26, జులై 2022, మంగళవారం

గెలుపుకు కోరిక వుంటే చాలదు, పట్టుదల కూడా కావాలి

2024లో గెలవాలి అంటే గెలిచి తీరుతా అనే విశ్వాసం పెంచుకోవాలి. 2019 లో జగన్ చేసింది అదే! సాధించిన విజయం చివరిది అనుకున్న వాడే మరో విజయాన్ని కైవసం చేసుకోగలుగుతాడు.


నన్ను మన్నించు! నన్ను క్షమించు!

 


గత మూడేళ్ళుగా ఈ మాటలు నాలోనేను ఎన్ని లక్షలసార్లు అనుకుని ఉంటానో, ఇంకా అనుకుంటూనే వున్నానో లెక్క లేదు. ఇప్పడు ఎన్ని అనుకున్నా, ఎన్నిసార్లు అనుకున్నా ఏమిలాభం, వినే మనిషి మనుషుల్లో లేకుండా పోయిన తర్వాత.  

భద్రాద్రి రాముడిని ప్రస్తుతిస్తూ రచించిన  దాశరధి శతకంలో కంచర్ల గోపన్న ఇలా అంటాడు.

“సిరిగల నాడు మైమరచి చిక్కిననాడు దలంచి పుణ్యముల్

పొరిబొరి సేయనైతినని పొక్కిన గల్గునె గాలి చిచ్చుపై

గెరలిన వేళ దప్పికొని కీడ్పడు వేళ జలంబు గోరి త

త్తరమున ద్రవ్వినం గలదె దాశరథీ కరుణాపయోనిధీ!”

శరీరానికి ముసలితనం వచ్చిన తరవాత, ఇప్పటి వరకు పుణ్యమైన పనులను ఏమీచేయలేకపోయానే అని ఎంత బాధపడినప్పటికీ ప్రయోజనం ఉండదు. అందువలన ఓపికగా ఉన్న రోజులలోనే భగవంతుడి మీద భక్తితో పుణ్యకార్యాలను చేయాలి. లేకపోతే బాధపడవలసి వస్తుంది  అనేది తాత్పర్యం.

భార్యాభర్తల్లో ఎవరు ముందో ఎవరు వెనకో ఎవరూ చెప్పలేరు. అంచేత జీవించి ఉన్నప్పుడే ఒకరినొకరిని  బాధ పెట్టే పనులు చేయకుండా, మనసును నొప్పించే మాటలు అనకుండా వుంటే తర్వాత బాధ పడాల్సిన అవసరం వుండదు.

అలా అని మా ఆవిడని నేనేదో నానా  బాధలు పెట్టానని కాదు, ఆమె జీవించి వుండగా  ప్రేమించాల్సినంతగా ప్రేమించలేదేమో అని, ఆదరంగా పలకాల్సిన పలుకులు పలకలేదేమో అని మనసు మూలల్లో ఓ బాధ.

ఇది తీరేది కాదు.

ఆగస్టు మాసం వస్తోంది అంటే ఇది మరింత సెల వేస్తుంది.



(26-07-2022)  

 

షిర్డీ సాయిరాం

 1997 అంటే 25 ఏళ్ళ కిందట షిర్డీలో దిగిన ఫొటో. ఆ రోజుల్లో షిర్డీసాయి దేవాలయంలో మూల విరాట్ ముందు నిలబడి ఫొటోలు తీసుకోనిచ్చేవాళ్ళు. అంచేత ఈ ఫొటో మాకు ఒక అపురూపమైన కానుకగా మిగిలింది. నా పక్కన వున్నది మా రెండో అన్నయ్య కుమారుడు లాల్ భండారు.




25, జులై 2022, సోమవారం

కార్పొరేట్ దోపిడీ

వరద రాజకీయం

పుట్టింట్లో కొన్ని ఘడియలు

 

