5, జనవరి 2012, గురువారం

సంగీతం మధుర సంగీతం



సంగీతం మధుర సంగీతం – ఆర్వీవీ కృష్ణారావు, భండారు శ్రీనివాసరావు

'సంగీతము చేత బేరసారములుడిగెన్'

చిన్నప్పుడు సంగీతం నేర్చుకొందామనుకొనే  వారందరికీ  కాషన్ గా ఈ సామెత చెప్పేవారు.  అయితే కొంతమంది పెళ్ళిచూపుల్లో అదనపు అర్హత కోసం చిన్నప్పుడు ఆడపిల్లలకి ఇళ్ళల్లో నాలుగయిదేళ్లపాటు  సంగీతం చెప్పించేవారు.  దొంగరాముడు సినిమాలో  వీరభద్రయ్య {రేలంగి} తన కూతురుకి ఇలాగే పెళ్లి సంగీతం చెప్పిస్తాడు.  పెళ్లి చూపుల్లో 'జార చోరా భజన చేసితిరా' అని 'దారిని తెలుసుకొంటి' అనే త్యాగరాజ కీర్తనలో  ఓ  చరణాన్ని పెళ్లి కూతురు చేత  పాడిస్తారు దర్శకుడు కేవీ రెడ్డి గారు.

అదలా వుంచితే,

తెలుగునాట  ద్వారం వెంకటస్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, దాలిపర్తి పిచ్చిహరి, హరి నాగభూషణం, తూమాడ సంగమేశ్వర శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు, మహావాది వెంకటప్పయ్య  వంటి పాటా తరానికి చెందిన సంగీత విద్వాంసులు ప్రసిద్ధిచెందారు. పోతే, సుసర్ల దక్షిణా మూర్తి గారు త్యాగరాజు శిష్య పరంపరలోని వారు.  ఈ మహా విద్వాంసుల శిష్యకోటిలో తెలుగు వారికి అఖండ ఖ్యాతి తెచ్చిపెట్టిన వారు మంగళంపల్లి బాలమురళి కృష్ణ, శ్రీపాద పినాకపాణి, నేదునూరి కృష్ణ మూర్తి, వోలేటి వెంకటేశ్వర్లు, షేక్ చిన్న మౌలా, ఈమని శంకర శాస్త్రి .  ఇంకా ఎందరో  విద్వాంసులు కర్నాటక సంగీతంలో  అగ్రశ్రేణిలో నిలిచారు.  ఈ విషయంలో మనం ఎంత గొప్పవాళ్ళ మైనా  తమిళులు కర్నాటక సంగీతం వాళ్లదేనని అనుకొంటారు. కొంత వాస్తవం కూడా. కర్నాటక సంగీతానికి  తమిళనాట ఉన్నంత ఆదరణ మన ప్రాంతంలో లేదు. మద్రాసులో కచేరి చేసి అక్కడి వాళ్ళ చేత ‘సెహభాష్’ అనిపించుకొంటేనే ఇక్కడ కూడా గౌరవం. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న సూత్రం ఇక్కడ పని చెయ్యదు.  సంగీతంలో మాత్రం రచ్చ  గెలిస్తేనే  ఇంట్లో గౌరవిస్తాం.
  ఫిడేలు నాయుడు గారి నుంచి ఈతరం మాండొలిన్ శ్రీనివాస్ దాకా ఇదే వరస, ఇదే బాణీ.



  
ఈ మధ్య  ముగిసిన చెన్నై  మ్యూజిక్ సీజనులో ఈ వాస్తవం మరోమారు బోధపడింది.  మార్గశిర మాసం వచ్చిందంటే చెన్నై వాసులకు  ఓ పండగ. డిసెంబర్ పదిహేనో తారీకు నుంచి జనవరి ఒకటో  తారీకు దాక చెన్నైలో సంగీతం తప్పితే ఏమీ వుండదు.  నగరంలో నలుమూలలా కనీసం ఓ  పది పదిహేను ప్రాంతాల్లో ప్రతి  రోజూ హీనపక్షం  అయిదారు సంగీత  కచేరీలయినా  జరుగుతూ వుంటాయి. ఎక్కడ చూసినా హడావుడే. ఎక్కడెక్కడినుంచో  కర్నాటక సంగీత అభిమానులు చెన్నై చేరుకుంటారు.  ప్రొద్దుట తొమ్మిది నుంచి రాత్రి పది దాకా కచ్చేరీలు  వినడమే వారి పని. చెవుల తుప్పు వొదిలిపోతుంది. మరో ఏడాదికి సరిపడా ఆనందాన్ని మనస్సులో నింపుకుని సంగీతాభిమానులు తిరుగుమొగం పడతారు.

ఇక చెన్నైలో  మ్యూజిక్ అకాడమీది  ఓ ప్రత్యేకత. మొన్న ముగిసిన డిసెంబరులోనే ఈ అకాడమీ  85 వ సంగీతోత్సవం  జరుపుకొంది. నిజానికి పాశ్చాత్య ధోరణులు అన్ని రంగాలను ముప్పేటలా ముసురుకుంటున్న ఈ రోజుల్లో ఇది  ఎంతో గొప్ప విషయం అనే చెప్పుకోవాలి.


