24, జులై 2024, బుధవారం

పేరెంట్స్ డే



(ఈ పదాన్ని తెనిగించడం నాకు మంచిగా అనిపించలేదు. పైగా అనువదిస్తే దరిద్రమైన అర్ధం వస్తుంది.అందుకే అలానే ఉంచేశాను)  

“చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి.
“నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం.
వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు. 
కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది అపనమ్మకంతో కూడిన అభిలాష . ఇద్దరిదీ ఒకటే కోరిక, తమ పిల్లలు  ప్రయోజకులు కావాలనే. తేడా అల్లా భావవ్యక్తీకరణలో. కల్మషం, కల్తీలేని ప్రేమ కన్నవారిది.
పిల్లలు పిల్లలుగా వున్నప్పుడు అనేకమంది తలితండ్రులది ఇదే పరిస్తితి. పిల్లలందరు పెద్దవాళ్ళు అవుతారు. కొద్దిమందే నిజంగా గొప్పవాళ్ళు కాగలుగుతారు. జీవితంలో బాగా ఎదిగొచ్చిన అనేకమంది సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు పత్రికలకి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు, ‘తలితండ్రులు కష్టపడితే ఇలా  పైకి వచ్చాం, కానీ మా ఎదుగుదలను మా  కన్నవాళ్ళు కళ్ళారా చూడలేకపోయారనే  బాధ మాత్రం మిగిలింది” అని. 
తలితండ్రుల ప్రేమకు గుర్తింపుగా వారి పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఒక దినాన్ని కేటాయించారు.

“ తలితండ్రులను ఆదరించండి, ప్రేమించండి” అనేది ఈ ఏడాది పేరెంట్స్ డే నినాదం.

మన మేలుకోరే శ్రేయోభిలాషులు చాలామంది వుంటారు. కానీ మనం ఈ భూమి మీదకు రాకముందునుంచి  మనల్ని మనసారా ప్రేమించింది, మనం బాగుండాలని కోరుకున్నది  మన తలితండ్రులు మాత్రమే.

