పెద్ద కోడలు భావన బోధించిన భగవద్గీత గుర్తుకు వచ్చిన తర్వాత స్వాంతన కలిగింది.

ఫంక్షన్ బ్రహ్మాండంగా జరిగిందని దాన్ని గురించి రాయకుండా మధ్యలో ఈ ఉపాఖ్యానం.

ఎలాగూ నిద్ర ఎగిరిపోయింది. 
అందుకే అర్ధరాత్రి ఈ అంకమ్మ శివాలు.
నిద్ర అంటారా! 
రేపు అనేది ఒకటి వుంది కదా నిద్ర పోవడానికి.

తోక టపా:
సభా కార్యక్రమం నడుమ ఒక దృశ్యం నా కంటిని ఆకట్టుకుంది. 
జ్వాలా అందరి ప్రసంగాలకు ఉచిత రీతిలో జవాబు చెప్పి కూర్చోగానే దాహం వేసిందేమో, నీళ్ల కోసం సైగ చేశాడు. సభామధ్యంలో వున్న జ్వాలా ఏకైక కుమారుడు ఆదిత్య, కోడలు పారుల్  ఆ విషయం గమనించి వెంటనే వాటర్ బాటిల్ తెచ్చి అందించారు. 

ఇదేమంత పెద్ద విషయం అంటారా.
అతి పెద్ద బహుళ జాతి కంపెనీల్లో మేమెవ్వరం ఊహించలేనంత అతి పెద్ద హోదాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వాళ్ళు. అయినా ఎలాంటి భేషజం లేకుండా బయటకు వెళ్లి నీళ్ల బాటిల్ వెతికి పట్టుకు వచ్చి ఇవ్వడం నాకు చాలా సంతోషం కలిగించింది.
ఒక వయసు వస్తే కానీ ఇటువంటి విషయాల్లో దాగున్న మధురిమ ఏమిటో అర్ధం కాదు.

17, డిసెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో : ( 249 ) : భండారు శ్రీనివాసరావు

 ఆకాశంలో సగం :  సగం అబద్ధం

‘ఆఫీసు పనిమీద మూడు రోజులు హైదరాబాదు వస్తున్నాను. అదీ మీ పెళ్లి రోజున.  మీకు ఏమి తేవాలి పాపా అన్నది నా పెద్ద కోడలు భావన అమెరికా నుంచి.  

‘నాకు ఇక్కడ లోటు ఏమున్నది? వచ్చి కొద్ది రోజులు వుంటాను అంటున్నావు, అంతకంటే నాకేమి కావాలి ఈ వయసులో’ అన్నాను నేను.

అన్నట్టే డిసెంబరు పదహారు సాయంత్రం వచ్చింది. విమానం ఆలస్యం కావడంతో ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అయింది. కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేసరికి పొద్దు పోయింది.

మరునాడు ఉదయం లేచే సరికి ఇదీ సీను. మనసు ఎటో వెళ్ళిపోయింది.

   

మీరలా కాసేపు ప్రెస్ క్లబ్ కి వెళ్లి రండి. ఇంట్లో వుండి ఇలా కాళ్ళకు చేతులకు అడ్డం పడుతూ, వచ్చిన పనివాళ్ళని కసురుకుంటూ వుంటే ఇల్లు సర్దడం ఇప్పట్లో కాదు’ అనేది మా ఆవిడ మేము ఇల్లు మారినప్పుడల్లా.

అన్నీ ఒక పద్దతిగా చేయాలనేది నా థియరీ, అసలు ఏ పద్దతి నాకు తెలియకపోయినా.

ముందు బీరువాలు పెట్టాలి, తర్వాతే మంచాలు. అప్పుడు అన్నీ తేలిగ్గా అమరుతాయి. ఆ మాటే వచ్చిన వర్కర్లతో చెప్పాను అంటే మా ఆవిడ వినిపించుకునేది కాదు. ‘చెబితే చెప్పారు, అలా కసురుకుంటూ చెప్పడం ఏమిట’ని లా పాయింటు తీసేది. దాంతో ఆమె చెప్పినట్టే ఎక్కడో కాలక్షేపం చేసి ఇంటికి వచ్చేసరికి చిందరవందరగా వున్న ఇల్లు కాస్తా కడిగి తుడిచిన అద్దంలా కనిపించేది.

మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత నిద్ర లేచి చూసేసరికి ఇల్లు  కడిగిన అద్దంలా వుంది.

తెల్లవారుఝాము వరకూ ఆన్ లైన్ లో ఆఫీసు పని చేస్తూ, తెల్లవారగానే ఇల్లు సదిరే కార్యక్రమం పెట్టుకుంది. ఆడ దక్షత లేని ఇల్లు ఎలా వుండాలో అలా వుంది. విషయం గ్రహించిన పిల్ల కనుక పొద్దున్నే ఈ పని పెట్టుకుంది. ఎందుకమ్మా ఈ శ్రమ అని అడిగితే జెట్ లాగ్ తప్పించుకోవడానికి అని నా నోరు మూయించింది.    

స్త్రీ జాతిని 'ఆకాశంలో సగం' అంటూ పొగడ్తలతో ఆకాశానికి ఎత్తే వాళ్లు నేటి సమాజంలో ఎక్కువగానే కానవస్తారు. చేతల దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోవడం కద్దు.

కొన్నేళ్ళ క్రితం ఒక వార్త కొన్ని పత్రికల్లో చాలా చిన్నగా వచ్చింది. ఆ వార్తకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వలేదేమో, ఆ అంశానికి దొరకాల్సినంత ప్రాచుర్యం లభించలేదేమో అనిపించింది, చదివిన తర్వాత. ఆ వార్త ఏమిటంటే-

ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఫ్లిప్ కార్ట్ అనే ఒక సంస్థ యాజమాన్యం, తమ దగ్గర పనిచేసే మహిళా సిబ్బందికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఉద్యోగినులకు ఇచ్చే ప్రసూతి సెలవులను ఇరవై నాలుగు వారాలకు పెంచింది. అంటే సుమారు ఆరు మాసాలపాటు జీతంతో కూడిన సెలవు. అంతే కాదు, ప్రసూతి సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరే ఉద్యోగినులకు నాలుగు నెలలపాటు పనివేళల్లో, వారికి వీలయిన సమయాల్లో పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది.

చట్టం ప్రకారం ఉద్యోగినులకు ఇవ్వాల్సిన సెలవుల్ని మించి ఈ కంపెనీ తమ మహిళా సిబ్బందికి ఈ సదుపాయాలను కల్పించడం విశేషం.

