15, జులై 2022, శుక్రవారం

కొండంత వాత్సల్యం – భండారు శ్రీనివాసరావు

 రాయడానికి తీరిక ఒక్కటే కాదు, ఓపిక కూడా కావాలి.

దూరదర్సన్ లో నా సహోద్యోగి హనుమంతరావు గారికి రెండోది పుష్కలం. మొదటిది రిటైర్ అయినప్పటి నుంచి ఆయనకు పుష్కలంగా దొరుకుతోంది. ఉద్యోగం చేసే రోజుల్లో  పొద్దున్న ఆఫీసుకు వస్తే మళ్ళీ రాత్రికే ఇంటికి చేరడం. ఉదయం నుంచి సాయంత్రం వరకు పద్దులు రాస్తూ కూర్చొనే ఉద్యోగం  కాదది. సృజనాత్మకతతో  కార్యక్రమాలు రూపొందించే బాధ్యత కలిగిన దూరదర్సన్ కొలువాయే.

అలా పనిచేసిన అనుభవాల సమాహారమే ఈ గోరంత అనుభవం పుస్తకం.

ఉద్యోగ విరమణ అనంతరం దొరికిన తీరికతో, సహజసిద్ధంగా లభించిన ఓపికతో, అప్పుడెప్పుడో ఉద్యోగపర్వంలో కూడబెట్టుకున్న డబ్బులతో మొత్తానికి ఈ గోరంత పుస్తకాన్ని కొండంత శ్రమతో వెలుగులోకి తెచ్చారు.

ఇదంతా ఒక ఎత్తు. అచ్చు వత్తించిన పుస్తకాలను తెలిసిన వారికి స్వయంగా తీసుకువెళ్లి వాళ్ళ ఇంటి వద్దనే అందించాలనే ప్రయత్నం ఎందుకో నాకూ ముందు అర్ధం కాలేదు.

ఇవ్వాళ పుస్తకం ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు అదే అడిగాను.

ఆయన సమాధానం నాకు బాగా నచ్చింది.

ఆయన ఏమన్నారంటే! ఆయన మాటల్లోనే:

“కరోనాకు ముందు అందరం ఏదో ఒక విధంగా కలుస్తూ వుండేవాళ్ళం. కరోనా వచ్చిన తరవాత ఈ రాకపోకలు బాగా తగ్గిపోయాయి. ఇక కలుసుకోవడాలకు జనం స్వస్తి చెబుతారేమో అనే భయం కూడా కలుగుతూ వుండేది. అంచేత కలవడానికి ఒక సమాధానం వెతుక్కున్నాను. అదే ఈ పుస్తకం. పుస్తకం ఇవ్వాలనే పేరుతొ ఇలా నలుగురినీ కలుసుకుంటున్నాను. పుస్తకం ఇవ్వగానే పోమ్మనరు కదా!  కాసేపు కూర్చొంటాము. కబుర్లు చెప్పుకుంటాము. పాత సంగతులు నెమరు వేసుకుంటాము. మనసుకు హాయిగా వుంటుంది. పుస్తకం ఒక మిష మాత్రమే. అసలు సంగతి ఇది”

ఎంత గొప్పగా చెప్పారు అనిపించింది. హనుమంతరావు గారి స్నేహ వాత్సల్యపు రుచి అలాంటిది మరి.

అన్నట్టే, ఉన్న కాసేపట్లో  ఆయన కబుర్లు చెప్పారు. నా కబుర్లు విన్నారు. కంప్యూటర్ కు సంబంధించి ఆయన వారి పిల్లవాడి నుంచి, అచ్చంగా తెలుగు భావరాజు పద్మిని గారి నుంచి నేర్చుకున్న మెలకువలను నాకు బోధించారు. ఫేస్ బుక్ లో  తెలుగులో రాయడం ఎలా అని చాలా మంది మధన పడుతుంటారు. వారికి పనికొచ్చే పాఠాలు (చిట్కాలు) ఆయన దగ్గర బోలెడు వున్నాయి.