లోకం చుడుతున్న వీరుడు రాజేష్ వేమూరి


రాజేష్ వేమూరి అనే పేరు వినగానే నాకు అల్లసాని పెద్దన విరచిత స్వారోచిత మనుసంభవం అనే మనుచరిత్ర  కావ్యంలోని ప్రవరుడు, మహాకవి ధూర్జటి రచించిన శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తుకు వస్తాయి.
ప్రవరాఖ్యుడి గురించి ఖమ్మం కాలేజీలో మా తెలుగు లెక్చరర్ ఆదినారాయణ గారు చెప్పేవారు.
అరుణాస్పదపురం అనే  ఓ మారుమూల కుగ్రామంలో కాపురం చేసుకుంటూ, తలితండ్రులను పోషించుకుంటూ త్రికాల సంధ్యాదులు సక్రమంగా క్రమంతప్పకుండా  నిర్వర్తించుకుంటూ కాలం గడిపే ఓ శోత్రియ శ్రేష్టుడు ప్రవరుడు.  అతడికి తన ఇల్లే కైలాసం. ఊరు దాటి ఎరుగడు. కానీ లోకం చూడాలనే కోరిక. పొలిమేర దాటలేని ఆశక్తత. అంచేత ఊరిలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా ఇంటికి పిలిచి ఆతిధ్యం ఇచ్చేవాడు. అతిథి మర్యాదల అనంతరం తాను చూడాలని అనుకుని చూడలేని ప్రదేశాల విశేషాలు వారినుంచి వింటూ తృప్తి పడేవాడు. ఈ క్రమంలో యువకుడు అయిన ఓ యువ సిద్ధుడు తటస్థ పడడం, పరాయి ప్రదేశాలను గురించి అతడు చెప్పిన సంగతులు వింటూ, ఇంత చిన్న వయస్సులో అన్ని ప్రాంతాలు ఎలా తిరిగాడని అబ్బుర పడడం,  సరే ఈ కధ ఇంతవరకే చెప్పుకుందాం. తర్వాత కధ తెలియని వాళ్ళు వుండరు. 
ఇదెందుకు చెప్పాను అంటే, ఈ కావ్యంలోని ప్రవరుడి వంటి వారు అనేకమంది ఈ నాటికీ వుంటారు. దేశాలు చుట్టి రావాలని వారికి  వుంటుంది, కానీ అందుకు అనేక అవరోధాలు. అంచేత రాజేష్ వంటి వారు దేశాలు చుట్టి రాసే పుస్తకాలు చదివి,  సంతోషించడం. ఇంత చిన్న వయస్సులో ఇన్ని దేశాలు ఎలా తిరిగారని ఆశ్చర్యపడడం.
మనుచరిత్రలోని  సిద్ధుడి వద్ద, అనుకున్నదే తడవుగా  లోకాలు చుట్టి రావడానికి పాదలేపనం అనే దివ్యమైన పసరు  వుంది.  మరి రాజేష్ దగ్గర ఏముంది. తిరగాలనే ఆకాంక్ష వుంది. దాన్ని నెరవేర్చుకునే పట్టుదల వుంది. పట్టుదలకు తగ్గట్టు సహకరించే భార్య భార్గవి వున్నారు. పోదాం పద డాడీ అంటూ  సంచి సర్దుకుని, నేనూ రెడీ అనే   చిన్నారి హన్ష్ ప్రోద్బలం వుంది. అన్నింటికీ మించి రకరకాల దేశాలు చూడాలి, అక్కడి ప్రజలతో మమేకం అవ్వాలి, వాళ్ళ జీవన విధానాలు తెలుసుకోవాలి అనే బలమైన కోరిక వుంది. విశాలమైన హృదయం వుంది. ఏతావాతా జరిగింది ఏమిటి అంటే ఇరవై రెండు దేశాల వీసా స్టాంపులు వాళ్ళ పాసుపోర్టుల్లో భద్రంగా వున్నాయి. కాణీ ఖర్చులేకుండా మనల్ని కూడా ఆ పుస్తకాల ద్వారా ఆ దేశాలు  తిప్పారు. ఈ పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పండి. ముందు ముందు మరిన్ని దేశాలు తిరుగుతారు. మరిన్ని పుస్తకాలు రాస్తారు. మనమూ  వాటిని చదువుతూ వారితో పాటు ఆయా దేశాలు ఉత్తపుణ్యానికి చదువుతాము. ఉభయతారకం అన్నమాట.
ఇంతకీ దూర్జటి పద్యం గురించి ప్రస్తావించారు కానీ ఆ ప్రసక్తి రాలేదేమిటి అనుకుంటున్నారా! అక్కడికే వస్తున్నాను. ముగింపు కోసం అట్టే పెట్టాను.
శ్రీ కాళహస్తీశ్వర శతకంలో ఆఖరి నూరో పద్యం ఇది.
“దంతంబుల్పడనప్పుడే తనవునం దారూడి యున్నప్పుడే
 కాంతా సంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు గానప్పుడే 
విన్తల్మేన చరించనప్పుడే కురుల్వెల్ల గానప్పుడే చింతింపన్వలె
నీ పదాంబుజములన్ శ్రీ కాళ హస్తీశ్వరా!”
ప్రతిపదార్ధం అవసరం అనుకోను.  
తిరగగలిగిన వయసులో తిరగకుండా, ఇప్పుడు 78 ఏళ్ల వయసులో తిరగాలనే  కోరిక ఉన్నప్పటికీ   తిరగలేని అశక్తత కలిగిన మా వంటి వారి గురించే ఆ పద్యం రాసారని అనిపించింది. 
అయినా భక్త గోపన్న అన్నట్టు, తక్కువేమి మనకు, రాజేష్ పుస్తకం చేత వున్నవరకు.
కావున, కాబట్టి దేశాలు  తిరగలేని మా బోంట్ల తరపున వారికి  మనః పూర్వక ధన్యవాదాలు.

