29, జులై 2017, శనివారం

ముసలితనం, పసి తనం, రెండింట్లో కామన్ మొండితనం

  
చిన్నప్పుడు మా బామ్మను చూసినప్పుడు నేనెప్పుడు ఇంత పెద్దవాడిని అవుతానో కదా అనుకునేవాడిని.  ఆమె పోయిన నలభయ్ అయిదేళ్లకల్లా  నాకామె వయసు ఈజీగా నా ప్రమేయం లేకుండానే  వచ్చేసింది. ఇంట్లో అందరికంటే వయసులో చిన్నవాడినేకావచ్చు, కానీ నేనూ ఇప్పుడు పెద్దవాడినే!
పుట్టిన ప్రతివాడికి బాల్యం వుంటుంది కాని ముసలి వయసు అనేది  ఆయుస్సునిబట్టి వుంటుంది. ఇంకో చిత్రం ఏమిటంటే మొండితనం అనే ఒక లక్షణం మాత్రం  పసితనానికి, ముసలితనం ఈ రెండింటికీ కామన్.
చిన్నప్పుడు ‘అలా చేయోద్దురా’ అనే పెద్దవాళ్ళు వుండేవాళ్ళు. ‘ఏమిట్రా అలా ముందూ వెనకా చూసుకోకుండా ఆ గెంతులు. పడితే కాలో చెయ్యో విరుగుతుంది. సిమెంటు కట్టు కట్టుకుని ఆటా పాటా లేకుండా మంచం మీద పడి వుండాలి, జాగ్రత్త!’ అంటూ వుంటారు. ‘ఏవిటో ఈ పెద్దవాళ్ళు, అనవసరంగా అన్నింటికీ కంగారు పడుతుంటారు’ అనుకుంటారు పిల్లవాళ్ళు. నేనూ అలాగే చెప్పిన మాట వినకుండా ఒకరోజు సైకిల్ మీద నుంచి పడి  చెయ్యి విరగగొట్టుకున్నాను. సర్కారు దవాఖానాలో సిమెంటు కట్టు వేస్తే దాన్ని మెడకి తగిలించుకుని మోస్తూ నలభయ్ రోజులు తిరిగాను. ‘ఇంకా నయం కాలు విరిగింది కాదు’ అనుకున్నాను. అంతే కాని ‘కాళ్ళూ చేతులు విరగగొట్టుకోవద్దు’ అన్న పెద్దల మాటలు చెవి కెక్కించుకోలేదు.
ఇప్పుడు మళ్ళీ సీను రివర్స్. ‘కాస్త జాగ్రత్త’ అంటారు పిల్లలు. ‘ఆ మాత్రం తెలియదా’ అంటుంది మనలోని మొండితనం.
‘వద్దమ్మా! అలా మిట్ట మధ్యాన్నం వరకు పూజలూ అవీ చేస్తూ కడుపు మాడ్చుకోకు. అసలే నీకు, సుగరు, బీపీ. డాక్టరు ఏం చెప్పాడు, పొద్దున్నే ఏదో ఇంత  తిన్న తరువాతనే ఏ పని అయినా అని చెప్పాడా లేదా. మళ్ళీ ఏదైనా అయితే ఇబ్బంది పడేది నువ్వే’ అంటుంటారు పిల్లలు. అందరి మాటా అంతవరకూ వింటూవచ్చి, ‘మంచి అమ్మ’  అని నలుగురి చేతా అనిపించుకున్న ఆ అమ్మ మాత్రం పిల్లలు చెప్పిన ఆ మంచి మాట వినదు.  పైగా ‘ఆ మాత్రం నాకు తెలవదా’ అనుకుంటుంది. ‘మనం పెద్దవాళ్ళం కదా పిల్లవాళ్ళ మాట వింటే ఇక మన పెద్దరికం ఏముంటుంది’ అని కూడా అనుకుంటుంది. నిజానికి ఏదైనా జరిగితే ఇబ్బంది పడేది నిజమే అయినా, అసలు ఇబ్బంది పిల్లలది.
మొన్నీమధ్య తెలిసిన దంపతులు పిల్లల్ని చూడ్డానికి అమెరికా వెళ్ళారు. ఆమెకు బీపీ, సుగరూ పుట్టింటి కట్నంగా వచ్చాయి. కావాల్సిన మాత్రలు అవీ తీసుకు వెళ్ళారు. తల్లీ తండ్రికి అమెరికాలో నాలుగు ప్రదేశాలు చూపించాలని ముచ్చటపడి పిల్లలు,  ఎక్కడికో విహార యాత్రకు తీసుకువెళ్ళారు. ఈసందడిలో మాత్రలు వెంట  పట్టుకుపోవడం మరచిపోయారు. నాల్రోజులు మాత్రలు వేసుకోకపోతే ఏం కొంప మునుగుతుందని పిల్లలకి ఆ విషయం చెప్పలేదు. చెబితే ఏదైనా ప్రయత్నం చేసేవాళ్ళేమో! చివరికి నిజంగానే కొంప మునిగింది. జబ్బున పడ్డ తల్లిని ఆసుపత్రిలో చేర్చి బయటకు తీసుకురావడానికి వాళ్ళ లెక్కలో అటూ ఇటూగా ఓ యాభయ్ లక్షలు ఒదిలాయని చెప్పుకున్నారు.  కాబట్టి ఏమిటట! చిన్నప్పుడు పిల్లల మొండితనం మనకు యెంత కోపం తెప్పించేదో గుర్తుకు తెచ్చుకుని పెద్దతనంలో మనం కాస్త మొండితనం తగ్గించుకోవాలి. ‘ఈ రోడ్డే కదా దాటి అవతల ఉన్న గుడికి వెళ్ళలేమా!’ అంటే వెళ్ళవచ్చు. అదే ఖర్మం కలిసిరాక ఏదైనా జరిగితే మంచాన పడేది పిల్లలు కాదు, మనమే  అనే విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి.
చలికాలం వస్తే మూడంకె వేసి దుప్పటి కప్పుకుని పడుకుంటాం.  ముసలి తనం కూడా అలాగే. ఆ వయసుని బట్టి దానికి తగ్గట్టు మన  మనసును కాస్త వీలుగా ముడుచుకోవాలి.
కాదూ కూడదంటే కలిగేవి ఇబ్బందులే. మనం పడడంతో సరిపోదు ఇతరులను కూడా అనవసరంగా ఇబ్బందుల పాలు చేయాల్సిరావచ్చు.

నీతి: పెద్దతనంలో మొండితనాన్ని అటక ఎక్కించాలి. లేకపోతే ‘పడక’ వేయాల్సి వస్తుంది. 

కల్యాణం కమనీయం



పూర్వాశ్రమంలో ఒక దినపత్రికలో పనిచేసేరోజుల్లో అంటే నలభయ్ ఏళ్ళకిందట రాష్ట్రంలో వేసవి వచ్చిందంటే చాలు అనేక చోట్ల అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతూ ఉండేవి. ఒకోసారి ఒకే రోజు అనేకచోట్ల నుంచి ఈ ప్రమాద వార్తలు అందేవి. వాటినన్నిటినీ కలిపి ‘వాడవాడలా అగ్నిప్రమాదాలు’ అనే ఒకే శీర్షిక కింద హోల్ మొత్తం ఫుల్ పేజీలో ఒకే చోట ప్రచురించేవారు. వేసవిలోనే పెళ్లి ముహూర్తాలు కూడా ఎక్కువగా వుంటాయి. పలానా వారి పెళ్లి పలానా వారితో పలానా రోజున జరిగిందని పత్రికలో ప్రచురించే సాంప్రదాయం ఒకటి వుండేది. అదీ చాలా ముఖ్యులు అనుకునేవారి విషయంలోనే దీన్ని పాటించేవారు. అయితే కాలక్రమంలో పత్రికలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వాళ్ళ పెళ్లి పత్రికలు పట్టుకొచ్చి, ఆ శుభలేఖలోని తేదీ ప్రకారం  పలానా రోజున పలానావారి  పెళ్లి ఘనంగా జరిగిందనే వార్త  ఆ ‘పెళ్ళిళ్ళకాలమ్’ లో అచ్చయ్యేలా తమవంతు ప్రయత్నం చేసుకునేవారు. అది ఎంతవరకు విస్తరించింది అంటే ‘వాడవాడలా వివాహాలు’  అనే శీర్షిక కింద పెళ్ళిళ్ళ వార్తలు  ప్రచురించే దుస్తితి దాపురిస్తుందేమో అని చెప్పుకుని నవ్వుకునే వాళ్ళం. అయితే చివరికి ఈ అంటు వ్యాధికి అడ్డుకట్ట ఒక పెళ్లి వార్త రూపంలోనే పడింది. పెళ్లి పత్రికల దాకా వచ్చిన ఒక పెళ్లి, పెళ్లి పీటల దాకా వెళ్ళకుండానే ఏదో కారణంతో వాయిదా పడడం, ఆ విషయం తెలియక ఆ పెళ్లి జరిగినట్టు పత్రికలో రావడం ఒక చర్చనీయాంశం అయింది. అప్పటి నుంచి ఈ ముందస్తు పెళ్లి వార్తల ప్రచురణకు ఎడిటర్ గారు స్వస్తి పలకడంతో అప్పటికా కధ ఆవిధంగా  ముగిసింది.      