సరే. షరా మామూలుగానే ఈ రాయితీలకు వక్ర భాష్యాలు వెలువడ్డాయి. తమ సంస్థలో పనిచేసేందుకు అధిక సంఖ్యలో ఆడవారిని ఆకర్షించేందుకు ఫ్లిప్ కార్ట్ కంపెనీ ఈ నిర్ణయాలు తీసుకుందని వాటి తాత్పర్యం.

వెనుక కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న సోవియట్ యూనియన్ లో ఆడవారికి ఈ రకమైన రాయితీలు ఇవ్వడం నేను స్వయంగా చూసాను. గర్భవతులయిన ఉద్యోగినులకు, గర్భం ధరించిన సమాచారం తెలియచేసినప్పటి నుంచి, సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా కనిపెట్టి చూసుకునేందుకు వీలుగా తల్లులకు జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు.

నిజానికి గత రెండు దశాబ్దాల కాలంలో మనదేశంలో మహిళలు గణనీయమైన పురోగతి సాధించడం కళ్ళారా చూస్తున్నాం. ఓ అరవై ఏళ్ళక్రితం ఆడపిల్ల ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టడం కనాకష్టం. 'ఆడపిల్లకు చదువెందుకు, ఇంట్లో ఏవో పద్దులు రాసుకునే అక్షర జ్ఞానం వుంటే చాలు' అని పెద్దవాళ్ళు అంటూ వుండడం నాకెరుక. నూటికో కోటికో చదువుకున్న ఆడవాళ్లు కనిపిస్తే విడ్డూరంగా చూసే కాలం గడిచిపోయి ఎన్నో ఏళ్ళు కాలేదు. సైకిల్ తొక్కే ఆడపిల్లల్ని రౌడీ పిల్లలు అనేవాళ్ళు. లంగా ఓణీ కాకుండా చుడిదార్ వేసుకుంటే నోటితో కాకపోయినా నొసటితో వెక్కిరించేవాళ్ళు.

మార్పు అనేది కాల ధర్మం. అందుకే కాలం మారింది. ఇంకా మారుతోంది. మగా ఆడా తేడా చదువుల్లో లేకుండా పోయింది. కాకపొతే, చదువుకున్న ఒక తరం ఆడవాళ్ళు, చదివిన చదువుకు సార్ధక్యం లేకుండా మళ్ళీ గృహిణులుగానే ఇంటి పనులకు పరిమితం అయిపోయారు. దానితో, 'చదువుకుని ఏం చేస్తారు ఉద్యోగాలు చేస్తారా, వూళ్ళు ఏలాలా?' అనే కొత్త వ్యంగ్యాస్త్రాలు వ్యవహారంలోకి వచ్చాయి.

ముందే చెప్పినట్టు మారుతూ పోవడం కాల ధర్మం. తరువాతి తరం ఆడపిల్లలు మగ పిల్లలతో పోటీలు పడి చదువుల్లో రాణిస్తూ వస్తున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. వేడి నీళ్ళకు చన్నీళ్ళ మాదిరిగా వారి సంపాదనలు కుటుంబ ఖర్చులకు అవసరం కావడంతో మగవాళ్ళే సర్దుకుపోయి, ఉద్యోగం చేసే ఆడపిల్లలకి పెళ్లి చూపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. అంతటితో మార్పు ఆగలేదు.

మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆర్ధిక సంస్కరణల పుణ్యమా అని రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన కొత్త కొలువులు వచ్చి పడ్డాయి. వాటికి తగ్గట్టే మంచి మంచి జీత భత్యాలు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆ జీతాలు కూడా సంసారాలకు తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఈ ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు ఈనాడు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. మగ పిల్లల మాదిరిగానే కన్న తలితండ్రులను, వున్న వూరినీ విడిచి వెళ్ళి పరాయి వూళ్లల్లోనే కాదు, పరాయి దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ రీత్యా ఆర్దిక స్వాతంత్రం అయితే ఆడవారికి కొంత వరకు వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఆ మేరకు వారికి లభిస్తోందా అంటే చప్పున జవాబు చెప్పలేని పరిస్తితి.

ఉదాహరణకు సినీ రంగంలో రాణిస్తున్న తారల సంగతే తీసుకుందాం. ఆదాయం బాగానే వున్నా మగ తారల మాదిరిగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కాపాడుకోలేని పరిస్తితి ఆ రంగంలో ఎక్కువ. అన్నింటికీ ఎవరిమీదనో ఆధారపడాల్సిన స్తితే.

సరే! ఇవన్నీ బాగా చదువుకుని, బాగా సంపాదిస్తూ వున్న మహిళల సంగతి. కుటుంబ ఆర్థిక స్తితి గతులు మెరుగు పరచడంలోనే కాదు, దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో కూడా వీరి పాత్ర తక్కువేమీ కాదు. ఆ మేరకు వారికి జాతి రుణపడి వుండాలి.

మరో రకం ఆడవారు కూడా వున్నారు. నిజానికి వీరి జనాభానే అధికం. వీరు చదువు సంధ్యలు లేనివాళ్ళు. అధవా చదువుకున్నా ఏదో నాలుగు పొడి పొడి అక్షరం ముక్కలే. చిన్న చిన్న పనిపాట్లు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న వారు. తమ కుటుంబాలకు ఆర్ధికంగా సాయపడుతున్నవారు. సంపాదన వుందన్న మాటే కాని దానిపై పెత్తనం బొత్తిగా లేనివాళ్ళు. గ్రామాల్లో పొలం కూలీలుగా పనిచేసుకుంటూ, బస్తీల్లో అయితే నాలుగిళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ, నాలుగు రాళ్ళు పోగేసి మొగుడి చేతిలో పోసి చేతులు దులుపుకునే వాళ్లు. తమ చెమటతో తడిసిన ఆ సొమ్మును వాళ్లు తాగుడు కోసం తగలేస్తున్నా నోరు తెరిచి అడగలేని మూగవాళ్ళు. వీరికి బొత్తిగా ఆర్ధిక స్వాతంత్రం లేదు, పోనీ వ్యక్తిగత స్వేచ్చ వుందా అంటే అదీ లేదు. మరబొమ్మల్లా కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించడం తప్ప.

మరో వివక్షకు కూడా వీరు గురవుతున్నారు. చేసేది ఒకే పని అయినా దినసరి కూలీ డబ్బులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. ఆడవాళ్లు చేసే ఇంటి పనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, బయట పనిపాటుల్లో వారికి ముడుతున్నది నామమాత్రమే.