ఆజాదీకా అమృత్ మహోత్సవాల సందర్భంగా ఓ కార్యక్రమంలో పాల్గొందురు గాని, ఓమారు దయచేయండి అని పుట్టిల్లు ఆకాశవాణి నుంచి పిలుపు. ఎగిరి గంతేసా. రిటైర్ అయి పదిహేడేళ్లు. చాలాకాలం తర్వాత వెళ్ళే అవకాశం.
ఇంటర్వ్యూ చేయాల్సింది ఎవర్ని. బ్రిగేడియర్ శ్రీరాములు గారిని. మరో గంతు వేసా.
ఎందుకంటే ఆయన ఎవరో కాదు, ఎస్సారార్ కాలేజీలో మూడేళ్లు కలిసి చదువుకున్నాం. కాకపొతే ఆయన ఎంపీసీ. నేను కామర్స్.
ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఇద్దరం వెళ్లాం. ఆయన సైనిక పురి నుంచి, నేను ఎల్లారెడ్డి గూడా నుంచి. బ్రిగేడియర్ కి సాంప్రదాయక మర్యాదలు, నాకు ఆత్మీయతతో కూడిన పలకరింపులు. కొన్ని పరామర్శలు కూడా.
ఆయన నేనూ కాలేజీలో ఎన్సీసీ వాళ్ళమే. నేనేమో బూట్లు, యూనిఫారం కోసం, ఆయనేమో చిత్తశుద్ధిగా చేరిన బాపతు. 1971 ఇండో పాక్ యుద్ధంలో సైనికాధికారిగా పాల్గొని వీరోచితంగా పాల్గొని ఆయన ప్రసంశలు, పతకాలు సాధిస్తే, అదే సమయంలో నేనేమో బెజవాడ ఆంధ్రజ్యోతిలో నైట్ డ్యూటీలు చేస్తూ అదే యుద్ధ వార్తలు అనువాదం చేస్తూ ఉండేవాడిని.
బ్రిగేడియర్ చాలా విషయాలు చెప్పారు. ఎక్కడో హిమాలయాల్లో గడ్డకట్టే చలిలో, నిశిలో అయినవారికి దూరంగా మృత్యువు నీడలో సంచరిస్తూ, శత్రుసైనికుల కదలికలను గమనిస్తూ భారత సైనికులు తమ ప్రాణాలకు తెగించి దేశాన్ని కాపాడుతున్న విధానాన్ని ఆయన కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
మిలిటరీలో జవాన్ నుంచి జనరల్ వరకు సైన్యంలో చేరిన రోజే వీలునామా రాయించి తీసుకుంటారట. ఎప్పుడు ఏ క్షణంలో మృత్యువు పంజా విసురుతుందో తెలియని ఆ ఉద్యోగంలో ఎందుకైనా మంచిదని ఆ ఏర్పాటు. ఆంధ్రజ్యోతిలో చేరడానికి వెళ్ళిన రోజు, ఎడిటర్ నార్ల గారు, నీ రాజీనామా ఏదీ అని అడిగిన సంఘటన జనపకం వచ్చింది. బలవంతపు రాతలు రాయడం ఇష్టం లేకపోతె, ఉద్యోగం నుంచి స్వచ్చందంగా తప్పుకుని ఆత్మ గౌరవం వ్యక్తిత్వం కాపాడుకోవడానికి ప్రతి జర్నలిస్టు రాజీనామా లేఖ సిద్ధంగా ఉంచుకోవాలని నార్లగారి ఉవాచ.
త్రివిధ సైనిక దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది సేపటిలోనే ఒక సైనికాధికారిని రేడియోలో ఇంటర్వ్యూ చేయడం కాకతాళీయమే అయినా గొప్ప సంతృప్తిని కలిగించింది.
ప్రోగ్రాం పూర్తయింది. పెళ్లి చూపుల తతంగం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి ఏ సంగతి కబురు చేస్తాం అని మగ పెళ్లివాళ్ళు అన్నట్టు, ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారం అయ్యేది తర్వాత చెబుతాం అన్నారు రేడియో అధికారులు.
సరే! ఏదైతేనేం! ఏదో ఒక పేరుతో పుట్టిల్లు చూడడం, పుట్టింటి వారితో మాట్లాడడం అనే ఒక పని పూర్తయింది.
పదిహేడేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తు పట్టి పాత రోజులు గుర్తుకు తెచ్చిన ఇంజినీరింగ్, ప్రోగ్రాం సిబ్బందికి మనః పూర్వక ధన్యవాదాలు. ఒకప్పుడు మా దగ్గర న్యూస్ యూనిట్ తలలో నాలుకలా మా దగ్గర పనిచేసి, ప్రస్తుతం స్టేషన్ డైరెక్టర్ పేషీలో పనిచేస్తున్న శైలజారంగాచారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా ఆవిడ చనిపోయిన మూడేళ్ల తర్వాత కూడా ఆ విషయం తలచుకుని ఇవ్వాళ కన్నీళ్లు పెట్టిన ఆమె పెద్ద మనసుకు జోహార్లు.
కింది ఫోటోలలో బ్రిగేడియర్ ఎస్. శ్రీరాములు, స్టేషన్ డైరెక్టర్ ఉదయ శంకర్, సరే ఎలాగు నేను.











(25-07-2022)

వార్తా వంటకాలు - భండారు శ్రీనివాసరావు

విషయం ఒక్కటే. కానీ చూసే ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే, వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, వేర్వేరు పత్రికలు, వేర్వేరు కోణాల్లో, వార్తలు 'వండి వారుస్తున్న' తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. ఏ ఛానల్ మార్చి చూసినా యిదే వరస.

ఎవరయినా తాము చదివే పత్రిక, చూసే ఛానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు ఛానళ్ళ శకం మొదలయినప్పుడు, జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో కాకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

యిరవై నాలుగ్గంటల నిరంతర న్యూస్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ రోజుల్లో పనికొచ్చే సమాచారం, పనికిరాని సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ల వాళ్ళే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే, టీవీ ఛానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి, ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో, రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!