28, జులై 2017, శుక్రవారం

అవినీతి, అనైతికం రెండూ కవలపిల్లలు


మన  దేశంలో అవినీతి ఆరోపణలకు అతీతులయిన రాజకీయ నాయకుల జాబితా తీస్తే అందులో మొదట కనబడే పేరు నీతీష్ కుమార్. అవినీతి మరకలు ఇసుమంతైనా అంటని వాళ్ళలో ఆయన ప్రధముడు. నీతినిజాయితీలకు మారుపేరనిపించుకుంటాడని భావించి తలితండ్రులు ఆ పేరు పెట్టి వుంటారేమో అని అనుకునేవాళ్లు కూడా వున్నారు. అయితే అదంతా నిన్న మొన్నటి దాకానే. ఇప్పుడు ఆయనా ఆ తానులో ముక్కే అని బాధపడుతున్నారు ఆయన అభిమానులు.
లాలూవంటి అవినీతి పరుడయిన రాజకీయ నాయకుడు   అనుయాయులకో, బడా బడా కాంట్రాక్టర్లకో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమయిన  పనులు చేసి పెట్టి  కోట్లు దండుకుంటే, అటువంటివాళ్ళు రాజకీయాలకు చీడ పురుగువంటివాడని తీర్మానిస్తాము. మరి అలాంటి అధికారాలు అనేకం కలిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అనైతికంగా, అప్రజాస్వామికంగా దొడ్డిదారిన   పొందితే అటువంటి వారిని యేమని పిలవాలి? అవినీతి ఎలాంటిదో అనైతికం కూడా అలాంటిదే. వేసుకున్న చొక్కా మార్చినట్టు, రాత్రి రాత్రి ఏకంగా ఉత్తర దక్షిణాలవంటి రెండు పార్టీ కూటముల్లో ఒకదాన్ని ఒదిలి మరో దాంట్లో చేరిపోతే, దాన్ని సమర్ధించడం ఏం ధర్మం.
అప్రజాస్వామిక పద్దతిలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం గొప్పవిషయమూ కాదు, మన దేశానికి కొత్త విషయమూ కాదు. అలా గతంలో జరిగినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ పేరుతొ గగ్గోలు పెట్టిన వాళ్ళే ఈరోజు అలాంటి పనులకు పూనుకోవడం, అవినీతిపై చేస్తున్న యుద్ధంగా పేరు పెట్టుకుని వాటిని సమర్ధించుకోవడం క్షంతవ్యం కాదు.  అలా ఏర్పడ్డ ప్రభుత్వాలు అవినీతిరహిత పాలన అందివ్వవచ్చు. యేవో కొన్ని మంచి పనులు చేసి మంచి  ప్రభుత్వాలు అనిపించుకోవచ్చు.  కానీ   ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వాలు మాత్రం కానేరవు.  లాలూ కానీ అతడి కుమారుడు కానీ చెడ్డవాడు అయితే వాళ్ళని  తిరస్కరించాల్సింది ప్రజలే కాని వారి  రాజకీయ ప్రత్యర్ధులు కారు. ఇటువంటి నీతిబాహ్య చర్యలకు ప్రజాస్వామ్య ముసుగు తగిలించుకోవడం అంటే ఆ స్పూర్తిని అవహేళన చేయడమే. ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడానికి అయినా, దించడానికి అయినా రాజ్యాంగంలో కొన్ని పద్దతులు వున్నాయి. వాటిని తుచ తప్పకుండా పాటించడం వదిలేసి, వాటిల్లోని లొసుగులను వాడుకోవాలని చూస్తే తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు సిద్ధించవచ్చేమో కాని, శాశ్వితంగా అపకారం జరిగేది ప్రజాస్వామ్యానికే అనే అంశాన్ని  గమనంలో వుంచుకోవాలి.
ఈరోజు గడిస్తే చాలు అనుకునేవాడు రాజకీయ నాయకుడు. రేపు ఎలా అని ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు.

బీహారు పరిణామాలు గమనిస్తుంటే మొదటి రకానికి దేశానికి లోటులేదనిపిస్తోంది.

27, జులై 2017, గురువారం

పాట్నాలో మూగ మనసులు


కొన్ని వింటున్నప్పుడు, మరి కొన్ని చూస్తున్నప్పుడు ఎప్పుడో విన్న, ఎన్నడో  కన్న సంగతులు గుర్తుకు వస్తుంటాయి, మూగమనసులు సినిమాలాగా.
1964 లో అనుకుంటాను బెజవాడ లీలామహల్లో చూశాను క్లియోపాట్రా సినిమా. ఒక్కసారి కాదు అనేకసార్లు చూసాను అనేకమంది మాదిరిగానే. అప్పుడే విన్నాను ఆ రెండు పేర్లు, ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్. ఆ సినిమా సెట్లపై వారిరువురి నడుమ  పుష్పించిన ప్రేమ పెళ్ళికి దారితీసిందని పత్రికలు రాసాయి. (ఆ సినిమాలో ఆ ఇద్దరి నడుమా ఒక ముద్దు సీను వుంది. పెదవులు కలుపుకుని గట్టిగా ముద్దు పెట్టుకునే ఆ దృశ్యంలో ఇద్దరూ ఎంతగా ఒళ్ళు మరిచిపోయారంటే, దర్శకుడు కల్పించుకుని ‘కట్ కట్’ అని అంతకంటే గట్టిగా అరవాల్సి వచ్చిందట) అప్పట్లో అదో సంచలనం. కారణం ఆ ఇద్దరికీ అది మొదటి పెళ్లి కాకపోవడం. అప్పటికే పెళ్లి చేసుకుని సంసారాలు చేస్తున్న ఆ ఇరువురూ విడాకులు తీసుకుని తమ జీవిత సహచరులతో విడిపోయి మళ్ళీ పెళ్ళాడారు. హాలీవుడ్ లో అదో కొత్త విషయం కాదుకాని ఇండియాలో ఇలాంటి కబుర్లు వింతగానే చెప్పుకుంటారు. అలాగే చెప్పుకున్నారు కూడా. ఒక పదేళ్ళు వారి సంసారం బాగానే సాగింది. పాతొక రోత సామెత మాదిరిగా ఇద్దరికీ సరిపడక విడాకులు తీసేసుకుని మళ్ళీ తమకు నచ్చిన పెళ్ళిళ్ళు ఎంచక్కా చేసుకున్నారు. కధ అంతటితో ఆగలేదు. అలా విడిపోయిన వీరిరువురూ ఏదో  సందర్భంలో మళ్ళీ కలుసుకున్నారు. పాత ప్రేమ మళ్ళీ మారాకు తొడిగింది. అంతే! ఏడాది తిరక్కుండానే పాత మొగుడికి టేలరు, పాత భార్యకు బర్టను టాటా చెప్పేసి మళ్ళీ మరోసారి పెళ్లి చేసుకుని కొత్తగా భార్యాభర్తలు అయ్యారు. కానీ పెళ్ళాడి కొన్ని వారాలు గడిచాయో లేదో కధ మళ్ళీ మొదటికి వచ్చింది. కాపురం చివరికి వచ్చింది. మళ్ళీ విడిపోవడమే వారికి మిగిలింది.
ఈ చిన్ని కధలో ఇన్ని ‘మళ్ళీ’లు  ఎందుకు అంటే, ఆ విషయం మళ్ళీ మరోసారి చెప్పుకుందాం!


25, జులై 2017, మంగళవారం

సెన్స్ ఆఫ్ హ్యూమర్


సామాన్యుడికి, ఆ మాటకు వస్తే ఎవరికయినా వారి వారి దినవారీ ఒత్తిళ్ళ నుంచి ఒకింత ఊరట కలిగించేవి చిన్న చిన్న  కార్టూన్లు, జోకులు. సీరియస్  వాతావరణం నుంచి  ఇవి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. కారణం తెలియదు కానీ రాజకీయ నాయకుల్లో ఈ సెన్స్ ఆఫ్  హ్యూమర్ అనే లక్షణం  రోజురోజుకీ తగ్గిపోతోంది. ఒక కార్టూనును  కానీ, లేదా ఒక హాస్య స్పోరక కధనాన్ని కానీ హరాయించుకోలేకపోతున్నారన్నది సుస్పష్టం.  ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో  ఇదొకటి.
ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల్లో  కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో, ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.
ఈ సందర్భంలో  ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం.   1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి  ఘోర పరాభవం ఎదురయినప్పుడు,  ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్,  నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్  కారణంగా ఆయన అభిమానులనుంచి దాడి తప్పదు అని ఆ కార్టూనిష్టు   అనుకుంటుంటే ఒక చిత్రం జరిగింది. లక్ష్మణ్ గారికి  నెహ్రూ నుంచి  ఒక ఉత్తరం వచ్చింది. తెరిచి చూస్తే విషయం ఇది.
‘పొద్దున్నే పత్రికలో మీ కార్టూన్ చూసి నాకెంతో సంతోషమయింది. అది చూడగానే నా మనసుకు ప్రశాంతత చిక్కింది.  అదే కార్టూన్ ని కొంచెం పెద్దదిగా గీసి నాకు  పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అని రాశారు నెహ్రూ.
బాపూ సినిమా ముత్యాలముగ్గులో  రావు గోపాల రావు అన్నట్టు ‘మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి’. నిజమే!

అయితే అది రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

వార్తా వంటకాలు



విషయం ఒక్కటే. కానీ చూసే  ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే,  వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు  యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండిఒక సంఘటన కానివ్వండి,  ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, వేర్వేరు పత్రికలు, వేర్వేరు కోణాల్లో, వార్తలు 'వండి వారుస్తున్నతీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. ఏ ఛానల్ మార్చి చూసినా యిదే వరస.
ఎవరయినా తాము చదివే పత్రికచూసే ఛానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు ఛానళ్ళ శకం మొదలయినప్పుడు, జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో కాకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

యిరవై నాలుగ్గంటల నిరంతర న్యూస్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ రోజుల్లో పనికొచ్చే సమాచారం, పనికిరాని సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ల వాళ్ళే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది  వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే, టీవీ ఛానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం  గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి,  సమాచార విస్పోటనం చిల్లులు  పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో, రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!