ఇలాటివారు నేటి సమాజంలో ఎల్లెడలా కనిపిస్తారు. పనికి తగ్గ వేతనాలు వుండవు. పని వేళలూ వుండవు. రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేస్తారు. పనిచేసిన రోజున బాగా చేసావు అనేవాళ్ళూ వుండరు. పనికి రాని రోజున 'మా నాగాల రాణి ఇవ్వాళ రాలేదు, ఎగనామం పెట్టింది' అనే సన్నాయి నొక్కులకు మాత్రం తక్కువ వుండదు. మరి వీరి జీవితాలు మారేదెన్నడో!

అరవై ఏళ్ళ క్రితం గడప దాటని ఆడవాళ్ళను చూసాను. అదే కళ్ళతో చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళను ఈనాడు చూస్తూ వున్నాను.

కాల ధర్మం మీద నమ్మకం వున్నవాడ్ని. చివర చెప్పిన బడుగు బలహీనవర్గాల ఆడవారికి కూడా మంచి కాలం రాకపోతుందా? నేను చూడక పోతానా?

కింది ఫోటో: ఇంటి సంప్రోక్షణకు నడుం బిగించిన పెద్ద కోడలు భావన ( వాళ్లకు సోషల్ మీడియాలో కనబడడం అస్సలు నచ్చదు. అందుకే యాంగిల్ మార్చి ఫోటో తీశాను)




(ఇంకావుంది)  

15, డిసెంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (248) : భండారు శ్రీనివాసరావు

 

మా పెళ్లి రోజు ఓ చేదు జ్ఞాపకం
ఆరేళ్ల క్రితం ఆగస్టు నెల మొదటి వారంలో మిత్రుడు జ్వాలా, మా మేనకోడలు విజయలక్ష్మి దంపతుల యాభయ్యవ వివాహ వార్షికోత్సవం జరిగింది. హితులు, సన్నిహితులు, చుట్టపక్కాల నడుమ జ్వాలా దంపతుల పిల్లలు ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగలా నిర్వహించారు.
“మరో రెండేళ్లలో మీ గోల్డెన్ జూబిలీ. రెడీగా వుండు దుర్గత్తయ్యా!” అంది మా మేనకోడలు మా ఆవిడ నిర్మలతో.
దేవతలకు ఉన్నట్టే మాఆవిడకు అనేక పేర్లు. పుట్టినప్పుడు కన్న తలితండ్రులు బియ్యంలో రాసి పెట్టిన పేరు కనకదుర్గ. కానీ ఆమె పుట్టింటి వాళ్ళందరూ చిట్టి అనే పిలిచేవాళ్ళు. పెళ్లి అయిన తర్వాత మా బామ్మ గారు నిర్మల అని మార్చింది. స్నేహితులందరికీ ఇదే పేరు వాడుక. చుట్టాల్లో చాలామందికి చుట్టరికం ఏదైనా అందరికీ ఆవిడ దుర్గత్తయ్యే.
సిల్వర్ తప్పితే మా ఆవిడకు గోల్డ్ ఇష్టం లేనట్టుంది. అందుకే అప్పటిదాకా ఆగకుండా వెళ్ళిపోయింది.
రేపు డిసెంబరు పదహారు మా పెళ్లిరోజు.
ఆ రోజు గురించి తలచుకుని మురిసిపోయే మంచి సంగతులేవీ మాకు లేవు. ఎందుకంటే అది కన్నీళ్ళ పెళ్లి.
1971 డిసెంబరు 15 వ తేదీ రాత్రి మద్రాసు నుంచి అంబాసిడర్ కారులో తిరుపతి ప్రయాణం. దారిలో భోరున వాన. అట్లా ఇట్లా కాదు, ఉరుములు, మెరుపులు, పిడుగులు. నా వంటి వాడితో తన భవిష్యత్ జీవితం ఎలా వుండబోతోందో సూచనాప్రాయంగా మా ఆవిడకి చెప్పడానికా అన్నట్టు వుంది ప్రకృతి బీభత్సం.
మధ్య మధ్యలో ఆగుతూ, తెల్లారేలోపునే తిరుమల చేరాము. ఒక కాటేజీలో పైన గదులు తీసుకున్నాము.
మా ఆవిడ పిన్నివసుంధర కొన్న నీలం రంగు ఫారెన్ నైలెక్స్ చీరే పెళ్లి చీరె. నేను ధోవతి కట్టుకున్నానో, ప్యాంటు షర్టుతో పెళ్లి చేసుకున్నానో గుర్తు రావడం లేదు. ఎందుకంటే సందర్భం, సన్నివేశం అలాంటివి. ప్రత్యేకంగా ముహూర్తం అంటూ లేదు కనుక, తొమ్మిదీ పది గంటల నడుమ పెళ్లి జరిగిపోయింది. వెంటనే వెళ్లి బాలాజీ దర్శనం చేసుకున్నాము.
ఇప్పట్లోలా క్యూ లైన్లు లేవు. కొండ దిగి వచ్చి భోజనం చేసి వచ్చిన కారులోనే మళ్ళీ మద్రాసు వెళ్ళాము. మా ఆవిడ స్నేహితులు టీ నగర్ హోటల్లో విందు ఇచ్చారు. అటునుంచి మా మామగారి వద్దకు వెళ్లాం. కూతుర్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. “నీకు ఏం తక్కువ చేస్తానని అనుకుని ఇలా పెళ్లి చేసుకున్నావ”ని మా ఆవిడను అడిగారు. కన్నీళ్ళే జవాబు.
రైళ్ళలో రిజర్వేషన్ల గొడవ లేని రోజులు. అంచేత 16 వ తేదీ రాత్రి రైల్లో బయలుదేరి మర్నాడు ఉదయం బెజవాడ చేరుకున్నాము. రిక్షా చేసుకుని మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారింటికి వెళ్ళాము. మా అమ్మగారు కూడా అక్కడే వుంది.
మమ్మల్ని చూసి కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. కాళ్ళకు దణ్ణం పెట్టగానే దగ్గరకు తీసుకుని మనసారా ఆశీర్వదించింది.
‘పెళ్లి వద్దు! పెళ్ళాం కావాలి’ అనే నా మొండి పట్టుదల ఫలితం మా ఈ పెళ్లి. ఇరువైపుల పెద్దల చేత కళ్ళ నీళ్ళు పెట్టించింది కూడా, బహుశా అదే ఆఖరిసారి కావచ్చు.
పెళ్లి అనేది ఇద్దరి మధ్య వ్యవహారం. మూడో వ్యక్తికి ఇందులో సంబంధం లేదు. పెళ్లి మీద ఖర్చుచేయడం వృధా అనే సిద్దాంతాన్ని నాకు నేనే ప్రతిపాదించుకుని, దాని మీదే భీష్మించుకుని కూర్చోవడంతో, మా ప్రేమ పెళ్ళికి పెద్దల ఆమోదం లభించినా, కొన్నేళ్ళు గా వాయిదా పడుతూ వచ్చింది.
ఒక్కగానొక్క పిల్లకు గుళ్ళో పెళ్లి చేయలేను అనే మా మామగారి వాదన నేను పట్టించుకోలేదు.
అందుకే ఆయన ఇష్టపడిన పెళ్లిని, ఇష్టం లేని గుళ్ళో పెళ్ళిగా చేసుకోవాల్సి వచ్చింది.
పెద్దతనంలో ఇప్పుడు తలచుకుంటే అప్పుడు చేసిన పని చిన్నతనంగా అనిపిస్తుంది.
ఏదిఏమైనా అన్నింటినీ నా జ్ఞాపకాలకు వదిలేసి తాను తప్పుకుని వెళ్ళిపోయింది. పెళ్ళంటే నా ఇష్టప్రకారం చేసుకున్నాను. ఇది నా చేతిలో లేదుగా!
నా గురించి తప్ప తన గురించి ఆలోచించుకోవడానికి సుతరామూ ఇష్టపడని ఓ వింత మనిషి, 1971 డిసెంబరు పదహారు నుంచి నా జీవితంలో ఒక విడరాని ప్రధాన భాగమై పోయింది. నేను ఎన్నటికీ తీర్చుకోలేని రుణం ఈ ఒక్క వ్యక్తికే!
గ్రహపాటున తీర్చుకుంటానేమో అనే సందేహం కలిగిందేమో, నాకు ఆ అవకాశం ఇవ్వకుండా ముందుగానే దాటిపోయింది.
ప్రతి ఏటా డిసెంబర్ 15 వ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు నన్ను నిద్ర లేపి మృదువుగా షేక్ హాండ్ ఇచ్చేది. మర్నాడు ఉదయం అంటే డిసెంబర్ 16 ఉదయం మళ్ళీ నిద్ర లేపి కాళ్ళకు దణ్ణం పెట్టేది. అప్పుడు కానీ నాకు లైట్ వెలిగేది కాదు డిసెంబర్ 16 మా పెళ్లి రోజని. కలిసి గుడికి పోవాలని తనకు మనసులో కోరిక. నాకేమో టీవీ చర్చలతో సమయం దొరికేది కాదు. తానే ఒంటరిగా వెళ్లి అర్చన చేయించి వచ్చేది.
ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు ఇలా 48 సంవత్సరాలు ఇదే విధంగా గడిచిపోయాయి.
బుద్ధి తక్కువ వాడిని, ఇన్నేళ్ళలో ఒక్కటంటే ఒక్కరోజయినా గుర్తు పెట్టుకుని నేనే ముందుగా ఆమెకు షేక్ హాండ్ ఇచ్చివుంటే....
ఇప్పుడిలా ఆ విషయాలను గుర్తుచేసుకుని మధన పడే అవకాశం వుండేది కాదేమో!
బ్యాడ్ లక్!
దండలు కూడా లేని పెళ్ళికి ఫోటోలు ఏమి వుంటాయి?
కింది ఫొటోలు: పెళ్లి కాక ముందు, పెళ్ళయిన కొత్తల్లో, ఇప్పుడు, మూడేళ్ల క్రితం కాబోలు తిరుపతి వెళ్ళినప్పుడు మేము పెళ్లి చేసుకున్న కాటేజీ ముందు ఒంటరిగా నిలబడి తీసుకున్న ఫోటో









(ఇంకా వుంది)
15-12-2025

13, డిసెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (247) : భండారు శ్రీనివాసరావు

 

నేనో సీతయ్యని!
ఈ శీర్షిక మొదలు పెట్టి దాదాపు పదమూడు మాసాలు గడిచాయి. ఇది 247వ ఎపిసోడు.
మొదటి నుంచీ ఇప్పటివరకూ సాగిన నా ఈ చరిత్రలో, ఎవరైనా గమనించి వుంటే, పలుసార్లు ప్రస్తావనకు వచ్చిన పేర్లు మూడే మూడు.
ఒకరు మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారు, రెండో అన్నయ్య రామచంద్రరావు గారు, మూడో వ్యక్తి నా చిన్ననాటి, పెద్దనాటి, ఈనాటి స్నేహితుడు, మేనకోడలు విజయలక్ష్మి భర్త వనం జ్వాలా నరసింహారావు. పూర్తి పేరు ఇంత పొడుగుది అయినా, నేను ఆప్యాయంగా పిలుచుకునే జ్వాలా అనే చాలా సార్లు పేర్కొంటూ వచ్చాను.
అనేక రోజులుగా ఒక విషయాన్ని గురించి విపులంగా రాయాలని అనుకుంటూ వస్తున్నాను. వీలు దొరకలేదు అని అబద్ధం చెప్పను, కానీ నేనే వీలు చేసుకోలేదు. ఇది నిజం. విషయం ఏమిటంటే పోస్టు రిటైర్మెంటు జీవితం.
2005 డిసెంబరు ముప్పై ఒకటిన నేను దూరదర్శన్ నుంచి రిటైర్ అయ్యాను. కానీ, అదే రోజు ఓ ఏడాది సర్వీసు పొడిగించారు. కానీ దాన్ని నేను పూర్తిగా వినియోగించుకోలేదు. మధ్యలోనే బయటకు వచ్చి సత్యం రామలింగరాజు గారు ప్రారంభించిన 104 సర్వీసు గ్రామీణ ఆరోగ్య సేవల స్వచ్చంద సంస్థలో మీడియా అడ్వైజర్ గా కొన్నాళ్ళు పనిచేశాను. అలాగే రోజువారీ టీవీ చర్చలు.
ఇలా జీవితం సాగిపోయింది. రిటైర్ అయ్యాను అనే ఫీల్ లేకుండా పోయింది.
2019 లో మా ఆవిడ నిర్మల ఆకస్మిక మరణంతో నా జీవితం మరో మలుపు తిరిగింది. ఇతర వ్యాపకాలు తగ్గిపోయాయి. అసలైన రిటైర్ మెంట్ జీవితం మొదలయింది. కానీ రిటైర్ మెంట్ జీవితం ఎలా గడపాలి అనే విషయంలో సరైన అవగాహన లేక మానసికంగా చాలా ఇబ్బందులు పడ్డాను. ఒకరకంగా చెప్పాలి అంటే రోజులు దొర్లిస్తున్నాను. సరే! ఇది నా గొడవ. అలా ఉంచుదాం.
ఇప్పుడు మరో వ్యక్తిని గురించి చెబుతాను. ఆయనే నేను ముందు పేర్కొన్న వనం జ్వాలా నరసింహారావు. నా బాల్య మిత్రుడు. చిన్నప్పుడు స్కూల్లో సహాధ్యాయి. పెద్దయిన తర్వాత నా మేనకోడలు విజయలక్ష్మి భర్త. తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి ఎంతో పైకి వచ్చాడు. కిందపడ్డాడు. మళ్ళీ ఉవ్వెత్తున తాటిప్రమాణంలో పైకి లేచాడు.
చేయని ఉద్యోగం లేదు. బిహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో లైబ్రేరియన్ గా మొదలు పెట్టి తెలంగాణా ముఖ్యమంత్రి ప్రధాన సంబంధాల అధికారి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగాడు. ఈ క్రమంలో చేయని ఉద్యోగం లేదు. మారని ఇల్లు లేదు. అయితే, ఈ ఒక్క విషయంలో మాత్రం నాకూ ఆయనకు పోలిక. మరీ ఆయనలా అన్ని కాకపోయినా నేను సైతం హైదరాబాదు ఉద్యోగపర్వంలో అనేక అద్దె ఇళ్ళు మారాను.
మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో, హైదరాబాదులో నేను చేసింది ఒకే ఒక ఉద్యోగం, ఒకే ఒక సంస్థ, ఆలిండియా రేడియోలో. కాకపొతే ఉద్యోగ పర్వం చరమాంకంలో కొద్ది కాలం దూరదర్సన్ లో కూడా ఇష్టం లేని కాపురం ఒక ఏడాది చేసి అక్కడే రిటైర్ అయ్యాను.
జ్వాలా అలా కాదు. అనేక ఉద్యోగాలు. అనేక తరహా ఉద్యోగాలు. కొన్ని సర్కారు కొలువులు. మరి కొన్ని అటూ ఇటూ కానివి. అందుకే రిటైర్ మెంటు అనేది ఆయనకు లేకుండా పోయింది. ఉద్యోగానికి ఉద్యోగానికి మధ్య ఖాళీ. ఖాళీకి ఖాళీకి నడుమ కొలువు. ఇలా సాగిపోయింది ఆయన జీవితం. ఖాళీ సమయాన్ని కూడా ఖాళీగా వుంచలేదు ఏనాడు. రాజకీయాల నుంచి రామాయణ, మహాభారతాల వరకూ గ్రంధాలు రచిస్తూ పోయాడు. రాయడమే కాదు వాటిని పుస్తకాలుగా వెలుగులోకి తెచ్చాడు. వేటినీ అమ్మకానికి పెట్టలేదు. ఆసక్తి కలిగిన వారికి ఉచితంగా ఇచ్చాడు.
చివరికి జ్వాలా కూడా రిటైర్ అయ్యాడు. కానీ ఒప్పుకోడు. ఆయనే కాదు, నేను కూడా ఆయన రిటైర్ అయ్యాడు అంటే ఒప్పుకోను. నో రిటైర్మెంట్ అనేది ఆయన పాలసీ.
నాకూ ఆయన వయసులో ఒకటి రెండేళ్లే చిన్న. పోస్టు రిటైర్మెంట్ విషయంలో మాత్రం చాలా తేడాలు.
ఒకప్పుడు ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. కానీ నా భార్య మరణానంతరం నా లోకం మారిపోయింది. ఏకాంతం నా లోకం అయింది. ఇంతవరకు నా జోలికి రాని కొన్ని ఆరోగ్య సమస్యలు. మరికొన్ని హార్దిక ఇబ్బందులు. రెండో కుమారుడి మరణం వంటి తట్టుకోలేని సంఘటనలు. జీవితం పట్ల నా దృక్పథం మారిపోయింది.
ఒంటరితనం. ఒంటరిగా జీవించడం. ఏదీ పట్టించుకోకపోవడం. నిర్లిప్తత. నిర్వేదం.
విల్లాల్లో జీవితం కాకపోయినా, చెప్పుకోదగిన ఆర్ధిక ఇబ్బందులు లేవు. వయసురీత్యా కొన్ని ఆరోగ్య సమస్యలు ఎలాగు తప్పవు.
(ఇవన్నీ మా పెద్దకోడలు భావన నాకు జీవన భగవద్గీత బోధించే వరకే)
ఈ నేపధ్యంలో జ్వాలా జీవితం నాకు ఓ దిక్సూచిలా కనిపించింది. ఒప్పుకోడు కానీ ఆయనది రిటైర్మెంట్ జీవితమే. ఆ మధ్య ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్లాను. గతంలో మాకిది రోజువారీ వ్యవహారమే. కానీ ఈ మధ్య నేను ఇల్లు వదిలి బయటకు పోలేదు. నిజం చెప్పాలి అంటే, నా గది వదిలి ఇంట్లోనే అడుగు బయట పెట్టలేదు. బెడ్ రూమ్ టు బాత్ రూమ్. తిండీ తిప్పలు అన్నీ నా గదిలోనే. అంతగా ఒంటరితనం నన్ను ఆవరించింది.
ఆయన ఇల్లు ఎప్పటిలా బంధుమిత్రులతో కళ కళ లాడుతోంది. ఒకానొక కాలంలో, అంటే మా ఆవిడ జీవించి వున్న కాలంలో అందరూ మా గురించి, మా ఇంటి గురించి ఇలాగే చెప్పుకునేవారు.
స్నేహితులని, సన్నిహితులని, బంధువులని, మిత్రులని అప్పుడప్పుడు కలుస్తూ, పాత ముచ్చట్లు, కొత్త సంగతులు కలబోసుకోవడం ద్వారా రిటైర్ మెంటుని హాయిగా, ఆనందంగా, ఉల్లాసంగా గడపవచ్చనేది జ్వాలా థియరీ. మధ్య మధ్య కలుస్తుంటేనే చుట్టరికాలు అయినా స్నేహితాలయినా చిరకాలం నిలబడతాయని ఆయన నమ్ముతాడు. అందుకే చిన్ననాటి స్నేహితుల నుంచి ఉద్యోగ పర్వంలో పరిచయం అయిన ప్రతి ఒక్క అధికారి, సిబ్బందితో ఇప్పటికీ టచ్ లో ఉంటాడు. మధ్య మధ్య ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు, ఏ పనీ లేకపోయినా. హ్యూమన్ రిలేషన్స్ ప్రాధాన్యతని ప్రాక్టికల్ గా నిరూపిస్తున్న జ్వాలాని చూసి నేర్చుకోవాల్సింది చాలా వుంది అనిపించింది.
నా దగ్గర కూడా అంతకు మించిన ఫోన్ లిస్టు వుంది. కానీ ఏ రోజూ ఎవరితో మాట్లాడను. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేది నాకు నేను చెప్పుకునే సమర్ధన.
ఇంత పెద్ద వయసులో ఈ అనుకరణలు సాధ్యమా! కాదని నాకు తెలుసు.
ఎందుకంటే నా గురించి నాకు బాగా తెలుసు.
నేనో సీతయ్యని.
(ఎవరి మాటా వినను)

