30, జులై 2021, శుక్రవారం

మా అమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

 (ఈరోజు ఇంగ్లీష్  తేదీల ప్రకారం మా అమ్మగారి పుణ్య తిధి)

మా అమ్మగారి పేరు వెంకట్రామమ్మ. ఆమె కృష్ణా జిల్లా గండ్రాయిలో 1907 నవంబర్ ఒకటో తేదీన జన్మించింది. తండ్రి కొండపల్లి శ్రీనివాసరావు. తల్లి వెంకటమ్మ. పుట్టింటి వారిది శ్రీవత్స గోత్రం. చిన్న తనంలోనే తల్లీ తండ్రీ గతించారు. బాల్యం చాలా ఇబ్బందులతో గడిచిందని చెబుతారు. ఆమె పెద్దన్న గారు కొండపల్లి రామచంద్ర రావు కష్టపడి చదువుకుని ప్లీడరుగా బెజవాడలో ప్రాక్టీసు పెట్టి పేరుమోసిన న్యాయవాదిగా కీర్తి గడించారు. ఆయన నివాసం వున్న రోడ్డుకు ఆయన పేరే పెట్టారు. రెండో అన్న కృష్ణారావు గారు గండ్రాయి కరణీకం చేస్తుండేవారు.

మా నాన్న గారు భండారు రాఘవ రావు గారు. ఆయన కంభంపాడు కరణం. పర్వతాలయ్య గారి పెద్ద కుమారుడు. ఆయనకు వివాహం చేయడానికి మా తాతగార్లు ముగ్గురూ గుమ్మడిదుర్రో మరే వూరో గుర్తులేదు – వెళ్లి పిల్లను చూసి సంబంధం అనుకూలంగానే వుందనుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారుట. అదేసమయానికి, అప్పటికింకా ప్రాక్టీసు మొదలుపెట్టని మా పెద్ద మేనమామ రామచంద్రరావు గారు మా వూరు వచ్చి ఇంటి అరుగు మీద కూర్చుని మా తాతల రాకకోసం ఎదురు చూస్తున్నారు. మా నాన్న గారికి, ఆయన చెల్లెల్ని అంటే మా అమ్మగారిని ఇవ్వాలని వచ్చిన సంగతి అర్ధం చేసుకున్న మా తాతగార్లు అప్పుడేం చేయాలన్న మీమాంసలో పడ్డారు. వారు వెళ్లి వచ్చిన సంబంధం వాళ్లు చాలా కలిగిన వాళ్లు. పదెకరాల తోట, సొమ్ములు పెడతాం అని చెప్పారట. ఇటు చూస్తే మా మేనమామ వాళ్ళది వేలు విడిచిన మేనరికం. బాగా లేమిలో వున్న కుటుంబం. ‘యేది ఏమయినా రామచంద్రం వచ్చి కూర్చుని పిల్లను ఇస్తానంటున్నాడు. కనుక మేనరికం కాదని బయటకు పోవడం ఉచితం కాద’ని తీర్మానించుకున్న మా తాతగార్లు రామచంద్రరావును లోపలకు పిలిచి సంబంధం ఖాయం చేసారుట. అలా అయింది మా నాన్న గారితో మా అమ్మగారి పెళ్లి. ఈ నాటిలా కాసులకు కాకుండా బంధుత్వాలకు ప్రాధాన్యం ఇచ్చే రోజులవి.

అలా కంభంపాడులో మా ఇంటి గడప తొక్కిన మా అమ్మ, దాదాపు అరవై ఏళ్ళపాటు ఆ ఇంటితో అనుబంధం పెంచుకుంది. మొత్తం పన్నెండు కాన్పులు. ఒక పిల్లవాడు (ఏడో కాన్పు) పురిటిలో పోగా, ఏడుగురు ఆడపిల్లలూ, నలుగురు మగపిల్లలు కలిగారామెకు.

కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, ముని మనుమలు, ముని మనుమరాళ్లనే కాకుండా ముని ముని మనుమరాళ్లను కూడా కళ్ళారా చూసుకోగలిగిన పూర్ణ జీవితం గడిపింది.

“1993 జులై 30 నాడు – ఆ రోజు శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం – శుద్ద త్రయోదశి, అంతా వరలక్ష్మీ వ్రతం నోచుకున్నారు. ముత్తయిదువలు రావడం, ఫలహారాలు చేయడం, వాయనాలు తీసుకుని వెళ్లడం అంతా అయిపోయింది. ఇల్లంతా సందడి ఓ పక్క. మరో వైపు మరణ శయ్యపై అమ్మ. ఆ రోజు ఉదయం నుండి అమ్మ ఆరోగ్యం క్షీణిస్తూ వుంది. ఏ క్షణానికి యేమో అన్నట్టుగా వుండడంతో, అందరికీ కబురు వెళ్ళింది. చివరకు ఆ రాత్రి ఎనిమిది గంటల ఇరవై అయిదు నిమిషాలకు, ఇచ్చిన ‘కీ’ అయిపోతే గడియారం దానంతట అదే ఆగిపోయినట్టు అమ్మ ప్రశాంతంగా తుది శ్వాస విడిచింది. మమ్మల్ని అందర్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. సంవత్సరం క్రితం కనకాభిషేకం చేసుకున్న ఒక సుదీర్ఘ జీవితం ముగిసిపోయింది. మర్నాడు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరిగిన అంత్య క్రియలకు అశేష సంఖ్యలో బంధు మిత్రులు తరలి వచ్చారు.