24, జులై 2017, సోమవారం

బదరీ కేదార్ యాత్ర (1996) పదో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


యాత్రలో మా వెంట వచ్చిన గైడ్ పేరు చవాన్. కేదార్ గురించి, బదరీ గురించి అతనే మాకో విషయం చెప్పాడు. “కేదార్ లో పచ్చని చెట్లు విరివిగా  వుంటాయి. అవి ఎల్లవేళలా ఆక్సిజన్ విడిచిపెడుతూ వుంటాయి కనుక అంత ఎత్తున వున్నా  ఆయాసం అనిపించదు. బడరీలో చెట్లు వుండవు. ఎత్తుకు పోయిన కొద్దీ గాలిలో ఒత్తిడి తగ్గి, ఆక్సిజన్ సరిగా అందదు అంచేత నడిచేటప్పుడు మాట్లాడ కూడదు. మాట్లాడితే ఆయాసం వస్తుంది. ఎటు తిరిగినా నెమ్మదిగా నడవాలి. మౌనంగా వుండాలి”.
అతను చెప్పినట్టు గదిలో వున్నప్పుడు బాగానే వుండేది. బయటకు వచ్చినప్పుడు మాత్రం ఊపిరి పీల్చడం కష్టంగా వుండేది. నాకీ కాదు, అక్కడ ఎవ్వరికయినా అంతే.  మనిషి  ముందూ వెనకా ఆలోచించకుండా, ఆశ కొద్దీ చెట్లన్నిటినీ కొట్టేయడం వలన కలిగిన దుష్ఫలితం ఇది.
నాకు మాత్రం హైదరాబాదులో డాక్టర్ నాగభూషణం గారు ఇచ్చిన మాత్రలు బాగా అక్కరకు వచ్చాయి. అందువల్ల ఎలాటి ఆయాసం లేకుండా నేను యాత్ర చేయగలిగాను. ఆయన్ని తలచుకోని రోజు లేదు.
బస్సు అలాగే పర్వతాలను ఒక్కొక్కటే దాటుకుంటూ జోషీ కుండ్ చేరింది. ఇక్కడ నరసింహాలయం వుంది. గుడి గుహలో వుంది. సాధారణంగా నరసింహ స్వామి కోవెలలు కొండలు, గుహల్లోనే వుంటాయి. గుడి బయట నరనారాయణులు, శివపార్వతులు, గరిత్మంతుడు, నవ దుర్గ ఆలయాలు వున్నాయి. మా పెద్ద తమ్ముడు పర్వతాలరావు ఆరోజుల్లో నరసింహ తత్వం మీద పుస్తకాలూ రాస్తుండేవాడు. విషయ సేకరణ ఎక్కడెక్కడో నరసింహ స్వామి క్షేత్రాలు తిరుగుతూ ఉండేవాడు. భార్గవగారు మా తమ్ముడికి పరిచయం. ఆయన శ్రీధర్ గురూజీ శిష్యులు. కను చూపు లేకపోయినా మేము చేస్తున్న ఈ యాత్రలన్నీ భార్గవ గారు అప్పటికే పూర్తిచేసారు. అది మామూలు విషయం కాదు. ఆయనలో ఉన్న భక్తికీ, దీక్షకూ, మనోనిబ్బరానికి తార్కాణం. మా పెనుగంచిప్రోలు నరసింహస్వామి దేవాలయంలో అచ్యుతా చార్యులు గారని పూజారి వుండేవారు. ఆయనకూ కంటి చూపులేదు. కానీ అంతర్నేత్రాలు ఉండేవని చెప్పుకునేవారు. బహుశా భార్గవగారికి కూడా అలంటి నేత్రాలను భగవంతుడు అనుగ్రహించాడేమో తెలవదు.
శంకరాచార్యుల వారు కేరళకు చెందిన నంబూద్రి బ్రాహ్మణులను బదరి దేవాలయంలో అర్చకులుగా నియమించారుట. అప్పటి నుండి దక్షిణాదివారే అక్కడ పూజారులు. ఈవిధంగా ఆసేతు హిమాచలం ( దక్షిణాన సేతువు నుండి ఉత్తరాన హిమాలయాల వరకు) అని భారతదేశం గురించి చెప్పుకునే వర్ణన అతికి నట్టు సరిపోతుంది అనిపించింది.   
బదరిలో వుండే అర్చకులు సంవత్సరానికి ఆరు మాసాలే అక్కడ వుంటారు. మంచు పడడం ఎక్కువకాగానే వాళ్ళు ఉత్సవ విగ్రహాలతో సహా దిగి వచ్చి కింద జోషీ కుండ్  లో మిగిలిన ఆరు నెలలు వుంటారు. ఆ కాలంలో అక్కడి ఆలయంలో పూజాదికాలు నిర్వహిస్తారు. కేదార్ లో కూడా ఆరునెలలే మనుషుల పూజ. తరువాత గుడి మూసివేస్తారు. ఆ ఆరు  నెలలు శివుడికి  దేవతలు పూజ చేస్తారని చెబుతారు. కేదార్  లో అయితే ఇళ్ళ ఛాయలు కూడా లేవు. భక్తులు వెళ్ళే రోజుల్లో ప్లాస్టిక్ షీట్లతో పందిళ్ళ లాగా వేసుకుని కాలక్షేపం చేస్తారు. కేదార్ కు వెళ్ళే దోవలో దేవ  ప్రయాగ, రుద్ర  ప్రయాగ, కర్ణ ప్రయాగ, నంది ప్రయాగ మొదలయినవి చూసాము. ప్రయాగ అంటే రెండు నదుల సంగమం. (ఇంకా వుంది)   


23, జులై 2017, ఆదివారం

డెక్కన్ రేడియో

(నేడు జాతీయ ప్రసార దినోత్సవం)

పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే
ఉర్దూ తెలియని వాళ్లు కూడా వసీం అక్తర్ చదివే వార్తలు వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది. నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది.
దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్ శక్తితో, ‘డెక్కన్ రేడియోఅనే పేరుతో ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్ ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం ఒక కుటుంబం ఆద్వర్యంలో ఏర్పడింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది.
ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు, పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం మాసంలో రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్ మజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.
(సమాచార సేకరణకు సహకరించిన అనేకానేకమందికి అనేక వందనాలు. కృతజ్ఞతలు భండారు శ్రీనివాసరావు - 06-09-2013)

21, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర తొమ్మిదో భాగం –కొమరగిరి అన్నపూర్ణ (1996)


మేము డోలీలలో హాయిగానే కూర్చున్నాం. కానీ డోలీల వాళ్ళ సంగతి గమనిస్తే చాలా బాధ వేసేది. రాళ్ళల్లో బురదలో, నిటారుగా వుండే కొండ దారిలో మమ్మల్ని మోస్తూ వాళ్ళు నడుస్తున్నారు. చలికి వణుకుతూ డోలీల్లో కూర్చోవడమే మాకు ఇంత బాధగా వుంటే, వర్షంలో తడుస్తూ, చలికి వణుకుతూ, పైగా డోలీల్లోకూర్చున్న మమ్మల్ని మోసుకుంటూ అంతంత దూరాలు ప్రయాణాలు చేస్తున్నారంటే వాళ్ళ కష్టం ఊహించు కోవడానికే భయం వేస్తుంది. వాళ్లకు మన భాష రాకపోయినా ఎలాంటి ఇబ్బంది, పేచీలు  పెట్టకుండా వస్తున్నారు. మన దగ్గర ఆటోల వాళ్ళు, రిక్షాల వాళ్ళు పెట్టే పేచీలు, కిరికిరులు  గుర్తుకువచ్చాయి. కానీ వీళ్ళు అదేమిటో ఒక్కరోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరగలేదు. దొంగతనం అన్నది ఈ యాత్ర మొత్తంలో మాకు అనుభవానికి రాలేదు. మా సామాన్లను వాళ్ళే ఎంతో పదిలంగా జాగ్రత్త చేసారు. డోలీలో ప్రయాణిస్తూ వుండగా సురేష్ వాళ్ళు ఫోటో తీయాలని అనుకున్నారు. అయితే కెమెరా ఎందులో పెట్టిందీ గుర్తురాక అది సాధ్యపడలేదు. చివరికి అందరం క్షేమంగా గౌరీకుండ్ చేరుకున్నాము. మళ్ళీ అదే హోటల్లో మా బస. అక్కడే అన్నాలు తిని మళ్ళీ బస్సెక్కి బదరీ బయలుదేరాం.
తిరుగు ప్రయాణంలో మళ్ళీ శ్రీనగర్ వచ్చాము. అయిదు గంటలు కావస్తోంది. కేదార్ వెళ్ళేటప్పుడు కొండల నిండా గుబురుగా పెరిగిన పచ్చటి చెట్లు. ప్రకృతి సోయగాలు చూసి మురిసిపోయాము. అదేమిటో శ్రీనగర్ (కాశ్మీర్ శ్రీనగర్ కాదు) పరిసరాలలో ఉన్న కొండలన్నీ ఎండిపోయి, చిగురు పెట్టని చెట్లతో కళావిహీనంగా కానవస్తాయి. సారహీనమైన సంసారంలా వన్నెతగ్గి ఉసూరుమంటూవున్నాయి. ఏవిటో ఈ ప్రకృతి వైచిత్రి.
మా బస్సులో వచ్చిన గైడ్  పేరు చవాన్.
“కేదార్ లో పచ్చని చెట్లు విరివిగా వుంటాయి. కాబట్టి ఏమీ అనిపించదు. కానీ బదరీలో అలా చెట్లు లేవు. బాగా ఎత్తుకు పోయిన కొద్దీ ఆక్సిజన్ అందడం కష్టం. నడిచేటప్పుడు ఎక్కువగా మాట్లాడకండి. మాట్లాడితే ఆయాసం వస్తుంది. కాబట్టి ఎక్కడ తిరిగినా నెమ్మదిగా నడవండి, మౌనంగా వుండండి” అని హెచ్చరికగా చెప్పాడు.

