లక్ష రూపాయల పాల సీసా
నేను మాస్కోలో
వుండగానే, ఒకానొక సుముహూర్తంలో మాస్కో ఇండియన్ ఎంబసీకి నా పేరున
ఒక లీగల్ నోటీసు వచ్చింది. బెజవాడలోని పలానా బ్యాంకు వాళ్లకు నేను బాకీ వున్నానని, అసలు వడ్డీలతో సహా లక్ష రూపాయలు ఖుద్దున చెల్లించాలని
కోర్టు వాళ్ళు ఇచ్చిన డిక్రీ అది.
1987 నుంచి దాదాపు అయిదేళ్లపాటు మాస్కోలో 'పిల్ల జమీందారు' లాగా వెలిగిన నా
జర్నలిస్టు జీవితం 1971
ఆగష్టులో విజయవాడ ఆంధ్రజ్యోతిలో మొదలయింది. ప్రతి ముగింపుకు ఒక
ఆరంభం వుంటుంది కదా!
అసందర్భంగా అనిపించినా, మాస్కో జీవితం
గురించి రాస్తున్నప్పుడు, అలనాటి పాత రోజులను
కూడా నెమరు వేసుకోవడం తప్పనిసరి అనుకుంటున్నాను. అప్పుడు నా నెల జీతం యాభయి
రూపాయలతో ఆరంభమయి వంద రూపాయలకు పెరిగి, 1975 లో జ్యోతిని
వొదిలిపెట్టే నాటికి నూట యాభయి రూపాయలకు చేరింది. జీతానికీ, జీవితానికీ పొంతన లేని రోజుల్లో, మా పెద్ద పిల్లవాడికి
పాలపొడి టిన్నులు కొనడం అనేది గగనంగా వుండేది. ఆ గడ్డు రోజుల్లో ఒక రోజు రామారావనే
ఆర్టిస్ట్ మా ఇంటికి వచ్చాడు. నా స్నేహితుడయిన లాల్ మోహన్ అనే మరో ఆర్టిస్ట్
అతడిని నాకు పరిచయం చేసాడు. ఒక విషయంలో నా సాయం కోరుతూ అతడు నా వెంట
తిరుగుతున్నాడు. చెప్పాపెట్టకుండా అతడు రావడం నాకూ మా ఆవిడకూ ఆ క్షణంలో అంత బాగా
అనిపించలేదు. అతడు వచ్చిన సమయంలో మేమొక గడ్డు సమస్యతో
కొట్టుమిట్టాడుతున్నాము. పిల్లవాడికి పాలు పట్టాల్సిన సీసా కడుగుతుంటే
పగిలిపోయింది. రూపాయి ఖరీదు చేసే ఆ సీసా కొనడానికి ఇల్లు మొత్తం గాలించినా యెర్ర
ఏగాని దొరకలేదు. పిల్లవాడేమో ఒక పక్క గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఈ సీను చూసి అతడు
వెళ్ళిపోయాడు. అమ్మయ్య వెళ్ళాడు కదా అని అనుకునేంతలో మళ్ళీ తిరిగి వచ్చాడు. ఆ
వచ్చిన అతడి చేతిలో పాల సీసా కనబడగానే దేవుడే దిగివచ్చాడనిపించింది. పాల సీసా వెల
తక్కువే కావచ్చు. కానీ ఆ క్షణంలో, దానికి
ఖరీదు కట్టగల షరాబు లేడనిపించింది.
అన్ని రోజులుగా అతడు నన్నడుగుతున్నది ఒక్కటే. సొంతంగా
హోర్డింగుల వ్యాపారం పెట్టాలనుకుంటున్నాడు. అయిదు వేలు లోను కావాలి. జామీను ఇచ్చే
వాళ్ళుంటే బ్యాంకు వాళ్ళు లోను ఇస్తామన్నారుట.
ఆ రోజు అడగకుండా అతడు
చేసిన సాయానికి ఏదయినా చేసి ఋణం తీర్చుకోవాలనిపించింది. నా అంతట నేనే వెళ్లి
బ్యాంకులో అతడి రుణానికి జామీను పత్రంపై సంతకం చేసాను. బహుశా మూడు వేలో, అయిదు వేలో అనుకుంటా. నూట యాభయ్ రూపాయల నెల జీతగాడికి అంత మాత్రం పరపతి
దక్కినందుకు ఆనందపడ్డా కూడా. జర్నలిస్టులు జీతాల విషయంలో కుచేల సంతానమే కానీ, పరపతి విషయంలో కుబేరులే.
ఆ తరువాత హైదరాబాద్
ఆకాశవాణిలో ఉద్యోగం రావడం, నేను విజయవాడ వొదిలిపెట్టడం జరిగిపోయాయి. ఆ తరవాత అతడు
ఏమయ్యాడో తెలియదు . పదేళ్ళ అనంతరం, మాస్కోలో వున్నప్పుడు , ఇండియన్ ఎంబసీ ద్వారా నాకొచ్చిన లీగల్ నోటీసు అదన్నమాట. ఆ పదిహేనేళ్ళలో ఆనాటి ఆ
అప్పు పాపంలా పెరిగి లక్ష రూపాయలకు డిక్రీ అయింది. అదే నేనందుకున్న కోర్టువారి
శ్రీముఖం. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మాస్కోలో ప్రోదుక్తిలో లీటర్లకు
లీటర్లు పాలను, మంచి నీళ్ళలా డబ్బు ఖర్చు చేస్తూ కొంటున్నప్పుడు, నడిచి వచ్చిన దారిలో తొక్కుకుంటూ వచ్చిన ముళ్ళ
బాటలు కళ్ళల్లో మెదిలేవి. ఆనాటి దృశ్యాలు సినిమా రీలులా గిర్రున తిరిగేవి.
