30, అక్టోబర్ 2019, బుధవారం

రేడియో రోజులు -1 -భండారు శ్రీనివాసరావు

(29-10-2019 తేదీ  మంగళవారం సూర్య దినపత్రికలో ప్రచురితం)

‘ఆకాశవాణి కేంద్రం, హైదరాబాదు’
(నిషిద్ధ ప్రదేశం, అనుమతిలేనిదే లోనికి రాకూడదు)
“ఒక్కసారయినా ఇందులోకి వెళ్ళొస్తే ఎంత బాగుంటుందో!”
ఇలా మనసులో అనుకుంది ఎవరో కాదు, ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వానికి సాంస్కృతిక సలహాదారుడుగా వున్న మాజీ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ కేవీ. రమణాచారి. ఆయన స్వయంగా ఒక సభలో ఈ విషయం చెప్పారు.
అలాంటి రేడియో స్టేషన్ లో మూడు దశాబ్దాలకు పైగా కొలువు చేసే అపూర్వ అవకాశం నాకు  లభించింది. ఇది పూర్వ జన్మ సుకృతం.
అలనాటి అనుభవాలను కొన్నింటిని సూర్య పాఠకులతో పంచుకోవాలనే సంకల్పానికి సుముఖత చూపిన  ఆ పత్రిక యాజమాన్యం, సంపాదక వర్గానికి కృతజ్ఞతలు.
ఇక చదవండి!


2004 జనవరి చివరి వారం లో ఒక రోజు.

ఇంకా పూర్తిగా తెల్లవారలేదు.

బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి అప్పుడే ఇంటికి చేరాను, మా ఆవిడను అమెరికాలోనే పిల్లల దగ్గర  వొదిలేసి.
పేపర్లు వచ్చే సమయం కాలేదు కనుక టీవీ స్విచ్ ఆన్ చేసాను. హఠాత్తుగా టీవీ తెరపై వార్తలు చదువుతూ అమర్ కనిపించాడు. నాకు తెలిసినంతవరకు అతడికి ప్రింట్ మీడియా తప్ప విజువల్ మీడియాలో పనిచేసిన అనుభవం లేదు. అప్పుడెప్పుడో ఎన్నో ఏళ్ల క్రితం ఒకసారి రేడియోలో ప్రాంతీయ వార్తలు చదివే కాజువల్ న్యూస్ రీడర్ పోస్ట్ కోసం వచ్చాడు. అదీ మా రిక్వెస్ట్ మీదనే. జర్నలిస్టులు అయితే భాష మీద పట్టు వుంటుందని మావాళ్ళు వాళ్లకు ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. నిజానికి ఇది రెగ్యులర్ ఉద్యోగం కాదు. వార్తలు చదివేవాళ్ళు సెలవు పెట్టినప్పుడు వీళ్ళని బుక్ చేసి ఆ రోజు వార్తలు చదివిస్తారు. అప్పట్లో రేడియోకు వున్న గ్లామర్ మూలాన చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఆసక్తి చూపేవారు. కాజువల్ న్యూస్ రీడర్ని సెలక్ట్ చేయడానికి చిన్న పరీక్ష వుండేది. ఇంగ్లీష్ నుంచి వార్తలను తెలుగులోకి అనువాదం చేయడం, ఒక నమూనా న్యూస్ బులెటిన్ చదివించి రికార్డ్ చేయడం అన్నమాట. వార్తాపత్రికల్లో పుష్కలంగా అనుభవం వున్న అమర్ కు అనువాదం కొట్టిన పిండి. అందువల్ల ఆ మెట్టును ఇట్టే దాటి బులెటిన్ చదివే ఘట్టానికి చేరుకున్నాడు. అది దాటితే సెలక్షన్ అయిపోయినట్టే. అయితే, అమర్ వాయిస్ లో తెలంగాణా స్లాంగ్ వుంది అని కామెంట్ చేసాడు అప్పటి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు. అతడు ఆంద్ర ప్రాంతం వాడయినా ప్రాంతీయ విద్వేషాలు లేని మనిషి. రేడియో బులెటిన్ తయారు చేయడం పట్ల ఆయనకు కొన్ని నిర్దిష్ట మయిన ఆలోచనలు వున్నాయి. అన్ని ప్రాంతాలవారు వింటారు కాబట్టి ఎలాటి రీజినల్ స్లాంగ్ లేకుండా వార్తలు చదవాలన్నది కేంద్ర ప్రభుత్వ అధికారిగా అతగాడి ఉద్దేశ్యం. కానీ ఈ సంగతి తెలిసిన అమర్ నిర్ద్వందంగా ఆ సెలెక్షన్ ప్రాసెస్ ను కాదని వెళ్ళిపోయాడు. అయితే ఆకాశవాణి ప్రాంతీయ విభాగంలో పనిచేస్తున్న మాడపాటి సత్యవతి, అమర్ చదివే విధానం నచ్చి ఆయన చేత వారానికి రెండుసార్లు ప్రసారం అయ్యే ‘వార్తావాహిని’ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా అవకాశం ఇచ్చారు. అప్పుడు అక్కడే విలేకరిగా పనిచేస్తున్న నాకు, అమర్ తో అప్పటివరకు ఉన్న పరిచయం అంతంత మాత్రమే  అని చెప్పాలి. అది కూడా ప్రెస్ క్లబ్ కే పరిమితం. కాకపొతే తరవాతి రోజుల్లో మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నా విషయం వొదిలి పెడితే, అమర్ స్వతహాగా స్నేహశీలి. అందరితో చాలా కలుపుగోలుగా మెలిగే తత్వం అమర్ సొంతం. అప్పుడే అమెరికా నుంచి వచ్చిన నాకు అమర్ టీవీ తెరపై కనబడడం యెంత ఆశ్చర్యాన్ని కలిగించిందో, అంతకంటే ఎక్కువ ఆశ్చర్యం మరో సంగతి గమనించిన తరవాత కలిగింది. అమెరికాలో ఇరవై నాలుగుగంటల న్యూస్ ఛానళ్ళకు అలవాటు పడి రావడం చేత, తెలతెలవారే   ఆ సమయంలో వార్తలు ఎందుకు వస్తున్నాయో అన్న అనుమానం ముందు కలగలేదు. వేళకాని వేళలో  టీవీలో ఈ  వార్తలు ఏమిటి అన్న సందేహం పొటమరించిన తరవాత నా ఆశ్చర్యం రెట్టింపు అయింది. ఇదేమిటి ఇది ఇండియాలో సాధ్యమా అనిపించింది. ముప్పయ్యేళ్ళకు పైగా  రేడియోలో పనిచేస్తున్న నాకు ఈ పరిణామం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒకే ఒక మూసలో పోసినట్టుగా కాకుండా నాలుగు కోణాలనుంచి జనం సమాచారం తెలుసుకునే వీలు కలిగినందుకు ఒక మీడియా మనిషిగా ఆనాడు సంతోషించాను. వెంటనే బయటకు వెళ్లి పబ్లిక్ కాల్ బూత్ నుంచి అమెరికాకు ఫోను చేసి నేను క్షేమంగా చేరిన సమాచారంతో పాటు, నేను దేశంలో లేని అయిదు మాసాల్లో సంభవించిన ఈ అద్భుతమయిన మార్పుని గురించి కూడా అక్కడి మా వాళ్లకు గొప్పగా వివరించాను.

