30, సెప్టెంబర్ 2014, మంగళవారం

పిలుపుల పరిణామక్రమం



"నాన్నగారండీ!...... నాన్నారూ! ......నాన్నా!..... ఒరేయ్ నాన్నా!..... ఏరా నాన్నా!...... ఏం గురూ ఏంటి సంగతి మీ ఆవిడ అదేరా మా అమ్మ ఎలావుంది ? "

విభజన పూర్తికాలేదా!


ఈ ఏడాది జూన్ రెండో తేదీన మునుపటి ఆంద్ర ప్రదేశ్, తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. ఇది చారిత్రిక సత్యం.

నిన్నటికి నిన్న ఆసియా క్రీడల్లో టెన్నిస్ విభాగంలో జరిగిన మిక్సడ్ డబుల్స్ లో భారత జోడీ సానియా మీర్జా, సాకేత్ మైనేని కలిసి మన దేశం ఖాతాలో మరో స్వర్ణ పతకాన్ని చేర్చారు. సానియా మీర్జా తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్. సాకేత్ విశాఖ కుర్రవాడు. వీరిద్దరూ కలిసి సాధించిన విజయం పట్ల యావత్ దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ మన నాయకులు మాత్రం వారిని ఆంద్ర, తెలంగాణాలకు చెందినవారిగా గుర్తించి విడివిడిగా అభినందనలు తెలియచేస్తున్నారు. నగదు బహుమతులు, వేరే పురస్కారాలు అంటే అర్ధం చేసుకోవచ్చు, ఆంద్ర తెలంగాణా తేడా లేకుండా వారిద్దరూ కలిసి శ్రమించి సాధించిన విజయాన్ని 'ప్రశంసించడం'లో అడ్డొచ్చిన అడ్డుగోడలు ఏమిటో అర్ధం కాదు. నిజంగా అయాం సారీ ఫర్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్! 

      

29, సెప్టెంబర్ 2014, సోమవారం

కాపీ జోకులు



'రాత్రి రైల్లో నిద్ర పట్టక చాలా అవస్థ  పడ్డాను' ఏకాంబరం చెప్పాడు.
'ఎందుకని'
'ఖర్మ! పై బర్త్ దొరికింది'
'కింద పడుకున్నవాళ్ళని అడక్కపోయావా?'
'ఆ మాత్రం నాకు తెలియదని అనుకున్నావా! అడగడానికి కింద బర్తుల్లో ఎవరయినా వుంటే కదా! రైలంతా ఖాళీ!'

'ఏకాంబరం! నీ భార్య చనిపోయింది'
ఆ కబురు విన్న అతడికి  మతి పోయింది. భార్య లేని జీవితం వృధా అనిపించింది. వెంటనే తనుంటున్న భవనం వందో అంతస్తుకి వెళ్లి అక్కడి నుంచి కిందికి దూకాడు.
యాభయ్యో అంతస్తు దగ్గరికి రాగానే అతడికి తనకు పెళ్ళే కాలేదన్న సంగతి గుర్తుకు వచ్చింది.
పాతిక అంతస్తు దగ్గర మరో దారుణమైన విషయం గుర్తుకు వచ్చింది. తాను ఏకాంబరం కాదని, తనపేరు లంబోదరం అని. ఏం లాభం. అప్పటికే ఆలస్యం అయిపోయింది.  

హోటల్లో ఆర్డర్ చేస్తున్నప్పుడు ఏకాంబరం తలలో మెరుపు మెరిసింది. వెంటనే పరిగెత్తుకుంటూ లంబోదరం దగ్గరికి వెళ్ళాడు. అతడికి ఆరోజు గాలిలో తేలిపోతున్నట్టు వుంది. తన స్నేహితులెవరు  జవాబు చెప్పలేని ఓ చిక్కు ప్రశ్నకు సమాధానం తనకే ముందు తట్టింది.
'గుడ్డు ముందా చికెన్  ముందా అని అడుగుతుండేవాడివి కదా. ఇప్పుడు చెబుతాను చూడు. హోటల్ కు వెళ్లి ముందు ఏది ఆర్డర్ చేస్తే అది ముందు వస్తుంది'   

ఏకాంబరం భార్యను తీసుకుని హోటల్ కు వెళ్ళాడు. భార్య కాఫీ ఆర్డర్ చేసింది. తను కోల్డ్ కాఫీ తెప్పించుకున్నాడు. 'కాఫీ చల్లారి పోతుంది త్వరగా తాగమ'ని భార్యను తొందర చేసాడు. ఎందుకంటె ఆ హోటల్లో హాట్ కాఫీ అయిదు రూపాయలు. కోల్డ్ కాఫీ పది రూపాయలు. 


ఏకాంబరం ఆర్ట్ గ్యాలరీ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఓ బొమ్మ అతడికి యెంత మాత్రం నచ్చలేదు. 'ఇలాటి దరిద్రపు బొమ్మ పెట్టి,  పైగా మోడరన్ ఆర్ట్ అంటూ పబ్లిసిటీ ఒకటీ...'
అంటూ చిందులు తొక్కాడు.
'అయ్యా అది బొమ్మకాదు. ముందు, ఆ అద్దం ఎదట నుంచి బయటకు రండి' ఎవరో అన్నారు.


(స్వేచ్చానువాదం ఒక్కటే సొంతం) 

NOTE:COURTESY IMAGE OWNER


26, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పిపీలికం


అధికారం, హోదా, చదువు, డబ్బు, బ్యాంక్ బాలన్సులు ఇవి వ్యక్తుల స్తితిగతులకు కొలమానాలు కావచ్చు. కానీ అవేవీ వారిని ఈ ప్రపంచంలో పెద్దవారిని చేయలేవు. నిజానికి మనం యెంత చిన్నవాళ్ళమో, ఒకరకంగా చెప్పాలంటే పిపీలికాలమో తెలుసుకోవడానికి ఓ చిన్న చిట్కా వుంది. ఆకాశం నిర్మలంగా వున్న రాత్రి డాబా మీద వెల్లకిలా పండుకుని పైకి చూడండి. వేల కోట్ల మైళ్ళ దూరంలో వున్న నక్షత్రాలు మిణుకుమిణుకు మంటూ కానవస్తాయి. వాస్తవానికి అవి యెంత పెద్దవో ఈరోజుల్లో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధికి కూడా తెలుసు. 


గగనాంతర రోదసిలో, అనంత  నక్షత్ర రాశుల నడుమ,  మనం వున్న ఈ సమస్త భూ మండలమే ఓ పిపీలికం. ఆ భూమండలంలోని ఒక దేశంలో, ఆ దేశంలోని ఓ రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలోని ఓ నగరంలో, ఆ నగరంలోని ఓ ప్రాంతంలో, ఆ ప్రాంతంలోని ఓ నివాసంలో, ఆ నివాసంలోని డాబాపై పడుకుని పైకి చూస్తున్న మనం  పిపీలికాలమా, లేక అంత కంటే చిన్నవాళ్ళమా?

NOTE: COURTESY IMAGE OWNER

25, సెప్టెంబర్ 2014, గురువారం

అచ్చంగా మగవారికి మాత్రమె!