(15-07-2022)    

పార్టీలు కోర్టులు

డాక్టర్ కె.ఎల్. రావు రోడ్డు - భండారు శ్రీనివాసరావు

 (జులై,15, డాక్టర్ కె.ఎల్.రావు జయంతి)

హిందూ పత్రిక డిప్యూటీ ఎడిటర్ కీర్తిశేషులు శ్రీ ఆర్. జే. రాజేంద్రప్రసాద్ గారు హైదరాబాదు రాకముందు నుంచి కూడా నాకు తెలుసు. నేను విజయవాడలో ఆంధ్రజ్యోతిలో పనిచేసేటప్పుడు ఆయన అక్కడే హిందూ పత్రికకు ROVING CORRESPONDENT గా వున్నారు. వార్తలకోసం చుట్టుపక్కల జిల్లాలు తిరుగుతుండేవారు.
ఆ రోజుల్లో ఒకసారి మా వూరికి మా పార్లమెంటు సభ్యుడు, కేంద్రమంత్రి అయిన డాక్టర్ కే.ఎల్. రావు టూరు ప్రోగ్రాము పెట్టుకున్నారు. ఆ సందర్భంలో రాజేంద్రప్రసాద్ గారు 'మీ ఊరు పోతున్నాను, మీరూ వస్తారా' అని అడిగారు. 'అది అంత సులభం కాదండీ, ప్రయాణంలో చాలా అవస్థలు పడాలి' అన్నాను. 'అవస్థలు పడితేనే కదా మనకి వార్తలు దొరుకుతాయ'ని ఆయన అన్నారు.
సరే అని ఇద్దరం బెజవాడ నుంచి రైల్లో బయలుదేరాము. ఉదయం నైజాం పాసింజరులో వెళ్లి రెండు గంటల తర్వాత మోటమర్రి (అంతకుముందు అల్లినగరం) స్టేషనులో దిగాము. వర్షాకాలం. దోవ అంతటా చిత్తడి చిత్తడిగా వుంది. నాలుగు మైళ్ళు నడిచి వెడితే మా వూరు కంభంపాడు. చెప్పులు చేతిలో పట్టుకుని నడక మొదలు పెట్టాము. బురద నేలల్లో మోకాళ్ళ దాకా కాళ్ళు కూరుకుపోతున్నాయి. పాపం పట్టణం నుంచి వచ్చి ఎన్ని అవస్థలు పడుతున్నారో అనిపించింది. కానీ ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన మార్కు మందహాసంతో దారిపొడుగునా కబుర్లు చెబుతూనే వున్నారు. జొన్నచేలు దాటి, మా వూరు పొలిమేరల్లో వరిపొలాల గట్ల మీద నడుచుకుంటూ మొత్తం మీద మా వూరు చేరాము.
పల్లెటూరు కదా టిఫిన్ల మాట ఎత్తకుండా మా అమ్మగారు ఏకంగా భోజనాలకే లేపారు. మా బామ్మగారు ఎవర్రా వచ్చింది, తాసీల్ దారా అని అడుగుతోంది. భోజనాలు అయిన తర్వాత ప్రసాద్ గారు వూళ్ళో తిరిగి వద్దామన్నారు. వచ్చింది పేపరు మనిషి అని వూరి వాళ్ళకి తెలిసిపోయింది. ఆయనతో చెప్పుకుంటే పేపర్లో రాస్తారు, తమ కష్టాలు తీరిపోతాయని అందరూ ఆయన చుట్టూ మూగి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ప్రసాద్ గారు పరమ ప్రశాంతంగా వాళ్ళు చెప్పిన ప్రతిదీ ఓపిగ్గా విన్నారు. కే.ఎల్. రావు గారు మా వూరికి మధ్యాన్నం రెండు గంటల ప్రాంతంలో రావాలి. అందరం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం.
