8, ఆగస్టు 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో : (207) : భండారు శ్రీనివాసరావు

 


వర్షార్పణం

జీవితంలో పుట్టింది ఒక్క రోజునే అయినా, పుట్టిన రోజులు ప్రతియేటా వస్తుంటాయి. చిన్నప్పుడు పండగలా అనిపించేది. ఇప్పుడు అన్ని రోజుల్లో అదొక రోజు. అంతకంటే ప్రత్యేకత ఏమీ లేదనిపిస్తోంది.

ఈ ఫేస్ బుక్ లేనిరోజుల్లో ఈ రోజు ఎలా గడిచేదో ఆలోచిస్తే నవ్వు వస్తుంది. అమ్మా నాన్నా కొత్త బట్టలు కొనిపెడతారు అనే చిరు ఆశ పుట్టినరోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా చేసేది.  స్కూలు రోజుల్లో అయితే, ఆ రోజు పుట్టిన రోజు జరుపుకునే  పిల్లాడు ఇచ్చే చాక్ లెట్ రుచిని ఆనందంగా  ఆస్వాదించడం. మరొకటి ఇస్తే ఎంత బాగుంటుందో అనుకోవడం.   కొంచెం పెద్దయ్యాక, గ్రీటింగు కార్డుల సంబరాలు, ఇచ్చేది ఆడపిల్లకు అయితే,  అందమైన కొటేషన్లు వున్న కార్డులకోసం ఒక పూటల్లా  షాపుల చుట్టూ తిరగడం,   ఫోన్లు చేసి శుభాకాంక్షలు చెప్పడం, నలుగురు దోస్తులతో కలిసి హోటల్లో టిఫినో, భోజనమో  చేసి, వీలయితే (డబ్బులు వుంటే) ఓ  సినిమా చూడడం, మరి కొంచెం పెరిగాక అంటే అటు వయసులో, ఇటు జీవితంలో అన్నమాట, దగ్గరి  స్నేహితులతో  పార్టీలు, పెళ్లయ్యాక వచ్చే పుట్టిన రోజున భార్య ఇచ్చే మంగళ హారతులు, దేవాలయ దర్శనాలు,  కుటుంబంతో కలిసి మంచి హోటల్లో భోజనాలు అలా అలా గడిచిపోయేవి పుట్టిన రోజులు.   

అదొక అందమైన కాలం. మళ్ళీ మళ్ళీ తిరిగి రాని మంచి  కాలం.

ఫేస్ బుక్ మితృలు, బుక్ వెలుపలి  మితృలు, చుట్టపక్కాలు, ఆత్మీయులు, ఆప్తబంధువులు చేసిన  ఫోన్లు, పంపిన సందేశాలు, చెప్పిన శుభాకాంక్షల వరదలల్లో ఒక పక్క కొట్టుకు పోతూ, మరోపక్క ఆకాశానికి చిల్లులు పడ్డట్టు   కురుస్తున్న భారీ వర్షంలో,  చుట్టూ గట్లు తెగిన చెరువులా చుట్టుముట్టిన నీటి నడుమ నడుస్తున్నదో, కొట్టుకుపోతున్నదో తెలియని ఒక కారులో, దిక్కు తోచని స్థితిలో దారులు వెతుక్కుంటూ, ట్రాఫిక్ ని తప్పించుకోవడానికి సందులు, గొందుల బాట పట్టి వెళ్ళిన దారిలోనే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఇళ్లకు చేరడం కోసం   దాదాపు ఆరు గంటల పాటు చేసిన  ప్రయాణం తలచుకుంటే, ఇంతకంటే విభిన్నంగా, విచిత్రంగా,  వైవిధ్యంగా ఎవరికైనా వాళ్ళ పుట్టిన రోజు గడుస్తుందా చెప్పండి. సాయంత్రం అయిదు గంటలకు మొదలైన  ఈ వర్షంలో ప్రయాణం రాత్రి పదకొండు గంటలకు ముగిసింది.

ఈ నడుమ ఫోను పలకరింపులు. వీటితో వున్న కాస్త మొబైల్  ఫోన్ చార్జ్ అయిపోతుందేమో అనే భయం.  కారు అద్దాల నుంచి, కురుస్తున్న వర్షపు ధారల్లో తడిసిముద్దవుతున్న బాహ్య ప్రపంచం కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ,  చార్జ్ అయిపోతే అయిన వాళ్ళతో  మాటా  ముచ్చటా లేకుండా పోతుందేమో అనే సందేహంతో, ఫోను చేసి శుభాకాంక్షలు చెప్పేవారితో కట్టె కొట్టె అన్నట్టు  ముక్తసరిగా మాట్లాడడం చాలా ఇబ్బందిగా అనిపించింది.

నా మేనల్లుడు డాక్టర్ రంగారావు గారి కుమారుడు డాక్టర్ భరత్ ముచ్చటపడి కొనుక్కున్న కొత్త కారు. ఇంటి నుంచి గంట దూరంలో నార్సింగ్ దగ్గర  ఒక రిసార్ట్ లో జరుగుతున్న  పెళ్లి వేడుక కోసం ఈ ప్రయాణం. వెళ్ళేటప్పుడు బయట  భానుడి చండ్ర నిప్పుల ప్రతాపం ఎంత తీవ్రంగా వుందన్నది రిసార్ట్ దగ్గర కారు దిగిన తర్వాత తెలిసింది. ఈ మధ్య కురిసిన వానల వల్ల నగరం చాలావరకు చల్లబడింది అనే భావనతో ఉన్నాము. ఊరి బయట దూరంగా విశాలమైన ప్రాంతంలో  చక్కని వేప వృక్షాలతో బయట  వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంటుందనే ఊహతో కారు డోరు తీసి దిగిన మాకు బయట ఎండ పెడేల్మని మొహం మీద ఈడ్చి కొట్టింది. దాంతో  వేగంగా నడుచుకుంటూ వెళ్లి పెళ్లి బృందాన్ని కలిశాము.  ఏసీ హాళ్ళు, ఏసీ గదులు, ఏసీ భోజన మందిరాలు. చాలా గొప్పగా తీర్చి దిద్దారు ఆ రిసార్ట్ ని. పేరు ‘ఆయన’ (AYANA).  తెలుగు ‘ఆయన’ ఈ ఆయన కాదు అనుకుని గూగులమ్మని అడిగితే, చాలా చెప్పింది. ఉత్తరాయణం, దక్షిణాయనంలో వున్న ఆయనలతో పోల్చింది. ఇది కుదరదు అనుకుంటే చక్కని అమ్మాయి అనుకోమంది. అయినా ఈ మధ్య పిల్లలకు పెడుతున్న పేర్లే సరిగా అర్ధం కావడం లేదు. ఇక రిసార్టులు, కాంప్లెక్సుల సంగతి చెప్పాలా!

పేరు సంగతి అటుంచి రిసార్ట్ ను మాత్రం చాలా వైవిధ్యంగా తీర్చి దిద్దారు. దగ్గరి బంధువులు ఎంతమంది వచ్చినా, హాయిగా మూడు రోజుల పెళ్లి  వేడుకలను అక్కడే బస చేసి తీరికగా తిలకించేలా స్టార్ హోటళ్ళను తలదన్నే రీతిలో వసతి సౌకర్యాలు వున్నాయి.

ఎదుర్కోలు సాంప్రదాయ వేడుక హంగామాగా ముగిసిన తర్వాత, భోజనాలు చేసి,  నేను, నామేనల్లుడు డాక్టర్ మనోహర్, డాక్టర్ భరత్ కారులో ఇళ్లకు బయలుదేరాము. అప్పటికి వాతావరణం కొంత చల్లబడింది. భరత్ మొబైల్ లో తెలంగాణా వెదర్ మ్యాన్ అనే పేరుతో ఒక కుర్రవాడు తయారు చేసిన APP వుంది. అది చెప్పిన ప్రకారం కాసేపట్లో భారీ వర్షం కురిసే అవకాశం వుంది. కురిసే సమయాలు, వర్షం పడే ప్రాంతాలు కూడా వివరంగా చూపింది. భారీని మించిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తబోతోందన్న హెచ్చరిక తెలంగాణా వెదర్ మ్యాన్ ఫోర్ కాస్ట్ సారాంశం.

