30, ఏప్రిల్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (153) – భండారు శ్రీనివాసరావు

 లాక్ డౌన్

అందరం మరచిపోయాం! అవును. అందరం పూర్తిగా మరచిపోయాం.

జీవిత కధ అంటేనే అంతవరకూ అనుభవించిన కష్ట సుఖాల కలబోత. అలాంటిది మనమే కాదు, మన పూర్వీకులు సయితం కనీవినీ ఎరుగని కష్టకాలాన్ని మనం అందరం కలిసే అనుభవించాము. అది కూడా దశాబ్దాల నాటి విషయం  కాదు. నాలుగయిదేళ్ళు కూడా కాలేదు. అప్పుడే మరచిపోయాం.

ఈ సువిశాల విశ్వంలో ప్రకృతి వైపరీత్యాలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఒక ప్రాంతంలో వరదలు సంభవిస్తే దానివల్ల ఏర్పడే కష్ట నష్టాలు అక్కడి ప్రజలే అనుభవిస్తారు. బయటి ప్రాంతాల వాళ్లకు నేరుగా వచ్చిపడే బాధలు వుండవు. భూకంపాలు, తుపానులు, పిడుగు పాట్లు,  అంటువ్యాధుల వ్యాప్తి, అనావృష్టి, రోడ్డు, రైలు, విమాన ప్రమాదాలు ఇలా ఏది తీసుకున్నా వాటి ప్రభావం స్థానికంగానే వుంటుంది. అలాంటిది అప్పటివరకు పేరూ వూరూ లేని, మామూలు కంటికి కనపడని ఒక చిన్న నలుసులాంటి క్రిమి యావత్ ప్రపంచాన్ని ఒకేమారు గడగడా  వణికించింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను అతలాకుతలం చేసింది.   

కేరళలోని మూడు పట్టణాల్లో మొట్టమొదట  2020 మార్చిలో  ఈ కోవిడ్ వ్యాధిని గుర్తించారు. చైనా వెళ్లి వుహాన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్ధులు స్వదేశానికి వస్తూ వెంటబెట్టుకు  వచ్చిన వ్యాధి,  అతిత్వరలో భయంకర పరిణామాలకు మూలకారకం అవుతుందని అప్పట్లో వారికి తెలియదు. నిజం చెప్పాలి అంటే, ప్రపంచంలోనే  అసలు ఎవ్వరికీ తెలియదు.

తదాదిగా,  ప్రపంచంలో చోటు చేసుకున్న పరిణామాలు సినిమా రీలులా గిర్రున తిరిగాయి. 2020 మార్చి ఇరవై మూడో తేదీన దేశంలో తొలిసారి కేరళలో లాక్ డౌన్ విధించారు. అప్పటిదాకా ఈ పదాన్ని వేరే అర్ధంలో, అర్ధం చేసుకోవడానికి అలవాటు పడిన వారికి లాక్ డౌన్ అమలు తీరు  అంటే ఏమిటో తెలిసి వచ్చి నివ్వెరపోయారు. ఆ తర్వాత రెండు రోజులకే,  విధిలేని పరిస్థితుల్లో  యావత్ భారతదేశంలో ఇరవై ఒక్క రోజులపాటు  లాక్ డౌన్ విధించారు. దేశ వ్యాప్తంగా కర్ఫ్యూ వంటి వాతావరణం కమ్ముకోవడం అదే మొదటిసారి కావడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అయినా ప్రభుత్వ ఆదేశాలను పాటించారు. గత్యంతరం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.

ఎందుకంటేఈ కోవిడ్ (దీనికే కరోనా అనే మరో ముద్దు పేరు) వ్యాధి లక్షణాలు  ఏమిటో తెలియదు. ఎలా వ్యాపిస్తుందో తెలవదు. అప్పటికి తెలిసిందల్లా ఈ వ్యాధి బారిన పడితే మరణం తధ్యమని. దీనికి మందు లేదని.  నోటి నుంచిశ్వాస నుంచి వెలువడే గాలి ద్వారా మాత్రమే కాదు,  అసలు మనుషులు ఒకరినొకరు తాకినా అంటుకుంటుందని ఇలా రకరకాల పుకార్లు షికారు చేశాయి. కలరా వంటి ఇతరేతర వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు. చికిత్సచేయడానికి ప్రభుత్వప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో  వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లువాడడానికి  మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండాకుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని   ఐసొలేషన్ గదుల్లో ఉంచాల్సిన పరిస్థితి. ఇళ్ళల్లో ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడం సామాన్యులకు అలవి కాని పని. ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో కిటకిట. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య ఖర్చు అసామాన్యులకు కూడా అందని మానిపండు. దీనికి తోడు ఆక్సిజన్ కొరత. చుట్టూ గాలిలో ఎంత ఆక్సిజన్ వున్నా రోగికి అందించాలి అంటే అప్పటికప్పుడు ఆక్సిజన్ అందించడం సాధ్యం కాదు.  ఇదంతా ఆషామాషీ వ్యవహారం కాదు. రోగిని ముట్టుకోకుండా పరీక్షలు చేయాలి. ప్రాణాలను పణంగా పెట్టి కనిపెట్టి చూసే వైద్యులు, వైద్య సిబ్బంది కావాలి.   మొదటి రెండు దశల్లో వ్యాధిని  గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ హానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అన్నారు నిపుణులు. రోగి  చనిపోయిన తర్వాత కూడా సొంత కుటుంబ సభ్యులు తమ ఆత్మీయుడి శరీరాన్ని తాకలేని పరిస్థితి. సాంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించలేని దుస్థితి. ఈ స్థితి పగవాడికి కూడా రాకూడదు అని మౌనంగా రోదించిన కుటుంబాలు ఎన్నో! ఎన్నెన్నో!!

మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి దేశంలో ప్రవేశించిందని వార్తలు. విదేశాల్లో బయలు దేరినప్పుడు వ్యాధి సోకినా ఆ విషయం వారికి తెలియదు. స్వదేశం చేరిన తర్వాత అలాంటివాళ్ళు ఎంతో మందిని కలిసి వుంటారు. అలాంటివారినందరినీ ఇప్పుడు వెతికి పట్టుకుని పరీక్షలు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ భుజస్కంధాలపై పడింది. ఇది సాధారణ విషయం కాదు. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది. అయినా ప్రభుత్వం వెనుకాడ లేదు.

 

కోవిడ్ మొదటి ఉత్పాతాన్ని సరిగా అర్ధం చేసుకోలేని ప్రజలు దీన్ని సరదాగా తీసుకోకపోయినా సీరియస్ గా తీసుకోలేదు.  ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి.  ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. ఈ వ్యాధిని ఎలా నిర్మూలించడం అనే కన్నా, విస్తరించకుండా దీన్ని  ఎలా అరికట్టడం ఎలా అనేది ప్రాధాన్యతా అంశంగా మారిపోయింది. వారికి ముందుగా కనపడిన మార్గం  లాక్ డౌన్. ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రాకుండా,  కదలకుండా కొన్ని రోజుల పాటు ఒకేచోట వుండిపోయేలా చెయ్యడం. నాగరిక ప్రపంచ చరిత్ర ప్రారంభం అయిన తర్వాత మొట్టమొదటిసారి ప్రజలు కాలు బయట పెట్టకుండా, మూడు విడతలుగా,  కొన్ని వారాల పాటు ఇళ్లకు అతుక్కుని వుండిపోయారు.  రైళ్లు, కార్లు, బస్సులు, ఆటోలు, టాక్సీలు, విమానాల రాకపోకలు పూర్తిగా  నిలిచిపోయాయి. ప్లబ్బులు,  క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు,  మాల్స్, సినిమా హాల్స్ మూతపడ్డాయి. పోలీసులు విధించే కర్ఫ్యూ సమయాల్లో కూడా బయట తిరిగేవాళ్ళు కొందరు కనిపించేవారు కానీ లాక్ డౌన్ అమల్లో వున్న కాలంలో రాత్రీ పగలూ తేడా లేకుండా ఎల్లెడలా నిర్మానుష్యం. అప్పుడప్పుడూ తిరిగే అంబులెన్సుల సైరన్ చప్పుళ్ళు మినహా సర్వత్రా నిశ్శబ్దం. లాక్ డౌన్  నియమం ఉల్లంఘిస్తే జైలు శిక్ష అన్నారు కానీ, జనం స్వచ్చందంగానే లాక్ డౌన్ పాటించారనే చెప్పాలి.

ఆ రోజులు ఇప్పుడు తలచుకుంటే, అప్పుడు అలా ఎలా  వుండగలిగామని మనకే ఆశ్చర్యం వేస్తుంది. మనిషిలో అంతర్లీనంగా వుండే చావు భయం అలా చేయించి వుండాలి.  కరోనా భయం అనేది  వున్నవారు లేనివారు అనే తేడా లేకుండా సమస్త సమాజాలను ఒకే తీరున వణికించింది. జీవితం అశాశ్వతం అనే నిర్వేదంలోకి మానవ జాతి ఏకకాలంలో వెళ్ళిన ఏకైక సందర్భం అది.

మొత్తం మీద కరోనా వ్యాధికి వాక్సిన్ కనుక్కున్నారు. అదీ మన దేశంలోనే,  హైదరాబాదు, పుణే నగరాలలోనే. వాక్సిన్ రాకతో ప్రజల్లో గుండె ధైర్యం పెరిగింది.

కానీ ఏం లాభం? ఏడాది, రెండేళ్లు  తిరక్క మునుపే, జనం వెనుకటి గుణమేల మాను అన్న రీతిలో పాత జీవితాల్లోకి జారిపోయారు. కరోనా అంటే ఏమిటి? స్విగ్గీలో దొరుకుతుందా అంటున్నారు.

తోకటపా:

కరోనా మన్ కి బాత్

 కరోనా రాకచూసి మిగిలిన వ్యాధులన్నీ సర్దుకు కూర్చున్నాయి.

ఏమిటలా వున్నావు’ ధైర్యం చేసి అడిగింది కలరా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.

ఎలా ఉండనునిన్న మొన్నటిదాకా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించానని విర్రవీగాను’

ఇప్పుడు మాత్రం ఏమైందినీ నామ స్మరణ చేయకుండా భూలోకవాసులకు క్షణం గడవలేదు కదా!’ అన్నది హెచ్.ఐ.వి.

నేనూ అలాగే అనుకున్నాను. ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజల నోళ్ళలో నా పేరు ఎన్ని కోట్లమారు మారుమోగుతున్నదో చూసి నేనూ పులకరించిపోయాను. వాళ్ళు నా పేరు వింటేనే ఎంతగా భయపడుతున్నారో కళ్ళారా చూసి పొంగిపోయాను. కానీ అది భయం కాదనీవాళ్ళు నాతో పరాచికాలు ఆడుతున్నారనీ ఇపుడిప్పుడే గ్రహింపుకు వచ్చి సిగ్గుపడుతున్నాను’

అదేమిటే అలా అంటున్నావు. నువ్వు కదా మా అందర్నీ చూస్తుండగానే మించిపోయావు. నీ పేరు వింటేనే వణికిపోయేలా మానవుల్ని మార్చగలిగావు అని మేమిక్కడ అసూయతో రగిలిపోతుంటే ఏమిటిది ఇలా నీ ఈ మాటలతో మమ్మల్నిలా మళ్ళీ సంతోషపెడుతున్నావు’ అంది ఎబోలా.

అలానా! నేను రంగ ప్రవేశం చేసిన తర్వాత మీకెవ్వరికీ సరైన పనిపాటలు లేకుండాపోయాయి కదా! ఆ ఖాళీ టైములో మీరు కాస్త పత్రికలు చదివితేకొంచెం టీవీలు చూస్తే విషయం బోధపడేది’

పత్రికలూటీవీలు అంటూ మమ్మల్ని భయపెట్టకు. మేము ఇంతమందిమి కలిసి చేయలేని అపకారాన్ని అవి ఒంటిచేత్తో మానవాళికి చేస్తున్నాయి. అసలేం జరిగిందో నువ్వే చెప్పువింటాం’ అంది కేన్సర్.

మనుషులకు చావు భయాన్ని మించిన భయం వుండదు అనే ధీమాతో నేను భూలోకంలో అడుగుపెట్టాను. మొదట్లో నా అభిప్రాయం నిజమే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ తమ మునపటి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చావు ముంగిట్లో వుందని తెలిసి కూడా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తూనే వున్నారు. చనిపోతే కట్టుకుపోయేది ఏమీ ఉండదని తెలిసికూడా ఆన్ లైన్ మోసాలతో ఇతరులని దోచుకుంటూనే వున్నారు. కరోనా బారిన పడితే రేపు మనది కాదు అనే భయం ఎటు పోయిందో తెలవదు ఎప్పుడో  వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలాగాప్రత్యర్ధిని ఓడించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగతనాలుదోపిడీలు జరుగుతూనే వున్నాయి. భూఆక్రమణలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి. డబ్బు పోగేసుకోవడం ముమ్మరమయింది. మరణభయంతో జనంలో అత్యాశ లేకుండా పోతుంది అనుకుంటే ఆ కక్కుర్తి మరీ ఎక్కువయింది. తింటున్నారుతాగుతున్నారుక్వారంటైన్లలో చిందులేస్తున్నారు. వైద్యం చేయడానికి లక్షలు గుంజుతున్నారు. చనిపోతే శవాన్ని అప్పగించడానికి డబ్బులు లాగుతున్నారు. నిజం చెప్పాలంటే నా రాకకు ముందుకంటే కూడా ఇప్పుడు ప్రపంచం మరీ పాడయిపోయింది.

ఇన్నిరోజుల అనుభవంతో చెబుతున్నా వినండి. కరోనా అంటే భయం కంటే డబ్బు అంటే మమకారమే వాళ్లకు ఎక్కువ అని తేలిపోయింది’

 

 

కింది ఫోటో:

ప్రభుత్వ ఆధ్వర్యంలో కరోనా వాక్సిన్ మొదటి డోసు వేయించుకుంటున్న సందర్భం.



 

(ఇంకావుంది)

29, ఏప్రిల్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (152) – భండారు శ్రీనివాసరావు

 కాలుక్షేపం

బెన్ హర్ మహేష్ ఎక్కా. ఐ.ఏ.ఎస్. ఆయన్ని చూసి కాస్త అటూ ఇటూగా పాతికేళ్ళు పైమాటే. నేను గుర్తు పట్టనే లేదు. రాత్రి అన్నంలో వేసుకుంది ఏ కూర అంటే చప్పున చెప్పలేని గొప్ప జ్ఞాపక శక్తి నాది.
విషయంలో జ్వాలాని మెచ్చుకుని తీరాలి. స్నేహితులు, సన్నిహితులవే కాక అప్పుడప్పుడు పరిచయం అయిన వ్యక్తుల పేర్లు, ఫోను నెంబర్లు అన్నీ ఆయనకి కరతలామలకం. నిజానికి ఆయన ఫోను చేసి చెప్పబట్టే బెన్ హర్ ఎక్కాని కలవడం జరిగింది. ‘నీకు ఆయన తెలుసు, ఐఏఎస్ ప్రోబెషనర్లగా వున్నప్పుడు ఆయన బ్యాచ్ కి నువ్వే తెలుగు పాఠాలు చెప్పావు, మరచిపోయావా’ అని కూడా అన్నాడు.
నాకయితే ఈ బెన్హర్ మహాశయుల రూపం కూడా గుర్తుకు రాలేదు.
గిరిజనుల ఆరోగ్యాలకు సంబంధించిన అంశంపై క్రియ సీయీఓ డాక్టర్ బాలాజీ ఆయనకి వివరిస్తున్నారు. మధ్య మధ్యలో బెన్ హర్ ఎక్కా నా వైపు చూస్తున్నారు. నేను కూడా తేరిపార చూసాను కానీ నా దగ్గర తెలుగు నేర్చుకున్న అధికారులు ఎవ్వరూ స్పురణకు రాలేదు. లేచి వస్తున్నప్పుడు బెన్ హర్ నాతో అన్నారు.
‘నేను, సంజయ్, వెంకటేశం ఇంకా కొంతమందిమి మీ ఇంటికి వచ్చే వాళ్ళం. ఆ రోజుల్లో మీకు కాలు ఫ్రాక్చర్ అయి ఇంట్లో వున్నారు’
నాకు లైట్ వెలిగింది.
మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు శ్రీ పీ.వీ.ఆర్.కే. ప్రసాద్ డైరెక్టర్ జనరల్. జ్వాలా అక్కడ చేసిన ఉద్యోగం ఏమిటో చెప్పలేను కానీ ఆ సంస్థలో అన్నీ ఆయనే అని చెప్పగలను. ఆ రోజుల్లో నాకు కాలు ఫ్రాక్చర్ అయింది. ఆఫీసుకు పోకుండా, తీరిక సమయాల్లో ఇంటి నుంచే ఫోన్ ద్వారా రేడియో రిపోర్టింగ్ పని చూస్తూ, (వర్క్ ఫ్రమ్ హోం పాతికేళ్ళ క్రితమే నాతోనే మొదలైందేమో) నా విరిగిన కాలుతో ‘కాలుక్షేపం’ చేస్తుండేవాడిని.
మరికొంత కాలక్షేపంగా ఉంటుందని జ్వాలా పూనికపై, ప్రసాద్ గారు తెలుగు మాతృభాష కాని ప్రొబేషనరీ ఐ.ఏ.ఎస్. అధికారులకు తెలుగు నేర్పే పని ఒప్పచెప్పారు. వాళ్ళు అప్పుడు గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ లో (ఇప్పుడు అది శిధిలావస్థలో వుంది) వుంటుండేవాళ్ళు. మేము వుండే దుర్గానగర్ కు దగ్గర. అంచేత ఉదయమో, సాయంత్రమో వీలు చేసుకుని ఆ యువ అధికారులు అందరూ మా ఇంటికి వచ్చేవాళ్ళు. చాలా కలివిడిగా వుండేవాళ్ళు. నా దగ్గర నేర్చుకున్న తెలుగు వారికి యెంత ఉపయోగపడిందో తెలియదు కాని, పోటీ పరీక్షలు రాసి జీవితంలో అనుకున్నది సాధించిన కొందరు యువకులతో సన్నిహితంగా వుండే అవకాశం మాత్రం నాకు కలిగింది. ఐ.ఏ.ఎస్. అనే మూడు అక్షరాలు తమ పేరు పక్కన చేరగానే, తామేదో వేరే లోకానికి చెందినవారం అనే అభిజాత్య, ఆధిపత్య ధోరణి ఆ యువ అధికారులలో మచ్చుకు కూడా కానవచ్చేది కాదు. చాలా సింపుల్ గా వుండేవారు.
నా నుంచి వారు నేర్చుకున్న తెలుగు సంగతి అలా పెడితే, మా ఆవిడ మాత్రం వారికి అచ్చ తెలుగు వంటకాలను బాగానే పరిచయం చేసింది.
వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు.
మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్ర భారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.
“ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”
సబ్ కలెక్టర్ గా పనిచేసిన అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!
నేను 2005లో దూరదర్సన్ నుంచి రిటైర్ అయ్యేవరకు ఏ టీవీ చర్చలకు వెళ్ళే వాడిని కాదు. ఒకపక్క టీవీలో పనిచేస్తూ వేరే టీవీల కార్యక్రమాల్లో పాల్గొనడం నాకు ఇష్టం వుండేది కాదు. అయితే రిటైర్ అయిన తర్వాత నేను వెళ్ళని టీవీ ఛానల్ వుండేది కాదు. ఉదయం, మధ్యాన్నం, సాయంత్రం ఏదో ఒక ఛానల్లో ఉభయం వుండేది. ఆ రోజుల్లో నన్ను టీవీల వారాల అబ్బాయి అనేవారు. ఉద్యోగం చేసే రోజుల్లో కూడా అంత నిర్విరామంగా పనిచేసిన దాఖలా లేదు. ఇక ఎన్నికలు, ఎన్నికల ఫలితాల రోజుల్లో ఉదయం బయటకు వెడితే ఎప్పుడో రాత్రి పొద్దుపోయి ఇంటికి చేరేవాడిని. ప్రస్తుత కాలంలో ఉప్పూ నిప్పూగా రాజకీయ పక్షాలకు అనుబంధంగా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ఎదుర్కుంటున్న ఛానళ్ళు కూడా చర్చలకు పిలిచే సుహృద్భావం వున్న రోజులవి. ఒక ఛానల్ కారులో మరో ఛానల్ కు వెడితే అభ్యంతరం పెట్టకుండా లోపలకు అనుమతించేవాళ్లు. మరి ఇప్పుడు ఒక టీవీ ఇంటి కాకి మరో టీవీ మీద వాలడం లేదని అంటున్నారు. ఎంత నిజమో తెలియదు.
తెలంగాణా ఉద్యమం తీవ్రంగా సాగుతున్న రోజుల్లో కూడాఆయా పార్టీల ప్రతినిధులు చర్చల్లో పొట్టుపొట్టు అయ్యేవారు కానీ విశ్లేషకుల/ జర్నలిస్టుల మాటలకు అడ్డం తగిలేవాళ్ళు కాదు. అలాగే టీవీ యాంఖర్లు కూడా.
2019 లో నా భార్య చనిపోయేవరకు టీవీ చర్చల్లో పాల్గొంటూనే వచ్చాను. తర్వాత కొన్ని సార్లు వెళ్లాను కానీ అప్పటికే పరిస్థితుల్లో మార్పు స్పష్టంగా కనిపించడం మొదలైంది. దానితో నెమ్మదిగా ఆ వ్యాపకం నుంచి నా అంతట నేనే తప్పుకున్నాను.
బహుశా నా జీవితంలో తీసుకున్న అతి కొద్ది మంచి నిర్ణయాల్లో ఇదొకటి. డబ్బూ డుబ్బూ ఎలాగూ లేదు. కొత్తగా వచ్చే గుర్తింపూ లేదు. ఆ అవసరమూ లేదు. మరెందుకు ఈ లాయలాస.
తోకటపా:
టీవీ చర్చల విరామసమయంలో లేదా చర్చలకు, ముందూ తరువాత జరిగే తేనీటి సమావేశాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు అనేక ఆసక్తికరమైన విశేషాలు చెబుతుంటారు. వాటిల్లో నిజంపాలెంతో తెలియదు కాని, విన్నప్పుడు నిజమేనేమో అనిపించేలా వుంటాయి ఆ కబుర్లు. అలాటి ఉదంతం ఒకటి.
చాలా ఏళ్ళ కిందటి సంగతి. అధికార పార్టీలో పైకి వచ్చిన నాయకుడొకరు, అప్పుడప్పుడే పైకి వస్తున్న మరో ఛోటా నాయకుడికి రాజకీయ గీతాబోధ చేసాడిలా.
'నాయనా! రాజకీయాల్లో పైకి రావడానికి ఎన్నో కావాలి. కానీ నా అనుభవం మీద చెబుతున్నాను. అన్నింటిలోకి అతి ముఖ్యమైనది మీడియా మేనేజిమెంటు'
'మేనేజిమెంటు అంటే ఏమిటి గురువుగారూ?' అడిగాడు ఛోటా నాయకుడు.
'అది తరువాత చెబుతా కాని మన జిల్లా రిపోర్టర్ పలానా వాడు వున్నాడు చూసావు కదా. అతడికేదో డబ్బవసరం పడినట్టువుంది. నేను ఇచ్చానని చెప్పి ఈ ఇరవై వేలు అతడికి ఇచ్చిరా. అలాగే, మన సీఎం గారి కారు డ్రైవర్ వున్నాడు తెలుసు కదా! అతడింటికి వెళ్ళి ఈ ఇరవై వేలూ నేనిచ్చానని చెప్పి ఇచ్చేసిరా' అన్నాడు.
ఛో.నా., బ. నా.
చెప్పినట్టే వెళ్ళి చెప్పిన పని చప్పున చేసేసి తిరిగొచ్చిఆ సంగతి చెప్పాడు. చెప్పి తన మనసులో తొలుస్తున్న సందేహం బయట పెట్టాడు.
'రిపోర్టర్ కు ఇవ్వమన్నారు. సరే. బాగుంది. వాళ్ళకు మనతో, మనతో వాళ్లకు సవాలక్ష పనులుంటాయి. కానీ సీ ఎం గారి కారు డ్రైవర్ సంగతే నా మట్టి బుర్రకు అర్ధం అయి చావలేదు'
'అదేమరి. నేర్చుకో అని చెప్పింది అందుకే. సీఎం గారిని మన పార్టీ కార్యకర్తలు ఎక్కడ కలుస్తారు ? ఆయన కారు ఎక్కుతున్నప్పుడో, దిగుతున్నప్పుడో కదా! మామూలు వాళ్ళకి అవకాశం అలాటప్పుడే దొరుకుతుంది. మరి ఆయన కంట్లో పడాలంటే సీఎం గారి కారు కాసేపు అక్కడే ఆగాలి. ఆగాలి అంటే డ్రైవర్ కారు ఆపాలి. ఆపాలి అంటే డ్రైవర్ ని మనం మంచి చేసుకోవాలి. అప్పుడే, మనం కనబడగానే, డ్రైవర్ కాలును, కాసేపు బ్రేక్ మీద నొక్కిపెడతాడు. అర్ధం అయిందా? సమ్జే! అండర్ స్టాండ్!' అన్నాడు అన్ని భాషల్లో బ. నా.
'అయింది మహాప్రభో!' అనేసాడు ఛో.నా.
(తోకటపా: ఎవరా ఛో.నా. ? ఎవరా బ.నా.? ఇంతకీ ఎవరా రిపోర్టర్? ఇలాటి ప్రశ్నలు దయచేసి అడక్కండి. చెప్పినాయన చెప్పలేదు. అలా అడిగే అలవాటులేని నేనూ అడగలేదు, విని వూరుకున్నంత సుఖం మరోటి లేదు)
కింది ఫోటోలు:
వివిధ టీవీ చర్చల్లో...
(ఇంకావుంది)
All reactions:
28
5
1
Like
Comment
Share
Facebook