మూడయింది, నాలుగయింది, మంత్రిగారి జాడలేదు. చూస్తుండగానే చీకటి పడింది. అప్పటికి మా వూళ్ళో కరెంటు లేదు. కిరసనాయిలు దీపాలే. ఇంతలో జీపు హెడ్ లైట్ల కాంతి కనిపించింది. ఇంకేముంది వస్తున్నారని సంబర పడ్డాము. ఆ జీపు లైట్లు ఆకాశంలో చుట్టూ గిరగిర తిరిగే సర్కసు దీపం (బీమ్) మాదిరిగా కొంతసేపు కనిపించి ఆ తర్వాత కనపడకుండా పోయాయి. ఇంకో రెండు గంటలు చూసి వూరివాళ్ళు ఇళ్ళకు మళ్ళారు.
ఆ తర్వాత కాసేపటికి రెండు జీపుల్లో మంత్రిగారి కాన్వాయ్ మా ఇంటి దగ్గర ఆగింది. మా బాబాయి కొడుకు సత్యమూర్తి అన్నయ్య మా వూరు సర్పంచ్. కాస్త వసతిగా ఉంటుందని ఆయన కార్యకలాపాలు మా ఇంటి నుంచే నడిపేవారు.
అనుకున్నంత సేపు పట్టలేదు మంత్రిగారి పర్యటన. చల్లారిపోయిన పాలను మళ్ళీ వేడి చేసి పెట్టి ఇచ్చిన కాఫీలు తాగి నిష్క్రమించారు. వచ్చింది హిందూ కరస్పాండెంటు కాబట్టి ప్రసాద్ గారితో కాసేపు విడిగా మాట్లాడారు.
మర్నాడు బయలుదేరి మేమిద్దరం బెజవాడ వచ్చేసాము.
ఆ తర్వాత మూడో రోజనుకుంటాను హిందూలో ఓ బాక్స్ ఐటం వార్త వచ్చింది. సరైన రోడ్లు లేక దారి తప్పిన కేంద్రమంత్రి అంటూ. కేంద్ర మంత్రి తనతో మాట్లాడిన విషయాలను క్లుప్తంగా ప్రస్తావించి, వూరి వాళ్ళు తనతో చెప్పుకున్న కష్టాలను వివరంగా రాసారు.
ఆ వార్త వచ్చిన కొద్ది రోజులకే, కే.ఎల్. రావు గారు శ్రమదానం కార్యక్రమాన్ని ప్రకటించి మా వూరికి రోడ్డు, కరెంటు మంజూరు చేసారు. మా వూరికే కాదు చుట్టుపక్కల అనేక గ్రామాలను కలుపుతూ వత్సవాయి నుంచి చెవిటికల్లు వరకు మా వూరి మీదుగా రోడ్డు పడింది. కరెంటు వచ్చింది. శ్రమదానం అంటే ఏ వూరివాళ్ళు ఆ ఊరికి కావాల్సిన కరెంటు స్తంభాలు తమ బండ్ల మీద చేరవేయాలి. అలాగే రోడ్డు నిర్మాణంలో శ్రమదానం చేయాలి.
కే.ఎల్. రావు గారిచ్చిన స్పూర్తితో దాదాపు నలభయ్ గ్రామాల ప్రజలు పార్టీలతో నిమిత్తం లేకుండా తమ ఊళ్లకు కరెంటు, రోడ్డు సాధించుకున్నారు.
అయితే దండలో దారం మాదిరిగా ఆ రోజు రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన వార్త ప్రభావం ఈ అభివృద్ధిలో వుంది.
దానికి ప్రత్యక్ష సాక్షులలో నేనొకర్ని.
తోకటపా: ఆ రోడ్డుకు ఎవరూ పనికట్టుకుని పేరు పెట్టలేదు. ఆ నలభయ్ గ్రామాల ప్రజలే ఈనాటికీ దాన్ని కె.ఎల్.రావు రోడ్డు అని పిలుచుకుంటున్నారు.