మనోహర్ వుండేది అశోక్ నగర్ లో. మధ్యలో మేము వుండే యూసుఫ్ గూడా, ఎల్లారెడ్డి గూడా. డ్రైవర్ వుండేది కూకట్ పల్లి. అంచేత ముందు మేము దిగి మనోహర్ ని కారులో పంపిచ్చేద్దాం అని భరత్ అన్నాడు.

కారు ప్రయాణం సజావుగా సాగుతోంది. నేనూ మనోహర్ ఒక ఈడు వాళ్ళం (నా కంటే ఏడాది చిన్న) కాబట్టి చిన్నతనంలో మా ఇళ్ళల్లో జరిగిన పెళ్ళిళ్ళ ముచ్చట్లు మననం చేసుకున్నాము. ఒకే కాలానికి చెందిన ఇద్దరు కలిస్తే కాలం తెలియకుండానే గడిచిపోతుంది. ఈ ముచ్చట్ల మధ్య ఆ వెదర్ మ్యాన్ అంచనా వాస్తవరూపం దాలుస్తోందన్న సంగతి  మాకు తెలియలేదు. వేటూరి రాసిన ‘చినుకులా రాలి,నదులుగా సాగి, వరదలై పోయి, కడలిగా పొంగు’ పాటలా కాకుండా, వర్షం మొదలు కావడమే తద్విరుద్ధంగా జరిగింది. చినుకులు లేవు, ఆకాశానికి చిల్లులు పడ్డట్టు ఏకంగా ఏనుగు తొండపు ధారలే! చూస్తుండగానే రోడ్ల మీద ఎక్కడినుంచో తన్నుకు వస్తున్నట్టు వరద నీటి ప్రవాహాలు.

నిమిషాల వ్యవధిలో ట్రాఫిక్ అస్తవ్యస్తం. బహుశా వాహనదారులు అందరూ గూగుల్ మ్యాపులని  నమ్ముకున్నట్టున్నారు. ఎటు నీలి రంగు ఇండికేటర్ కనిపిస్తే అటు వాహనాలని అడ్డదిడ్డంగా మళ్లిస్తున్నారు. దాంతో అంతా అస్తవ్యస్తం.

భరత్  కాల్ డ్రైవర్ భాస్కర్ నెమ్మదస్తుడు. వేగంగా నడిచే కారు వేగాన్ని నత్త నడకను తలదన్నే రీతిలో అతి తక్కువ వేగానికి తగ్గించి నడపడంలో వున్న కష్టం నడిపే వాడికే తెలుస్తుంది. కారులో వున్న ముగ్గురం ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేము. మా ముచ్చట్లలో మేమున్నాము.

కాసేపటి తర్వాత చూస్తే చుట్టూ నీళ్ళు, మధ్యలో కారు, కారు ముందు కారు, కారు వెనక కారు. ఎన్ని కార్లు అలా ఆగిపోయాయో లెక్క చెప్పడం కష్టం. ఎటు చూసినా ఆగిపోయిన కార్లే. ఎటు చూసినా పరవళ్ళు తొక్కుతూ పారుతున్న వర్షపు వరద నీళ్ళే. అప్పటికే మేము బయలుదేరి రెండు గంటలు దాటింది. పరిస్థితిలో తీవ్రత అర్ధం అయింది. అశోక్ నగర్ లో ముందు మనోహర్ ని దింపి మేము వెనక్కి వద్దామనుకున్నాము. గూగుల్ మ్యాపు చూస్తే అన్నీ ఎర్ర గీతలే.

అశోక్ నగర్ పోయి రావాలంటే మూడు, నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువే పట్టేలా వుంది. అంచేత రెండు కిలోమీటర్ల దూరంలో వున్న మా ఇంటికి కానీ, భరత్ ఇంటికి కానీ పోవాలని నిర్ణయించారు. కానీ పోవడం ఎలా అన్ని రోడ్లు కిక్కిరిసి వున్నాయి. మా ప్రయాణం ఆగుతోంది కానీ వర్షం ఆగడం లేదు. దాని ఉధృతి ఇసుమంత కూడా తగ్గడం లేదు.

మొత్తం మీద మా ఇంటికి కూతవేటు దూరానికి చేరాము. అదిగో ద్వారక అని ఆనందంగా పద్యం అందుకునే లోపల మా వాచ్ మన్ ని గేటు తీసి వుంచమని ఫోన్ చేస్తే కరెంటు పోయింది లిఫ్ట్ లేదు అని చెప్పాడు.

మళ్ళీ భరత్ రూటు మార్చి కారు తన ఇంటి వైపు పొమ్మన్నాడు. అది మాఇంటికి దగ్గరే. మామూలుగా అయితే కారులో అయిదు నిమిషాలు. మాకు గంటకు పైగా పట్టింది. కాంప్లెక్స్ మెయిన్ గేటు దగ్గర పక్కకు తిరగడానికి వీలు లేకుండా వాహనాలు వున్నాయి. ఆ రద్దీ క్లియర్ కావడానికి చాలాసేపు ఇంటి ముందే వెయిట్ చేయాల్సి వచ్చింది.

మొత్తం మీద ఒక ఇంటి కప్పు కిందకు చేరగలిగాము. మా వలలి వనితకి  ఫోన్ చేస్తే ఏమీ పర్వాలేదు, వర్షం తగ్గితే, రాత్రి పదకొండు దాటినా సరే,  ఫోన్ చేయండి,  మా అబ్బాయి మోటార్ సైకిల్ మీద వచ్చి మీకు పోపన్నం చేసిపెట్టి వెళతానని అని హామీ ఇచ్చింది.   అమ్మయ్య పర్వాలేదు అనుకున్నా. కానీ భరత్ బలవంతం మీద  భోజనాలు అక్కడే కానిచ్చాము.  వర్షం పూర్తిగా తగ్గిన గంట తర్వాత ట్రాఫిక్ ఒక పద్దతిలోకి వచ్చిన సంగతి గూగుల్ ద్వారా తెలుసుకుని కారులో మనోహర్ ని అశోక్ నగర్ లో దింపి, మళ్ళీ తేదీ మారే ముందు ఎవరి ఇళ్లకు వాళ్ళం చేరుకున్నాము.

కధ సుఖాంతం.

మా పెద్ద కోడలు భావన చెప్పినట్టు ఇబ్బందులను చూసి కష్టాలుగా భ్రమ పడరాదు.  



(ఇంకా వుంది)

6, ఆగస్టు 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (206) : భండారు శ్రీనివాసరావు

 

