5, ఏప్రిల్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (136) – భండారు శ్రీనివాసరావు

 

ఆరేళ్ల కిందటి ఆగస్టు జ్ఞాపకాలు

నిన్నటి ఎపిసోడ్ పై వచ్చిన అనేక స్పందనలు చూసిన తర్వాత,  మరోటి మొదలుపెట్టడానికి చాలా సందేహించాల్సి వచ్చింది. మా ఆవిడ పట్ల, నా పట్ల వ్యక్తపరచిన అశేష అభిమానానికి ‘కృతజ్ఞతలు’ అనే నాలుగక్షరాల మాట చాలా చిన్నది. అంచేత,  అందరికీ పేరుపేరునా వందనశతాలు. పూర్తిగా వ్యక్తిగతమైన అంశాలు ఇంకా రాసి స్నేహితులను బాధ పెట్టాలా, లేదా అలా రాస్తూ నా మనసులోని బాధను కొంతమేరకు తగ్గించుకోవాలా అనే మీమాంస ఎదురయింది.   

నా జీవితాన్ని గురించే కాకుండా, నా చుట్టూ అల్లుకున్న ప్రపంచాన్ని, పరిస్థితులను, వ్యక్తులను, ఆహార వ్యవహారాలను, ఆచారాలను  కొత్త తరానికి పరిచయం చేయాలి అనే ఉద్దేశ్యంతో ఇది మొదలుపెట్టాను. మరి నా  జీవనయానంలో నాకూడా విశేషదూరం నడిచిన సహచర బాటసారి నా భార్య ప్రస్తావన,  ప్రసక్తి లేకుండా నా కధ అసంపూర్ణం. అంచేత కొంత భాగంలో ఆమెకూ  భాగం వుంటుంది. పైగా ఇది నా ఆత్మ కధ లాంటిది. బయటివారి విషయం  సంగతి కాకుండా ముందు ముందు మా కుటుంబంలో భావితరం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని వున్నాయి. అంచేత వీటినన్నిటినీ  అక్షరబద్ధం చేయాల్సిన అవసరం వుంది. ఒకే విషయాన్ని సాగదీయడం అవసరమా అనే అభిప్రాయంతో ఎవరైనా వుంటే దయచేసి  ఈ విషయాన్ని గమనంలో వుంచుకోవాలని మనవి.

ప్రతి నెలా మొదటి వారంలో అలా నడుచుకుంటూ వెళ్లి, ఇంటికి కూతవేటు దూరంలో వున్న రత్నదీప్ సూపర్ మార్కెట్లో నెల వారీ సరుకులు కొని, హోం డెలివరీ చేయమని చెప్పి,  మళ్ళీ నడుచుకుంటూ తిరిగి రావడం కొన్నేళ్లుగా మా ఇద్దరికీ ఓ అలవాటుగా మారింది. అలాగే,  ఒక ఏడాది ఆగస్టు మొదటివారంలో  షరామామూలుగా ఈ నెలవారీ నడక మొదలు పెట్టాం. ఎప్పుడూ లేనిది మా ఆవిడ, ఆ రోజు  ఓ సంచీ చేతబట్టుకుని వచ్చింది.

తిరిగి వస్తుంటే ‘ఇదిగో ఈ పక్క సందులోనే మన అరుణ ఇల్లు ఒకసారి చూసిపోదాం’ అంది. అరుణ అంటే మా వలలి. మూడు నెలల నుంచి వంటకు రావడం లేదు. అరుణ వాళ్ళు వుండేది వాళ్ళ ఫ్లాటు  మూడో అంతస్తులో. మెట్లెక్కి వెళ్ళాలి. ఫోన్ చేసి కిందికి పిలవరాదా అన్నాను.

“లేదు, పొద్దునే ఫోన్ చేసి మాట్లాడాను. వాళ్లమ్మ గారి ఊరికి పోతోందిట. ఉత్తమనిషి కూడా కాదు, మెట్లు దిగి ఏమి వస్తుంది. మీరిక్కడే వుండండి, నేను కలిసి వస్తాను అన్నది స్థిరంగా. ఇక నేనూ ఆవిడతో పాటు మెట్లెక్కి వెళ్లక తప్పలేదు.

పైన ఒకటే గది. మమ్మల్ని చూడగానే అరుణ భారంగా  లేవలేక లేచింది. వెలిగిపోతున్న మొహంతో మమ్మల్ని చూస్తూ మంచం మీద  కూర్చోమంది.

మా ఆవిడ తాను  తెచ్చిన సంచీలో నుంచి కుంకుమ భరిణ, చీరె, జాకెట్ పీస్ తీసి బొట్టుపెట్టి ఇచ్చింది. తీసుకువచ్చిన మిఠాయిలు, పూలు అందించింది.

‘పండంటి బిడ్డను కనడమే కాదు, రాగానే నాకు తీసుకువచ్చి చూపించాలి సుమా’ అని అరుణ దగ్గర మాట తీసుకుంది.

అరుణ మాట నిలబెట్టుకుంటూ మూడు నెలల తర్వాత పసిబిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. కానీ ఆ బిడ్డను చూడడానికి తను లేదు.

అరుణ ఇంటికి వెళ్లి వచ్చిన తర్వాత ఆమె బతికి వుంది కేవలం పదిరోజులే.

 

అమ్మపెట్టిన చీర

ఇది మరో చీర కధ.  

 

“అమ్మని చూడానికి వచ్చాను. అమ్మ పెట్టిన చీర కట్టుకుని”

లక్ష్మిగారు అంటున్నది ఏమిటో ముందు అర్ధం కాలేదు.

లక్ష్మి, కీర్తన్ లది ప్రేమ పెళ్లి. పెళ్లి చేసుకుని వచ్చి మా పక్క అపార్ట్ మెంటులో కాపురం పెట్టారు. ప్రేమ పెళ్లి కదా! పెద్దవాళ్లు సర్దుకోవడానికి కొంత సమయం పట్టింది. ఈ నేపధ్యంలో మా ఆవిడే ఆమెకు అమ్మగా మారింది. కాదు లక్ష్మి మా ఆవిడను అమ్మగా చేసుకుంది. ఎప్పుడూ అమ్మా అని పిలిచేది. ఆ బంధం మరింత బలపడుతూ వచ్చింది. లక్ష్మి కడుపుతో వున్నప్పుడు మా ఆవిడే నలుగుర్ని పిలిచి సీమంతం చేసింది. భార్యా భర్తా తమ పనులపై బయటకు వెళ్ళినప్పుడు, వారి పిల్లల్ని తన పిల్లలుగా పెంచింది. అలా మా ఆవిడ ఓ అమ్మని తన కుమార్తెగా చేసుకుంది. తర్వాత వాళ్ళు ఇల్లు మారి వెళ్ళిపోయారు.

లక్ష్మి మంచి విద్యాధికురాలు. ఓ లెక్చరర్ కావాల్సిన అన్ని  అర్హతలు వున్నాయి. కానీ అవకాశాలు దొరక్క మా ఇంటి దగ్గరలో ఓ చిన్న ఎలిమెంటరీ స్కూల్లో టీచర్ గా చేరింది. అలా కష్టపడుతూ, అనుభవం పెంచుకుంటూ ఇప్పుడు ఓ కార్పొరేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలు. మా కంటి ముందు పుట్టిన వాళ్ళు ఇప్పుడు నా భుజాల వరకు ఎదిగారు. తల్లి టీచర్. అంచేతనే వాళ్లు కూడా చదువులో ఫస్టు.

ఆ రోజు స్కూలుకు హోలీ సెలవు. అందుకని కీర్తన్ భార్య, పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చాడు.

మా ఆవిడ బతికి వున్నప్పుడు లక్ష్మిని  ఏదో పండక్కు పిలిచి చీరె పెట్టిందట. అది కట్టుకుని వచ్చింది. నెలల పిల్ల   నా మనుమరాలికి, ఎండాకాలం కదా,  సైజులు వెతికి వెతికి  మరీ చిన్న చిన్న కాటన్ ఫ్రాకులు పట్టుకు వచ్చింది.  అప్పుడు వయసులో  పెద్ద అయిన మా ఆవిడ, ఆవిడకు  అమ్మ. ఇప్పుడు నెలల పిల్ల నా మనుమరాలిని  అమ్మ అంటూ  ఆవిడే  పిలుస్తోంది. అమ్మే మళ్ళీ ఈ రూపంలో పుట్టిందని తెగ సంతోషపడింది. అనుబంధాలకు అర్ధాలు ఒక పట్టాన అర్ధం కావు.

నిన్న మా రెండో అన్నగారు భండారు రామచంద్రరావు గారు మా ఇంట్లో తద్దినాలు గురించి చెప్పింది అక్షర సత్యం. అయితే ఓ చిన్న విషయం రాయలేదు. తద్దినాల రోజు ఆయన పొద్దున్నే లేచి కూరగాయల మార్కెట్టుకు వెళ్లి ఆ రోజుకు అవసరమైన కూరగాయలు అన్నీ వివరంగా కొని మా ఇంట్లో పెట్టి మళ్ళీ తద్దినం టైముకు వచ్చేవారు. దత్తు పోయిన మనిషికి నిజానికి ఈ భారం అవసరం లేదు. కానీ ఆయనకి పెట్టిన పేరే రామచంద్రుడు. శ్రీరామ నవమి నాడు ప్రతి ఇంటా మారుమోగే పేరు. మా కుటుంబంలో అనునిత్యం తలచుకునే పేరు.

తిధి, తద్దినం, వార్షికం ఏ పేరుతొ పిలిచినా అది రెండూ రెండున్నర గంటల కార్యక్రమం. అయినా ఇంటి ఇల్లాలు మాత్రం  శతావధానం చేయాల్సిందే.

‘ఆవు నెయ్యి, నల్ల నువ్వులు చెప్పాను, తెచ్చి ఇక్కడ పెట్టండి. భోక్తలు భోజనాలు చేసే చోట తడిగుడ్డతో తుడవండి, ఓ నిమ్మకాయంత అన్నం తెచ్చి విస్తట్లో ఆ మూల వుంచండి, చిల్లర డబ్బులు అక్కడ పెట్టండి, ఆధరువులు అన్నీ వరసగా తెచ్చి వడ్డించండి. జాగ్రత్తగా కనుక్కుని మారు వడ్డన చేయండి

వశిష్టుల వారు విరామం లేకుండా ఏదో ఒకటి ఇలా  అడుగుతూనే వుంటారు. తడిపొడి మడిచీర కట్టుకున్న ఇంటి ఇల్లాలు మరో ముచ్చట లేకుండా వాటిని చప్పున తెచ్చి అందిస్తుండాలి. పేరుకు ఆ రోజున ఓ వంటమ్మగారు వచ్చి వంటలు చేసినా, ఈ అందింపు, వడ్డింపుల  బాధ్యత మాత్రం ఇల్లాలిదే. తద్దినానికి కర్తగా కూర్చొన్న భర్త మాత్రం  సవ్యం. అపసవ్యం అంటూ పురోహితుల వారు చెప్పినప్పుడల్లా భుజం మీది  జంధ్యాన్ని అటూఇటూ  మారుస్తూ ఉంటాడు.

మా అమ్మానాన్నల ఆబ్డీకాల సమయంలో కొన్ని దశాబ్దాలుగా మా ఇళ్ళల్లో జరుగుతూ వచ్చిన తంతు ఇదే. ఎన్నో ఏళ్ళుగా మా వదినెలు, మా ఆవిడా చేస్తూ వచ్చింది ఇదే.

అలాంటి ఇంట్లో మా ఆవిడ తద్దినం పెట్టాల్సిన పరిస్థితి. మా వాడు సంతోష్ బుద్దిగా కూర్చుని కన్నతల్లికి పిండాలు పెట్టి, నువ్వులు, నీళ్ళతో తర్పణాలు వదులుతూ వుంటే,  మా కోడలు నిషా  ఈ కర్తవ్యాలను అన్నింటినీ నిష్టగా  పూర్తిచేసింది. డ్రెస్సులకు అలవాటు పడిన యువతరం  కోడలు అయినా,  అలవాటులేని  చీరకట్టుతో  పడిన ఇబ్బందినీ,  కష్టాన్ని కళ్ళారా చూసినప్పుడు కానీ,  ఇన్నేళ్ళుగా మా ఆవిడ ఇంతగా  కష్టపడిందా అనే ఎరుక నాకు కలగక పోవడం ఆశ్చర్యం.

నిజానికి ఇందులో  విడ్డూరం ఏముంది! ఆడవాళ్ళ కష్టాలు మగవాళ్లు  తెలుసుకోగలిగితేనే ఆశ్చర్యపడాలి.   

అందరూ వచ్చారు. వచ్చిన వారందరూ తలచుకున్నారు అందరి మధ్య లేని మనిషి గురించి, ఆమె మంచితనం గురించి.   

కింది ఫోటో:

ఇంకెవరు? ఈవిడే మా ఆవిడ నిర్మల



 

(ఇంకా వుంది)

4, ఏప్రిల్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (135) – భండారు శ్రీనివాసరావు

 రాయని నా డైరీలో ప్రతి పేజీలో ఆవిడే!

నాకే విచిత్రం అనిపిస్తోంది, నా జ్ఞాపక శక్తి చూసి. రాత్రి తిన్న కూర ఏమిటంటే బుర్ర తడుముకునే  పరిస్తితి నాది. అలాంటిది ....

నాలుగు నెలలనుంచి ప్రతి రోజూ రాస్తూవస్తూనే వున్నాను, బిగ్ జీరో పేరుతో నేను నడిచివచ్చిన దారి గురించి. ఎందరో వ్యక్తులు, ఎన్నో సంఘటనలు. అర్హతను మించి ఎక్కిన మెట్లు, అర్హత వున్నా అందుకోలేని అందలాలు. అన్నీ కలగలిపి చూసుకుంటే ప్లస్సులు, మైనసులు లెక్క తీస్తే మిగిలింది సున్నా. ఆరేళ్ల క్రితం మా ఆవిడ మరణంతో అది గుండు సున్నా, బిగ్ జీరో అయింది. ఆమె నా పక్కన ఉక్కు స్తంభంలా నిలబడి వున్నప్పుడు నేనో పెద్ద అంకెలా కనబడేవాడిని. జనాల దృష్టిలో హీరోగా కనబడేవాడిని. పోయిన తరవాత కానీ నా అసలు విలువ ఏమిటన్నది నాకు తెలిసి రాలేదు. నా జీవితంలో ఆమె పాత్ర గురించి నాకు పూర్తిగా తెలిసి రావడం కానీ,  దానిని గురించి రాయడం కానీ ఆమె పోయిన తర్వాతనే మొదలయింది. అదో విషాదం.  ఆమె వెళ్ళిపోయిన తర్వాత  నాది దారీ తెన్నూ లేని జీవితం అయిపోయింది. అంచేత ఆమె గురించి రాస్తున్న రాతలకు కూడా ఒక దారీ తెన్నూ లేదు. ఒక తీరున వుండవు.  ఒక వరసలో వుండవు. నా మనసులాగే అల్లకల్లోలం. పిచ్చి గీతలు. పిచ్చి రాతలు.  చదువరులు మన్నించాలి. పెద్దమనసు చేసుకోవాలి. ఇంతవరకు రాసినవి చదివి ‘మీరు జీరో కారు హీరో’నే అని మెచ్చుకున్నవాళ్ళు,  నేను బిగ్ జీరో ఎందుకు అయ్యానో తెలుసుకోవడానికే ఈ రాతలు.   

ఆ రాత్రి ఏం జరిగింది?


2019 ఆగస్టు 17 రాత్రి పదిగంటలు.

ప్రతి రాత్రీ నిద్రపోవడానికి ముందు డబ్బూడుబ్బూ లేని ఓ పదాటలు కార్డ్సు ఆడటం, అలెక్సా ఆన్ చేసి ఘంటసాల పాటలు వినడం  మా ఇంట్లో ఆనవాయితీ అయిపోయింది. పెద్ద పిల్లవాడు సందీప్  అమెరికాలో  సెటిల్ అయ్యాడు. రెండోవాడు సంతోష్, వాడి భార్య ఉద్యోగాల నిమిత్తం  బెంగుళూరులో.

ఉదయం నుంచి రాత్రి దాకా  నేను ఏదో ఒక టీవీ చర్చల్లోన్నో, ఫ్రెండ్స్ తోనో కాలక్షేపం చేస్తుంటే, తాను తన పూజలు, పునస్కారాలతో పొద్దు పుచ్చుతుండేది.

గత పదేళ్ళలో ఎన్ని సినిమాలు చూశామో లెక్క గుర్తు లేదు కానీ  గత రెండేళ్లలో చాలా సినిమాలు కలిసి చూశాము. బుక్ మై షో వంటి యాప్స్, ఓలా ఉబెర్ వంటి రవాణా సదుపాయాలు అందుబాటులోకి రావడంతో తరచుగా ధియేటర్లకి వెళ్ళడం అలవాటు అయింది. మా ఆవిడ ఉదయం పూజకు అడ్డులేకుండా, నా సాయం కాలక్షేపాలకు అడ్డం రాకుండా వుండే ఆట సమయాలు ఒక్కటే కండిషన్. సినిమా ఏమిటి అన్నదానితో నిమిత్తం లేదు. పైనుంచి రెండు మూడు వరసల్లో టిక్కెట్లు దొరికితే చాలు. బుక్ చేయడం, ఉబెర్ పిలవడం సినిమాకి వెళ్ళిపోవడం. మళ్ళీ ఉబెర్ లో ఇంటికి. ఎక్కడా పర్స్ తీసే అవసరం లేదు. అంతా ఆన్ లైన్. ఇంట్లో ఇద్దరమే. దాంతో చూసే సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది.

రెండేళ్ల తర్వాత ఇలా కలిసి సినిమాలకు వెళ్ళడం ఎలాగూ వీలుపడదని తెలియక అప్పుడే హడావుడిగా చాలా సినిమాలు చూసేశాము. బహుశా పెళ్ళయిన తరవాత ఇన్నేళ్ళలో కూడా అన్ని సినిమాలు ఎప్పుడూ చూసివుండం.

అప్పట్లో అదో తుత్తి. 

ఆ దురదృష్టపు రోజున తాను కార్డ్సు ఆడదామా అని అడగకపోవడం ఆశ్చర్యం అనిపించింది.

‘తలనొప్పిగావుంది అమృతాంజనం కావాలంది. ఇంట్లో అదెక్కడ వుంటుందో తెలియని అజ్ఞానం నాది.  తానే చెప్పింది పలానా చోట చూడమని. వెతికి పట్టుకొస్తే అదికాదు జిందాతిలిస్మాత్ తెమ్మంది. అత్తయ్య గారి పొటో పెట్టిన ఫ్రేము పక్కన వుంటుంది చూడమని అంది. తెచ్చిన తర్వాత ఏదీ రాసుకోలేదు. మంచినీళ్ళు, కాదు కాదు ఏదైనా జ్యూస్ కావాలంది. నా చేతులతోనే తాగిస్తే కొద్దిగా తాగింది. తర్వాత బాగా ఆయాసపడింది. బాత్ రూం కు పోతానంటే అడుగులు తడబడుతుంటే, నేనే తీసుకువెళ్లి, తీసుకుని వచ్చాను. హాల్లో సోఫాలో పడుకుని ఆయాసపడుతోంది. చూడలేక అంబులెన్స్ కు ఫోన్ చేశాను.

48 ఏళ్ళ సంసార జీవితంలో నాకు నేనై ఆమెకు చేసిన సేవలు ఇవే.

ఇంతలో అంబులెన్స్ వచ్చింది. ఇంట్లో తను నేను తప్ప ఎవరు లేరు. ఆ రాత్రి మేము ఆసుపత్రికి వెళ్లినట్టు పొరుగు వాళ్లకు కూడా తెలియదు. మర్నాడు మేము కనబడకపోతే మా అన్నయ్య ఇంటికి వెళ్ళామనుకున్నారుట.   

 

ఆస్పత్రికి వెళ్ళిన 15 నిమిషాల్లో చావు కబురు చల్లగా చెప్పారు, దారిలోనే పోయిందని.  

నిజంగా ఇలా కూడా మనుషులు చనిపోతారా!

 

15 రోజుల్లో ముగిసిన కధ’

 

 

2019 ఆగస్టు  పదిహేడో తేదీ అర్ధరాత్రి దాటిన  తర్వాత, కార్డియాక్  అరెస్టుతో ఆకస్మికంగా నా భార్య నిర్మల చనిపోవడానికి ముందు, కేవలం  రెండు వారాల లోపు వ్యవధానంలో అనేక వేడుకలు, వినోదాలు, శ్రావణ శుక్రవారం  నోములు, పేరంటాలు, ముత్తయిదువులకు  వాయినాలు, చుట్టాల ఇళ్ళు చుట్టబెట్టడాలు,  ఇంటికి వచ్చిన వారికి అతిధి మర్యాదలు, హైదరాబాదులో ఇన్నేళ్ళుగా ఉంటున్నా ఎన్నడూ చూడని  రామోజీ  ఫిలిం సిటీలో ఒక రోజల్లా  సరదా తిరుగుళ్ళు, ఒకటా రెండా, అలుపు లేకుండా తిరిగి ఆ అలసట తీర్చుకోవడానికా అన్నట్టు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది. హైదరాబాదులోని చుట్టాలు అందరూ విషయం తెలిసి తెల్లవారక ముందే ఆసుపత్రికి వచ్చారు. 1989 లో ఇదే ఆసుపత్రిలో మా ఆవిడకు  మొదటిసారి  గుండె ఆపరేషన్ జరిగింది. ముప్పయ్యేళ్ల తర్వాత అదే ఆసుపత్రిలో కన్నుమూయడం కాకతాళీయం.

కబురు తెలియగానే అమెరికా  నుంచి మా పెద్దవాడు సందీప్, కోడలు భావన, మనుమరాళ్లు సఖి, శ్రిష్టి, బెంగుళూరు నుంచి చిన్నవాడు సంతోష్, కోడలు నిషా రెక్కలు కట్టుకుని హైదరాబాదులో వాలారు, మంచు పెట్టెలో ప్రశాంతంగా నిద్ర పోతున్న నా భార్యని చూసి భోరుమన్నారు. సంతోష్ కి నామీద చాలా కోపం వచ్చింది, అమ్మకు ఒంట్లో బాగా లేకపోతే ఎందుకు ఫోన్ చేయలేదని. అమ్మ నాకు అంత వ్యవధానం ఇవ్వలేదురా అని చెప్పలేని పరిస్థితి నాది.

మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకి ఎక్కడెక్కడి నుంచో చుట్టపక్కాలు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు వచ్చారు. ఇద్దరు పిల్లలు శాస్త్రోక్తంగా ఆ క్రతువు ముగించారు. ఆమె కట్టెల్లో కాలిపోతుంటే, చూస్తూ కూర్చొన్నాను. నా  కంటివెంట కారే కన్నీటితో వాటిని చల్లార్చడం అయ్యేపని కాదని తెలుసు. 

 

  

‘ఈ జీవితానికి పని పూర్తయింది’

పెద్దల ఆశీశ్శులతో, ఆత్మీయుల ఆదరణతో, పిల్లల ప్రేమాభిమానాలతో కరోనా నేపథ్యంలో సైతం మా ఆవిడ ఏడూడి, (సంవత్సరీకాలు) భగవంతుని దయతో నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. ఈ మూడు రోజుల క్రతువులో నేను నిమిత్తమాతృడిని. కొడుకులు, కోడళ్ళు యావత్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వర్తించారు.

మొత్తం కార్యక్రమంలో అందరికీ కళ్ళ నీళ్ళు తెప్పించింది మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు గారి వ్యాఖ్య:

"మాకన్నా ఎంతో చిన్నదైన మా తమ్ముడి భార్యకు దండాలు పెట్టడం ఎంతో బాధ కలుగుతున్నది . ఏటా అమ్మ నాన్నల తద్దినాలకు వెళ్లి, అదే ఇంట్లో ఎన్ని సంవత్సరాలనుంచో దండాలు పెడుతూ ఉన్నాము .అదే ఇంట్లో ఈరోజు ఇలా చిన్న మనిషికి నమస్కరించి రావడం

మనసును కలచి వేసింది .

“అమ్మ నాన్నల తద్దినాలు పెట్టినప్పుడు , తమ్ముడి భార్య నిర్మల సర్వం తానుగా అన్ని ఏర్పాట్లు చేసి , పురో హితునితో మాట్లాడటం, వంటమనిషితో మాట్లాడటం ,

ధోవతులు తేవడం ,అందరికీ ఫోన్లు చేయడం , మడి కట్టుకొని అన్నీ ఏర్పాట్లు స్వయంగా, శ్రద్ధగా, నిష్ఠగా చూసుకొనేది .

“అటువంటిది ఆ ఇంట్లోనే ఆమె పిండాలకు దణ్ణం పెట్టడం మా దురదృష్టం. మనం దేనినన్న జయించవచ్చు కానీ ,

విధిని మాత్రం జయించలేము. విధికి తలవంచి రాజీ పడటం మాత్రమే మనం చేయగలిగింది.

“ఆమె పవిత్ర ఆత్మకు

శ్రద్దాంజలి . ఓం శాంతి శాంతి"

 

ఆ రోజు మా ఆవిడ గుణగణాలు గురించి, మంచితనం గురించి మెట్టినింటివాళ్ళు చేసిన ప్రసంశలు విని ఆమె పుట్టింటివాళ్ళే ఆశ్చర్యపోయారు.  

 

 

‘అమ్మకు ఏదిష్టం?

 

కాలం మన చేతిలో వుండదు. చూస్తూ ఉండగానే మా ఆవిడ రెండో ఆబ్దీకం వచ్చింది.

మూడు కూరలు, మూడు పచ్చళ్ళు జాబితా రాస్తున్నప్పుడు ఆమెకి ఇష్టం అయిన కూరో, స్వీటో చేయిస్తే బాగుంటుంది అని ఓ సలహా.

ఆమెకి ఏమిష్టం అన్న ప్రశ్నకు నా దగ్గర జవాబు లేదు. నా ఇష్టాలే తన ఇష్టంగా బతికింది. ఆమెకేది ఇష్టమో  నేను తెలుసుకునే తీరిక, ఓపిక నాకు ఎక్కడిది?

అమ్మకు నేనంటే ఇష్టం అని మనసులో మాట చెప్పాలని అనిపించింది. కానీ గుండెలో మొదలయిన ఆ మాటను గొంతులోనే నొక్కేసాను.

పనస పొట్టు కూర, దబ్బకాయ పులుసు, ఐస్ క్రీం. ఇలా అనేక సూచనలు. వీటి మధ్య కర్ణపేయంగా వినబడింది ఓ మాట.

‘అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా ఇంటికి వచ్చినవాళ్లు ఎంతమంది అని చూసుకోకుండా అప్పటికప్పుడు వంట చేసి పెట్టడం ఆమెకు చాలా ఇష్టం’

ఈ మాట అందరికీ నచ్చింది.

కొడుకు సంతోష్, కోడలు నిషా ఈ బాధ్యత నెత్తికి ఎత్తుకున్నారు.

మా ఆవిడ క్రమం తప్పకుండా వెళ్ళే మా ఇంటి పక్కన వున్న ఓ దేవాలయాన్ని సంప్రదించారు. డబ్బు చెల్లించి ఓ అయిదు వందల మందికి అన్న వితరణ ఏర్పాటు చేశారు.

 కరోనా కాలంలో పిలవకుండా ఎవరు వస్తారని అనుకున్నాను. రెండు రోజుల ముందే ఆ గుడిలో పలానా వ్యక్తి సంస్మరణలో అన్నదానం అని బోర్డు పెట్టారుట. మా చుట్టుపక్కల అపార్ట్ మెంట్లలో వుండే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు. ఈ లొకాలిటీలో నన్ను తెలిసిన వాళ్ళు అరుదు. ఆమెకి ఇంతమంది తెలుసా! ఇంతమందికి  ఆమె తెలుసా! అన్న సంగతి అప్పుడే తెలిసింది.

మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావుగారు  ఎనభయ్యో పడిలో కూడా, కరోనాని కూడా లెక్క చేయకుండా చనిపోయిన మరదలి మీద, నా మీద  ప్రేమాభిమానాలతో వచ్చి నిలబడి వడ్డన చేశాడు. నాకది ఎంతో అపూర్వంగా  అనిపించింది.

మనిషి ఎలాటివాడు అన్నది అతడు చనిపోయిన తర్వాత తెలుస్తుంది అంటారు.

భార్యను చూసి మొగుడు గర్వపడే అవకాశం నాకు ఇచ్చి వెళ్ళిపోయింది మా ఆవిడ.      

కింది ఫోటో :


ఇంక సెలవ్ !




(ఇంకావుంది)

3, ఏప్రిల్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (134) – భండారు శ్రీనివాసరావు

  లక్ష రూపాయల డిక్రీ కధ  

అమెరికాలో మా పెద్ద కుమారుడు సందీప్ వుంటున్న సియాటిల్ కి దాదాపు మూడు వందల మైళ్ల దూరంలో వున్న స్పోకెన్ నగరం నుంచి  స్పోక్స్ మన్ రివ్యూ అనే పత్రిక 125 సంవత్సరాలకు పైగా ప్రచురితమవుతూ వస్తోంది. కిందటి ఎపిసోడ్ లోని ఫోటోలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నాయుడు గారు చూస్తున్న, లేదా నేను చూపిస్తున్న పత్రిక ఇదే.

హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా సహోద్యోగిగా పనిచేసిన పవని విజయ లక్ష్మి, ఆమె భర్త బాలాజీ ఉద్యోగరీత్యా ఆ నగరంలో వుంటున్నారు. 2004 లో కాబోలు, నేను అమెరికా వచ్చిన సంగతి తెలుసుకుని, వాళ్ళ వూరు రావాల్సిందని పదే పదే ఫోన్లు చేస్తూ వుండడంతో ఒకరోజు నేను మా ఆవిడను తీసుకుని స్పోకేన్ కు వెళ్ళాను.


 
అక్కడ వాళ్ళు కొనుక్కున్న ఇల్లు చూడముచ్చటగా వుంది. అంతకు ముందే బాలాజీ తలిదండ్రులు హైదరాబాద్ నుంచి వచ్చి కొడుకూ కోడలి దగ్గర ఆరు నెలలు వుండి తిరిగి ఇండియాకు వెళ్లారు. సగటు తెలుగు కుటుంబాల్లో ఇది సహజంగా జరిగేదే. అయితే, అక్కడి అమెరికన్లకు ఇదొక వింత.  వేరు కాపురం పెట్టుకున్న కొడుకు దగ్గర తలిదండ్రులు అన్ని నెలలు గడపడం అక్కడివారికి ఎంతో వింతగా తోచింది. ఆ నోటా ఈ నోటా పడి ఈ సంగతి స్పోక్స్ మన్ రివ్యూ  పత్రిక విలేఖరి రెబెక్కా నప్పీ చెవిన పడింది. ఇంకేముంది ఆమె అమాంతం విజయలక్ష్మి అడ్రసు కనుక్కుని ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేసి మొత్తం ఫ్యామిలీ ఫొటోలతో సహా మొదటి పుటలో ప్రచురించింది. ఆ వార్తాకధనానికి వచ్చిన మంచి స్పందన గమనించిన ఆ స్పోక్స్ మన్ రివ్యూ పత్రిక వాళ్ళు, వారం వారం విజయలక్ష్మి కార్యకలాపాలను కేంద్రంగా చేసుకుని,  ప్రత్యేక కధనాలను ప్రచురించడం ప్రారంభించారు.  అంటే స్పోకెన్ నగరంలో ఆమె ఒక ఐకాన్ గా మారిపోయింది. రెబెక్క ఆ పత్రికకు ఇంటరాక్టివ్ ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. నేను ఆలిండియా రేడియో విలేకరినని తెలుసుకున్న మీదట ఆమె  స్పోక్స్ మన్  రివ్యూ పత్రిక కార్యాలయానికి ఆహ్వానించారు.

 డౌన్ టౌన్ రివర్ సైడ్ ఎవేన్యూ లో అనేక అంతస్తులలో వున్న ఈ పత్రిక భవనం అతి పురాతనమయినది. చారిత్రిక అవశేషాలు దెబ్బతినకుండా భవనం లోపల ఇంటీరియర్ ను మాత్రం ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా అధునాతనంగా తీర్చిదిద్దారు. సుమారు నూరేళ్ళ నాటి లిఫ్ట్ దగ్గర నిలబడి ఫోటోలు దిగాము. రెబెక్క మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించి వివిధ విభాగాలకు తీసుకువెళ్లి, అక్కడ పనిచేస్తున్న జర్నలిష్టులను పరిచయం చేసారు.

 అంతే కాకుండా ఎడిటోరియల్ స్టాఫ్ మీటింగ్ లో కూర్చోబెట్టి ‘జర్నలిస్ట్ ఫ్రెండ్ ఫ్రం ఇండియా’ అని పరిచయం చేసిన తీరు మరిచిపోలేనిది. పత్రిక చీఫ్ ఎడిటర్ ఎలాటి భేషజం ప్రదర్శించకుండా చక్కని హాస్యోక్తులతో కూడిన ప్రొఫెషనల్ సీరియస్ నెస్ తో సమావేశాన్ని రక్తి కట్టించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ ప్రాంతాల విలేకరులతో మాట్లాడి ఏ వార్తకు ఆ రోజు ఎలాటి ప్రాధాన్యం ఇవ్వాలో అందరితో చర్చించి నిర్ణయించడంతో ఆ సమావేశం ముగిసింది. తరవాత చివరి అంతస్తులో వున్న కాంటీన్ కు వెళ్లి కాఫీలు కలుపుకు తాగాము. అక్కడ మేడ మీద పెద్ద పెద్ద గుడ్లగూబ పక్షుల బొమ్మలు కనిపించాయి. మన వైపు వీధి వాకిళ్ళ వద్ద కనిపించే సింహాల బొమ్మల మాదిరిగా వున్నాయి. క్షుద్ర శక్తులు ప్రవేశించకుండా ఈ బొమ్మలు కాపాడుతాయని తమ పూర్వీకులు నమ్మేవారని రెబెక్క చెప్పారు.  

ఆధునిక జీవన శైలికి, నమ్మకాలకు సంబంధం లేదని ఆమె మాటల్ని బట్టి అర్ధం అయింది. పూర్వం మేము కమ్యూనిస్ట్ రష్యాలో వున్నప్పుడు కూడా ఎవరైనా తుమ్మితే, నెత్తి మీద తట్టి, రష్యన్ లో చిరంజీవ అనే అర్ధం వచ్చే విధంగా (Da zdravstvuyet) అనే నోరు తిరగని పదం అనేవారు.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే, విజయలక్ష్మి ఇక్కడ హైదరాబాదులో వున్నప్పుడు తాను ఇతరుల గురించి వార్తలు సేకరించేది, అమెరికా వెళ్ళిన తర్వాత తానే వార్తల్లో వ్యక్తి అయింది. చాలా సమాజ సేవా కార్యకలాపాల్లో పాల్గొంటో౦దని, ఆ పత్రికా కధనాలను బట్టి మాకు అర్ధం అయింది. ఆమె ఒకసారి హైదరాబాదు వచ్చినప్పుడు,  వాటినే నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తే,  ఆయన ఆసక్తిగా తిలకించారు. ఇదీ ఆ ఫోటో వెనుక కధ.  

పొతే, లక్ష రూపాయల కోర్టు డిక్రీ సంగతి.

పది వేలు గరిష్ట పరిమితితో  అప్పు మంజూరు చేశారు కానీ, వాస్తవంగా ఆ పెయింటర్/ ఆర్టిస్టు తీసుకున్నది మూడు వేలే. ఆ బాకీ వాయిదాలు కూడా సరిగా కట్టలేక ఆ వ్యాపారం వదిలేసాడో ఏమిటో తెలియదు. మనిషి జాడ లేడు.  హామీ సంతకం చేసింది నేను కాబట్టి నాకు నోటీసులు పంపారేమో అదీ తెలియదు. నేను అద్దె ఇల్లు ఖాళీ చేసి హైదరాబాదు వచ్చేశాను. మాస్కో నుంచి వచ్చాక,  హైకోర్టు ఇచ్చిన డిక్రీ మీద ఒక లాయరు స్టే తెప్పించారు. డిక్రీ అమలు అయితే నాకు వేరే ఆదాయాలు లేవు కాబట్టి, వచ్చే జీతంలో పావు వంతు కంటే తక్కువ ప్రతి నెలా కట్టాల్సి వుంటుందన్నారు. అప్పటికి నాకు ఇంకా పదమూడేళ్ల సర్వీసు వుంది. అంతటితో సరి. పెన్షన్ కి ఈ కత్తిరింపులు వుండవుట.  స్టే వెకేట్ కాగానే ఇలా బాకీ చెల్లింపు చేయాలని మానసికంగా సిద్ధపడ్డాము. అయితే ఈ లోగా ఒక విచిత్రం జరిగింది.

ఒక మంచి రోజు చూసుకుని ఆ బ్యాంకు దివాళా తీసింది.

(చిన్నచిన్న మొండి బకాయిలకంటే, ఆ అప్పులను వసూలు చేసే క్రమంలో, పెద్ద పెద్ద లాయర్లకి చెల్లించిన భారీ ఫీజుల వల్లే అలా జరిగిందని నా అనుమానం)

కింది ఫోటో:

పవని విజయలక్ష్మి, రేడియోలో సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావు, మా ఆవిడ నిర్మల 


 

(ఇంకా వుంది)