3, డిసెంబర్ 2020, గురువారం

రజనీ రాజకీయ రంగప్రవేశం

రజనీ రంగప్రవేశం - భండారు శ్రీనివాసరావు

‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు’ అంటుండే రజనీ కాంత్, తన రాజకీయ రంగ ప్రవేశం గురించి ఇప్పటికి వెయ్యిసార్లు చెప్పిన మాటను నిలబెట్టుకుంటారా లేదా అనేది గత మూడేళ్ళుగా ఆయన అభిమానుల్లో నలుగుతూ వస్తున్న సందేహం. రజనీ తన స్టైల్ లోనే ఒక్క ట్వీట్ తో దీన్ని పటాపంచలు చేశారు. ఈ నెల ముప్పయి ఒకటిన రాజకీయ పార్టీ ప్రకటన చేస్తానని రజనీ వెల్లడించడం ఆయన అభిమానులకు ఒకరకంగా నూతన సంవత్సర కానుకే అవుతుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఆయన అభిమాన గణం సంబరాలు చేసుకోవడం మొదలయింది కూడా.

పురుషులలో పుణ్య పురుషులు వేరయా అన్నట్టు మన దేశంలో తమిళనాడు రాజకీయాల తరహానే వేరు. అక్కడ అనేక సంవత్సరాలుగా రెండే రెండు, డి ఎం కె, ఏ ఐ డి ఎం కె అనే ప్రాంతీయ పార్టీల హవానే నడుస్తోంది. రెంటికీ ఉమ్మడి పోలిక సినిమా రంగం నేపధ్యం. ఇక ఆ రాష్ట్రంలో జాతీయ పార్టీల పరిస్థితి నామమాత్రం. వనరులు కలిగిన పెద్ద పార్టీలు కాబట్టి ఏదో విధంగా తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. ఈ విషయంలో కూడా జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల పంచనే కాలం వెళ్లదీస్తున్నాయి. కాకపొతే అటు కాంగ్రెస్ కానీ, ఇటు బీజేపీ కానీ కేంద్రంలో అధికారం అనే ఒక కారణంతో ఆయా ప్రాంతీయ పార్టీల మీద కొద్దో గొప్పో పెత్తనం చెలాయించగలిగే పరిస్థితిలో వుండడం వాటికో ఊరట.

తమిళనాట సినీ ప్రభావం ఎక్కువ కావడం చేత చాలామంది సినీ హీరోలు తమ అదృష్టాన్ని రాజకీయ రంగంలో పరీ క్షించుకోవడం మొదలు పెట్టారు. ఈ జాబితా కూడా పెద్దదే. ఈ కారణం వల్ల కాబోలు ఆ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సంఖ్య భారీగా వుంది. నిరుడు జరిగిన లోక సభ ఎన్నికలలోముప్పై మూడు పార్టీలు పోటీ చేసాయి. ఫలితాలు మాత్రం బాగా నిరాశ కలిగించాయి. అయినా కొత్త పార్టీలు పుట్టుకొస్తూనే వున్నాయి. తమిళనాడు రాజకీయాలను క్రీగంట శాసించిన జయలలిత, కరుణానిధి ఇద్దరూ కాలం చెయ్యడం వల్ల ఏర్పడ్డ రాజకీయ శూన్యత కూడా మరో కారణం.

రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచనను, వీరిద్దరూ జీవించి ఉండగానే ఎప్పుడో 2017లోనే రజనీ కాంత్ వ్యక్తం చేశారు. వారు మరణించి చాలాకాలం అవుతున్నా ఆ ఆలోచన మాత్రం కార్యరూపం దాల్చకపోవడంతో, రాజకీయాల పట్ల రజనీకాంత్ అంత ఆసక్తిగా లేరని జనం అనుకునేవరకు ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇవి ముదిరి పాకానపడ్డప్పుడల్లా రజనీ మధ్య మధ్య ఏవో ప్రకటనలు చేస్తూ వాటికి తెర దించుతూ వచ్చారు. ఓ వారం క్రితం రజనీకాంత్ మరోసారి తన అభిమాన సంఘాల వారిని పిలిపించుకుని ఓ సమావేశం పెట్టడంతో ఈసారి ఖచ్చితమైన ప్రకటన వస్తుందని అందరూ ఆశించారు. కానీ షరా మామూలుగా కొత్త విషయం ఏమీ రజనీ నోటివెంట రాలేదు. దానితో మరోరకమైన వదంతులు వ్యాపించాయి. ఆయన తటపటాయింపుకు కారణం అనారోగ్య సమస్యలు కాదుకదా అనేంత వరకూ అవి సాగాయి. ఇక వీటికి అడ్డుకట్ట వేయడం అవసరం అనుకున్నారేమో, రజనీ కాంత్ హఠాత్తుగా ఈ ట్వీట్ దెబ్బతీశారు.

