4, డిసెంబర్ 2021, శనివారం
అస్వతంత్రుడైన స్వతంత్రుడు శ్రీ రోశయ్య – భండారు శ్రీనివాసరావు
(05-12-2021 తేదీ సాక్షి దినపత్రికలో ప్రచురితం)
తొలిసారి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడు, మళ్ళీ తరవాత రోశయ్య ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించినప్పుడు, వారికి ముందున్న ముఖ్యమంత్రులు, అంటే నందమూరి తారక రామారావు, రాజశేఖరరెడ్డి ఈ ఇరువురు కూడా ప్రజల మనస్సులను ముందు గెలుచుకుని తరువాత ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చినవారే కావడం గమనార్హం. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన పధకాలే కాకుండా, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదనంగా అనేక ప్రజాకర్షక పధకాలను ప్రకటించి, అమలు చేసిన ఘనత వారిది. తాము మాత్రమే వాటిని అమలు చేయగలరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించి, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని రగిలించి అధికార పీఠం అధిరోహించిన చరిత్ర కూడా వారిదే.
పోతే,
ఒక విపత్కర, అనూహ్య దారుణ సంఘటన కారణంగా రాష్ట్రం యావత్తూ చేష్టలుడిగివున్న పరిస్తితిలో కాంగ్రెస్ పార్టీ అదిష్టానం, హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన రాజశేఖరరెడ్డి స్తానంలో, వయస్సు పైబడుతున్న కారణంగా క్రమేపీ రాజకీయాలనుంచి తప్పుకోవాలన్న నిర్ణయానికి ఏనాడో వచ్చి, ఆ దృష్టి తోనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా శాసన మండలికి పరిమితమై మంత్రిమండలిలో సీనియర్ సభ్యుడిగా కొనసాగుతున్న రోశయ్యను ముఖ్యమంత్రిగా నామినేట్ చేసింది. ఈ విషయంలో ఆయన ఎంతో అదృష్టవంతుడయిన కాంగ్రెస్ నాయకుడనే చెప్పాలి. ఎందుకంటె, రాజకీయాల్లో ఈనాడు ఎంతో ప్రధానంగా పరిగణిస్తున్న కులం, ధనం, వర్గం వీటిల్లో ఏ కోణం నుంచి చూసినా, ఏ రకమయిన ప్రాధమిక అర్హతా లేకుండా, కనీస స్తోమత కూడా లేకుండా, రోజు రోజుకూ మీదపడుతున్న వయస్సు ఒక అడ్డంకి కాకుండా, అదిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు చోటా మోటా కాంగ్రెస్ నాయకులందరూ హస్తిన చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన సంప్రదాయం బలంగా వేళ్ళూనుకునివున్న పార్టీలోవుంటూ కూడా, అధిష్టానం కొలువైవున్న కొత్త డిల్లీలో ఒక్క మారు కూడా కాలుపెట్టకుండా ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారంటే ఆయనకు వున్న సీనియారిటీకి తోడు అదృష్టం కూడా కలిసివచ్చిందనే అనుకోవాలి. ఈ వాస్తవాన్ని బయటవారు కాకుండా ఆయనే స్వయంగా పలుమార్లు ప్రస్తావించడం గమనార్హం. ఇటు ప్రభుత్వాన్నీ , అటు పార్టీ అధిష్టానాన్నీ తన కనుసన్నల్లో వుంచుకోగల శక్తియుక్తులు, ప్రతిభాసామర్ధ్యాలు కలిగిన రాజశేఖరరెడ్డి వారసుడిగా పాలన సాగించడం అంటే కత్తిమీద సాము అన్న వాస్తవం తెలిసిన మనిషి కనుక,
పార్టీలో ఎవరు ఏమిటి? అన్న విషయాలు పుక్కిట పట్టిన దక్షుడు కనుక,
అధిష్టానం
మనసెరిగి మసలుకునే తత్వం వొంటబట్టించుకున్న వ్యవహారశీలి కనుక,
బలం గురించి
బలహీనతలు గురించి స్పష్టమయిన అంచనాలు వేసుకోగలిగిన సమర్ధుడు కనుక, అన్నింటికీ మించి
రాజకీయాలలో ‘కురువృద్ధుడు’, ‘పెద్దమనిషి’ అన్న ముద్రతో పాటు, అందరూ అర్రులు
చాచి అందుకోవాలని తాపత్రయపడే ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించే సంసిద్దతను
వ్యక్తం చేయగలిగిన ధీమంతుడు కనుక,
పరిశీలకులు
తొలినాళ్ళలో ఊహించిన స్తాయిలో ఆయన పట్ల వ్యతిరేకత వెల్లువెత్త లేదు.
ఇవికాక, కాకలు తీరిన
నాయకులకు ఏ మాత్రం కొదవలేని కాంగ్రెస్ పార్టీలోని సహజసిద్ద వర్గ రాజకీయాలు సైతం, రోశయ్య
ముఖ్యమంత్రిత్వానికి ఎవరూ ఎసరు పెట్టకుండా కాపాడుకుంటూ వచ్చాయి. మూన్నాళ్ళ ముఖ్యమంత్రి అనీ, మూన్నెళ్ల
ముఖ్యమంత్రి అనీ ఎవరెన్ని రాగాలు తీసినా, మంత్రులను
మార్చకుండా, వైఎస్సార్ పధకాలను ఏమార్చకుండా గుంభనగా నెట్టుకొస్తూనే వచ్చారు. లోగడ కనీవినీ ఎరుగని ప్రకృతి వైపరీత్యాలు, ప్రాంతీయ ఉద్యమాలు
రాష్ట్రాన్ని చుట్టుముట్టినా, ఆయన తనదయిన శైలిలో
నిబ్బరంగా పాలనపై క్రమంగా పట్టుబిగించే ప్రయత్నం చేసారు. వై.ఎస్. మరణం తర్వాత ముఖ్యమంత్రిగా
ఆయన చేసిన నియామకాలు వేళ్ళమీద లెక్కపెట్టదగినవే. కానీ వాటి విషయంలో
ఆయన ఎవరినీ సంప్రదించి చేసిన దాఖలాలు లేవు. ఉదాహరణకు ప్రెస్ అకాడమి చైర్మన్ గా
తిరుమలగిరి సురేంద్రను, సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా రమణమూర్తిని, ఏ పీ ఐ ఐ డి సీ
అధినేతగా శివసుబ్రమణ్యంను నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలు ఈ కోవలోకే వస్తాయి.
సమర్ధులయిన ముఖ్యమంత్రులుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, రాజశేఖరరెడ్డి
సయితం ప్రెస్ అకాడమి విషయంలో రోశయ్య మాదిరిగా స్వతంత్ర నిర్ణయం
తీసుకున్న దాఖలాలు లేవు. అలాగే, జర్నలిష్టు
సంఘాలన్నీ ముక్తకంఠంతో వద్దన్నప్పటికీ విజయవాడ పోలీసు కమీషనరుగా పీఎస్సార్
ఆంజనేయులును బదిలీ చేసిన తీరుని కూడా ఈ సందర్భంలో గుర్తుచేసుకోవచ్చు.
ముఖ్యమంత్రి
పదవి నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా శ్రీ రోశయ్య
పల్లెత్తు మాట అనకుండా సుసుక్షితుడైన పార్టీ కార్యకర్తగా అధిష్టానం ఆదేశాన్ని ఔదలదాల్చారు.
బహుశా
ఆయన లోని ఈ సుగుణాన్ని గుర్తించే కాబోలు శ్రీ రోశయ్యను తమిళనాడు వంటి ప్రధానమైన
రాష్ట్రానికి గవర్నర్ గా నియమించారు. కేంద్రం మీద కాలు దువ్వె తత్వం కలిగిన నాటి
ముఖ్యమంత్రి జయలలితతో ఎలాంటి పోరచ్చాలకు తావు రాకుండా చూసుకుంటూ, పదవికి మాట
రాకుండా పదవీ కాలాన్ని జయప్రదంగా పూర్తి చేయడం ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవానికి అద్దంపడుతుంది.