మూడో రోజు ఉదయం, అస్తి నిమజ్జనం గురించిన ప్రస్తావన వచ్చింది. చిన్న అల్లుడు, భారతి అక్కయ్య మొగుడు తుర్లపాటి పాండురంగారావు గారు ‘కాశీ వెళ్లి గంగలో కలిపితే బాగుంటుంద’ని సూచించారు. దానిపై చర్చ సాగి సాగి అసలు మొత్తం కర్మ కాండ కాశీలోనే చేస్తే బాగుంటుందన్న సలహాను అంతా సమర్ధించారు. ఆ విధంగా కాశీ ప్రయాణం దైవికంగా నిర్ణయం అయిపోయింది. అమ్మ అపర కర్మలు యావత్తు సమీప బంధు జన సమక్షంలో కాశీలో జరగడం ఓ విశేషం ”


( 1987 నేను మాస్కో వెళ్లేముందు మా అమ్మగారు జీవించి వున్నప్పుడు కొందరు కుటుంబ సభ్యులతో తీసిన ఫోటో )

29, జులై 2021, గురువారం

పూర్తి అయిన జీవిత పదబంధం

 ఆదివారం వచ్చిందంటే మా ఆవిడకి నాలుగాటలు సినిమా చూసిన సంబరం. పదబంధాలు, గళ్ళనుడికట్లు వాటితోనే పొద్దంతా గడిచిపోతుంది, ఆదివారంనాడు  డైలీ సీరియళ్ళు టీవీల్లో రావనే బెంగ లేకుండా.

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున తీసిన ఫోటో ఇది. పక్కన మరో కుర్చీలో కూర్చుని కంప్యూటర్ పై పనిచేసుకుంటున్న నేను ఎందుకో లేచివచ్చి ఈ ఫోటో తీశాను.

అదే ఆమె ఆఖరి ఫోటో అవుతుందని ఆ ఉదయం ఆమెకూ తెలియదు, నాకూ తెలియదు.

ఆ కుర్చీ ఆ టేబుల్ అలాగే వున్నాయి, ఆమె లేదు.



మూడు వారాల్లో మనుషులు ఇలా మాయం అయిపోతారా!

28, జులై 2021, బుధవారం

కేసీఆర్ వ్యూహాల వెనుక లెక్కలేంటి..? | KCR Master Plan on Huzurabad By Po...

ఈ ఆధాన్ ప్రధాన్ ఎందుకయిందంటే

‘ఎందుకండీ ఈ వెబ్ ఛానల్స్ కు ఇంతర్వ్యూలు. మీరు చెప్పినదానికి, వాళ్ళు పెట్టే హెడ్డింగులకు పొంతన వుండదు’ అని చాలా మంది హితైషుల హితవచనాలు. ఇదిగో  ఆ సమయంలో ఈ ఆధాన్ టీవీ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఇందులో నాకు కనిపించిన ప్లస్ పాయింట్లు ఏమిటంటే :

ఇది లైవ్ టెలికాస్ట్. మనం చెప్పింది చెప్పినట్టు అప్పటికప్పుడే  గాలిలో కలుస్తుంది. మధ్యలో కత్తిరింపులు, యాడింగులు గట్రా వుండవు. శీర్షికల తలనొప్పిలేదు.

చెప్పిన ప్రతి మాటకు మనమే బాధ్యులం. నేను అలా అనలేదు అని చెప్పి తప్పించుకోవడానికి వీలుండదు. అంచేత వళ్ళు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. అది మన మంచికేగా!

పొతే అంతా జూమ్ వ్యవహారం.  యాంకర్ ఒకచోట, మనం మన ఇంట్లో. గడపదాటి బయటకు పోనక్కరలేదు, ఈ కరోనా కాలంలో.      





26, జులై 2021, సోమవారం

సంచలనం రేపుతున్న రామోజీ లేఖ


Aadhan Media  ఛానల్  ఇంటర్వ్యూలో యాంకర్ శేషుకు ఇచ్చిన ముఖాముఖి 






https://youtu.be/SMMmxSJ8pNs

దేవుడ్ని ఒదిలేయండి! - భండారు శ్రీనివాసరావు

 బుడుగును 'బుడుగూ' అని పిలుస్తారు బాపూరమణలు

'బుడ్గూ' అంటాడు గోపాళం
'హారి బుడుగు కన్నా' అంటుంది వాళ్ళమ్మ
'బుడుగా ఏంటి అసహ్యంగా మడుగూ బుడుగూ. పేరు లేదా ఆయ్' అంటాడు అగ్నిహోత్రావధాన్లు
'బుడుగు అసలు పేరు చాలా పొడుగు. అందుకే బుడుగూ అంటాం వాయ్' అంటాడు రమణ గారి జోకుకి కాపీరైట్ తీసుకుంటూ గిరీశం
'ఏంది గురూ ఈ పేర్ల గోల' అంటుంది సీగానపెసూనాంబ
శాల్తీ ఒక్కడే. పేర్లు అనేకం. బుడుగన్నా, కన్నా అన్నా, ఏం గురూ అన్నా, ఏ పేరు పెట్టి పిలిచినా, అసలు ఏపేరు పెట్టకుండా అరేయ్ ఒరేయ్ అని పిలిచినా ఎంచక్కా పలుకుతాడు బాపూరమణల బుడుగు.
అలానే దేవుడు!
దేవుడికి కావాల్సింది నమ్మకం. దేవుడున్నాడనే నమ్మకం. నిజం చెప్పాలంటే నమ్మకానికి మరో పేరే దేవుడు. అందుకే అంటారు 'తొక్కితే రాయి, మొక్కితే సాయి'
దేవుడి పేరుపెట్టి మనుషులు ఘోరాలు చేయకుండా కనిపెట్టి చూసుకుంటే, చాలు మిగిలినవన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు.
'దేవుడున్నాడా వుంటే చూపించు' అనే మాటలన్నీ పనికిమాలిన పలుకులు. 'దేవుడే అన్నీ చూసుకుంటాడు' అని అన్నీ ఆయనకే ఒదిలి చాప చుట్టేయడం ఇంకా పనికి మాలిన పని.
గజేంద్ర మోక్షం పద్యాలు రాస్తున్నప్పుడు భక్త పోతన్న గారికే అనుమానం వచ్చింది, 'కలడు కలండనెడి వాడు కలడో లేడో' అని.
మనమనగానెంత?
వ్యర్దవాదాలు మాని ఎవరి పని వారు చూసుకుంటే అందరి పని ఆ దేవుడే చూసుకుంటాడు.
అంచేత ఆయన మానాన ఆయన్ని ఒదిలేయండి.
ఎందుకంటే,
దేవుడు మనలాగా కాదు. ఆయనకి బోలెడు పనులుంటాయి.




24, జులై 2021, శనివారం

పేరెంట్స్ డే

 (ఈ పదాన్ని తెనిగించడం నాకు మంచిగా అనిపించలేదు. అందుకే అలానే ఉంచేశాను)


“చూస్తుండండి. ఏనాటికో ఓనాడు మనవాడు మనం గర్వపడేలా గొప్పవాడు అవుతాడు” అంటుంది తల్లి.
“నాకూ వాడు ప్రయోజకుడు కావాలనే వుంది. కానీ వాడి తరహా చూస్తుంటే నమ్మకం కుదరడంలేదు” అది తండ్రి అభిప్రాయం.
వీరి అంచనాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు.
కానీ.. ఆ తల్లిది ఆకాంక్షతో కూడిన అతివిశ్వాసం, ఆ తండ్రిది అపనమ్మకంతో కూడిన అభిలాష . ఇద్దరిదీ ఒకటే కోరిక, తమ పిల్లలు ప్రయోజకులు కావాలనే. తేడా అల్లా భావవ్యక్తీకరణలో. కల్మషం, కల్తీలేని ప్రేమ కన్నవారిది.
పిల్లలు పిల్లలుగా వున్నప్పుడు అనేకమంది తలితండ్రులది ఇదే పరిస్తితి. పిల్లలందరు పెద్దవాళ్ళు అవుతారు. కొద్దిమందే నిజంగా గొప్పవాళ్ళు కాగలుగుతారు. జీవితంలో బాగా ఎదిగొచ్చిన అనేకమంది సినీ నటులు, ఇతర రంగాల ప్రముఖులు పత్రికలకి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఒక మాట చెబుతుంటారు, ‘తలితండ్రులు కష్టపడితే ఇలా పైకి వచ్చాం, కానీ మా ఎదుగుదలను మా కన్నవాళ్ళు కళ్ళారా చూడలేకపోయారనే బాధ మాత్రం మిగిలింది” అని.
తలితండ్రుల ప్రేమకు గుర్తింపుగా వారి పేరిట ప్రపంచ వ్యాప్తంగా ఒక దినాన్ని కేటాయించారు.
మన దేశంలో ఈ ఏడాది, 2021 జులైలో వచ్చే ఆఖరి ఆదివారం పేరెంట్స్ డే. అంటే జులై, 25.
“ప్రపంచవ్యాప్తంగా తలితండ్రులను ఆదరించండి, ప్రేమించండి” అనేది ఈ ఏడాది పేరెంట్స్ డే నినాదం.
మన మేలుకోరే శ్రేయోభిలాషులు చాలామంది వుంటారు. కానీ మనం ఈ భూమి మీదకు రాకముందునుంచి మనల్ని మనసారా ప్రేమించేది, మనం బాగుండాలని కోరుకునేది మన తలితండ్రులు మాత్రమే.
(25-07-2021)