(ఇంకో 'మాత్రమే' ఏమిటంటే 'ఇది' కేవలం అనువాదం మాత్రమే!)
భార్య: ఏవిటి ఆఫీసు నుంచి పెందలాడే దిగడ్డారు?
భర్త: మా బాసుకి నా మీద కోపం వచ్చింది. గో టు హెల్ అన్నాడు. అంతే! ఇంటికొచ్చేసా!
డాక్టర్: మీ తలనొప్పి ఏమైంది ?
పేషెంటు: నిన్ననే పుట్టింటికి వెళ్ళింది.

మనిషికి నాలుగింటితో అసలు  తృప్తి అనేదే  వుండదు ఒకటి సెల్ ఫోన్, రెండోది కారు, మూడోది టీవీ, నాలుగోది భార్య
ఎందుకంటె -
ఎప్పటికప్పుడు వాటిని మించిన బెటర్ మోడళ్ళు మార్కెట్లోకి వస్తుంటాయి కాబట్టి.
విస్కీ కనుక్కున్నవాడు ఎవడో కానీ దానిలో ఒక సుగుణం వుంది. ఒక 'డబుల్' కడుపులో పడగానే సింగిల్ గా వున్న భావన కలుగుతుంది.
ఆడది కళ్ళు  మూసుకుంటే ఆమె మనసుపడే మనిషి కళ్ళల్లో మెదులుతాడు. అదే మగవాడు కళ్ళు మూసుకుంటే అతగాడు కోరుకునేవారి మొహాలతో ఏకంగా ఒక  స్లైడ్ షో మొదలవుతుంది.
ఒక మగవాడి టీ షర్ట్ మీద ఇలా రాసుంది:
ఆడవాళ్ళందరూ రాక్షసులు. కానీ మా  ఆవిడ మాత్రం రాణి (చిన్న అక్షరాలలో) ఆ రాక్షసులందరికీ.
'ఆడవాళ్లకి చెప్పులు అంటే ఎందుకంత మోజు ?
ఎందుకంటె, వాళ్ళు  ఎంతగా లావెక్కినా చెప్పులు మాత్రం సైజు మార్చక్కరలేకుండా కరెక్టుగా సరిపోతాయి'
'ఆడవాళ్ళు సరిగా కారు నడపలేరు అనే అపప్రధ వుంది.  నిజమేనా?
'వాళ్ళు మాత్రం ఏంచేస్తారు. కార్లలో ఎటూ చూసినా అద్దాలేనాయే! ఇక వారికి  డ్రైవింగ్ మీద ధ్యాస నిలబడాలంటే కష్టం  కదా!'  
'ఆత్మహత్య చేసుకోవాలని నదిలో దూకబోతున్న ఆడమనిషిని కాపాడడం ఎలా?
'దగ్గరలో వున్న చీరెల షాపులో తొంభయ్  శాతం సేల్ నడుస్తోందని గట్టిగా అరిచి చెప్పాలి'
'మగవాళ్ళందరూ ఒకే మోస్తరు. ఏం తేడా లేదు' అనే స్త్రీ ఎవరయి వుంటుంది?'
'మగవాళ్ళ గుంపులో తప్పిపోయిన మొగుడ్ని వెతుక్కునే చైనా అమ్మడు అయివుంటుంది'
కొందరు మగవాళ్ళు బ్రహ్మచారులుగా వుండిపోయి ప్రపంచంలో  జరిగే వింతలన్నింటినీ గమనిస్తుంటారు.  మరి కొందరు మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని ఇంట్లో జరిగేవాటిని వింతగా చూస్తుంటారు.
'ఏమో అనుకుంటాము కానీ గురూ గారూ ఈ ఆడాళ్ళున్నారే, మహా జాదూలు గురూ గారు?'
'ఎందుకలా అనిపించింది'
'మా ఆవిడతో ఏదైనా మాటలు మొదలు పెడతానా! విషయం ఏదైనా కానీండి. నాకు తెలీకుండానే దాన్ని వాదులాటలోకి మార్చేస్తుంది'

'మగవారితో పోలిస్తే ఆడవాళ్ళు మంచి, చక్కటి, ఆహ్లాదకరమైన, జీవితాన్ని చాలాకాలం అనుభవించగలరు ఎందుకంటారు.?'
'ఎందుకేమిటి మీ మొహం నా శ్రాద్ధం - వారికి 'భార్యలు' వుండరు కాబట్టి'


  (రవి జీడిగుంట వారి సౌజన్యంతో)

అంగారక విజయం


"గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"
చాలాకాలం క్రితం వచ్చిన బాల భారతం సినిమాకోసం ఆరుద్ర రచించిన గీతం - 'మానవుడు తలచుకుంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేయగలడు' అనే రీతిలో సాగిపోయే పాట  మళ్ళీ ఈనాడు స్పురణకు వస్తోంది.
దీనికి నేపధ్యం అంతరిక్ష పరిశోధనారంగంలో భారత్ తాజాగా సాధించిన అపూర్వ విజయం.
2014 సెప్టెంబర్ 24. ఉదయం ఏడుగంటలు. బెంగుళూరులో భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ 'ఇస్రో' కు చెందిన మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ భవనం.  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా అంతా ఎంతో ఆసక్తిగా, అంతకుమించి ఆదుర్దాగా ఎదురు చూస్తున్న సమయం.
'అనుకున్నది అనుకున్నట్టు జరిగితే బాగుంటుంది' అందరి మదిలో మెదులుతున్న ఆకాంక్ష.
'అలా జరుగుతుందా?' ఎక్కడో ఓ మూల కదలాడుతున్న సందేహం.
సరిగ్గా ఏడుగంటల యాభయ్ తొమ్మిది నిమిషాలకు వీటన్నిటికీ  తెర పడింది. అంగారక గ్రహం  పరిశోధనల నిమిత్తం ఇస్రో  పది మాసాల క్రితం ప్రయోగించిన ఉపగ్రహం - మార్స్ ఆర్బిటర్ మిషన్' (మామ్), కొన్ని కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం చేసి, అత్యంత క్లిష్టమైన సమస్యలను అధిగమించి, ప్రపంచంలో ఇంతవరకు ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో మొదటి ప్రయత్నంలోనే  అంగారక కక్ష్యలోకి ప్రవేశించచడంతో అక్కడ ఉన్నవారందరూ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇస్రో డైరెక్టర్ రాధాకృష్ణన్ ని, ప్రధాని ఆలింగనం చేసుకుని మనసారా అభినందించారు. 'ఇస్రో సాధించిన ఈ విజయం అసామాన్యమైనది. ఈ రంగంలో మన దేశం సత్తాను, శక్తి సామర్ధ్యాలను ఇస్రో ప్రపంచానికి చాటి చెప్పింది' అని ప్రధాని ప్రసంశల జల్లు కురిపించారు. అమెరికాకు కూడా తొలి ప్రయత్నంలో అలవికాని ఈ  బృహత్తర కార్యాన్ని సాధించి - ప్రధాని హోదాలో తొలిసారి అమెరికా గడ్డపై అడుగిడుతున్న మోడీకి, ఒకరోజు ముందుగా ఇస్రో అందించిన కానుకగా ఆయన భావించారేమో తెలియదు. కాని ప్రధాని ఈ విజయం పట్ల ఎంతగానో పులకరించిపోయినట్టుగా ఆయన మాటలే తెలియచేస్తున్నాయి. 'అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగారు మన శాస్త్రవేత్తలు. వారందరికీ వందనాలు' అంటూ ధన్యవాదాలు తెలిపారు. 'ఈరోజు దేశంలోని ప్రతి పాఠశాలలో విద్యార్ధులను సమావేశ పరచి మన దేశం సాధించిన ఈ ఘన విజయాన్ని వారి చప్పట్ల నడుమ ప్రకటించాలి' అని అన్నారంటే ఇస్రో సాధించిన విజయం పట్ల ఆయన ఎంతగా పులకితులయిందీ అర్ధం చేసుకోవచ్చు. 