దాదాపు
నలభయ్ ఏళ్ళపాటు సన్నిహిత పరిచయం వున్న
శ్రీ రోశయ్య మరణం నాకు తీరని బాధ కలిగిస్తోంది.
(04-12-2021)
3, డిసెంబర్ 2021, శుక్రవారం
సినీ ప్రముఖులు - సాంఘిక బాధ్యత
2, డిసెంబర్ 2021, గురువారం
అభిమానం అర్ణవమైతే – భండారు శ్రీనివాసరావు
“సినిమా టిక్కెట్టు ధర తగ్గిస్తే ఏమిటి? బెనిఫిట్ షోలు ఎత్తేస్తే ఏమిటి? ఒక్కసారి పెద్దమొత్తం ఇలా ఖర్చు చేసేబదులు, మా హీరో సినిమా ఒకటికి పదిసార్లు, వీలయితే వరసగా పాతికసార్లు టిక్కెట్టు కొని చూస్తాం. అదీ మా అభిమానం” అంటున్నాడు ఓ హీరో అభిమాని ఓ టీవీ చర్చలో.
మంచిదే
అనిపించింది,
సినిమా సక్సెస్ కు రిపీటెడ్ ఆడియన్స్ ఓ గీటురాయి అని తలనెరిసిన సినీపండితుడు
చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. మళ్ళీ పాతరోజుల్లో మాదిరిగా, ధియేటర్లు పూర్తిగా
నిండుతుంటే, శత దినోత్సవాలు, రజతోత్సవాలు
జరిగే స్వర్ణయుగం తిరిగి వస్తుందేమో!
అయితే
ఇలా ఉద్రేకపడే ముందు, ఒక్కసారి ముంచుకు వస్తున్న మూడో వేవ్ గురించి కూడా
ఆలోచించండి. మీ కుటుంబం గురించి కూడా ఆలోచించండి.
సినిమా
అయినా, అభిమానం అయినా,
ఏదైనా ముందు మనం పదిలంగా వున్నప్పుడే కదా!
(చట్టబద్ధమైన
సూచన: ఇది రాజకీయ పోస్టు కాదు. వినవచ్చని విషయంపై వ్యాఖ్య మాత్రమే)
(02-12-2021)
చంద్రహారం
టీవీల్లో చూసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ
వేస్తుంటారు. చక్కటి పాత చిత్రాలు ఎన్నిసార్లు వేసినా చూడాలనే అనిపిస్తుంది.
అలాంటి సినిమానే చంద్రహారం. మొదటిసారి విడుదల
చేసినప్పుడు పెద్దగా ఆడినట్టు లేదు. ఇప్పుడు ఈ టీవీ సినిమా ఛానల్ లో వస్తోంది. ఇది చూస్తున్నప్పుడు
గతంలోని ఓ జ్ఞాపకం గుర్తుకు వచ్చింది.
మా వూరికి నాలుగు మైళ్ళ దూరంలో వున్న వత్సవాయిలో ఒక టూరింగు
టాకీసు వుండేది. దాంట్లోకి చంద్రహారం సినిమా వచ్చినట్టు ఆ ఉదయం మా వూళ్ళో దండోరా వేసారు. దండోరా అంటే ఒక ఎడ్లబండికి రెండువైపులా సినిమా పోస్టర్లు తగిలించేవాళ్ళు. అందులో ఓ ముసలాయన కూర్చుని
మైకులో సినిమా గురించి చెబుతుండేవాడు. బండిలోనుంచి కరపత్రాలు విసిరేస్తే అవి
పట్టుకోవడానికి కుర్రవాళ్ళం నానా తంటాలు పడేవాళ్ళం. ఎన్టీఆర్ నటించిన అ సినిమా ఎల్లాగయినా చూడాలని మా అమ్మ వెంట పడ్డాం. మా చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో ఆమెకు మేమంటే ప్రాణం. కానీ
ఆమెకు డబ్బు వ్యవహారాలు ఏమీ తెలవ్వు. అన్నీ మా
బామ్మే చూసుకునేది. కాళ్ళు వత్తిందో, నడుం
నెప్పికి అమృతాంజనం రాసిందో ఏం చేసిందో కాని మడిబీరువాలో దాచిపెట్టిన చిల్లర
డబ్బుల్లోనుంచి మూడు పావలాలు బామ్మను అడిగి తీసుకుని రెండు మా మూడో అన్నయ్య చేతిలో పెట్టింది. ఇంకో పావలా నాకిచ్చి సినిమా మధ్యలో
ఏదైనా కొనుక్కోమని చెప్పింది. మాతోపాటు మరో నలుగురు సావాసగాళ్ళు రావడానికి తయారయ్యారు. పొలాలగట్ల
మీద నడుచుకుంటూ వెడుతుంటే అక్కడక్కడ ఎండ్రకాయల బొరియలు కనబడేవి. మేము ఊరు
పొలిమేరలకు చేరగానే సినిమాహాలు వాడు వేసే
పాట మైకులో వినిపించింది. మొదటి ఆటకు సినిమా
టిక్కెట్లు అమ్మడం మొదలు పెట్టడానికి ముందు ఊరంతా వినిపించేటట్టు పాటలు
వేసేవాళ్ళు.
సరే! నేల క్లాసు పావలా టిక్కెట్టు కొనుక్కుని హాల్లోకి వెళ్ళాము. జనం బాగానే
వున్నారు. మధ్యలో చోటుచూసుకుని కూర్చున్నాము. పైన డేరాకున్న చిల్లుల్లో నుంచి
ఆకాశం కనబడుతోంది. కొనుక్కున్న కట్టె మిఠాయి తింటూ వుండగానే సినిమా మొదలయింది.
ఫిలిమ్స్ డివిజన్ వారి చిత్రంలో నెహ్రూ గారు కనబడగానే హాలు మొత్తం కేరింతలు.
రామారావు సినిమా అని ఎగబడి వెళ్ళాము కానీ, అసలు
సినిమా మాకెవ్వరికీ అంత నచ్చలేదు.
తిరిగివచ్చేటప్పుడు చూడాలి, వెన్నెల వెలుతుర్లో కనిపించే ఎండ్రకాయ బొరియలు ఎంతో భయపెట్టాయి. వచ్చేటప్పుడే
వెంట ఒక తాడు తెచ్చుకున్నాము, ఆరుగురం ఆ తాడు పట్టుకుని వరసగా
నడవడానికి. ఎవ్వరూ తప్పిపోకుండా ఆ ఏర్పాటు. చిన్నవాడినని నన్ను మధ్యలో నడవమన్నారు.
ఇంటికి చేరేవరకు లోపల బితుకుబితుకుమంటూనే వుంది.
అసలు చంద్రహారం కధ ఏమిటంటారా!
చిన్నప్పుడు సినిమా చూడడమే ముఖ్యం.
సినిమా గురించికానీ, సినిమా కధ గురించి కానీ పట్టని వయసు.
'దడిగాడు వాన విదిచ’ – భండారు శ్రీనివాసరావు
సంస్కారం లేని వాళ్ళే ఇతరుల ఉత్తరాలు, డైరీలు
చదువుతారంటారు.
కానీ ఇది ‘రాంగున్నర రాంగు’ అభిప్రాయమన్నది మా సుబ్బారావు
నిశ్చితాభిప్రాయం!