కింది చిత్రం:
జ్వాలా, నేను



(ఇంకావుంది)

12, డిసెంబర్ 2025, శుక్రవారం

ఎన్నాళ్లగానో చదవాలని అనుకుంటున్న పుస్తకం

పాత్రికేయ  మిత్రుడు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్. వినయ్ కుమార్ రాసిన ఆత్మ కధ- పేపర్ బాయ్ టు ఎడిటర్ - ఇన్నాళ్లకు ఇంటికి చేరింది. ఆనందంతో కూడిన కృతజ్ఞతలు.

మా అపార్ట్ మెంట్ లిఫ్ట్ సమస్య వల్ల వాచ్ మన్ కాస్త ఆలస్యంగా తెచ్చి ఇచ్చాడు.
🙏🙏🙏
భండారు శ్రీనివాస రావు

240 పేజీలు వెల : Rs. 125/- కాపీల కోసం : S. Vinay Kumar, Hyderabad. Mobile : 99897 18911



10, డిసెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (246) : భండారు శ్రీనివాసరావు


నందిక నా కళ్ళు తెరిపిళ్ళు పడేలా చేసింది.
ఇప్పుడు తెల్లవారుఝమున మూడు గంటలు దాటింది.
నా వయసు ఎనభయ్ సంవత్సరాలు. ఆరేళ్ల క్రితం నా భార్య నిర్మల మరణించింది. నిరుడు మొదట్లోనే నా రెండో కుమారుడు సంతోష్ కన్ను మూశాడు.
అమెరికాలో ఉంటున్న నా పెద్దవాడు సందీప్, కోడలు భావన, చిన్న వయసులోనే జీవన సహచరుడిని పోగొట్టుకున్న చిన్నకోడలు నిషా నాకు బాసటగా నిలబడ్డారు. మా అన్నయ్య రామచంద్ర రావు గారు, ఆయన పిల్లలు సరే సరి. నా పాలిటి 108.
మల్టీ నేషనల్ సంస్థలో చిన్న కోడలుకి ఉద్యోగ బాధ్యతలు. చిన్నారి జీవిక ఆలనా పాలనా చూడడానికి మా ఆవిడ లేదు. అంచేత తప్పనిసరి పరిస్థితిలో పుట్టింట్లో, కటక్ లో వుండాల్సిన పరిస్థితి. అక్కడ జీవికకు అమ్మమ్మ, తాతతో పాటు కోడలి అన్నవదినలు, వారి పిల్లలు వుంటారు. ఒక కుటుంబ వాతావరణంలో పెరుగుతుంది. నిజానికి అంతకంటే గొప్పగానే పెరుగుతోంది. అది దాని అదృష్టం.
పగలు స్కూలు, సాయంత్రం డాన్సు స్కూలు, ఉదయం ట్యూషన్, డ్రాయింగు క్లాసు. ఇలా ఉదయం నుంచీ సాయంత్రం దాకా, వాళ్ళ అమ్మ ఓవర్ సీస్ కాల్స్ పూర్తయ్యేవరకు బిజీ, బిజీ.
ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒంటరిగా వుండడమే మంచిదని నాకూ అనిపించింది. మొబైల్స్ యుగంలో దూరాభారాల సమస్య లేదు కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు వీడియో కాల్ చేసి చూస్తూ మాట్లాడ వచ్చు.
అలా సర్దుకుపోయాను.
ఒకరకంగా హైదరాబాదులో వానప్రస్తాశ్రమం.
ఒక్కడిని. వంట చేసిపెట్టడానికి వలలి. ఇంటి పనులు చేసిపెట్టడానికి ఒక హెల్పర్. బయట తిరగాలి అంటే కారు. ఎనభయ్ ఏళ్ళ మనిషికి ఇంతకంటే ఏం కావాలి?
ఏ సమస్య లేకుండా పిల్లలు చూసుకుంటున్నారు. వాళ్లకి నేను సమస్య కాకుండా చూసుకోవడం ఒక్కటే నేను చేయగలిగింది.
దాంతో నాకు నేనుగా కొన్ని నియంత్రణలు పెట్టుకున్నాను.
ముందు నేను చేయాల్సింది నా ఆరోగ్యం చూసుకోవడం. ఇదివరకు ప్రతిదీ ఒక సమస్యే. ఎప్పుడయితే నా పెద్దకోడలు భావన చెప్పినట్టు, అది సమస్య కాదు ఇబ్బంది అని అనుకోవడం మొదలు పెట్టానో అన్నీ దూదిపింజల్లా ఎగిరిపోయాయి.
నాకు నేనుగా ఒక ప్రపంచం నిర్మించుకున్నాను, ఇందులో రాత్రీ పగలు తేడా లేదు. రాత్రుళ్లు నిద్ర పట్టదు. పట్టకపోతే ఏమవుతుంది? రేపు పగలు నిద్రపోతాను. రేపు అనేది వుంది అనే నమ్మకం కుదరడంతో నిద్రపట్టక పొతే ఎల్లా అనే దిగులు, భయం పోయాయి. దిగులు పోవడంతో ఆరోగ్యం నా ప్రమేయం లేకుండానే కుదుట పడింది.
అదివరకు ప్రతినెలా వైద్య పరీక్షలు చేయించుకునే వాడిని. ఆరు నెలలుగా డయాగ్నాస్టిక్ సెంటర్ గడప తొక్కలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళలేదు.
ఒకరకంగా ఇది మొండితనమే. ఏదన్నా ముంచుకు వస్తే! ఏమవుతుంది? ఇంతకంటే ఏమవుతుంది?
కట్టుకున్న భార్య, కన్న కొడుకు కళ్ళ ముందే పోయారు. వారిని కాపాడగలిగానా?
మిత్రుడు, మేనకోడలు మొగుడు జ్వాలా 'బయటకు వస్తుండు' అని చెప్పి చెప్పి విసుగు పుట్టి ఊరుకున్నాడు. ఆదివారం కలిసిన మిత్రుడు, తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి కూడా అదే మాట. వారానికి ఒకరోజు జీరోకు సెలవు ఇచ్చి బయటకు వస్తుండు అని. కానీ ఒకళ్ళ మాట వినేరకం అయితే నేను, నేను ఎందుకు అవుతాను.