23, జులై 2024, మంగళవారం

మాస్కో అతిథి


నందగిరి ప్రసాద్.  నలభయ్ ఏళ్ల క్రితం నేను మాస్కోలో తిరుగాడిన ప్రదేశాలన్నీ, ప్రస్తుతం మాస్కోలో ఉద్యోగం చేస్తున్న ఈ ప్రసాద్ గారు అనే పెద్ద మనిషి గత మూడు మాసాలుగా నాకు వీడియోలో ప్రతి ఆదివారం నాడు తాను కలయ తిరుగుతూ నాకు ఫోన్లో చూపిస్తూ వస్తున్నారు.  నిజానికి వీరితో నాకు పూర్వ పరిచయం లేదు. ఎప్పుడో నా బ్లాగులో, నా ఒకప్పటి మాస్కో జీవితం గురించి చదివి, గట్టి పట్టుదలతో ప్రయత్నించి, నా ఫోన్ నెంబరు పట్టుకుని ఓ రోజు ఫోన్ చేసారు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒకప్పుడు నేను అక్కడ వున్న అయిదేళ్ల కాలంలో చూసిన మాస్కోకు ఇప్పటి మాస్కోకు స్థూలంగా పెద్ద మార్పులు లేకపోయినా,  ప్రజల జీవన శైలి, వస్త్ర ధారణల్లో వచ్చిన మార్పులు స్పుటంగా కనిపించాయి. మళ్ళీ ఒకసారి మాస్కో వెళ్ళాలనే నా తీరని కోరికను ఆయన ఈ విధంగా తీరుస్తూ వస్తున్నారు.
 ప్రసాద్ గారు నాకు పరిచయం లేని మనిషి అయినా కూడా, వీడియోల్లో చూస్తూ వచ్చాను కనుక ముఖ పరిచయం లేని మనిషి అని చెప్పలేను.
నిన్న ఉదయం ఫోన్ చేసి, హైదరాబాద్ వచ్చాను, సాయంత్రం నాలుగు గంటలకు  మీ ఇంటికి వస్తున్నాను, లోకేషన్ షేర్ చేయమని చెప్పి, అన్నట్టే వచ్చేసారు. గత మూడు నెలలుగా ఫోన్లో మాట్లాడుతూ వున్నా మేమిద్దరం ఒకరినొకరం కలుసుకోవడం ఇదే మొదటిసారి. రెండు గంటలు కూర్చుని మళ్ళీ ఆరు గంటలకు బయలు దేరి వెళ్ళిపోయారు. తాను మరో మూడు నాలుగేళ్లు మాస్కోలో వుంటానని, తాను కూడా (పెళ్లి కాలేదు కనుక) ఒంటరిగానే ఉంటున్నానని, తప్పకుండా వచ్చి తనతో వుండమని మరీ మరీ చెప్పారు. మేము మాస్కోలో వున్నప్పుడు తాను బెజవాడలో స్కూల్లో చదువుతున్నానని, తనకు ఇప్పటి మాస్కో తెలుసుకానీ, నలభయ్ ఏళ్ల క్రితం ఎలా వుండేది అన్నది నా రచనల ద్వారా తెలుసుకున్నానని చెబుతూ, ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా కలవాలని అనుకున్నానని, అంచేత హైదరా బాద్ రాగానే మొదటి ఫోన్ మీకే చేసాను అని అన్నారు.
మొత్తం మీద నిన్న ఓ రెండు గంటలు ప్రసాద్ గారి మాటలతో కాలక్షేపం అయ్యింది.

అసలు అధికారం ఎక్కడ వుంది?