 అకాడమీలో కచేరి చెయ్యడం అంటే ఆర్టిస్టులకు  అంతకంటే  గొప్ప గౌరవం ఇంకోటి  వుండదు. అలాగే సంగీత అభిమానులకు అకాడమీలో  కచేరి వినడం.  అంత కంటే గొప్ప అనుభవం వుండదు.  జీవితంలో వొక్కసారైనా అకాడమీలో  కచ్చేరి వినాలన్నది వారి నరనరాల్లో జీర్ణించుకుపోయే కోరిక. మంచి సంగీతం వినాలనుకునే వారికి   మ్యూజిక్ అకాడమీ హాలు ఒక వరప్రసాదం లాటిది. ఎందుకంటె అక్కడి ఏర్పాట్లు అలాటివి. ఎక్కడ కూర్చున్నా కూడా  చక్కగా, శ్రావ్యంగా వినిపించే సౌండ్ సిస్టం.  మన రవీంద్ర భారతి అధికారులు ఓ సారి వెళ్లి చూడాలి.  ఆ సీటింగ్ ఆరెంజిమెంటు,  సౌండ్ సిస్టం దేనికదే ప్రత్యేకం.  వాళ్ళను పొగడడం, మన వాళ్ళను కించబరచడం అని  కాదు.  మనకు కూడా ఇక్కడ అటువంటి చక్కటి  అనుభూతి కలగాలని మాత్రమె.

అకాడమీ  టీటీకె ఆడిటోరియంలో అడుగు పెట్టగానే ‘హాల్ అఫ్ ఫేం’ లో అకాడమీ  వార్షిక ఉత్సవాలకు అద్యక్షత  వహించిన విద్వాంసుల ఫోటోలు.  అలా అద్యక్షత వహించినవారికే ఆ ఏడాది ‘సంగీత కళానిధి’ బిరుదు  ఇస్తారు. నిజమయిన సంగీత కళాకారులకు దీన్ని మించిన సత్కారం వుండదు. కళానిధి బిరుదును మించిన పురస్కారం వుండదు. పద్మ విభూషణ, పద్మ భూషణ, పద్మశ్రీ  పురస్కారాలు కూడా  సంగీత కళానిధికి సాటిరావని భావించే సంగీత విద్వాంసులు వున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ 85  ఏళ్లలో సంగీత కళానిధిపొందిన తెలుగు వారు చాలా తక్కువ.  ద్వారం వెంకట స్వామి నాయుడు, చిత్తూర్ సుబ్రహ్మణ్య పిళ్లే, రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , (ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు  మృణాలిని  మాతామహులు),  మంగళంపల్లి బాల మురళి కృష్ణశ్రీపాద పినాక పాణి, నేదునూరి కృష్ణ మూర్తి, షేక్ చిన్న మౌలా మాత్రమే  ఈ అరుదయిన సంగీత  పురస్కారం పొందిన కొద్దిమంది తెలుగువారిలో వున్నారు. సంగీత చక్రవర్తులుగా పేరొందిన ఎందరో  మహామహుల సరసన   వీళ్ళ ఫోటోలు చూస్తూ వుంటే తెలుగువాళ్లకు  వొళ్ళు పులకరించడం ఖాయం.

ఈ స్తాయి కలిగిన మరికొందరు సంగీత కళాకారులు తెలుగునాట లేకపోలేదు. కారణం తెలియదు కాని వారికి ఈ మహత్తర గౌరవం దక్కలేదు. పారుపల్లి,  పిచ్చి హరి,  ఈమని శంకర శాస్త్రి, చిట్టిబాబు ఈ గౌరవం అందుకోకుండానే అందరాని తీరాలకు తరలిపోయారు. ఇక సంగీత  కురువృద్ధుడు  నూకల చిన్న సత్యనారాయణ ఇప్పటికీ అంత వయస్సులో కూడా కచ్చేరీలు చేస్తూ అభిమానులను అలరిస్తూనే వున్నారు. మల్లాది బ్రదర్స్, హైదరాబాదు సిస్టర్స్, మాండొలిన్ శ్రీనివాస్ ఎప్పుడో ఒకనాడు చెన్నై  మ్యూజిక్ అకాడమీలో తెలుగు బావుటా ఎగురవెయ్యకపోరు. అదే సంగీతాభిమానుల ప్రగాఢ అభిలాష.

చెన్నై సంగీతోత్సవం వివరాలు మరోసారి. (05-01-2012)

4 కామెంట్‌లు:

prasad sarma చెప్పారు...

Thank you very much for the wonderful story. Tamilians keep up and nurture their traditional art forms without any hesitation. They put on Vibhuti, sikha etc. even these days, however bigger position they might occupy. Waiting eagerly for your next article on Sangeetotsavam. Jaya TV also conducts Margali Mahotsavam every year and broadcast the programmes. Unfortunately no TV chanel in Telugu except SV Bhakti channel, broadcast any programme on classical music.

Regards.
Prasad Sarma

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Prasad Sarma - Thank you very much. I am forwarding this to sri R V V Krishna Rao garu - Bhandaru Srinivasrao

Prasad Sarma చెప్పారు...

శ్రీనివాస రావు గారు,

ఆర్వీవీ గారికి సంగీతంలో మంచి ప్రవేశం వున్న సంగతి నాకు తెలుసును. కానీ మీ వ్యాసాలు చదువుతుంటే మీకు కూడా అపరిమిత సంగీత పరిఙానం, అభినివేశం వున్నట్టు బోధ పడుతోంది. వీలైతే మీరు ప్రస్తావిస్తున్న గాయకుల క్లిప్పింగులు ఏవైనా లభిస్తే వాటిని కూడా మీ వ్యాసాల్లో లింకులు పెట్టి వినిపించగలరు.

Kottapali చెప్పారు...

బాగుంది