ఆగస్టు జ్ఞాపకాలు
నిన్న ఆగస్టు ఐదో తేదీన సుప్రసిద్ధ పాత్రికేయులు, సీనియర్ సంపాదకులు ఐ. వెంకట్రావ్ గారి పుస్తకావిష్కరణ సభలో లోగడ ఆంధ్రజ్యోతిలో పనిచేసిన సుధాకర్ కనిపించాడు. ఒకానొక సందర్భంలో అతడిని ఒక కోరిక కోరదామని మనసులో అనిపించింది. కానీ మొహమాట పడి అడగలేకపోయాను. అడిగివుంటే నా జీవితంలో నాకొక అపూర్వమైన కానుక లభించి వుండేది. ఆ మాట గుర్తు చేస్తే సుధాకర్, ‘అయ్యో! అదేమంత పనండీ! ఎందుకు అడగలేదు, నేను సంతోషంగా చేసి వుండేవాడిని’ అన్నాడు.
గతజలసేతుబంధనం. ఇప్పుడు విచారించి ఏమి లాభం?
అణు విస్పోటనాల నడుమ నా జననం
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో, 1945 ఆగస్టు ఆరో తేదీన జపాన్ లోని హిరోషిమా పై అమెరికా మొట్టమొదటి అణు బాంబును ప్రయోగించింది. తరువాత మూడు రోజులకు రెండో ఆటంబాంబును నాగసాకిపై జారవిడిచింది.
ఈ రెండు బాంబులు సృష్టించిన అణు విలయం నడుమ ఆగస్టు ఏడో తేదీన నేను పుట్టాను. గోరా గారిని సలహా అడిగివుంటే, తన పిల్లలకు లవణం, సమరం అని పేర్లు పెట్టినట్టే, నాపేరు ఆటంబాంబు అని పెట్టమనేవారేమో.
బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు.
'బుడ్గూ' అంటాడు గోపాళం.
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ.
'బుడుగా ఏంటి బుడుగు అసయ్యంగా. మడుగూ బుడుగూ. నాకో పేరు లేదా ఆయ్' అంటాడు బుడుగు అగ్నిహోత్రావధాన్లు లాగా గయ్యి మంటూ.
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం.
'ఏంది గురూ ఈ పేర్ల గోల పొద్దున పొద్దున్నే అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు.
బుడుగుకే కాదు, పుట్టిన ప్రతివారికీ ఈ పేర్ల తిప్పలు తప్పవు.
చిన్నప్పుడు నేను పుట్టినప్పుదు నామ నక్షత్రం ప్రకారం శ్రీనివాసరావు.
కానీ ఇంట్లో ముద్దు పేరు సీనప్ప.
అలాగే ఆ పేరుతోనే పెరిగాను. పెరిగి పెరిగి పెద్దయి ఆంధ్రజ్యోతిలో చేరాను.
చేరిన తరవాత తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు జ్యోతి శ్రీనివాస్ అన్నారు. కావమ్మ గారి మొగుడిలా కామోసు అనుకున్నా. తర్వాత రేడియోలో చేరిన తర్వాత రేడియో శ్రీనివాస్.
ఆ పిమ్మట జీవన స్రవంతి శ్రీనివాస్.
అక్కడితో ఆగిందా.
మాస్కో శ్రీనివాస్.
ఇలాగే ప్రతివారికి జీవితం చివరాఖర్లో .. చెప్పుకోవడానికి, పిలవడానికి ఎన్నో ఇంటి పేర్లు.
కొన్నేళ్ళ క్రితం ఒక మీడియా ఫంక్షన్ కు వెళ్లాను.
ఆక్కడ అందరూ నన్ను పలానా టీవీ శ్రీనివాస్ రావు అనడం మొదలు పెట్టారు. నిజానికి ఒక్కొక్కరు ఓ టీవీ పేరు చెబుతున్నారు. నాకూ ఆ టీవీలకి ఏమీ సంబంధం లేదు, రోజూ పొద్దున్నా సాయంత్రం ఏదో ఒక టీవీ చర్చకు వారాలబ్బాయి మాదిరిగా వెళ్లి రావడం తప్ప. ఇప్పుడు అదీ లేదు, ఫేస్ బుక్ లో తోచినవి, తోచనివి గిలకడం తప్ప.
సియాటిల్ లో వున్నప్పుడు ఒకరోజు ఇండియన్ రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళాము. ఒకతను నావైపు దీక్షగా చూసి మీరు ఫేస్ బుక్ శ్రీనివాస రావు కదా అని పలకరించాడు. నన్నెలా గుర్తుపట్టాడు అని ఆశ్చర్యపోతూ వుంటే ఆయనే సందేహ నివృత్తి చేసారు.
' లోగడ టీవీ చర్చల్లో కనపడే వారు, ఇప్పుడు రావడం లేదు. నేను ఫేస్ బుక్ లో మీరు రాసినవి ప్రతీదీ చదువుతుంటాను. మీరు సియాటిల్ వచ్చారని ఫేస్ బుక్ ద్వారానే తెలిసింది. అంచేతే తేలిగ్గా గుర్తు పట్టాను అన్నారు కరచాలనం చేస్తూ.
అంటే నా సహస్ర గృహ నామావళిలో మరో ఇంటి పేరు ఫేస్ బుక్ శ్రీనివాసరావు చేరిందన్న మాట.
నా వయసు రేపు ఏడున ఎనభయ్యవ పడిలో పడుతుంది. ఉద్యోగం చేసే వయసు కాదు, అలా అని ఎవరన్నా తలచుకుని, పెద్ద మనసు చేసుకుని ఉద్యోగం ఇచ్చే వయసు అంతకంటే కాదు.
అసలు విషయం ఇది కాదు.
జనం నన్ను గుర్తు పడుతున్నారు. గుర్తుపట్టి పలకరిస్తున్నారు ఆప్యాయంగా. ఏ ఉద్యోగం లేకపోయినా.
2019 ఆగస్టు నెలలో ఒకరోజు.
ప్రతి నెలా మొదటి వారంలో అలా నడుచుకుంటూ వెళ్లి రత్నదీప్ సూపర్ మార్కెట్లో నెల వారీ సరుకులు కొని, హోం డెలివరీ చేయమని చెప్పి మళ్ళీ నడుచుకుంటూ తిరిగి రావడం కొన్నేళ్లుగా మా ఇద్దరికీ ఓ అలవాటుగా మారింది. అలాగే ఆరేళ్ల క్రితం ఆగస్టు మొదటివారంలో ఈ నెలవారీ నడక మొదలు పెట్టాం. ఎప్పుడూ లేనిది మా ఆవిడ ఓ సంచీ చేతబట్టుకుని వచ్చింది.
తిరిగి వస్తుంటే ఇదిగో ఈ పక్క సందులోనే మన అరుణ ఇల్లు ఒకసారి చూసిపోదాం అంది. అరుణ అంటే మా వలలి. అంటే వంట అమ్మాయి. మూడు నెలల నుంచి వంటకు రావడం లేదు. అరుణ వాళ్ళు వుండేది మూడో అంతస్తులో. మెట్లెక్కి వెళ్ళాలి. ఫోన్ చేసి కిందికి పిలవరాదా అన్నాను.
“లేదు పొద్దునే తనతో మాట్లాడాను. వాళ్లమ్మ గారి ఊరికి పోతోందిట. ఉత్తమనిషి కూడా కాదు, మెట్లు దిగి ఏమి వస్తుంది. మీరిక్కడే వుండండి, నేను కలిసి వస్తాను’ అన్నది స్థిరంగా. ఇక నేనూ ఆవిడతో పాటు వెళ్లక తప్పలేదు.
పైన ఒకటే గది. మమ్మల్ని చూడగానే అరుణ భారంగా లేవలేక లేచింది. వెలిగిపోతున్న మొహంతో మమ్మల్ని చూస్తూ మంచం మీద కూర్చోమంది.
మా ఆవిడ తాను తెచ్చిన సంచీలో నుంచి కుంకుమ భరిణ, చీరె, జాకెట్ పీస్ తీసి బొట్టుపెట్టి ఇచ్చింది. తీసుకువచ్చిన మిఠాయిలు, పూలు అందించింది.
‘పండంటి బిడ్డను కనడమే కాదు, రాగానే నాకు తీసుకువచ్చి చూపించాలి సుమా’ అని అరుణ దగ్గర మాట తీసుకుంది.
అరుణ మాట నిలబెట్టుకుంటూ మూడు నెలల తర్వాత పసిబిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. కానీ ఆ బిడ్డను చూడడానికి తను లేదు.
అరుణ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె బతికి వుంది కేవలం పది రోజులే.
మరపురాని బాధ కన్నా మధురమే లేదు అనే పాట అలెక్సాలో విన్నప్పుడల్లా వింతగా అనిపిస్తుంది.
ఆగస్టు అంటేనే జ్ఞాపకాలు. మరచిపోవాలని ఎంత ప్రయత్నించినా మరపున పడని ఇలాంటి సంగతులు మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తూనే వుంటాయి. జ్ఞాపకాలకు అడ్డుకట్ట వేసే టెక్నాలజీ ఇంకా కనుక్కోలేదు.
పెళ్ళయిన కొత్తల్లో నాకు దేవుడు అంటే భయం, భక్తీ అంతా ఇంతా కాదు. ఆమెకు పూజా పునస్కారాలు అంతగా లేవు. కానీ కొన్నేళ్ళ తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. ఆమె వుంటే ఇక నాకు దేముడితో పనేమిటి అనే భరోసా నాలో పెరిగితే, ఇల్లూ వాకిలీ పట్టని నాలాంటి మొగుడు దొరికాక, దేవుడి అవసరం ఆమెకు బాగా పెరిగింది.
2019 ఆగస్టు ఏడోతేదీ. ఆ రోజు నా పుట్టిన రోజు. పొద్దున్నే టీవీ ఛానల్ డిబేట్ కి వెళ్లి వచ్చాను. తాను తయారుగా వుంది. జూబిలీ హిల్స్ లోని టీటీడీ బాలాజీ దేవాలయానికి వెడదాం అన్నది. నేనూ అంతవరకూ ఆ గుడి చూడలేదు. సరే పదమని బయలుదేరి వెళ్లాం. కొండ మీద గుడి. మంచి దర్శనం అయింది. అర్చన చేయించి, పులిహోర ప్రసాదం తీసుకుని తిరిగి కిందికి వస్తుంటే ఓ పూజారి గారు నన్ను గుర్తు పట్టి పక్కనే ఉన్న మరో గుడి, వినాయకుడి గుడికి తీసుకు వెళ్ళారు. ఈ గుడికీ, ఆ గుడికీ నడుమ ఓ ప్రహరీ గోడ వుండడం వల్ల కాస్త చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. పూజారి గారు ఏదో చెబుతున్నారు, ఒకరిది వైఖానస సాంప్రదాయం, మరొకరిది శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుకుంటా. ఒకదానికి మరొకటి చుక్కెదురుట. తమని వేరే శ్రీవైష్ణవుల నుండి విడిగా గుర్తించడానికి వైఖానసులు తిరుచూర్ణం స్థానంలో (నిలువు నామాలకు మధ్య వచ్చే నిలువు గీత) కేసరి రంగు మిశ్రమాన్ని వాడతారు. ఇతర వైష్ణవులు నామంలో ఎర్రని పొడిని వాడతారుట. ఇవన్నీ నాకు అర్ధం కాని విషయాలే కాదు, అవసరం లేని విషయాలు కూడా. ఎప్పుడైనా గుడికి వెడితే దేముడికి దండం పెట్టి బయటకు రావడమే తప్ప మిగిలిన విషయాలు పట్టించుకోను.
గుడి మహా ద్వారం దగ్గర ఫోటో తీసుకుందామని అనిపించింది. సెల్ఫీ తీయడం రాదు, తీసేవాడు కనిపించలేదు. కనపడిన వాడిని అడగడానికి మొహమాటం. లేకపోతే ఆ ఫోటో మా జీవితంలో ఆఖరిసారి కలిసి దిగిన ఒక అపూర్వమైన జ్ఞాపకంగా మిగిలిపోయేది. పైగా కనబడ్డవాడు అపరిచితుడేమీ కాదు. పాతిక ముప్పయ్యేళ్ల స్నేహం. అతడే ఆంధ్రజ్యోతి సుధాకర్.
కింది ఫోటో:




