14, అక్టోబర్ 2024, సోమవారం

అతి వర్జయేత్!

పొద్దున సాక్షిలో చదివాను. నేను చదివే మరో రెండు ప్రధాన పత్రికల్లో  కనపడలేదు. 

చాలా కాలంగా నేను చెబుతోంది ఇదే. పదవిలోకి రాగానే తమ చుట్టూ వలయంలా ఏర్పడే భద్రతా సిబ్బంది వల్ల ఎంతటి రక్షణ లభిస్తుందో తెలియదు కానీ, వారివల్ల నాయకులకు చెడ్డ పేరు రావడానికి అవకాశాలు ఎక్కువ.

పాత తరం వయోధిక పాత్రికేయులు ఇటువంటి వేడుకలకు  ఆహ్వానం లేకుండా వెళ్ళరు. ఈ తరం పోలీసులకు వారెవ్వరూ తెలియదు. పిలిచిన వాళ్ళే బాధ్యత తీసుకోవడం సముచితంగా ఉంటుంది.

 గతంలో పత్రికల వారిపట్ల దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకున్న సందర్భాలు మా కాలంలో నేను ఎరుగుదును.
కానీ ఆ మంచి కాలానికి కాలం చెల్లింది.
వారిద్దరూ, మాడభూషి శ్రీధర్, పాశం యాదగిరి వయసు రీత్యానే కాకుండా వృత్తి రీత్యా కూడా ఈ పాత్రికేయ రంగంలో పెద్దవారు. భౌతిక గాయాల నుంచి కోలుకోవచ్చు కానీ, ఇలాంటి సందర్భాలలో  మానసిక గాయాల నుంచి కోలుకోవడం కష్టం.
ఈ ఘటనను ఖండిస్తున్నాం అనేది చిన్న మాట.
పునరావృతం కానివ్వం అనేది ఏలికల షరా మామూలు మాట.
ఇంతకంటే ఏం చెప్పను?

డ్రైవర్ పక్క ఫ్రంటు సీటు



ఈ కాలంలో సీటుకోసం వెంపర్లాడని వెర్రివాళ్ళెవ్వరుంటారు?
రాజకీయాలు తీసుకుంటే సర్పంచ్ సీటుతో ప్రారంభించి  సీఎం సీటు వరకు ఎగబాకాలనుకుంటారు.
సినిమాల్లో అయితే ఎగస్ట్రా పాత్రనుంచి మొదలుపెట్టి, సెట్లో  వెనుక ‘హీరో’ అనో ‘హీరోయిన్’ అనో రాసున్న సీటు సొంతం చేసుకోవాలని కలలు కంటారు.
మహాసభల్లో స్టేజీ మీద మొదటి వరస సీటు దక్కించుకోవాలనుకునేవారు కోకొల్లలు.
ప్రేక్షకుల్లో కూర్చోవాల్సిన పరిస్తితే వస్తే అక్కడా మళ్ళీ ముందు వరస కోసం వెతుకులాటే!
చిన్న చిన్న సాంస్కృతిక సమావేశాలనుంచి పెద్ద పెద్ద సభలవరకూ ఈ సీట్ల గోల తప్పదు.
కెమెరా యాంగిల్ దృష్టిలో పెట్టుకొని, ముందు చూపుతో వీ.వీ.ఐ.పీ. పక్క సీటు కోసం ఆత్రపడేవాళ్ళు తక్కువేమీ కాదు.

యాభై అరవై ఏళ్ళక్రితం పల్లెటూళ్ళకు వచ్చే బస్సుల్లో డ్రైవర్ పక్కన వుండే ఫ్రంటు సీటు కోసం వూళ్ళో మోతుబరులు పోటీపడేవారు. ఆ రోజుల్లో ఆ సీట్లో కూర్చుని ప్రయాణం చేయడం ఒక హోదాగా భావించేవారు.

ఎనభయ్యవ దశకం మొదట్లో ముఖ్యమంత్రి  శ్రీ టంగుటూరి అంజయ్య అధికారిక వాహనం అయిన అంబాసిడర్ కార్లో డ్రైవర్ పక్కన ముందు సీట్లో ఆసీనులయ్యేవారు.  ‘అమ్మ’   (శ్రీమతి ఇందిరాగాంధి)  కూడా ఫ్రంటు సీటే సుమా!’ అని అమాయకంగా అనేవారు.  ఆవిడ కూడా ప్రధాని హోదాలో అంబాసిడర్ కార్లో ముందు సీట్లోనే కూర్చునేవారు.
 అంజయ్య గారు  ముందు సీటు ఎంపిక చేసుకోవడంలో నాకు మరో కోణం కనిపించేది.  ప్రజల మనిషి అయిన అంజయ్య గారికి జనం తాకిడి ఎక్కువ.  ‘లైఫ్ బాయ్ ఎక్కడవుంటే  ఆరోగ్యం అక్కడ వుంటుంది’  అనే వాణిజ్య ప్రకటన తరహాలో అంజయ్య గారు ఎక్కడ వుంటే అక్కడ జనమే జనం.  బాత్రూం, బెడ్ రూముల్లో  కూడా ఆయనకు ఈ తాకిడి తప్పేది కాదని చెప్పుకునేవారు. సెక్యూరిటీని కూడా తోసుకువచ్చి కారెక్కాలని చూసే అనుయాయుల వల్ల కలిగే తొడతొక్కిడిని తప్పించుకోవడానికి ఆయన హాయిగా ముందు సీటుకు మారిపోయారని అప్పట్లో ముఖ్యమంత్రికి భద్రతాధికారిగా పనిచేసిన బాలాజీ చెబుతుండేవారు.

ఒకప్పుడు కారులో వెనుక సీటులో కూర్చునేవారే ఆ  కారుకు  యజమాని అని జనం భావించేవారు. ఇప్పుడా అభిప్రాయం  పూర్తిగా మారిపోయింది. మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసన సభ్యులు ఒకరేమిటి అంతా ఫ్రంటు సీటుకు అతుక్కుపోతున్నారు. టీవీ కెమెరా  యాంగిళ్లకి కూడా ఈ సీటే అనువుగా వుండడం ఒక కారణం అయితే, దారివెంట ప్రజలకు చేతులు ఊపుతూ అభివాదం చెయ్యడానికి  ఫ్రంటు సీటే బెటరన్న నమ్మకం కుదరడం  మరో కారణం.

12, అక్టోబర్ 2024, శనివారం

అటు నేనే ఇటు నేనే



హాలీవుడ్ చిత్రాలను తలదన్నే రీతిలో గతంలో ఎప్పుడో కెమెరా పనితనం ప్రదర్శించే చిత్రాలను తెలుగులో తీశారు అనే మాటను ఈ నెట్ యుగపు పిల్లలు నమ్ముతారా! 
అలా నమ్మని పిల్లలకు మాయా బజార్ సినిమాని బలవంతంగా అయినా చూపించాలి.

ఈటీవీ లో వస్తున్న ఈ సినిమాను ఒంటరిగా చూస్తున్నాను. చూడాల్సిన వాళ్ళు మొబైల్ లో వీడియోలు చూస్తున్నట్టున్నారు!
ఇదో విషాదం!

11, అక్టోబర్ 2024, శుక్రవారం

గుడ్డుగారికో రోజు



ఏ దేశమేగినా, ఎందుకాలిడినా పాలూ, నీళ్ళతో పాటు తప్పకుండా దొరికేది మరోటివుంది. అదే కోడి గుడ్డు.
అక్టోబర్ నెలలో రెండో శుక్రవారం అంతర్జాతీయ కోడిగుడ్డు దినం అంటున్నారు. 
1975 వరకు ఎగ్గూ పెగ్గూ రెండూ మా ఇంటావంటా లేవు. వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా రెండోది ముందుగా వచ్చి చాలా కుటుంబాలలో తిష్ట వేసింది. మొదట్లో నిరసన ధ్వనులు వినపడ్డా మొత్తం మీద దానికి పసుపు నీళ్ళు చల్లి ఇళ్ళల్లోకి రానిచ్చారు. దాంతో పాటే మొదటిది కూడా తగుదునమ్మా అని గృహప్రవేశం చేసి ఓటరు కార్డు, ఆధార్ కార్డు లేకుండానే ఇంట్లో సభ్యురాలు అయిపోయింది. మంచి ఎండాకాలంలో కూడా చలి దుప్పటి కప్పుకుని ఫ్రిజ్ లో పడుకునేది ఆ కోడిగుడ్డే. మేము  తిన్నా తినకపోయినా, ఇంటికి వచ్చిన (నా) నాన్ వెజ్ ఫ్రెండ్స్ ఎవరికయినా అవసరం పడుతుందో ఏమో అని మా ఆవిడ ముందు జాగ్రత్తగా వాటిని కొని ఫ్రిజ్ లో దాచి వుంచేది. 
ఎప్పుడో మా చిన్నప్పుడు మా చుట్టాల అమ్మాయికి టైఫాయిడ్ వచ్చి నిమ్మలించిన తర్వాత త్వరగా కోలుకోవడానికి డాక్టర్ ఉడక పెట్టిన కోడి గుడ్డు రోజూ ఒకటి తినమన్నారు. అసలే నిప్పులు కడిగే ఆచారం. గుడ్డు తినమనగానే ఇంట్లో వాళ్లకి నిలువు గుడ్లు పడడం చూసిన డాక్టరు గారు, పేషెంటు ముక్కూ, కళ్ళూ మూసి, నోరు తెరిపించి పటేల్ మని గుడ్డు పగల గొట్టి తటాలున నోట్లో పోసి మింగించాడు. అటువంటి భీకర భీభత్స దృశ్యాలు చూసిన తరువాతే వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం అనే సామెత పుట్టి వుండాలి.

అసలు కోడి గుడ్డు అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఒకరు వున్నారు. ఆయనే  బీ.వీ. రావు (బి.వాసుదేవరావు, ఇప్పుడు లేరనుకోండి). తెలంగాణాకు చెందిన ఈ పెద్దమనిషి వెంకటేశ్వరా హేచరీస్ అనే పరిశ్రమను స్థాపించి కోడిగుడ్డుకు ఎనలేని ప్రాముఖ్యాన్ని కట్టబెట్టారు. మేము మాస్కోలో ఉన్నరోజుల్లో నాటి సోవియట్ ప్రభుత్వ అతిథి హోదాలో ఆయన  రష్యా వచ్చారు. ఓరోజు మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేతి భోజనం చేసి వెళ్ళారు. తర్వాత మేము ఇండియాకు తిరిగి వచ్చిన తరవాత కూడా గుర్తు  పెట్టుకుని మా పిల్లలు ఇద్దర్నీ పూనాలో వున్న తమ స్టడ్ ఫాం కు తీసుకువెళ్ళారు. అదో సంగతి.   
ఏది ఏమైనా పిడికెట్లో నాలుగోవంతు లేని కోడిగుడ్డుకు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చి, దాని పేరిట ఒక దినం ఏర్పాటు కావడం, ఆ సందర్భాన్ని పురస్కరించుకుని గుడ్డు ప్రాముఖ్యతను ప్రస్తుతిస్తూ రేడియో ప్రసంగాలు, టీవీ కార్యక్రమాలు జరగడం కోడిగుడ్డు చేసుకున్న పూర్వజన్మ  సుకృతం.
గుడ్డుగా వున్నప్పుడూ, గుడ్డు నుంచి కోడిగా మారిన కొత్త అవతారంలో కూడా మానవులకు ఆహారంగా సేవలందిస్తూ  త్యాగంలో బలి, శిబి చక్రవర్తులను మించిన ఆ త్యాగశీలికి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం, ఆమ్లెట్ గా వేసుకుని నోరారా తినడం తప్ప అంటారు కొందరు ఎగ్గేరియన్లు.

9, అక్టోబర్ 2024, బుధవారం

డ్రైవర్ లేని కారు

 

కొత్త ఏదైనా కొంత కాలం వింతే! - భండారు శ్రీనివాసరావు

 

మొన్న అమెరికా వెళ్ళినప్పుడు మా మూడో అన్నయ్య కనిష్ట కుమారుడు సత్యసాయి ఇంట్లో కొన్నాళ్ళు వున్నాను.  వాడి కొడుకు శైలేష్ అక్కడ వున్నన్ని రోజులు నన్ను వాళ్ళ కారులో తిప్పాడు.

ఆ కారుకు డ్రైవర్ అవసరం వుండదు. అన్నీ కంప్యూటరే చూసుకుంటుంది. కారెక్కి ఎక్కడికి వెళ్ళాలో సంకేతాలు ఇస్తే చాలు, అదే నిర్దేశిత ప్రదేశానికి తీసుకువెడుతుంది. ప్రపంచం మొత్తంలో అత్యధిక సంపన్నుడు  ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లా తయారు చేసిన కారు ఇది. స్టీరింగ్ పట్టుకుని, క్లచ్ లు మారుస్తూ, బ్రేకులు వేస్తూ నడపాల్సిన అవసరం వుండదు. అవన్నీ కారులో అమర్చిన  కంప్యూటర్ బాధ్యతలు. కారుకు  అన్ని వైపులా అమర్చిన సెన్సార్లు, కెమెరాలు  అన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. ముందు వెళ్ళే కారు ఎంత వేగంలో వెడుతున్నది, వెనక వచ్చే కారు ఎంత దూరంలో, ఎంత వేగంతో వస్తున్నది,  ఇరుపక్కల నుంచి ఏయే వాహనాలు ఎంత వేగంగా దూసుకు వస్తున్నది అదే గమనించి, తదనుగుణంగా తన గమనాన్ని,  వేగాన్ని  సర్దుబాటు చేసుకుంటుంది. సాధారణంగా మనకు ముందు వెళ్ళే కారు మాత్రమే కనిపిస్తుంది. అయితే ఈ కారుకు వున్న కెమెరా కళ్ళు, ముందు కారునే కాకుండా దాని ముందున్న వాహనాల వేగాన్ని, రోడ్డు పరిస్థితులను ఒక కంట కనిపెడుతుంటాయి.  స్పీడ్ పరిమితులకు తగ్గట్టుగా  కారే తనకు తానుగా వేగాన్ని పెంచుకుంటుంది. అవసరం అయితే తగ్గించుకుంటుంది. వేగ పరిమితులను మించి వాహనం నడుపుతున్నారని పోలీసులు చలానాలు విధించే ఆస్కారం ఉండదు.  ఇంజిన్ వుండదు కాబట్టి ముందూ వెనకా రెండు డిక్కీలు. పెట్రోలు అవసరం లేదు. పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. ఇంధనం పొదుపు కాబట్టి కారు ఖరీదులో  ప్రభుత్వ రాయితీ కూడా లభిస్తుంది.

అయితే నేను విన్నదాన్ని బట్టి,  అమెరికాలో చాలామంది ఈ కారును వాడుతున్నప్పటికీ ఈ కారు ఇంకా  ప్రయోగాత్మక దశలోనే వుంది. లైసెన్స్ వున్న వ్యక్తి కారులో వుండడం తప్పనిసరి.

ఈ కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సామాన్యుడు కాదు. ప్రపంచ కుబేరుడు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం  ప్రెసిడెంట్ పదవికి మరోసారి పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన ఇటీవల పాల్గొన్న ఎన్నికల సభలో వేదిక మీద నృత్యం చేసిన ఘనుడు.

ఈ టెస్లా కారు విషయంలో ఆయనకు ఎన్నో విప్లవాత్మక ఆలోచనలు వున్నట్టు చెబుతారు.

అవన్నీ సాకారం అయితే ప్రస్తుత మోటారు కార్ల పరిశ్రమ స్థితిగతులు సంపూర్ణంగా మారిపోతాయి. ఎవరికీ డ్రైవర్ అవసరం వుండదు. అసలు కారు అవసరమే వుండక పోవచ్చు. ఉబెర్ ఓలా వంటి సంస్థలకు స్వర్ణ యుగం రావచ్చు. ఫోను చేయగానే రమ్మన్న చోటుకు కారు దానంతట అదే చెప్పిన సమయానికి  వస్తుంది. పోవాలని అనుకున్న చోటుకు అదే తీసుకు వెడుతుంది. పార్కింగ్ ఇబ్బందులు ఉండవు. ఎక్కడ పార్కింగ్ ఖాలీ వుందో అక్కడికి వెళ్లి పక్క వాహనాలను తాకకుండా అదే పార్క్ చేసుకుంటుంది. మందు బాబులను పట్టుకోవడానికి  నోట్లో గొట్టాలు పెట్టి ఊదాల్సిన శ్రమ ట్రాఫిక్ పోలీసులకు తప్పుతుంది.  రోడ్డు ప్రమాదాలు చాలావరకు తగ్గిపోతాయి. ఇంధనం కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇన్ని లాభాలు, ప్రయోజనాలు వున్నాయి కనుకే, అందరి కళ్ళు ఈ కార్ల మీదే వుంది. అయితే పోటాపోటీ కాటా కుస్తీలకి దిగే మోటారు కార్ల తయారీ రంగం పెద్దల లాబీ చేతులు కట్టుకు కూర్చ్గుంటుందా ! ఈ రంగంలోని పెత్తందారులు అందరూ,  సంపదలో ఎలాన్ మస్క్ తో పోటీ పడలేకపోయినా, అంతో ఇంతో కుబేరులే. ప్రభుత్వాలను తమ ప్రయోజనాలకు అనుగుణంగా శాసించగల ధీరులే!

ప్రపంచ కుబేరుడు కనుక మస్క్ మాటే  చెల్లుబాటు అవుతుందేమో!

కార్పొరేట్ ప్రపంచంలో రాజకీయాలు, అసలు రాజకీయరంగంలోని రాజకీయాల కన్నా దారుణమైనవి, తమ ఎత్తులతో ప్రత్యర్థి కుత్తుకలను కత్తిరించే నిర్దాక్షిణ్యం ఆ రంగంలో సర్వసాధారణం.  అమెరికాలో అయితే మరీ.

Below photo:

Tesla Driverless Car, Courtesy Image Owner 


 


08-10-2024

8, అక్టోబర్ 2024, మంగళవారం

సాయంత్రం కలుద్దామా

సాయంత్రం కలుద్దామా!

"మీరు అమెరికా నుంచి వచ్చినట్టు ఫేస్ బుక్ లో మీ పోస్టు ద్వారా తెలిసింది. మీకు వీలుంటే కలుద్దాం. కారు పంపుతాను"

కాదనడానికి కారణం కనపడలేదు, ఒకటి తప్ప. అదే చెప్పాను. చాలా కాలంగా రాజకీయ చర్చల జోలికి వెళ్ళడం లేదు. దాదాపుగా అస్త్ర సన్యాసం చేసాను. సొంత గొడవలు రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. గతంలో ఏళ్ల తరబడి వ్యాసాలు రాస్తూ వస్తున్న పత్రికా సంపాదకులకు కూడా ఇదే విషయం చెప్పి సెలవు తీసుకున్నాను.
రాజకీయాలతో ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా రాజకీయంతో ఎంతోకొంత ముడిపడిన వారిని కలుసుకోవడం, వారితో కొంత సేపు గడపడం అంటే కొంచెం ఇబ్బందే. కానీ పిలిచిన వాళ్ళు అనేక ఏళ్లుగా పరిచితులు. గతంలో అనేక మార్లు కలుసుకుని ముచ్చట్లు చెప్పుకున్న ఆత్మీయులు. అంచేత కాదనలేక సరే అని వెళ్ళాను.
నిజంగా ఈ సాయంత్రం అద్భుతంగా గడిచింది. రాజకీయాలే కాదు, పరస్పరం విభేదించుకునే ఏ ఒక్క అంశం ప్రస్తావనకు రాలేదు. హాయిగా మనసారా కబుర్లు చెప్పుకున్న సాయంత్రంగా గుర్తుండి పోయింది.
ఇద్దరిలో ఒకరు సీతయ్య. ఎవ్వరి మాటా వినని సీతయ్య. ఏపీ హక్కుల పరిరక్షణ అనే ఏకైక అంశం తీసుకుని అవిశ్రాంత పోరాటం చేస్తున్న చలసాని శ్రీనివాస్.
రెండో వ్యక్తి తెలంగాణ ప్రయోజనాలు ప్రధానం అని మనసారా నమ్మే పద్మారెడ్డి గారు. నమ్మిన సిద్ధాంతాల దృష్ట్యా ఒకరికొకరు చుక్కెదురు.
అందుకే సంక్షేపించింది.

ఒకప్పుడు నేను పని చేసిన రేడియో ఎవరి కనుసన్నల్లో అయితే పనిచేసేదో, ఆ మంత్రిత్వ శాఖకు సాక్షాత్తూ క్యాబినెట్ మంత్రి, కీర్తిశేషులు ఎస్. జైపాల్ రెడ్డి గారికి స్వయంగా సోదరుడు  పద్మారెడ్డి గారు. వీరిద్దరూ నాకు చిరకాలంగా పరిచితులు.
అందుకే రాజకీయాలు వద్దు అనే నిబంధనతో వెళ్ళాను.
ఇద్దరూ పెద్ద మనుషులు. పెద్ద మనసు చేసుకుని నా అభ్యర్థన మన్నించారు.
వెళ్ళగానే ఒక విషయం నన్ను ఆకర్షించింది. మరో విషయాన్ని గుర్తుకు తెచ్చింది.

పీవీ నరసింహారావు గారు భారత ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో, ఆయన సమీప బంధువులకు ఒక మేరకు భద్రత కల్పించారు. ఇదేమీ కొత్త విషయం కాదు. ప్రధాని, ముఖ్యమంత్రితో ప్రమేయం లేకుండా భద్రతా విభాగం ఈ ఏర్పాట్లు చేస్తుంది.
ఆ రోజుల్లో ప్రధాని సమీప బంధువు నాతో ఒక మాట చెప్పారు. గతంలో హాయిగా రిక్షాలో ఎక్కడికి అంటే అక్కడికి వెళ్ళేవాడిని. అదే ఇప్పుడు ఈ తుపాకీ వాడిని వెంటబెట్టుకుని ఆటోలో వెళ్లాల్సి వస్తోంది అని.
అది గుర్తుకు వచ్చి పద్మారెడ్డి గారి వెనుక ఎవరైనా సాయుధ పోలీసులు ఉన్నారేమో అని ఆసక్తిగా చూసాను. ఎవ్వరూ కనపడలేదు. ఎప్పటి మాదిరిగానే, వారి అన్నగారు జైపాల్ రెడ్డి గారిలాగా మందహాసంతో కానవచ్చారు. ఆశ్చర్యం అనిపించింది.
ఆశ్చర్యం ఎందుకంటే, పద్మా రెడ్డి గారు ఎవ్వరో కాదు, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వయానా పిల్లనిచ్చిన మామగారు.

7-10-2024

7, అక్టోబర్ 2024, సోమవారం

ఓ ఫొటో ముచ్చట



ఫోటో ఏముంది? తీసినవాళ్ళ పనితనాన్ని బట్టి దాని గొప్పతనం. 
ఈ ఫొటో తీసింది ఆషామాషీ ఫోటోగ్రాఫర్ కాదు. ఆకాశవాణిలో తన స్వరంతో, ఫేస్ బుక్ లో తన కలంతో ఆకట్టుకుంటున్న ప్రముఖ రేడియో న్యూస్ రీడర్ తురగా ఉషారమణి. 
ఎనిమిదేళ్ళ క్రితం నేను నా పుట్టిల్లు రేడియో స్టేషన్ కు వెళ్ళినప్పుడు తన మొబైల్ తో క్లిక్ అనిపించింది. బాగా తీసావమ్మా అంటే జీవితాంతం గుర్తు పెట్టుకునే ఓ సర్టిఫికెట్, నాకు మరో గుర్తుగా ఇచ్చింది. పోలికలో ఉత్ప్రేక్ష అనిపిస్తే మన్నించండి. శ్రీ శ్రీకి చలం యోగ్యతాపత్రం లాగా భావిస్తా. అదే ఇది.

"సందర్భం వచ్చింది కాబట్టి:

నాకు శ్రీనివాస రావు గారు నేను చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి తెలుసు. తెలియడమే కాకుండా నేను ఆయనని తరచూ చూస్తూ వచ్చాను. కనీసం వారానికి ఒక సారి అన్నంత తరచుగా. ఆయన 35 ఏళ్ళ క్రితం ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. అది అందరికీ కనిపిస్తున్నదే. 
ఆయన చాలా ఫొటోజెనిక్. ఫొటోజెనిక్ అంటే కెమెరాకి సరిపడే లుక్స్ అనే కాదు. పోర్ట్రయిట్ ఫొటోస్ తీయడం ఎక్కువగా  ఇష్టపడే నాకు ఆయనలో రెండు మూడు విలక్షణమైన అంశాలు కనిపిస్తాయి. ఒకటి, స్పాంటేనిటీ. అంటే చటుక్కున ముఖంలోకి నవ్వు వచ్చేస్తుంది. కళ్ళల్లో కూడా ఆ నవ్వు reflect అవుతుంది. రెండు comfort. అంటే ఏ ఒక్క క్షణంలోనూ, పరధ్యానంగా ఉన్నా, అలెర్ట్ గా ఉన్నా ఆయన అంతే relaxed గా ఉంటారు. మనసులో ఆలోచనల్లో అలజడి లేదన్న విషయం ఆయన face లో ప్రతిఫలిస్తుంది. మూడోది involvement. శ్రీనివాస రావు గారు జనాలతో ఉన్నప్పుడు తన సొంత గోల కాక అవతలి వాళ్ళ మీద దృష్టిపెట్టి, వాళ్ళ మాటలు ఆసక్తితో వింటూ, participate చేస్తుంటారు. దానితో అసలు ఈ కెమెరా గొడవ ఆయనకీ పట్టదు. These are the traits which make him a great subject for portraits any time and in any light. ఫోటో తీసే వాళ్ళు కూడా 'ఆహా, భలే తీసానే' అనుకునేట్లు. :)  
నా observations. కాదంటే చెప్పండి."

అని సవాలు విసురుతోంది పైగా. 
ఎంతయినా నా గురుపత్ని తురగా జానకీరాణి గారి అమ్మాయి కదా!
థాంక్స్ ఉషా!

తోకటపా:
చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో రామప్ప గుడికి ఎక్స్ కర్షన్ కు తీసుకు వెళ్ళారు. ఆ రోజుల్లో కెమెరా అంటే ఎంతో అపురూపం. ఒక్క ఫొటో దిగితే చాలు జీవితం ధన్యం అనుకునే కాలం. 
కొందరు ఫారెన్ టూరిస్టులు అక్కడ ఫోటోలు దిగుతున్నారు. అందులో ఒక దాంట్లో నేను పడ్డాను అని నా నమ్మకం. ఆ ఫొటో చూసుకునే అవకాశం ఈ జన్మకు వుండదు అని తెలిసికూడా, జన్మకు సరిపడా మురిసిపోయాను.
చిన్నతనపు అజ్ఞానంలో కూడా ఎంతో మధురిమ వుంటుంది.

5, అక్టోబర్ 2024, శనివారం

నా మీద నాకే అసూయ

నా మీద నాకే అసూయ - భండారు శ్రీనివాసరావు 

"ఏమిటి మీ ఆరోగ్య రహస్యం?" అడిగాడు ఓ మిత్రుడు.
"ఏమీ లేదు, జ్ఞాపకాలను నమిలి తింటుంటాను"

2019 లో కంటికి రెప్పలా చూసుకున్న మా ఆవిడ నిర్మల హఠాత్తుగా కన్నుమూసింది. 
ఈ ఏడాది (2024) ఫిబ్రవరి నాలుగున, నాకు కుడి భుజంగా వున్న నా రెండో కుమారుడు సంతోష్ తల్లి మీద ప్రేమతో ఆమె దగ్గరికే వెళ్ళిపోయాడు. వాడికి తల్లి అంటే ప్రాణం. ఆమె చనిపోయినప్పుడు, ఎవరో పెద్దగా బాడీని తీసుకు రండి అంటుంటే వాడు కోపం ఆపుకోలేక పోయాడు. ' బాడీ ఏమిటి బాడీ. బుద్ది వుందా! ఆమె మా అమ్మ. అమ్మ.' అంటూ విరుచుకుపడ్డాడు. అంత ప్రేమ తల్లి అంటే.

అయిదేళ్ల వ్యవధిలో ఈ ఇద్దరూ నాకు కాకుండా పోయారు. అయినా దుక్కలా వున్నానంటే  జ్ఞాపకాలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ వుంటే చెప్పరాని ఆనందం, చెప్పుకోలేని బాధ రెండూ పడుగుపేకలుగా మనసును ముప్పిరిగొంటాయి. ఇది అదృష్టమో దురదృష్టమో తెలియని స్థితి.

కొన్ని జ్ఞాపకాలు అంతే. తలచుకున్నప్పుడల్లా  వయసును మురిపిస్తాయి. మనసుని వేధిస్తాయి.

 దాదాపు ఓ అర్ధ శతాబ్దం నన్ను కంటికి రెప్పలా చూసుకున్న అర్ధాంగి, కరోనా అంటే ఏమిటో తెలియకుండానే, ఆ పదం వినకుండానే, ఆ మహమ్మారి ఆగమనానికి ముందుగానే   నేను పుట్టిన ఆగస్టులోనే, నా పుట్టినరోజున ప్రేమతో కేకు తినిపించిన పదో రోజునే  2019లో  కన్ను మూసింది. వచ్చే పెన్షన్ తప్ప వేరే ఆధారం లేదు. కూడబెట్టుకున్నవీ లేవు. ఇవేవీ నా మనసుకు తాకలేదు. కారణం నా ఇద్దరు  పిల్లలు, నా కోడళ్ళు. తోడులేని మనిషికి తోడుగా నిలబడ్డారు. నా చుట్టపక్కాల సంగతి చెప్పాల్సిన పనే లేదు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు రోజూ నా యోగక్షేమాలు కనుక్కోకుండా నిద్రపోడు. 
సాధారణ మనుషులకి నిజంగా ఇవన్నీ అసాధారణ విషయాలే. అందుకే నా మీద నాకు అసూయ. కానీ ఇంతటి ఆదరణకి నేను అర్హుడిని కాదు అన్న సంగతి నాకు తెలుసు.
ఏడుగురు అక్కయ్యలు. అది ఒక కారణం కావచ్చు, నాకు ఆడవాళ్లంటే గౌరవం. మా కోడళ్ళను చూసిన తరువాత అది రెట్టింపు అయింది.
పెద్ద కోడలు భావన అమెరికానుంచి ఫోన్ చేసి నా వెల్ఫేర్ కనుక్కుంటుంది.  వాళ్ళు అక్కడ సిటిజన్లు. ఆమెకు విద్యార్హతలు చాలా వున్నా, పిల్లల కోసం ఇన్నేళ్ళు ఉద్యోగం చేయకుండా ఇల్లు చూసుకుంది. నా మనుమరాళ్లు ఇద్దరూ యూనివర్సిటీ చదువుల కోసం బయటి రాష్ట్రాలకు వెళ్ళారు. దాంతో ఖాళీగా వుండడం ఇష్టంలేక వున్న ఊళ్లోనే క్వాలిఫికేషన్ కు తగిన ఉద్యోగానికి అప్లయి చేస్తే ఇన్నేళ్ళు ఏ ఉద్యోగం చేశావు అని మాట మాత్రం అడగకుండా అర్హతను చూసి మంచి ఉద్యోగం ఇచ్చారు. 
నా రెండో కోడలు నిషా. ఆమెకు ఏదో పెద్ద  కార్పొరేట్ సంస్థలో, దేశ దేశాల్లోని సిబ్బంది మీద అజమాయిషీ చేసే బాధ్యత కలిగిన పెద్ద ఉద్యోగం. అయినా ఇంటినీ, నన్నూ, నా అవసరాలను కనిపెట్టి చూస్తుంటుంది. ఎందుకమ్మా ఇలా అవస్థ పడతావు అంటే నవ్వి ఊరుకుంటుంది.
  
 
మా ఆవిడ వుండివుంటే, ఈ వైభోగాలు చూస్తూ వుంటే, నా కొడుకు బతికి వుంటే నన్ను పట్టడానికి పగ్గాలు వుండేవి కావు. దేవుడు రెండు చేతులు ఇచ్చాడు కానీ ఏదీ మన చేతిలో పెట్టలేదు.

దేవదాసు సినిమాలో పార్వతి పాత్ర వేసిన సావిత్రితో,  ముసలి భర్త సీ.ఎస్.ఆర్. అంటాడు, 'చంద్రబింబం లాంటి నీ మొహం మీద ఈ మచ్చ ఏమిట'ని.
చంద్రుడికే తప్పలేదు. మనమెంత? 

కింది ఫోటో:
అమెరికాలో  గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర ఆలూమగలం.
ఇదొక బంగారు జ్ఞాపకం.


4, అక్టోబర్ 2024, శుక్రవారం

కాశీ అయోధ్య యాత్రలు



అక్టోబర్ రెండు, 2024.
వారాణాసి నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. కాశీలో మేము మూడు రోజులు బస చేసింది చెన్నై కి చెందిన ప్రముఖ నగల వ్యాపార సంస్థ GRT ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అతిథి భవనంలో. ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి  కారులో గంట ప్రయాణం. సెప్టెంబరు 29 సాయంత్రం  లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం బయటకు  రాగానే, యాత్ర ఆరంభం అదిరింది. ట్రావెల్స్ తరపున కొందరు వచ్చి, హైదరాబాదు నుంచి వచ్చిన మా పద్నాలుగు మందికి దండలు వేసి మరీ స్వాగతం చెప్పారు, ఏదో స్టార్ హోటల్ మర్యాదల మాదిరిగా. సిద్ధంగా వుంచిన మూడు ఇన్నోవా కార్లలో జీ ఆర్ టి గెస్ట్ హౌస్ కి చేరాము. భవనం మొత్తం గ్రానైట్ తో తీర్చి దిద్దారు. లోపలకు అడుగుపెట్టగానే గ్రానైట్ తో నిర్మించిన చిన్న వినాయకుడి గుడి. స్వామికి దణ్ణం పెట్టుకుని, పక్కనే వున్న పెద్ద లిఫ్ట్ లో  మాకు కేటాయించిన నాలుగో అంతస్తుకు చేరాము. చివరికి మంచాలు కూడా గ్రానైట్ వే కావడం విశేషం. మా అందరికీ ఒకే అంతస్తులో గదులు ఇచ్చారు. ప్రతి గదిలో మూడు పడకలు. చక్కటి ఏసీ సదుపాయం. వారణాసిలో అంత వేడి వాతావరణం వుంటుందని అస్సలు  ఊహించలేదు. 
GRT గెస్ట్ హౌస్ లో బస చేసినవారికి  ఉదయం బెడ్ కాఫీ, తరువాత కాసేపటికి  బ్రేక్ ఫాస్ట్, లంచ్, సాయంత్రం కాఫీ/ టీ, రాత్రి డిన్నర్ ఉచితం.  గది అద్దె రోజుకు 1680 రూపాయలు. అయితే అన్నీ టైము ప్రకారం జరుగుతాయి. కొంచెం ముందుగా కానీ, కాస్త ఆలస్యం అయినా కానీ సర్వీసు వుండదు. బయటకు పోవాల్సిందే.  డైనింగ్ హాల్, కుర్చీలు, బల్లలు అన్నీ శుభ్రంగా వున్నాయి. వంటలు రుచిగా, శుచిగా తయారు చేశారు. వేడివేడిగా అన్నం, ఒక కూర, పప్పు, పాయసం, సాంబారు, రసం. బ్రేక్ ఫాస్ట్ లో ఊతప్పం, దోసె, చట్నీ సాంబారు. సాంబారు మాత్రం తప్పనిసరి. చెన్నై వంటవాళ్లు కాబట్టి సాంబారు రుచి స్పెషల్. బఫే పద్దతి.  వడ్డన చేసే వాళ్ళు నవ్వు మొహంతో ఏదీ కాదనకుండా, లేదనకుండా అందర్నీ ఒకే మాదిరిగా కనుక్కున్నారు. 
మా కాశీ ప్రయాణానికి ఒక కారణం వుంది. సెప్టెంబర్ 30 మా అన్నయ్య రామచంద్ర రావు గారి పుట్టిన రోజు. ఆ రోజున కాశీ వెళ్లి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకోవాలి అనే ఆకాంక్షతో పెట్టుకున్న యాత్ర ఇది. ఆ రాత్రి గెస్ట్ హౌస్ లోనే సింపుల్ గా కేక్ కట్ చేయించి, కుటుంబ సభ్యులు అందరం మా అన్నావదినల ఆశీర్వాదం తీసుకున్నాం.
ఆన్ లైన్లో ముందుగానే  బుక్ చేసిన హారతి దర్శనం కోసం అర్థరాత్రి రెండు గంటలకు కాశీ విశ్వేశ్వరుడి దేవాలయానికి వెళ్ళాము. అలాగే పక్కనే అమ్మవారి దర్శనం. ఈ దర్శనం కోసం బుక్ చేసుకున్న వాళ్ళు వెయ్యికి మించరు. కొంచెం క్యూ పద్దతి పాటిస్తే పదిహేను ఇరవై నిమిషాల్లో అందరికీ చక్కటి దర్శనం లభించేది. గర్భగుడిలో లింగాన్ని చేతితో తాకి బయటకు వచ్చాము. (స్పర్శ దర్శనం)
ముప్పయ్యేళ్ల క్రితం మాదిరిగా కాకుండా ఆలయ ప్రాంగణాన్ని విశాలంగా తీర్చి దిద్దారు. గర్భగుడిలో తోపులాట గురించి కాస్త అసహనం వ్యక్తం చేసిన వారిని మరోవైపు దేవుడ్ని దర్శించిన తృప్తితో, భక్తి పారవశ్యంతో బయటకు వచ్చిన వారిని చూస్తే ఒక సత్యం బోధపడింది. ఏదో గొప్పగా జరుగుతుందని ఊహించుకుని వచ్చిన వారు మొదటి రకం. వారికి దేవుడి మీద కంటే కూడా పరిసరాలను గమనించడంలోనే ఆసక్తి జాస్తి. ఇందులో నాబోటి వాళ్ళు కూడా వున్నారు. మా బృందంలో చాలామంది, అలాగే భక్తుల్లో అనేకులు  చక్కటి  దర్శనం లభించింది అనే తృప్తితో గుడి నుంచి బయటకు వచ్చారు. ఎందుకంటే వారి దృష్టి ఆ దేవదేవుడిపైనే లగ్నమై వుంది. అర్ధనిమీలిత నేత్రాలతో శివ స్తోత్రాలు బిగ్గరగా చదువుతూ సాగుతున్న వారిని చూస్తే వీరుకదా నిజమైన భక్తులు అనే భావన కలిగింది. 
  
గంగమ్మ తల్లి వరద మీద వున్న కారణంగా బోట్లు తిరగడం లేదు అనే సమాచారం కొంత నిరాశ పరిచింది. బోటు నుంచి గంగాహారతి చూసే అవకాశం లేదు. చిన్న చిన్న సందుల్లో వెళ్లి చూసే ప్రయత్నం చేశాము. పితృ పక్షాల సమయం ఏమో తెలియదు, శివుడికి ప్రీతికరమైన సోమవారం మహత్యమో  తెలియదు, ఊరి మీద ఊరు పడ్డట్టు ఎక్కడ చూసినా భక్త జన సందోహం. అంత జనంలో ఇంతమందిమి అందులో ఒక చంటి పిల్ల తప్పిపోకుండా చూసుకోవడం మరో పెద్ద సమస్య. 
దేవాలయ సందర్శన అనేది ఒక పర్యాటక వ్యవహారంలా కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూస్తే పరిసరాలు కనపడవు, దేవుడు తప్ప. అలాకాకుండా విహార యాత్ర మాదిరిగానో, వీ వీ ఐ పీ దర్శనాలు చేసుకునే ఇతరులతోనో పోల్చిచూసుకోవడంతోనే సరిపెడితే పరిసరాలు కనపడతాయి కానీ, దేవుడు కనపడడు అనేవారు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారు. కానీ జర్నలిస్టు బుద్ధి కదా! కనపడకూడనివి మాత్రమే కనపడతాయి. దుర్గంధ భూయిష్టంగా వున్నఆ సందులన్నీ ఫోటో తీయాలనే తలంపు బలవంతాన మానుకున్నాను. పైగా మర్నాడే స్వచ్చభారత్ వార్షికోత్సవం. భక్తుల ఓరిమి మీద అధికారులకు పూర్తి నమ్మకం.  పైగా సెక్యూరిటీ జోన్ కారణమా అన్నది  తెలియదు, కనెక్టివిటీ సమస్య. అంచేత వెంటనే బయలుదేరి  గెస్ట్ హౌస్ కు వచ్చేశాము. 
మర్నాడు అయోధ్య ప్రయాణం. దాదాపు అయిదు గంటలు రోడ్డు మార్గంలో. దోవలో వరసగా అనేక ఫ్లై ఓవర్లు నిర్మించారు. ఒకే రహదారిపై అన్ని ఫ్లై ఓవర్లు వెంటవెంటనే నిర్మించడం ఆశ్చర్యం అనిపించింది.  అటూ ఇటూ కలిపి నాలుగు లేన్ల రోడ్డు.  మధ్యలో ఓ యాభయ్ కిలోమీటర్లు సింగిల్ రోడ్డు.
కాశీలో మాదిరిగానే అయోధ్యలో కూడా గుడి చుట్టుపక్కల ఇరుకు సందులు. మాకిచ్చిన టైం స్లాట్ ఒంటి గంట నుంచి మూడు. సమయానికి చేరగలుగుతామా లేదా అనే సందేహం. మా అన్నయ్య కుమారుడు సుభాష్ జీఎస్టీలో ఉన్నతాధికారి. ట్రాఫిక్ పోలీసులను ఒప్పించి దగ్గరి దారిలో తీసుకు వెళ్ళడం వల్ల సరిగ్గా మాస్లాట్ టైం ముగిసేలోగా గుడికి చేరగలిగాము. 
ముందుగానే టిక్కెట్లు ఆన్ లైన్లో బుక్ చేసుకున్నoదువల్ల శ్రమ లేకుండా బాల రాముడి దర్శనం సులభంగా, చాలా త్వరితంగా జరిగింది. 75 ఏళ్లు నిండిన మాలో ఆరుగురికి వీల్ చైర్ సౌకర్యం లభించింది. మాలో కొందరు రెండో మారు కూడా దర్శనం చేసుకున్నారు. అక్కడ  ఇంకా నిర్మాణాలు జరుగుతున్నాయి. అవన్నీ పూర్తయిన నాడు, అయోధ్య రామమందిరం కన్నుల పండువగా తయారవుతుంది.  తర్వాత అయోధ్యలో కొత్తగా నిర్మించిన స్టార్ హోటల్ రామాయణంలో భోజనాలు చేసి మళ్ళీ కాశీ చేరే సరికి బాగా పొద్దు పోయింది.
మర్నాడే తిరుగు ప్రయాణం. ఈలోగా ఒక కబురు తెలిసింది. గంగలో పడవలపై ఆంక్షలు తీసేసారు అని. వెంటనే పోలోమంటూ బయలుదేరి కేదార్ ఘాట్ చేరుకుని ఒక మోటారు బోటులో అన్ని ఘాట్లు చూసుకుంటూ గంగలో కలయ తిరిగాము. చుట్టూ గంగ పారుతూ వున్నా కూడా ప్రతిఒక్కరికీ ఆ ఎండలో దిగచెమటలు పట్టాయి. ఒకళ్లిద్దరం తప్పిస్తే మిగిలిన వాళ్ళు అందరూ బోటు  దిగగానే గంగలో స్నానాలు చేశారు. గ్రీన్ ఆటోలు (బ్యాటరీతో నడిచేవి) పట్టుకుని అందరం గెస్ట్ హౌస్ కి తిరిగి వచ్చేసరికి ఫ్లయిట్ టైమ్ అయింది. పన్నెండున్నర తర్వాత కానీ, గెస్ట్ హౌస్ లో  లంచ్ మొదలు కాదు. నిరాహారంగానే బయలుదేరి కార్లు ఎక్కి కూర్చున్నాము. ఇంతలో ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి, కాశీకి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళడానికి వీలులేదు, మీకు అయిదు నిమిషాల్లో అన్నం వడ్డిస్తాను, రండి అని పిలిచాడు. అతని పేరు ముత్తు. గెస్ట్ హౌస్ క్యాంటీన్ ఇన్చార్జి. 
మాతా అన్నపూర్ణేశ్వరి దయ, మన ప్రాప్తం అనుకుంటూ వెళ్లి,  వేడి వేడిగా వడ్డించిన భోజనాలు చేసి ఎయిర్ పోర్ట్ చేరుకున్నాము. అసాధ్యం అనుకున్న గంగాస్నానంతో పాటు అన్నపూర్ణమ్మ తల్లి ప్రసాదం కూడా దొరకడం మా అదృష్టం.

తోకటపా:
ఇళ్ళల్లో కళ్ళముందే పెరిగి పెద్దయిన పిల్లలు, తమ తలితండ్రులకు ఒక దశలో  కుడి భుజం అవుతారు. భుజాలు ఒక్కటే కాదు, కాళ్ళూ చేతులు కళ్ళూ అన్నీ వాళ్ళే అనడానికి మా ఈ కాశీ యాత్రే ఉదాహరణ. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు,  మా వదిన విమలాదేవి గారు ఈ విషయంలో మహా అదృష్టవంతులు. వెళ్లిన గ్రూపులో దెబ్బయి దాటిన వాళ్ళం ఆరుగురం వున్నాం. మా అన్నయ్య పిల్లలు జవహర్, సుభాష్, లాల్, వారి భార్యలు రేణు, హేమ, దీప, మా కోడలు నిషా, మా మేనల్లుడు రామచంద్రం  భార్య కరుణ అస్తమానం వాళ్ళు కష్టపడుతూ, మేము  ఏమాత్రం  కష్టపడకుండా కనిపెట్టి చూసారు. వాళ్ళూ మరీ చిన్నవాళ్లేమీ కాదు, కానీ పెద్ద మనసున్న వాళ్ళు.  
హైదరాబాదు నుంచి ఎప్పటికప్పుడు మా యోగ క్షేమాలు కనుక్కుంటూ అప్పటికప్పుడు అవసరమైన సాయం, లోకల్ ట్రాన్స్పోర్ట్, గంగలో తిరగడానికి బోటు వంటివి ఏర్పాటు చేసిన మరో గొప్ప వ్యక్తి వున్నారు. వారి పేరు రమేష్ గారు. మా అన్నయ్య పెద్ద కుమారుడు జవహర్ వియ్యంకులు. వీరందరికీ ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు. పోతే, రెండేళ్ల పైచిలుకు వయసున్న నా మనుమరాలు జీవిక అర్ధరాత్రి లేపినా, ఏడిపించకుండా లేచి బుద్దిగా స్నానం చేసి గుడికి వచ్చింది. వీల్ చైర్ లో నాతో పాటు కూర్చోమన్నా వినకుండా అంతంత దూరాలు నడిచే తిరిగింది. 
వీటన్నిటి వెనుక మనకు తెలియని అర్థం కాని ఏదో అదృశ్య శక్తి వుంది అనుకోవడంలో తప్పేమీ లేదు.
అలాగే అనుకుంటూ యాత్ర పూర్తి చేసుకుని, తిరిగి ఇండిగో ఎక్కి ముందు అనుకున్న విధంగానే అక్టోబర్ రెండో తేదీ సాయంత్రానికి  క్షేమంగా అందరం హైదరాబాద్ చేరాము.
(ప్రయాణంలో కనెక్టివిటీ సమస్య కారణంగా పోస్టు చేయడం కొంచెం ఆలస్యం అయింది)

కింది ఫోటోల్లో వారణాసి ఎయిర్ పోర్టు వద్ద స్వాగతం, గంగలో పడవ ప్రయాణం, అయోధ్యలో రామాయణం హోటల్లో భోజనం,  ప్రయాణం చివర్లో గ్రూపు సభ్యులు, చివర్లో కడుపు చల్లబరచి పంపిన గెస్ట్ హౌస్ కిచెన్ ఇన్ చార్జ్ ముత్తుతో నేను.  

04-10-2024