అసలు జనం డైరీలు రాసేదే ఎవరైనా చదవకపోతారా! అన్న ఆశతోనే అనేది కూడా మా వాడి
థియరీనే! ఆ మాటకి వస్తే గొప్ప గొప్ప వాళ్ళందరూ డైరీలు రాసేసి - దరిమిలా వాటిని
ఆత్మకథలుగా అచ్చేసి - తెలిసిన వారి చేత కొనిపించి - తెలియని వారికి ఉచితంగా ఇచ్చి
చదివించిన వైనాన్ని వైనవైనాలుగా చెప్పుకురావడం
మా వాడికి వెన్నతో పెట్టిన విద్య! ఇందు నిమిత్తం అవసరమైన సమయాల్లో `కోట్' చేయడానికి
వీలుగా సుబ్బారావు అనేక దాఖలాలతో కూడిన అనేకానేక పుస్తకాలను సేకరించి సిద్ధంగా
ఉంచుకున్నాడు కూడా. ` ఎవ్వరూ
చదవని దాన్ని అసలు రాయడమే శుద్ధ దండుగ' అన్న
అతడి అభిప్రాయంతో మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు.
కాకపోతే, ఈ రకమైన
సిద్ధాంతాలు వల్లించే సుబ్బారావుని చూస్తున్నప్పుడు, చిన్నప్పుడు
మా వూళ్ళో పార్ట్ టైమ్ పోస్టుమాస్టరుగా పనిచేసిన గోపయ్యగారు గుర్తొస్తుంటారు.
వూళ్ళో ఎవరికి ఉత్తరాలు వచ్చినా వాటిని చించి, చదివి, వాటిలోని విషయాలను ఆమూలాగ్రం అర్ధం చేసుకుని , ఆపైన, వాటిని
జాగ్రత్తగా అతికించి, తాపీగా
ఎవరివి వాళ్ళకు బట్వాడా చేయడం అన్నది వూరి పోస్ట్ మాస్టరుగా తనకున్న కాపీరైట్ అని
భావిస్తూ - ఆ కర్తవ్య నిర్వహణని ఎంతో నిష్టగా సాగిస్తూ వుండేవాడు. అంతటితో ఆగితే ఏ
చిక్కూ లేకపోను. సదరు ఉత్తరాల చిరునామాదారులు ఎదురైనప్పుడు ' ఏమయ్యా ! రామం! మీ ఆవిడకి మీ అమ్మతో బొత్తిగా పడడం లేదా ఏమిటి?' అంటూ ఆరాలు తీసేవాడు. ఇలా చాన్నాళ్లు అతగాడి సెన్సార్షిప్ని మౌనంగా
భరిస్తూ వచ్చిన ఆ వూరి కొత్తకోడలు ఒకావిడ - ఓసారి పుట్టింటికి పోయినప్పుడు
మొగుడికి రాసిన ఉత్తరంలో విషయాలన్నీ రాస్తూ చివరాఖర్న `దడిగాడువానవిదిచ' అని
రాసి వూరుకుంది. అంటే ‘చదివినవాడు గాడిద’ అన్నది తిరగేసిరాసిన ఆ వాక్యానికి అర్ధం.
కానీ భార్యాభర్తల నడుమ సాగే ఉత్తరాయణంలో ప్రతి అక్షరాన్ని పొల్లుపోకుండా చదివే
వెధవ అలవాటున్న ఆ పెద్ద వెధవ - మర్నాడు ఆ మొగుడు శాల్తీ తారసపడ్డప్పుడు ` ఏమో అనుకున్నాను. ఎంతయినా మీ ఆవిడకు కోపం పాలు కాస్త ఎక్కువే ' అన్నాడట ఏ మాత్రం సిగ్గుపడకుండా.
Top of Form
Bottom of Form
1, డిసెంబర్ 2021, బుధవారం
యశస్వి
వయస్సులో
పదేళ్లు చిన్నవాడు
యశస్సులో
ఏడు జన్మలు పెద్దవాడు
సిరివెన్నెల
సీతారామ శాస్త్రి గారి జీవన ప్రస్థానం
మహాప్రస్థానంలో
ముగిసిపోయింది.
ఆయన
మరణం భౌతికం ఆయన పాట అజరామరం