అగ్రరాజ్యపు పాము పగ
భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య
మీడియా, రాజకీయాలు, మరెన్నో
12, మే 2025, సోమవారం
అయాం ఎ బిగ్ జీరో (162) – భండారు శ్రీనివాసరావు
9, మే 2025, శుక్రవారం
అయాం ఎ బిగ్ జీరో (161) – భండారు శ్రీనివాసరావు
నండూరి రామమోహనరావు గారు పెట్టిన మెత్తటి తొడపాశం
1971- 2025
1971 లో
ఇండో పాక్ యుద్ధం జరిగినప్పుడు నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను. చేసేది
సబ్ ఎడిటర్ ఉద్యోగమే అయినా ఆ సమయంలో నేను చేయని పని అంటూ లేదు. అప్పటికి పెళ్లి
కాలేదు కాబట్టి రాత్రీ పగలూ తేడా లేకుండా పనిచేయడానికి సిద్ధంగా వుండేవాడిని. పగలు
వార్తలు అనువాదం చేయడం,
సాయంకాలం, రాత్రి సమయాల్లో, పీటీఐ, యుఎన్ఐ, పీఐబి ద్వారా భారత సైన్యం జారీచేసే అధికారిక
పత్రికా ప్రకటనల ఆధారంగా సైన్యం కదలికలను తెలిపే మ్యాపులను తయారుచేయడం వగైరా చేసేవాడిని. ఆ రోజుల్లో ఇప్పటిలా ముద్రణా
సౌకర్యాలు లేవు. ఏదైనా ఫోటో ముద్రించాలి అంటే ముందు దాన్ని, ఎక్కడో గాంధీ నగర్ లో
వున్న బ్లాక్ మేకింగ్ కు పంపి బ్లాక్ తయారు చేయించి తీసుకురావాలి. ఆంధ్రప్రభ ఎడిటర్ పండితారాధ్యుల నాగేశ్వర
రావు గారి కుమారుడికి ఈ బ్లాక్ మేకింగ్ దుకాణం వుండేదని జ్ఞాపకం.
ముందు
సరిహద్దులలో మొదలైన సాయుధ ఘర్షణలు,
సంఘర్షణలు పూర్తి యుద్హస్వరూపం తీసుకోవడానికి చాలా వ్యవధానమే పట్టింది. అసలు
యుద్ధం పదమూడు రోజులు సాగింది. అధికారికంగా డిసెంబరు మూడో తేదీన మొదలై, పాకీస్తానీ సైన్యాలు లొంగిపోవడంతో
డిసెంబరు పదహారో తేదీన ముగిసింది. ఈ యుద్ధ పర్యవసానమే కొత్తగా తూర్పు పాకీస్తాన్
స్థానంలో బంగ్లా దేశ్ అనే కొత్త దేశం అవతరణ.
నా జర్నలిజం
తొలి రోజుల్లో, అంటే 1970 ప్రాంతాల్లో నండూరి రామమోహన
రావు గారు నన్ను సాన పట్టారు. ఆయన రూటే సపరేటు. చెప్పాల్సింది సూటిగా, సుతిమెత్తగా చెబుతారు. దాంతో ఆ పాఠం
జీవితాంతం గుర్తుండి పోతుంది. ఆ పాఠాల్లో ఇదొకటి.
బంగ్లాదేశ్
అవతరణ సమయంలో నాటి బంగ్లా నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ పేరు పలుసార్లు వార్తల్లో
చోటు చేసుకునేది.
అప్పటికి
ఇంకా తెలుగు పత్రికల్లో పేరుకు ముందు శ్రీ
అనే గౌరవ వాచకం వాడుతుండేవారు. (ఇప్పటి నాయకులు అలాంటి గౌరవానికి తగరని
అనుకున్నారేమో, మరేదైనా సాంకేతిక కారణమో తెలియదు, శ్రీ, గారు, మిస్టర్ అనే పదాలకు ఇప్పుడు స్వస్తి చెప్పారు)
ఈ
నేపధ్యంలో, అదే యుద్ధ సమయంలో నేను ఒకసారి వార్తను తర్జూమా చేసే పనిలో ఓ తప్పు తొక్కాను.
“శ్రీ షేక్ ముజిబుర్ ” అని రాశాను. ఆ అనువాదం నండూరి వారి దృష్టికి వెళ్ళింది. ఆయన
వెంటనే ఒక చీటీ పంపారు. ఆ రోజుల్లో నండూరి వారి నుంచి చీటీ వచ్చింది అంటే ఓ మెమోతో
సమానం. అందులో ఇలా వుంది
“Sheikh itself is
honorific. Do not use sri before it.” - NR
మళ్ళీ
ఇప్పుడు 2025 లో రెండు దేశాల నడుమ సాయుధ
సంఘర్షణలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో ఇరవై ఆరుమంది అమాయకులైన పర్యాటకుల ప్రాణాలను
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు బలికొనడం వీటికి ప్రధాన కారణం. పాక్ జరిపిన ఈ రెచ్చగొట్టే
అమానుష చర్యతో ఉభయ దేశాల సరిహద్దులో 1971 నాటి యుద్ధ వాతావరణం కానవస్తోంది.
యుద్ధ
సమయంలో సమాచార వ్యాప్తి విషయంలో 1971 నాటికి ఇప్పటికీ వున్న పెద్ద ప్లస్ పాయింటు మీడియా/ సోషల్ మీడియా.
దురదృష్టం ఏమిటంటే అంతకంటే పెద్ద మైనస్ పాయింట్ ఇవే కావడం! ఒక ఆయుధం చేయలేని మారణహోమం
ఒక నిరాధార, కల్పిత వదంతి చేయగలగడమే ఇందుకు కారణం.
1971 యుద్ధం
తుది దశలో అంటే డిసెంబరు పద్నాలుగున నేను బయలు దేరి మద్రాసు వెళ్లాను. నా కాబోయే
భార్యను తీసుకుని మర్నాడు ఉదయం తిరుమల వెళ్లి, అక్కడ పెళ్లి తంతు ముగించుకుని అదే
రోజు రాత్రి రైల్లో బయలుదేరి డిసెంబరు పదహారో తేదీ ఉదయానికి బెజవాడ చేరాను కొత్త
కాపురం పెట్టడానికి. అక్కడ తూర్పు పాకీస్తాన్ విమోచన, బంగ్లాదేశ్ అవతరణ. ఇక్కడ,
ఎంతో కాలంగా అంతూపంతూ లేకుండా సాగుతున్న నా ప్రేమ పురాణానికి పెళ్లితో శుభం
కార్డు.
బంగ్లా
యుద్ధంతో నాకున్న బాదరాయణ సంబంధం ఇది.
కొద్ది
సంవత్సరాల క్రితం, భారత స్వాతంత్రోత్సవ
అమృత ఘడియల్లో రేడియో శ్రోతలకు 1971
యుద్ధంలో పాల్గొన్న ఒక సైనికాధికారిని పరిచయం
చేసే మహత్తర అవకాశం నాకు దక్కింది.
ఇంటర్వ్యూ లాంటి ఈ పరిచయ కార్యక్రమంలో
నాకు బాగా పరిచయం వున్న వ్యక్తినే పరిచయం చేశాను. ఆయనే బ్రిగేడియర్ ఎస్, శ్రీరాములు. ఆయన ఎవరో కాదు, బెజవాడ ఎస్సారార్ కాలేజీలో నా సహాధ్యాయి.
బ్రిగేడియర్
శ్రీరాములు ఉమ్మడి
తెలుగు రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో జన్మించారు. విజయవాడ ఎస్సారార్ కాలేజీలో
చదివారు. గ్రాడ్యుయేషన్ తరువాత సైన్యంలో అధికారిగా చేరారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన
1971 ఇండో పాక్
యుద్ధంలో భారత సైన్యం తరపున పాల్గొన్నారు. మౌంటెన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కు నాయకత్వం
వహిస్తూ, 2003లో
పదవీ విరమణ చేశారు.
నేను
అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు సంక్షిప్తంగా.
“మా
కుటుంబంలోనే కాదు, మా ఊరి నుంచి కూడా ఎవరూ
ఆర్మీ లో చేరాలని ఆలోచించే వారు కాదు. ఐతే 1962 లో చైనా యుద్ధం జరిగే సమయానికి నేను
ఉంగుటూరులో స్కూల్లో చదువుకుంటున్నాను. రక్షణనిధి చందా పోగు చేయడం కోసం స్కూలు పిల్లలని
వరి పొలాల్లో కోతలకు పంపారు. మేమందరం చాల ఉత్సాహంగా కోతలు కోస్తుంటే ఓ రైతు
నన్ను చూసి, 'అంత
సరదాగా పని చేస్తున్నావు, ఆర్మీలో చేరి
యుద్ధం చేస్తావా ?' అని
సరదాగానే అడిగారు.
నా మనసులో ఆ మాట నాటుకు పోయింది. ఆ తరవాత 1965 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగే
సమాయానికి నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ లో చదువుతున్నాను. ఆ సమయంలో రోజూ
రేడియోలో యుద్ధం వార్తలు వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు నా మనసులో ఆర్మీలో చేరాలనే
ఆలోచన మరింత బలపడింది. అదే లక్ష్యంగా పెట్టుకుని డిగ్రీ చదువుతూనే ఆర్మీ
సెలెక్షన్స్ కి ప్రిపేర్ అయ్యాను. 'యద్భావం
తద్భవతి' అన్నట్లు
డిగ్రీ అవగానే ఆర్మీ ఇంటర్వ్యూ కి వెళ్లడం, సెలెక్ట్ అవడం జరిగిపోయాయి. ఆలా
లక్ష్యం, శ్రమ,
అదృష్టం అన్నీ
కలిసొచ్చాయి.
“అమృత
మథనం కథ మనందరికీ తెలిసిందే. దేవతలూ రాక్షసులూ మేరు పర్వతాన్ని వాసుకి అనే
సర్పాన్ని తాడుగా ఉపయోగించి సుదీర్ఘ కాలం క్షీర సాగర మథనం చేసారు. ఒకదాని తరవాత
ఒకటిగా మంచి వస్తువులు, చెడ్డ
వస్తువులు ఉద్భవించాయి. హాలాహలాన్ని నిర్మూలించడానికి దేవతలు శివుని
సహాయం కూడా తీసుకోవలసి వచ్చింది.
“స్వతంత్ర
భారతదేశ చరిత్ర కూడా అమృత మథనం లాగే సాగుతోంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాసుకి
మాదిరిగా తాడులాగా పని చేసి, మథనం
ఆగకుండా చూస్తూ, మంచి
ఫలితాలు వస్తూనే ఉండేలా, చెడ్డ
వస్తువులొస్తే వాటిని నిర్మూలించడానికి పనిచేసే ప్రమథగణాల వలె పని చేస్తున్నాయి. ఈ
బ్రహ్మయజ్ఞంలో, తాడులో
ఒక చిన్న పోగులా నా జీవితం సాగిపోయింది.
“అయితే, ఏ యజ్ఞానికైనా రక్షణ అవసరం.
విశ్వామిత్రుడంతటి మహర్షి తన యజ్ఞానికి శ్రీ రాముల వారి సహాయం తీసుకున్నారు. అలాగే
స్వతంత్ర భారత అమృత మధన యజ్ఞానికి ఇండియన్ ఆర్మీ ఎల్లకాలం రక్షణ కల్పించింది,
కల్పిస్తుంది
కూడా.
“విరోధి
దేశాలే కాదు, దేశంలోపల
కూడా చాలా దేశ విరోధ శక్తులు పని చేస్తున్నాయని అందరికీ తెలుసు. విరోధి
దేశాలతో యుధ్ధాలే కాకుండా, అంతర్విరోధ శక్తులతో కూడా సైన్యం ఎన్నోసార్లు తలపడే
అవసరాలొచ్చాయి.
“ఆర్మీలో
చేరడం ఎలా జరిగిందో మీకు చెప్పాను. చేరిన తరువాత ట్రైనింగ్ లో కొంత వరకు ధైర్యం,
స్థైర్యం,
యుద్ధ విద్యలు
నేర్చుకుంటాం. నా అదృష్టమేమంటే చేరిన కొన్ని నెలలలోనే యుద్ధంలో పని చేసే అవకాశం
దొరికింది. పాకిస్తాన్ విమానాలు జారవిడిచే బాంబులు, గన్స్ నుంచి వెలువడే తూటాలు, అన్నీ అనుభవించాను . మొదట్లో కొంచెం
భయం వేసిన మాట నిజమే. కానీ త్వరలోనే అలవాటై పోయింది. 'నా పేరు రాసి ఉన్న బులెట్ వచ్చే వరకు
నాకేం కాదు' అన్న
ధైర్యం ఈ రోజు వరకు నన్ను నిర్భయంగా ఉంచుతోంది.