(ఇంకావుంది)

5, ఆగస్టు 2025, మంగళవారం

పరిచయ వాక్యాలు

Sharing dais with former Vice President of India Shri Venkayya Naidu while releasing  a book ' విలీనం - విభజన' గతం స్వగతం, మన ముఖ్యమంత్రులు' written by Senior Editor Shri I. Venkata Rao  in Hyderabad today.

క్లుప్తంగా నా పరిచయ వాక్యాలు:

" వెంకయ్య నాయుడు గారు ఇప్పుడు మాట్లాడతారు..
అని ఆరోజు బెజవాడ పి.డబ్ల్యూ.డి. మైదానంలో జరుగుతున్న సభలో మైకులో అనౌన్స్ చేయగానే అక్కడ గుమికూడిన వేలాది జతల కళ్ళన్నీ స్టేజ్ వైపు తిరిగాయి.
వెంకయ్య నాయుడు అంటే ఎవరో నడికారు మనిషి అనుకున్నారు అందరూ. అయితే తెల్లటి దుస్తుల్లో చొక్కా ప్యాంటు వేసుకున్న నవ యువకుడు వచ్చి మైకు పట్టుకున్నాడు. అంతే!
మెరుపులు లేకుండానే పిడుగులు పడ్డాయి. అద్భుతమైన అంత్యప్రాసలతో కూడిన ఆయన ప్రసంగం వింటూ జనం చేసిన కరతాళ ధ్వనులతో మైదానం దద్దరిల్లింది. 
అదే నేను వెంకయ్య నాయుడి గారిని మొదటిసారి చూడడం.

పరిచయ వాక్యాలు పలకమని మిత్రులు గౌరవనీయులు ఐ వెంకట్రావు గారి ఆదేశం లాంటి అభ్యర్ధన. ఇక్కడ ఎవరిని పరిచయం చేయాలి?  పరిచయం అవసరం వున్న వారివ్వరూ ఇక్కడ పైనా కిందా కూడా నా కంటికి కనపడడం లేదు. అందరూ జగమెరిగిన వారే!

వెంకయ్య నాయుడు అన్న ఆ పేరే వారికి ట్రేడ్ మార్క్.  
వారి పక్కన నిలబడి నోరు మెదపడమే ఒక సాహసం. ఇంకా మాట్లాడడం, పరిచయం చేయడం అంటే ఏం చెప్పాలి. నేను కుప్పిగంతులు వేయకా తప్పదు. మీరు వినకా తప్పదు. చూడకా తప్పదు.

వారితో నాకు వ్యక్తిగతం కన్నా వృత్తిగత పరిచయం ఎక్కువ. సమైక్య రాష్ట్రంలో  వారు ఏ సభలో, ఏ సమావేశంలో పాల్గొన్నా రేడియో న్యూస్ యూనిట్ కి ఫోన్ వచ్చేది.  ట్రంక్ కాల్స్ రోజుల నుంచి std రోజులవరకు ఇదే కొనసాగింది.

ఈ క్రమంలో ఆయన పార్టీ పరంగా ఎక్కని మెట్లు లేవు. ఎన్ని మెట్లెక్కి  శిఖరాగ్రం చేరుకున్న తర్వాత కూడా ఆయన బాణీ మారలేదు. ప్రవర్తనలో తేడా రాలేదు. ఎక్కడ కనపడ్డా ఏం శ్రీనివాస రావు ఎలా వున్నావ్? అని అడిగే వారు. అదీ భుజం మీద చేయి వేసి.  ఇది నా ఒక్కడి అనుభవం కాదు.  ఈ హాలులో ఆశీనులైన జర్నలిస్టులు అందరిదీ ఇదే అనుభవం. ఆ మాటకు వస్తే,  ఒకానొకకాలంలో, సమైక్య రాష్ట్రంలో మారు మూల ప్రాంతాలలో వున్న పాత్రికేయులందరిది కూడా.

రేడియోలో వార్తలకు సంబంధించి అత్యధిక సమయం పది నిముషాలు.  6.15 అంటే 6.15 కు మొదలు పెట్టాలి. 6.25 కు క్షణం తక్కువ కాకుండా క్షణం ఎక్కువ కాకుండా ముగించాలి. ఈ ఒడుపు రేడియోలో పనిచేసే మాకన్నా వెంకయ్య నాయుడి గారికే బాగా తెలుసు. బంగారం తూచినట్టు సరిగ్గా, మాకు ఎంత కావాలో అంతే చెప్పేవారు.