గదిలో వున్నప్పుడు బాగానే వుండేది కానీ, బయటకు వచ్చినప్పుడు ఊపిరి పీల్చడం కష్టంగావుండేది. నాకే కాదు, అక్కడ అందరి విషయం అంతే. మనిషి  ముందూ వెనకా ఆలోచించకుండా, ఆశ కొద్దీ చెట్లన్నిటినీ కొట్టేయడం వలన కలిగిన దుష్ఫలితం ఇది.    (ఇంకా వుంది)

20, జులై 2017, గురువారం

అధికారం చుట్టూ ఈగలు



ఓ నలభయ్ ఏళ్ళ క్రితం కేబినెట్ మంత్రిగా చేసిన పీ. నరసారెడ్డి   చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు.  రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా కాలం తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే  గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.
“హై కోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసుకు వెడతాను. నేను ఎవరన్నది మా  పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధ వేస్తుందని చెప్పారు. కానీ  గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు.
కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి  వస్తే,  కొంత కాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్  సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు. 
ఆయన్ని కలిసివచ్చిన తరువాత ఇందిరకు సంబంధించి ఇలాంటిదే మరో ఉదంతం నాకు జ్ఞాపకం వచ్చింది.
ఓసారి ఇందిరాగాంధి మాజీ ప్రధాన మంత్రిగా ఖమ్మం  జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో మారిన సమీకరణాల  కారణంగా ఆవిడను ఘనంగా కాకపోతే పోనీండి,  ఓ మోస్తరుగా రిసీవ్ చేసుకునే నాయకులు కూడా లేకపోయారు. ఓ గెస్ట్ హౌస్ లో బస చేసినప్పుడు అప్పట్లో ఓ చోటా కాంగ్రెస్ నాయకుడు ఈశ్వరలింగం ఆమె బ్రేక్ ఫాస్ట్  కోసం  దగ్గర్లో ఓ హోటల్ నుంచి  ఇడ్లీ వడ తెప్పించి పెట్టారు. వాటితో పాటు ఇచ్చిన ఓ సత్తు చెంచాతో తినలేక, దాన్ని పక్కన పడేసి, చేత్తో తినడం అలవాటు లేకపోయినా ఇబ్బంది పడుతూనే   ఇందిరాగాంధి తిన్నారని దానికి ప్రత్యక్ష సాక్షి  అయిన కౌటూరు దుర్గాప్రసాద్ చెప్పారు. ఆవిడ టిఫిన్ చేస్తున్నప్పుడు పక్కన కూర్చున్న వారిలో పాలేరు సమితి మాజీ అధ్యక్షులు రావులపాటి సత్యనారాయణ రావు గారు (మాజీ ఐజీ రావులపాటి సీతారామారావుగారి తండ్రి) వున్నారు.  
ఆరోజుల్లో శ్రీమతి గాంధి రాజకీయంగా వొంటరి. కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగెస్ (ఐ) పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఆమెకు వీర విధేయుడిగా వున్న ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆమెతో విభేదించి పాత కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. ఇక ఆవిడను ఖమ్మం పర్యటనలో కనుక్కునే నాధుడు యెవ్వడు?
ఆవిడ వెంట వచ్చిన మర్రి చెన్నారెడ్డి, జీ వెంకటస్వామి  మొదలయినవాళ్ళు శ్రీమతి గాంధీని హిల్ బంగ్లా లో దింపి, అక్కడ  వసతి సరిపోకనో యేమో, మన్నెగూడెం వెంకటరెడ్డి ఇంటికి వెళ్లారు. అంచేత ఆవిడకు  బ్రేక్ ఫాస్ట్  ఏర్పాటుచేసే  బాధ్యత చిన్న నాయకుల మీద పడింది.
మొత్తం మీద  ఇందిరాగాంధీ ఖమ్మం ఎన్నికల సభ బాగా జరిగింది. కాంగ్రెస్ లో సిండికేటుగా పిలవబడే అగ్రనాయకులందరూ కలసి తనని వొంటరిదాన్ని చేసి బయటకు పంపారని శ్రీమతి గాంధి చేసే వాదనను జనం నమ్మారు. అందరూ ఒక్కటై ఈమెను వేదిస్తున్నారన్న నమ్మకం ప్రబలసాగింది. గెస్ట్ హౌస్ పక్కనే ఉన్న పెవిలియన్ మైదానం  చాలా ముందుగానే జనంతో కిక్కిరిసిపోయింది. రాత్రి ఏడు గంటలకు రావాల్సిన శ్రీమతి గాంధి మరునాడు ఉదయం ఖమ్మం వచ్చారు. అయినా సభకు వచ్చిన  ఎవ్వరూ అక్కడనుండి కదలలేదు. ఆవిడ ఖమ్మం సభలో ప్రసంగిస్తూ వున్నప్పుడే కాంగ్రెస్ (ఐ) పార్టీకి హస్తం గుర్తు’  కేటాయించినట్టు కబురు వచ్చింది.

కొసమెరుపు ఏమిటంటే ఆరోజు పెవిలియన్ మైదానంలో అమ్ముడు పోయిన మిర్చి బజ్జీలు అప్పటికీ ఇప్పటికీ ఒక రికార్డుగా చెప్పుకుంటారు.

17, జులై 2017, సోమవారం

వెంకయ్యనాయుడు - కొన్ని జ్ఞాపకాలు



రాజకీయాలు తరువాత.
ముందు ఒక తెలుగువాడిగా వెంకయ్యనాయుడు గారికి అభినందనలు.
ఒక విలేకరిగా ఆయన గురించిన కొన్ని పాత స్మృతులు తెలపడం ఒక్కటే ఈ పోస్టు లక్ష్యం.
1972 - 73
ప్రత్యేక ఆంద్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులు. నేను బెజవాడ నార్లవారి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాను.  బందరు రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇప్పుడు స్వరాజ్ మైదానం అనుకుంటా, అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రధాన వక్తలు మాట్లాడిన తరువాత ఒక యువకుడు మైకు అందుకున్నాడు. నిమిషాల వ్యవధిలోనే సభికులను తన వాగ్దాటితో మైకంలో ముంచి తేల్చాడు. ఎవరని ఆరా తీస్తే వెంకయ్య నాయుడు అన్నారు. పేరు చూస్తె వయసులో పెద్దవాడనుకున్నాము కానీ వయసులో చాలా చిన్న.
1975 లో హైదరాబాదు ఆలిండియా రేడియోలో విలకరిగా చేరిన మూడు సంవత్సరాలకు వెంకయ్యనాయుడు బీజేపీ ఎమ్మెల్యేగా శాసన సభలో అడుగుపెట్టారు. ఆయనకు జోడీ ఎస్. జై పాల్ రెడ్డి గారు. ఇక వాళ్ళు సభలో ప్రసంగం మొదలు పెట్టినా, ప్రశ్నలు లేవనెత్తినా, ప్రభుత్వాన్ని నిలదీసినా మొత్తం ప్రెస్ గ్యాలరీ పూర్తిగా నిండిపోయేది. వింటూ రాసుకోవడం విలేకరులకి అలవాటే అయినా వాళ్ళిద్దరూ చెబుతున్నది ఆసక్తిగా వినాలా,  శ్రద్ధగా వింటూ పొల్లుపోకుండా రాసుకోవాలా అనేది అందరికీ  ఒక సమస్యగా వుండేది. ఆ రోజుల్లో ప్రతి పత్రికా శాసన సభలో ఛలోక్తులు అనే శీర్షికతో ఒక కాలం ప్రచురించేవి. వాటిల్లో సింహభాగం వారివే ఉండేవి. ఈ విషయంలో ఇద్దరూ ఇద్దరే.  వెంకయ్యనాయుడి విశ్వరూపం నేను చూసింది అసెంబ్లీలోనే. అంత్య ప్రాసలతో  ఉపన్యాసాన్ని రక్తి కట్టించే ఆ సాంప్రదాయాన్ని ఆనాటి నుంచి ఈనాటివరకూ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ప్రసంగాల్లో ఆయన కొనసాగిస్తూ వస్తూనే  వున్నారు.      
ఆయనతో నా రేడియో అనుబంధం ఇంకా విచిత్రం. ఏదైనా వార్తను పత్రికలకు ఎలా చెప్పాలో, రేడియోకు ఎలా చెప్పాలో ఆయనకు కరతలామలకం. మాకు మధ్యాన్నం మళ్ళీ సాయంత్రం వార్తలు ఉండేవి. ఆయన ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడ వున్నా ఫోనుచేసి వార్త చెప్పేవారు. మేము ప్రసారం చేసింది విని, మళ్ళీ ఫోను చేసి ‘బాగానే చెప్పారు కానీ మరో వాక్యం జత చేస్తే బాగుండేది, సాయంత్రం చెప్పండి’ అనేవారు, ‘కాదు’ అనడానికి వీల్లేకుండా.
ఇక ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో ఆయన పాత్ర ఇంతా అంతా కాదు. ప్రజల్లో రగిలిన అసహనానికి ఆయన వాగ్ధాటి ఆజ్యం పోసిందనడంలో అతిశయోక్తి లేదు.
మరోసారి కలిసింది ఢిల్లీలో. మాస్కో రేడియోలో పనిచేస్తూ సెలవుపై హైదరాబాదు వస్తూ ఢిల్లీలో దిగాను. పూర్వ పరిచయం పురస్కరించుకుని వెడితే గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించారు. మాస్కో విశేషాలు అడిగి ఆసక్తిగా విన్నారు.
వై.ఎస్. రాజశేఖర రెడ్డి మొదటి విడత  ముఖ్యమంత్రిగా వున్న రోజుల్లో నేనూ జ్వాలా నరసింహారావు ఒకసారి ఢిల్లీ వెళ్ళాము. ఏపీ భవన్ లో దిగిన మమ్మల్ని కలవడానికి సీనియర్ జర్నలిష్టులు చంద్రకాంత్, ఆనంద్ వచ్చారు. మాటల మధ్యలో వెంకయ్యనాయుడు గారి ఇంటికి వెడుతున్నట్టు చెప్పి మమ్మల్ని కూడా రమ్మన్నారు. ఆయన ప్రతి సంక్రాంతి పండక్కు కాబోలు తన ఇంట్లో చక్కటి విందు భోజనం ఏర్పాటుచేసి, తెలుగు కుటుంబాలను ఆహ్వానిస్తారు. పిలవని పేరంటంగా వెళ్లిన మా ఇద్దర్నీ కూడా వెంకయ్యనాయుడు చాలా ఆదరంగా కనుక్కున్నారు. అద్వానీని చాలా దగ్గరగా ఆ సందర్భంలోనే చూడడం తటస్తించింది. అందరూ వెళ్ళిన తరువాత వెళ్లి కలిస్తే ‘వచ్చిన పనేమిటని’ ఆయనే  ఆరా తీసారు. అప్పుడు జ్వాలా 108 లో పనిచేస్తున్నాడు. రాజస్థాన్ రాష్ట్రంలో విస్తరణ గురించి జ్వాలా చెబితే అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడుతానని చెప్పి మాట్లాడారు కూడా.
ఏడాది క్రితం ఒకసారి హైదరాబాదులో ఏదో కార్యక్రమానికి హాజరయి, జనాల చేత చప్పట్లు కొట్టించుకునే ప్రసంగం చేసి  మధ్యలో విమానం టైం అయిందని వెడుతుంటే దారిలో నాకు కనిపించారు. ‘ఎలా వున్నావు శ్రీనివాసరావు’ అంటూ అదే ఆదరణతో కూడిన పలకరింపు. నడుస్తూనే నా గురించి మంచీచెడూ కనుక్కుంటూ కారెక్కి వెళ్ళిపోయారు.
మొత్తం దేశానికి ప్రధమ పౌరుడి తర్వాత స్థానం ఆయనదే అనే అవకాశాలు  మెండుగా వున్న వెంకయ్య నాయుడు గారికి ముందస్తు అభినందనలు.             
       