షెడ్యూలు ప్రకారం 2021 మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి వుంది. జనవరిలో పార్టీ పేరు ప్రకటిస్తే అప్పటికి కేవలం అయిదు నెలల వ్యవధానం మాత్రమే వుంటుంది. ఈలోగా ఎన్నికల కమిషన్ లో పార్టీని రిజిస్టర్ చేయించుకోవడం, పార్టీ గుర్తును ఎంచుకుని దానికి అనుమతి తెచ్చుకోవడం మొదలయిన ముఖ్యమైన కార్యాలు నెరవేర్చుకోవాల్సి వుంటుంది. ఇవన్నీ ఒక పద్దతిగా చక్కబెట్టగల యంత్రాంగం కూడా అవసరం. వ్యవధి తక్కువ కావడం వల్ల ఒత్తిడి పెరిగే అవకాశం వుంటుంది. ఒకవేళ పార్టీని ఈ ఎన్నికలలో విజయపథంలో నడిపించి అధికారంలోకి తీసుకురాగలిగితే, తొమ్మిది మాసాల్లో తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై నిలబెట్టిన ఒకనాటి ఎన్టీఆర్ రికార్డును అధిగమించినట్టు అవుతుంది.

రాజకీయ పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక్క అభిమాన సంఘాల అభిమానం ఒక్కటే సరిపోదు. అభిమానులను కార్యకర్తలుగా రూపొందించుకోవాలి. పొతే, పెద్ద హీరోలు కొత్త పార్టీ పెట్టినప్పుడు వారికి ఎదురయ్యే పెద్ద సవాలుఏమిటంటే, ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలా లేదా ఎవరినైనా కలుపుకు పోవాలా! అనే సందిగ్ధత. ఈ ప్రశ్నకు జవాబు అంత తేలికకాదు. అభిమానులు తమ హీరోని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటారు. అంతేకానీ మరో పార్టీని అధికారంలోకి తేవడానికి వారు ఇచ్చగించరు.

అలాగే ఒక సాధారణ రాజకీయ నాయకుడు పార్టీ పెడితే గెలుపోటములు లెక్కలోకి రావు. కానీ కోట్లాది అభిమానులను కలిగిన ఓ సినీ హీరో అలా ఛాన్స్ తీసుకోవడం కష్టం. ప్రతిష్టకు సంబంధించిన వ్యవహారంగా ఆ హీరో పరిగణించకపోయినా, అతడి అభిమానులు అలా అనుకోరు. తేలిగ్గా తీసుకోరు. ఒక సినిమా ఆడకపోయినా పెద్ద హీరోలకు మరో సినిమా అవకాశం వస్తుంది కానీ, రాజకీయాల్లో ఈ లెక్కలు వేరుగా వుంటాయి.

సినీ రంగంలో రజనీ స్నేహితుడు తోటి సూపర్ స్టార్ కమల్ హసన్ ఈ విషయంలో ఒక అడుగు ముందే వున్నారు. కానీ, నిరుడు జరిగిన లోక సభ ఎన్నికల రణ క్షేత్రంలో ఆయన వేసిన తొలి అడుగే తడబడింది. ఆయన చేసిన ప్రయోగం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. పైగా దారుణమైన నిరాశను కలిగించేవిగా వున్నాయి. పోటీ చేసిన స్థానాల్లో ఆయన నిలబెట్టిన అభ్యర్ధులకు ధరావత్తులు కూడా దక్కలేదు. అభ్యర్ధుల ఎన్నికల వ్యయ నిబంధనలకు లోబడి ఖర్చు చేయడం, ప్రత్యర్థి పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేయడం వంటివి తమ MNM పార్టీ ఓటమికి కారణాలుగా చెప్పుకొస్తూ, ఈ ఓటమి వల్ల తాను ఏమీ చింతించడం లేదని, రాజకీయాల్లో నైతికవిలువలను కాపాడడమే ధ్యేయంగా పెట్టుకునే వారికి గెలుపు ఓటములు ప్రధానం కాదనీ వివరణ ఇచ్చుకున్నారు.

మరో రకంగా పరిశీలిస్తే కమల్ సాధించింది తక్కువేమీ కాదనిపిస్తుంది. కమల్ హసన్ పార్టీ మొత్తం 38 సీట్లలో 13
చోట్ల కమల్ హసన్ పార్టీ మూడో స్థానంలో వుంది. చెన్నై లో 10 శాతం ఓటు షేర్ తెచ్చుకుంది. పారిశ్రామిక వాడల్లో ఇది పదిహేను శాతం దాకా వుంది. ఆ ఎన్నికల్లో కమల్ పార్టీకి మొత్తంగా పదిహేను లక్షల ఓట్లు పోలయ్యాయి. పార్టీ స్థాపించిన పద్నాలుగు నెలల్లో ఈ స్థాయిలో ఓట్లు రావడం అంటే అసాధారణమే అని అన్నవాళ్లు కూడా వున్నారు.

2016 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం ముప్పయి మూడు పార్టీలు పోటీ పడ్డాయి. మూడు కూటములుగా ఏర్పడ్డాయి. ఏడు పార్టీలతో జయలలిత నాయకత్వంలోని ఏ ఐ డి ఎం కె కూటమి ఒకటి కాగా, కరుణానిధి నేతృత్వంలోని ఎనిమిది పార్టీల డి ఎం కె కూటమి రెండోది. ఏ ఐ డి ఎం కె కూటమిలోని పార్టీలు అన్నీ ఒకే గుర్తు, అంటే ఏ ఐ డి ఎం కె సింబల్ రెండు ఆకుల గుర్తుతోనే పోటీ చేయడం విశేషం. ఒక చిన్న స్థాయి ప్రాంతీయ పార్టీని కలుపుకుని బీజేపీ కూడా రంగంలో దిగింది. ఏ కూటమిలో కలవకుండా 10 ప్రాంతీయ పార్టీలు విడిగా పోటీ చేసాయి. ప్రధాన కూటముల నాయకులు జయలలిత, కరుణానిధికి ఈ ఎన్నికలే చివరి ఎన్నికలు. 2016లో గెలిచి ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన జయలలిత తీవ్రమైన అనారోగ్యం పాలయి డెబ్బయి అయిదు రోజులు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి అదే ఏడాది డిసెంబరులో కన్నుమూసారు. ఆ ఎన్నికల్లో త్రుటిలో విజయావకాశాలను చేజార్చుకుని ఓటమి పాలయిన కరుణానిధి 2018లో వృద్ధాప్యంతో మరణించారు.

తమిళనాట మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ రాష్ట్రంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలతో పాటు కులాలవారీగా రాజకీయ పార్టీలు వున్నాయి. వీటివల్ల ఓట్లలో చీలిక అనివార్యం.

మచ్చలేని మంచివాడనే గొప్ప పేరు రజనీ కాంత్ కు పుష్కలంగా వుంది. ఆ పేరుకు తగ్గట్టుగా అతి గొప్ప శ్రమ తోడయితేనే రజనీకాంత్ రాజకీయ ప్రయోగం విజయవంతమయే అవకాశాలు వుంటాయి.

ఏడు పదుల వయసులో ఆయన తీసుకున్న నిర్ణయం సరయినదా కాదా అనేది మరి కొద్ది నెలల్లో తమిళనాడు ఓటర్లు నిర్ణయిస్తారు. (03-12-2020)





3 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...


డెబ్బై పదుల్లో మోడీ రిటైర్మెంటంటూంటే, ఈయన డెబ్బై పదుల్లో ఎంటర్ అవుతానంటాడు :)


ఈ ఎంట్రీ ఏదో ఓ యాభై యేండ్లలో అయ్యుంటే ఇప్పటికీ నిలచి వుండే నేతగా వుండేవాడేమో !

ఏమో గుర్రం ఎగురనూ వచ్చు :)


జిలేబి

సూర్య చెప్పారు...

AP లో పవన్ చేసిన పనే TN లో రజని కాంత్ చేయబోతున్నాడని నా అనుమానం.!

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Zilebi: నాదే పొరబాటు. ఏడు పదుల వయసుకు బదులు డెబ్బయి పదుల వయసు అని అచ్చుతప్పు పడింది. దిద్దుకున్నాను.