వెంకయ్య నాయుడి గారిలో ఒక మంచి సుగుణం ఏమిటంటే, ఆయన ఎంత పెద్ద పదవిలో వున్నా అదే సౌజన్యం. అదే ఔదార్యం. అదే మంచితనం. మరో అరుదైన గుణం ఎక్కి వచ్చిన మెట్లను గుర్తు పెట్టుకోవడం. ఎంత గ్యాప్ వచ్చినా అందర్నీ పేరు పేరునా పలకరించడం. ఆయన అసాధారణ ధారణ శక్తికి ఇదో నిదర్శనం.

ఇక వెంకట్రావు గారు. వృత్తిలో ఎంత చురుకో, వ్యక్తిగా అంత నెమ్మది. 70 వ దశకంలో  బెజవాడ ఆంధ్ర జ్యోతిలో అయిదేళ్లు వారితో కలిసి పనిచేసే అవకాశం, కలిసిమెలిసి తిరిగే అదృష్టం నాకు దక్కింది.  లబ్బీపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం రోడ్డులో వారి నివాసం. పశువుల ఆసుపత్రి సందులో నా ఇల్లు. ఈ రెంటి మధ్యలో ఆంధ్రజ్యోతి. నేను సబ్ ఎడిటర్ గా ఏబీకే ప్రసాద్ గారితో నైట్ షిఫ్ట్.  మధ్యలో ఎప్పుడో చప్పుడు కాకుండా వచ్చి అప్పుడు రిపోర్టర్ గా వున్న వెంకట్రావు గారు తాను తెచ్చిన వార్తలు రాస్తూ కనపడే వారు. 
ఇవన్నీ పాత జ్ఞాపకాలు.

'విస్తళ్లు వేసాం, వడ్డన మొదలైంది, కాళ్ళు చేతులు కడుక్కోండి' అన్న తర్వాత నా వంటి వాడు ఇలా పరిచయ వాక్యాల పేరుతో మెదళ్ళు తినడం అన్యాయం కదా! 
వెంకయ్య నాయుడు గారి మృష్టాన్న ప్రసంగం సిద్ధంగా వుంది. చెవులరా విని ఆనందించండి.

కనుక ముగిస్తున్నాను.

https://youtu.be/fwIgONV1hIU?si=EagKeqUeLNIT9pB5

Video Courtesy: Shri Kondaveeti Jayaprasad MD, Metro TV.







కొడుకే తండ్రయిన వేళ - భండారు శ్రీనివాసరావు

  


'చిట్టి డెలివర్డ్ మేల్ చైల్డ్ - గోపాలరావు '


1973 ఆగస్టు అయిదో తేదీన మద్రాసు నుంచి మా మామగారు ఇచ్చిన టెలిగ్రాం బెజవాడలో వున్న నాకు మరునాడు చేరింది.

నాడు పుట్టిన నా పెద్ద కొడుకే ఈ సందీప్. సండే నాడు పుట్టాడు కనుక సందీప్ అని పిలవడం మొదలు పెట్టాము. బాలసారలు, నామకరణాలు గట్రా లేవు.

ఇప్పుడు పెరిగి పెద్దవాడు అయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. నిరుడు వాడి యాభయ్యవ పుట్టిన రోజున  నేను కాకతాళీయంగా అమెరికాలో వుండడం తటస్థించింది.

వాడి ఫ్రెండ్స్ ఓ పదిమంది తమ కుటుంబాలతో కలసి  పుట్టిన రోజు వేడుకను సియాటిల్ లోని నదిలో నౌకా విహారం చేస్తూ ఘనంగా, సందడిగా నిర్వహించారు. నా కోడలు భావన, మనుమరాళ్ళు సఖి, సృష్ఠి ఈ వేడుకకు తగిన ప్రణాళిక చాలా ముందుగానే సిద్ధం చేశారు. 


సందీప్ గురించి మాట్లాడమంటే నాకు మాటలు కరువయ్యాయి. 


' 2019 లో నా భార్య నిర్మల కన్నుమూసేవరకు వాడికి నేను తండ్రిని. అప్పటినుంచి వాడు నాకు తండ్రిగా మారి కడుపులో పెట్టుకుని చూస్తున్నాడు '


ఇంతకు మించి నా నోరు పెగల్లేదు.

మాట్లాడిన వారందరూ చక్కటి తెలుగులో మాట్లాడి, సందీప్ తో తమ పరిచయాన్ని, స్నేహాన్ని, వాడి మంచితనాన్ని గొప్పగా ప్రశంసించారు.


ఇంటికి వచ్చిన తర్వాత  తల్లి ఫోటో ముందు మళ్ళీ కేకు కట్ చేసి దణ్ణం పెట్టి ఆశీస్సులు తీసుకున్నాడు.


ఒకరకంగా వాడు నా కంటే రెండు రోజులు పెద్ద. నా పుట్టిన రోజు ఆగష్టు ఏడు అయితే వాడిది ఆగష్టు అయిదు.


Happy Birthday Sandeep (IST)







4, ఆగస్టు 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో ( 205 ) : భండారు శ్రీనివాసరావు

 అయాం ఎ బిగ్ జీరో ( 205 ) : భండారు శ్రీనివాసరావు


మరికొన్ని అమెరికా సంగతులు

సియాటిల్ నుంచి బయలుదేరి సాల్ట్ లేక్ సిటీ మీదుగా రాత్రంతా విమానంలో ప్రయాణం చేసి బాల్టిమోర్ ఎయిర్పోర్ట్ చేరుకునే సరికి ఉదయం ఆరుగంటలు. మా మూడో అన్నయ్య కుమారుడు సత్య సాయి వచ్చి మమ్మల్ని ఇంటికి తీసుకు వెళ్ళాడు. రాత్రి నిద్ర మొత్తం బుధవారం పగటి వేళ బాకీ తీర్చుకున్నాము.
ఎందుకంటే మర్నాడు గురువారం ఆ మర్నాడు శుక్రవారం హెక్టిక్ స్కెడ్యూలు. మా అన్నయ్య పిల్లలు అమెరికాలో వుండడం వల్ల నా ప్రయాణం నల్లేరు మీద బండిలా సాగుతోంది.
ఒకరకంగా చెప్పాలి అంటే గవర్నర్ గారి పర్యటన మాదిరిగా వుంది. అన్నీ ఎరెంజ్ చేసి కారు, విమానం ఎక్కమంటారు.

గురువారం అంతా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ సీ అంతా కలయ తిరిగాము. Nations' most famous address వైట్ హౌస్ మా ప్రియారిటీ.

సెక్యూరిటీ హడావిడి వుంటుందని అనుకుంటూ వెడితే అక్కడ ముగ్గురు నలుగురు సాయుధ పోలీసులు మాత్రమే కనిపించారు. ముందుగా ఆన్ లైన్లో బుక్ చేసుకుంటే విజిటర్లను లోపలకు కూడా అనుమతించే ఏర్పాటు వుందట.

విచిత్రం ఏమిటంటే వైట్ హౌస్ కు వెళ్ళే మార్గంలో, దానికి కూతవేటు దూరంలో పేవ్ మెంట్ మీద ఇద్దరు బిచ్చగాళ్లు (హోం లెస్) కనిపించారు. అదే దోవలో దారిపక్కన టోపీలు, టీ షర్టులు అమ్ముకుంటున్న వాళ్ళు కనిపించారు.

అమెరికా పార్లమెంట్, లింకన్ మెమోరియల్, వాషింగ్ టన్ మెమోరియల్ (ఎత్తైన స్థూపం) చూసాము. ఎటు తిరిగినా, ఏమి చేసినా, ఫోటోలు తీసుకుంటున్నా, అక్కడ అడిగేవాళ్ళు, అభ్యంతర పెట్టేవాళ్ళు ఎవరూ లేకపోవడం చిత్రంగా అనిపించింది. అటకాయించే భద్రతా సిబ్బంది మాకు కనబడలేదు.

అమెరికా రాజధానిలో మేము చూసినంతమేరకు , పెద్ద పెద్ద భవనాలు వున్నాయి కానీ, ఆకాశ హర్మ్యాలు కానరాలేదు. దానికి కారణం అడిగితే, వాషింగ్ టన్ మెమోరియల్ స్థూపం కంటే మించి ఎత్తైన భవనాలు నిర్మించరాదని చట్టం వుందని చెబుతారు.

సాయంత్రం తిరిగి బాల్టి మోర్ వస్తూ, రీగన్ ఎయిర్పోర్ట్ సమీపంలో గ్రెవెల్లీ పాయింట్ అనే ఒక టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళాము. అప్పటికే అక్కడ వందకు పైగా వాహనాలు పార్కింగు ఏరియాలో ఆగి ఉన్నాయి. విమానాశ్రయం నుంచి బయలుదేరే లేదా అక్కడ ల్యాండ్ అయ్యే విమానాలను ఆ పాయింట్ నుంచి చాలా దగ్గరగా చూడవచ్చు.

హైదరాబాదు బేగంపేటలో ఎయిర్పోర్ట్ వున్నప్పుడు దగ్గరలో ఒక ఫ్లై ఓవర్ మీద నిలబడి, ఇలానే వచ్చిపోయే విమానాలను జనం ఆసక్తిగా చూసిన సంగతులు గుర్తుకు వచ్చాయి.

విమానాలను కనుక్కున్న దేశం అమెరికా. ఎగిరే విమానాలను దగ్గర నుంచి చూడాలని వందలమంది కార్లలో తరలి వెడుతున్న దేశం అమెరికా. చిత్రంగా అనిపించడంలో ఆశ్చర్యం ఏముంది?

అయితే ఒక విషయం ఒప్పుకుని తీరాలి.
ఎంత చిన్న విషయాన్ని అయినా పర్యాటక ఆకర్షణగా మార్చి జనాలను రప్పించడంలో వారి తెలివితేటలు అమోఘం.

మర్నాడు ఉదయం న్యూయార్క్ ప్రయాణం.
అమెరికాలో పర్యాటక ప్రదేశాలు చుట్టబెట్టాలి అంటే ముందు సిద్ధపడాల్సింది కాలి నడకకు.

ఉదయం పదిన్నర కు బాల్టిమోర్ నుంచి రోడ్డు మార్గంలో న్యూయార్క్ బయలుదేరాం.
ఏడుగురం వసతిగా కూర్చుని, ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రయాణించే విశాలమైన వాహనం.

ఫిలడెల్ఫియా, డెలావేర్ మీదుగా న్యూజెర్సీ చేరుకున్నాము. డెలావేర్ అనేది అమెరికాలో చాలా చిన్న రాష్ట్రం. స్టేట్ సేల్ టాక్స్ వుండని కారణంగా అనేక పెద్ద కంపెనీలు అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకుంటాయి. ఖరీదైన సెల్ ఫోన్లతో సహా అనేక వస్తువులు బయటకంటే చౌకగా లభిస్తాయి.
చుట్టుపక్కల అనేక రాష్ట్రాల వారు ఆ రాష్ట్రానికి వెళ్లి కొనుగోళ్లు చేస్తుంటారు.

అమెరికా మాజీ ప్రెసిడెంటు బైడన్ ఈ రాష్ట్రానికి చెందిన వారే. గతంలో వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు ఆయన కుటుంబం ఇక్కడే వుండేదిట. ఆయన రైల్లో ప్రతిరోజూ న్యూయార్క్ ఆఫీసుకు వెళ్లి వస్తుండేవారు అని మాతో పాటు వున్న మిత్రుడు చెప్పారు.

ఇక న్యూ జెర్సీలో ఆగి ఇండియా స్క్వేర్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వీధిలోని సదరన్ స్పయిస్ రెస్టారెంట్ లో భోజనాలు చేశాము.

తర్వాత కాలి నడకన కలయ తిరిగాము. పక్కనే వున్న పాన్ షాపులో కిళ్ళీలు తీసుకున్నాము. అచ్చం ఇండియాలో వున్నట్టే వుంది. ఆ షాపుకు ఒక తాడు వేలాడ తీసివుంది. ఎవరో వచ్చి ఒక్కటంటే ఒకటే సిగరెట్ కొనుక్కుని, ఆ తాడు కొసన ఉన్న నిప్పుతో సిగరెట్ వెలిగించుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది. అమెరికా వచ్చిన తర్వాత మొదటిసారి ఆ వీధిలో కారు హారన్లు వినిపించాయి. ఒకచోట రోడ్డు మీద రంగురంగులలో వేసిన రంగవల్లి కనిపించింది. అలాగే ‘మీ చేయి చూసి జాతకం చెప్పబడును’ అనే బోర్డు కూడా.

నదీ గర్భంలో సుమారు వందేళ్లకు పూర్వం నిర్మించిన హాలండ్ టన్నెల్ ద్వారా హడ్సన్ నదిని దాటి అవతల న్యూయార్క్ హార్బర్ కు వెళ్లాము. అక్కడ నుంచి పెద్ద బోటులో ప్రయాణిస్తూ, నది రెండు వైపులా అటు న్యూ జెర్సీ, ఇటు న్యూయార్క్ లోని రమ్యహర్మ్య భవనాలు వీక్షిస్తూ స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేరుకున్నాము.

అద్భుతమైన నిర్మాణం. వందేళ్లకు పూర్వమే ఆ భారీ శిల్పం రూపొందించిన తీరు విభ్రమ కలిగించేదిగా వుంది.
పారిస్ లో ఆ భారీ విగ్రహాన్ని నిర్మించి విడి భాగాలుగా విడతీసి ఆ నాటి తెర చాప పడవల్లో న్యూయార్క్ తీరానికి తరలించిన తీరును వివరించే లఘు చిత్రాలను అక్కడ భారీ (ఐ మాక్స్) తెరలపై ప్రదర్శిస్తున్నారు. వాటిని చూసాము.

తరువాతి అడంగు న్యూయార్క్ డౌన్ టౌన్ లోని గ్రౌండ్ జీరో. అంటే ఉగ్రవాదుల దాడులకు గురై నేలమట్టం అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల స్థానంలో నిర్మించిన అమర వీరుల స్మారక ప్రదేశం. అలాగే అదే ప్రాంతంలో మరో సమున్నతమైన వరల్డ్ ట్రేడ్ సెంటర్ భవనాన్ని కొత్తగా నిర్మించారు.

అక్కడికి చాలా దగ్గరలో వున్న ప్లాజా అనే భవనాన్ని చూడడానికి వెళ్ళాము. ఈ భవనంతో మాకో బాదరాయణ సంబంధం, అనుబంధం వుంది. దాదాపు మూడు దశాబ్దాలకు పూర్వం మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు గారు, ఈ భవనం 29 వ అంతస్తులో అనుకుంటా కొన్ని సంవత్సరాలు నివసించారు. అప్పుడు ఆయన న్యూయార్క్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ వుండే వారు.
తర్వాత గ్రౌండ్ జీరో పక్కనే అపూర్వ నిర్మాణ కౌశలంతో నిర్మించిన అండర్ గ్రౌండ్ రైల్వే చూసాము.

అక్కడ నుంచి అమెరికాతో పాటు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసించే న్యూయార్క్ స్టాక్ ఎక్సెంజి దగ్గర ప్రఖ్యాతిగాంచిన భారీ బుల్ విగ్రహాన్ని చూడడానికి వెళ్ళాము.
నమ్మకమో, మూఢ నమ్మకమో తెలియదు, వీటికి ఎవరూ అతీతులు కారేమో అనిపించే దృశ్యాన్ని అక్కడ చూసాను.
షేర్ లావాదేవీల్లో కలిసి రావాలని కోరుకుంటూ అనేక మంది ఆ బుల్ విగ్రహం వద్దకు వెడతారు. తప్పేమీ లేదు. ఎవరి నమ్మకాలు వారివి. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే ఆ బుల్ వృషణాలను తాకి మనసులో కోరుకుంటే వారు కోరుకున్నట్టుగా షేర్ ధరలు పెరుగుతాయట. ఈ నమ్మకం అక్కడి వారిలో ఎంతగా వున్నదో తెలియడానికి అక్కడ కనిపించిన క్యూలే సాక్ష్యం.