గుర్రం ఎగరావచ్చు.... భండారు శ్రీనివాసరావు

 కొన్నేళ్ళ క్రితం ఒక వారపత్రిక వాళ్ళు నేను రాసిన మాస్కో అనుభవాల కూర్పు, ‘మార్పు చూసిన కళ్ళు’ రచనని సీరియల్ గా వేస్తామని చెప్పి, ప్రచురణ మొదలయ్యే తేదీని కూడా నిర్ణయించి సరిగ్గా ఆఖరు నిమిషంలో మనసు మార్చుకున్నారు. వాళ్ళు నాకు స్వయంగా చెప్పిన కారణం ఏమిటంటే, ఈ రచన ఇంతకుముందే నా బ్లాగులో వచ్చినందువల్ల, తమ పత్రిక నియమనిబంధనల ప్రకారం ప్రచురించ లేకపోతున్నామని. నేనూ ఒకప్పుడు పత్రికల్లో పనిచేసిన వాడినే కనుక, నియమాలకు కట్టుబడి మాట్లాడకుండా లేచి వచ్చేశాను.

ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలు సాంఘిక మాధ్యమాల్లో వచ్చిన వాటిని ‘ఎత్తిపోసి’ మరీ ప్రచురిస్తున్నారు. ట్వీట్ల సంగతి చెప్పక్కరలేదు. ఏకంగా అవి పతాక శీర్షికలలో దర్శనమిస్తున్నాయి.

కాలం తెచ్చే మార్పులముందు ఏ నియమాలూ, నిబంధనలూ నిలబడలేవేమో!

23, జులై 2021, శుక్రవారం

ఈ సినిమాలు మీ కోసం కాదు – భండారు శ్రీనివాసరావు

 పత్రికల్లో ప్రకటనల ఖర్చు లేదు. నటీనటుల పారితోషికాల భారీ భారాలు లేవు. ధియేటర్లు దొరకవన్న బాధ లేదు. తీయడం వదలడం. అదేమిటో, కరోనా కూడా ఈ సినిమా నిర్మాణాలకు అడ్డంకి కాలేదు.  

మధ్యాన్నం భోజనం చేయగానే పిల్లలు ఆహానో ఓహోనో ఏదో ఒక ప్లాట్ ఫారం మీద ఓ ఓటీటీ సినిమా పెడతారు. ఈ సినిమాల  కోసమే పుట్టారు అన్నట్టు కొందరు గడ్డపు హీరోలు. ఒక చేతిలో సిగరెట్టూ, మరో చేతిలో మందు గ్లాసు. “ధూమపాము, మద్యపానము ఆరోగ్యానికి హానికరం” అనే  చట్టబద్ధ హెచ్చరికను సినిమా నడిచినంత సేపు వేసుకోవాల్సిన దుస్థితి. ఏమైనా సరే, హీరోయిన్ ను పెళ్ళాడడమే హీరోయిజం అనే తరహాలో ఏదో పగబట్టినట్టు ఆమెను  భౌతికంగా, మానసికంగా   హింసించడం,  పూటుగా తాగి, ఆమె ఇంటిమీదకు వెళ్లి  తలితండ్రులతో నానా గొడవ పడడం. కన్నవారిని హేళన చేయడం. ఆ హీరోకి తోడు ఓ చిన్న స్నేహితుల ముఠా. దాదాపు ప్రతి సినిమాలో ఇవే సీన్లు రిపీట్.      

ఆడపిల్లలు క్లబ్బుల్లో అర్ధరాత్రి దాకా తాగడాలు. ఆపైన వారిపై దౌర్జన్యాలు ఇవన్నీ వీటిల్లో  చూస్తుంటే కంపరంగా అనిపిస్తోంది.

వెనక అనేవాళ్ళు వివిధ భారతిలో మంచి పాటలు వినాలంటే చేపలు పట్టేవాడికి వుండేంత ఓపిక వుండాలని. ఎంతో వేచి చూస్తేనే  గాలానికి ఓ మంచి చేప పడేదిట. అలాగే  ఓపికతో వినగా వినగా రేడియోలో ఒక మంచి పాట వినబడుతుందట. ఈ ఓటీటీలో కూడా అంతే! ఎప్పుడో  ఓసారి తగులుతుంది  ఓ మంచి చిత్రం మళయాళం సినిమా డబ్బింగు రూపంలో.

ఇప్పటిదాకా  ఓ పాతిక ముప్పయి ఇలాంటి సినిమాలు చూసివుంటాను. అయితే అన్ని సినిమాలు కలిపి ఓ అరగంట కూడా చూసి ఉండను. పది నిమిషాలు చూడగానే విసుగుపుట్టి తర్వాత నా పనేదో నేను చూసుకుంటాను.

వీటిల్లో కనీసం ఓ పాతిక చిత్రాల మీద ఫేస్ బుక్ లో ఓసారి చూడొచ్చు అనే కితాబులు కనిపించాయి.

అది ఆశ్చర్యం.

‘ఈ సినిమాలు మీ తరం కోసం కాదులే అంకుల్. మీ ముందు తరం వాళ్ళు మెచ్చిన సినిమాలు మీరెన్ని చూసారు?’ అని అడిగాడు ఓ బంధువుల అబ్బాయి.

ఆ అబ్బాయి చెప్పింది మాత్రం పచ్చి నిజం.

తరం మారినప్పుడు అభిరుచులు కూడా మారతాయి.