అందాల రాముడు సినిమాలో
డబ్బున్న ఖామందు గారు సెక్రటరీని పిలిచి, ‘నేను ఎక్కే రైలుకు థర్డ్ క్లాసు బోగీలు
తగిలించింది ఎవరు' అని గద్దిస్తాడు. ఆ సెక్రటరీ తెలివిగా, 'థర్డ్ క్లాసు వుంటేనే
ఫస్ట్ క్లాసు విలువ తెలుస్తుందని తానే తగిలించా'నంటాడు.
నిజమేకదా. కష్టాలు లేకపోతే
సుఖాలకున్న విలువేమిటి?
కంప్యూటర్ మీద టిక్కు టిక్కుమంటూ కొట్టుకుంటూ, మధ్య మధ్య
చేతులు నొప్పిపుట్టి మెటికలు విరుచుకుంటున్నప్పుడు చూసి మా ఆవిడ అంటుండేది, ఏమిటీ
రాతలు? కూటికా,
గుడ్డకా, సినిమాకా? అని.
ఈ రాతల ప్రయోజనం నిన్న తెలిసింది. ఎప్పుడో మాంధాతల
కాలం నాడు, 1991లో, మాస్కోలో
రమేష్ చంద్ర భార్య కాత్యాయని గారి సీమంతానికి మా ఆవిడే కర్తా కర్మా క్రియ లాగా
వ్యవహరించింది. ముప్పయ్ నాలుగేళ్ల కిందటి ఆ నాటి అపురూపమైన ఫోటోలను రమేశ్ చంద్ర
అన్నగారు ఆకెళ్ళ పేరి శివకుమార్ గారు నాకు పదిలంగా అందించారు. దాదాపు ప్రతి ఫోటోలో మా ఆవిడ నిర్మల
వుంది. పక్కన వారి మాతృమూర్తి కమలా దేవి గారు కూడా వున్నారు. ఇంత విలువైన మంచి జ్ఞాపకాన్ని ఇన్నేళ్ళు భద్రంగా దాచి, నా
చేతికి ఇచ్చిన శివకుమార్ గారి రుణం ఎలా తీర్చుకోను. అందుకే నా కంటే వయసులో
చిన్నవారయినా, వారికి శత కోటి వందనాలు.
రాతల వల్ల ఎంత గొప్ప ప్రయోజనం వుందో
తెలుసుకోకముందే, మా ఆవిడ తెలియని లోకాలకు తరలిపోయింది. ఎంత గట్టిగా అరచి చెప్పినా
వినపడనంత దూరానికి. అందుకే మళ్ళీ ఈ రాతలు.
తోక టపా:
సీమంతం అంటే గుర్తుకు వచ్చిన మరో జ్ఞాపకం.
2005 లో దూరదర్సన్
నుంచి రిటైర్ అయిన తర్వాత, గవర్నమెంటు
క్వార్టర్ ఖాళీ చేసి ఎల్లారెడ్డిగూడా లోని మధుబన్ అపార్ట్ మెంటుకు చేరాము.
మా పక్కన ఒక చిన్న వాటాలో ఓ చిన్న పెళ్ళయిన ప్రేమ జంట దిగింది. ఆమె ప్రైవేటు
స్కూలు టీచరు, ఆయన
చిన్నపాటి నటుడు. వాళ్ళని చూస్తుంటే మాకు మా కాపురం మొదటి రోజులు గుర్తుకు
వచ్చేవి. ఒకే గదిలో సర్దుకుని గుట్టుగా జీవనం సాగించిన రోజులు. ఆమె మా ఆవిడను
అమ్మా అని పిలిచేది. ప్రేమ వివాహం, అందులోను కులాంతరం కాబట్టి మొదట్లో తలితండ్రుల రాకపోకలు వుండేవి
కావు. అంచేత ఆ అమ్మాయి కడుపుతో
వున్నప్పుడు, ఆమె సీమంతాన్ని మా ఆవిడ మా ఇంట్లోనే నలుగురు ముత్తయిదువులను పిలిచి
శాస్త్రోక్తంగా చేసింది. పుట్టిన పిల్ల కూడా మా ఇంట్లోనే పెరిగింది. ఎంతయినా అమ్మవొడి నడిపిన అనుభవశాలి కదా!
కింది ఫోటోలు:
మాస్కోలో కాత్యాయని గారి సీమంతం ఫోటోలు. ఒక గ్రూపు ఫోటోలో నా పక్కన నిలబడిన సన్నటి ఆరడుగుల బుల్లెట్ కథానాయకుడు రమేశ్ చంద్ర.
చివరి ఫోటో మధుబన్ లో చేసిన మరో సీమంతం తాలూకు. ఇందులో మా రెండో వదిన విమలాదేవి గారు కూడా వున్నారు. మా ఆవిడ చేసే ప్రతి పనికిఆమె మద్దతు వుండేది.
(ఇంకా వుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి