20, డిసెంబర్ 2020, ఆదివారం

చంద్రబాబు నాయుడు జగన్ ను చూసి నేర్చుకోవాలి – భండారు శ్రీనివాసరావు

 (Published in AP edition of SAKSHI on 20-12-2020, SUNDAY today)

ఇదెప్పుడో క్రీస్తుకు పూర్వం చరిత్ర కాదు. యువకుల నుంచి వృద్ధుల వరకు గుర్తున్న గతమే.

ఒకప్పుడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్నది ఎవరిని ? సాక్షాత్తు తను ఏ పార్తీకి లోకసభలో నాయకత్వం వహిస్తున్నాడో ఆ కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలిని. అప్పటివరకు తన నాన్నగారికి అనుయాయుల్లా, నమ్మిన బంటుల్లా, అనుచరుల్లా వ్యవహరిస్తూ వచ్చిన సొంత పార్టీ ముఖ్యమంత్రులు, మంత్రులు, నాయకులు  అధినాయకురాలికి భయపడిపోయి  తనకు దూరం జరిగినా, తనను దూరం చేసుకున్నా, రాజకీయ ప్రేరేపిత కేసుల్లో చిక్కుకుని పదహారు నెలలు జైల్లో గడిపినా జగన్ మోహన రెడ్డి వీసమెత్తు ఆదరలేదు, బెదరలేదు. దేశంలో ఉన్న అన్ని పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తనకు వ్యతిరేకంగా వున్నప్పుడు, మీడియాలో అధిక భాగం తన పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన  కాడి కింద పారేయలేదు. అదే ధైర్యం, అదే తెగువ జన సామాన్యంలో అతడ్ని హీరోను చేసాయి. ఆయనపై పడిన మచ్చలను జనం పట్టించుకోలేని విధంగా రక్షణ కవచంలా కాపాడాయి.

ఒకనాడు జగన్ మోహన రెడ్డి ఎదుర్కున్న ఈ కఠిన పరిస్థితులను చంద్రబాబు ఈనాడు ఒక స్థాయిలో ఎదుర్కుంటున్నారు. నిజానికి ఆ రోజుల్లో  జగన్ ఒక్కడూ ఒక పక్క,  మిగిలిన పార్టీలన్నీ మరోపక్క. చంద్రబాబు నాయుడికి ఈ పరిస్థితి లేదు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల వంటి కొన్ని రాజకీయ పక్షాలు ఇంకా ఆయనతో మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాయి. బీజేపీతో ఆయన కొని తెచ్చుకున్న వైరం తప్పిస్తే  వాళ్ళంతట వాళ్ళు చంద్రబాబు చేతిని వదిలేసి పోయింది లేదు. 2014 నుంచి  2019 వరకు రాష్ట్రంలో అధికారం ఆయనదే. చంద్రబాబు ఏదో సాధిస్తాడని,  నూతన రాష్ట్రం ఆయన చేతుల్లో పదిలంగా ఉంటుందని జనంలో  అపరిమితమైన  నమ్మకం. ఆయన దక్షత పట్ల, శక్తియుక్తుల పట్ల చదువుకున్న వారిలో,  మేధావి వర్గాలలో సైతం అంతులేని విశ్వాసం. ఆయన ఏం చేసినా   గోరంతను కొండంత చేసి చూపే  మీడియా. కేంద్రంలో చాలా కాలం తన మాటకు ఎదురు చెప్పని మిత్ర ప్రభుత్వం.  నిజానికి ఏ పరిపాలకుడికి అయినా ఇంతకు  మించి ఏం కావాలి?  అయినా ఆయన తన  అయిదేళ్ళ పుణ్య కాలాన్ని రకరకాల ఆలోచనలు చేస్తూ, ప్రణాళికలు రచిస్తూ గడిపారే కాని వాటిల్లో అధిక భాగం అమలుకు నోచుకోలేదు. కొన్ని చేయగలిగినా వాటికి సంపూర్ణత్వం సిద్ధించలేదు.

అయిదేళ్ళ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయనకు తన ఆత్మ విశ్వాసం పట్ల ఎనలేని నమ్మకం. నిజానికి నాయకుడు అనేవాడికి ఇది చాలా అవసరం కూడా.  అయితే  ఆత్మ విశ్వాసం పరిధి మించితే వచ్చేది  దుష్ఫలితాలే.

జగన్ మాదిరిగా నెత్తి మీద కత్తిలా ఆయనకు కోర్టు కేసుల గొడవ  లేదు. గ్రామ స్థాయి కార్యకర్తల బలంతో పోల్చి చూసుకున్నా వైసీపీ కంటే టీడీపీ మెరుగైన స్థితిలోనే వుంది. ఆయన్ని సమర్ధుడైన నాయకుడిగా గుర్తించి, గౌరవించే రాజకీయేతర పెద్ద మనుషులకు కూడా కొదవ లేదు. ఈ రకమైన అభిమానులు చంద్రబాబుకు దేశ విదేశాల్లో అధిక సంఖ్యలో వున్న విషయం రహస్యమేమీ కాదు. ఇక రాజకీయ అనుభవమా! ఈ విషయంలో ఆయనది ఎప్పుడూ అగ్రస్థానమే.

మరి ఇన్ని సానుకూల పరిస్థితులు వున్న నేపధ్యంలో ఆయన నేతృత్వంలోని తెలుగు దేశం పార్టీ ఎందుకు ముక్కుసూటి రాజకీయాలు కాకుండా వ్యూహ, ప్రతివ్యూహాలతో కూడిన రాజకీయ ఎత్తుగడలను ఆశ్రయిస్తోంది? చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రిగా పదవీస్వీకారం చేసిన కొత్తల్లోనే కొత్త ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకునే వ్యవధానం కూడా ఇవ్వకుండా నరకాసుర సంహారం వంటి బహిరంగ నిరసనలకు దిగిన వైసీపీ వ్యూహం ఎలా దారుణంగా విఫలం అయిందో టీడీపీ వ్యూహకర్తలు మరిచిపోయారా?  

ఒక ఎన్నికలో చతికిల పడిన పార్టీ  అంతటితోనే చితికి పోదు, అంతరించిపోదు.  దీనికి టీడీపీనే రుజువు. పార్టీ సంస్థాపక అధ్యక్షుడు జీవించి ఉన్న కాలంలో కూడా ఆ పార్టీకి  ఉత్థానపతనాలు  తప్పలేదు. అలాగే ఒకానొక రోజుల్లో టీడీపీకి ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఇదే. 1989లో అధికారంలో ఉన్న ఈ పార్టీ తరువాత ఎన్నికల్లో ఓడిపోయింది. 1994లో అసెంబ్లీలో ఈ పార్టీ బలం కేవలం 26.   అలాంటిది 2004 ఎన్నికల నాటికి  మళ్ళీ తన బలాన్ని 185 కి పెంచుకుంది.

ప్రస్తుత అసెంబ్లీలో మొత్తం 175 స్థానాల్లో  టీడీపీకి 23  లభించాయి.  మొత్తం 294 స్థానాల్లో 26 గెలుచుకున్న అప్పటి కాంగ్రెస్ పరిస్థితితో పోలిస్తే ఇది మెరుగే. కాంగ్రెస్ మళ్ళీ పుంజుకొని తర్వాత పదేళ్లకు అధికారంలోకి వచ్చింది. మరి ఈసారి ఓటమితో టీడీపీ అంతగా కుంగిపోవడం ఎందుకు? వైఫల్యాల్లో అవకాశాలు వెతుక్కునే సమర్ధత కలిగిన నాయకుడు ప్రజాస్వామ్య బాటలో సాగి మరో విజయానికి ప్రయత్నం చేయకుండా కోర్టులు, కేసులు వంటి పరోక్ష పద్దతిలో కౌటిల్యం చేస్తున్నారనే నిందలు మోయడం ఎందుకు? వెనుకటి రోజుల్లో  అయితే, వీటిని జనంలో చాలామంది తేలిగ్గా తీసుకునేవారేమో కానీ ఇప్పటి సోషల్ మీడియా యుగంలో అలాంటి అవకాశం ఉంటుందా!

ప్రధాన స్రవంతి మీడియాకు ధీటుగా, మరింత ఎక్కువ ప్రభావం చూపగల సోషల్ మీడియా పురుడుపోసుకున్న ఈ  కాలంలో పాత పద్దతులు పనికిరాకపోవచ్చు. కాలానుగుణంగా అప్ డేట్ కావాల్సిన అవసరాన్ని గురించి టెక్నో సావీ రాజకీయ నాయకుడైన చంద్రబాబుకు ఒకరు చెప్పేది ఏమీ వుండదు.

ఎన్నికల సమరంలో  చదరంగపు ఎత్తులు, ఎత్తుగడలు అవసరమే. కానీ  సాంఘిక మాధ్యమాలు రాజ్యం చేస్తున్న ప్రస్తుత కాలంలో మరీ ఎక్కువ చాణక్యం మేలుచేయకపోవచ్చు.

అధికార పక్షానికి న్యాయస్థానాల అక్షింతలు, మొట్టికాయలు అంటూ నిరంతరంగా సాగించిన ప్రచారం మరో రకంగా  జగన్ పట్ల సానుభూతిని పెంచేదిగా తయారు అయ్యే అవకాశాలను గురించి ఆలోచించకపోవడం టీడీపీ  వ్యూహకర్తల మరో వైఫల్యం. దీనికి తోడు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక న్యాయస్థానం ఇచ్చిన  తీర్పుల్లో అధిక భాగం పై కోర్టులో నిలవకపోవడం కూడా టీడీపీ పై వచ్చిన ఆరోపణలకు ఊతం ఇస్తోంది.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్నా, ఇప్పుడు కొత్తగా రాష్ట్ర విభజన అనంతరం తీసుకున్నా అత్యంత ఎక్కువ కాలం పాలించిన నాయకుడు.  సందేహం లేదు.  పరిపాలనా వ్యవస్థకు సుదీర్ఘ కాలం ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి,  వ్యవస్థల నడుమ ఘర్షణ వాతావరణం ఏర్పడడానికి కారణం అని ఎవరైనా లేశ మాత్రంగా అనుమానించినా కూడా చంద్రబాబు నాయుడికి శోభస్కరం కాదు.

ఏదో సినిమాలో చెప్పినట్టుయుద్దం గెలవడం అంటే శత్రువును చంపడం కాదు.. ఓడించడం” 

ఇది హితవచనం మాత్రమే.   (18-12-2020)



  

9 కామెంట్‌లు:

సూర్య చెప్పారు...

సాక్షికోసం రాసారా?బావుంది.

sasi చెప్పారు...

Bhale comedy ga rasaru.Neutral musugu inka entha kalam manage chestarlendi.Inka ekkuva kastapadakandi

శ్యామలీయం చెప్పారు...

అవునండీ తప్పకుండా నేర్చుకోవాలి చంద్రబాబు గారు. సందేహం అక్కరలేదు. ప్రజలు అభివృద్ధిని కొరుకుంటారు - ఇది సామాన్యుల నుండి మేధావుల వరకు అందరికి ఉండే సాధారణ అవగాహన. కాని, ప్రజలకు ఊరించే తాయిలాలు కావాలి - ఇది ఆధునిక రాజకీయ అవగాహన. రేపటి కోసం కష్ట పెడదాం అనేవాడి కన్నా నాడే మీకు బంగరు మురుగులు తొడుగుతారు రండి నా వైపుకు అనేవాడు ఈనాటి ఓటర్లకు ఆకర్షణీయంగా ఉంటాడు. ఆధునిక దృక్పథం అలవరచుకొని జనాకర్షణ కోసం యత్నించలేకపోయిన నాయకుడు తప్పకుండా నేర్చుకోవాలి. ప్రజలకు భవిష్యత్తులో వచ్చే లాభం కన్నా వర్తమానంలో దొరకబోతున్న తాయిలాలే ముఖ్యం అని ఇప్పటికైనా తెలుసుకోవాలి.

శ్యామలీయం చెప్పారు...

... కష్ట పడదాం ...
Sorry for the typo.

Jai Gottimukkala చెప్పారు...

ఒకరి దగ్గర చూసి నేర్చుకోవడం అనడం వారి బ్లడ్డు/బ్రీడులో ఉందంటారా?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@ సూర్య: సాక్షి కోసం రాయలేదు. నేను రాసింది సాక్షిలో వచ్చింది.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@sasi : డెబ్బయి అయిదులో పడ్డాను. ఏదో ఇంకొన్నాళ్ళు ఇలా మీ దయవల్ల

hari.S.babu చెప్పారు...

భలే సలహా ఇచ్చారు సార్ చంద్రబాబుకి!

మొహమాటం లేకుండా తనో 46 వేల కోట్లూ పక్కనున్నవాళ్ళకి పందేరం చేసి మొత్తం లక్షకోట్లు కొట్టెయ్యమని సలహా ఇవ్వాల్సింది.

కోడి కత్తి డ్రామాలతో సెంటిమెంటు పందించమని సలహా ఇవ్వాల్సింది.

"నేను గాని ఒక ఈల గాని వేస్తే.." అని పిట్టలదొర సినిమాలో హీఎరో అన్నట్టు నేను తల్చుకుంటే ఈ ప్రభుత్వం గంతలో పడిపోతుందని వాగి రోజు గడిచేసరికి తనవాళ్ళే గోడ దూకితే అసెంబ్లీ మొహం చూడ్డానికి సిగ్గుపడిన దేబెతనాన్ని అలవాటు చేసుకోమని మీరు దగ్గిరుండి త్రైనింగు ఇచ్చి నేర్పాల్సింది.

పోలీసు నియామకాల్లో 2 కమ్మ పేర్లని 35 చేసి అబద్ధాల వార్తలతో ప్రజల్ని మోసం చెయ్యడం నేర్చుకోమని మొట్టికాయలు వేసి చెప్పాల్సింది.

డబ్బు తీసుకుని పే TM బ్యాచ్చిని ఉపయోగించుకుని బజారు వెదవల్ని గొప్పవాళ్ల కింద మార్చేసి గెలిపించే ప్రశాంత్ కిశోరు లాంటి తప్పుడు వెధవల్ని ఉపయోగించుకోమని సలహా ఇస్తే బాగుండేది.

రాష్ట్రాన్ని బాగుచెయ్యడం గాక చెడగొట్టటం/పాడుచెయ్యటం/తగలబెట్టటం నేర్చుకోమని సలహా ఇస్తే ఆంధ్రా చంకనాకిపోతే చూడాలని గుటకలు మింగుతున్న జై గొట్టిముక్కల లాంటివాళ్ళు దొంగవోట్లు కూడా వేసి చంద్రబాబుని గెలిపిస్తారు.

కదూ జై!

నీహారిక చెప్పారు...

సాక్షి లో అచ్చేయాలంటే ఇలాగే వ్రాయాలి.
You too brutus....