ఇక చివరి మజిలీ ప్రపంచ ప్రఖ్యాత టైమ్ స్క్వేర్.
నిజానికి న్యూయార్క్ లోని అనేకానేక వీధుల్లో అదొకటి. కానీ దాని వైభోగమే వేరు. పర్యాటకులు అందరూ కట్టగట్టుకుని వచ్చినట్టు ఆ ప్రాంతం అంతా జనంతో కిటకిటలాడుతోంది. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ అంతా అక్కడే వినియోగిస్తున్నట్టు ధగధగలాడుతోంది.
నా కంటికి మాత్రం అదో కలవారి తిరునాళ మాదిరిగా అనిపించింది.
కాళ్ళు అరిగేలా తిరిగి తిరిగి కారులో మళ్లీ వూరు చేరే సరికి అర్ధరాత్రి రెండు గంటలు దాటింది.

మా అన్నయ్య కొడుకు సత్యసాయి నేను ఇండియా వెళ్ళిపోతున్న సందర్భంగా వాళ్ళ ఇంట్లో వీడ్కోలు విందు ఇచ్చాడు. వున్న వూళ్ళో వాళ్ళే కాకుండా చుట్టుపక్కల అనేక ప్రదేశాల నుంచి మా బంధుమిత్రులు దాదాపు నలభై మంది వచ్చారు. ఇంతమంది చుట్టూ వుంటే ఒంటరివాడిని ఎందుకవుతాను?

అమెరికాలో అనేక ప్రదేశాలు తిరిగాను. విమానాల్లో, కార్లలో ప్రయాణించాను. పెద్ద పెద్ద హోటళ్లలో బస చేసాను. ఎక్కడా ఒక్క రూపాయి (డాలర్) ఖర్చు చేయనివ్వకుండా వెంట వుండి అన్నీ వాళ్ళే చూసుకున్నారు. నా పట్ల ఇంతటి అవ్యాజానురాగం చూపించడానికి నాకు తెలిసి ఏ ఒక్క కారణం లేదు, కేవలం మా అమ్మ, నాన్న కడుపున పుట్టిన నా అదృష్టం తప్ప.

తోకటపా:

వైట్ హౌస్ పైన ఎగురుతున్న అమెరికన్ జాతీయ పతాకం కిందనే నలుపు తెలుపులో మరో జెండా ఎగురుతుంటుంది. యుద్ధాల్లో మరణించిన లేదా ఆచూకీ తెలియకుండా పోయిన అమెరికన్ సైనికుల స్మృత్యర్ధం రూపొందించిన పతాకం అది.


కింది ఫోటోలు:
































(ఇంకా వుంది)

ఫ్రెండ్ షిప్ డే

  స్నేహితుల దినం అంటూ చాలా మంది నా పేస్ బుక్ స్నేహితులు వారి దోస్తులను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెట్టారు. వారూ, వారి ఫ్రెండ్స్ ధన్యులు.

నాకు ఒకే ఒక్క స్నేహితురాలు మా ఆవిడ నిర్మల. ఇక నాకు స్నేహితులు ఎవరూ లేరని కాదు. వున్నారు. పెళ్ళికి ముందు, తర్వాత నన్ను అస్తమానం అంటి పెట్టుకుని వున్న మనిషి ఈవిడే.
బహుశా నన్ను వదిలిపెట్టే రోజు, ఒకరోజు వస్తుందని ముందే తెలుసేమో ఏనాడు నన్ను వదిలిపెట్టి వుండలేదు.
ఈరోజు అని ఏమిటి ప్రతి రోజూ గుర్తుకు రావాల్సిన మనిషి.
ఆమె బతికివున్న రోజుల్లో ఈ ఎరుక వుంటే ఎంత బాగుండేదో కదా!



1, ఆగస్టు 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (204) : భండారు శ్రీనివాసరావు

 వేలు విడిచిన మేనమామ

నేను వేలు పెట్టని ప్రక్రియ లేదు, ఒక్క ఛందోబద్ధ పద్యం, నవలా రచన ఈ రెండు తప్పిస్తే, కధలు, గేయాలు, వ్యాసాలు, వాక్టూనులు, కార్టూనులు, జీవన స్రవంతి వంటి స్వకపోల కల్పితాలు,  టీవీ చర్చలు, వగైరా వగైరా.   

వేలు దూరే సందు దొరకాలే కానీ, అన్నిట్లో వేలు పెట్టడం, వదిలేయడం, అదేదో ఇంగ్లీష్ సామెత లాగా. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ బాపతన్న మాట.  

మా పెద్ద మేనల్లుడు, నాకంటే వయసులో చాలా పెద్ద అయిన  డాక్టర్ ఏపీ రంగారావు (108, 104 అంబులెన్స్ల  ఫేం) కు పత్రికల్లో వచ్చే గళ్ళనుడికట్లు పూర్తి చేయడం హాబీ. ముఖ్యంగా ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం సప్లిమెంటులో (ఇప్పుడు వస్తున్నదో లేదో తెలియదు) ప్రచురించే గళ్ళనుడికట్టుతో కుస్తీ పడుతుండేవాడు. ఇక్కడ మేనమామ చాలిక పోలిక కుదరదు, నాదీ నా పెద్ద మేనల్లుడి  వరసే. ఆదివారం నాడు అన్ని తెలుగు దినపత్రికలు తెప్పించడం ఇందుకోసమే. ఆ రోజుల్లో వారాల అబ్బాయిలా ప్రతి రోజూ ఒక టీవీ స్టూడియోకి వెళ్ళేవాడిని.  ఆదివారం ఉదయం చర్చలకు వెళ్ళే  టీవీ స్టూడియో నుంచి,  మా ఇంటికి రాని కొన్ని పేపర్లను ‘ఇదిగో ఈ పిల్ల పత్రికని నేను దొంగిలిస్తున్నాను’ అని చెప్పి మరీ  పట్టుకొచ్చేవాడిని. ఏమోలే, ఏనాడూ మనం ఇచ్చే  పచ్చి టీ నీళ్ళు కూడా తాగడు’ అనే సానుభూతో ఏమో  వాళ్ళూ కిమ్మనేవాళ్ళు కాదు.  

ఈ పదబంధ పూరణ అనే అలవాటు క్రమంగా ముదిరి, డీఎడిక్షన్ కు అవకాశం లేని వ్యసనంలా మారింది.

రేడియోలో పనిచేసేటప్పుడు ఒకమ్మాయి వచ్చి ఎలాగైనా వార్తలు చదవాల్సిందే, నా చేత చదివించాల్సిందే అని పట్టుబట్టింది. దూరదర్సన్ అయితే అద్దంలో నీ మొహం చూసుకున్నావా అనే ఒక మాట ప్రయోగించవచ్చు. కానీ రేడియోకి కావాల్సింది రూపం కాదు వాచికం. అదీ ఆమె రూపానికి తగ్గట్టే వుంది. కానీ ఆ మాట మొహం మీద ఎలా చెప్పగలం. వార్తలు చదవడం సంగతేమో కానీ,  మనసులో భావాలు చదివే సామర్ధ్యం వున్నట్టుంది, తెల్లబోయి చూస్తున్న మా మొహాల వంక నవ్వుతూ చూస్తూ అంది, ‘మీకు తెలిసే వుండాలి, అమితాబ్ బచ్చన్ కి కూడా మొదట్లో గొంతు బాగా లేదని చెప్పి  సినిమాల్లో వేషాలు ఇవ్వలేదు, మీరు  ఇచ్చి చూడండి అదే అలవాటు అవుతుంది’ అనే ధోరణిలో వాదం మొదలు పెట్టింది. వార్తలు చదవడం అంటే రేడియో పెట్ట్టుకుని వార్తలు విన్నంత సులభం కాదని, ఆ ఎంపికకు చాంతాడంత ప్రొసీజర్ వుంటుందని ఎలాగో నచ్చచెప్పి పంపించాము అనుకోండి.

నాదీ ఒకరకంగా ఆ అమ్మాయి తత్వమే. ఎందుకు చేయలేను అని అన్నింట్లో వేలు పెడుతుంటాను.

ఎన్నాళ్ళు ఇలా పిల్ల పత్రికల్లో పదబంధ పారిజాతాలు పూర్తి   చేస్తూ కూచోవాలి, నేనే గళ్ళ నుడికట్టు తయారుచేస్తే పోలా అనుకుని ఒక శుభ ముహూర్తంలో కష్టపడి ఆ ప్రయత్నం  చేశాను. ఆ రోజుల్లో నా లక్ష్యం నా పదాల పందిరి మరో పదబంధ  ప్రహేళిక కావాలని. లక్ష్యం పెద్దది పెట్టుకోమన్నారు కదా, కలాం గారు.

బోలెడు తయారు చేశాను, నిజంగా కష్టపడి. ఇందులో ఇంత శ్రమ వున్న సంగతి అప్పుడే తెలిసింది. కానీ వేసే పత్రిక లేదు. ముష్టివాడు వస్తే, చేయి ఖాళీ లేదు అనే ఇల్లాలిలా,  ప్రతి పత్రికకు ఇవి తయారు చేసిపెట్టే ఘనాపాటీలు సిద్ధంగా వున్నారు. దాంతో, పదాల పందిరి శీర్షికతో తయారు చేసిన పందిళ్ళు కొన్ని పాత కాగితాల దొంతరల్లోనే  వుండిపోయాయి.  వెతికితే నాలుగయిదు దొరికాయి. కొన్ని పూరించినవి. కొన్ని పూరించనవి. ఇప్పుడు ప్రయత్నిస్తే నాకే కొరుకుడు పడడం లేదు.  

ఇదంతా ఎప్పుడో, పాతికేళ్ళ కిందటి సంగతి. అప్పుడు కంప్యూటర్లు వున్నాయి, కానీ  ఇప్పటిలా ఇంతటి నాగరీకంగా వుండేవి కావు. ఒకరకంగా చెప్పాలి అంటే గ్లోరిఫైడ్ టైప్ రైటర్లు.  మా  దగ్గర పనిచేసే శ్రీదేవి అనే స్టెనోగ్రాఫర్, నా మాట కాదనలేక  నానా అవస్థపడి గళ్ళనుడికట్టు చార్టులు తయారుచేసింది.  తెలుపు, నలుపు గళ్ళు, మళ్ళీ వాటిలో అడ్డం, నిలువు అంకెలు. తీరా అంతా పూర్తయిన తర్వాత నిలువులోనో, అడ్డంలోనో   ఒక అంకె తప్పు పడేది. మళ్ళీ శ్రమపడి సరిదిద్దేది. అయినా ఒకటి రెండు అక్షర దోషాలు తప్పేవి కావు. శ్రీదేవికి పని ఒప్పచెబితే ఇది నా పని కాదు అనకుండా ఓపికగా చేసేది. మనసు పెట్టి పనిచేసేది.  అంచేత మనసులో తిట్టుకోకుండా ఇష్టపడే ఈ తతంగాన్ని పూర్తి చేసేది.

అప్పుడు ఈ సాంఘిక మాధ్యమాలు లేవు, మనం రాసింది మనం చదువుకోవడమే. మనం చూసుకోవడమే.  

రెండు దశాబ్దాలుగా వెలుగు చూడకుండా వున్న పదాల పందిరి గళ్ళనుడికట్లలో మచ్చుకు ఒకటి.

 

పదాల పందిరి: 5

ఆధారాలు:

అడ్డం:

1. నువ్వు తప్ప (4)

4. కసి కసిగా వుందా? రెండో మారనకపొతే ఏం?  (2)

6. పొమ్మనడం రమ్మనడం అంతా మీ ఇష్టమేనా? (2)

8. దీవించండి ఒక పనయిపోతుంది (5)

10.  ఆవేశం చివర్లో తగ్గిపోయింది (3)

12. దన్నుగా నిలవాలని ఎదురు తిరిగి నిలబడింది  (2)

13. ఉత్తరం పంపాలా? దీన్ని పిలవండి (3)

15. లెస్స పలికితివి కృష్ణ రాయా! (9)

18. విడిపోయింది చెదిరి మధ్యలో కొంత కోల్పోయింది. (3)

19. వున్నవి రెండు ఎలుకలు, వరసగా నిలబడితే, తలలు ఎగిరిపోయాయి. (4)

22. ఆమ్యామ్మా నలుగురికి తెలియకూడదని రూపం మార్చుకుంది. (3)

24. దీంతో కడిగిన ముత్యం మెరవక చస్తుందా! (2)

25. ఇదీ నిలువు 21 మాదిరే! కానీ ముందున్న గౌరవం కోల్పోయింది   (2)

27. వ్రతమన్న పేరే కానీ కాణీ ఖర్చులేదు . పైగా చేయక్కరలేదు, పడితే చాలు  (4)

28. బేధాల్లో ఒకటి  (2)

29. 26 నిలువులోని పాలే సుమా!  (4)

31. ఈ అఘాయిత్యం కూల! ఇదేమిటి?  (4)

32. అప్పటినుంచి (4)

35. కుదుపు  (3)

36. తలాపిడికెడు  (5)

 

ఆధారాలు నిలువు

 

 2. ఫారిన్ లాంగ్వేజెస్ – అందుకే తెలుగు వ్యాకరణం తగలడి గుడి, గుడి దీర్ఘం రెండూ పోయాయి. (6)

 

3. నడి సంద్రములో నడిపించు -------దేవా! (2)

4. నిజమే కానీ మధ్యలో సాగింది (4)

5. ఇంకు (2)

7. రచ్చ రచ్చ (3)

9. గజిబిజి ఆలోచన (3)

10. చూచి రమ్మంటే కాల్చి వచ్చే సేవకులతో ఇదే తంటా! కడకంటా వినరు (2)

11. వేషము కట్టబోతే మధ్యలో కుదరలేదు (3)

13. క భాషలో రెండులు (4)

14. అచ్చంగా చెవులవే (3)

16. పాతకాలం నాటి నాటకాల కరపత్రాలలో ఇది మామూలేగా  (6)

17. తెలుపు గడి కదా! తెల్లదే (5)

20. కింద నుంచి ఏర్పాటు, అరమరిక ర లేదు. (4)

21. ఇది ఆజ్ఞే కానీ ముందు గారు (3)

23. ఉచ్చారణ లేని భాష (2)

26. కుంభం రాశి కాదు (2)

28. అంతరాయం కనుకే అలా అయింది (4)

30. పన్నీరుకు జత (3)

 33. పద్యం చెప్పాలంటే ఈ సన్యాసి అవసరం ఎంతో వుంది. (2)

34. ఈ భారం అంటే కృష్ణుడు గుర్తు వస్తాడు (2)

 

తోకటపా:

ఇదంతా రాసిన తర్వాత నాకు బోధివృక్షం అవసరం లేకుండానే  జ్ఞానోదయం అయింది. టెక్నాలజీలో గొప్ప ప్రవేశం లేని నాకు అర్ధం అయింది ఏమిటంటే:

“THIS IS NOT MY CUP OF TEA”

 

 

 

 

 

కింది చిత్రాలు : పదాల పందిరి (5) ఆధారాలతో పూరించక మునుపు, పూరించిన తర్వాత







 

(ఇంకావుంది)