29, సెప్టెంబర్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (224) : భండారు శ్రీనివాసరావు

 మై హు నా!

“Today again lots of fluctuations happening, please find the solution for transformer. We already lost 1.5 lakh worth of electric items due to these fluctuations.”

నేను వుంటున్న మధుబన్ అపార్ట్మెంట్ నివాసితుల గ్రూపులో మొన్న శనివారం నాడు నాకు కనపడిన మెసేజ్ ఇది. శని ఆది సెలవు రోజులు.  సోమవారం వర్కింగ్ డే కాబట్టి దాన్ని గురించి ఆలోచించలేదు.

ఈరోజు సోమవారం. నాకున్న మతిమరపు కారణంగా మరచిపోయాను. సాయంత్రం గుర్తుకు వచ్చి నాకు కొంత పరిచయం వున్నఒక ఉన్నతాధికారికి వాట్సప్ మెసేజ్ పెట్టాను. పెట్టిన సంగతి మరచిపోయాను.

 

మూడు దశాబ్దాలకు పూర్వం మాస్కోలో, రేడియో మాస్కోలో పనిచేసే అవకాశం నాకు లభించింది. 1990 లో ఓ సెలవు రోజున ఢిల్లీ నుంచి మాస్కో  వస్తున్న ఓ మిత్రుడిని రిసీవ్ చేసుకోవడానికి భార్యా పిల్లలతో కలిసి మాస్కో నగర పొలిమేరల్లో వున్న షెర్మేతోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి టాక్సీలో బయలుదేరాను. విపరీతంగా మంచు కురుస్తోంది. మార్గమధ్యంలో వుండగా కారు టైర్లు మంచులో  జారిపోయి ఓ పక్కకు వెళ్లిపోయింది. ఏం జరిగిందా అని ఆందోళన మొదలయ్యేలోగా, మంచుపొర  కమ్మిన కారు కిటికీ అద్దం వెనుక,  ఆరున్నర అడుగుల భారీ శరీరం కనిపించింది. నల్లటి యూనిఫారం చూడగానే అతడు ట్రాఫిక్ పోలీసు అని గుర్తు పట్టాను. ఇంత  మంచు వర్షంలో హఠాత్తుగా ఇతడెలా ప్రత్యక్షం అయ్యాడో అర్ధం కాలేదు. ఇప్పుడీ కేసు తేలేదాకా రోడ్డు మీద, పిల్లలతో  నానా అవస్థలు తప్పవేమో అని భయపడుతున్న సమయంలో, ఆ పోలీసు రెండు కాళ్ళు నేల మీద గట్టిగా చరిచి, ఫుల్ సెల్యూట్ చేయడంతో మా మొహాల్లో  భయం తగ్గిపోయి ఆశ్చర్యం ఆవరించింది. పౌరులకు అక్కడి పోలీసులు ఇచ్చే మర్యాద అని తరువాత తెలిసింది. అతడు ఆ మంచులో కారు దిగవద్దని మాకు  సైగలు చేస్తూ, వాకీ టాకీలో  మాట్లాడుతున్నాడు. కొద్ది నిమిషాల్లో మరో టాక్సీ వచ్చి ఆగింది. అందులోకి మమ్మల్ని ఎక్కించిన తర్వాతనే అతడు ట్రాఫిక్ కేసు విషయం చూసుకోవడం మొదలు పెట్టాడు. కేసు విచారణ పేరుతొ మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించని అతడి తీరు, మమ్మల్ని ఎంతగానో  విస్మయపరచింది.

చాణక్యుడు చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. 

 

యాభయ్, అరవై  ఏళ్ళ క్రితం: 

ఒకసారి మా వూరికి  పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. 

ప్రోగ్రాం ప్రకారం  ఆయన మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.

మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో దూరంగా  జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది, మంత్రిగారు  వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.

ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.

అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. ఊరి పోలిమేరల వరకూ వచ్చి కూడా  ఊరిలోకి వెళ్ళే  దారి తెలియక చాలాసేపు ఇబ్బంది పడిన విషయం ఆయన చెప్పేదాకా తెలియదు. అంత అధ్వాన్నంగా ఉండేవి ఆ రోజుల్లో  రహదారి సౌకర్యాలు. మా ఊరికి అయితే బండ్ల బాట మినహా వేరే దారిలేదు. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి మంత్రిగారు  నిష్క్రమించారు. 

సరైన రోడ్డు సదుపాయం లేక  ఆ ప్రాంతపు ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వయంగా అనుభవం లోకి రావడం వల్లనేమో, ఢిల్లీ వెళ్ళగానే ఆ విషయంపై దృష్టి పెట్టినట్టున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకే శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక  గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి. స్తంభాలు, కంకర, సిమెంటు వగైరా ప్రభుత్వం ఇస్తుంది.

కే ఎల్ రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు. ఇన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత కూడా ఆ గ్రామాల ప్రజలు ఆ రోడ్డుని కేఎల్ రావు గారి రోడ్డనే పిలుస్తారు.

ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా వెంటనే గుర్తొచ్చేది చాణక్యుడి సూక్తే. 

ఇదీ పాత ముచ్చటే.  

కొన్నేళ్లుగా  జంట నగరాల్లో కరెంటు కోతలు లేకుండాపోయాయి. 

అయినా కానీ, ప్రజలకు కరెంటు కష్టాలు పూర్తిగా తొలగిపోయాయని చెప్పే పరిస్థితి లేదు.

అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాలకు కూడా ఈ అవస్థలు తప్పడం లేదు.

ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. పౌరుడికి ఒక సమస్య ఎదురయినప్పుడు

దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెడదామని అనుకుంటాడు. స్పందించే అధికారి వుంటే చాలు, సగం సమస్య తీరిపోయినట్టుగా అతడు భావిస్తాడు. అన్ని సమస్యలకు ఏదో ఒక పరిష్కారం అంటూ వుంటుంది. కొన్నిటికి తక్షణ ఉపశమనం లభిస్తే మరి కొన్ని నిదానంగా

పరిష్కారమవుతాయి.

మేము ఉంటున్న ప్రాంతంలో విద్యుత్ సరఫరాలో కోతలు లేవు. కానీ అంతరాయాలు

వున్నాయి. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళడానికి ఇప్పుడు సాంఘిక మాధ్యమాలు అందుబాటులో వున్నాయి. 

నాకు తెలిసిన విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం చేస్తూ వస్తున్నాను. గతంలో కూడా మా ప్రాంతవాసుల సమస్యలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే కొన్ని సార్లు మునిసిపల్ అధికారులు తక్షణం స్పందించారు. అలాగే మరో అనుభవం.

ఒకరోజు రాత్రి కాసేపు కరెంటు పోయింది. లిఫ్ట్ లో ఒక పెద్దావిడ చిక్కుకు పోయింది.

కాసేపటికి కరెంటు వచ్చింది. ఆ పెద్దావిడ మా అపార్ట్ మెంటులో ఎవరినో

చూడడానికి వచ్చింది. లిఫ్ట్ ఇబ్బంది పెట్టడంతో గాభరా పడిపోయింది. ఇది

చూసి రాత్రి పొద్దుపోయిన తర్వాత నేను ఒక పోస్ట్ పెట్టాను.

వేసవికాలం ప్రవేశించింది. నిరంతర విద్యుత్ సరఫరా విషయంలో పౌరుల

ప్రేమయాత్ర ముగిసింది అనుకోవాలా!  అటక ఎక్కించిన పవర్ ఇన్వర్టర్లను, జెనరేటర్లను

మళ్ళీ కిందికి దింపాలేమో! ఇలా చెప్పడానికి కాసింత  సిగ్గుపడుతున్నాను”

కఠినంగా రాశానేమో అని నాకే తరువాత అనిపించి ఆ పోస్ట్ తీసి వేశాను.

యథావిధిగా ఆవిషయం మరచిపోయాను.

మరునాడు మధ్యాన్నం కాబోలు అయిదారుగురు మా ఇంటికి వచ్చారు.

పొద్దున్న చైర్మన్ ప్రభాకరరావు గారు ఫోన్ చేశారు”

వారిలో ఒకరు ఈ మాట అంటూ, తనని తాను పరిచయం చేసుకున్నారు.

ఆయన గారి పేరు ఆనంద్. ట్రాన్స్ కోలో  సూపర్ ఇన్ టె౦డింగ్ ఇంజినీరు.

మిగిలినవాళ్ళు డీఈ, ఏడీయీలు, ఏఈలు.

సమస్య ఏమిటని అడిగారు. నేను చెప్పింది విన్నారు. అప్పటికే ఆశ్చర్యంలో

మునిగిపోయి ఉన్న నాకు ఆయన తన సెల్ ఫోన్ లో రికార్డ్ అయిన కొన్ని విషయాలు

చెప్పారు. అది వింటుంటే నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. 

మా ప్రాంతంలో ఈ నెలలో అయిదు సార్లు కరెంటు పోయిందని చెబుతూకరెంటు పోయిన

టైమును, మళ్ళీ వచ్చిన సమయాన్ని వివరాలతో సహా చూపించారు. నాలుగుసార్లు ఈ

ఎల్ (ఎర్త్ లీకేజీ), ఒకసారి ఓఎల్ (ఓవర్ లోడ్) వల్ల సరఫరాకు అంతరాయం

కలిగినట్టు రికార్డులలో వుంది.

ఎస్ ఈ గారి అధీనంలో మొత్తం 38 సబ్ స్టేషన్లు వుంటాయిట. ప్రతిరోజూ ఆ

ఏరియాల్లో ఎక్కడ, ఎన్నిసార్లు కరెంటు పోయిందనే వివరాలు ఎప్పటికప్పుడు అప్ డేట్

అవుతాయట. ఆ సమాచారం ఆధారంగా వెనువెంటనే సరఫరా పునరుద్ధరణకు రాత్రీ పగలూ ఇరవై నాలుగు గంటలు సిబ్బంది సిద్ధంగా వుంటారట.

సాధారణంగా చెట్ల కొమ్మలు నరికే సమయాలను ముందుగానే ఆయా వినియోగదారులకు

ఎస్సెమ్మెస్ ద్వారా తెలియచేస్తారట.

ఎంత ప్రయత్నం చేస్తున్నా తమ చేతిలో లేని కారణాల వల్ల సరఫరాలో ఆటంకాలు

కలుగుతున్న మాట నిజమే అని చెబుతూ, వాటిని సాధ్యమైనంత మేరకు తగ్గించడానికే

తాము, తమ సిబ్బంది నిరంతరంగా పనిచేస్తున్నామని చెప్పారు.

మా ప్రాంతంలో కరెంటు సరఫరాలో అంతరాయాలు లేకుండా చేయడానికి చేయవలసినది

చేస్తామని హామీ ఇచ్చారు.

ముందే చెప్పినట్టు సమస్య పరిష్కారం ముఖ్యమే కావచ్చు కానీ, సమస్యను విని,

నేనున్నాను కదా!’ అని భరోసా ఇచ్చేవాళ్ళు కూడా అంతే ముఖ్యం. అప్పుడే ప్రభుత్వం పనిచేస్తోందని జనం అనుకుంటారు. పనిచేసే ప్రభుత్వం అని మెచ్చుకుంటారు.

మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత అదే జరిగింది. నేను మెసేజ్ పంపిన ఆ ఉన్నతాధికారి అది చూశారు, చూసి వదిలేయ లేదు. తన సిబ్బందికి తగు ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు వచ్చారు. సమస్య విన్నారు. అర్ధం చేసుకున్నారు. వారు చేయగలింది చేశారు, ఇంత రాత్రా, రేపు వచ్చి చూస్తాం అనకుండా!  

మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత, చాణక్యుడి సూక్తి మరోమారు స్పురణకు వచ్చింది.

ఇంతకీ చాణక్యుడు ప్రవచించిన ఆ సూక్తి ఏమిటంటారా!

“సుపరిపాలన అంటే ప్రభుత్వ (రాజు)  ప్రమేయం లేని సాధారణ జన జీవితం, తక్షణం స్పందించే వ్యవస్థ”

వినడానికి బాగానే వుంది.

ఇలా అడపా దడపా కాకుండా చాణక్యుడి సూక్తి అనుదినం గుర్తుకు వచ్చే బంగారు రోజులు వస్తే ఎంత బాగుంటుందో!

(ఇంకావుంది)

28, సెప్టెంబర్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (223) : భండారు శ్రీనివాసరావు

“పెళ్ళికి ముందు”
“ విధి! అదేమిటో ఎన్నడూ కలిసి రాదు,
“తాజ్ మహల్ కడదామని అనుకున్నాను, కానీ ముంతాజ్ దొరకలేదు”
“పెళ్లి తర్వాత”
“తాజ్ మహల్ కడదామని అనుకున్నాను,
కానీ ముంతాజ్ చనిపోలేదు”
ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, అన్నమాచార్య భావనా వాహిని శోభారాజు గారు. ఈ మాటలు చెప్పింది ఎవరి గురించి? నా గురించే!
తరువాత ఆవిడగారు చెప్పిన మాటలు నన్ను మ్రాన్పడిపోయేలా చేసాయి.
“అయితే శ్రీనివాసరావు గారు ఇలాంటి మనిషి కాదు, భార్య బతికి వున్నప్పుడు ఆయన ప్రేమానురాగాలు ఆవిడ పట్ల ఎలా వున్నాయో, చనిపోయి ఇన్నేళ్ళు గడిచినా అవి చెక్కు చెదరకుండా అలాగే వున్నాయి. వారు రాసే ఆవిడ జ్ఞాపకాలే ఇందుకు సాక్ష్యం”
శోభారాజు గారు నాకు తెలిసినంతవరకూ అన్నమయ్య భావనలను జనంలోకి తీసుకువెళ్ళే నిర్విరామ కృషిలో తలమునకలుగా వుంటారు. అలాంటి వ్యక్తి దృష్టికి నా రాతలు ఎలా చేరాయి? అదే దైవ లీల.
నా చిన్నప్పుడు దత్తాత్రేయ శర్మ గారితో పరిచయం వుండి వుంటే, ఇప్పుడు మనిమాపు వయసులో మతిమరపుతో ఇబ్బంది పడాల్సిన అవసరం పడేది కాదేమో. శోభారాజ్ గారికి దత్తాత్రేయ శర్మ గారికి ఏమిటి లింకు అంటారా!
ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక రోజు ఉదయం మిత్రుడు జ్వాలా పూనిక మీద ఇంటికి పాతిక కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. జ్వాలా ముఖ్య అతిథి. నారుమంచి అనంత కృష్ణ శర్మగారు అధ్యక్షులు. ఈ రెండు పాత్రల్లో ఉభయులకీ అపార అనుభవం ఉంది. అంచేత చివరివరకూ సజావుగా ఆసక్తికరంగా సాగిపోయింది. ఇది చిన్న సైజు స్నాతకోత్సవం అని చెప్పాలి. అవధాన విద్యలో చక్కటి శిక్షణ పొందిన చిన్నారులు, యువతీ యువకులకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది.
అవధానానికి కావాల్సింది ధారణ శక్తి. నిజానికి ప్రతి విద్యార్థికి ఇది ఎంతో అవసరం. అలాగే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తే ముసలితనంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు అనే అభిప్రాయం నాకు ఆ క్షణంలో కలిగింది.
దత్తాత్రేయ శర్మగారు ఉపాధ్యాయుడిగా పనిచేసారు. పదవీ విమణ అనంతరం పిల్లలకు చిన్న నాటి నుంచే అవధాన ప్రక్రియలో శిక్షణ ఇచ్చే మేలుబంతి లాంటి కార్యక్రమాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నారు. దర్శనం శర్మగా ప్రసిద్ధులైన మరుమాముల శర్మ గారికి వీరు స్వయానా సోదరులు. సంకల్ప శుద్ధి వుంటే ఏదైనా సిద్ధిస్తుంది, సాధ్యమవుతుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సోదరులు వీరు.
తూముకుంటలోని సీతా రామభద్ర ఆలయం నిర్వాహకులు తగిన తోడ్పాటు అందించారు. మధ్యలో జ్వాలాతో కలిసి దైవ దర్శనం చేసుకున్నాను.
మెట్ల దగ్గరే దేవుడు కనిపించాడు. పాల బుగ్గల పసివాడు ఒకరు ఉద్ధరిణ, పంచపాత్ర ముందు పెట్టుకుని అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యాన ముద్రలో కానవచ్చాడు. అంతటి సంరంభం పక్కనే జరుగుతున్నా అతడి ఏకాగ్రత చెదరలేదు. బహుశా అవధాన శిక్షణ పొందిన కారణంగా ఇది సిద్ధించి వుండవచ్చు. అప్రయత్నంగా ఆ చిన్నారికి చేతులు జోడించి నమస్కారం చేశాను. నేను వయో వృద్ధుడిని. ఆ బాలుడు జ్ఞాన వృద్ధుడు.
ఈ కార్యక్రమానికి వెంటబెట్టుకుని వెళ్లిన జ్వాలాకి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాను.
ఇది ఒకనాటి మాట.
మళ్ళీ ఈరోజు (సెప్టెంబరు ఇరవై ఏడు, శనివారం) అలాంటి అనుభవమే. ఇంకా గొప్ప అనుభవం. ఇందులో ప్రధాన పాత్ర కూడా జ్వాలాదే. నేను నిమిత్త మాత్రుడిని.
మా మేనకోడలు శాంత కుమార్తె శ్యామల కుమారుడు తేజ పెళ్లి నిశ్చితార్థం. చివర వరకూ వెళ్ళాలా వద్దా అనే గుంజాటనే.
చివరికి వెళ్లాను. వధువు, వరుడు తరపు వాళ్ళు ఇద్దరూ నాకు దగ్గరి బంధువులు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తేడా లేకుండా పడుగుపేకల్లా కలిసిపోయి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో వయసులో అక్కడ అందరికంటే పెద్ద అనే పెద్దరికం నన్ను కొంత ఇబ్బంది పెట్టింది. చిన్నాపెద్దా అందరు వంగి నమస్కారాలు పెట్టే వాళ్ళే.
చుట్టపక్కాలు అందరూ కలిసారు. చాలా సేపు చాలా రోజుల తర్వాత కాలక్షేపం. భోజనానికి ముందూ, భోజనం చేస్తూ,ఆ తర్వాతా ఒకటే నవ్వులు, ఒకటే కబుర్లు. కొన్ని గంటలు ఆహ్లాదంగా గడిచిపోయింది.
అందరిలో అలా వుంటూ కూడా ఏదో తెలియని ఒంటరితనం.
ఇది గమనించినట్టున్నాడు నా చిన్న నాటి మిత్రుడు, నా మేనకోడలు మొగుడు అయిన జ్వాలా నరసింహారావు, కార్యక్రమం తర్వాత నా మరో మేనల్లుడు, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కొమరగిరి శ్రీ రామచంద్ర మూర్తి ఇంటికి తీసుకుపోయాడు.
వాడు వయసులో నాకంటే చాలా చిన్న. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో చాలా పెద్ద. ఆధ్యాత్మిక అంశాలతో ఎప్పుడు ఏ పోస్టు పెట్టినా సింహభాగం నా ఈ మేనల్లుడితో నేను జరిపిన మాటామంతీలో భాగమే. రామచంద్రం ఉంటున్న కాంప్లెక్స్ లోనే చిన్న బాలాజీ దేవాలయం ఉంది. చాలా ప్రశాంతంగా, తొడతొక్కిడి లేకుండా వుంటుంది. మా దురదృష్టం ఆ గుడి తెరవడానికి చాలా వ్యవధి వుంది. బయట నుంచే దణ్ణం పెట్టుకుని బయట పడ్డాము.
తరువాయి అడంగు, మాదాపూర్ హైటెక్స్ దాపులో వున్న శోభారాజు గారి అన్నమాచార్య భావనా వాహిని. నేను తప్పు రాస్తే మన్నించాలి. నాకు ఇటువంటి వాటి పట్ల పెద్ద ఆసక్తి లేదు. ఎప్పుడయినా వెళ్ళినా జ్వాలాతో పాటే.
వెళ్ళడం వెళ్ళడం అక్కడ వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి. అంతకు ముందు దర్శనం ఇవ్వని వాడు ఈ గుడిలో నిండు రూపంలో దర్శనం ఇచ్చాడు. వచ్చే డిసెంబరు పదహారో తేదీన మా పెళ్లి రోజు. 1971 లో మా పెళ్లి జరిగింది తిరుమల కొండపై. మళ్ళీ ఓసారి అదే రోజున అక్కడికి వెడితే ఎలా వుంటుంది అనిపించింది. సీనియర్ సిటిజన్స్ కోటాలో మా మరో మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్ చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఫలించలేదు. నాహం కర్తా హరి కర్తా. స్వామి అనుమతి లేనిదే ఎవరికీ దర్శనం దొరకదు అని పూజ్యులు పీవీ ఆర్కే ప్రసాద్ గారి అనుభవాలే చెబుతున్నాయి. నేనెంత అని సరి పుచ్చుకున్నాను.
అయితే ఈరోజు స్వామి నా కోరిక మరో విధంగా తీర్చాడు. జ్వాలా వెంటబెట్టుకుని తీసుకువెళ్ళిన అన్నమయ్య క్షేత్రంలో బ్రహ్మాండమయిన వేంకటేశ్వరుని దేవాలయం వుంది. కన్నుల పండువుగా స్వామి దర్శనం జరిగింది. మా పిల్లల గోత్ర నామాలతో అర్చన చేయించుకునే మహత్తర భాగ్యం లభించింది. ఆ దేవదేవుని చెంత ఎంతసేపు ఉన్నామో నాకే తెలియదు. ఇలా అనుకోకుండా స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అన్నట్టుగా తిరుమలలో అయినా, అన్నమయ్య క్షేత్రంలో అయినా ఆయన వైభవం ఆయనదే.
అసలు అంకం అప్పుడే మొదలయింది.
గత కొద్ది రోజులుగా అక్కడ ప్రతి సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి, శోభారాజు గారి ఆధ్వర్యంలో. ప్రతియేటా అక్కడ ఇది ఆనవాయితీ. ఈరోజు (అంటే నిన్న శనివారం సాయంత్రం) ప్రముఖ నాట్య కళాకారిణి ఉషా గాయత్రి బృందం చక్కటి ప్రదర్శన ఇచ్చింది. అనుకోకుండా నేత్ర పర్వంగా జరిగిన ఈ ప్రదర్శనను ఆసాంతం చూడడం జరిగింది. నా అభిరుచులు, ఆసక్తి కోణంలో చూస్తే ఇది అపూర్వమే అని చెప్పాలి. వేదిక మీద రాసి వున్న ఒక వాక్యం నన్ను ఆకర్షించింది.
“భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ”
“భావ దారిద్య్రం కన్నా భాషా దారిద్య్రం మేలు” అన్న ఒక కవి వాక్యం గుర్తుకు వచ్చింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మిత్రుడు జ్వాలా నరసింహారావు, ఆయన భార్య, నా మేనకోడలు శ్రీమతి విజయలక్ష్మి ప్రధాన ఆహ్వానితులు. నేను, మరో మిత్రుడు మావుడూరి ప్రసాద్. డాక్టర్ భరత్ ఒకరకంగా చెప్పాలంటే తోడుగా వెళ్ళిన తోడు పెళ్లి కొడుకులం. జ్వాలా మమ్మల్ని కూడా శోభారాజు గారికి పరిచయం చేశాడు.
ఇంతవరకు అతి కొద్ది సందర్భాలలోనే కలిసిన శోభారాజు గారితో నా పరోక్ష పరిచయం 38 ఏళ్ళ నాటిది. నేను నా కుటుంబంతో కలిసి మాస్కోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆ రోజుల్లో వ్యాపార పనుల నిమిత్తం మాస్కోకు తరచుగా వస్తుండే అప్పటి పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు, శోభారాజు గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనల ఆడియో కేసెట్లు తెచ్చి ఇచ్చేవారు. అవి క్రమంగా మాస్కోలోని తెలుగు లోగిళ్ళకు వెళ్ళేవి. ఆ విధంగా ఆమె చక్కటి గాత్రం అందరి ఇళ్ళల్లో మారుమోగేది. అలాంటి మధుర స్వరం కలిగిన శోభారాజు గారు, పైన చెప్పిన మాటలు వింటూ నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను.
2019 లో నా భార్య నిర్మల చనిపోయినప్పటి నుంచి పుంఖానుపుంఖాలుగా నేను సోషల్ మీడియాలో రాస్తూ వస్తున్న అంశాలను శోభారాజు గారు ప్రస్తావించారు. స్వయంగా చదివారో, లేక చదివిన వారు చెప్పగా విన్నారో నాకు తెలియదు కానీ పెళ్ళికి ముందు భార్య పట్ల భర్త ప్రవర్తన, పెళ్ళికి తర్వాత మారిపోయే నడవడిక గురించి హిందీలో ప్రాచుర్యం పొందిన కొన్ని పై వాక్యాలను ప్రస్తావించి, శ్రీనివాసరావు గారు దీనికి విరుద్ధం అని, భార్య పట్ల ఆయన ప్రేమానురాగాలు ఇన్నేళ్ళు అయినా చెక్కుచెదరలేదని అని అర్ధం వచ్చేలా మాట్లాడారు. బహిరంగ సమావేశంలో ఆమె నా పట్ల ప్రదర్శించిన ఈ అభివ్యక్తి నా నోరు పూడుకుపోయేలా చేసింది. ఆవిడకు మౌనంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలపడం మినహా ఏమీ చేయలేని అశక్తత నాది. మన్నించండి శోభారాజు గారు.
నాకు సంతోషం కలిగించిన మరో విషయం ఏమిటంటే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మరణించిన మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారిని సంస్మరిస్తూ ఆవిడ గారు నాలుగు మంచి ముక్కలు చెప్పడం.
ఒక రోజు ఇలా చిరస్మరణీయ దినంగా మారడానికి కర్తా, కర్మా, క్రియ అయిన మిత్రుడు జ్వాలాకి కృతజ్ఞతలు అనే ఒకే ఒక్క చిన్న పదంతో సరిపుచ్చడం అంటే నాకే నచ్చడం లేదు. ఆయన అర్ధం చేసుకుంటాడని ఆశ వుంది.
కింది ఫోటో: నన్ను శాలువాతో సత్కరిస్తున్న శోభారాజు గారు.



(ఇంకావుంది)
(28-09-2025)

23, సెప్టెంబర్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (222): భండారు శ్రీనివాసరావు

 

చీరే మేరే సప్నే
నా నలభయ్ అయిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి.
అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొచ్చిందని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ నాకు నేనుగా చీరెలు కొన్న పాపాన పోలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.
చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.
కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు.
అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొందలు పెట్టి, ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను. అంత వరకు బాగానే వుంది.
మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి.
చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాన్ని పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.
అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో, అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా మొహమాట పెట్టి ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు చెవిన పడ్డప్పుడు కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.
దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఆ తర్వాత ఎప్పుడూ మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.
నడిచి వచ్చిన జీవితం బాగా గుర్తుంది అని చెప్పడం పెద్ద అబద్ధం కాకపోయినా మన మనస్సుని మోసం చేసుకోవడమే.
1975 లో హైదరాబాదు వచ్చిన కొత్తల్లో చిక్కడపల్లిలోని మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో మెయిన్ రోడ్డుమీద, సుధా హోటల్ వద్ద సిటీ బస్ స్టాపు వుండేది. అక్కడి నుంచి నేరుగా రేడియో స్టేషన్ కు కాని, సెక్రెటేరియేట్ కు కానీ వెళ్ళాలంటే రామ్ నగర్ నుంచి విజయనగర్ కాలనీకి వెళ్ళే 139 నెంబరు బస్సు ఒక్కటే దిక్కు. ఒక్కటే అవటాన దానికి టెక్కు సహజం. అంచేత దాని రాకపోకలు అనూహ్యం. కావున, మన రూటుది కాకపోయినా మరో బస్సును పట్టుకుని ప్రయాణం చేయడం తప్పనిసరి. పైగా జేబులో ‘అన్ని సిటీ రూట్లలో ఉచిత ప్రయాణానికి సర్కారు (ఆర్టీసీ) వారిచ్చిన జర్నలిస్టు పాసు సిద్ధంగా వుండేది. అలా నిత్యం బస్సుల్లో తిరిగే రోజుల్లో సిటీ బస్సు ప్రయాణీకుల పాట్లు బాగా అర్ధం అయ్యేవి.
ఆ తరువాత కొన్నాళ్ళకు ఆటో శరణ్యం అయింది. అప్పుడు కానీ నాకు ఆటో బాధలు (ఆటో వారితో ప్రయాణీకుల బాధలు అన్నమాట) అర్ధం కాలేదు. రమ్మన్న చోటుకు రావడం వాళ్లకు ఇష్టం వుండేది కాదు. వాళ్ళు అలా రాననడం నాకు నచ్చేది కాదు. వాళ్ళతో ప్రతిరోజూ నా పొట్లాటలు మా ఆవిడకు నచ్చేవి కావు. సినిమాకని బయలుదేరి, ఆటోవాడు రానంటే, అతడు చెప్పిన చోటుకే తీసికెళ్ళమని అందులో ఎక్కి కూర్చుని మధ్యలో పోలీసు స్టేషన్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉండేవి. రోడ్డు మీద మన మాట చెల్లకపోయినా, పోలీసుల దగ్గర విలేకరిగా చెల్లుబాటయ్యేవి. ఇంతా చేసి మనం అడిగే ఫేవర్ ఒక్కటే, మీటరు మీద వచ్చే ఆటో మాట్లాడి పెట్టమని. వాళ్ళకది చిటికెలో పని. ఆ విధంగా ముందుకు పోతూ, కొంతమంది ఆటో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసేంతవరకు నా చేష్టలు శృతిమించడంతో, మా ఇంటిల్లిపాదీ స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే దీనికి తరుణోపాయమని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసారు.
కొన్నాళ్ళకు ఆ ముచ్చటా తీరింది. స్కూటర్ నడపడం మొదలెట్టాక, ఇక ద్విచక్ర వాహనదారుల కడగండ్లన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించడం మొదలయింది. హెల్మెట్ ఉదంతంతో ఆ అధ్యాయమూ ముగిసింది.
జీవితం అన్నాక ఒక్కోమెట్టు నింపాదిగానో, హడావిడిగానో ఎక్కుతుంటాం.
మరి అదేమి చిత్రమో, చూపు ఎక్కే పైమెట్టు మీదనే కానీ, ఎక్కివచ్చిన కింది మెట్టు మీద వుండదు.
కొసమెరుపు
1975 లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రోజు వారీ రాసి వడ్డించిన వాక్టూన్లలో ఒక వంటకం:
చీరే మేరే సప్నే
పండక్కి ఈ మారయినా
షాపులో చేసి అరువయినా
కనీసం కంచిపట్టు చీరయినా
కొని తీరాలి ఆరునూరయినా





(ఇంకావుంది)

20, సెప్టెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (221): భండారు శ్రీనివాసరావు

 ‘నిన్ను కలుసుకోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ అన్నారు మా న్యూస్ యూనిట్ లో  నా బల్లకు ఎదురుగా వున్న ఒక మామూలు ఫేమ్ కుర్చీలో కూర్చొంటూ మా సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీ, మొత్తం ఆలిండియా రేడియో, దూరదర్సన్ లతో కూడిన ప్రసార భారతి సీ ఈ ఓ  కె.ఎస్. శర్మ గారు. అంతవరకూ ఆయన మీద గొంతు వరకూ కోపం పెంచుకున్న నేను, ఆయన మాటలతో ఒక్కసారిగా చల్లబడిపోయాను.

అప్పటికి ఒక పదేళ్లు వెనక్కి వెడదాం.

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి మా డైరెక్టర్ కు ఫోన్ వచ్చింది.

‘మీ దగ్గర భండారు శ్రీనివాసరావు అనే పేరుగల వాళ్ళు పనిచేస్తున్నారా అని కలెక్టర్ గారు కనుక్కోమన్నారు అని వాకబు. అప్పుడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నది ఐ ఎ ఎస్ అధికారి శ్రీ కంభంపాటి సుబ్రమణ్య శర్మ. ఆయన బెజవాడలో చదువుకునే రోజుల్లో ఒక శ్రీనివాసరావు ఆయనకు స్కూల్లో క్లాసుమేటో, జూనియరో అట.  ఆ రోజు ఉదయం  రేడియోలో నా జీవన స్రవంతి ప్రోగ్రాం విన్న తరువాత కలెక్టర్ గారికి నా గురించి తెలుసుకోవాలని అనిపించిందట. సాయంత్రం ఆఫీసుకు వెళ్ళిన తరువాత ఈ విషయం నా చెవిన వేశారు. ఆ తరువాత ఆ సంగతి ఆయనా మరచిపోయారు, నేనూ మరచిపోయాను.

కరీంనగర్ కలెక్టర్ గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా. అక్కడ ఒక పాడుపడ్డ చెరువును పూడ్పించో , లేదా  ఆ జాగాను వేలం వేయించో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే గొడుగు కింద వుండేలా విశాలమైన పరిపాలనా విభాగాల సముదాయాన్ని నిర్మించారు. ఇటువంటి నిర్ణయాలను ప్రజలు హర్షించారు,  ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఏమైతేనేం సమర్ధుడు అయిన కలెక్టర్ గా పేరొచ్చింది. తరువాత ఆయన్ని హైదరాబాదుకు బదిలీ చేశారు,  విద్యుత్ బోర్డు కార్యదర్శిగా. ఒకటి రెండు సార్లు వెళ్లి కలిశాను వార్తల పనిమీద. ఒక క్లాసు మేటుగా ఆయన నన్ను గుర్తుపట్టలేదు. పట్టినా పైకి ఆ మాట అనలేదు. నా  సంగతి సరే!

చిన్నప్పుడు స్కూలుకు సరిగానే వెళ్ళే వాడిని కానీ అందరితో స్నేహం చేసే అవకాశం లేదు. మా బావగారు ఈ విషయంలో చాలా స్ట్రిక్టు.

ఆ తరువాత నా మకాం, చదువు ఖమ్మానికి మారాయి. ఆ తరువాత మళ్ళీ కాలేజి చదువుకు బెజవాడ. మధ్యలో ఎమ్మెసెం బండి (మార్చి – సెప్టెంబరు- మార్చి). ఈ లోగా క్లాస్ మేట్స్ సీనియర్లు, జూనియర్లు క్లాస్ మేట్స్, ఆ క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యారు. నా లాంటి వాళ్లకు క్లాస్ మేట్స్ ఏం గుర్తుంటారు?

ఖమ్మంలో చదివేటప్పుడు వెంకటేశ్వర రావు అనే తెలివికల విద్యార్థి నా క్లాసు మేట్. ఎంత తెలివి కలవాడు అంటే, నేను రేడియోలో ఉద్యోగం చేసేటప్పుడు నన్ను వెతుక్కుంటూ హైదరాబాదు వచ్చాడు. భోజనం చేసేటప్పుడు విషయం చెప్పాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం. బదిలీ అయింది. ‘నీకు శర్మగారు తెలుసు కదా! ఒక మాట చెప్పవా’ అన్నాడు. అదెంత భాగ్యం అని  వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాను. అతడిని బయట కూర్చోమని, నన్ను అడిగారు శర్మగారు, ‘మీ ఫ్రెండ్ ఎక్కడికి అంటే ఏ విభాగానికి బదిలీ కోరుతున్నాడో నీకేమైనా తెలుసా’ అని. ‘తెలియదు, శర్మగారు నీకు తెలుసా అంటే తెలుసు అని తీసుకువచ్చాను’ అన్నాను. ‘అది నాకు ముందే అర్ధం అయింది. ఈ బదిలీ చేయడం నాకు చిటికెలో పని. కానీ అతడు కోరుతున్నది నాలుగు రాళ్లు అదనంగా వచ్చే పోస్టు. తరువాత నీకూ నాకూ చెడ్డపేరు రాదని నువ్వు హామీ ఇవ్వగలవా!’ అన్నారు. ‘నాకు ఇవన్నీ తెలియదు, ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వదిలేయండి, నేను అతడికి సర్ది చెబుతాను’ అని వచ్చేశాను.

తరువాత కొన్నాళ్ళకు మా వాడికి కోరిన చోటుకు కోరిన పోస్టులో బదిలీ అయింది.  థాంక్స్ చెబుదాము అనుకుంటే శర్మగారు బదిలీపై కేంద్ర సర్వీసులకు ఢిల్లీ వెళ్ళారు.

ఇదొక కధ.

ఆ తరువాత నేను కుటుంబంతో సహా మాస్కో వెళ్లాను, రేడియో మాస్కోలో పనిచేయడానికి.

అక్కడ ఒక చిక్కొచ్చిపడింది.

రష్యన్ స్కూళ్ళలో విద్య పూర్తిగా ఉచితం. ప్రతి ఏరియాలో ఇంటి నుంచి నడిచిపోయే దూరంలో వుంటాయి ఆ స్కూళ్ళు. ఎక్కడైనా కొంచెం దూరంగా వుంటే, ఉచితంగా తీసుకువెళ్ళే స్కూలు  బస్సులు వుంటాయి. మధ్యాన్న భోజనంస్కూలు యూనిఫారాలు,  పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతే, మేము వెళ్ళిన సంవత్సరమే ఇండియన్ ఎంబసీ సిబ్బంది పిల్లకోసం మాస్కోలో కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ వారు  ఇండియన్ స్కూల్ ప్రారంభించారు.  అయితే ఫీజులు వుంటాయి.   రష్యన్ స్కూళ్ళలో చేర్పిస్తే ఇండియాకు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సి వచ్చింది.  

 అక్కడా ఎడ్మిషన్లు  అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్  గంగల్  కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు, రూబుళ్ళలో ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక,  ఆ రోజుల్లో ఢిల్లీలో  కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న కె యస్ శర్మ గారికి మాస్కోనుంచి ఫోన్ చేసి విషయం వివరించాను.

 ఆయన కూల్ గా విని,  రేపు ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కానిమా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది.

శర్మగారి మీద గొంతు వరకూ కోపం వచ్చిందన్నాను కదా! ఎందుకో ఇప్పుడు చెబుతాను.

కేంద్ర సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీగా వున్నప్పుడు ఒకసారి రేడియో స్టేషన్ కు వచ్చారు. డైరెక్టర్ గదిలో ఉన్నతాధికారుల సమావేశం. శర్మగారు వచ్చిన సంగతి తెలిసి చూడడానికి వెళ్లాను. తలుపు తెరుచుకుని లోపలకు వస్తున్న నన్ను చూసి తర్వాత కలుద్దాం అన్నారు శర్మగారు. నాకు తలకొట్టేసినట్టు అయింది. చెప్పలేని ఉక్రోషంతో మా గదికి వచ్చి కుర్చీలో కూలబడ్డాను. ఇదేమిటి! ఎందుకిలా జరిగింది? ముళ్ళపూడి వారి భాషలో చెప్పాలి అంటే బల్లపై పెట్టి ఉన్న నీళ్ళ గ్లాసులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.

మీటింగు అయిన తర్వాత ఆయనే నా దగ్గరకు వచ్చి అన్నారు, ‘నిన్ను కలుసుకోవాల్సింది ఇక్కడ, అక్కడ కాదు’ అని. మనసు తేలికపడింది. కృష్ణుడు, కుచేలుడు గుర్తుకు వచ్చారు.

ఇంతకీ నేను వారికి స్కూల్లో క్లాసు మేటునా కాదా! అవునో కాదో కానీ ఒక బాదరాయణ సంబంధం వుంది. మా స్వగ్రామం పేరు కంభంపాడు. శర్మగారి ఇంటిపేరు కంభంపాటి.

అలాంటి వ్యక్తి, అడగకుండానే వరాలిచ్చే దేవుడు అని ప్రసార భారతి సిబ్బంది చెప్పుకుని మురిసిన ఒక ఉత్తమ ఐ.ఎ.ఎస్. అధికారి శ్రీ కంభంపాటి సుబ్రమణ్య శర్మ గారు ఈరోజు  హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో   మరణించారనే విషాద వార్త నుంచి తేరుకోవడానికి, వారికి నివాళిగా  ఈ నాలుగు ముక్కలు రాస్తున్నాను.

(20-09-2025)

కింది ఫోటో:  అప్పటి  తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు,  కే. ఎస్.శర్మగారితో నేను




(ఇంకా వుంది)