(23-07-2021)

“ట” మాయమైపోయింది – భండారు శ్రీనివాసరావు

 

(మూడేళ్ల క్రితం వారాలబ్బాయి మాదిరిగా ప్రతి రోజూ ఒక టీవీ చర్చకు పోయివచ్చే రోజుల్లోని ముచ్చట)

AP 24 X 7 తెలుగు న్యూస్ ఛానల్ లో ప్రతి సోమవారం మాదిరిగానే ఈరోజు ఉదయం ((23-07-2018)

 Morning Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో, రాజకీయ నాయకులు మాట మార్చడాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గుర్తున్నంతవరకు నేను చెప్పిన విషయాల్లో కొన్ని: (సరిగ్గా ఇలాగేఅని కాదు, ఓ మోస్తరుగా ఇలాగే)

“తెలుగు అక్షరమాలలో ‘ట’ అనే అక్షరం మాయమయిపోయినట్టుంది. అదివరకు ఏవైనా విన్నవి, అనుమానం వున్నవి చెప్పేటప్పుడు ‘అన్నాడుట’, ‘చెప్పాడుట’ అని అనేవారు. ఇప్పుడు అలాకాదు, ఎదురుగా వుండి తన చెవులతో విన్నట్టు, ‘అలా అన్నాడు, ఇలా చెప్పాడు’ అనేస్తున్నారు. ‘వెనక ఎన్టీ రామారావు గారు, కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ సీటు అడిగితే కాదన్నారన్న కినుకతో ఏకంగా తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టాడుట తెలుసా’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ‘ట’ తీసేసి మాట్లాడుతున్నారు. దీనివల్ల మీడియా పని కూడా తేలిక అయింది. ప్రయాస పడి, సోర్సులను పట్టుకుని వార్తను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పని లేదు. అసలు వాళ్ళే నేరుగా మీడియాకు, అదీ కెమెరాల ముందు నిలబడిమరీ చెప్పేస్తున్నారు. ‘హోదా కావాలని చెప్పగలరు, అదే నోటితో హోదా కావాలని ఎప్పుడు అన్నామో చెప్పండి’ అంటూ మీడియానే ఎదురు ప్రశ్న వేయగలరు. వాళ్ళూ వీళ్ళూ కాదు,  స్వయంగా నాయకులే ఆ మాటలు  చెబుతున్నారు. టీవీ చర్చల్లో తమ నాయకుల వ్యాఖ్యలని సమర్ధించలేక ఇబ్బంది పడే పార్టీ ప్రతినిధులను మనం రోజూ చూస్తూనే వున్నాం.

“నేను మూడేళ్ళ నుంచీ మీడియా చర్చల్లో ఒకటే చెబుతూ వస్తున్నాను. హోదా విషయంలో వైఖరులు మార్చి మాట్లాడకండి. ఇప్పటివరకు అది భావోద్వేగ అంశం కాలేదు. ఒకసారి అలా రూపం మార్చుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఉదాహరణ తెలంగాణా ఉద్యమం. లక్ష కోట్ల ప్యాకేజీ ఇస్తానన్నా ఒప్పుకోలేదు. తెలంగాణా తెచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ప్రభ వెలిగిపోతున్నరోజుల్లోనే, ‘హోదా అనేది మారిన పరిస్తితుల్లో సాధ్యం కాదు, ప్రత్యామ్నాయం చూస్తాము’ అని చెప్పి వుంటే, ప్రజలకు నచ్చచెప్పి  వుంటే, ఎవరెన్ని చెప్పినా ప్రజలు  వారి మాటనే నమ్మేవారు. ప్రజల్ని మీరు  విశ్వాసం లోకి తీసుకుంటే  వాళ్ళు  మిమ్మల్ని నమ్ముతారు.  అప్పుడేమో ప్రతివారూ హోదా తధ్యం అన్నట్టు మాట్లాడారు. తరువాత కుదరదన్నారు. 

“వెనక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పట్టుకుంటే లక్ష అనో పదివేలనో ఒక సినిమా వచ్చింది. ఒక చిన్నపాప ఆడుకునే బొమ్మలో లక్షలు ఖరీదు చేసే వజ్రాలు దాస్తారు. అది చేతులు మారుతుంటుంది. కానీ విషయం తెలియక ఎవరూ ఆ బొమ్మను సీరియస్ గా తీసుకోరు. ఒకసారి వజ్రాలు ఎక్కడ వున్నాయో తెలియగానే అందరూ ఆ బొమ్మ వేటలో పడతారు. ఇప్పుడు హోదా వ్యవహారం కూడా ఆ బొమ్మ మాదిరిగానే తయారయింది. ఎన్నికల వైతరణి దాటాలంటే హోదా అస్త్రం ఒక్కటే శరణ్యం అని తెలియగానే అన్ని పార్టీలు హోదా మంత్రం మొదలు పెట్టాయి”

“చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు కరక్టు టైము చూపిస్తుంది. ఆ మాదిరిగా రాజకీయం కోసం రాజకీయం చేయండి. పార్టీలుగా మీకు తప్పదు. కానీ, కనీసం కొంతయినా ప్రజలకోసం చేయండి. అన్ని పార్టీలకి నా విజ్ఞప్తి ఇదే”