14, జులై 2022, గురువారం

శ్రీలంక పరిణామాలు

రివాజుగా మారిన సవాళ్లు, ప్రతి సవాళ్లు

గోదావరి వరదలు – భండారు శ్రీనివాసరావు


నేను హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేస్తున్న రోజుల్లో ఓసారి గోదావరి నదికి ఉధృతంగా వరదలు వచ్చాయి. పెరుగుతున్న వరద నీటి మట్టాలను గురించి ఎప్పటికప్పుడు చెబుతూ, ప్రజలని అప్రమత్తం చేయడానికి ఆ రోజుల్లో ఉన్న ఏకైక మీడియం బేటరీలతో పనిచేసే రేడియో ఒక్కటే. దూరదర్సన్ వున్నా దానికి కరెంటు వుండాలి. మామూలుగానే కరెంటు నిలకడగా వుండని ప్రదేశాలు. ఇక వానలు, వరదలు వస్తే చెప్పాలా! రోజులతరబడి చీకటి రాత్రులే. వరదలు ముంచెత్తి లంకలుగా తేలిన గ్రామాలకు పత్రికలు చేరే చాన్స్ అసలు లేదు. అంచేత ఏ సమాచారం వాళ్లకు చేరవేయాలన్నా పనికొచ్చేది, అందుబాటులో వుండేది రేడియో మాత్రమే.
హైదరాబాదు నుండి ఆహార పొట్లాలను ప్రతి రోజూ రెండు దఫాలుగా హెలికాప్టర్ లో తీసుకువెళ్ళి వరద ముంపుకు గురైన గ్రామాల ప్రజలకు పైనుంచి జారవిడిచేవాళ్ళు. సహాయ కార్యక్రమాలు అమలు జరుగుతున్న తీరుతెన్నులను రేడియో వార్తల ద్వారా తెలియచెప్పడానికి రేడియో విలేకరిగా నేను కూడా ఒకసారి హెలికాప్టర్ లో భద్రాచలం ప్రాంతాలకు వెళ్లాను. అది మిలిటరీ హెలికాప్టర్. సీట్లు అవీ వుండవు. ఒక పక్కగా సీటు బెల్టులు ఉన్న ఒక చెక్క బల్ల లాంటిది వుంది. మిగిలిన జాగా అంతా పులిహోర పొట్లాలు, బిస్కెట్ల సంచులు. వాటిని కిందికి విసిరేసేటప్పుడు హెలికాప్టర్ ని బాగా కిందికి దించేవాళ్ళు. చెట్ల కొమ్మల మీదా, ఇంటి కప్పుల మీదా నిలబడిన జనం హెలికాప్టర్ చప్పుడు వినగానే ప్రాణం లేచొచ్చినట్టు, పైకి చూస్తూ తమని గమనించమని చప్పట్లు కొట్టేవాళ్ళు. పైనుంచి సంచులను కిందికి వదిలేలోగా హెలికాప్టర్ వేగానికి బాగా ముందుకు వెళ్ళిపోయేది. ఆ సంచులు పడాల్సిన చోట పడకుండా ఎక్కడెక్కడో పడి నీళ్ళ పాలు అయ్యేవి. కానీ సైనికులది జాలిగుండె. మళ్ళీ వెనక్కి తిప్పి ఎక్కడనుంచి, ఎప్పుడు కిందికి పడేస్తే వాళ్లకు చేరుతుందో ఉజ్జాయింపుగా లెక్క వేసుకుని అనేక ప్రయత్నాలు చేసి ఏదో ఒక విధంగా వాళ్లకు అందేటట్టు చూసేవాళ్ళు. నాచేత కూడా కొన్ని సంచులు కిందికి విసిరేయించారు.
హైదరాబాదు తిరిగి వచ్చిన తర్వాత సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ‘చుట్టూ నీళ్ళు వున్నా అవి తాగడానికి పనికి రాని నీళ్ళు’ అని చెప్పాను. అప్పట్లో ఈ వాటర్ బాటిళ్ళ పద్దతి లేదు. ప్లాస్టిక్ సంచుల్లో నీళ్ళు సప్లయి చేద్దామంటే అదీ కుదిరే పనికాదని తేలింది. రెండు మూడు రోజులు నిలవ వుండాలంటే పులిహోర తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదులా వుంది. డిసెంట్రి లాంటి రోగాలు వచ్చే ప్రమాదం కూడా వుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లకు శుభ్రమైన నీళ్ళు అవసరం అని డాక్టర్లు చెబుతారు. ఆ సంగతే నేను వాళ్ళతో చెప్పాను. ఈ ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చేలోగా గోదావరి వరదలు తగ్గుముఖం పట్టాయి.