  
ఈ విజయానికి ఇంతటి ప్రాముఖ్యత రావడానికి కారణం లేకపోలేదు. రోదసీ పరిశోధనల్లో దూసుకు పోతున్న ఏ దేశం కూడా  మొదటి ప్రయత్నంలో అంగారకుడి కక్ష్యలో ప్రవేశించలేదు. అమెరికా, రష్యా, యూరోపియన్ యూనియన్ సయితం అనేక విఫలయత్నాల తరువాతనే అరుణ గ్రహం కక్ష్యలోకి తమ ఉపగ్రహాలను ప్రవేశ పెట్టగలిగాయి. ఇక, చైనా, జపాన్ లకు ఇంతవరకు ఇది సాధ్యపడనే లేదు. తీరని కలగానే మిగిలిపోయింది.
ఈ అనంత కాల విశ్వంలో సెకనుకు కొన్ని వేల మైళ్ళ వేగంతో ముందుకు దూసుకుపోయే ఉపగ్రహాన్ని, కొన్ని మాసాల అనంతరం, నిర్దేశించిన మార్గంలో దారి మళ్లించడమే గగనం. అంతేటే కాదు, ఈ సుదీర్ఘ ప్రయాణం ముగియవచ్చే సమయంలో ఒక విషమ పరీక్షను తట్టుకోవాల్సి వుంటుంది. చైనా, జపాన్ దేశాలు ఈ తుది పరీక్షలోనే నెగ్గలేక బొక్కబోర్లా పడ్డాయి. దాదాపు అరవై కోట్ల మైళ్ళ దూరం ప్రయాణం సాగాక, ఇంకా అక్కడికి కొన్ని వేల మైళ్ళ దూరంలో వున్న అంగారకుని కక్ష్యలో ఉపగ్రహాన్ని ప్రవేశ పెట్టడానికి దాని వేగాన్ని అత్యంత తక్కువ స్థాయికి తగ్గించాల్సివుంటుంది. ఇందుకోసం 'మామ్' లో పదిమాసాలుగా నిద్రాణంగా భద్రపరచిన ఇంధనాన్ని తగుస్థాయిలో మండించాల్సిన  ప్రక్రియ బహు సంక్లిష్టమైనది. ఇందు  నిమిత్తం ఒక రోజు ముందుగానే ప్రయోగాత్మకంగా  ఆ ఇంధనాన్ని కొన్ని సెకన్ల పాటు మండించి చూసిన  ఇస్రో  శాస్త్రవేత్తలు సెమీ ఫైనల్స్ దాటగలిగారు. అయితే  అసలు ముహూర్తం వేళకు ఆ  ఇంధనాన్ని దాదాపు ఇరవై మూడు నిమిషాల కొన్ని సెకన్ల పాటు అటు  ఎక్కువా ఇటు తక్కువా కాకుండా మండించగలిగితేనే, అంగారకుడి కక్ష్యలో ఖచ్చితంగా ప్రవేశించగలిగే వేగనియంత్రణ వీలుపడుతుంది. అంటే అప్పటి వరకు  సెకనుకు 22.1 కిలో మీటర్ల (గంటకు అక్షరాలా డెబ్బయ్ తొమ్మిదివేల అయిదువందల అరవై కిలోమీటర్లు) వేగంతో ప్రయాణిస్తున్న 'మామ్' ఉపగ్రహ వేగాన్ని  సెకనుకు  4.4 కిలోమీటర్లకు తగ్గించగలగాలి. లేని పక్షంలో మొత్తం వ్యవహారం  బూడిదలో పోసిన పన్నీరు చందమే. బుధవారం ఉదయం ఇస్రో సాదించిన విజయం అదే. దాటిన మైలురాయి అదే. అందుకే అన్ని జయ జయ ధ్వానాలు.  హర్షధ్వానాల జల్లులు, అభినందనల వెల్లువలు.
భారత్ సాధించిన ఈ ఘన విజయంలో మరికొన్ని పార్శాలు వున్నాయి. ఈ ప్రయోగం పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో సాధించింది. పెట్టిన ఖర్చు కూడా మిగిలిన దేశాలతో పోలిస్తే బహు తక్కువ. ప్రధానమంత్రి మోడీ స్వయంగా చెప్పినట్టు,  రోదసీ పరిశోధనల నేపధ్యంలో తీసిన హాలీవుడ్ చిత్రం -  'గ్రావిటీ'  నిర్మాణ వ్యయం ఆరు వందల  కోట్లు కాగా 'మామ్' ప్రయోగ వ్యయం కేవలం నాలుగు వందల యాభయ్ కోట్లే. పోతే, అమెరికా ప్రయోగించిన అంగారక పరిశోధన ఉపగ్రహం, 'మావెన్' పై పెట్టిన ఖర్చులో పదో వంతు  కూడా లేదు. భారత్ ప్రయోగించిన 'మామ్' ఉపగ్రహం ప్రయాణించిన కోట్లాది కిలోమీటర్ల దూరాన్ని గమనంలో వుంచుకుంటే, ప్రతి కిలోమీటరుకు వెచ్చించిన డబ్బు,  హైదరాబాదులో మీటరు మీద వచ్చే ఆటో రేటుకంటే తక్కువ పడుతుందని సోషల్ మీడియాలో  కొందరు లెక్కలు కడుతున్నారు.                         
పోతే, దేశాలన్నీ ముక్తకంఠంతో భారత్ సాధించిన విజయానికి జేజేలు పలికాయి. చైనా కూడా ఈ విజయం ఆసియాఖండపు  విజయంగా అభివర్ణించింది.
'విజయం సరే. అభినందనలు సరే. పేద దేశం అయిన భారత దేశానికి అంగారక గ్రహం గురించిన  పరిశోధనలుల వల్ల వొనగూడే ప్రయోజనం ఏమిటి?' అని మెటికలు విరిచేవాళ్ళు లేకపోలేదు.
వారికి సమాధానం ఒక్కటే.
శాస్త్రీయ పరిశోధనలను మిగిలిన పరిశోధనల సరసన చేర్చి మదింపు చేయడం సరికాదు. అన్నింటినీ   అణాపైసల లెక్కన  చూడకూడదు. మొదటిసారి అమెరికా వ్యోమగామి ఆర్మ్ స్ట్రాంగ్  చంద్రుడిపై కాలుమోపిన  ఏడాదే మనదేశంలో ఇస్రో తన కార్యకలాపాలను ఓ మోస్తరు స్థాయిలో మొదలుపెట్టింది. అంచెలంచెలుగా ఎదుగుతూ, ఇతర దేశాల ఉపగ్రహాలను వాణిజ్య ప్రాతిపదికపై రోదసిలో ప్రవేశ పెట్టగల స్థాయికి చేరుకుంది. ఇదంతా ఎవరిమీదా ఆధారపడకుండా, కేవలం స్వదేశీ పరిజ్ఞానంతో సాధించుకున్న ఆస్తి. బుధవారం నాటి విజయంతో భారత దేశం,  ఈ రంగంలో ముందున్న అన్ని అగ్ర దేశాలను దాటుకుని ఒక అడుగు ముందుకు వెళ్ళగలిగింది. ఇదొక రికార్డు అయితే,
దశాబ్దాల క్రితం, ఇస్రో జరిపిన మొదటి ప్రయోగం గురించి  ప్రజలు మరునాడు మాత్రమె పత్రికల్లో  చదివి తెలుసుకోగలిగారు. అదే, ఈనాడు 'అంగారక విజయయాత్ర'ను ఇళ్ళల్లో కూర్చుని టీవీల్లో  కళ్ళారా వీక్షించగలిగారు. సెల్ ఫోన్ల ద్వారా తమ ఆనందాన్ని తమవారితో పంచుకోగలిగారు. వీటన్నిటి వెనుకా 'ఇస్రో' పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే.
అందుకే 'ఇస్రో' సాధించిన ఇలాటి విజయాలను జనం తమ సొంతం చేసుకుంటున్నారు.
ఇస్రో తలపెట్టిన  'మంగళయాన్' మనదేశానికి మంగళప్రదం కావాలనీ, భవిష్యత్తులో ప్రపంచం గర్వించే మరికొన్ని విజయాలను మూటగట్టుకోవాలనీ  మనసారా కోరుకుందాం. (25-09-2014)