బదరీ కేదార్ యాత్ర (ఎనిమిదో భాగం) 1996 – కొమరగిరి అన్నపూర్ణ


స్వర్ణ, సురేష్, రంగడు మాత్రం చీకటితోనే లేచారు. మమ్మల్ని లేపి, మొహాలు కడిగించి వేడి వేడి కాఫీలు తాగించారు. తలకు మంకీ టోపీ, కాళ్ళకు  ఉలెన్ సాక్సూ తొడిగారు. మేం ఎవరం స్నానాలు చేయలేదు. మేమే కాదు బస్సులో వచ్చిన వాల్లెవ్వరూ చేయలేదు. మొహాలు, చేతులు కడుక్కోడానికే కాదు, తాగడానికి కూడా వేన్నీళ్ళే. ఒక్క రంగారావుగారు మాత్రం అంత చలిలోనూ పట్టుదలగా స్నానం చేసే బయలుదేరారు.
అందరం గుడికి చేరాం. పై నుంచి మంచు గడ్డలు ఊడి పడుతున్నాయి. క్యూ చూస్తె పెద్దదిగా వుంది. చలి సూదుల్తో పొడుస్తోంది. ఆ క్యూలో ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు నలుగురు కలిసారు. అందులో ఒకామె రాజ్యం ఒదినె కూతురు. ఖమ్మం పర్సా శ్రీనివాసరావు మామయ్య మనుమరాలు. ఆమె బిడ్డనే బెజవాడలో వుండే  తెన్నేటి భాస్కరరావుగారి కొడుక్కి ఇచ్చారు. అంటే మా మేనత్త కూతురికి వియ్యపురాలు. ఆమె గుండె జబ్బు మనిషి. కేదార్ చూడాలని మనసు పడితే వెంటపెట్టుకుని తీసుకు వచ్చారు. హార్టు పేషెంటువి, కేదార్ ఎలా వెడతావ్ అని గద్దించ కుండా ఓపిగ్గా యాత్రలకు తిప్పుతున్నారు.
గుడి నిండా జనం. ఒకటే నెడుతున్నారు.అప్పుడు ఎవరో ఒకాయన మమ్మల్ని పిలిచి తలకాయ పట్టి దేవుడికి తాకించాడు.భగవంతుడే ఆయన రూపంలో వచ్చాడా అనిపించింది. మొత్తం మీద కేదార దేవుడ్ని చూడాలనే మా చిరకాల వాంఛ నెరవేరింది.
పాండవులు యుద్ధంలో అందర్నీ సంహరించారు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడం కోసం యజ్ఞం చేయాల్సి వచ్చిందట. నా వెంట వస్తే స్వర్గానికి దారి చూపిస్తానని శివుడు చెప్పాడట. శివుడు వాళ్ళని గుప్త కాశీ వరకు తీసుకువచ్చి మాయమై పోయాడట. అప్పుడు అర్జునుడు శివుడ్ని వెతుక్కుంటూ గౌరీ కుండ్ వరకు వెళ్ళాడట. శివుడు ఎద్దు రూపంలో కానవచ్చాడు.  అర్జునుడు రెండు పర్వతాల మీద రెండు కాళ్ళు వుంచి నిలబడ్డాడు. ఆ కాళ్ళ మధ్యనుండే అంతా వెడుతున్నారు. కానీ శివుడు మాత్రం పోలేదు. దాంతో ఆ ఎద్దే శివుడని గ్రహించి అర్జునుడు ఆ ఎద్దు తోకని కేదార్ లో తొక్కిపడతాడు.తోక కేదార్ లో వుంటే మొహం మాత్రం నేపాల్ లోని పశుపతినాధ ఆలయంలో వెలిసిందట. అది స్థల పురాణం అని చెప్పారు. అందుకే కేదార్ లో దేవుడు, లింగాకారంలో కాకుండా  ఎద్దు తోక కుచ్చు ఆకారంలో ఉంటాడు.      
రాత్రి రాగానే గదిలో కరెంటు లేదు. కుంపట్లు పెట్టారు. అవి వుంటే గదిలో మనకు ఆక్సిజన్ సరిపోదు. ఆ గది అద్దెఒక రాత్రికి వంద రూపాయలు. కప్పుకునే పరుపులకు ఒక్కొక్క దానికి పదిహేను రూపాయలు చార్జి.
రూముకు వచ్చి కాఫీలు తాగాము. కప్పు కాఫీ పది, టీ ఏడు రూపాయలు. మంకీటోపీలు, ఉలెన్ సాక్స్ ధరించి అందరం మళ్ళీ డోలీలు ఎక్కాం. ఈసారి అన్ని డోలీలు కలుపుకుంటూ వచ్చాము. వచ్చేటప్పుడు వాన లేదు. ఎండ కాస్తూ వుంది. చలి బాధ సాంతం తగ్గలేదు కానీ చాలా నయం. బాగానే మాట్లాడుకోగలుగుతున్నాం. గుర్రాల మీద వస్తున్న సురేష్ వాళ్ళు మధ్య మధ్య కలుస్తున్నారు. కొండలు పచ్చని చెట్లతో ఎంతో అందంగా కనిపించాయి. ఆ కొండలపై ఎవరో మొక్కల్ని నాటి, నీళ్ళు పోసి పెంచినట్టు గుబురుగా వున్నాయి. పోతన భాగవత పద్యం జ్ఞాపకం వచ్చింది.
‘అడవిలోన నున్న అబలుండు వర్ధిల్లు, రక్షితుడు మందిరమున జచ్చు’

దారి వెంట గంగామాయి హోరున శబ్దం చేసుకుంటూ మాతోనే వస్తున్నట్టు వుంది. మా ప్రయాణమంతా ఋషీకేష్ నుండి గంగ ఒడ్డునే జరుగుతోంది. పోతనగారు ఈ దృశ్యాలను ఎలా వర్ణించారో. గంగావతరణం రాసారంటే మాటలా! ఎంతో ఆశ్చర్యం వేసింది. నాలాగే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు కూడా, ‘గొల్లపిల్లల  వేళ్ళ సందు మాగాయ పచ్చడి పసందు యేతుల కనుగొంటి వయ్య, నీకెవరు చెప్పిరయ్య’ అంటూ  పద్య రూపంలో ఆశ్చర్యపోయారు. లోయలో పారుతున్న గంగని చూస్తుంటే నగర చక్రవర్తుల కధ, భగీరధ ప్రయత్నం గుర్తుకు వచ్చాయి. (ఇంకా వుంది)           

15, జులై 2017, శనివారం

ద్రాస్త్విచ్ కగ్జిలా


నాకే విచిత్రం అనిపించింది నా జ్ఞాపక శక్తి చూసి. రాత్రి తిన్న కూర ఏమిటంటే బుర్ర తడుముకుండే పరిస్తితి నాది. అలాంటిది .....
పాతికేళ్ళు దాటిందేమో చూసి, నిన్న ప్రెస్ క్లబ్ లో అమర్ తో కనబడ్డాడు. ‘తెలుసు కదా మన...’ అని అమర్ అనేలోగా  నేనే ముందుగా “ద్రాస్త్విచ్ కగ్జిలా నరేందర్” అనేశాను. అతడూ వెంటనే “ఎలా వున్నారు శ్రీనివాసరావు గారూ” అంటూ పలకరించాడు.
నరేందర్ అంటే గూడవల్లి నరేంద్రనాథ్. ఢిల్లీ ఎం.డీ.టీ.వీ. ఛానల్లో సీనియర్ ఫోటోగ్రాఫర్. రిటైర్ అయిన తరువాత కూడా ఆ టీవీ లోనే పనిచేస్తున్నాడు. గూడవల్లి నాగేశ్వర రావుగారి అబ్బాయి. సోవియట్ యూనియన్ అయిదోతనం కోల్పోకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇస్కస్ (ఇండో సోవియట్ కల్చరల్ సంస్థ) కు గూడవల్లి నాగేశ్వర రావు గారు కర్తాకర్మా క్రియా అన్నీను. నేను మాస్కో రేడియోలో పనిచేస్తున్న రోజుల్లో ఈ సంస్థ తరపున అనేకమంది మాస్కో వచ్చిపోతుండేవాళ్ళు. అలా వచ్చిన వాళ్ళలో అక్కడ భోజన వ్యవహారాలు సరిగా ఇమడక ఏదో ఇంత సాంబారు, పెరుగన్నం తినడానికి మా ఇంటికి వస్తుండేవారు. నరేందర్ మాస్కోలోనే చదువుకుని ఇండియా తిరిగి వచ్చిన తరువాత ఢిల్లీలో ఉద్యోగం చేస్తుండేవాడు. అలనాటి పరిచయం మాది. మళ్ళీ ఇనాల్టికి ఇలా తటస్థ పడ్డాడు. నరేందర్ మంచి మిత్రుడు. కాబట్టే తిరుపతి వెళ్లి వచ్చి చప్పున గుర్తు పట్టడానికి వీల్లేకుండా ఉన్న నన్ను వెంటనే పోల్చుకోగలిగాడు.



సరే ఈ కగ్జిలా ఏమిటంటారా!    
మాస్కోలో వుండగా మాస్కో రేడియో వాళ్ళు నాకు రష్యన్ నేర్పడానికి ప్రత్యేకంగా ఒక టీచర్ ని పెట్టారు. ఆవిడ వారానికోసారి మా ఇంటికి వచ్చి మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లు తింటూ, మరో పక్క నాకు  రష్యన్ పాఠాలు చెప్పేది. ఏతావాతా జరిగిందేమిటంటే, ఆవిడ పుణ్యమా అని  నాకు నాలుగు తడిపొడి రష్యన్ మాటలు పట్టుపడ్డాయి, ఆవిడేమో ఎంచక్కా తెలుగు నేర్చుకుని చక్కాపోయింది.
ఆ పొడి మాటల్లో ఒకటి  ‘కగ్జిలా’. అంటే హౌ ఆర్ యు? (ఎలా వున్నారు?)        