ఇప్పుడు ఒకటే నా ధ్యేయం. మొదలు పెట్టిన జీరో కధను పూర్తి చేయడం. వీలయితే దాన్ని మా పిల్లలు చదువుకునేలా ఆంగ్లంలో అనువాదం చేయడం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజుల్లో అదేమంత పెద్ద విషయం కాదు.
తెల్లవారుఝామున ఎప్పుడో నిద్ర పట్టినా ఆరుగంటలకు మెలకువ వస్తుంది. కాలకృత్యాలు తీర్చుకునేసరికి, పాలబ్బాయి ప్యాకెట్ వేస్తాడు. వాటిని కాగబెడతాను. ఒక్కోసారి పొంగిపోతాయి. అవసరం అన్నీ నేర్పిస్తుంది. సన్నటి సెగన కాగబెడతాను. గతంలో ఫిల్టర్ కాఫీ తాగేవాడిని. అదో పెద్ద హైరాణా. ఫిల్టర్ లో పొడివేసి, వేడి నీళ్ళు పోసి అది దిగిన దాకా వెయిట్ చేయడం నా వల్ల కాదు.
మరి ఇంతమంది పనివాళ్లు దేనికి అంటారా! వంట చేసే ఆవిడ పదిహేను ఏళ్ళ నుంచి పని చేస్తోంది. ఆమెకు గంపెడు సంసారం. పొద్దున్నేరావాలి, ఈ పనులు చేయాలి అంటే. గతంలో వచ్చేది. ఒక్క మనిషికి కాఫీ కలపడం కోసం ఎందుకు, వద్దని నేనే చెప్పాను. కొన్నాళ్ళు కాఫీ ప్రహసనంతో కుస్తీ పట్టిన తర్వాత ఈ గోలకంటే కాఫీ మానేస్తే పోలా అనిపించి ఆ అలవాటుకు స్వస్తి చెప్పాను.
ఒక గ్లాసు పాలలో ఎన్స్యూర్ కలుపుకుని, డ్రాయింగ్ రూములో కూర్చుని లెగ్ మసాజర్ లో కాళ్ళు పెట్టుకుని, పాలు తాగుతూ, అలెక్సాలో వెంకటేశ్వర సుప్రభాతం పెడతాను. మిగిలిన పాలు తోడు పెడతాను. నిజానికి ఈ పనులన్నీ చాలా రోజులు మా వలలి చేసేది. అప్పటిదాకా మంచం మీద నిద్రపట్టక దొర్లుతూ వుండేవాడిని. ఈ పనులు నా భుజానికి ఎత్తుకున్న తర్వాత రోజులో ఎంతో సమయం కలిసివస్తోంది. నాకూ కొంత కాలక్షేపం.
పొతే, ఇక నందిక సంగతి. ఈ అమ్మాయి మా చిన్నకోడలు నిషా అన్నయ్య కుమార్తె. చార్టర్డ్ అక్కౌంటెన్సీ ఇంటర్ మీడియెట్ గ్రూపు రెండు పరీక్షలు ఒకే అటెంప్ట్ లో మంచి రాంక్ తో పూర్తి చేసింది. ప్రముఖ అంతర్జాతీయ సంస్థలో ఆర్టికిల్ షిప్ ఆఫర్ వచ్చింది. ఆ కంపెనీ హైదరాబాదులో వుంది. చేరడానికి ఇక్కడకు వచ్చింది. అదీ ఇండిగోలో. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు అన్నీ ఒకేమారు నేల వాలినట్టు ఇండిగో విమానాలన్నీ గాలిలో ఎగరడం మానేసి భూమి మీదనే పడి వుంటున్నాయి, కొన్నిరోజులుగా. ఆ అమ్మాయి సోమవారం నాడు జాయిన్ కావాలి. ఎలారా అని మధన పడుతుంటే ఆదివారం నాడు మాత్రం మధ్యాన్నం ఫ్లయిట్ సరయిన సమయానికి భువనేశ్వర్ లో బయలుదేరి సరయిన సమయానికి హైదరాబాదు చేరింది. లక్కీ గర్ల్.
ఇంట్లో దీపం వెలిగించేవాళ్లు లేరు అనుకునే బాధ లేకుండా ఇంటి దీపంలా నందిక వచ్చింది.
సోమవారం ఆఫీసుకు వెళ్ళింది, వచ్చింది. కొత్త ఆఫీసులో పని, ఇతర క్షేమ సమాచారాలు కనుక్కుని మళ్ళీ నా డెన్ లోకి వచ్చాను. ఏదో చెత్తా చెదారం రాసుకుంటూ వుండి పోయాను. నేను సాధారణంగా నా గది వదిలి మా ఇంట్లోనే కాలు బయట పెట్టను, ఉదయం పూట ఓ అరగంట తప్ప. తలుపు తీసి పెడతాను. వంటమనిషి, పనిమనిషి వచ్చి ఎవరి పనులు వాళ్ళు చేసుకుని వెడతారు. మూడు కిలోలు బియ్యం కొంటే నెల దాటినా మళ్ళీ కొనే అవసరం పడదు. నేను కంచంలో వదిలేసే అన్నం చూసి, పని మనిషి బాధ పడుతుంది. ఇంతకంటే తక్కువ వండడం కష్టం అని వలలి వాదన. ఈ వయసులో ఎంత తక్కువ తింటే అంత మంచిది అనేది నా థియరీ. మా అన్నయ్య, లేదా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ మీల్స్ ఎలాగూ తప్పదు.
సోమవారం సాయంత్రం వంటింట్లో చప్పుడు అవుతుంటే వెళ్లి చూశాను. నందిక వంటింటి సామాగ్రి సర్దుతూ కనిపించింది. ఎందుకమ్మా ఈ చాకిరీ అన్నాను. తీరా చూస్తే ఆరు నెలల కింద కొనిపెట్టి పోయిన సరుకులు. తెలివికల అమ్మాయి కనుక స్కాన్ చేసి పనికిరాని సరుకులన్నీ పెద్ద గోతాములో పెట్టింది. గిన్నెలు, స్టీల్ డబ్బాలు అన్నీ సదిరిపెట్టింది.
ఎలా అయినా ఆడపిల్లలు ఆడపిల్లలే. నిషా పోలికే ఈ అమ్మాయికి వచ్చింది. పోలిక సంగతేమో కానీ మా ఇంటికి మళ్ళీ వెలుగు వచ్చింది.