ఆ రోజు టీవీలో చూసిన అమర్ ఎవరో కాదు తదనంతర కాలంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ గా పనిచేసిన దేవులపల్లి అమర్. జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు. (ప్రస్తుతం క్యాబినెట్ హోదాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు). ఆ తెలతెలవారే సమయంలో నేను చూసిన ఆ న్యూస్ చానల్ టీవీ -9.
ముందు అడుగు వేసినవాడే మునుముందుకు పోగలుగుతాడని అనతి కాలంలోనే నిరూపించిన వ్యక్తి ఆ ఛానల్ సీయీఓ  రవి ప్రకాష్. అప్పటికే జెమినీ టీవీలో నిర్వహించిన కార్యక్రమాలు ఆయనకు ఎంతో పేరుతొ పాటు అసంఖ్యాకమయిన అభిమానులను సమకూర్చిపెట్టాయి. టీవీ ఇంటర్వ్యూ లు అంటే ఇలాగే వుండాలని అనుకున్నవాళ్ళలో నేను కూడా వున్నాను. (ఓ ప్రైవేట్ టీవీ ఛానల్ ను, అందులో తెలుగు టీవీని  దిగంతాలకు చేర్చగలిగిన సత్తా చూపిన రవిప్రకాష్ విషయంలో ఇటీవల వెలుగు చూసిన కొన్నిపరిణామాలు, ఆయన శక్తి సామర్ధ్యాలను మసకబారేలా చేయడం ఓ విషాదం)   