24, సెప్టెంబర్ 2014, బుధవారం

చుక్కల్ని దాటుకు వెళ్ళిన భారత రోదసీ ప్రతిభ


"గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గగనాంతర రోదసిలో...
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్రలోకమైనా ............"
చాలాకాలం క్రితం వచ్చిన బాల భారతం సినిమాకోసం ఆరుద్ర రచించిన గీతం మళ్ళీ స్పురణకు వస్తోంది.
'మానవుడు తలచుకుంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేయగలడు' అనే రీతిలో సాగిపోయే పాట ఇది.



సరిగ్గా ఇదే చేసిచూపారు భారత రోదసీ సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు. ఇంతవరకు ఏ దేశానికీ సాధ్యం కాని పనిచేసి చూపెట్టారు. పది నెలలుగా రోదసిలో ప్రయాణిస్తున్న  భారతీయ ఉపగ్రహాన్ని, కోట్ల కిలోమీటర్ల దూరంలో  అంగారకుడి కక్ష్యలో మొదటి ప్రయత్నంలోనే విజయవంతంగా ప్రవేశపెట్టి, సంక్లిష్ట రోదసీ పరిశోధనల్లో మనదేశం  ఎవరికీ తీసికట్టు కాదని సగర్వంగా నిరూపించారు.

భారతీయులందరూ  మనః పూర్వకంగా సగౌరవంగా ఇస్రో శాస్త్రవేత్తలకు 'సాల్యూట్' చేయాల్సిన  శుభ సందర్భం ఇది.

NOTE: COURTESY IMAGE OWNER 

23, సెప్టెంబర్ 2014, మంగళవారం

జెట్ లాగ్ కోడి


మా వాచ్ మన్ కొండల రావుకి ఇద్దరు పిల్లలు. పండక్కి వాళ్ళ వూరు వెళ్లినప్పుడు వస్తూ వస్తూ ఇంకో 'పిల్లాడిని' వెంటబెట్టుకొచ్చాడు. పల్లెటూళ్ళో వేళపట్టున కూతబెట్టే ఆ కోడి పుంజు  నిద్ర ఎరుగని నగరంలో ఓ వేళాపాళా లేకుండా కూతపెడుతూ వుంటుంది. బహుశా జెట్ లాగ్ అయివుండవచ్చు. నాకు మాత్రం అది ఎన్నిసార్లు కూసినా మళ్ళీ ఓమారు కూస్తే బాగుండు అనిపిస్తుంది.



కారు వాడకపోతే డాలరు దిగొస్తుంది (ట)



మీ దగ్గర వున్న ఓ పది నోటు తీసిచూడండి. 'ఇది తీసుకువచ్చిన వాడికి పది రూపాయలు ఇస్తాన'ని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకంతో కూడిన హామీ (ఒక రకంగా చెప్పాలంటే ప్రామిసరీ నోటు) కనబడుతుంది. సాంకేతిక అంశాలను అంత క్లుప్తంగా వివరించడం సాధ్యం కాకపోవచ్చు కాని పది రూపాయలకు బదులు అంతే విలువకలిగిన బంగారం ఇస్తామన్న హామీ అన్నమాట.
అంటే భారత దేశం ఆర్ధిక వ్యవస్థ బంగారం నిల్వలపై  ఆధారపడివుందనుకోవాలి. మరి ఈ కారు గొడవ  యేమిటి అన్న అనుమానం రావచ్చు.
ఒక డెబ్బయ్యేళ్ల  క్రితం  వరకు అమెరికా కూడా తన డాలరు విలువను బంగారం నిల్వల ప్రాతిపదికగా లెక్కకట్టేది. పెట్రోలు కూడా బంగారం మాదిరిగా ప్రియమైనది(మన దేశంలో బంగారం మరో రకంగా ప్రియమైనది అనుకోండి) అన్న జ్ఞానోదయం ముందు కలిగిన దేశం  కనుక  అమెరికా  ముందు జాగ్రత్త పడి  పెట్రోలు ఉత్పత్తి చేసే మధ్య ప్రాచ్య దేశాలతో ఒక వొప్పందం కుదుర్చుకుంది. అదేమిటంటే వాళ్లు పెట్రోలు ఏ దేశాలకు అమ్మినా డాలర్లలోనే అమ్మాలి. ఏవిటి దీనివల్ల వాళ్లకు లాభం? ఓ ఉదాహరణ చెప్పుకుందాం.
మన పెట్రోలియం మంత్రిగారు చమురు కొనుగోళ్ళ కోసం ఓ మధ్య ప్రాచ్య దేశానికి వెళ్ళారనుకుందాం. కాని వాళ్లు మన మన కరెన్సీ వొప్పుకోరు. డాలర్లు కావాలంటారు. అప్పుడు మన మంత్రి గారు డాలర్లకోసం అమెరికా వైపు చూస్తారు. వాళ్ల సొమ్మేం పోయింది. టకటకా తెల్లకాగితంపై (కరెన్సీ ముద్రణకు వాడే కాగితమే కావచ్చు)  డాలర్లు ప్రింటు చేసి మనకు ఇస్తారు.
ఈవిధంగా వచ్చిన డాలర్లతో మనం పెట్రోలు కొనుగోలు చేస్తాం.
ఇక్కడో తిరకాసు వుంది. 'మాకీ డాలర్లు అక్కరలేదు, తిరిగి  ఇచ్చేస్తాం తీసుకోండిఅంటే అమెరికా రిజర్వ్ బ్యాంక్ వొప్పుకోదు. డాలర్ల బదులు మాకు బంగారం ఇవ్వండి అంటే ఆ దేశం ఎంతమాత్రం అంగీకరించదు.  'డాలర్ బదులు తిరిగి ఏదయినా ఇస్తామని హామీ ఏమైనా ఇచ్చామా చెప్పండి' అని ఎదురు ప్రశ్న వేస్తారు.  మన కరెన్సీ మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హామీ లాగా వాళ్ల డాలర్ మీద అలాటి పూచీకత్తు ఏమీ వుండదు. అందుకే డాలర్లు ముద్రించాలంటే తగిన బంగారం నిల్వలు వున్నాయా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఆ దేశానికి వున్నట్టు  లేదు. మరయితే, తాను కొనుగోలు చేసే పెట్రోలుకు  అమెరికా అయా దేశాలకు చెల్లింపులు ఏ కరెన్సీలో చేస్తుందనే అనుమానం రావచ్చు.   
వాళ్లకు ఇక్కడ ఓ సౌలభ్యం వుంది. ఆ దేశాల రాజులనండి, సుల్తానులనండి తమ ఆస్తులను సామ్రాజ్యాలను కాపాడడం కోసం అమెరికాకు డబ్బులు చెల్లించాలి. అలాగే ఆయా దేశాల్లో అమెరికా నిర్మించిన రహదారులు మొదలయిన నిర్మాణాలకు అయిన ఖర్చు తాలూకు చెల్లింపులతో పెట్రోలు చెల్లింపులు సరి.   
సరే! అది వాళ్ల ఏర్పాటు.  మన సమస్య అమెరికా డాలర్లు. ఆ డాలర్ల ముద్రణకు అమెరికా ఉపయోగించే తెల్ల కాగితం విలువా, మన బంగారం నిల్వల విలువా సమానం అనుకోవాలేమో.
అంటే ఏమిటన్న మాట. మనం పెట్రోలు దిగుమతులపై పెట్టే ఖర్చు తగ్గించుకోగలిగితే డాలర్ విలువ మన రూపాయి మారకం విలువతో పోల్చినప్పుడు తగ్గుతుందన్న మాట. అంటే మరో ఏమిటన్న మాట. మనం కనుక ఒక్క మాట మీద నిలబడి ఓ వారం రోజుల పాటు కార్లను రోడ్లకు దూరంగా వుంచి వాటికి విశ్రాంతి ఇవ్వగలిగితే  చాలు కొండెక్కి కూర్చున్న డాలరు దానంతట అదే  దిగివస్తుందని సూతుడు శౌనకాది మునులకు చెప్పగా వారిలో ఒకడు మన నెటిజెన్ల చెవిన వేయడం,   ఆంగ్లంలో వున్న ఆ విషయాలనన్నింటినీ కుదించి  ఇలా  తెలుగులోకి అనువదించి రాయడమైనది. మంగళం మహత్. శ్రీ శ్రీ శ్రీ.