ఈ కింది సంభాషణలు చిత్తగించండి: 

“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి  అయివుండి, ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”
“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”
“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”
“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

“దేశంలోనే కాదు, మొత్తం ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చంద సంస్థలకు కోట్ల రూపాయలు  భూరివిరాళాలుగా  ఇస్తుంటారు. మరి  రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది”
“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”

“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. మీకు మీరే సాటి అనే పేరుంది. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మధన్యం  అనుకునే వీరాభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. మరి ఈ వయసులో రాజకీయ అరంగేట్రం చేసి,  ఎండనకా, వాననకా ప్రజాసేవ అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”
“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే సరైన  మార్గం”   
 
“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ.గా వున్నారు.  వృత్తిపరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ ప్రవేశం ఎందుకు చేసినట్టు”
“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”

“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం. అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”
“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను”  

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!
చివరికి ప్రజాసేవ కూడా సోషలిజంలాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని. 
మరో అర్ధం కాని విషయం వుంది. ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు ఎవరూ డబ్బులు లేని వాళ్ళు కాదు. మరిన్ని ఎక్కువ సొమ్ములు సంపాదించేందుకు రాజకీయాల్లో చేరుతున్నారా అంటే అదీ కాదు. మరి ఎందుకోసం ఈ యావ!  
ఎందుకంటే రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికారచక్రం అలవోకగా  తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయనీటికి ఎగబడే చేపల చందంగా రాజకీయ కండువాలు కప్పుకోవడం కోసం తహతహలాడేది అందుకే.
ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం!

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. కానీ  బయటకు తెలియని విషయం ఒకటుంది. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క బీట్ కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు, షూటింగ్ పర్మిషన్  ఒక్కటే కాదు, కస్టడీలో ఉన్న మనిషికూడా దర్జాగా బయటకు వస్తాడు. ఇక మా ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోవాలి? అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ అనేది  ఓ ప్రముఖ సినీనటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు మరుక్షణంలో క్లియర్ అవుతాయి. కానీ మా పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి? మేము ఎంత గట్టి ఆఫీసర్లం అయినా సరే, పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా ఒక్కోసారి  మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసే బదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా, కాలం గడుస్తున్నకొద్దీ  తత్వం బోధపడి సర్దుకుపోవడమే మేలనే స్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో మనసు మూలల్లో  బాధ. ఇంత చదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మేము అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ అనేది  ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

“ఏళ్ళ తరబడి కష్టపడి సువిశాల వ్యాపార, వాణిజ్య సామ్రాజ్యాన్ని నిర్మించాను. నెలకు లక్షలు లక్షలు జీతాలు తీసుకునే సిబ్బంది నా దగ్గర వేల మంది అనేక దేశాల్లో పనిచేస్తున్నారు. వాటిని చుట్టి రావడానికి సొంత విమానాలు వున్నాయి. బస చేయడానికి ఏడు నక్షత్రాల హోటళ్ళకు ఏమాత్రం  తీసిపోని సొంత అతిథి గృహాలు అన్ని నగరాల్లో  లెక్కకు మిక్కిలిగా వున్నాయి. కానీ ఏం లాభం. గవర్నమెంటులో  ఒక్క చిన్న ఫైలు కదిలించడానికి మా సీనియర్ అధికారులు సచివాలయం చుట్టూ తిరుగుతుంటారు. వాళ్ళు హోటల్లో ఇచ్చే టిప్పు పాటి చేయని నెల జీతాలు తీసుకునే ప్రభుత్వ గుమాస్తాల ముందు చేతులు కట్టుకుని నిలబడి గంటలు గంటలు వెయిట్ చేస్తుంటారు. ఓ చిన్నపాటి రాజకీయ నాయకుడు కల్పించుకుని పై వాళ్లకు ఓ మాట చెబితే ఆ ఫైలు  ఆఘమేఘాల మీద కదిలి, అన్ని సంతకాలతో ఆమోద ముద్ర వేసుకుని బయటకు వస్తుంది. ఇలాంటి సందర్భాలు ఎదురయినప్పుడు అనిపిస్తుంది, ఎందుకీ పనికిరాని వైభోగాలు, సిరి సంపదలు అని. అసలైన అధికారం మా దగ్గర లేదని తేలిపోయింది. ఎక్కడ ఉన్నదో కూడా తెలిసిపోయింది. అందుకే రాజకీయ రంగప్రవేశానికి అడుగులు వేస్తోంది” ఒక వ్యాపారవేత్త అంతరంగం.

“ఒక చిన్న వీధి రౌడీ దగ్గర కుడి భుజంగా చాలా కాలం వున్నాను. అతడు చెప్పిన పనల్లా చేస్తూ పోయాను. చాలాసార్లు  పోలీసులకు దొరికిపోయి నానా అవస్థలు పడ్డాను. వాళ్ళు నన్ను  నన్ను నడి బజారులో తన్నుకుంటూ స్టేషన్ కు తీసుకు వెడుతుంటే మిన్నకుండిపోయాను. ఇక ఎన్నాళ్ళీ కష్టాలు అని ఓ శుభ ముహూర్తం చూసుకుని రాజకీయ నాయకుడి దగ్గర అనుచరుడి  అవతారం ఎత్తాను. కొంత పేరు వచ్చిన తర్వాత నన్ను అడిగేవాడే లేడు, అడ్డుకునే వాడే లేడు. నన్ను పట్టుకునే పోలీసు పుట్టలేదు, నన్ను పెట్టే జైలు కట్టలేదు అనే తరహాలో రొమ్ము విరుచుకుని తిరిగే అవకాశం నాకీ కొత్త వృత్తి ఇచ్చింది” అని ఓ మాజీ గ్యాంగ్ లీడర్ తన  గోడు వెళ్ళబోసుకుంటాడు. 
అంటే వీరందరినీ రాజకీయాల వైపు  బలంగా లాగుతోంది వ్యవస్థలో ఉన్న లోపం అనుకోవాలి. 
 
తోకటపా:
ఇలా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు పైకి చెప్పే ప్రజాసేవ అనేది ఒక పడికట్టు పదం మాత్రమే. అసలు కారణాలు మాత్రం  వేరే అనిపిస్తే తప్పేముంది! 
నిజానికి ప్రజాసేవే చేయాలి అనుకుంటే అంటే రాజకీయ పదవులు అవసరమా! 
ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకే వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.

22, జులై 2024, సోమవారం

ఊణషాణ మాసికం – భండారు శ్రీనివాసరావు

 

ఆదివారం 21-7-24 నా రెండో కుమారుడు సంతోష్ చనిపోయి 171 వ రోజు.

ఊణషాణ మాసికం. 🙏

ఎప్పుడూ వినలేదు ఏమిటీ మాసికం అని అడిగారు మితృలు కొందరు మా రెండో కుమారుని ఊణషాణ మాసికం పెట్టిన సంగతి ఫేస్ బుక్ లో చదివి.

ప్రేత సంబంధ కర్మలు అయినా, యాగ సంబంధ క్రతువులు అయినా నమ్మకం ప్రధానం అనేది నా నమ్మకం. నా తల కొరివి పెట్టాల్సిన వాడికి నేనే అంత్యక్రియలు చేయాల్సిన దుస్థితి గత ఫిబ్రవరిలో నాకు ప్రాప్తించినప్పుడు నా మనసు నా మనసులో లేదు. ఏదో కలలో జరుగుతున్న విధంగా అన్నీ సశాస్త్రీయంగా జరిగిపోయాయి, నా అన్నగారు భండారు రామచంద్ర రావు గారు , మా  పెద్ద కుమారుడు  సందీప్  భండారు పర్యవేక్షణలో.

శ్రాద్ధ కర్మలకు నేతృత్వం  వహించిన వసిష్టుల వారు  శ్రీ సి.హెచ్. యు.ఎస్. ప్రసాద శర్మ గారు.  వాటిల్లో భాగంగా నా చేత అనేక దానాలు చేయించారు. మరణించిన మనిషి తాలూకు జీవి సంవత్సరం పాటు వేలాది మైళ్ళు ప్రయాణిస్తుందని, ఆ ప్రయాణంలో జీవుడు అనేక రకాల ఈతి బాధలకు గురవుతాడని, ఎర్రటి ఎండల్లో, వానల్లో, దుర్గమ మార్గాల్లో ఆ ప్రయాణం సాగుతుందని, ఉపశమనంగా ఉండడానికి గొడుగు, పాదరక్షలు, వంట దినుసులు, కాయగూరలు, వంట పాత్రలు, నీళ్ళ పాత్ర, చెంబు వగైరాలు దానాలుగా ఇప్పించారు.  ఈ సుదీర్ఘ ప్రయాణంలో, 45 వరోజున  ( త్రిపక్షం), 171 వ రోజున  జీవుడు మరింత శ్రమకు గురవుతాడు. అంచేత ఈ రోజుల్లో కూడా తప్పనిసరిగా మాసికాలు పెట్టాలి.

జీవించి వున్న వారికి ఒక మాసం మరణించినవారికి ఒక రోజుతో సమానం కనుక నెలకోసారి మాసికం పెట్టి పిండ ప్రదానం చేస్తే, వారికి ప్రతిరోజూ భోజనం పెట్టినట్టు అవుతుందని ఓ నమ్మకం. ఇలా పన్నెండు నెలలు గడిచిన తర్వాత ఏడాది చివర్లో పెట్టే హూణ మాసికం, సాంవత్సరీకం, ఆబ్దీకంతో ఈ కర్మ కాండ పూర్తవుతుంది. జీవుడి పాప పుణ్యాల ప్రాతిపదికన పునర్జన్మ, లేదా స్వర్గ, నరక లోక ప్రాప్తి నిర్ధారణ అవుతుంది.

ఈ విషయాలు అన్నీ శర్మగారు సవిస్తరంగా  నాకు అప్పుడే తెలిపారు.

కానీ అప్పుడు నా  గుండె, మనసు, శరీరం అన్నీ ఘనీభవించి వున్నాయి.

ముందే చెప్పినట్టు అంతా నమ్మకం.

చనిపోయింది స్వయంగా నా కుమారుడు. నా ఇహ లోక ప్రయాణం సజావుగా సాగడానికి వాడు బతికి వున్నప్పుడు ఎన్నో ఎన్నో చేశాడు.  పై లోక ప్రయాణంలో వాడికి  ఇబ్బందులు రావు అని చెబుతున్నప్పుడు నమ్మకంగా పాటించక తప్పదు. అదే చేశాను. చేస్తున్నాను.



(22-07-2024)      

 

21, జులై 2024, ఆదివారం

ఆదివారం ఆడవారికోసం



గోపాలానిది అటూ ఇటూ కాని వయసు. ప్రతిదీ అర్ధం చేసుకోవాలనిపిస్తుంది. ఏదీ సరిగా అర్ధం కాదు.
అమ్మ వొంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టుకోవడం చూశాడు కానీ ఎందుకో అర్ధం కాలేదు. అదే  అడిగాడు.
“ఇలా ఏడిస్తేకానీ నా గుండెల్లో భారం తగ్గదు” అంది భారంగా.
“అర్ధం కాలేదు. భారం అంటే?”
“నీకర్ధం కాదులే! ఇప్పుడే కాదు ఎప్పటికీ అర్ధం కాదు” కొడుకును దగ్గరికి తీసుకుంటూ   అంది తల్లి.
గోపాలం తండ్రి దగ్గరకు వెళ్లి అమ్మ ఏడుస్తున్న సంగతి చెప్పి కారణం అడిగాడు.
“మీ అమ్మే కాదు ఆడాళ్లందరూ కారణం లేకుండానే ఏడుస్తుంటారు” తేలిగ్గా తీసేశాడు తండ్రి.
కానీ ఆడవాళ్ళు ఎందుకు ఏడుస్తారు అన్న అనుమానం తీరలేదు చిన్న గోపాలానికి.
స్కూలుకు వెళ్ళినప్పుడు టీచరు వొంటరిగా వున్నప్పుడు చూసి తన అనుమానం బయట పెట్టాడు.
ఆ టీచరు బాగా చదువుకున్నది. లోకజ్ఞానం బాగా వున్నది.
ఆమె ఇలా చెప్పింది.
“బ్రహ్మ దేవుడు సృష్టి కార్యం నిర్వర్తిస్తూ ఒక స్త్రీ మూర్తిని తయారు చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోసేముందు స్త్రీ జాతికి కొన్ని ప్రత్యేకతలు కల్పించాలనుకున్నాడు.
“సంసార భారాన్ని తేలిగ్గా మోయగల శక్తిని ఆమె చేతులకు ఇచ్చాడు. అదేసమయంలో కుటుంబ సభ్యులకు ఎలాటి  ఇబ్బంది లేకుండా  చూడగల మానసిక మృదుత్వాన్ని ప్రసాదించాడు.
“నవమాసాలు మోసి, ప్రాణాలనే  పణంగా పెట్టి మరో జీవిని ఈ లోకంలోకి తీసుకురాగల ఆత్మ స్తైర్యాన్ని అనుగ్రహించాడు.
“అంతేకాదు, అంత కష్టపడి కన్న, కన్న  పిల్లలే   పెరిగి పెద్దయిన తరువాత  వారి నుంచి ఎదురయ్యే దూషణ భూషణ  తిరస్కారాలను భరించగల హృదయ వైశల్యాన్ని వరంగా ఇచ్చాడు.
“కుటుంబంలో సమస్యలు ఎదురయినప్పుడు అందరూ పట్టనట్టు వొదిలేసి వెడుతున్నా అన్నీ తన నెత్తిన వేసుకుని సంసార నావను ఓ దరిచేర్చగల నిగ్రహాన్ని అనుగ్రహించాడు.
“ఇంట్లో ఏఒక్కరికి  వొంట్లో బాగా లేకపోయినా ఏమాత్రం విసుక్కోకుండా  రేయింబవళ్ళు  సేవ చేసే మంచి మనసును ఆమె పరం చేసాడు.
“పిల్లలు విసుక్కున్నా, మాటలతో చేతలతో మనసును గాయపరచినా వారిని  ప్రేమించి లాలించే హృదయాన్ని ఇచ్చాడు.
“కట్టుకున్నవాడు ఎన్ని తప్పులు చేసినా ఉదారంగా మన్నించి  మరచిపోగల మనసును ఇచ్చాడు.
“సంసారంలో ఎన్ని వొడిదుడుకులు ఎదురయినా ఎదుర్కుంటూ  భర్త వెంట నడవగల ధీమంతాన్ని ఆమె సొంతం చేశాడు.
“ఇన్ని ఇచ్చిన ఆ భగవంతుడు, ‘కన్నీరు’ ను కూడా  వరంగా  అనుగ్రహించాడు.
“కన్నీరు  ఆడవారి  సొంతం.  తమకు  అవసరమయినప్పుడల్లా కన్నీరు పెట్టుకుని  తమ మనసులోని భారాన్ని దింపుకుంటారు. కష్టాలతో, క్లేశాలతో   కల్మషమయిన మనసును శుభ్రం చేసుకోవడానికి వారికి ఉపయోగపడే నీరే ఈ కన్నీరు. కన్నీరు పెట్టుకోవడానికి కారణాలు చెప్పాల్సిన అవసరం కానీ  హేతువులు చూపించాల్సిన అగత్యం కానీ ఆడవారికి  లేదు.
“చూడు గోపాలం. ప్రేమను నింపుకున్న ఆడవారి హృదయానికి ప్రధాన కవాటాలు వాళ్ల కళ్ళల్లోని ఈ కన్నీటి  చుక్కలే.”
టీచరు  చెప్పింది గోపాలానికి కొంత అర్ధం అయింది. కొంత కాలేదు.
కానీ,  ప్రపంచంలోని మగవాళ్లకు మాత్రం  ఎప్పటికీ అర్ధం కాదు. ఆ అవసరం కూడా వారికి లేదు.

19, జులై 2024, శుక్రవారం

తీరికలేని మనుషులు


 

ఆ మధ్య జ్వాలా ఫోన్ చేశాడు.
‘ ఎప్పుడూ మేము చేయడమేనా! నువ్వు ఫోన్ చేయవా?’
నిజమే! కాల్ లిస్టు తీసి చూస్తే అవుట్ గోయింగ్ ఒకటి రెండు కూడా లేవు. అన్నీ ఇన్ కమింగే.

ఒకరోజు సాయంత్రం మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారి కుమార్తె వేణి ఖమ్మం నుంచి ఫోన్ చేసింది.
"ఏమిటి విశేషం" అన్నాను మామూలుగా.
"అదే బాబాయ్ నేను చెబుదామని అనుకున్నది. విశేషం ఉంటేనే ఫోన్ చేయాలా! మామూలుగా  ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటే చాలా బాగుంటుంది" అన్నది.
 అంతే కాదు చిన్నతనం నాటి ఒక వృత్తాంతం  చెప్పింది. మా అన్నయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్ లో వున్నప్పుడు పోస్టాఫీసు నుంచి ఓ డజన్ కార్డులు కొనుక్కు వచ్చి వేణి చేతికి ఇచ్చి చెప్పాడుట. ‘అడ్రసు కూడా రాసి పెట్టాను. నువ్వు చేయాల్సింది అల్లా వారానికి ఒక కార్డు కంభంపాడులో ఉన్న బామ్మకు పోస్టు చేయి. పెద్ద విశేషాలు రాయక్కరలేదు. మేము క్షేమం, మీరు కులాసాగా వున్నారని భావిస్తాను అని రాయి చాలు. పల్లెటూళ్ళో ఉంటున్న ఆమెకు ఈ సమాచారం ఎంతో ఊరట ఇస్తుంది. మనమంతా తనకు మానసికంగా దగ్గరగా వున్నామనే భావన పెద్దవాళ్లకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ వయసులో వారికి కావాల్సింది ఇంతకంటే ఏమీ వుండదు అని.
‘నాన్న చెప్పింది నా మనసులో ముద్ర పడింది. అందుకే మీ వంటివారికి తరచుగా ఫోన్  చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’ 
 "మంచి నిర్ణయం వేణీ" అన్నాను.
జ్వాలా చెప్పింది, వేణి చెప్పింది ఒకటే. 
నిజానికి ఇలాంటి మాటలు అన్నీ నేనే ఒకప్పుడు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ వచ్చాను. 
‘మధ్య మధ్య కలుస్తూ వుంటేనే కుటుంబ బంధాలు, మధ్య మధ్య  మాట్లాడుకుంటూ వుంటేనే స్నేహ సంబంధాలు’ అంటూ గొప్పగా నీతులు చెప్పాను. కానీ నేను చేస్తున్నది ఏమిటి?
పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి  అనుకోవాలా!
చేతిలో ఫోన్ అస్తమానం వుంటుంది. వెనుకటి మాదిరిగా గుండె గుభిల్లుమనే చార్జీల బాధ లేదు. మరి ఎందుకీ నిర్లిప్తత.
నాకూ చిన్నతనం గుర్తుకు వచ్చింది. సొంతంగా ఇంట్లో ఫోన్ లేకపోయినా మిత్రులతో, చుట్టాలతో మాట్లాడాలని తాపత్రయ పడేవాళ్ళం.  పుట్టిన రోజు సందర్భాల్లో  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళం. ఇప్పుడూ చెబుతున్నాం. ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ  మొక్కుబడిగా షరా మామూలు గ్రీటింగ్ పెట్టి ఊరుకుంటున్నాం. అదీ ఫేస్ బుక్ వాడు గుర్తు చేస్తేనే సుమా. వాళ్ళు చూస్తారో తెలియదు. ఒక పని అయిపోయింది అనుకుంటాం. అలా కాకుండా ఆ ఒక్కరోజు ఫోన్ చేసి శుభకామనలు తెలియచేస్తే ఎంత బాగుంటుంది. 
అంత తీరికలేని పనులు ఏమీ లేవు కదా!
కానీ ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాం!  
అసలు అంత తీరిక ఏదీ! 
Courtesy Cartoonist