23-07-2021

Below File Photo



22, జులై 2021, గురువారం

పెగాసస్ గుర్తు చేసిన పాత పోస్టు

“మరుగేలరా ఓ రాఘవా” అని పాడుకునే రోజులకు రోజులు దగ్గర పడుతున్నాయి. ఇక ముందు ముందు మనుషుల జీవితాల్లో చాటు మాటులు వుండవు. అంతా బహిరంగమే. ‘బతుకు బస్ స్టాండ్’ అనుకుంటూ బాధపడే భవిష్యత్తు ఎలా వుంటుందో తెలిపే ఓ ఆంగ్ల కధనం ఒకటి ఇప్పుడు (అంటే పదేళ్ల క్రితం) నెట్లో షికార్లు చేస్తోంది. దానికి స్వేచ్చానువాదం:

2020లో బ్రేక్ ఫాస్ట్ ఆర్డర్ చేయడం కోసం చట్నీస్ కు ఫోన్ చేస్తే ఆ సంభాషణ ఇలా సరసంగా సాగుతుంది.
“గుడ్ మార్నింగ్. నాకు వెంటనే నాలుగు ప్లేట్లు .....”
“ఒక్క నిమిషం సర్! మీ మల్టీ పర్పస్ కార్డ్ నెంబర్ చెబుతారా?”
“కార్డు నెంబరా! ఒక్క నిమిషం ఆగండి చూసి చెబుతాను..... నా నెంబరు ... 889861356102049 998-45-54610"
“థాంక్స్. పొతే ఫాక్ట్ చెక్ చేసుకుంటాను. దయచేసి సహకరించండి. మీ పేరు ఏకాంబర రావు. మాదాపూర్ లో మహారాజా ఛాట్ ఎదురుగా వున్న అపార్ట్ మెంటులో నాలుగో అంతస్తులోని ఫ్లాట్లో వుంటారు. మీరక్కడ ఏడాదిగా అద్దెకు వుంటున్నారు. మీ లాండ్ లైన్ నెంబరు 23731056. సారీ అది బీ యస్ ఎన్ ఎల్ కనెక్షన్ కావడం వల్ల కేబుల్ షార్టేజ్ కారణంగా ఇంకా షిఫ్ట్ చేయలేదు. ప్రస్తుతం ,మీ మొబైల్ నెంబరు 9999898889. ఇప్పుడు చెప్పండి. మీకేమి కావాలి?”
“నాకేమి కావాలో చెబుతాను సరే! ఇంతకీ నా ఫోను నెంబర్లు, నా వివరాలు మీ దగ్గర ఎలావున్నాయి?”
“సిష్టంతో కనెక్ట్ అయివున్నాం సర్”
“సరే! నాకు త్వరగా నాలుగు ప్లేట్లు బాబాయి ఇడ్లీ ...”
“వన్ మినిట్ సర్! మీరు మొన్న ఉదయం మీ భార్యతో కలసి వెళ్లి శ్రీనగర్ కాలనీలోని క్లినిక్ లో షుగర్ చెక్ చేయించుకున్నారు. ఆ రిపోర్ట్ ప్రకారం మీరు ఉదయం పూట ఇడ్లీ తినడం అంత శ్రేయస్కరం కాదు. మీ ఆవిడ రిపోర్ట్ బాగానే వుంది. ఆమెకు ఇడ్లీ చెబుతాను. మీకు బ్రౌన్ బ్రెడ్ శాండ్ విచ్ ఆర్డర్ చేస్తాను.”
“ఓకే! బిల్లు సుమారుగా ఎంతవుతుంది?”
“యెంత సర్! చాలాతక్కువ. సర్వీస్ చార్జ్ కాకుండా పన్నెండు వందలు”
“కార్డు మీద పే చెయ్యవచ్చా?”
“తప్పకుండా. కాకపోతే చిన్న ప్రాబ్లం సర్! కంప్యూటర్ చెబుతున్నదాన్నిబట్టి చూస్తే మీ క్రెడిట్ కార్డు క్రెడిట్ రికార్డు ఏమీ బాగాలేదు. ఇప్పటికే మూడు వాయిదాలు కట్టలేదు. హౌసింగ్ లోన్ బకాయి కూడా పేరుకు పోయివుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా క్యాష్ మాత్రమే కట్టాల్సి వుంటుంది”
“ ఓ షిట్! ************”
“సర్! మీరు అసభ్యంగా మాట్లాడుతున్నారు. అసలే మీ మీద బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఒక కేసు నమోదయి వుంది. మూడు రోజుల క్రితం బార్ నుంచి కారులో వస్తూ పోలీసులకు పట్టుపడి వాళ్ళతో తగాదా పెట్టుకున్నారని రికార్డ్ చెబుతోంది. కాబట్టి మరో కేసుకు అప్పుడే తొందర పడవద్దని మర్యాద పూర్వకంగా సలహా ఇస్తున్నాను.”
“ఓ! షి..... వద్దులే. మీ టిఫిన్ వద్దు నా పిండా కూడూ వద్దు. ఈ పూటకు ఇంట్లోనే ఏదో వండుకు తింటాం తల్లీ!”
“అదిగో సర్! అదే వద్దన్నాను. తల్లి ఏమిటి తల్లి! బల్లి లాగా...”
ఇవతల వ్యక్తి పరిస్తితి చెప్పక్కరలేదు. ఊహించుకోవచ్చు. ఏదో చిత్రంలో బ్రహ్మానందం పాత్ర మాదిరిగా కింద పడి గిల గిలా కొట్టుకుంటున్నాడు.