NOTE: Courtesy Image Owner 

22, సెప్టెంబర్ 2014, సోమవారం

హే కృష్ణా.......!


(Published by 'SURYA' telugu daily dated 24 -09-2014, Wednesday)
ఒక సందర్భాన్ని మననం చేసుకుందాం. మరో సన్నివేశాన్ని వూహించుకుందాం.



కౌరవసభలో ద్రౌపదీ వస్త్రాపహరణం. దుశ్శాసనుడు పాంచాలి వలువలు లాగి అవమానించే సందర్భంలో సభ యావత్తు మౌనంగా మిన్నకుండి పోతుంది. దృపదరాజ పుత్రి వేడుకోలు వినిపించుకున్న శ్రీ కృష్ణ పరమాత్మ హఠాత్తుగా ప్రత్యక్షమై ఆదుకుంటాడు.
ఇక సినిమాల్లో ఇలా హీరోలు వచ్చి ఆపదలో వున్న హీరోయిన్లను అలా ఆదుకునే సన్నివేశాలు కోకొల్లలు. వీటి ఆధారంగా ఊహించుకుంటే-
నగరంలో ఏదో ఒక కాలేజీలో ఆడపిల్లల్ని ఆకతాయి పిల్లలు వేధిస్తుంటారు. వారిలో ఒకమ్మాయి ధైర్యం చేసి పోలీసులకు  మొబైల్ ఫోను ద్వారా  సమాచారం అందిస్తుంది.  నిమిషాల్లో పోలీసులు అక్కడ వాలిపోతారు. యువతుల్ని వేధిస్తున్న అల్లరి పిల్లలపై రబ్బరు లాఠీలు ఝలిపిస్తారు. వెడుతూ వెడుతూ 'పోలీసులున్నారు జాగ్రత్త!' అంటూ హెచ్చరిక జారీచేసి వెడతారు.
ఇలా చేస్తే  కాని నగరంలో ఆకతాయి మూకల్ని అరికట్టడం సాధ్యం కాదన్న వూహ మెదిలినట్టుంది  సాక్షాత్తు తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మస్తిష్కంలో. రాజు తలచుకుంటే కొదవేముంది. కమిటీ వేసారు. ఆ కమిటీ సభ్యులు కాలయాపన చేయకుండా  నానారకాలుగా సమాచారాన్ని సేకరించి  ముఖ్యమంత్రికి ఒక నివేదిక సమర్పించారు. ఈ కమిటీలో నలుగురు సీనియర్ ఐ.ఏ.యస్., ముగ్గురు ఐ.పీ.యస్.  అధికారులు వున్నారు. ఈ ఏడుగురిలో  ఆరుగురు మహిళా అధికారులే కావడం ఒక విశేషం.   ఈ  నెల పదో తేదీనుంచి కమిటీ తన పని మొదలుపెట్టింది.  ఇరవయ్యో తేదీకల్లా  ముఖ్యమంత్రికి నివేదిక అందచేసింది. ఈ మధ్యలో  కమిటీ హైదరాబాదు  ఐ టీ కారిడారులో వున్న వివిధ కంప్యూటర్ కంపెనీల్లో పనిచేస్తున్న  మహిళా ఉద్యోగులను కలుసుకుంది. స్వచ్చంద సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకుంది. స్వయం సహాయక బృందాల సభ్యులతో  సమావేశాలు జరిపింది. మహిళా కళాశాలలకు వెళ్లి విద్యార్ధినుల మనోభావాలు తెలుసుకుంది. ఉద్యోగాలు గట్రా చేయకుండా ఇంటిపట్టున వుండే గృహిణులను సయితం కలుసుకుంది. మీడియా ప్రతినిధులతో, మహిళా జర్నలిష్టులతో ముచ్చటించింది. ఇక ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బందితో సమావేశాలు సరేసరి. అంతే కాకుండా గుజరాత్, కేరళ రాష్ట్రాలకు బృందాలను పంపి  ఈ విషయంలో అక్కడ మంచి ఫలితాలను ఇస్తున్న విధానాలను  అధ్యయనం చేసింది.
ఈ సమావేశాల్లో, ఈ సమాలోచనల్లో, ఈ సంప్రదింపుల్లో, ఈ అభిప్రాయ  సేకరణ క్రమంలో  బాలికలు, మహిళల భద్రతకు సంబంధించిన అనేక అంశాలు వెలుగు చూశాయి.  ఆవిషయాలను అన్నింటినీ  సాకల్యంగా పరిశీలించినమీదట,  సత్వర ఫలితాలు సాధించేందుకు  కొన్ని స్వల్పకాలిక చర్యలు వెంటనే చేపట్టాలని ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫారసు చేసింది. ఈ  ఆర్ధిక సంవత్సరంలోనే కమిటీ సిఫార్సుల అమలుకు వీలైన నిధులను ఆయా ప్రభుత్వ శాఖలకు విడుదల చేయాలని కూడా  ఈ కమిటీ సూచించింది.
'హెల్ప్ లైన్' (ఆపన్న హస్తం) ఏర్పాటు చేయడం అనేది కమిటీ సిఫారసుల్లో మొట్టమొదటిది.
అలాగే, జిల్లా స్థాయిలోను, నగరపాలక  సంస్థ పరిధిలోను  ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా పనిచేసే  కేంద్రాలను నెలకొల్పాలని సూచించింది.
కమిటీ చేసిన ఇతర సిఫారసులు ఇలా వున్నాయి.
"పోలీసు శాఖలో మహిళా సిబ్బంది సంఖ్యను ఇతోధికంగా పెంచాలి. అత్యాచార సంఘటనలు గురించిన పిర్యాదులపై  సత్వరంగా విచారణ పూర్తిచేసి నేరం రుజువైన పక్షంలో ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేలాచూడడానికి జిల్లా స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలి. లైంగిక అత్యాచారాలకు గురైన బాధితులను బహిరంగంగా కాకుండా  వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించేందుకు వీలుగా విధానాలను నిర్బంధం చేయాలి.ఢిల్లీ పోలీసు తరహాలో మహిళా రక్షక్ లను పోలీసు కమీషనరేట్లలో, జిల్లా స్థాయి పోలీసు అధికారుల కార్యాలయాల్లో నియమించాలి. ఇంటర్ నెట్ లో అసభ్య చిత్రాలను చూపే సైట్లను పూర్తిగా నిరోధించాలి. మహిళలు, బాలికలకు సంబంధించిన కేసుల విచారణలో ఖచ్చితమైన, ప్రామాణికమైన విధానాలను రూపొందించి అవి సరిగా అమలయ్యేలా చూడాలి. కార్యాలయాలలో,  విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగినులు, చదువుకునే విద్యార్ధినుల   భద్రతకు సంబంధించిన ఎలాటి సమాచారం వచ్చినా రాకున్నా  సకాలంలో స్పందించడానికి ఆయా  ప్రాంతాలలో  పోలీసు గస్తీ  వ్యవస్థను పటిష్టం చేయాలి. మహిళా ఉద్యోగులు ప్రయాణించే టాక్సీలలో  మహిళా డ్రైవర్లు మాత్రమె ఉండేలా చూడాలి.
"ఆటో రిక్షాలు, టాక్సీల నిర్వహణను మరింత కట్టుదిట్టం చేసి వాటి రాకపోకలపై నిరంతర నిఘా పెట్టాలి. ఆర్టీసీ బస్సులు, లోకల్ రైళ్ళ వంటి ప్రజా రవాణా వ్యవస్థలను పటిష్టం చేయాలి. వివాహాలను నిర్బంధంగా నమోదు చేసేలా చట్టాలను సవరించాలి. మద్యం వాడకం పెరగడం వల్ల మహిళలపై నేరాలు పెరిగిపోయే అవకాశాలు వుండే కోణం నుంచి కూడా ఆలోచించి  ఈ అంశంపై మరింత దృష్టి పెట్టాలి. అసంఘటిత రంగాల్లో, ఇళ్ళల్లో పనిచేసే బాలికలు, మహిళల భద్రత పట్ల కూడా శ్రద్ధ తీసుకోవాలి.  కడుపులో వున్న శిశువు ఆడపిల్ల అని తెలుసుకుని గర్భవిచ్చేధం  చేసే వికృత పోకడలను  గట్టిగా అరికట్టాలి. అవసరంలో వున్న మహిళలకు  న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించాలి. పడుపువృత్తిని అరికట్టే చర్యలకు మరింత పదును పెట్టాలి.
"గ్రామ స్థాయిలో స్త్రీ శక్తి సంఘాలను ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల స్థాయిలో మహిళా వనరుల కేంద్రాలను నెలకొల్పాలి. తెలంగాణా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఒక మహిళా కమీషన్ ఏర్పాటుచేయాలి. విడిగా స్త్రీలకోసం తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పాలి."
ఈ నివేదిక చేతికి అందగానే ముఖ్యమంత్రి, కే.చంద్రశేఖర రావు సీనియర్ అధికారులతో  సుదీర్ఘ సమాలోచనలు జరిపారు. లండన్ తరహా పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసి, హైదరాబాదు నగరాన్ని నేర రహిత నగరంగా చేయాలనే లక్ష్యం ప్రకటించిన ముఖ్యమంత్రి, తదనుగుణంగా చర్యలు కూడా తీసుకునే అవకాశాలు వున్నాయి. కమిటీలు ఏర్పాటుచేయడం, నివేదికలు తెప్పించుకోవడం, వాటికి తగిన ప్రచారం కల్పించడం దరిమిలా వాటి సంగతి సమయానుకూలంగా మరచిపోవడం ప్రభుత్వాల్లో పరిపాటే. కానీ ఈ విషయంలో తాను  'విభిన్నంగా వ్యవహరిస్తాను' అనే పేరు తెచ్చుకునే దిశగా అడుగులు వేస్తె  తెలంగాణా ముఖ్యమంత్రికీ  మంచిదే. తెలంగాణా ఆడపడుచులకూ  మంచిదే.
చూడాలి ఏం చేస్తారో! ఏం జరుగుతుందో! 

NOTE: COURTESY IMAGE OWNER

21, సెప్టెంబర్ 2014, ఆదివారం

షరా మామూలు గొప్ప మనిషి



కొందరు వృత్తి రీత్యా గొప్పవాళ్ళు అవుతారు. మరికొందరు ప్రవృత్తి రీత్యా అవుతారు.
వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా కూడా గొప్పవాళ్ళు అయినవాళ్ళు అరుదుగా కనబడతారు.
హైదరాబాదు, జూబిలీ హిల్స్  ప్రాంతంలో, ఆంద్ర జ్యోతి దినపత్రిక దగ్గరలో ఉదయపు వేళల్లో ఆజానుబాహు అయిన ఒక వ్యక్తి నింపాదిగా, ఏ హడావిడీ లేకుండా నడుచుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తి తారసపడతాడు. నాలుగు మాసాల క్రితం వరకూ ఇది దినవారీ దృశ్యమే. అయితే ఈ  మధ్య వివిధ రాష్ట్రాలు పర్యటిస్తూ, ఆయా ముఖ్యమంత్రులతో సమావేశాలు జరుపుతూ కొంత బిజీ అయిపోయి ఆయన కనబడడం లేదు. ఎలాటి డాబూ దర్పం లేకుండా, ఎటువంటి సెక్యూరిటీ లేకుండా  చాలా సాధారణంగా  కానవచ్చే ఆ పెద్దమనిషి నిజానికి అంత మామూలు మనిషేం కాదు.  ఆయన్ని ఒకసారి కలవాలని, ఆయనతో ఓ మంచి మాట అనిపించుకోవాలని మన దేశంలోని  అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెగ ఆరాటపడిపోతుంటారు. అలాటి మనిషి తన వృత్తి జీవితంలో పరిచయమై, అదే ప్రాంతంలో నివసిస్తున్న మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు వంటి వారితో కలిసి మార్నింగ్ వాక్ చేస్తూ, పాత ముచ్చట్లు కలబోసుకుంటూ, అక్కడ వున్న వీధుల్లో కాసేపు తిరిగి ఇంటికి చేరుకుంటారు. కేంద్ర ప్రభుత్వంలో సహాయ మంత్రి హోదా, అంటే రాష్ట్రంలో కేబినేట్ హోదాకు సమానమైన స్థాయి వుండి కూడా ఆయన నిరాడంబరంగానే వుంటారు. చిన్న చిన్న కార్పోరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్లు సయితం, తమకు అధికారికంగా హక్కు లేకపోయినా బుగ్గ కార్లలో తిరగాలని ఆరాట పడే రోజులు ఇవి. అలాటిది ఆయన వాహనంపై  ఇలాటి అధికార చిహ్నాలు ఏవీ వుండవు. ముందూ వెనుకా సెక్యూరిటీ పోలీసులు  అంటూ ఎవరూ కనబడరు. పనిమీద వెడుతుంటే ట్రాఫిక్ పోలీసుల హడావిడి అసలే కనబడదు. సాధారణ పౌరుల మాదిరిగానే ఆయన తన దినవారీ వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ వుంటారు. ఆయన ఎవరంటే,
ఈ మధ్య తిరుపతిలో ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మొన్న హైదరాబాదు పలక్ నుమా ప్యాలెస్ లో తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు -  కేంద్రం నుంచి వచ్చిన పద్నాలుగవ ఆర్ధిక సంఘానికి ఘనమైన విందులు ఇచ్చారు. ఆ సంఘం అధ్యక్షుడు వై వీ రెడ్డి (వై.వేణుగోపాల రెడ్డి) ఈ షరా మామూలుగా తిరిగే పెద్దమనిషి అంటే ఓ పట్టాన నమ్మడం కష్టం.


(శ్రీ వై.వీ.రెడ్డి)

ఒక విచిత్రం ఏమిటంటే, హోదాలను పక్కనబెట్టి సాదాసీదాగా జీవనం గడిపే పెద్దవారి గురించి చెప్పుకునే వారు చాలామంది కనిపిస్తారు. కానీ అలాటి వారిని ఆదర్శంగా తీసుకుని అనుసరిద్దామనుకునే వాళ్ళు తక్కువగా కానవస్తారు. అయినా కానీ, ఇలాటివారిమధ్యన  మసలగలిగే అవకాశం లభించినందుకు సంతోషించాలి.

20, సెప్టెంబర్ 2014, శనివారం

నెరవేరని స్కాటిష్ ప్రజల వేర్పాటువాద స్వప్నం


'బ్రిటన్ తో కలిసి వుండాలా విడిపోవాలా' అనే అంశంపై స్కాట్ లాండ్ ప్రజలు చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చారు. మూడువందల ఏళ్ళకు పైబడిన బంధాన్నే వారు బ్రిటన్ తో కోరుకున్నారు. స్కాట్ లాండ్ పార్ల మెంట్  తీర్మానం ప్రకారం ఈనెల పద్దెనిమిదో తేదీన  నిర్వహించిన ప్రజాభిప్రాయ  సేకరణలో సుమారు పదకొండు శాతం తేడాతో వేర్పాటువాదులు వోడిపోయారు.
14 వ శతాబ్దంలో ఇంగ్లాండ్, స్కాట్ లాండ్ దేశాలనడుమ వరుసగా అనేక యుద్ధాలు జరిగాయి. 1653లో ఈ రెండు సామ్రాజ్యాలు పరస్పరం సంధి చేసుకుని ఒకే ప్రభుత్వం కింద తాత్కాలికంగా ఏకమయ్యాయి. 1707లో స్కాట్ లాండ్ , ఇంగ్లాండ్ లు గ్రేట్ బ్రిటన్ పేరుతొ ఒక్కటయ్యాయి. తరువాత 1801లో ఐర్లాండ్ ని కూడా కలుపుకుని యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ గా అవతరించింది. కాని, 1922 లో ఐర్లాండ్ లోని అనేక ప్రాంతాల వారు ఆ సామ్రాజ్యం నుంచి వేరు పడిపోయారు. అయితే స్కాట్ లాండ్ మాత్రం గ్రేట్ బ్రిటన్ లో భాగంగానే కొనసాగుతూ వచ్చింది. లేబర్ పార్టీ ప్రభావంతో స్కాట్ లాండ్ లో వేర్పాటు ఉద్యమాలు మొదలయ్యాయి. స్కాట్ లాండ్ కు ప్రత్యేక పాలన కోరిన లేబర్ పార్టీ తదనంతర కాలంలో తన విధానాన్ని మార్చుకుంది. దానితో 1934లో ఈ బాధ్యతను కొత్తగా పురుడుపోసుకున్న స్కాటిష్ నేషనల్ పార్టీ తన భుజానికి ఎత్తుకుంది. కాని పాతికేళ్ళవరకు ఈ కొత్త పార్టీ తన లక్ష్యాల దిశగా గట్టిగా అడుగులు వేయలేకపోయింది. 1970 నుంచీ స్కాటిష్ ప్రజానీకంలో వేర్పాటువాదం పుంజుకోవడం మళ్ళీ మొదలయింది. జిమ్ కేలగాన్ నేతృత్వంలో ఏర్పడ్డ లేబర్ ప్రభుత్వం మద్దతుతో ఈవాదానికి మరింత బలం చేకూరినట్టయింది.
1979 లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. వేర్పాటువాదులకు అనుకూలంగా ప్రజాతీర్పు వచ్చింది. కానీ, మొత్తం వోటర్లలో నలభయ్ శాతానికి మించి వోట్లు వస్తేనే ఆ తీర్పుకు విలువ వుంటుందన్న నిబంధన కారణంగా స్కాటిష్ వేర్పాటువాదానికి తొలి వోటమి ఎదురయింది. 1977 లో తిరిగి లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కానీ ఇందుకు సంబంధించిన రాజ్యాంగ సంస్కరణలు గురించి ఎవ్వరూ ఆలోచించలేదు. ఆ ఏడాది మరో రిఫరెండం నిర్వహించారు. కేంద్రం నుంచి బదలాయించిన అధికారాలు కలిగిన స్కాటిష్ పార్ల మెంటు ఏర్పాటుకు అనుకూలంగా మెజారిటీ ప్రజలు వోటు వేసారు. దరిమిలా  1988 స్కాట్లాండ్ చట్టం ప్రకారం 1999 మే ఆరోతేదీన మొట్టమొదటి స్కాటిష్ పార్లమెంటు ఏర్పాటయింది. స్కాట్ లాండ్ కు సంబందించిన శాసనాలు సొంతంగా చేసుకునే అధికారాన్ని ఈ పార్ల మెంటుకు దఖలు పరిచారు.     
2007 స్కాటిష్ పార్లమెంటుకు ఎన్నికలు జరిగాయి.  ఇంగ్లాండు నుంచి వేర్పాటు కోరుతూ 2010 లో తిరిగి రిఫరెండం నిర్వహిస్తామన్న ఎన్నికల వాగ్దానంతో స్కాటిష్ నేషనల్ పార్టీ  స్కాటిష్ పార్ల మెంటులో ఎక్కువ సీట్లు పొందిన పార్టీగా అవతరించింది. అలెక్స్ సాల్మండ్ నేతృత్వంలో ఆ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలింది. ఆ ప్రభుత్వం తన వాగ్దానానికి అనుకూలంగా మూడు ప్రత్యామ్నాయాలతో కూడిన ఒక బిల్లును తయారు చేసి పార్ల మెంటులో ప్రవేశపెట్టింది. దురదృష్టవశాత్తు  మొత్తం సభ్యులు  129 మందిలో  50 మంది సభ్యులు మాత్రమె రిఫరెండానికి అనుకూలంగా వోటు చేసారు. సరయిన మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమయిన ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకుంది.
అయితే, స్కాటిష్ నేషనల్ పార్టీ అంతటితో నిరుత్సాహపడకుండా  2011 ఎన్నికల మేనిఫెస్టోలో మళ్ళీ రిఫరెండం వాగ్దానాన్ని పొందుపరిచింది. ఆ ఎన్నికల్లో స్కాటిష్ నేషనల్ పార్టీకి తిరుగులేని ఆధిక్యతను ప్రజలు కట్టబెట్టారు. మొత్తం 129 సీట్లలో ఆ పార్టీ  69 స్థానాలు గెలుచుకుంది. తద్వారా రిఫరెండం జరపాలన్న తమ ఎన్నికల వాగ్దానానికి ప్రజల మద్దతును సయితం కూడగట్టుకుంది.
2012 జనవరిలో రిఫరెండం నిర్వహించుకోవడానికి స్కాటిష్ పార్ల మెంటుకు యునైటెడ్ కింగ్ డం ప్రభుత్వం అంగీకరించింది. అయితే అందుకు కొన్ని షరతులు విధించింది. న్యాయమైన రీతిలో, చట్టబద్ధంగా, నిర్ణయాత్మకంగా రిఫరెండం జరపాలని కోరింది.
రిఫరెండంలో ఎవరు వోటు వెయ్యాలి, ఎవరు దీన్ని నిర్వహించాలి మొదలయిన విధి విధానాలను ముందుగానే ఖరారు చేయాలని సూచించింది. న్యాయపరమయిన అంశాలను, రిఫరెండం నిర్వహించే తేదీని ఖరారు చేసే  పనిలో యూకే ప్రభుత్వం ఉండగానే, మరోపక్క  సాల్మండ్ 2014 లో రిఫరెండం జరుగుతుందని హడావిడిగా ప్రకటించారు. స్వాతంత్రేచ్చను వ్యక్తం చేసే రిఫరెండం యాక్టును స్కాటిష్ పార్లమెంటు ఆమోదించింది. 2013 ఆగస్టు ఏడో  తేదీన దీనికి బ్రిటిష్ రాణి ఆమోదం లభించింది. స్కాట్లాండ్ ను స్వతంత్ర దేశంగా మార్చుకునే ఉద్దేశ్యం కలిగిన ఒక శ్వేత పత్రాన్ని కూడా సాల్మాండ్ ప్రభుత్వం విడుదల చేసింది. 2014 సెప్టెంబర్ 18 వ తేదీన రిఫరెండం నిర్వహించడం జరుగుతుందని షెడ్యూల్ కూడా ప్రకటించింది. అదే సంవత్సరం స్కాట్ లాండ్ లో కామన్ వెల్త్ దేశాల క్రీడోత్సవాలకు స్కాట్ లాండ్ ఆతిధ్య దేశంగా వ్యవహరించాల్సి వుంటుంది అనే అభ్యంతరాలను సయితం కూడా  సాల్మాండ్ ఖాతరు చేయలేదు. ఈ రిఫరెండంలో పాల్గొనే వోటర్ల కనీస వయస్సును 18 నుంచి 16 ఏళ్ళకు తగ్గించింది. స్కాట్ ల్యాండ్ వెలుపల నివాసం ఉంటున్న స్కాట్ జాతీయులకు కూడా వోటింగ్ హక్కు ఇవ్వాలనే  డిమాండ్ ని కూడా లెక్కపెట్టలేదు. ఇలాటి వారి సంఖ్య సుమారు ఎనిమిది లక్షల వరకు ఉంటుందని అంచనా. స్కాట్ లాండ్ స్వాతంత్రానికి సంబందించి  నిర్వహించే రిఫరెండంలో బ్రిటన్ లోని పౌరులకు కూడా అవకాశం కల్పించాలని యూకే పెద్దల సభలో గట్టిగా వాదనలు వినిపించాయి. అయితే దీన్ని బ్రిటిష్ ప్రభుత్వమే తిరస్కరించింది. యునైటెడ్ కింగ్ డం ని వొదిలి పెట్టి వేరుపడాలా లేక కలిసి వుండాలా అన్నది స్కాటిష్ ప్రజలు మాత్రమె తేల్చుకోవాలని స్కాట్ లాండ్ అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనను బ్రిటిష్ ప్రభుత్వం సమర్ధించింది. అంతే  కాకుండా 2014 డిసెంబర్ లోపు రిఫరెండం నిర్వహించుకోవడానికి స్కాటిష్ పార్లమెంటుకు అధికారం ఇస్తూ ఎడెన్ బర్గ్ వొప్పందంపై  సంతకాలు చేసింది. దీనితో బ్రిటన్ తో కలిసి వుండాలా, వేరుపడి స్వతంత్ర దేశంగా ఏర్పడాలా అనే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి స్కాట్ లాండ్ ప్రజలకు అవకాశం లభించింది.
దరిమిలా ఈనెల పద్దెనిమిదో తేదీన కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య రిఫరెండం జరిగింది. 'స్కాట్ లాండ్ స్వతంత్ర దేశంగా ఏర్పడడాన్ని మీరు కోరుకుంటున్నారా?' అని ప్రశ్న అడగాలని ముందు స్కాటిష్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రశ్న తీరులోనే వోటర్లను ఎలా జవాబు ఇవ్వాలని కోరుకుంటున్నారో తెలిసిపోతుందని ఎలక్షన్ కమీషన్  దాన్ని త్రోసిపుచ్చింది. 'స్కాట్ ల్యాండ్ స్వతంత్ర దేశంగా వుండాలనుకుంటున్నారా?' అని ఆ ప్రశ్న రూపాన్ని మార్చాలని భావించింది. ఈ ప్రశ్నకు వోటర్లు 'అవును' అనికానీ, 'లేదు' అని కానీ క్లుప్తంగా  జవాబు ఇవ్వాల్సి వుంటుంది. మొత్తం దేశం యావత్తు ఈ 'అవును' కాదు' అనే బృందాలుగా విడిపోయి ఉదృతంగా ప్రచారం కొనసాగింది.
ఎట్టకేలకు జరిగిన రిఫరెండంలో 'కలిసి ఉండాలని కోరుకునే' వారికే మెజారిటీ లభించింది.

(20-09-2014)