“సైన్యంలో
మాకు సపోర్ట్ ఉండేది కానీ సోల్జర్ ఫామిలీస్ కి, ముఖ్యం గా భర్తలు బోర్డర్ లో
ఉన్నప్పుడు ఒంటరి గా ఉండే మహిళలకి ఏ రకమైన సపోర్ట్ ఉండేది కాదు. పైగా మా రోజుల్లో
ఇళ్లల్లో టెలీఫోన్స్ లేవు, మొబైల్
ఫోన్ అప్పటికి రాలేదు. ఒక చిన్న అనుభవం చెపుతాను.
“1988
లో నేను
కాశ్మీర్ లో, భార్యా
పిల్లలూ హైద్రాబాద్ లో ఉన్నాం. మా అబ్బాయి కి ఏడేళ్లు, అమ్మాయికి ఐదేళ్లు. ఒక రోజున మా
అమ్మాయి లాల్ బజార్ దగ్గర స్కూటర్ కింద పడింది. బాగా దెబ్బలు తగిలాయి. నాకు ఈ
ఆక్సిడెంట్ గురించి తెలిపే సౌకర్యం లేదు. ఇన్లాండ్ లెటర్ రాస్తే అది మా యూనిట్
చేరడానికి 20 రోజులు
పట్టింది. నేను యూనిట్ నుంచి 200 కి మీ
దూరంలో ఒక పర్వతం పైన డ్యూటీలో ఉన్న్నాను. సో, నాకు ఆ ఉత్తరం చేరడానికి ఇంకో 15
రోజులు
పట్టింది. ఆ తరవాత లీవ్ దొరకలేదు. పాపని చూడడానికి 4 నెలల వరకు రాలేక పోయాను. ఈ రోజుకి కూడా
అది గుర్తొస్తే బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం?
“ఇలాంటి
అనుభవాలు ప్రతి సైనికుడికి తప్పవు. అయితే 32 సంవత్సరాలు సేవ, సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యాలు తలుచుకుంటే నాకే
కాదు, నా భార్య,
పిల్లలు కూడా
గర్వంగా ఫీల్
అవుతారు. సర్వీస్ లో దాదాపు 13 సంవత్సరాలు
టెర్రరిస్టులని వేటాడుతూ గడిపాను. రిటైర్ అయిన రోజు గూడా ఒక టెర్రరిస్ట్ నా మీదికి
ఫైర్ చేసాడు. ఆ బులెట్ మీద నా పేరు లేదు గనక నేను మీ ముందున్నాను. ఇంత సేవచేసే
అవకాశం దొరకటం అదృష్టం కాదా?
“ఇది
నా అమృత మంథన యాత్ర. నా ముందు, నా
తరవాత భారత సైన్యం సేవ నిరంతరం సాగుతుంది, అమృతం ఉద్భవిస్తూనే ఉంటుంది”
ఆ రోజు
బ్రిగేడియర్ శ్రీరాములు చెప్పినట్టే, భారత
సైన్యం దేశం పట్ల తన బాధ్యతలను
నిర్వర్తిస్తూనే వుంది. ఈ నాడు కూడా మనందరం చూస్తూనే వున్నాం.
అలాంటి
వీరులకు సాల్యూట్ చేయడం, వారు
చేస్తున్న త్యాగాలకు కృతజ్ఞులుగా వుండడం ఒక్కటే మనం చేయగలిగింది.
1971 యుద్ధ విరమణ, బంగ్లాదేశ్ అవతరణకు సంబంధించిన ఒప్పంద పత్రంపై ఇండియన్ లెఫ్ట్ నెంట్ జనరల్ జగ్ జిత్ సింగ్ అరోరా, పాకీస్తాన్ ఆర్మీ తరపున ఏ.ఏ.కే. నియాజీ సంతకాలు చేశారు.
8, మే 2025, గురువారం
అయాం ఎ బిగ్ జీరో (160) – భండారు శ్రీనివాసరావు
హమే తుమ్సే ప్యార్ కిత్ నా......
“ఇంకా
ఏమన్నా మనసులో వుంటే చెప్పండి. భగవంతుడు దయ వల్ల మాకు ఏ లోటు లేదు” అన్నారు శ్రీ
వాస్తవ్ గారు మా ఆవిడా నేనూ అడగడానికి మొహమాటపడుతూ మొహాలు చూసుకుంటూ వుంటే.
“ఏం
లేదండీ! పెళ్లి వీలైనంత సింపుల్ గా జరపాలని మా వారి కోరిక. లాంఛనాలు ఏవీ వద్దు. మాది గుళ్ళో పెళ్లి. అంచేత పిల్లల పెళ్ళిళ్ళకు ఆర్భాటాలు
ఎందుకు అని ఆయన ఆలోచన. మీకీ విషయం చెప్పమని నాతో చెప్పారు’ అంది మా ఆవిడ.
‘ఆ
ఒక్కటీ తప్ప’ అన్నట్టు ఆయన మొహం చూడగానే అర్ధం అయింది.
‘నాకు
ఒక్కతే అమ్మాయి, ఒక్కడే అబ్బాయి. వీలైనంత ఘనంగా చేయాలని కోరిక.
పోనీ ఒక పని చేద్దాం. ముహూర్తాలు చూసుకుని ఇక్కడే, హైదరాబాదులో ఒక మంచి కళ్యాణ మంటపంలో పెళ్లి చేద్దాం.
కావాలంటే నేను రిసెప్షన్ రాంచీలో పెట్టుకుంటాను. మంచి మంటపం చూద్దాం పదండి’
అన్నారాయన.
మా
అత్తామామలకు కూడా మా ఆవిడ ఒక్కతే అమ్మాయి. పైగా మగపిల్లలు కూడా లేరు. పాతికేళ్ళ
క్రితం నేను మా మామగారితో చేసిన మాటల యుద్ధం గుర్తుకు వచ్చింది. పెళ్లి వద్దు, పెళ్ళాం కావాలి అంటూ నేను పెళ్ళిళ్ళ
మీద చేసిన పోరాటం జ్ఞాపకం వచ్చింది. దానివల్ల సాధించింది ఏమిటే అందరి కళ్ళల్లో
కన్నీళ్లు తప్ప. అంచేత, ఆయన మాటలకు నేను
ఏమీ జవాబు చెప్పకుండా క్లుప్తంగా సరే అన్నాను.