21, జులై 2021, బుధవారం

దేవుడు ఫేస్ బుక్ చదువుతాడా!

చదువుతాడనిపిస్తోంది నా వరకు.

రెండేళ్ల క్రితం, అంటే 2019లో ఇదే రోజున ఈ కింది పోస్టు పెట్టాను, దేవుడి ప్రస్తావనతో. అంతే!
నెల తిరగకుండానే నా తిక్క కుదురుస్తూ, మా ఆవిడని తీసుకువెళ్ళిపోయాడు.
పెళ్ళికి పూర్వం తర్వాత – నేనూ మా ఆవిడ
పెళ్లి కాక ముందు నేను వీర దైవభక్తుడిని కాకపోయినా చిన్నతనం నుంచి దేవుడంటే భయం భక్తీ పుష్కలంగా ఉండేవి. పొద్దున్నే లేచి రాముడు మంచి బాలుడి మాదిరిగా స్నానం వగయిరా ముగించుకుని నుదుటి మీద విభూతి పట్టీ వేసుకుని అలా నడుచుకుంటూ గవర్నర్ పేట చెట్ల బజారులోని శివాలయానికి వెళ్లి ముమ్మారు ప్రదక్షిణలు చేసి, శివలింగం ఎదుట సాష్టాంగనమస్కారం చేసి దైవ దర్శనం అనంతరం కాసేపు గుడి ప్రాంగణంలోనే బాసింపట్టు వేసుకు కూర్చుని తెలిసిన స్త్రోత్రాలను బిగ్గరగా చదివిన తరువాతగానీ మరో పని చేసేవాడిని కాను.
పెళ్ళికి ముందే మా ఆవిడ నాకు తెలుసు. తలితండ్రులకి ఏకైక సంతానం కావడం వల్లనో ఏమో ఆమె పెరిగిన తీరే వేరు. ఆడింది ఆటా పాడింది పాటా. అంచేత ఈ భక్తి కాలమ్ ఆమెలో పూర్తిగా సున్నా.
అలాటిది పెళ్ళయిన తర్వాత పాత్రలు తిరగబడ్డాయి. అన్నీ కనిపెట్టి చూసే భార్య దొరికిందని, ఇక దేవుడి అవసరం ఏముందని నేను ఆయనపై శీతకన్ను వేశాను. ఇలాటి మొగుడ్ని కట్టుకున్న తర్వాత దేవుడే దిక్కనుకుందో ఏమో ఆవిడ భక్తి మార్గం పట్టింది.
ఇప్పుడు ముప్పూటా ఆవిడ పూజలూ, వ్రతాలూ. నేను నా పద్దతిలో మిత్రులతో కలిసి సాయంకాలక్షేపాలు.
ఎవరి గోల వారిది.



(21-07-2019)

20, జులై 2021, మంగళవారం

ఇదో రకం తుత్తి

 అప్పుడప్పుడు ఇలా కూడా అభిప్రాయం అడిగి తీసుకుని అచ్చులో నా పేరు వేస్తుంటారు. అదో తుత్తి. థాంక్స్ రిషిక

LINK to PRINT


https://theprint.in/politics/how-congress-became-irrelevant-in-andhra-pradesh-in-a-span-of-just-7-years/698407/

ప్రజాసేవ

 ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:

“ఐ.ఐ.టి. టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”

“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”

విలేకరి:

“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?

“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో  రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”

విలేకరి:

“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?

“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”

ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!

చివరికి ప్రజాసేవ కూడా సోషలిజం లాగా అర్ధం పర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.

తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.  

సెంఛురీ దాటిన పెట్రోలు ధర

(ఈరోజు 25-07-2021 ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం) 

పెట్రోలుకు మండే గుణం వుంది. గులాబీ సువాసన గులాబీ ముల్లుకు అంటినట్టు ఈ మండే గుణం పెట్రోలుతో పాటు దాని ధరకు కూడా అబ్బింది. అందుకే  పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా పెట్రో మంటలు అని మీడియాలో చమత్కరిస్తుంటారు.

పెట్రోలు ధర వంద రూపాయలు దాటిపోయింది. దాంతో పాటే డీసెలు ధర కూడా పోటీ పడుతోంది. ఇంకా పెరగడానికి అవకాశం ఉన్న నిత్యావసర వస్తువుల్లో ఈ రెండూ ఏనాడో చేరిపోయాయి. అంచేత ఆశ్చర్యం అనిపించలేదు.

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటి. నిజానికి ఈ ధరవరల వ్యవహారం ప్రభుత్వం చేతిలో లేకపోయినా ఆ నింద మోయక తప్పదు. ఎందుకంటే ఎంత చేతిలో లేని సంగతి అయినా, ప్రభుత్వం తలచుకోకుండా ఇలాంటివి జరగవు అని స్కూల్లో చదివే పిల్లాడు కూడా చెబుతాడు.