అదలా ఉంచితే, తదనంతర కాలంలో ఎస్. జైపాల్ రెడ్డి  మా మంత్రిగా పనిచేసిన కాలంలో, ఆకాశవాణి , దూరదర్శన్ లను ప్రభుత్వ పెత్తనం నుంచి తప్పించి ప్రసార భారతిని ఏర్పాటు చేసినప్పుడు కూడా మరింత ముచ్చట పడ్డాను. పలురకాల న్యూస్ చానల్స్ చూసే అవకాశం జనాలకు వుండాలన్నది నా ప్రగాఢమయిన కోరిక. అప్పటికే సోవియట్ యూనియన్ లో పరిస్తితి చూసివచ్చిన అనుభవం వుండడం వల్ల అలాటి మార్పును నేను మనసారా కోరుకున్నాను. అయితే, చాలా సంవత్సరాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోని మీడియాలో పని చేయడం వల్లనో ఏమో వార్తలను వార్తలుగా మాత్రమే ఇవ్వాలనే సిద్దాంతానికి అలవాటు పడ్డాను. వ్యాఖ్యను మరోరకంగా వీక్షకులకు అందచేయాలి తప్ప వార్తలో మిళితం చేసి ఏది వార్తో ఏది వ్యాఖ్యో తెలియకుండా వారిని గందరగోళపరిచే హక్కు వార్తా పత్రికలకు కానీ, మీడియాకు కానీ వుండకూడదన్నది నా నిశ్చితాభిప్రాయం.
 వార్తలను ఎలాటి అంటూ సొంటూ లేకుండా అందించి , సంచలనం కోసం ఇచ్చే వ్యాఖ్యలను మరోరకంగా ఇవ్వడం వల్ల ‘వార్తలపట్ల జనాలకు వుండాల్సిన నమ్మకం చెదరకుండా వుంటుంద’ని భావించే వారిలో నేనొకడిని. ఒక్కసారి కనుక మనం ఇచ్చే వార్తలపట్ల జనాలకు అపనమ్మకం కలిగిందంటే చాలు ఆతరవాత మనం ఏది చెప్పినా ఆ ఛానల్ అలానే చెబుతుందని జనంలో ఒక చెరపలేని అభిప్రాయం ఏర్పడిపోతుంది. ఒకనాడు రేడియో, దూరదర్శన్ వార్తలకు ఇదే గతి పట్టింది. నిజాలు చెప్పినా నిర్ధారణ చేసుకోవడానికి బీబీసీ వినేవారు.

టీవీ –9 సాధించిన అపూర్వ విజయం పుణ్యమా అని తెలుగునాట మీడియా బూమ్ మొదలయింది. అనేక న్యూస్ ఛానళ్ళు రంగ ప్రవేశం చేసాయి. పెట్టుబడులు ప్రవహించాయి. తెలుగు మీడియాకు కనీవినీ ఎరుగని హంగులు సమకూరాయి.

ఒకప్పుడు దూరదర్శన్ ఓబీ వ్యాన్ (ప్రత్యక్ష ప్రసారాలకోసం వుపయోగించేది) బయటకు తీయాలంటే బ్రహ్మ ప్రళయం. సందులు గొందుల్లో మలుపులు తిరగలేని పెద్ద ట్రక్కులాటి భారీ వాహనం. ఇరవై మంది సిబ్బంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ముందస్తు అనుమతుల జంఝాటం.

ఇప్పుడో, ఒక చిన్న వ్యాన్ లోనే ఈ పరికరాలని అమర్చుకోగల సాంకేతిక సామర్ధ్యం పెరిగింది. చిన్న సంఘటనకు కూడా వెంటనే స్పందించి టీవీ ఛానళ్ల వారు, వీటిని తక్షణం పంపి ప్రత్యక్ష ప్రసారాలు చేయగలుగుతున్నారు. (ఇప్పుడు ఇంకా సులువయింది. చిన్న సెల్ ఫోన్ తోనే ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారు.)

పోటీ వున్న చోట ప్రతిభ పెరిగే అవకాశం వుంది. అలాగే ప్రమాణాలు పడిపోయే ప్రమాదం కూడా వుంది. మీడియాలో వస్తున్న పరిణామాలు ఆనందంతోపాటు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. నాకే కాదు, ఈ రంగానికి సంబంధించిన చాలామందికి.

మా అన్నయ్య భండారు పర్వతాల రావు చెప్పేవారు. ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసు భవనం ఎక్కి రోడ్డు మీదికి  చూస్తే కళ్ళు తిరిగే ట్రాఫిక్కు. ఈ కార్లు, లారీలు, ఆటోలను దాటుకుని వెళ్ళగలమా అని భయం వేస్తుంది. వాటి నడుమ పోతూ వుంటే మాత్రం ఎలాటి జంకూ కలగదు. బహుశా, ఈ ఆందోళనలు కూడా అలాగే తొలగిపోయి ఆనందమే మిగలాలని కోరుకుందాం.
అన్నట్టు, ఆశ పడడం, ఆశగా ఎదురు చూడడం  మన దేశం మనకిచ్చిన జన్మహక్కు.

3 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

రేడియోలో వార్తలు చదవడానికై ఎంపికకు వచ్చిన దేవులపల్లి అమర్ ఆ ప్రోసెస్ పట్ల మరింత అవగాహన చూపించవలసింది ఆ సమయంలో. తన మాటలో తెలంగాణా యాస ఉన్నదన్నందుకు ప్రోసెసే నచ్చలేదా? మరిప్పుడు తెలంగాణేతర రాష్ట్రం అయిన ఏపీ ప్రభుత్వంలో పదవి ఎలా స్వీకరించాడో? రేడియో అంటే ఏదో ఒక ప్రాంతీయ సంస్ధ కాదనీ జాతీయ ప్రసారసాధనం అనీ తెలిసుండాలే? అయినా ఇప్పుడంటే మా భాష మా యాస అంటూ పట్టుదలలు ఎక్కువయ్యాయి గానీ (రాజకీయాల వలన), ఆ రోజుల్లో వార్తలు చదవడం అంటే neutral ఉచ్చారణతోటే చదవడం ఆనవాయితీ అని తెలియదా వారికి? నేనొకసారి ఎక్కడో చదివినట్లు గుర్తు ..... BBC లో ఏ ప్రాంతీయ ప్రభావమూ పడని ఉచ్చారణతోటే వార్తలు చదువుతారని, చదవాలనీ నిబంధన అనీ. ఒక్క లండన్ సిటీలోనే పలు రకాల యాసలు ఉన్నాయిట. మరి ఇంగ్లండ్ దేశంలో ఇతర ప్రాంతాలవారీ యాసలూ చాలానే ఉన్నాయిట. అయినా BBC లో మాత్రం nwutral ఉచ్చరణతోటే చదవాలనీ, neutral స్వరంలోనే (అంటే మన ఛానెళ్ళలాగా emotions మోత మోగించకుండా) చదవాలనీ నియమంట.

కాబట్టి ఆనాడు సెలెక్షన్ అప్పుడు ఆ రేడియో అధికారి గారు అన్నది సబబే అనిపిస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

పత్రికలు చేసిన సేవ తెలుగుకు ఒక ప్రామాణిక భాష రూపాన్ని స్థిరీకరించడం.
రవి ప్రకాశ్ ప్రతిభ కలవాడే కానీ దాన్ని దుర్వినియోగం చేసి ప్రస్తుతం ఫలితం అనుభవిస్తున్నాడు.
ఇప్పుడు వార్తా చానెళ్లకు పట్టిన దరిద్రమేమంటే ప్రతి వార్త వెంబడి ఒక దిక్కుమాలిన గుండెలు అవిసిపోయే మ్యూజిక్ బిట్ వేయడం.
వార్తలకు హేళన , జుగుప్సాకరంగా శీర్షికలు పెట్టడం.
రిపోర్టర్ లు నిర్విరామంగా జొల్లు వాగడం.
సిబీఎన్ చంద్రజ్యోతి, టీవీ 5, సాక్షి, ఈటీవి, ఎన్ టీవీ... దాదాపు అన్ని ఛానెళ్లు కుల రాజకీయ పిచ్చితో కంపు కొట్టడం. పుండాకోరు చర్చలు చేయడం. థూ మీ బతుకులు చెడ.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// "ఏది వార్తో ఏది వ్యాఖ్యో తెలియకుండా ...." //
tv-9 వారికి మీరు పెద్ద కితాబు ఇస్తున్నారు గానీ అటువంటి ప్రసారశైలిని మొదలెట్టిందే tv-9 వారు కదా. కొత్తలో ఆ శైలిని ప్రజలు ... సినిమా వాళ్ళు చెప్పినట్లు "డిఫరెంట్" గాను, "వెరైటీ" గానూ ఉందని ... ఒక వింతలాగా చూశారనే నా అభిప్రాయం. ఆ అనుకరణతో తరువాత తామరతంపరగా పుట్టుకొచ్చిన అన్ని ఛానెళ్ళ వారు చదివే సో-కాల్డ్ "వార్తలు" గోలగోలగా ఉంటున్నాయి అన్నది అందరూ ఒప్పుకునే మాటే.

నా దృష్టిలో ... రెండు రంగాలు ఆంధ్ర దేశంలో భ్రష్టు పట్టిపోయాయి. ఒకటి --> tv-9 వారు మొదలెట్టిన వింత ధోరణుల వల్ల గందరగోళంగా తయారయిన విజువల్ మీడియా (సరే ఇప్పుడు అది అన్ని రాష్ట్రాలకూ / భాషలకూ అంటుకుంది లెండి). రెండవది ....చైతన్య లాంటి వారు వేసిన కార్పొరేట్ విద్య అనే మాయాజలతారు ముసుగులో చిక్కుకుని భ్రష్టు పట్టిపోయిన విద్యావిధాన రంగం.

ఇవన్నీ irreversible stage కు జేరుకున్నాయి. ప్రజల గతి ఇంతే.