మంగళవారం 20 మార్చి 2012

మాస్కోలో మెక్ డొనాల్డ్




మాస్కోలో మెక్ డొనాల్డ్


1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు,  యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.  అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే ప్రదేశాలుగావుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు తింటూ వేడి వేడి చాయ్ తాగుతూ, దక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ కుర్రకారు భలేగా  కాలక్షేపం చేసేవారు.  అయితే మాస్కో మెక్ డొనాల్డ్ విషయం లో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే  పట్టేది. ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే  లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన  మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ క్యూలు పలచబడ్డవని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.


మాస్కోలో మెక్ డొనాల్డ్

ఇనుప తెరదేశంగా పేరు పొందిన సోవియట్ రష్యా లో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.
మాస్కో మెట్రో సింబల్ ఇంగ్లీష్ అక్షరం ‘M’ని పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే బిగ్ మాక్మాస్కో రెస్టారెంట్ లో బల్షోయీ మాక్అనేవారు. రష్యన్లో బల్షోయీఅంటే పెద్దఅని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర  రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో చెప్పాలంటే మూడు  డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల జీతంలో వందో వంతు. కాకపొతే ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు సుమా!
మాస్కో పౌరులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ మెక్ డొనాల్డ్ కధాకమామిషూ ఏమిటంటే-
1940 మే 15 వ తేదీన మొట్టమొదటి మెక్డొనాల్డ్ రెస్టారెంట్ ను- డిక్, మాక్ మెక్డొనాల్డ్ అనే సోదరులు కలసి కాలిఫోర్నియాలోని సాన్  బెర్నార్డినో అనే చోట ఏర్పాటుచేశారు. అలా మొదలయిన ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లు కాలక్రమంలో 122  దేశాలకు ఎగబాకి మొత్తం ముప్పై వేల పైచిలుకు రెస్టారెంట్లతో యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని తమదయిన  రుచులతో అలరించే  స్తాయికి చేరుకున్నాయి.
ఇక అమెరికాలో మెక్ డొనాల్డ్ ప్రభ యెలా వెలుగుతున్నదో తెలుసుకోవాలంటే కొన్ని గణాంకాలు అవసరం. 1970 లో మెక్డొనాల్డ్ అమ్మకాలు మొత్తం అమెరికాలో ఆరు బిలియన్ డాలర్లు వుండగా 2001 నాటికి అవి 110 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే ఆ దేశంలో ఉన్నత విద్య పైనా, కంప్యూటర్లు, మోటారు కార్లు, సినిమాలు, మాగజైన్లు, పుస్తకాలు, వీడియోలు వీటన్నిటి పైనా కలిపి ఆ దేశస్తులు ఖర్చు పెట్టే మొత్తం కంటే ఇది చాలా చాలా  ఎక్కువ.
 (20-03-2012)

సోమవారం 19 మార్చి 2012

వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా


వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ ఇన్ కలకత్తా

కోల్ కటా అని ఇప్పుడు పేరు మార్చుకున్న కలకత్తా నగరంలో వున్న అనేక వేల వీధుల్లో ఇది ఒకటి. దాని పేరు హరీష్ చంద్ర స్ట్రీట్.
గత వారం కాశీ యాత్రకు వెడుతూ మార్గ మధ్యంలో కలకత్తాలో ఆగినప్పుడు పనికట్టుకుని చూసివచ్చిన వీధి ఇదొక్కటే.













ఓపెన్ డ్రైనేజీ. మురుగుకాలువ. వీధిలోనే స్నానాలు.  ఇంటి ఆకారం కూడా లేని టార్పాలిన్ తడికెల నడుమ కాపురాలు. వీధి కుక్కల స్వైర విహారాలు. చూడగానే వికారం కలిగించే చిరుతిళ్ళ అంగళ్ళు.

కలకత్తాలోనే కాదు దేశంలో ఏ బస్తీలో చూసినా ఇలాటి వీధులు అనేకానేకం కానవస్తాయి. అటువంటప్పుడు వెరీ ఇంపార్టెంట్ స్ట్రీట్ అని సన్నాయి నొక్కులెందుకు అనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
అదే. అది చెప్పడానికే ఈ ఉపోద్ఘాతం.

పై ఫోటోలను కొంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అందులో ఒకదానిలో బెంగుళూరు పెంకులు  కప్పిన ఒక సాదా సీదా ఇల్లు కనిపిస్తుంది.

ఆ ఇంట్లో వుండే వ్యక్తి మాత్రం అంత సాదా సీదా సాధారణ మనిషి కాదు. కొన్ని దశాబ్దాలపాటు అవిచ్చిన్నంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని పాలించిన మార్క్సిష్టులకు, లెఫ్ట్ పార్టీలకు అధికార పీఠాన్ని  దూరం చేసిన అత్యంత సాదా సీదా రాజకీయ నాయకురాలు, తృణమూల్ అధినేత్రి  ‘దీదీ’ – మమతా బెనర్జీ - ముఖ్యమంత్రి హోదాలో నివసిస్తున్నది ఆ ఇంట్లోనే అంటే ఓ పట్టాన నమ్మడం కష్టం. కానీ కళ్ళతో చూసిన దాన్ని నమ్మక తప్పదు కదా.
సాధారణంగా ఎవరయినా రాజకీయ నాయకులు నివాసం వుండే ప్రాంతాల్లో పౌర సౌకర్యాలు బాగా వుంటాయనీ, మామూలు పౌరులను వేధించే నీటి కొరత, కరెంటు కోతలు వుండవనీ, వీధులు పరిశుభ్రంగా వుంటాయనీ జనంలో ఓ నమ్మకం. నమ్మకమే కాదు మనవైపు చోటా మోటా రాజకీయ నాయకులు, అధికారులు నివసించే ప్రాంతాల్లో ఇలాటి ఇబ్బందులు లేకపోవడం నిజం కూడా.

ఈ నేపధ్యంలో మమతా దీదీ నివసిస్తున్న ఇల్లూ, ఆ ఇల్లు వున్న వీధినీ చూస్తుంటే ఇలాటి రాజకీయ నాయకులు కూడా వుంటారా అనిపించడం అంతే సహజం.  కానీ ఒక ముఖ్యమంత్రి వుండే వీధే అలా వుంటే ఇక మిగిలిన వాటి సంగతేమిటి? దీనికి జవాబు కూడా అంతగా  అర్ధం కాని ‘హింగ్లీ’  (హిందీ-బెంగాలీ) భాషలో ఆ వీధిలో వుండే వ్యక్తి నుంచే లభించింది. కోల్ కటా లోని అన్ని వీధులు బాగుపడ్డ తరువాతే తన వీధిని బాగు చేసే పనికి పూనుకోవాలని దీదీ హుకుం జారీ చేసారట. ఇందులోని నిజానిజాలు ఆ వీధికి ఎదురుగా వుండే మరో వీధిలో కొలువున్న మరో ‘దేవత’ కలకత్తా కాళీనే చెప్పాలి. 

దీదీ సాదా సీదా వ్యవహార శైలి తెలిసిన వాళ్లకు ఆ వీధి వ్యవహారం  అంత ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. కాకపొతే,
పోలీసు పటాలాలు, స్టెన్ గన్లు ధరించి పహరా కాసే  అంగరక్షకులు, అడుగడుగు బారికేడ్లు ఇవన్నీ ఏమీ లేకుండా ఒక ముఖ్యమంత్రి అంత సాధారణ జీవితం గడుపుతున్న తీరుతెన్నులు గమనిస్తే రాజకీయ ప్రముఖుల ‘రక్షణ’ కోసం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించడం అంత అవసరమా అన్న సందేహం తలెత్తక మానదు. (19-03-2012)                

బుధవారం 7 మార్చి 2012

సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!




సంసారం నడిపే స్త్రీలు కారు నడపలేరా!

తేదీ: 2011, జూన్ 17 దేశం సౌదీ అరేబియా




ఆ రోజు వందలాదిమంది జనం  కార్లలో బయలుదేరారు. ఇందులో విచిత్రం ఏమిటి అనుకుంటున్నారా.  ఆ కార్లు నడుపుతున్నవారందరూ స్తీలే. అయితే ఏమిటంటారా! వారందరికీ కార్లు వున్నాయి కాని వాటిని నడపడానికి లైసెన్సులు మాత్రం  లేవు. మరి లైసెన్సులు లేకుండా వారంతా కార్లలో బయటకు ఎందుకు వచ్చినట్టు? లైసెన్సుల కోసమే అంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. లైసెన్సుల కోసమే వారందరూ అలా రోడ్డెక్కాల్సి వచ్చింది. లైసెన్స్ లేకుండా కారు నడిపితే ఏం జరుగుతుందో వారికి తెలుసు. దానికి సిద్ధపడే వాళ్లు కార్లతో రోడ్డున పడ్డారు.
మూకుమ్మడి నిరసన కావడం వల్ల పోలీసులు అందర్నీ అరెస్ట్ చేయలేకపోయారు. కొందరికి చలాన్లు రాశారు. కొందర్ని హెచ్చరించి వొదిలేశారు. అరెస్ట్ అయిన కొద్దిమంది కూడా అందుకు బాధ పడలేదు. ఎందుకంటె తమ బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే వారు ఈ ఆందోళనకు నడుం కట్టారు.
ఇంతకీ విషయం ఏమిటంటే ఆ దేశంలో స్త్రీలకు కార్లు నడిపే హక్కు లేదు. ప్రపంచంలోవున్న లగ్జరీ కార్లన్నీ సౌదీలో దర్శనమిస్తాయి. పెట్రోలు కూడా చాలా చవుక. కార్లు కొనుక్కోగల ఆర్ధిక స్తోమత ఆ దేశంలో చాలామందికి వుంది. మహిళలు కూడా  ఉద్యోగాలు చేస్తారు. కారు కొనుక్కోవడం వారికి ఓ లెక్కలోనిది కాదు. పైగా వృత్తి రీత్యా వాహనం అవసరం కూడా. ఆఫీసులకు వెళ్లడానికీ, పిల్లల్ని స్కూళ్ళలో దింపడానికీ ఉద్యోగినులకి సొంత వాహనం యెంత అవసరమో ఈ నాడు అందరికీ తెలిసిన విషయమే. ఆడా  మగా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అందరూ  కారు నడపడం సర్వసాధారణంగా మారిపోయింది. అయినా సౌదీ అరేబియాలో ఆడవారికి ఈ హక్కు ఇంకా హక్కుభుక్తం కాలేదు. దీనికోసం వాళ్లు చాలాకాలంగా ఆందోళన  చేస్తూ వున్నారు. బహుశా, ఆడవారిని మోటారు కారులో డ్రైవింగ్ సీటులో చూడలేనిది మొత్తం ప్రపంచంలో ఈ ఒక్క దేశంలోనే.
సౌదీ మహిళల పట్ల ప్రభుత్వం ప్రదర్శిస్తున్న ఈ వివక్ష కారణంగా  ఆ దేశంలో చాలా కుటుంబాలు డ్రైవర్ ని పెట్టుకోవాల్సిన పరిస్తితి. అలా సొంతంగా డ్రైవర్ ని పెట్టుకుకోవాలంటే అతగాడికి నెలకు రెండు వేల సౌదీ రియాల్స్ చెల్లించుకోవాలి. లేదా ఉద్యోగం చేస్తున్న మహిళలు ఆఫీసులకు వెళ్లి రావడానికి భర్త మీదనో లేదా కుటుంబంలోని  మరో మగవాడి మీదనో  ఆధారపడాలి. ఇందువల్ల వాళ్లు ఎంతో విలువయిన సమయాన్ని నష్టపోతున్నారు. శారీరకంగా, మానసికంగా కష్టపడుతున్నారు.       
పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న ఉద్యోగినుల పరిస్తితి మరీ దారుణం.
మనాల్ షరీఫ్ (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ ఇందుకొక ఉదాహరణ.
భర్త తోడు లేని ఈ మహిళ  పిల్లలతో ఒంటరిగా జీవిస్తోంది. ఇంట్లో కారున్నప్పటికీ, పిల్లల్ని పార్కు తీసుకు వెళ్ళాలన్నా లేక ఆసుపత్రికి వెళ్ళాలన్నా అన్నదమ్ములపై ఆధారపడాల్సిన దుస్తితి. ఆ మాత్రం మగతోడు కూడా లేని ఆడవాళ్లు, సొంత కారున్నప్పటికీ  అవసరం పడితే  టాక్సీలో వెళ్ళాలి. ఇలాటి సందర్భాలలో  ఆడవాళ్ళు ఎంతో నిర్వేదానికి లోనవుతుంటారు. ప్రతి రోజూ ఆఫీసుకు వెళ్ళడానికి పరాయి మగవాళ్ళని దేబిరించడం  కనాకష్టంగా  ఉంటోందని మనాల్ తన స్నేహితురాలికి యూ ట్యూబ్ లో ఒక సందేశం పంపారు.
కారు నాది.  నా డబ్బుతో కొనుక్కున్నాను. నా పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. అయినా కానీ దాన్ని నడపలేని దౌర్భాగ్య స్తితి నాది.  ఏం చెప్పమంటావు?’ అంటూ అందులో  తన గోడు వెళ్లబోసుకుంది.

ఉన్నత కుటుంబీకులకీ, సంపన్న వర్గాలవారికీ డ్రైవర్ను పెట్టుకోవడం పెద్ద ఖర్చేమీ కాదు. కానీ, ఆడా మగా ఇద్దరూ సంపాదించుకుంటే కాని సంసారం నడవని మధ్య తరగతి కుటుంబాలలోని ఆడవారికి సౌదీలో ఇదొక ప్రధాన సమస్యగా తయారయింది. హాస్పిటల్ కు వెళ్ళాలన్నా, ఆఫీసుకు సకాలంలో చేరాలన్నా, పిల్లల్ని స్కూళ్ళలో దింపాలన్నా, పచారీ దుకాణానికి వెళ్లి సరకులు కొనుక్కోవాలన్నా ఆడవారు సొంత కారు పెట్టుకొని కూడా  ఎవరినో ఒకరిని ప్రాధేయ పడాల్సి వస్తోంది. అందుకే అక్కడి ఆడవారు ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న స్టీలు డ్రైవింగ్ లైసెన్స్ హక్కు కోసం ఆందోళనలు దిగుతున్నారు.
  
బాగా అవసరం పడ్డప్పుడయినా కారు నడపడం రావాలని ఆదేశంలో కొందరు ఆడవాళ్ళు పొరుగునవున్న బహ్రెయిన్, లేదా యూయేయీ దేశాలకు వెళ్లి కారు నడపడం నేర్చుకుంటున్నారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్సులు సంపాదించుకుని స్వదేశానికి వస్తున్నారు. 
కారు డ్రైవింగ్ నా తమ్ముడు నేర్పాడు. వూరికి దూరంగా తీసుకువెళ్ళి కారు నడపడంలో మెళకువలు నేర్పాడునూర్ అనే పేరుగల మహిళా అరబ్  వార్తా  సంస్థతో చెప్పింది.
నిరుడు జెడ్డాలో వరదలు వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులను ఓ మహిళ కారులో సురక్షిత ప్రాంతాలకు చేర్చిందని పత్రికల్లో  చదివినప్పుడు నాకూ కారు డ్రైవింగ్ వస్తే యెంత బాగుండుననిపించింది. అందుకే లెబనాన్ కు వెళ్లి దాన్ని సంపాదించుకున్నానుఅని మోనా హేజాజీ అనే సౌదీ స్త్రీని ఉటంకిస్తూ రియాద్ న్యూస్  పేర్కొన్నది.  
రాత్రివేళల్లో తాను కారు నడుపుతున్న దృశ్యాలను అరీజ్ ఆల్ ఖల్డీ అనే మహిళ  ఇంటర్నెట్ లో పెట్టింది. దాన్ని చూసయినా మరికొందరు మహిళలు స్పూర్తి పొందుతారేమో అన్నది ఆవిడ ఆకాంక్ష.
(మార్చి ఎనిమిదో తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆవిడ ఆకాంక్ష నెరవేరడానికి ఇంకా ఎన్ని ఏళ్ళు వేచివుండాలో!)
  
(08-03-2012)

శుక్రవారం 2 మార్చి 2012

పీత కష్టాలు పీతవి


పీత కష్టాలు పీతవి
ముని శాపగ్రస్తుడయిన కుబేరుడు భూలోకంలో మానవరూపంలో ముఖేష్ అంబానీగా అవతరించి తండ్రి ధీరూభాయ్ అంబానీ  స్తాపించిన సువిశాల వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించి, అపర కుబేరుడిగా పేరు గాంచి, ఆ క్రమంలో  పోగేసుకున్న అపార ధనరాశులతో ఏం చేయాలా అని ఆలోచించి ఆలోచించి,  ఏదో ఒకటి చేయకపోతే బాగుండదనిపించి, భార్యాబిడ్డలతో చర్చించి, కోట్లకు  కోట్లు వెచ్చించి  ముంబై లో  ఏకంగా ఇరవై ఏడు అంతస్తుల రమ్యహర్మ్యాన్ని నిర్మించుకుని సుఖంగా జీవిస్తున్న తరుణంలో – ఆ వైనాన్ని ఓ గిట్టని పత్రిక వైనవైనాలుగా  వర్ణించి రాసి జనం మీదకు వొదిలింది. ఆ కధాక్రమంబెట్టిదనిన - -
ముఖేష్ అంబానీ తన నివాస భవనంలో పదిహేనో అంతస్తులో వున్న పడకగదిలో నిద్రిస్తాడు. నిద్ర లేచిన తరువాత పదిహేడో అంతస్తుకువెళ్లి అక్కడ వున్న  జిమ్ లో వ్యాయామం చేసి అక్కడే నిర్మించుకున్న అందమైన  అధునాతన నీటి  కొలనులో ఈత కొడతాడు.  పందొమ్మిదో అంతస్తులో బ్రేక్ ఫాస్ట్ ముగించి పద్నాలుగో అంతస్తులో దుస్తులు ధరించి ఇరవై ఒకటో అంతస్తుకు వెడతాడు. అక్కడవున్న బ్రీఫ్ కేసు, అవసరమయిన ఫైళ్ళు తీసుకుని పదహారో  అంతస్తులో వెయిట్ చేస్తున్న భార్యకు టాటా చెప్పి పదమూడో అంతస్తుకు వెళ్లి  స్కూలుకు వెళ్ళడానికి తయారవుతున్న పిల్లలను పలకరిస్తాడు. ఆ తరువాత మూడో అంతస్తులో పార్కుచేసివున్న రెండున్నర కోట్ల రూపాయలు ఖరీదుచేసే మెర్సిడెస్ కారెక్కి సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ఆఫీసుకు వెడతాడు.
ఇంతవరకూ కధ బాగానే వుంది. కానీ విధి విచిత్రమైనది కదా. ప్రతిరోజూ ఒకేరకంగా వుండదు. కదా!. అందుకే ఓ రోజు అది అడ్డంగా  అడ్డం తిరిగింది. ఆ సంగతే ఆ పత్రిక రాసింది. ఆ కధనం ప్రకారం ఓ రోజు యధావిధిగా అన్ని అంతస్తుల్లో తన దినసరి దిన చర్యలను ముగించుకుని కారెక్కడానికి  మూడో అంతస్తుకు చేరుకున్న ముఖేష్ కు కారు తాళాలు మరిచివచ్చిన సంగతి లేటుగా గుర్తుకు వచ్చింది.
వాటిని ఎక్కడ మరచిపోయినట్టు?
పదిహేనో అంతస్తులోనా ? లేక పదిహేడులోనా!  పదా! పద్నాలుగా! ఇరవై ఒకటో అంతస్తులోనా లేక పదహారులోనా! లేదా పదమూడో అంతస్తులో పిల్లలను పలకరించి  వస్తున్నప్పుడా? ఎక్కడ మరచిపోయినట్టు. ఆలోచిస్తూ  తల గోక్కుంటే తండ్రి వారసత్వంగా వచ్చిన బట్ట తల తగిలింది కాని  తాళాలు గురించిన లైటు మాత్రం వెలగలేదు.
కానీ అంబానీనా! మజాకా!
అపర కుబేరుడి కారు తాళాల కోసం  ముమ్మరంగా గాలింపు మొదలయింది. అన్ని అంతస్తుల్లోవున్న  సిబ్బంది చేతుల్లో వున్న  ఫోన్లు మోగాయి. నౌకర్లు, చాకర్లు, బట్లర్లు, సెక్రెటరీలు, జిమ్ ట్రైనర్లు,  వంటవాళ్ళు, వార్పువాళ్ళు, క్లీనర్లు, డ్రైవర్లు, లిఫ్ట్ అటెండెంట్లు ఒకరా ఇద్దరా లెక్కకు మిక్కిలిగావున్న పనివాళ్ళ ఫోన్లన్నీ ఒకేసారి మోగాయి. కానీ ఏం లాభం? తాళం చేతుల జాడ లేదు.
కాలమే ధనంగా  భావించి అనుక్షణం సంపాదనలో మునిగితేలే అంబానీ క్షణం ఆలశ్యం చేయకుండా, ఆ రోజుకు సరిపెట్టుకుని  ఓ కోటి మాత్రమే కిమ్మతు చేసే మరో  చిన్న కారులో డ్రైవర్ను వెంటపెట్టుకుని తన పనిపై తాను  వెళ్ళిపోయాడు. 
అంతటితో ముగిస్తే కధ ఏముంది?
అంబానీ సిబ్బంది అందరూ కళ్ళల్లో కాగడాలు పెట్టుకుని  కారు తాళాల అన్వేషణ ఆ తరువాత కూడా కొనసాగించారు. ఆ క్రమంలో మరో ఆసక్తికరమయిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో బట్టలు ఉతకడానికి కొత్తగా పనిలో కుదిరిన ఓ పనిమనిషి కారు తాళాలున్న అంబానీ గారి ప్యాంటును  తాళాలతో సహా  ఉతికి ఝాడించి పదహారో అంతస్తులో ఆరేసింది. అలా ఆరేసిన ఆ ప్యాంటు, అక్కడ వీస్తున్న చల్లని  హోరు గాలికి ఎగిరిచక్కా పోయింది. ఆ విధంగా, ప్యాంటు  సమేతంగా కోటిన్నర రూపాయల కారు తాళాలు కూడా గాలిలో కలిసిపోయాయి.
కధ అంతటితో ఆగిందా. ఆగితే కధ ఎందుకవుతుంది.
ఆ రోజు రాత్రి పదహారో అంతస్తులో పడుకుని, అత్తగారిని విషం పెట్టి చంపాలని చూసే కోడలు పిల్ల ప్రయత్నాలను   టీవీ సీరియల్  నాలుగువందల నలభయ్యో ఎపిసోడ్ చూసి, పీడ కలలతో  నిద్రపట్టక కలత నిద్రలో  దొర్లుతున్న అంబానీ అర్ధాంగికి పైన ఏదో శబ్దం వినిపించి లేచి చూసింది. క్లోజుడ్ సర్క్యూట్ టీవీ తెరపై  భవనం పై భాగంలో హెలిపాడ్ పై  దిగుతున్న  హెలికాప్టర్ కన్పించింది. ఇంత  రాత్రప్పుడు మొగుడు హెలికాప్టర్ లో ఎక్కడ చక్కర్లు కొట్టి వస్తున్నట్టన్న అనుమానం ఆవిడ మనసులో  మొక్కై మొలిచి మరుక్షణంలోనే  మానుగా విస్తరించింది. ఆ మధ్య   ఏదో ఫంక్షన్ లో అప్పుడే పైకొస్తున్న  ఓ  సినీ హీరోయిన్ తన మొగుడి  వంక వంకర చూపులు చూస్తున్నప్పుడే జాగ్రత్త పడివుండాల్సింది. అయినా ఇన్నేళ్ళొచ్చి,  ఇంట్లో ఎదిగిన పిల్లల్ని పెట్టుకుని ఇలా చెడు  తిరుగుళ్ళు తిరగడానికి ఈ మగవాళ్ళకు మనసెలా వస్తుందో అని ఏడుస్తూ ముక్కు చీదుకుంటూ పైఅంతస్తులో వున్న అత్తగారి దగ్గరకు వెళ్లి మరోసారి భోరుమంది. అర్ధరాత్రి ఈ కాకి గోలేమిటని అత్త కోకిలా బెన్  విసుక్కుంటూ నసుక్కుంటూ  అప్పటికప్పుడే  కొడుకుని పిలిచి అక్కడికక్కడే పంచాయితీ పెట్టింది. చవితినాడు నోముకోకుండా విదేశాల్లో విహారయాత్రలు చేసి వచ్చిన  పాపానికి తనమీద పడ్డ నీలాపనింద  ఇదానుకుని ఎంతో ఇదయిపోయిన ముఖేష్ అంబానీ  మరోసారి బట్ట తలను తడుముకుంటే అసలు విషయం గుర్తుకువచ్చింది. ఆ రోజు కారు తాళాలు పోయిన సంగతి మెర్సిడెస్ కంపెనీ వారికి తెలియచేస్తే వారు తమ హోదాకు తగ్గట్టుగా ఆ రాత్రికి రాత్రే హెలికాప్టర్ ద్వారా కారు తాళాలను ఇంటికి బట్వాడా చేశారు. ఆ అర్ధరాత్రి  ఆ అమ్మడు చూసి అపార్ధం చేసుకున్న హెలికాప్టర్ అదేనట.
అందుకే అంటారు –  పీత కష్టాలు పీతవని. (02-03-2012)

బుధవారం 29 ఫిబ్రవరి 2012

సమతూకం


సమతూకం


ఈ చరాచర సృష్టి జరక్క పూర్వం సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంపై  మఠం వేసుక్కూర్చుని  విశ్వ సృష్టిలో నిమగ్నమై వున్నాడు. సృష్టి కార్యంలోని  వింతలూ విశేషాలను పనిలో పనిగా తన సతీమణి సరస్వతీ దేవికి తెలియచేస్తున్నాడు.
‘చూడు వాణీ! హాటకగర్భురాణీ! మనం చేసే ప్రతిపనీ చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగుసార్లు ఆలోచించుకుని చేయాలి. సమతూకం వుండేలా చూసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది’ అన్నాడాయన హెచ్చరికగా తన నాలుగు తలల్లో ఒకదాన్ని తడుముకుంటూ.
‘ఉదాహరణకు పది జింక పిల్లల్ని సృష్టించగానే సరిపోదు. వాటి సంఖ్యను అదుపుచేయడానికి కనీసం ఒక సింహాన్ని అయినా సృష్టించాలి.’
చదువులతల్లికి విషయం అర్ధమయింది.  ఎప్పుడూ ఏదో ఒకదాన్ని సృష్టిస్తూ ఆ పనిలోనే తలమునకలుగా వుండిపోయే శ్రీవారు ముచ్చట్లు మొదలు పెట్టడమే ఓ వింత. అందుకని వాయిస్తున్న వీణను కాసేపు పక్కనబెట్టి తన రెండు చెవులను ఆయనకు ఒప్పగించింది.      
‘చూశావు కదా ప్రపంచపఠంలో కానవస్తున్న  ఈ దేశాన్ని. దీన్ని అమెరికా అంటారు. ఈ దేశానికి నేనిప్పుడు సర్వ సంపదలు అనుగ్రహిస్తున్నాను. మొత్తం ప్రపంచంలో అత్యంత సంపన్న దేశంగా దీన్ని తయారుచేస్తున్నాను. కానీ అదే సమయంలో ఈ దేశానికి భద్రతా భావం  కొరవడేట్టు చేస్తున్నాను. లేకపోతే దీనికి పట్టపగ్గాలుండవు.’
‘ఇదిగో! ఇది ఆఫ్రికా! యావత్ ప్రపంచంలో ఎక్కడా కానరాని  ప్రకృతి రామణీయకతను దీని సొంతం చేస్తున్నాను.  అయితే అదేసమయంలో ఎక్కడాలేని విధంగా అతి దారుణమయిన ఉష్ణోగ్రతలతో కూడిన వాతావరణాన్ని ప్రసాదిస్తున్నాను.’
‘ఇదే దక్షిణ అమెరికా. ఈ దేశంలో ఎక్కడ చూసినా దట్టమయిన అడవులు. అందుకే, సమతూకంగా  నివాసయోగ్యమయిన భూమి అంతగా అక్కడి ప్రజలకు దొరక్కుండా చేస్తున్నాను. అందువల్ల వాళ్ళంతట  వాళ్ళే అడవులను నరుక్కుంటూపోతారు.    ఆత్మహత్యాసదృశమయిన పనులతో వారిని వారే నాశనం చేసుకుంటారు.’
సృష్టికర్త మాటలను ఓ చెవితో వింటూ మరోవంక ఓరకంట విశ్వపఠంలో వివిధ దేశాలను  తిలకిస్తున్న  వాణీదేవి  చూపులు ఓ సుందర ప్రదేశం దగ్గర ఆగిపోయాయి.  అదేమిటన్నట్టు బ్రహ్మను చూపులతోనే ప్రశ్నించింది.
‘అదా! మొత్తం  నా సృష్టిలోనే అపూర్వమైన దేశం అది. పేద దేశమైనా ధార్మికంగా సంపన్నమైనది. ఎత్తయిన పర్వత శిఖరాలు, గలగలా పారే నదులు. చక్కటి అవగాహన వున్న ప్రజలు. యావత్ ప్రపంచానికి ఆధ్యాత్మికంగా  మార్గ నిర్దేశనం చేయగల చేవ,సత్తా వున్న ఏకైక దేశం. అదే భారత దేశం’
వింటున్న వాణమ్మ నోరు తెరిచింది. కొంత ఆశ్చర్యంతోనూ, మరికొంత ఉత్సుకతతోనూ.
‘మరి మీరు చెబుతూ వస్తున్న సమతూక న్యాయం భారత దేశం విషయంలో ఏమయింది స్వామీ?’
‘తొందరపడకు సుందరవదనా! ఆ విషయం చెప్పేలోగానే నువ్వు నోరు తెరిచావు. చూడు మరి. భారత దేశానికి ఇరుగు పొరుగున ఎలాటి వారిని సృష్టించి పెట్టానో!’        

 బ్రహ్మదేవుడు నాలుగు నోళ్ళతో మందహాసం చేస్తుంటే బ్రహ్మణి భర్త తెలివితేటలకు ఆశ్చర్యపోతూ మరో మారు నోరు తెరిచింది.
స్వస్తి.
(29-02-2012)

సోమవారం 27 ఫిబ్రవరి 2012

పనికిరానిదేమిలేదు ఈ లోకంలో


పనికిరానిదేమిలేదు ఈ లోకంలో



అనగనగా ఓ రాజు. ఆ రాజుగారికో కొడుకు.  యుక్తవయస్సు రాగానే అతడికి పట్టాభిషేకం చేసి తాను వానప్రస్తాశ్రమం స్వీకరించాలన్న తలంపు మహారాజుకు కలిగింది.  అయితే రాజ్యభారాన్ని కొడుకు భుజస్కంధాలపై పెట్టేముందు అందుకు తగిన శిక్షణ ఇప్పించేందుకు కుల గురువులవద్దకు పంపాడు.
గురువు గారి ఆశ్రమంలో రాజూ పేదా అన్న తేడాలేదు. అక్కడ  అందరూ సమానమే.
ఆశ్రమజీవితంలో కొంత కాలం గడిపిన తరువాత యువరాజు  ఓ రోజు వెళ్లి  గురువును కలిశాడు. కలిసి తన మనసులోని మాట బయట పెట్టాడు.
స్వామీ! ఇన్నాళ్ళబట్టి  నేను కప్పుకుంటున్న  గొంగడి బాగా చిరుగులు పడిపోయింది. దాని స్తానంలో కొత్తది ఇప్పిస్తే కృతజ్ఞుడిని
గురువు పాత గొంగడిని పరీక్షించి చూశాడు. యువరాజు చెప్పింది నిజమే. అది బాగా జీర్ణించి పోయి కప్పుకోవడానికి పనికిరాకుండా వుంది.
గురువు కొత్త గొంగడి తెప్పించి శిష్యుడికి ఇచ్చాడు. యువరాజు సంతోషంగా వెళ్ళిపోయాడు.
ఆ తరువాత గురువు గారికి ఓ సందేహం వచ్చింది. కొత్త గొంగడి  తీసుకువెళ్ళాడు   సరే పాత గొంగడి మాటేమిటి?’
శిష్యుడిని మళ్ళీ పిలిపించాడు. పాత  దుప్పటి  ఏం చేశావని ప్రశ్నించాడు.
పక్క బట్ట బాగా మాసిపోయింది. అందుకని పాత గొంగడిని పక్కబట్టగా వాడుతున్నానని బదులుచెప్పాడు.
కానీ, గురువు గారు అంతటితో వొదిలిపెట్టలేదు.
పాడయిపోయిన పాత పక్కబట్టని ఏం చేశావని ప్రశ్నించాడు.
కుటీరం కిటికీకి దాన్ని పరదాగా కట్టానని శిష్యుడి జవాబు.
బాగుంది. మరి పాత పరదా సంగతేమిటి? దాన్నేం చేశావ్?’ గురువుగారు మరో ప్రశ్న సంధించాడు.
ఇల్లు కడిగిన తరువాత తుడవడానికి దాన్ని వాడుతున్నానని శిష్యుడు చెప్పాడు.
గురువుగారి సందేహాలు ఇంకా తీరినట్టులేదు.
అంతకుముందు ఈ పనులకు వాడిన బట్టలు ఏమయ్యాయి?’
వాటిని దారాలుగా విడదీసి ఆ దారాలతో వొత్తులు తయారు చేసి రాత్రి వేళల్లో ఆముదపు దీపాలు వెలిగించి చదువుకుంటున్నాను
అడగడానికి గురువుదగ్గర ఏమీ మిగలలేదు. అలాగే శిష్యుడికి నేర్పడానికి కూడా ఆయన దగ్గర ఏమీ లేదు.
పనికిరానిదేమీ లేదు ఈ లోకంలో అన్న నీతిని బాగా  వొంటబట్టించుకున్న  యువరాజు చేతుల్లో ఈ రాజ్యం భద్రంగా వుంటుందన్న గట్టి నమ్మకం గురువుకు కలిగింది.
అంతే!  పట్టాభిషేకానికి ఏర్పాట్లు చేసుకోవలసిందని
మహారాజుకు కబురు పంపారు. (27-02-2012)

ఆదివారం 26 ఫిబ్రవరి 2012

ఇచ్చుటలో వున్న హాయీ!


ఇచ్చుటలో వున్న హాయీ!



చుట్టూ చిమ్మ చీకటి.  ఆ చీకటి నడుమ ఆగిపోయిన కారు. ఆ కారులో వొంటరిగా అనసూయ.
భర్త తరచూ పరిహాసంగా అనే మాటలు ఆ సమయంలో గుర్తుకు వచ్చాయి.  
‘నువ్వు మగాడిగా పుడితే సరిపోయేది’
కారులో వొంటరి  ప్రయాణాలు ఆమెకు కొత్తేమీ  కాదు. కారు  ఆగిపోవడాలు, చిన్న చిన్న రిపేర్లు సొంతగా చేసుకోవడాలు కూడా కొత్త కాదు. అందుకే ముందు భయం అనిపించలేదు. కానీ పొద్దుపోయి చీకటి చిక్క పడుతున్న కొద్దీ, కొద్ది కొద్దిగా ఆందోళన మొదలయింది. ఈ ప్రయాణం పెట్టుకోకుండా వుంటే సరిపోయేదేమో అనిపించసాగింది.   
అనసూయకు చిన్నతనం నుంచీ  ధైర్యం పాలు కొంత ఎక్కువే. వొంటరి ప్రయాణాలు చేయడానికి ఎప్పుడూ జంకేది కాదు. మొగుడి తరపున వ్యాపార వ్యవహారాలు   సంభాలించడానికి అనేక వూర్లు తిరగాల్సిన పరిస్తితి. ఆయన కాలం చేసిన తరువాత ఆమెపై ఈ బాధ్యత మరింత పెరిగింది.  పిల్లలు పెద్దవాళ్లయి విదేశాల్లో స్తిరపడడంతో భర్త   పెంచి  పోషించిన సంస్తను తన చేతులతోనే మూసివేయలేక కొంతా, మరో వ్యాపకం లేక మరికొంతా ఏమయితేనేం దాన్ని ముందుకు నెట్టుకొస్తోంది.  అందులో భాగంగానే ఈ ప్రయాణం. ఆ ప్రయాణంలోనే ఈ కొత్త  అనుభవం.
హైదరాబాదు నుంచి బెజవాడ వెళ్ళే రోడ్డు మార్గాన్ని పెద్దది చేస్తూ వుండడంతో ఆ మార్గంలో రోడ్డు ఎక్కడ వుందో గుంత ఎక్కడ వుందో తెలియని పరిస్తితి. మామూలుగా  ఇలాటి ప్రయాణాల్లో డ్రైవర్ ఎప్పుడూ వుంటాడు.  కాని ఆ రోజు అతగాడి భార్యకు సుస్తీ చేయడంతో, గంట  ప్రయాణమేగా వెంటనే  తిరిగిరావచ్చు అన్న సొంత భరోసాతో బయలు దేరింది. తిరుగు ప్రయాణం బాగా ఆలశ్యం అయి చీకటి పడి పోయింది. కారు హెడ్  లైట్లు మొరాయించడంతో ముందు వెడుతున్న ఓ లారీ వెనుక కారు నడుపుతూ వెళ్ళింది. రోడ్ల విస్తరణ వల్ల కాబోలు, లోగడ మాదిరిగా ఎటువంటి  మెకానిక్కు షాపు దోవలో కానరాలేదు. పైగా  ఆ లారీ వెంట గుడ్డిగా వెడుతూ దోవ తప్పింది. ఆ సంగతి తెలిసివచ్చేసరికి ఆ లారీ కూడా అయిపులేకుండా పోయింది. మొబైల్ వెలుతురులో చూస్తే అదో డొంక దారిలా కానవచ్చింది. కనెక్టివిటీ లేకపోవడంతో హైదరాబాదు ఫోన్ చేసి విషయం చెప్పడానికి కూడా వీలు  లేకుండా పోయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ స్టీరింగ్ మీద తలపెట్టి చూస్తూ  కారులో అలాగే వుండిపోయింది.
కొంతసేపటి తరువాత దూరంగా ఎవరో వస్తున్న అలికిడి. ముందు ప్రాణం లేచివచ్చినట్టు అనిపించినా ఆ సమయంలో వొంటరిగా వచ్చింది ఒక యువకుడు అని తెలియడంతో తెలియని భయం ఆవహించింది. అతడు తన మానాన తను పోకుండా కారు దగ్గరికి వచ్చి అద్దంలోనుంచి తొంగి చూసాడు. ఆ చీకట్లో ఏమీ కనబడకపోయినా ఆమె  మనో నేత్రానికి అతగాడొక చిల్లర మనిషిలా కనిపించాడు. అందుకే  కిటికీ అద్దాలు తీయకుండా అలాగే వుండి  పోయింది.  అతడు కాసేపు కారు చుట్టూ  తిరిగి తన దారిన పోతుండడం చూసి ఆమె మనసు తేలిక పడింది. కానీ అది ఎంతో సేపు నిలవలేదు. కాసేపటిలో అతడు తిరిగి వచ్చాడు. అతడి చేతిలో ఈ సారి ఓ సంచీ వుంది. కిటికీ దగ్గర నిలబడి అద్దం తీయమని సైగలు చేయడం ప్రారంభించాడు. ఏదయితే అయిందని అద్దం దించింది.
బయట చలిగాలితో పాటు అతడి మాటలు మెల్లగా  చెవిలో పడి అనసూయ మనసు చల్లబడింది.
‘అమ్మా! కారుకు ఏదో అయినట్టుంది. అందుకే దగ్గర్లో వున్న మా వూర్లోకి వెళ్లి రిపేరు సామాను తెచ్చాను. మీరలా కారులోనే కూర్చోండి. నేను ఈ లోగా కారు సంగతి చూస్తాను.’
అంత ఖరీదయిన కారు రిపేరు పల్లెటూరి వాడికి వొప్పచెప్పడం ఆమెకు  సుతరామూ ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది.  విధిలేని  పరిస్తితి.
అతడు ఏం చేసాడో తెలవదు. మంత్రం వేసినట్టుగా హెడ్ లైట్లు వెలిగాయి. మరి కాసేపటిలో కారు ఇంజన్ స్టార్ట్ అయింది. అనసూయ  మొహం ఆ చీకట్లో వెలిగిపోయింది.
హాండ్ బ్యాగ్ తీసి చూసింది. అన్నీ  క్రెడిట్ కార్డులే. వెతగ్గా కొన్ని వెయ్యి రూపాయల నోట్లు కనిపించాయి. లెక్కపెట్టకుండా తీసి అతడికి ఇవ్వబోయింది.  నిజానికి ఆ మొత్తం చాలా ఎక్కువే. కానీ ఆ సమయంలో ఆ మాత్రం సాయం దొరక్కపోతే తను పడే  కష్టాలు వూహించుకుంటే తక్కువే అనిపించింది.  కానీ, అతడికీ  తక్కువే అనిపించిందేమో అన్నట్టుగా ఆ డబ్బు వద్దన్నాడు. ఇంకా ఎక్కువ కావాలేమో అని మళ్ళీ బ్యాగు తెరవబోయి ఇంతలో అతడి మాటలు వినిపించి ఆగిపోయింది.
‘చూడమ్మా మీరింత చీకటిలో వొంటరిగా ఇలా చిక్కుకుపోవడం చూసి నేనేదో  నా ప్రయత్నం చేసాను. ఈ పనికి  డబ్బుతో సరిపెట్టుకోవడం నాకు నచ్చదు. ఈ డబ్బు మీ వద్దే వుంచండి. అంతగా ఇవ్వాలనిపిస్తే ఇలాగే అవసరంలో వున్న వారికి సాయంగా ఇవ్వండి.  దానితో నా లెక్క చెల్లవుతుంది.’
అవాక్కయిన అనసూయ  తేరుకునే లోగా అతడు మళ్ళీ   అన్నాడు.
‘ఈ పక్కనే మా వూరు.  నా పేరు సత్యనారాయణ. అందరూ మెకానిక్ సత్యం అంటారు. ఈ దారంట వెళ్ళండి. మూలమలుపులో ఓ చాయ్ దుకాణం వస్తుంది. అక్కడ రోడ్డెక్కారంటే చక్కగా షహర్ కెళ్ళి పోతారు.  వస్తానమ్మా! నేను చెప్పింది మరచిపోకండి’ అంటూ సంచీ భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు.
కారు స్టార్ట్ చేసింది.  కొంత దూరంలో అతడు చెప్పిన టీ దుకాణం కనబడింది. లైట్లు వెలుగుతున్నాయి.
మెకానిక్ సత్యం మాటలే ఆమె  చెవుల్లో మార్మోగుతున్నాయి. ఇంత హైరానా ప్రయాణం తరువాత కాస్త వేడి వేడి చాయ్ తాగితే బాగుంటుందనిపించి కారు అక్కడ ఆపి లోనికి నడిచింది. వేళకాని వేళ. జనం లేరు. స్టవ్ మీద గిన్నెలో టీ నీళ్లు  మరుగుతున్నాయి. చెక్క బల్ల మీద కూర్చుంటూ వుండగానే లోపలనుంచి నిండు గర్భంతో వున్న మహిళ భారంగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది. కానీ కళ్ళల్లో ఏమాత్రం అలసట లేదు.   టీ చెప్పగానే అనసూయ ముందు  వున్న బల్లను శుభ్రంగా గుడ్డతో తుడిచింది. మూలగా వున్న ఫ్రిజ్ తెరిచి చల్లని నీళ్ళు తెచ్చిపెట్టింది. ఇంత రాత్రి వేళ ఇలా వొంటరి ప్రయాణం ఎందుకు  పెట్టుకున్నారని మందలింపు ధోరణిలో మాట్లాడుతూనే వెళ్లి టీ తయారు చేసి తీసుకు వచ్చింది. దానితో పాటు కొన్ని బిస్కెట్లు కూడా సాసరులో పెట్టి ఇచ్చింది. నెలలు మీదపడ్డ ఆడమనిషి అంత కష్ట పడడం చూసి అనసూయ మనసు కూడా కష్టపెట్టుకుంది.  పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆ అమ్మాయి కుటుంబంకోసం పడుతున్న శ్రమ అనసూయను కదిలించింది. ఓ వంద రూపాయల నోటు సాసరులో వుంచింది. చిల్లర తేవడానికి ఆ అమ్మాయి లోపలకు వెళ్ళగానే మెకానిక్ కోసం తీసివుంచిన వెయ్యి నోట్లను ఆ సాసరు కింద వుంచి అక్కడ నుంచి తప్పుకుంది.
చిల్లరతో వచ్చిన అమ్మాయికి అక్కడ ఎవరూ కనిపించలేదు. కారులో వచ్చిన ఆవిడకోసం చుట్టూ చూసింది. ఆవిడ కనబడలేదు కానీ ఆవిడ వొదిలి వెళ్ళిన వెయ్యి నోట్లు కనిపించాయి. వాటితోపాటే వుంచిన  మరో చిన్న కాగితం. దాని మీద హడావిడిగా రాసిన  రెండే రెండు వాక్యాలు. ‘నువ్వు నాకు ఏమీ రుణపడి లేవు. అలాటి భావన వుంటే మరొకరికి సాయపడు, ఈ రుణం తీరిపోతుంది.’
పాపం ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తోచలేదు. అంత డబ్బు ఉదారంగా వొదిలివెళ్లడం అంటే మాటలు కాదు.
నిజానికి వచ్చేనెలలోనే డాక్టర్ పురుడు వస్తుందని చెబుతూ అందుకు తగ్గట్టుగా  డబ్బు సర్దుబాటు చేసుకొమ్మని చెప్పింది. ఎలారా భగవంతుడా అని చూస్తుంటే ఎదురు చూడని విధంగా ఆ కారు ఆవిడ అందించిన అయాచిత  ఆర్ధిక సాయం.
ఈ టీ కొట్టుతో వచ్చే రాబడి ఇంటి ఖర్చులకు బొటాబొటిగా సరిపోతుంది. చిన్న  చిన్న రిపేర్లు చేసే మొగుడికి వచ్చే కొద్దో గొప్పో సంపాదన కూడా రోడ్డు విస్తరణ పనులవల్ల ఈ మధ్య బాగా తగ్గిపోయింది.
అసలే తొలి చూలు యెలా బయటపడాలి అని  అనుకుంటున్న సమయంలో అనుకోని విధంగా ఈ రాత్రి ఈ ధన యోగం. సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆమె హోటల్ కట్టేసి మొగుడు మెకానిక్  సత్యానికి ఈ కబురు చెవిలో వేయాలని ఆత్రుతగా ఇంటికి బయలుదేరింది. (26-02-2012)