గతంలోను గత ప్రభుత్వాలు ఈ విమర్శలు ఎదుర్కున్నాయి. ఇప్పటి ప్రభుత్వానికీ ఇవి తప్పని తలనొప్పే.

ఈ విమర్శకులు సాధారణంగా తమ వాదనకు మద్దతుగా చెప్పే విషయం ఒకటుంది. అది క్రమంగా ఓ పడికట్టు పదంగా మారిపోయింది. అదేమిటంటే అంతర్జాతీయ చమురు ధరలు, తగ్గుతున్నప్పుడు, లేదా మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధరలు పడిపోతున్నప్పుడు, పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎలా పెరుగుతున్నాయి? ఎవరూ వంక పెట్టడానికి వీల్లేని వాదన.

ఒకానొక కాలంలో (అప్పటికే ఈ ఆటోమేటిక్ ధరవరల విధానం అమల్లోకి వచ్చింది, ఇదేమీ కొత్త విషయం  కాదు) అంటే నేను రేడియోలో విలేకరిగా పనిచేస్తున్నప్పుడే నేనూ ఇలాంటి వాదన నెత్తికెత్తుకుని పెట్రోలియం శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారిని అడిగాను.

ఆయన ఏం చెప్పారు అంటే:

“దేశం ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాధన దిశలో వెడుతోంది. కొత్త చమురు నిక్షేపాల అన్వేషణకు, ముడి చమురు వెలికి తీయడానికి, దాన్ని శుద్ది చేయడానికీ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఈ పెంచిన ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో  కొంత మొత్తాన్ని ఆ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఒక్కసారి ఈ లక్ష్యం నెరవేరితే ఇక దిగుమతుల భారం లక్షల కొట్లలో తగ్గే అవకాశం వుంటుంది”

అంటే అప్పటిదాకా ప్రజలు ఈ పెంచిన ధరలు భరిస్తూ కొంత త్యాగం చేయాల్సి వుంటుంది.

‘బాగానే వుంది మీరు చెప్పిన సంగతి. కానీ భారతీయ పెట్రో సంస్థలు వ్యయ నియంత్రణ పాటిస్తున్నట్టు కనపడదు. పలానా బ్రాండు చమురు (వాహనాల్లో వాడేది) కొనండి అని పత్రికల్లో, మీడియాలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుంటారు. ఆ ఖర్చు అవసరమా! ఏ ప్రచారం లేకపోయినా, అవసరానికి  కొనే ఉత్పత్తులు అవి. ఇది సరే! ఇంత పేద దేశంలో ఇన్ని రకాల ప్రభుత్వ సంస్థలు అవసరమా! చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు సిబ్బంది, ఇవన్నీ వ్యయాన్ని పెంచేవే కదా!’

ఆ అధికారి నుంచి మందహాసం తప్ప సమాధానం లేకపోవడంతో నేను కాస్త రెచ్చిపోయాను.

‘పెట్రోలు బంకుల ఆధునీకరణ పేరుతొ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్లు మారినప్పుడల్లా లోగోలు దేశ వ్యాప్తంగా మారుస్తున్నారు. ఇవన్నీ అవసరమా! పెట్రో ధరలు పెంచడానికి ఇలాంటి అనవసరపు ఖర్చులు కారణం అని ఎవరైనా అనుకుంటే తప్పు పట్టగలరా”

సరే! ఆయన మాత్రం ఏం చెప్పగలరు? 

పెట్రోధరలు పెరిగినప్పుడల్లా  మరోసారి పెరిగాయి అనుకోవడం ఆనావాయితీగా మారింది. అయితే, ఈ ధరల పెరుగుదల  పెట్రోలు, డీసెలుతో ఆగిపోదు. ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితంఅలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు.

పొతేఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపే వాళ్ళుతమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలుప్రతివిమర్శలు చేసేవాళ్ళు యధావిధిగా టీవీ స్టూడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలురాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీఇది ఎవరికీ పట్టదు.

 

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందోఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. (ఈమధ్య అదీ మానేశారు, రోజూ చనిపోయేవాడికోసం  ఏడ్చేవారు ఎవరన్న చందంగా)

పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయిఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీయెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఒక రివాజుగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదననిఎడ్ల బళ్ళురిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలువెచ్చాలు కొనని కొందరు రాజకీయ ఆడంగులు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు, ఏమీ కొనేట్టులేదు’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ ఛానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ‘ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడం’ అన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండిపెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

 

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు. 

ఇదంతా ఎందుకు జరుగుతోంది ? 

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల. 

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమే కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాతతరం నుంచివున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరోతరం నుంచిఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకోతరం నుంచిఅలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన రాదారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలికొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి.

‘ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయిఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా’ అనే ఆటో డ్రైవర్, సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే ఆటో చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటేఅవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది.

ఇది సమాజంలోని అన్ని వర్గాలకు వర్తిస్తుందికాణీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప.