20, డిసెంబర్ 2025, శనివారం
చిన్న చిన్న సంతోషాలు
17, డిసెంబర్ 2025, బుధవారం
అయాం ఎ బిగ్ జీరో : ( 249 ) : భండారు శ్రీనివాసరావు
ఆకాశంలో సగం : సగం అబద్ధం
‘ఆఫీసు పనిమీద మూడు రోజులు హైదరాబాదు
వస్తున్నాను. అదీ మీ పెళ్లి రోజున. మీకు
ఏమి తేవాలి పాపా’
అన్నది నా పెద్ద కోడలు భావన అమెరికా నుంచి.
‘నాకు ఇక్కడ లోటు ఏమున్నది? వచ్చి
కొద్ది రోజులు వుంటాను అంటున్నావు, అంతకంటే నాకేమి కావాలి ఈ వయసులో’ అన్నాను నేను.
అన్నట్టే డిసెంబరు పదహారు సాయంత్రం వచ్చింది.
విమానం ఆలస్యం కావడంతో ఇంటికి వచ్చేసరికి ఏడున్నర అయింది. కబుర్లు చెప్పుకుంటూ
భోజనం చేసేసరికి పొద్దు పోయింది.
మరునాడు ఉదయం లేచే సరికి ఇదీ సీను. మనసు ఎటో
వెళ్ళిపోయింది.
‘మీరలా
కాసేపు ప్రెస్ క్లబ్ కి వెళ్లి రండి. ఇంట్లో వుండి ఇలా కాళ్ళకు చేతులకు అడ్డం
పడుతూ, వచ్చిన
పనివాళ్ళని కసురుకుంటూ వుంటే ఇల్లు సర్దడం ఇప్పట్లో కాదు’ అనేది మా ఆవిడ మేము
ఇల్లు మారినప్పుడల్లా.
అన్నీ ఒక పద్దతిగా చేయాలనేది నా థియరీ, అసలు ఏ
పద్దతి నాకు తెలియకపోయినా.
ముందు బీరువాలు పెట్టాలి, తర్వాతే
మంచాలు. అప్పుడు అన్నీ తేలిగ్గా అమరుతాయి. ఆ మాటే వచ్చిన
వర్కర్లతో చెప్పాను అంటే మా ఆవిడ వినిపించుకునేది కాదు. ‘చెబితే చెప్పారు, అలా
కసురుకుంటూ చెప్పడం ఏమిట’ని లా పాయింటు తీసేది. దాంతో ఆమె చెప్పినట్టే ఎక్కడో
కాలక్షేపం చేసి ఇంటికి వచ్చేసరికి చిందరవందరగా వున్న ఇల్లు కాస్తా కడిగి తుడిచిన
అద్దంలా కనిపించేది.
మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత నిద్ర లేచి చూసేసరికి
ఇల్లు కడిగిన అద్దంలా వుంది.
తెల్లవారుఝాము వరకూ ఆన్ లైన్ లో ఆఫీసు పని చేస్తూ,
తెల్లవారగానే ఇల్లు సదిరే కార్యక్రమం పెట్టుకుంది. ఆడ దక్షత లేని ఇల్లు ఎలా
వుండాలో అలా వుంది. విషయం గ్రహించిన పిల్ల కనుక పొద్దున్నే ఈ పని పెట్టుకుంది. ఎందుకమ్మా
ఈ శ్రమ అని అడిగితే జెట్ లాగ్ తప్పించుకోవడానికి అని నా నోరు మూయించింది.
స్త్రీ జాతిని 'ఆకాశంలో సగం' అంటూ
పొగడ్తలతో ఆకాశానికి ఎత్తే వాళ్లు నేటి సమాజంలో ఎక్కువగానే కానవస్తారు. చేతల
దగ్గరికి వచ్చేసరికి ఈ మాటలు నీటి మూటలుగానే మిగిలిపోవడం కద్దు.
కొన్నేళ్ళ క్రితం ఒక వార్త కొన్ని పత్రికల్లో
చాలా చిన్నగా వచ్చింది. ఆ వార్తకు ఇవ్వాల్సినంత ప్రాముఖ్యం ఇవ్వలేదేమో, ఆ
అంశానికి దొరకాల్సినంత ప్రాచుర్యం లభించలేదేమో అనిపించింది, చదివిన
తర్వాత. ఆ వార్త ఏమిటంటే-
ఆన్ లైన్ వ్యాపారం చేస్తున్న ఫ్లిప్ కార్ట్ అనే
ఒక సంస్థ యాజమాన్యం, తమ
దగ్గర పనిచేసే మహిళా సిబ్బందికి కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఉద్యోగినులకు
ఇచ్చే ప్రసూతి సెలవులను ఇరవై నాలుగు వారాలకు పెంచింది. అంటే సుమారు ఆరు మాసాలపాటు
జీతంతో కూడిన సెలవు. అంతే కాదు, ప్రసూతి సెలవు అనంతరం తిరిగి విధుల్లో చేరే
ఉద్యోగినులకు నాలుగు నెలలపాటు పనివేళల్లో, వారికి వీలయిన సమయాల్లో పనిచేసుకునే వెసులుబాటు
కల్పించింది.
చట్టం ప్రకారం ఉద్యోగినులకు
ఇవ్వాల్సిన సెలవుల్ని మించి ఈ కంపెనీ తమ మహిళా సిబ్బందికి ఈ సదుపాయాలను కల్పించడం
విశేషం.
సరే. షరా మామూలుగానే ఈ రాయితీలకు వక్ర భాష్యాలు
వెలువడ్డాయి. తమ సంస్థలో పనిచేసేందుకు అధిక సంఖ్యలో ఆడవారిని ఆకర్షించేందుకు
ఫ్లిప్ కార్ట్ కంపెనీ ఈ నిర్ణయాలు తీసుకుందని వాటి తాత్పర్యం.
వెనుక కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న సోవియట్
యూనియన్ లో ఆడవారికి ఈ రకమైన రాయితీలు ఇవ్వడం నేను స్వయంగా చూసాను. గర్భవతులయిన
ఉద్యోగినులకు, గర్భం
ధరించిన సమాచారం తెలియచేసినప్పటి నుంచి, సుఖ ప్రసవం జరిగి, పుట్టిన బిడ్డ బుడి బుడి నడకలు నడిచే
వయస్సు వచ్చేవరకు ఆ బిడ్డ ఆలనా పాలనా కనిపెట్టి చూసుకునేందుకు వీలుగా తల్లులకు
జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు.
నిజానికి గత రెండు దశాబ్దాల కాలంలో మనదేశంలో
మహిళలు గణనీయమైన
పురోగతి సాధించడం కళ్ళారా చూస్తున్నాం. ఓ అరవై ఏళ్ళక్రితం ఆడపిల్ల
ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టడం కనాకష్టం. 'ఆడపిల్లకు చదువెందుకు, ఇంట్లో
ఏవో పద్దులు రాసుకునే అక్షర జ్ఞానం వుంటే చాలు' అని పెద్దవాళ్ళు అంటూ వుండడం నాకెరుక. నూటికో
కోటికో చదువుకున్న ఆడవాళ్లు కనిపిస్తే విడ్డూరంగా చూసే కాలం గడిచిపోయి ఎన్నో ఏళ్ళు
కాలేదు. సైకిల్ తొక్కే ఆడపిల్లల్ని రౌడీ పిల్లలు అనేవాళ్ళు. లంగా ఓణీ కాకుండా
చుడిదార్ వేసుకుంటే నోటితో కాకపోయినా నొసటితో వెక్కిరించేవాళ్ళు.
మార్పు అనేది కాల ధర్మం. అందుకే కాలం మారింది.
ఇంకా మారుతోంది. మగా ఆడా తేడా చదువుల్లో లేకుండా పోయింది. కాకపొతే, చదువుకున్న
ఒక తరం ఆడవాళ్ళు, చదివిన
చదువుకు సార్ధక్యం లేకుండా మళ్ళీ గృహిణులుగానే ఇంటి పనులకు పరిమితం అయిపోయారు.
దానితో, 'చదువుకుని ఏం
చేస్తారు ఉద్యోగాలు చేస్తారా, వూళ్ళు ఏలాలా?' అనే కొత్త వ్యంగ్యాస్త్రాలు వ్యవహారంలోకి
వచ్చాయి.
ముందే చెప్పినట్టు మారుతూ పోవడం కాల ధర్మం.
తరువాతి తరం ఆడపిల్లలు మగ పిల్లలతో పోటీలు పడి చదువుల్లో రాణిస్తూ వస్తున్నారు.
