8, అక్టోబర్ 2024, మంగళవారం

సాయంత్రం కలుద్దామా

సాయంత్రం కలుద్దామా!

"మీరు అమెరికా నుంచి వచ్చినట్టు ఫేస్ బుక్ లో మీ పోస్టు ద్వారా తెలిసింది. మీకు వీలుంటే కలుద్దాం. కారు పంపుతాను"

కాదనడానికి కారణం కనపడలేదు, ఒకటి తప్ప. అదే చెప్పాను. చాలా కాలంగా రాజకీయ చర్చల జోలికి వెళ్ళడం లేదు. దాదాపుగా అస్త్ర సన్యాసం చేసాను. సొంత గొడవలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. గతంలో ఏళ్ల తరబడి వ్యాసాలు రాస్తూ వస్తున్న పత్రికా సంపాదకులకు కూడా ఇదే విషయం చెప్పి సెలవు తీసుకున్నాను.
రాజకీయాలతో ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా రాజకీయంతో ఎంతోకొంత ముడిపడిన వారిని కలుసుకోవడం, వారితో కొంత సేపు గడపడం అంటే కొంచెం ఇబ్బందే. కానీ పిలిచిన వాళ్ళు అనేక ఏళ్లుగా పరిచితులు. గతంలో అనేక మార్లు కలుసుకుని ముచ్చట్లు చెప్పుకున్న ఆత్మీయులు. అంచేత కాదనలేక సరే అని వెళ్ళాను.
నిజంగా ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. రాజకీయాలే కాదు, పరస్పరం విభేదించుకునే ఏ ఒక్క అంశం ప్రస్తావనకు రాలేదు. హాయిగా మనసారా కబుర్లు చెప్పుకున్న సాయంత్రంగా గుర్తుండి పోయింది.
ఇద్దరిలో ఒకరు సీతయ్య. ఎవ్వరి మాటా వినని సీతయ్య. ఏపీ హక్కుల పరిరక్షణ అనే ఏకైక అంశం తీసుకుని అవిశ్రాంత పోరాటం చేస్తున్న చలసాని శ్రీనివాస్.
రెండో వ్యక్తి తెలంగాణ ప్రయోజనాలు ప్రధానం అని మనసారా నమ్మే పద్మారెడ్డి గారు. నమ్మిన సిద్ధాంతాల దృష్ట్యా ఒకరికొకరు చుక్కెదురు.
అందుకే సంక్షేపించింది.

ఒకప్పుడు నేను పని చేసిన రేడియో ఎవరి కనుసన్నల్లో అయితే పనిచేసేదో, ఆ మంత్రిత్వ శాఖకు సాక్షాత్తూ క్యాబినెట్ మంత్రి, కీర్తిశేషులు ఎస్. జైపాల్ రెడ్డి గారికి స్వయంగా సోదరుడు  పద్మారెడ్డి గారు. వీరిద్దరూ నాకు చిరకాలంగా పరిచితులు.
అందుకే రాజకీయాలు వద్దు అనే నిబంధనతో వెళ్ళాను.
ఇద్దరూ పెద్ద మనుషులు. పెద్ద మనసు చేసుకుని నా అభ్యర్థన మన్నించారు.
వెళ్ళగానే ఒక విషయం నన్ను ఆకర్షించింది. మరో విషయాన్ని గుర్తుకు తెచ్చింది.

పీవీ నరసింహారావు గారు భారత ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో, ఆయన సమీప బంధువులకు ఒక మేరకు భద్రత కల్పించారు. ఇదేమీ కొత్త విషయం కాదు. ప్రధాని, ముఖ్యమంత్రితో ప్రమేయం లేకుండా భద్రతా విభాగం ఈ ఏర్పాట్లు చేస్తుంది.
ఆ రోజుల్లో ప్రధాని సమీప బంధువు నాతో ఒక మాట చెప్పారు. గతంలో హాయిగా రిక్షాలో ఎక్కడికి అంటే అక్కడికి వెళ్ళేవాడిని. అదే ఇప్పుడు ఈ తుపాకీ వాడిని వెంటబెట్టుకుని ఆటోలో వెళ్లాల్సి వస్తోంది అని.
అది గుర్తుకు వచ్చి పద్మారెడ్డి గారి వెనుక ఎవరైనా సాయుధ పోలీసులు ఉన్నారేమో అని ఆసక్తిగా చూసాను. ఎవ్వరూ కనపడలేదు. ఎప్పటి మాదిరిగానే, వారి అన్నగారు జైపాల్ రెడ్డి గారిలాగా మందహాసంతో కానవచ్చారు. ఆశ్చర్యం అనిపించింది.
ఆశ్చర్యం ఎందుకంటే, పద్మా రెడ్డి గారు ఎవ్వరో కాదు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వయానా పిల్లనిచ్చిన మామగారు.

7-10-2024

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

వాళ్ల వాళ్ల హోదా అంతస్తులకు‌తగ్గట్టు వాళ్లు వాళ్లు వాళ్ల వాళ్లకి పిల్లల్ని‌కట్టబెట్టేస్తున్నారండి

ప్చ్ బీదాబిక్కీ ఎలా పై అంతస్తులెక్కడం‌?


అజ్ఞాత చెప్పారు...

reservations to be applied.

అజ్ఞాత చెప్పారు...

కొన్ని పాటలింతే గుండెకోతలోనే చిగురిస్తాయి
కొన్ని బ్రతుకులంతే వెన్నెలతో చితి రగిలిస్తాయి