14, జులై 2017, శుక్రవారం

బదరీ కేదార్ యాత్ర – ఏడో భాగం (1996) – కొమరగిరి అన్నపూర్ణ


ఇంకా నాలుగు కిలోమీటర్లు వెళ్లాలన్నారు. వర్షం ఆగడం లేదు. చలి దుర్భరంగా వుంది. మేమంతా దుప్పట్లు కప్పుకుని కూర్చున్నాం. భారతి బాధ చూడలేకపోయాం. ఒక  కిలోమీటరు ఉందనగా మళ్ళీ ఆపారు. అక్కడ కొండ నిటారుగా వుంది. డోలీవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడం కష్టంగా వుంది. తొందరగా గదికి చేర్చమని భాష రాకున్నా సైగలతో చెప్పాం. వాళ్లకు అర్ధం అయినట్టు వుంది. పైగా ఇలాంటి ప్రయాణాల్లో అనుభవం కూడా వుంది. మా కష్టం చూసి వాళ్ళు, తమ కష్టాన్ని లెక్కచేయకుండా త్వరత్వరగా కేదార్  లో ఒక గూటికి చేర్చారు. ఐతే ఈ హడావిడిలో గైడు చెప్పిన గదికి కాకుండా మరో దాంట్లో దింపాడు. అందులో మూడు మంచాలు వున్నాయి. భారతిని ఒక మంచంపై పడుకోబెట్టి పరుపు కప్పారు. మేం దారిలో బాగానే వున్నాం కానీ డోలీ దిగేసరికి చలి వెన్నులోనుంచి పుట్టుకొచ్చింది. మా సామాను ఏమైందో తెలియదు. మా వాళ్ళు ఏమైనారో తెలియదు.  పరుపు పైన కప్పుకుని పడుకున్నాము. భారతిని ఏడవకే అని చెబుదామంటే మాట పెగలడం లేదు. నోట్లో మాట బయటకి రావడం లేదు. భగవంతుడా నీదే భారం అనుకున్నాము. గజేంద్ర మోక్షంలో పద్యం జ్ఞాపకం వచ్చింది.
‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావులు తప్పెను  మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతః పరంబెరుగ మన్నించదగున్ దీనునిన్
రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మకా”
ఇప్పుడు మాదీ అదే పరిస్తితి. ఆయన తప్ప వేరే దిక్కులేదు. మాయదారి మల్లిగాడు సినిమాలో చెప్పినట్టు ‘ఆయన మీదే భారం వేసి వచ్చాం. కాబట్టి చచ్చినట్టు వస్తాడురా దేవుడు’ అనే మొండి ధైర్యం వచ్చి అలాగే కూర్చున్నాము. నిజంగా తలచుకున్నట్టే వచ్చాడు భగవంతుడు స్వర్ణ, సురేష్ ల రూపంలో. మిగిలినవాళ్ళు కూడా వర్షంలో తడిసి గుర్రాల మీద మేమున్న చోటికి చేరుకున్నారు. వాళ్ళను చూడగానే ప్రాణాలు లేచివచ్చాయి. డోలీ వాళ్ళు మమ్మల్ని దింపాల్సిన చోట కాక వేరే చోట దింపారు. మేం ఏమయ్యామో అని వాళ్ళు ఓపక్క చలికి ఒణికిపోతూనే తెగ కంగారు పడుతున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. ఈ లోగా పొద్దుగుంకింది. చలి తీవ్రత మరింత పెరిగింది. చేతులు ఎలా కొంకర్లు పోయాయంటే పొయ్యిలో చేయి పెట్టినా స్పర్స తెలిసేట్టు లేదు. పరుపులు కప్పుకుని పడుకున్నాం కానీ పాడు చలి వాటిల్లోకి కూడా దూరి ఒణికిస్తోంది.

మా పరిస్తితి చూసి వాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళేమో పిల్లవాళ్ళు. పెద్దవాళ్ళ పరిస్తితి చూస్తే ఇలావుంది. అలాగే పడుకున్నాం. ఆశ్చర్యం అలాగే నిద్రపోయాం. శారీరక, భౌతిక ఇబ్బందులను మత్తులా మరిపించే శక్తి ఒక్క నిద్రాదేవతకు మాత్రమే ఉందేమో! (ఇంకా వుంది)         

12, జులై 2017, బుధవారం

పుట్టింట్లో రెండు గంటలు

రోజూ ఎన్ని టీవీ చర్చలకు వెళ్ళినా ఆలిండియా రేడియో రికార్డింగ్ కు వెళ్ళడంలో కిక్కే వేరప్పా. ఏవిటో ఫేస్ బుక్ భాష అలవడుతున్నట్టుంది కాబోలు. ఎంతయినా   నా వృత్తి జీవితంలో రేడియో నా పుట్టిల్లు. అటూ ఇటూగా ముప్పయ్యేళ్ళ అనుబంధం. 1975 నవంబరు 14 న అందులో  మొదటిసారి కుడికాలు మోపాను. పుట్టింటి ఆరాటం అంటే ఏమిటో ఈరోజు ఆకాశవాణికి వెళ్ళినప్పుడు అర్ధం అయింది.   రిటైర్ అయి అడుగు బయట పెట్టి పుష్కర కాలం దాటింది కానీ బయట వాచ్ మన్ల దగ్గర నుంచి అక్కడ పనిచేస్తున్న డ్యూటీ ఆఫీసర్లు, ఇంజినీర్లు, ప్రోగ్రాం అధికారులు, అన్ని విభాగాల సిబ్బంది గుర్తుపట్టి ఆప్యాయంగా పలకరించడం, యోగక్షేమాలు ఆరా తీయడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక మా ప్రాంతీయ వార్తా విభాగం సిబ్బంది సంగతి చెప్పక్కరలేదు. ఎవర్నీ కాదనలేక ఎన్ని సార్లు, ఎన్ని టీలు తాగానో లెక్కేలేదు.  దీనికంతటికీ కారణం రేడియోలో తెలుగు ప్రసంగాలు చూసే అధికారి సీతారాంబాబు  మొన్నీమధ్య ఫోను చేసి ‘సాంఘిక మాధ్యమాల మంచీ చెడుల’పై ఒక ప్రసంగవ్యాసం రాయాలని కోరారు. ఈరోజు సాయంత్రం రికార్డింగ్ అన్నారు. మళ్ళీ ఒక్కసారి పాత పరిచయస్తులని పలకరించే అవకాశం దొరికిందని ఆనందంగా వెళ్లాను. ఒకప్పుడు నేను పనిచేసినప్పుడు అచ్చు ప్రభుత్వ కార్యాలయం మాదిరిగా ఉన్న అదే ఆఫీసు ఇప్పుడు కార్పొరేట్ హంగుల్ని సమకూర్చుకుంది. మా న్యూస్ రూమ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.  అంతా డిజిటలైజ్ చేసారు. ప్రసారం అయిన ప్రతి బులెటిన్  ని  ఏ.ఐ.ఆర్. వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేస్తున్నారు. ఏవిటో,  అందరూ వినే రోజుల్లో ఈ భోగాలు లేవు.

అనుకున్నట్టే చాలామంది కలిశారు. ఇన్నేళ్ళ తరువాత గుర్తు పట్టి పలకరించిన వారి సౌహార్ధతకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఏం చేయగలను?    

11, జులై 2017, మంగళవారం

అన్నయ్య గొప్పతనం మరోమారు తెలిసింది – భండారు శ్రీనివాసరావు


మహాత్ములు, స్వాములు తమ అనుగ్రహ భాషణల్లో సాధారణంగా ఆ సర్వేశ్వరుడిని తప్ప  మనుష్యమాత్రుల్ని ప్రశంసించడం జరగదని నా విశ్వాసం. తమ ధార్మిక సేవా కార్యక్రమాలకు అండదండలకొసం కొండొకచో రాజుల్ని, పాలకుల్ని పొగడడం కొత్తేమీ కాదు. అలాంటిది చనిపోయిన ఒక వ్యక్తిని, అందునా కేవలం వివేకసంపద మినహా ఏవిధమైన లౌకిక బాహ్య సంపదలను కూడబెట్టుకోకుండా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న వ్యక్తిని ఒక బహిరంగ సమావేశంలో బాహాటంగా ఒక ఆధ్యాత్మిక గురువు అదేపనిగా ప్రశంసించిన సందర్భాన్ని నేనెరుగను. ఆ వ్యక్తి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు కావడం మా కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇంకేమీ కాదు.
దీనికి ముందు ఒక విషయం గురించి చెప్పుకోవాలి. మా అన్నయ్య తాను  జీవించి ఉన్నకాలంలో ఎంతో శ్రమకోర్చి, అనేక ప్రాంతాలు తిరిగి, కొండలు కోనల్లో ఉన్న అనేక నారసింహ క్షేత్రాలను సందర్శించి, ఆ క్షేత్రాల ప్రాశస్త్యాన్ని స్వయంగా అధ్యయనం చేసి కంప్యూటర్ల సాయం లేకుండా కేవలం చేతి రాతతో ఏడు సంపుటాలను ‘ఓం నమో శ్రీ నారసింహాయ’ అనే పేరుతొ రచించారు. వాటిల్లో మొదటి మూడు ప్రచురణకు నోచుకున్నాయి. మిగిలిన ఏడింటిని శ్రీ కే.ఆర్. పరమహంస గారు,  మిత్రవాత్యల్యంతో డిజిటలైజ్ చేయించి   నెట్లో భద్రపరిచారు. 
ఆ నాలుగు సంపుటాలను మా అన్నయ్య కుమార్తె కొలిపాక కృష్ణ వేణి పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. వాటిని ఎలాటి లాభాపేక్ష లేకుండా, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి, ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా అందచేయాలని సంకల్పించింది. ఆమె సంకల్పానికి భర్త కొలిపాక రమేష్  కుమార్ సహకారం తోడవడంతో అనుకున్న కొద్దిరోజుల్లోనే నిర్విఘ్నంగా ప్రచురణ కార్యక్రమం పూర్తయింది. 