ఉద్యోగాలు చేస్తున్నారు. వేడి నీళ్ళకు చన్నీళ్ళ మాదిరిగా వారి సంపాదనలు కుటుంబ
ఖర్చులకు అవసరం కావడంతో మగవాళ్ళే సర్దుకుపోయి, ఉద్యోగం చేసే ఆడపిల్లలకి పెళ్లి
చూపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టారు. అంతటితో మార్పు ఆగలేదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా, ఆర్ధిక
సంస్కరణల పుణ్యమా అని రాత్రింబవళ్ళు పనిచేయాల్సిన కొత్త కొలువులు వచ్చి పడ్డాయి.
వాటికి తగ్గట్టే మంచి మంచి జీత భత్యాలు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఆ జీతాలు
కూడా సంసారాలకు తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. ఈ ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు
ఈనాడు లెక్కకు మిక్కిలిగా కనిపిస్తున్నారు. మగ పిల్లల మాదిరిగానే కన్న
తలితండ్రులను, వున్న
వూరినీ విడిచి వెళ్ళి పరాయి వూళ్లల్లోనే కాదు, పరాయి దేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ
రీత్యా ఆర్దిక
స్వాతంత్రం అయితే ఆడవారికి కొంత వరకు వచ్చింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఆ మేరకు
వారికి లభిస్తోందా అంటే చప్పున జవాబు చెప్పలేని పరిస్తితి.
ఉదాహరణకు సినీ రంగంలో రాణిస్తున్న తారల సంగతే
తీసుకుందాం. ఆదాయం బాగానే వున్నా మగ తారల మాదిరిగా సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కాపాడుకోలేని
పరిస్తితి ఆ రంగంలో ఎక్కువ. అన్నింటికీ ఎవరిమీదనో ఆధారపడాల్సిన స్తితే.
సరే! ఇవన్నీ బాగా చదువుకుని, బాగా
సంపాదిస్తూ వున్న మహిళల సంగతి. కుటుంబ ఆర్థిక స్తితి గతులు మెరుగు పరచడంలోనే కాదు, దేశ
ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో
కూడా వీరి పాత్ర తక్కువేమీ కాదు. ఆ మేరకు వారికి జాతి రుణపడి వుండాలి.
మరో రకం ఆడవారు కూడా వున్నారు. నిజానికి వీరి
జనాభానే అధికం. వీరు చదువు సంధ్యలు లేనివాళ్ళు. అధవా చదువుకున్నా ఏదో నాలుగు పొడి
పొడి అక్షరం ముక్కలే. చిన్న చిన్న పనిపాట్లు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్న
వారు. తమ కుటుంబాలకు ఆర్ధికంగా సాయపడుతున్నవారు. సంపాదన వుందన్న మాటే కాని దానిపై
పెత్తనం బొత్తిగా లేనివాళ్ళు. గ్రామాల్లో పొలం కూలీలుగా పనిచేసుకుంటూ, బస్తీల్లో
అయితే నాలుగిళ్లల్లో
పాచి పనులు చేసుకుంటూ, నాలుగు
రాళ్ళు పోగేసి మొగుడి చేతిలో పోసి చేతులు దులుపుకునే వాళ్లు. తమ చెమటతో తడిసిన ఆ
సొమ్మును వాళ్లు తాగుడు కోసం తగలేస్తున్నా నోరు తెరిచి అడగలేని మూగవాళ్ళు. వీరికి
బొత్తిగా ఆర్ధిక స్వాతంత్రం లేదు, పోనీ వ్యక్తిగత స్వేచ్చ వుందా అంటే అదీ లేదు.
మరబొమ్మల్లా కాయకష్టం చేసి నాలుగు డబ్బులు సంపాదించడం తప్ప.
మరో వివక్షకు కూడా వీరు గురవుతున్నారు. చేసేది
ఒకే పని అయినా దినసరి కూలీ డబ్బులు ఆడవారికి వేరే, మగవారికి వేరే. ఆడవాళ్లు చేసే ఇంటి
పనిని కూడా పరిగణనలోకి తీసుకుంటే, బయట పనిపాటుల్లో వారికి ముడుతున్నది నామమాత్రమే.
ఇలాటివారు నేటి సమాజంలో ఎల్లెడలా కనిపిస్తారు.
పనికి తగ్గ వేతనాలు వుండవు. పని వేళలూ వుండవు. రాత్రీ పగలూ తేడా లేకుండా
పనిచేస్తారు. పనిచేసిన రోజున బాగా చేసావు అనేవాళ్ళూ వుండరు. పనికి రాని రోజున 'మా
నాగాల రాణి ఇవ్వాళ రాలేదు,
ఎగనామం
పెట్టింది' అనే
సన్నాయి నొక్కులకు మాత్రం తక్కువ వుండదు. మరి వీరి జీవితాలు మారేదెన్నడో!
అరవై ఏళ్ళ క్రితం గడప దాటని ఆడవాళ్ళను చూసాను.
అదే కళ్ళతో చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళను ఈనాడు చూస్తూ వున్నాను.
కాల ధర్మం మీద నమ్మకం వున్నవాడ్ని. చివర చెప్పిన
బడుగు బలహీనవర్గాల
ఆడవారికి
కూడా మంచి కాలం రాకపోతుందా?
నేను
చూడక పోతానా?
కింది ఫోటో: ఇంటి సంప్రోక్షణకు నడుం బిగించిన
పెద్ద కోడలు భావన ( వాళ్లకు సోషల్ మీడియాలో కనబడడం అస్సలు నచ్చదు. అందుకే యాంగిల్
మార్చి ఫోటో తీశాను)
(ఇంకావుంది)
15, డిసెంబర్ 2025, సోమవారం
అయాం ఎ బిగ్ జీరో (248) : భండారు శ్రీనివాసరావు
13, డిసెంబర్ 2025, శనివారం
అయాం ఎ బిగ్ జీరో (247) : భండారు శ్రీనివాసరావు
12, డిసెంబర్ 2025, శుక్రవారం
ఎన్నాళ్లగానో చదవాలని అనుకుంటున్న పుస్తకం
పాత్రికేయ మిత్రుడు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు ఎస్. వినయ్ కుమార్ రాసిన ఆత్మ కధ- పేపర్ బాయ్ టు ఎడిటర్ - ఇన్నాళ్లకు ఇంటికి చేరింది. ఆనందంతో కూడిన కృతజ్ఞతలు.
10, డిసెంబర్ 2025, బుధవారం
అయాం ఎ బిగ్ జీరో (246) : భండారు శ్రీనివాసరావు
8, డిసెంబర్ 2025, సోమవారం
అడిగి తెచ్చుకున్న పుస్తకం – భండారు శ్రీనివాసరావు
“చదవాలని అనిపించిన ప్రతి పుస్తకం కొనతగ్గదే!”
ఈ కొటేషన్ నాది కాదు.
నిన్న ఆదివారం ఉదయం ఒక పుస్తక ఆవిష్కరణ
కార్యక్రమానికి వెళ్లాను. వెళ్ళే సరికి వేదిక మీదికి అతిధులను ఆవిష్కరించే క్రతువు
కొనసాగుతోంది. బయట పుస్తకాన్ని అమ్మే ఏర్పాటు
ఏమైనా చేశారా, కొనుక్కుని వెడదామని ఒకపరి పరికించి చూసి, అలాంటిదేమీ లేదని నిర్ధారించుకుని లోపలకు
వెళ్లాను.
మిత్రుడు, పాత్రికేయుడు, బహురూపి,
సౌమ్యుడు ములుగు రాజేశ్వరరావు రాసిన ( “నేను –
బహువచనం,
అధినాయక జయహే” గేయ సంపుటి) రెండు పుస్తకాలను ఒకే వేదిక మీద, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ మోహన్ కందా
ఆవిష్కరించారు. తెలంగాణా మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కె. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథి.
వేదిక మీద జర్బలిస్తులే కాదు, వివిధ రంగాలకు చెందిన ఘనాపాటీలు వున్నారు.
అందరూ తమ ప్రసంగాలలో, రాజేశ్వరరావు గురించి నేను పైన పేర్కొన్న విశేషణాలనే
ప్రముఖంగా ప్రస్తావించారు. అది సహజం. పాతిక ముప్పయ్ ఏళ్ళకు పైగా ఆయనతో పరిచయం వున్న
మాబోంట్ల అభిప్రాయం అదే. అయితే ఈ పుస్తకంలో అంటే తన ఆత్మ కధలో ఆయన రాసుకున్న
రాజేశ్వరరావు వేరే. అయన లోపలి మనిషి గురించి మాలో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు.
తెలిసిన తర్వాత, ఇంటి పేరు
ములుగు, కానీ రాజీపడని రాజేశ్వరరావు అని
పేరు పెట్టుకుని వుంటే బాగుండేది అనిపించింది.
పుస్తకానికి వేసిన ముఖచిత్రంలో ఆయన ఈ రెండో
వ్యక్తిత్వం స్ఫుటంగా కనిపిస్తుంది. ఒక నిచ్చెన, దాని మూడో మెట్టు మీదనే కాటు
వేయడానికి సిద్ధంగా వున్న పాము. దాని నుంచి తప్పించుకుని కిందికి జారడం. మళ్ళీ ఎక్కే ప్రయత్నం మాత్రం మానలేదు. చివరికి నిచ్చెన చివరి మెట్టు ఎక్కాడా అంటే అదీ
లేదు. ముప్పయి ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాడో అక్కడే వున్నాడు. నిఖార్సయిన
జర్నలిస్టులు చాలా మంది పరిస్థితి ఇదే. దీనికి ప్రధాన కారణం వాళ్ళ ఎడమ కాలు
గట్టిది. నచ్చకపోతే, ఎంతో నచ్చి సంపాదించుకున్న ఆ ఉద్యోగాన్ని ఎడమకాలితో తన్ని బయటకు వస్తారు.
రాజేశ్వర రావు అదే బాపతు కనుక ఎన్నో పత్రికల్లో పనిచేసినా ఎక్కడా కుదురుకున్నది
లేదు. అలాగని రాజీ పడి జీవితాన్ని సరిదిద్దుకున్నదీ లేదు.
నేను ఈ పుస్తకాన్ని సమీక్షించడం లేదు. ఎందుకంటే
ఎవరికి వారు చదువుకుంటే ఇందులోని థ్రిల్ అర్థమవుతుంది.
ఇది చదివిన తర్వాత ధన్యవాదాలు చెప్పాల్సిన
వ్యక్తి ఒకరున్నారు. అతడి పేరు కూడా నాకు తెలియదు.
అతడు రాజేశ్వర రావు పెద్ద కుమారుడు.
“నాన్నా! నువ్వు జర్నలిష్టువి. ఎన్నో
రాస్తుంటావు. మరి నీ ఆటో బయాగ్రఫీ రాయొచ్చు కదా!”
“నేనేంటో మీకు తెలుసు కదా! మళ్ళీ అదెందుకు”
“ మాకు తెలిసిన నాన్న గురించి కాదు. తెలియని
నాన్న గురించి”
ఈ షాక్ నుంచి పుట్టిందే ఈ పుస్తకం.
“నేను”
దీనికి ఓ ట్యాగ్ లైన్ “ బహువచనం”
అంటే నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది వున్నారని కవి
హృదయం కావచ్చు.
“అఖండ విజయాలు, ఘోర వైఫల్యాలు” ఏదీ దాచుకోలేదు. ముళ్ళ
బాట మీద పూలు చల్లుకుంటూ నడవడానికి వెనుకాడ లేదు.
కాపీ రైట్ హక్కులు రచయితవి. సమీక్ష పేరుతొ మొత్తం
రాస్తే బాగుండదు. కనుక ఇంతటితో స్వస్తి.
అందరూ, ముఖ్యంగా జర్నలిజంలో చేరాలని ఆసక్తి
వున్నవారందరూ చదవాల్సిన పుస్తకం. వెల: రు. 180/- (ముచ్చటగా ముద్రించిన తీరుకు ఇవ్వొచ్చు ఈ ఖరీదు) ఆన్
లైన్ లో దొరికే చిరునామా: Active Citizens Club, Flat 3-B, Sai
Savitri Apartments, SBI Officers Colony, Bagh Amberpet, Hyderabad- 500013
తోక టపా:
ఉబెర్లో పడి ఇంటికి చేరి
ఆత్రంగా పుస్తకం తెరిచి చూస్తే, మొదటి
పుటలోనే కర్రు కాల్చి పెట్టిన వాత.
“చదవాలని అనిపించిన
ప్రతి పుస్తకం కొనతగ్గదే”
దటీజ్ రాజేశ్వర రావ్ !
(08-12-2025)