(08-12-2025)
(ఇంకావుంది)

8, డిసెంబర్ 2025, సోమవారం

అడిగి తెచ్చుకున్న పుస్తకం – భండారు శ్రీనివాసరావు

 

“చదవాలని అనిపించిన ప్రతి పుస్తకం కొనతగ్గదే!”

ఈ కొటేషన్ నాది కాదు.

నిన్న ఆదివారం ఉదయం ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. వెళ్ళే సరికి వేదిక మీదికి అతిధులను ఆవిష్కరించే క్రతువు కొనసాగుతోంది.  బయట పుస్తకాన్ని అమ్మే ఏర్పాటు ఏమైనా చేశారా, కొనుక్కుని వెడదామని ఒకపరి పరికించి చూసి,  అలాంటిదేమీ లేదని నిర్ధారించుకుని లోపలకు వెళ్లాను.

మిత్రుడు, పాత్రికేయుడు, బహురూపి, సౌమ్యుడు ములుగు రాజేశ్వరరావు రాసిన ( నేను – బహువచనం, అధినాయక జయహే” గేయ సంపుటి) రెండు పుస్తకాలను  ఒకే వేదిక మీద,  ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ  మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ కందా ఆవిష్కరించారు. తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథి. వేదిక మీద జర్బలిస్తులే కాదు, వివిధ రంగాలకు చెందిన ఘనాపాటీలు వున్నారు.

అందరూ తమ ప్రసంగాలలో,  రాజేశ్వరరావు గురించి నేను పైన పేర్కొన్న విశేషణాలనే ప్రముఖంగా  ప్రస్తావించారు. అది సహజం.  పాతిక ముప్పయ్ ఏళ్ళకు పైగా ఆయనతో పరిచయం వున్న మాబోంట్ల అభిప్రాయం అదే. అయితే ఈ పుస్తకంలో అంటే తన ఆత్మ కధలో ఆయన రాసుకున్న రాజేశ్వరరావు వేరే. అయన లోపలి మనిషి గురించి మాలో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. తెలిసిన తర్వాత, ఇంటి పేరు ములుగు,  కానీ రాజీపడని రాజేశ్వరరావు అని పేరు పెట్టుకుని వుంటే బాగుండేది అనిపించింది.

పుస్తకానికి వేసిన ముఖచిత్రంలో ఆయన ఈ రెండో వ్యక్తిత్వం స్ఫుటంగా కనిపిస్తుంది. ఒక నిచ్చెన, దాని మూడో మెట్టు మీదనే కాటు వేయడానికి సిద్ధంగా వున్న పాము. దాని నుంచి తప్పించుకుని కిందికి జారడం.  మళ్ళీ ఎక్కే ప్రయత్నం మాత్రం మానలేదు.  చివరికి నిచ్చెన చివరి మెట్టు ఎక్కాడా అంటే అదీ లేదు. ముప్పయి ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాడో అక్కడే వున్నాడు. నిఖార్సయిన జర్నలిస్టులు చాలా మంది పరిస్థితి ఇదే. దీనికి ప్రధాన కారణం వాళ్ళ ఎడమ కాలు గట్టిది. నచ్చకపోతే, ఎంతో నచ్చి సంపాదించుకున్న  ఆ ఉద్యోగాన్ని ఎడమకాలితో తన్ని బయటకు వస్తారు. రాజేశ్వర రావు అదే బాపతు కనుక ఎన్నో పత్రికల్లో పనిచేసినా ఎక్కడా కుదురుకున్నది లేదు. అలాగని రాజీ పడి జీవితాన్ని సరిదిద్దుకున్నదీ లేదు.

నేను ఈ పుస్తకాన్ని సమీక్షించడం లేదు. ఎందుకంటే ఎవరికి వారు చదువుకుంటే ఇందులోని థ్రిల్ అర్థమవుతుంది.

ఇది చదివిన తర్వాత ధన్యవాదాలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు. అతడి పేరు కూడా నాకు తెలియదు.

అతడు రాజేశ్వర రావు పెద్ద కుమారుడు.

“నాన్నా! నువ్వు జర్నలిష్టువి. ఎన్నో రాస్తుంటావు. మరి నీ ఆటో బయాగ్రఫీ రాయొచ్చు కదా!”

“నేనేంటో మీకు తెలుసు కదా! మళ్ళీ అదెందుకు”

“ మాకు తెలిసిన నాన్న గురించి కాదు. తెలియని నాన్న గురించి”

ఈ షాక్ నుంచి పుట్టిందే ఈ పుస్తకం.

“నేను”

దీనికి ఓ ట్యాగ్ లైన్ “ బహువచనం”

అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వున్నారని కవి హృదయం కావచ్చు.

“అఖండ విజయాలు, ఘోర వైఫల్యాలు” ఏదీ దాచుకోలేదు. ముళ్ళ బాట మీద పూలు చల్లుకుంటూ నడవడానికి వెనుకాడ లేదు.

కాపీ రైట్ హక్కులు రచయితవి. సమీక్ష పేరుతొ మొత్తం రాస్తే బాగుండదు. కనుక ఇంతటితో స్వస్తి.

అందరూ, ముఖ్యంగా జర్నలిజంలో చేరాలని ఆసక్తి వున్నవారందరూ చదవాల్సిన పుస్తకం. వెల: రు. 180/- (ముచ్చటగా ముద్రించిన తీరుకు ఇవ్వొచ్చు ఈ ఖరీదు) ఆన్ లైన్ లో దొరికే చిరునామా: Active Citizens Club, Flat 3-B, Sai Savitri Apartments, SBI Officers Colony, Bagh Amberpet, Hyderabad- 500013

తోక టపా:

ఉబెర్లో పడి ఇంటికి చేరి ఆత్రంగా పుస్తకం తెరిచి చూస్తే,  మొదటి పుటలోనే కర్రు కాల్చి పెట్టిన వాత.

“చదవాలని అనిపించిన ప్రతి పుస్తకం కొనతగ్గదే”

దటీజ్ రాజేశ్వర రావ్ !

(08-12-2025)




(08-12-2025)