ఈలోగా అనుకోని ఒక విశేషం జరిగింది. మా అన్నగారి కుటుంబానికి పూజ్యులు అయిన శ్రీధర్ గురూజీ హైదరాబాదు వస్తున్నట్టు తెలిసి వారి శిష్యులను సంప్రదించారు. గురూజీ కూడా నరసింహోపాసకులు. ఆయన పాల్గొనే ఆ కార్యక్రమానికి నరసింహ భక్తులు అనేక మంది వస్తారు కాబట్టి గ్రంధావిష్కరణ అక్కడే చేయడం సముచితంగా ఉంటుందని ముంబైలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు రాఘవరావు అందుకు తగిన ఏర్పాట్లు చేసాడు. గురూజీ శిష్యులలో ఒకరయిన వడ్డాది వారి సహకారంతో గ్రందావిష్కరణకు గురూజీ అంగీకరించారు.
నిన్న (మంగళవారం) సాయంత్రం హైదరాబాదులోని ఆర్టీసీ కళా మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మేమెవరం ఊహించని విధంగా గురూజీ గ్రందావిష్కరణకి పెద్ద పీట వేసి ఆ సాయంత్రం యావత్ కార్యక్రమాన్ని దానితోనే ప్రారంభించారు. సభికులతో కిక్కిరిసిన ఆడిటోరియంలో గురూజీ చేసిన ఇంగ్లీష్ లో చేసిన ఉపన్యాసాన్ని మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు సంగ్రహంగా ఇలా పేర్కొన్నారు.
For  full  20 minutes, Sridhar  Guruji, spoke  about  Annayya  (BHANDARU PARVATALA RAO) in a largely  attended  meeting. He started his speech  like this.....
‘Normally we will  start  any  pravachanam  by  invoking  Lord  Ganesha. Today I will start with  mentioning  about  a great, good, knowledgeable  and highly  simple and dear friend Parvatalarao’  Like  this  he spoke  for 20 minutes, paying  glorious  tributes to Annayya. We were all deeply  touched.” - B.Ramachandra Rao
మా అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ అన్నట్టు “ మా అన్నయ్య పుట్టిన కుటుంబంలో పుట్టిన మేము కూడా అదృష్ట వంతులం అయ్యాము”
భర్తృహరి సుభాషితాల్లో ఒకదాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఇలా అనువదిస్తారు:
“విద్య యొసగును వినయంబు వినయంబునను 
బడయు పాత్రత పాత్రత వలన ధనము 
ధనము వలనను ధర్మంబు దాని వలన 
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు”
బాగా చదివే విద్యార్ధిని  ఒక క్లాసు చదవకుండానే పై క్లాసులోకి ప్రమోట్ చేసేవిధంగా, మా అన్నయ్య కూడా ‘పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు’ అనే పద్య పాదాన్ని తాకకుండానే (నిర్ధనుడు గానే) ‘నైహికాముష్మిక’ సుఖ ప్రాప్తి పొందాడు. ఇది సత్యం.    

                  

10, జులై 2017, సోమవారం

బదరీ కేదార్ యాత్ర (1996) ఆరో భాగం – కొమరగిరి అన్నపూర్ణ


మర్నాడు తెల్లవారుఝామున్నే లేచి స్నానాలు కానిచ్చి బస్సులో రుద్రప్రయాగ చేరుకున్నాము. అక్కడ మందాకినీ, అలకనంద నదులు కలుస్తాయి. కానీ అక్కడ నీళ్ళు ఇఘాలు. అంత చల్లటి నీళ్ళలో స్నానాలు కష్టమని శ్రీనగర్ లోనే ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చాము కనుక నదిలో నీళ్ళు నెత్తిన చల్లుకున్నాము. బస్సు ఆగిన చోటునుంచి నది దగ్గరికి చేరుకోవడం కూడా కష్టం. ఇరుకు దారి. కాలు జారింది అంటే ఏకంగా నదిలో పడడమే. ఎట్లాగో అందరం చేతులు పట్టుకుని కిందికి దిగాము. యాభయ్ మెట్లు ఎక్కితే గంగాభవాని, శివాలయాలు వున్నాయి. అటునుంచే వెళ్లి బస్సు పట్టుకున్నాము. సాయంత్రం మళ్ళీ శ్రీనగర్ వెళ్లి పడుకున్నాము. మరుసటి రోజు కేదార్ ప్రయాణం.
ఉదయం ఎనిమిది గంటలకు గౌరీ కుండ్ చేరాము. అక్కడి వరకే బస్సు ప్రయాణం. తరువాత కాలినడక లేదా గుర్రాలపైనా కానీ డోలీలలో కానీ వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళకు పదకొండువందల చొప్పున అయిదు డోలీలు, నాలుగువందల చొప్పున ఆరు గుర్రాలు మాట్లాడారు. పదకొండుగంటలకు అయిదుగురు అక్కచెల్లెళ్ళం అయిదు డోలీలు ఎక్కాం. మిగిలిన వాళ్ళు గుర్రాలు ఎక్కారు. డోలీలు ఉయ్యాల మాదిరిగా వున్నాయి. ముందర ఇద్దరు మనుషులు, వెనక ఇద్దరు పట్టుకుని మోస్తారు.
బయలుదేరేటప్పుడు పెద్ద చలి ఉంటుందనుకోలేదు. అంచేత అందరం చిన్న స్వెట్టర్లు వేసుకుని శాలువలు కప్పుకున్నాం. వర్షం పడుతుందని బస్సువాడు చెప్పడంతో రెయిన్ కోట్లు అద్దెకు తెచ్చారు. ఒక కిలోమీటరు వెళ్ళామో లేదో పెద్ద వర్షం పట్టుకుంది. మేము తడవలేదు కానీ ఒకటే ఈదురుగాలి. దారిలో అక్కడక్కడా చిన్న పందిర్లు ప్లాస్టిక్ షీట్లతో వేసుకుని టీ, కాఫీ, రొట్టెలు, బిస్కెట్ల వంటివి అమ్ముతున్నారు. అంతంత దూరాల్లో తోడు లేకుండా ఎలా వుండగలుగుతున్నారో. ఒక వైపు చూస్తే కళ్ళు తిరిగే లోయ. అందులో హోరుమని చప్పుడు చేస్తూ మందాకినీ నదీ ప్రవాహం. మరో వైపు ఆకాశాన్ని అంటే హిమాలయాలు. ఇరుకు దారి. వందలకొద్దీ గుర్రాలు, డోలీలు. కాలినడకన సాగిపోయే వందలాది మంది యాత్రీకులు. పైగా వాన, బురద, పెద్ద పెద్ద బండరాళ్ళు. ఏమాత్రం కాలుజారినా పాతాళంలో పడిపోవడమే. ఇక గుర్రాలు ఎలా తర్పీదు ఇచ్చారో కానీ, మెల్లగా దారి అంచున కొననుండి పోతుంటాయి. గుర్రాలకు, వాటిని తీసుకువెళ్ళే వాళ్లకు అలవాటు కావచ్చు కానీ యాత్రీకులకుకొత్త కదా! గుండెలు పీచు పీచుమంటూ వుంటాయి. డోలీల్లో కూర్చున్నామనే కానీ మా కాళ్ళూ చేతులూ చలికి వంకర్లు పోతున్నాయి. భారతికి కీళ్ళ నొప్పులు. చలికి అసలు తట్టుకోలేక గజగజా వణికి పోతోంది. భాష తెలియకపోయినా డోలీల వాళ్ళు దాన్ని మోసుకుపోయి దగ్గరలో ఒక పొయ్యి దగ్గర కూర్చోబెట్టి కాళ్ళూ చేతులూ కాపడం మొదలు పెట్టారు. అది చూసి ప్రేమకు, నాకూ భయం వేసింది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. కేదార్ ప్రయాణం ఇప్పుడే మొదలయింది. ఇంకా చాలా దూరం పోవాలి. చలి ఇప్పుడే ఇలా వుంది. ముందు ముందు ఇంకా ఎలా వుంటుందో. పైగా ఇక్కడ అంతా ఎవరికి వారే. అందర్నీ కలుపుకుపోవడం వుండదు. మిగిలిన వాళ్ళ పరిస్తితి మనకు తెలియదు, మనం ఎలా ఉన్నామో వాళ్లకు తెలియదు. ఇంతలో సురేష్ గుర్రం మీద వస్తూ కనిపించాడు. మేము కేకలు పెడితే చూసి దగ్గరకు వచ్చాడు. వాడిని చూడగానే రవంత ధైర్యం వచ్చింది.
డోలీల వాళ్ళు వాన బాగా వుంటే ఆగడం, తగ్గితే బయలుదేరడం చేస్తున్నారు. ఆగినప్పుడల్లా భారతి చలి తట్టుకోలేక పోతోంది. మా పరిస్తితి అంతంత మాత్రంగానే వుంది. ఇంతలో రంగారావు గారు గుర్రం మీద వస్తూ కనిపించారు. ఆయన వచ్చి భారతికి కాళ్ళూ చేతులూ కాపడం పెట్టించి వేడి వేడి కాఫీ తాగించారు. ఈలోగా శారదక్కయ్య, సావిత్రి వస్తున్న డోలీలు కూడా వచ్చి ఆగాయి. అందరం కాఫీలు తాగి బయలుదేరాము.
వేడి కాఫీ కడుపులో పడేసరికి కాస్త కోలుకున్నాం. డోలీ నుంచి చూస్తె పర్వతశ్రేణులు, వాటిపై రకరకాల చెట్లు, పూలతో ప్రకృతి రమణీయంగా కనబడింది. వాన వచ్చినప్పుడు కొండ వారన ఆగడం, తగ్గగానే బయలుదేరడం ఇలా డోలీ వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు. కొండరాళ్ళు విరిగి మీదపడే ప్రమాదం పొంచి వుందని తెలిసికూడా అందరూ అలా ప్రయాణం చేస్తూ వుండడం చూస్తే అంతా దైవ లీల అనిపించింది. అవన్నీ చూస్తుంటే, ‘జగతిపై పడవచ్చు జలరాశి కెరటాలు, మామూలు మేరకు ముడవలేక, ఎంత శ్రమనొందుచుంటివో స్వామి’’ అన్న జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి (కరుణశ్రీ) పద్యం గుర్తుకు వచ్చింది. చూస్తుంటే, పైనుంచి కొండరాళ్ళు దొర్లి పడకుండా ఏదో దివ్య శక్తి చేతులతో ఆపుతున్నట్లే వుంది. (ఇంకా వుంది)

9, జులై 2017, ఆదివారం

బదరీ కేదార్ యాత్ర (1996)– ఐదో భాగం - కొమరగిరి అన్నపూర్ణ


ఋషీకేశ్ నుంచి హిమాలయాలు ప్రారంభం. అక్కడి నుండే ఘాట్ రోడ్డుపై ప్రయాణం మొదలు. కొంత దూరం పోయిన తరువాత చల్లటి మంచి నీళ్ళు దొరుకుతాయని ఒక చోట బస్సు ఆపారు. అందరం వెళ్లి వాటర్ బాటిల్స్ లో తెచ్చుకున్నాము. ఎండ తీక్షణంగానే వున్నా గాలి చల్లగానే వీస్తోంది. కనుక హాయిగానే వుంది. ఒక వైపు అగాధమైన లోయ. మరో వైపు ఆకాశాన్ని అంటే పర్వతాలు. బస్సులో చాలామంది తెలుగు వాళ్ళు వున్నారు. ఒకామె ‘తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి’ అంటుంటే ఆమె భర్త కాబోలు, మా వైపు చూపించి ‘ మామ్మగార్లు చూడు ఇంత వయస్సులో కూడా ఎలా హుషారుగా తిరుగుతున్నారో’ అని భార్యని మందలిస్తున్నాడు.
గైడు మాకు హిమాలయాలను చూపిస్తూ హిమాలయాల్లో పెద్దవీ, చిన్నవీ కలిపి మొత్తం లక్షా పదిహేనువందల పర్వతాలు వున్నాయని చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. కాళిదాసు హిమాలయాలను మానదండం (రూళ్ళ కర్ర) గా వర్ణించాడు.
కొంత దూరం వెళ్ళిన తరువాత మళ్ళీ బస్సు ఆపారు. ‘ఇక్కడే భాగీరధి (గంగ), అలకనంద నదుల సంగమం వుంది వెళ్లి చూడండి అన్నాడు గైడు. అందరూ దిగి వెళ్లి నెత్తిన నీళ్ళు చల్లుకు వచ్చారు.  నేను, సావిత్రి కొంతదూరం వెళ్లి నడవలేక వెనక్కి వచ్చి బస్సులో కూర్చున్నాము. రంగడు సీసాలో నీళ్ళు తెచ్చిస్తే చల్లుకున్నాము.దాన్ని దేవా ప్రయాగ అంటారుట.
బస్సులో నుంచే సూర్యాస్తమయ దృశ్యాన్ని చూసాము. ఎంతో మనోహరంగా వుంది. మనకు దగ్గరలోనే సూర్యుడు
 అస్తమిస్తున్న అనుభూతి కలిగింది. ఘాట్ రోడ్డు ప్రయాణం భయంకరంగానే అనిపిస్తుంది, వెళ్లినంతసేపు. ఎట్లాగో భగవంతుని దయ వల్ల క్షేమంగా శ్రీనగర్ చేరాము.
కాశ్మీరు రాజధాని శ్రీనగర్, ఈ శ్రీనగర్ ఒకటి కాదు. ఇది వేరు. ఇక్కడ అందర్నీ ఒక సత్రంలో బస చేయించారు.
మా పదకొండు మందికీ విడిగా రెండు గదులు ఇచ్చారు. గదికి అయిదువందలు అద్దె. అందరం మొహాలు కడుక్కున్నాం. స్వర్ణ మర్నాటికి అందరికీ కావాల్సిన బట్టలు అవీ తీసి మడతలు పెట్టి సర్దిఉంచింది.  రాత్రంతా బస్సులో సరిగా నిద్ర పట్టలేదు. మళ్ళీ తెల్లవారు ఝామున్నే ప్రయాణం. డోలీలు, గుర్రాలు ఎక్కడం ఎల్లా అనేదాని మీదే చర్చ. గుర్రానికి అయిదువందలు, డోలీకయితే పదిహేనువందలుట. శారదక్కయ్య, సావిత్రి  గుర్రం ఎక్కడానికి భయపడుతున్నారు. రంగారావు గారు నవ్వుతూ ‘ మీరు గుర్రాలు ఎక్కి ఏమైనా అయితే మీ కొడుకులకు నేనేం సంధానం చెబుతాను,డబ్బు పొతే పోయింది డోలీలే ఎక్కిస్తాను’ అని అన్నాడు.

ఫలహారం చేసి, మజ్జిగ తాగి ఆ రాత్రి పడుకున్నాము. హాయిగా నిద్ర పోయాము. ఈ విధంగా నాలుగో రోజు ప్రయాణం ముగిసింది. (ఇంకా వుంది)

అవినీతి వేలం పాటలు తగ్గించాలి


నిన్న సాయంత్రం (శనివారం) మహా టీవీ ‘ఎడిటర్స్ టైం’ ప్రోగ్రాం లో మాట్లాడాలని పిలిచారు. ఫోన్ ఇన్ కాబట్టి బయటకు పోవాల్సిన పని లేదు, వర్క్ ఫ్రం హోం లాగా. మహా టీవీ ఎడిటర్ ఐ. వెంకట్రావు గారు, నేను, ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం బెజవాడ ఆంద్రజ్యోతిలో కలిసి పనిచేసాము. నాపట్ల ఇప్పటికీ అప్పటి వాత్సల్యం చెక్కు చెదరలేదు. ఫేస్ బుక్ లో నేను రాసే వాటిని ఆయన శ్రద్ధగా చదువుతారు. ముందు కాసేపు ఆ విషయాలనే ప్రస్తావిస్తారు. ఇవ్వాళ మా పెద్దన్నయ్య పర్వతాల రావు గురించి రాసింది చదివినట్టున్నారు. ఆయనతోనే మా సంభాషణ మొదలయింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా వుంటే పర్వతాల రావుగారు తెలుగు ప్రజలు గర్వించే రచయిత అయ్యేవారనేది వెంకట్రావు గారి అభిప్రాయం.
తరువాత సంభాషణ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ వైపు మళ్ళింది. ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం గురించి అడిగినప్పుడు నేను ‘వివరణ’గా చెప్పాను. ఆకాశవాణి విలేకరిగా ప్రభుత్వాధినేతలతో మంచి సంబంధాలు ఉండేవని, అయితే వారిలో అంజయ్య, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురితో వ్యక్తిగత పరిచయం ఎక్కువని, కారణం వారు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు నాకు బాగా నచ్చడం వల్ల కావచ్చునని చెప్పాను. వైఎస్ తరువాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ మొదలయిన పధకాలను యథాతధంగా కొనసాగించి ఉన్నట్టయితే ఈ సరికి తెలుగు రాష్ట్రాలలో అట్టడుగు ప్రజలు బాగుపడి వుండేవారన్నాను. ఇంజినీర్ అనిపించుకోవడం వల్ల బడుగువర్గాలకు చెందిన వారికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా సమాజంలో వారి స్థాయి పెరిగి, వారిలో ఆత్మన్యూనతా భావం తగ్గిపోతుందని, ఈ పధకం వల్ల ఇతరత్రా లభించే లబ్దికంటే ఇది చాలా ముఖ్యమని అన్నాను. దీనికి ఉదాహరణలు ఇచ్చాను. ఇవన్నీ గతంలో నేను నా బ్లాగులో రాసుకున్నవే. అమల్లో కొన్ని లోపాలు వున్నాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జరిగే అవినీతితో పోల్చినా, ఈ పధకాల వల్ల బడుగు,బలహీన వర్గాలకు జరిగే ప్రయోజనాలతో పోల్చి చూసుకుంటే వీటిల్లోని లొసుగులు చాలా స్వల్పమని చెప్పాను. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పధకాలను సరిగా పట్టించుకోకపోవడం వల్ల పేద ప్రజలు బాగా నష్ట పోయారని అన్నాను.
తరువాత సహజంగానే టాపిక్ వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్లీనరీ మీదకు మళ్ళింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రచురించిన అవినీతి చక్రవర్తి పుస్తకం ప్రస్తావన వచ్చింది. గతంలో జగన్ లక్ష కోట్ల అవినీతి గురించి విస్తృత ప్రచారం జరిగిందని, లక్ష కోట్లు, లక్ష కోట్లు అంటూ పదేపదే చెబుతూ పోవడంతో అదే నిజమని జనం నమ్మే పరిస్తితి వచ్చిందని, అంతిమంగా వేసిన చార్జి షీట్లలో పేర్కొన్న అవినీతి ఆ స్థాయిలో కనబడలేదని, ఇటువంటి ప్రచారాల వల్ల ప్రత్యర్ధి పార్టీలకు రాజకీయ ప్రయోజనం లభించవచ్చేమో కానీ ప్రజలకు రాజకీయ పార్టీల పట్ల ఏహ్యభావం పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నాను. ఇప్పుడు వై.ఎస్.ఆర్.సీ.పీ. అదే పల్లవి ఎత్తుకుని చంద్రబాబును అవినీతి చక్రవర్తి గా అభివర్ణిస్తూ, గత మూడేళ్ళ కాలంలో ఆయన అవినీతి మూడుకోట్ల డెబ్బయి లక్షల స్థాయిలో వుందని సాక్ష్యాధారాలతో ఒక పుస్తకం వేసారని చెబుతూ, ఇలా అవినీతి లక్షల కొట్లలో జరుగుతున్నట్టు పై పాటలు పాడుతూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పొతే ప్రజలకు రాజకీయ నాయకులు అంటేనే విరక్తి కలిగే ప్రమాదం ఉంటుందని, అది ప్రజాస్వామ్యానికి మేలు చేయదని చెప్పాను.
ఆంద్ర ప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు ఎదుటివారిని విమర్శలతో ఎండగట్టె క్రమంలో ముందుకు వెడుతున్నాయని, ప్లీనరీలో జగన్ పక్షం వాళ్ళు ‘చంద్ర నామస్మరణ’ చేస్తే, ప్లీనరీ వెలుపల టీడీపీ మంత్రులు మూకుమ్మడి ‘జగన్నామ స్మరణ’ చేసారని చెప్పాను.
(విచిత్రం ఏమిటంటే ఈ రోజు (ఆదివారం) ఉదయం TV-5 News Scan లో కూడా విజయ్ నారాయణ్ ఈ అంశాల మీదనే నా అభిప్రాయం అడిగారు. దాదాపు ఇదే మోస్తరు జవాబులు చెప్పాను)