ఆ
రోజుల్లో ఇన్నిరకాల పెళ్లి మంటపాలు,
పెళ్లి రిసార్టులు లేవు. శ్రీధర్ ఫంక్షన్
ప్యాలెస్ లో చేస్తే గొప్ప అనుకునే రోజులు. అలా అయిదారు ఫంక్షన్ హాల్స్ చూశాము.
ఆయనకు ఏదీ నచ్చినట్టు లేదు. తిరిగి వస్తూ సత్యసాయి కళ్యాణ మంటపం (నిగమాగమం) లోకి
వెళ్ళాము. ఆ హాలూ అదీ చూడగానే ఆయనకు తెగ నచ్చేసింది. ఎంతగా నచ్చింది అంటే, అందులో ఖాళీ వున్న రోజునే ముహూర్తం పెట్టుకుందాం
అనేంతగా.
శ్రీ
వాస్తవ్ గారిది ప్రతిదీ ఒక స్థాయిలో వుండాలి అనే మనస్తత్వం. చాలా ఏళ్ళు జర్మనీలో
వుండివచ్చారు. సూటూ బూటూ టై లేకుండా ఆయన్ని చూసినవారు తక్కువ. ఐ డోంట్ వాంట్
నెంబర్ వన్. ఐ వాంట్ ఏ వన్ అనే వారు.
1999 నవంబరు 29 అర్ధరాత్రి సందీప్ పెళ్లి. సత్యసాయి
కళ్యాణ మండపంలో. ఆ రోజుల్లో హైదరాబాదులో ఆ మండపం కాసింత ఖరీదు వ్యవహారమైనా, శ్రీ
వాస్తవ్ దాన్ని ముచ్చటపడి ఎంపిక చేసుకున్నారు.
పెళ్ళికి ఒక రోజు ముందే శ్రీ వాస్తవ్ గారు, ఆయన భార్య ఇందూ శ్రీ వాస్తవ్ వారి సమీప బంధువులు చాలామంది రాంచీ నుంచి తరలి వచ్చారు. కొందరికి హోటళ్ళలో బస
ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యులైన ఆడపెళ్ళివారికి మా మేనకోడలు విజయ భర్త జీవీఆర్ రవిగారు,
శ్రీనగర్ కాలనీలో, నిగమాగమానికి నడక దూరంలో కొద్ది రోజుల క్రితమే కొనుక్కుని, గృహప్రవేశం కూడా చేయని కొత్త ఫ్లాటును
విడిదిగా ఇచ్చారు.
ఈ
పెళ్ళికోసం , మా ఆవిడకు ఆప్త మిత్రురాలు, మా పొరుగింటి అరుణ, ఆవిడ
భర్త శేఖర రెడ్డి దంపతులు ( ఇప్పుడు నేషనల్ స్టార్ గా వెలిగిపోతున్న పుష్ప
ఫేం, అల్లు అర్జున్ వీరి అల్లుడే) మూడు
రోజులపాటు తమ ఖరీదైన కారును డ్రైవర్ తో సహా
మా అధీనంలో ఉంచారు. మా తరపున అయ్యే ఖర్చులకోసం ఆఫీసులో పీ ఎఫ్ లోన్ లోన్ తీసుకున్నాను. ఆ రోజుల్లో ఆఫీసులో నా హవా
అలా వుండేది. కరెంటు బిల్లు కట్టడం కోసం పీ ఎఫ్ లోన్ కు అప్లయి చేసినా కూడా మారుమాట్లాడకుండా శాంక్షన్
చేసేవాళ్ళు.
అమీర్
పేటలోని శైలి అపార్ట్ మెంటు నుంచి శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమం వరకు
పెళ్లి బారాత్ సాగింది. అదీ మాకు కొత్తే. ఇలాంటి పోకడలకు అలవాటుపడిన ప్రాణాలు
కావు. సందీప్ స్నేహితులు పవన్, సుధీర్, సుధాకర్, రాజశేఖర్, కృష్ణ, శేషిరెడ్డి,
కోటిరెడ్డి, మా చిన్న వాడు సంతోష్ దారిపొడుగునా నృత్యాలు చేస్తూ మంచి ఉత్సాహం
కలిగించారు. శ్రీ వాస్తవ్ గారి కోరిక మేరకు సికిందరాబాదు నుంచి మిలిటరీ బ్యాండు
ఏర్పాటు చేశాను. చేతిలో డబ్బులు వుండేవి కాదు కానీ, బాగా డబ్బులు వున్నవాళ్ళు కూడా
చేయలేని పనులు సునాయాసంగా నోటిమాటతో చేయగలిగిన రోజులవి.
ఆ రోజు
ఉదయం కళ్యాణ మండపంలోనే ఉపనయనం. ఆ ఏసీ హాల్లో హోమం చేయడానికి నిబంధనలు అడ్డం వచ్చి, బయట కారిడార్లోనే ఆ కార్యక్రమం
పూర్తిచేసాము. అదే ఇబ్బంది పెళ్ళికి కూడా ఎదురయింది. (ఇప్పుడు ఆ నిబంధనలను సడలించినట్టున్నారు)
సాంప్రదాయ బద్ధంగా కన్యాదానం చేయాలనుకున్న
శ్రీవాస్తవ్ దంపతులు లోపల రిసెప్షన్ ఏర్పాట్లు చేసుకుని బయట ఆవరణలో అప్పటికప్పుడు షామియానాలు
వేయించి, కుర్చీలు తెప్పించి మరో పెళ్లి ఖర్చు
మీద వేసుకున్నారు.
బెజవాడ
నుంచి ఈ పెళ్ళికి వచ్చిన మా హనుమంతరావు బావ గారు పెళ్లి జరిగే వేదికకు దగ్గరలో కుర్చీ
వేయించుకుని, ఇటు దక్షిణాది పద్దతిలో, అటు ఉత్తరాది విధానంలో ఏకకాలంలో
తెల్లవారుఝాము దాకా కొనసాగిన వివాహ క్రతువును ఆ సాంతం శ్రద్ధగా చూసారు. రాంచీ
నుంచి వచ్చిన మహిళా పురోహితురాలు తాను చదువుతున్న ప్రతి మంత్రానికి అర్ధ
తాత్పర్యాలను వివరించి చెప్పడం హనుమంతరావు బావగారిని ఆకర్షించింది. పెళ్లిని ఒక
తంతులాగా ముగించడం కాకుండా ఆ క్రతువును నిష్టతో నిర్వహించడం చూసి ఆయన ఆ మహిళా
పురోహితురాలిని మెచ్చుకున్నారు కూడా.
నా
హిందీ అంతంత మాత్రం. హిందీ సినిమాలకు వెళ్ళినప్పుడు హాల్లో అందరూ పాప్ కార్న్
తింటుంటే నేను మాత్రం మా ఆవిడ మెదడు కొరుక్కుని తింటుండేవాడిని, ఆ హీరో ఏమన్నాడు? ఆ హీరోయిన్ ఎందుకలా ఏడుస్తోంది? అని అడ్డమైన ప్రశ్నలు వేస్తూ.
ఇప్పుడు
హఠాత్తుగా ఈ హిందీ ప్రస్తావన దేనికంటే...
అంతకుముందు
రోజు అంటే నవంబరు 28 న రవి గారి అపార్ట్ మెంటు ‘డోఎన్’ లో
మెహందీ కార్యక్రమం. అప్పటిదాకా ఇలాంటి తంతులు ఎరగని వాళ్ళం కనుక మెహందీలో
చిన్నాపెద్దా అందరూ సరదాగా పాటలు పాడడం చూసి ఎంతో సంబరపడ్డాము.
అదిగో
అప్పుడు పెళ్లి కుమారుడు సందీప్ గోడనానుకుని నిలబడి, క్రీగంట పెళ్లి కుమార్తె భావనను చూస్తూ పాడిన పాటే ఇది. “హమే తుమ్సే
ప్యార్ కిత్ నా......”
అర్ధం
నాకంతగా బోధపడలేదు కాని, రాంచీ నుంచి వచ్చిన పెళ్లి వారందరూ తెగ
మెచ్చుకున్నారు. ఈ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ మర్నాడు కాక ఆ మర్నాడు (డిసెంబరు
ఒకటిన ) బేగంపేటలోని ఎయిర్ పోర్టు దగ్గరలోని ఒక హోటల్లో జరిగిన మా రెండో అన్నయ్య
రామచంద్రరావు గారి కుమారుడు రాజేష్, ప్రియల
పెళ్ళికి కూడా హాజరయి వధూవరులను ఆశీర్వదించి వెళ్ళడం భండారు కుటుంబానికి ఒక
మరపురాని తీయటి జ్ఞాపకం.
పైన
పేర్కొన్న ఆ హిందీ పాటకి గూగులమ్మ లింకు:
https://www.youtube.com/watch?v=iJllh7l-D3g
కింది ఫోటోలు :
పెళ్ళికి హాజరై నూతన దంపతులను అభినందించి, ఆశీర్వదించిన ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు
ఇప్పుడు అంతటి వ్యవధానం ఉండకపోవచ్చు కానీ, ఇరవై ఆరేళ్ల క్రితం జరిగిన ఈ పెళ్ళికోసం రాంచీ నుంచి వచ్చిన ఆడపెళ్లివారితో తీరికగా ముచ్చటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
(ఇంకావుంది)
6, మే 2025, మంగళవారం
అయాం ఎ బిగ్ జీరో (159) – భండారు శ్రీనివాసరావు
భాష అవసరం బాధల్లో వున్నప్పుడే
నాలాగే మా పిల్లలది కూడా ప్రేమ వివాహాలే. కాకపోతే నాలాగా కాకుండా వాళ్లది నిఖార్సయిన ప్రేమ. భార్యాపిల్లలను వాళ్ళు చూసుకున్నంత ప్రేమగా నేను ఏనాడూ చూసుకోలేదు.
భావన పట్టుపట్టడంతో వాళ్ళ నాన్న గారు శ్రీ వాస్తవ్ గారు భార్యను ఇందు శ్రీవాస్తవ్ ని వెంటబెట్టుకుని రాంచీ నుంచి విమానంలో హైదరాబాదు వచ్చి, ఏదో స్టార్ హోటల్లో దిగి, మర్నాడు ఉదయం చెప్పాపెట్టకుండా సరాసరి మా ఇంటికి వచ్చేశారు, మా పెద్దవాడు సందీప్ కు పిల్లను ఇస్తామని చెప్పడానికి. రెండు గదుల ప్లాటు. రెండో బెడ్ రూమ్ లేదు. రాంచీలో వాళ్లది లంకంత కొంప (పెళ్ళయిన తర్వాత తెలిసింది). రాజ్ భవన్ మాదిరిగా ఇంటి ముందూ వెనుకా లాన్స్. తూగుటుయ్యాలు. ఇంటి గేటు వద్ద ఘూర్ఖా. ఇద్దరు డ్రైవర్లు. ఇంట్లో ప్రతి పనికి ఒక పని మనిషి. అంతా రాజవైభోగం. పెళ్లి అయ్యేవరకు మా వాడికి కూడా ఈ విషయాలు తెలవవు.
శ్రీ వాస్తవ్ గారు మా ఇంట్లోకి వస్తూనే తేరిపార చూసారు. మా స్థితిగతులు ఇట్టే తెలిసిపోయినట్టున్నాయి. అయినా ఒక పక్క కూతురు పట్టుదల. దాంతో నోరు తెరిచి చెప్పారు, సంబంధం కోసం వచ్చామని.
నేను తటాలున అన్నాను, మీ అమ్మాయిని వద్దనడానికి నాకు ఒకే ఒక అభ్యంతరం వుందని. నా నోట ఆ మాట విని భార్యాభర్తలు ఇద్దరూ నివ్వెర పోయారు. నేను నా భార్యని పిలిచి చెప్పాను. నేను చెప్పే ప్రతిమాటా వాళ్లకు బాగా అర్ధం అయ్యేలా చెప్పు. ఏ మాత్రం తభావతు వచ్చినా వాళ్ళు వేరే విధంగా అర్ధం చేసుకుంటారు అని.
మా ఆవిడకు కొంచెం కొంచెం హిందీ వచ్చు.
నేనిలా చెప్పాను.
“ మీ అమ్మాయికి తెలుగు రాదు. భాష అనేది అందరం సంతోషంగా వున్నప్పుడు ఎలా మాట్లాడుకున్నా సరిపోతుంది. కానీ ముందు ముందు ఎప్పుడో మా వల్లనో, మావాడి వల్లనో కారణం ఏదైతేనేం , మీ అమ్మాయి మనసుకు కష్టం కలిగితే, అది మాతో చెప్పుకుని స్వాంతన పొందడానికి మా భాష తనకు తెలియాలి. మేము ఆమెని ఊరడించగలగాలి. అందుకోసమే భాష. ఏదో విధంగా తెలుగు నేర్చుకుంటాను అంటే ఇక నుంచి భావన మీ అమ్మాయి కాదు, ఈ క్షణం నుంచి మా అమ్మాయి”
నా ఈ మాటలతో రాంచీ దంపతులకు నోట మాట రాకపోగా, కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
నా చేతులు పట్టుకుని చెప్పారు, ఈ క్షణం నుంచి భావన మీ అమ్మాయే అని.
ఆ విధంగా మా ఇంట్లోకి పెద్ద కోడలుగా భావన కుడి కాలు పెట్టింది.
పెళ్ళి నాటికి తెలుగు ఒక్క ముక్క రాదు. ఇంట్లో అందరూ గలగలా తెలుగులో మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బిక్క మొగం వేసుకునేది.
ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు ఈ సంగతి గుర్తు చేసుకుంటూ భావన చెప్పింది నాతో . "అప్పుడు అత్తయ్యే నాకు తోడు నిలిచింది. ప్రతివారం ఒక తెలుగు సినిమాకు తీసుకువెళ్ళే వారు. తను నాకు హిందీలో చెబుతూ నాకు అర్థమైంది తెలుగులో చెప్పమనే వారు. ఆ విధంగా నాకు కొద్దికొద్దిగా తెలుగు నేర్పించారు. అలాగే ఇంట్లో పనిచేసే అమ్మాయి కళ నాకు మరో తెలుగు టీచరు. ఇక సంతోష్ మరిది అయినా చాలా చనువుగా బహురాణి అంటూ తెలుగు విషయంలో చాలా సాయం చేసేవాడు. నేను సఖిని కడుపుతో ఉన్నప్పుడు వేవిళ్ళు. ఆ రోజుల్లో అత్తయ్య నన్ను కడుపులో పెట్టి చూసుకున్నారు. "మామయ్య కోసం కానీ , ఇంకా ఎవరికోసం కానీ వెయిట్ చేయవద్దు. వేళకు అన్నం తిను. వాళ్ళకు వీలైనప్పుడు వాళ్ళు తింటారు" అంటూ నాకు అన్నం పెట్టేవారు. సంతోష్ అయితే, కాళ్ళు పీకుతున్నాయి అని మనసులో అనుకుంటే చాలు, ఎలా కనుక్కునేవాడూ, ఏమాత్రం సంకోచించకుండా నా కాళ్ళు పట్టేవాడు. బంగారం లాంటి మరిది. వాడు పోయాడు అంటే నాకు ఈ నాటికీ నమ్మకం కుదరడం లేదు. దేవత లాంటి అత్తయ్య పోయింది. వజ్రం లాంటి సంతోష్ పోయాడు "
అని భావన కళ్ళ నీళ్ళు పెట్టుకుంది.
నా కళ్ళల్లో నీళ్ళు ఎప్పుడో ఇంకి పోయాయి.
నా పెళ్లి నాటికి నా అత్తామామలను చూడలేదు. పెళ్ళికి ఒకరోజు ముందు మద్రాసులో వాళ్ళని చూశాను. మర్నాడే తిరుపతిలో పెళ్లి.
ఈ విషయంలో నా కోడళ్ళు కొంత మెరుగు. పెళ్ళికి ముందే వాళ్ళు, నన్ను కాకపోయినా మా ఆవిడను చూసారు, మాట్లాడారు. బహుశా తర్వాతే వాళ్ళు తమకు కాబోయే వాళ్లకు ఓకే చెప్పారని అనుకుంటున్నాను. అదే ముందు నన్ను చూసి మాట్లాడి వుంటే ఎలా వుండేదో.
ఎక్కడో నాగపూర్ దగ్గర రాం టెక్ లో ఇంజినీరింగ్ చదువుకుంటున్న కొడుకు, ఓ తెల్లవారుఝామున ఇద్దరు ఆడపిల్లలను వెంటబెట్టుకుని ఆటోలో ఇంటికి వస్తే, ఆ తల్లి మనసు ఎలా వుంటుంది. ఇదిగో ఇలా.
అప్పటికి తెలుగు బొత్తిగా తెలియని ఆ ఇద్దరు ఆడపిల్లల్లో ఒకమ్మాయి భావన మాటల్లో:
అత్తయ్య గురించి నా మొదటి జ్ఞాపకం:
హైదరాబాదులో జీ ఆర్ ఈ పరీక్ష రాయడం కోసం ఒకరోజు నా స్నేహితురాలు స్వాతితో కలిసి నాగపూర్ నుంచి రైల్లో హైదరాబాదు చేరాను. అదే రైల్లో సందీప్ కూడా వస్తున్నాడు అని నాకు తెలియదు. కాలేజీ మేట్ గా తప్పించి అప్పటికి సందీప్ గురించి నాకేమీ తెలియదు. మేమిద్దరం హైదరాబాదుకు కూడా కొత్త. ఇంకా తెలవారలేదు. అప్పుడు ఊబెర్, ఓలాలు కూడా లేవు. దాంతో సందీప్ ని అడిగాము, నువ్వు వెళ్ళే దోవలో మమ్మల్ని దింపి వెడతావా అని. వెడుతుంటే తెలిసింది మేము వెళ్ళాల్సిన చోటుకు, అతడు వుండే ఇల్లు దగ్గరే అని. దాంతో అతడ్ని ముందు దింపేసి మేము వెడదామని అనుకున్నాం.
నాకు బాగా గుర్తుంది. ఇంటి బయట అంతా చీకటిగా వుంది. ఉదయం అయిదున్నర అయివుంటుంది. దుర్గానగర్ లో ఒక ఇంటి ముందు ఆటో ఆగింది. సందీప్ దిగి గేటు తెరిచాడు. గేటు చప్పుడు వినగానే ఎవరో తలుపు తెరిచారు. ద్వారం దగ్గర చిరునవ్వుతో ఒకామె కనిపించింది. చూడగానే ఆ మొహంలో ఆప్యాయత కనిపించింది. సందీప్ అమ్మా అంటూ ఆమెను పలకరించాడు. తలుపు తీయడానికి సిద్ధంగా వున్నారు అంటే ఆవిడకి సందీప్ వస్తున్న సంగతి తెలిసి వుండాలి. అప్పుడావిడ ఆటోలో వున్న మా ఇద్దర్నీ చూసారు. సందీప్ నన్నూ స్వాతినీ పరిచయం చేశాడు.
చిన్న చిన్న విషయాలే కానీ అప్పుడు ఆమె చక్కటి ఆకుపచ్చ చీరెలో వున్నారు. చాలా ప్రేమతో మా ఇద్దర్నీ లోపలకు రమ్మన్నారు. మీరు ఫ్రెష్ అయ్యేలోగా టిఫిన్ చేస్తాను, తిని వెడుదురు కానీ అని బలవంత పెట్టి తీసుకు వెళ్ళారు. ఆమె పిలుపులో ఎంతో ఆప్యాయత, ఆదరణ. కొడుకు వెంట తెల్లవారుఝామున ఇంటికి వచ్చిన ముక్కూ మొగం తెలియని ఇద్దరు ఆడపిల్లల్ని ఆదరంగా లోపలకు పిలిచి, టిఫిన్ చేసి వెళ్ళండి అనే తల్లిని నేను అంతవరకూ చూడలేదు.
ఎందుకో ఏమిటో తెలియదు ఆమెను మళ్ళీ చూడాలనే కోరిక నాలో కలిగింది. మళ్ళీ చూస్తాను అనే నమ్మకం కూడా నాలో పొడసూపింది.
ఆ క్షణంలో మాకు ఎవ్వరికీ తెలియదు. దేవుడి ఆలోచన గురించి. మరో ఇరవై ఏళ్ళ పైచిలుకు ఆ దేవత ఆదరణలో నా జీవితం గడుస్తుందని, కోడలిగా ఆ ఇంట అడుగుపెట్టి, నా అత్తగారిగా ఆమె ఆపేక్ష చూరగొంటానని.
భౌతికంగా లేకపోయినా స్వర్గం నుంచి ఆమె దీవెనలు మాకు సదా అందుతూనే వుంటాయని నా నమ్మకం” – భావన
కింది ఫోటో:
అత్తకోడళ్ళ అనుబంధం
(ఇంకావుంది)
5, మే 2025, సోమవారం
అయాం ఎ బిగ్ జీరో (158) – భండారు శ్రీనివాసరావు
ప్రపంచం చేసిన ప్రపంచయుద్ధం
రెండో
ప్రపంచయుద్ధం ముగియడానికి కేవలం ఇరవై ఆరు రోజుల ముందు నేను ఈ భూమి మీద పడ్డాను. ఆ యుద్ధం
గురించి కళ్ళారా చూసిన వాళ్ళు కానీ,
చెవులారా విన్న వాళ్ళు కానీ ఇప్పుడు వుండి వుంటే వారి సంఖ్య చాలా తక్కువగా
వుంటుంది.
ఇది
ఇప్పుడు ఎందుకంటే వర్తమాన తరం యుద్ధం కాని మరో ప్రపంచయుద్ధాన్ని కనులారా
వీక్షించింది. ఆ యుద్ధపు తాలూకు అనుభవాలు ఈ తరంవారి మనసులో ఇంకా పచ్చిగానే
వున్నాయి. ఎందుకంటే ఈ యుద్ధం ముగిసి మూడు నాలుగేళ్లే అయింది. ఇది ఒక దేశం మరో
దేశంపై సాగించిన యుద్ధం కాదు. ప్రపంచ దేశాలన్నీ ఒక్కటై ఒక మహమ్మారిపై జరిపిన
సంగ్రామం. ఈ యుద్ధంలో వాడిన ఆయుధాలు బాంబులు, తుపాకులు కాదు. అకుంఠిత దీక్షతో, నిర్విరామంగా ప్రాణాలకు తెగించి అచిరకాలంలోనే కనుగొన్న
కొన్ని వాక్సిన్లు,కనీవినీ ఎరుగని సంక్షోభ కాలంలో యావత్ మానవాళి
ప్రదర్శించిన ఐక్యత. రేపు అనేది వుంటుందా వుండదా అని కంటి మీద కునుకు లేకుండా
గడిపిన జనాలకు ఒక్క రేపేమిటి, యుద్ద్ధం ముగిసి మూడేళ్లు గడిచాయి.
ఆ
సంక్లిష్ట సమయంలో సాంఘిక మాధ్యమాలలో కానవచ్చిన ఒక పోస్టు నాకు బాగా జ్ఞాపకం వుంది.
‘అతడు
తన తెలివితేటలతో ఎంత సంపాదించాడు అంటే ఆ డబ్బుతో మొత్తం నగరాన్నే కొనగలనని
మిత్రులతో చెప్పేవాడు. చివరకు కరోనా బారిన పడి, ఆక్సిజన్ కొనుక్కోలేక చనిపోయాడు’
అదేమిటో
చిత్రం. కరోనా రక్కసి కోరలకు చిక్కి రోజుల
వ్యవధిలో చనిపోయిన వారు వున్నారు. ఆసుపత్రులలో రోజుల తరబడి క్వారంటైన్ లో
బిక్కుబిక్కుమంటూ గడిపి బతికి బయట పడిన వారూ వున్నారు. ఖరీదైన హాస్పిటల్స్ లో చేరి విగత జీవులు అయిన వారున్నారు. చేరడానికి
జనం సంకోచించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో గతిలేక చేరి, బతికి బట్టకట్టిన వారున్నారు.
కీడులో మేలులా, కరోనా కొంత మంచి కూడా చేసింది.
మునుపు సర్కారు దవాఖానా అంటే జనంలో చిన్న చూపు. కరోనా బాధితులను ప్రైవేటు/
కార్పొరేటు ఆసుపత్రులు చేస్తున్న లూటీ గురించి తెలుసుకున్న ప్రజల దృష్టి ప్రభుత్వ
హాస్పిటల్స్ మీద పడింది. ఈ విషయంలో విశేష సేవ చేసిన ఆసుపత్రులలో హైదరాబాదులోని గాంధి ఆస్పత్రి ఒకటి.
నా కాలేజ్ మేట్ ఒకరు ఫోను చేశాడు. ఉమ్మడి రాష్ట్ర
సచివాలయంలో చాలా పెద్ద పదవిలోనే, అడిషినల్ సెక్రెటరి హోదాలో రిటైర్ అయ్యాడు. కానీ
వస్తుతః నిదానస్తుడు, నిగర్వి, పదవిని
అడ్డం పెట్టుకుని అడ్డదారులు తొక్కని వాడు. పైగా ఆధ్యాత్మిక భావాలు, దైవ
భక్తీ, పాపభీతి.
ఇలాంటి వాడికి కరోనా కష్టం వచ్చి పడింది. రెండో అబ్బాయి రామచంద్రన్
(ఇతడు ఒకప్పటి మద్రాసులో పుట్టాడు, దానితో స్కూలు రిజిస్టరులో పేరు అలా
పడింది)కు కరోనా పాజిటివ్ అనగానే మనవాడి
గుండె జారిపోయింది. దానికి ప్రధాన కారణం కరోనా అయితే రెండో కారణం కొడుకు
పుట్టుకతోనే బధిరుడు. ఇలాంటి వాడు ఆసుపత్రిలో ఒంటరిగా ఎలా ఉండగలుగుతారు అనేది నా
స్నేహితుడి బెంగ. గాంధి ఆసుపత్రిలో చేర్చి నాకు ఫోను చేశాడు. కానీ నేనూ అతడి
పడవలోనే ప్రయాణిస్తున్నాను. రిటైర్ అయి దశాబ్దాలు గడిచాయి. చేయగలిగింది ఒక్కటే
మంత్రి కేటీఆర్
గారికి,
గాంధీ ఆసుపత్రిలో
కోవిడ్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకరరెడ్డి గారికి వాట్సప్ లో అభ్యర్ధనలు
పంపాను. పర్వాలేదు అన్నట్టుగా ఇద్దరి నుంచి తిరుగు సందేశం వచ్చింది.
పేషెంటుకు వినికిడి సమస్య వుంది కాబట్టి ప్రత్యేక గది కన్నా క్యూబికల్స్ లో వుంటే
మంచిది అని డాక్టరు ప్రభాకరరెడ్డి గారు అన్నారు. అదే మంచిదయింది. ఆసుపత్రిలొ
వున్నన్ని రోజులు రోగిని కనిపెట్టి చూసుకున్నారు. ప్రతిరోజూ పరిశుభ్రమైన, పౌష్టిక
ఆహారం అందించేవారు. సిబ్బంది సైతం చాలా సేవాభావంతో పనిచేసేవారని ఆ అబ్బాయి
ఫోనులో చెబుతుంటే, ఇంకా
నయం వేరే కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్పించక పోవడం మంచిదయిందని తండ్రి
సంతోషపడ్డాడు.
మొత్తం మీద నెగెటివ్ అనిపించుకుని అతడు
డిశ్చార్జ్ అయ్యాడు. ప్రభుత్వ ఆసుపత్రులపై తనకు మంచి అభిప్రాయం లేదనీ, కానీ
ఇప్పుడా దురభిప్రాయం పూర్తిగా తొలగిపోయిందనీ ఇంటికి వచ్చిన తర్వాత తండ్రితో
చెప్పాడు.
అదే ఆసుపత్రిలో నా మేనత్త మనుమడు మురళి చేరాడు. అతడి దురదృష్టం కరోనా అతడిని
కబళించింది. అలాగే నా ముద్దుల మేనల్లుడు కొలనరావు. కరోనా బారిన పడకూడదని వాడు
తీసుకోని జాగ్రత్తలు లేవు. అయినా అది వాడిని వదిలిపెట్టలేదు. బతికించుకోవడానికి చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు.
మా మొత్తం కుటుంబాన్ని కలచివేసిన మరణాలు ఇవి.
కొన్ని
కుటుంబాలు మొత్తం కరోనా చేతికి చిక్కుకున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ఆసుపత్రిలో.
అక్కడ చోటు దొరకని వాళ్ళు ఇళ్ళల్లో ఒంటరిగా. హాస్పిటల్ లో వాళ్ళు ఇళ్లకు రాలేరు.
ఇళ్ళల్లో వాళ్ళు అక్కడికి పోలేరు. ఎక్కడివాళ్లు అక్కడే ఒంటరిగా భయంతో బాధతో.
మాట్లాడడానికి తోడు వుండరు. హాస్పిటల్ వార్డుల్లో వారికి మొబైల్స్ వుండవు. ఎవరు
ఎలా వున్నారో కనుక్కునే వీలు లేదు. జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని భయంకరమైన వాతావరణం. ఆసుపత్రిలో చనిపోతే అటునుంచి అటే మునిసిపాలిటీ
ఏర్పాటు చేసిన వాహనంలో కాటికి తరలించేవాళ్లు. అంత్యక్రియలకు నలుగురినే
అనుమతించేవారు. అది కూడా పీపీయీ కిట్లు
ధరించి వస్తేనే. శాస్త్రీయంగా అంత్యక్రియలు జరిపించే వీలే లేదు.
మురళి
చనిపోయినప్పుడు వాడి కుమారుడు తేజ
శ్రీనివాస్ తండ్రి మరణానికి చింతిస్తూ ఇలా రాశాడు. అప్పటి పరిస్థితికి ఇది అడ్డం
పడుతుంది.
“పరిగెడుతున్నాం,
ఇంట్లో
వున్ననలుగురం చేతిలో చెయ్యేసి పరిగెడుతున్నాం..
అదేమీ
పందెమూ కాదు
మాకేమి
లక్ష్యమూ లేదు
కానీ
పరిగెడుతున్నాం, పరిగెడుతూనే వున్నాం.
ఇంతలో
కంటికి కనపడని ఏదో తాడు
మా
నలుగురి కాళ్ళకి తట్టుకుంది.
మేం
ముగ్గురం పడి లేచాం,
కానీ
నాన్నే బోర్లాపడి దొర్లుతున్నాడు..
కాళ్లల్లో
శక్తి లేదేమో, మాలా లేవలేకపోయాడు!
తిప్పలు
పడ్డాడు,
శాయశక్తుల
ప్రయత్నించాడు,
అతని
ప్రాణం పెట్టి ప్రయత్నించాడు,
కుదర్లేదు!
ఒక్కసారిగా
కూలపడిపోయాడు..
నా
చేతిలోనే కాలిపోయాడు..!
"మళ్ళి
వెనక్కి రావాలంటూ" ఒట్టు వేయించుకొని,
అంబులెన్స్
ఎక్కించిందే నాన్న తాలూకు ఆఖరి జ్ఞాపకం!
“పండగకో, పరామర్శకో తిరిగి రాడానికి,
నాన్న
అత్తగారింటికి వెళ్లలేదే,
అదేదో
నిండు శూన్యానికి వెళ్ళాడు!
అమ్మ
పలకరింపుకి కూడా అందని
దూరానికి
చేరాడు!”
కింది
ఫోటోలు:
కోవిడ్
టీకా వేయించుకుంటున్న నా మేనల్లుడు కొలనరావు, మరో మేనల్లుడు పర్చా మురళి
(ఇంకా
వుంది)