31, జనవరి 2021, ఆదివారం

భలే మామా భలే - భండారు శ్రీనివాసరావు

 

ఫోనొచ్చింది.
“చూస్తున్నారా! మావాడు వాళ్ళని భలేగా వాయించేస్తున్నాడు. ఈ దెబ్బతో అవతలవాళ్ళు మఠాష్!”
కాసేపట్లోనే మరో ఫోన్. మరో మనిషి నుంచి.
“చూశారా! అతగాడి వాదన. మాట్లాడిన దాంట్లో ఏవన్నా అర్ధం ఉందా!
ఇద్దరూ చూసింది ఒకే టీవీలో ఒకే దృశ్యం. ఇద్దరూ విన్నది ఒకే మాట.
అయినా ఆ చూపులో తేడా! అర్ధం చేసుకోవడంలో తేడా!
నిజానికి చూపులో తేడా లేదు. వాళ్ళు పెట్టుకున్న కళ్ళద్దాలలోనే.
ఇలాంటివి వింటుంటే మాయాబజార్ సినిమాలో ‘భలే మామా! భలే! మనవాడు కృష్ణుడి మీద ఎలా చమత్కార బాణం వేశాడో’ అనే డైలాగులు గుర్తుకురాకమానవు.
(31-01-2021)

30, జనవరి 2021, శనివారం

మా రోజుల్లో .....భండారు శ్రీనివాసరావు

 మా రోజుల్లో అని ఎవడైనా సంభాషణ మొదలు పెడితే ఇక ఆ వ్యక్తి ఈనాటి వాడు కాదు, పాత తరం మనిషి అని ఎవరికైనా ఇట్టే అర్ధమై పోతుంది. ఇవతల వ్యక్తి కూడా అదే బాపతు అయితే ఆ ముచ్చట్లకు అంతే వుండదు.

1975లో నేను రేడియోలో చేరిన కొత్తల్లో పరిచయం అయిన కె. వేణుగోపాల్ తో నా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. ఈనాడులో రాజకీయాలు రాసిన జర్నలిస్ట్ కాబట్టి సహజంగానే అతడికి వాటి పట్ల ఆసక్తి జాస్తి. రాజకీయులతో పరిచయాలు కూడా ఎక్కువే. వేణుగోపాల్ సలహాలు తీసుకోవడానికి వాళ్ళలో చాలామంది ఫోన్లు చేస్తుండేవాళ్ళు.
ఇక పొతే ఇప్పుడు మేమిద్దరం ముందు చెప్పిన ‘మారోజుల్లో...’ బాపతే. కాబట్టి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము.
‘నిమ్మగడ్డ మీద సభాహక్కుల తీర్మానం ఇచ్చారని అంటున్నార్రు. ఏమైతుందని అనుకుంటున్నావ్’ అన్నాడు కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసి.
‘ఏమవుతుందో నాకూ తెలియదు. ఆట ఆడేవాడిని బట్టి ఆట తీరు చెప్పొచ్చు. అలాగే ఒక రాజ్యాంగ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తి తీసుకునే నిర్ణయాన్ని బట్టి పరిణామాలు వుంటాయి’
‘........’
‘గతంలో కోర్టు తీర్పుల్ని కూడా లక్ష్య పెట్టని స్పీకర్లని మనం చూశాం. పట్టుదలతో ఆడే ఆట వేరు, పంతాలతో ఆడేది వేరు. ఇప్పుడు ఇరుపక్షాలదీ రెండో బాటే. ఒకరు తప్పు చేస్తున్నారేమో అని మనం అనుమానించేలోగా అవతల వాళ్ళు కూడా మరో తప్పు చేస్తున్నారు. తీర్పు చెప్పే ఛాన్స్ ఎవరిస్తున్నారు?ఎక్కడిస్తున్నారు?’
‘వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే వీళ్ళు ఒకప్పుడు మనకు తెలిసిన వాళ్ళేనా అనిపిస్తోంది’ అన్నాడు వేణు.
‘నిజమే! ఇప్పుడు టీవీల్లో వస్తున్న వార్తలలో వాడే భాష సంగతేమిటి అని అడుగుతున్నారు జనం. ఒకళ్ళకు చెప్పేముందు మనం కూడా ఒకసారి మనలోకి తొంగి చూసుకోవాలి కదా!’
‘అదీ నిజమే! పక్క పేపరు పేరు కూడా రాసే వాళ్ళం కాదు, ఒక పత్రిక అని తప్ప. ఇప్పుడో! ఒకర్ని మరొకరు కుత్తుకలు నరుక్కోవడం తప్ప అన్నీ చేస్తున్నారు.
‘కాబట్టి, కావున మనం ఇలా అప్పుడప్పుడూ మాట్లాడుకుంటూ గతం తిరగేసుకుంటూ ఉందాం. దాన్ని మించింది లేదు, ఈ వయసులో’
(30-01-2021)

మీడియాకు దూరంగా .... భండారు శ్రీనివాసరావు

 

“నేను పత్రికలు, చదవను, టీవీ చర్చలు చూడను” అని ఓ మిత్రుడు వాట్స్ అప్  సందేశం పంపాడు. నిజానికి ఈ మాటను ఒకప్పుడు మన దేశానికి ప్రధాన మంత్రిగా స్వల్పకాలం పనిచేసిన చరణ్ సింగ్ ఎప్పుడో చెప్పారు. కాకపొతే అప్పటికి ఈ టీవీలు లేవు. అంచేత ఆయన ఇలా అన్నారు.

“నేను పేపర్లు చదవను, రేడియో వినను. అదే నా ఆరోగ్య రహస్యం”

సరే అదలా వుంచి మా వాట్సప్ మిత్రుడి గురించి చెప్పుకుందాం.

టీవీలు, చూడకపోవడానికి, పత్రికలు చదవక పోవడానికి ఆయన చెప్పిన కారణం విచిత్రంగా వుంది. తనకు వచ్చిన ఓ మెసేజ్ తననీ నిర్ణయానికి ప్రొద్బలపరచిందని చెప్పాడు. నిజానికి ఈ సందేశం ఇప్పటికే  చాలా సార్లు చాలా మందికి చేరిపోయింది కూడా.

అదేమిటంటే, Nathan Zohner అనే పెద్దమనిషి, తనకు తెలిసిన  శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ఇతరుల అజ్ఞానాన్ని అవహేళన చేయడానికి ప్రయోగిస్తుంటాడు. ‘డైహైడ్రోజన్ మోనాక్సైడ్ (diyhydrogen monoxide) అనేది చాలా ప్రమాదకరం అని, దాన్ని తక్షణం నిషేధించాలని ఆయన చెబుతుంటాడు. తీరా చేస్తే  diyhydrogen monoxide అంటే మామూలు నీళ్ళు (water). అదొక రసాయనిక నామం మాత్రమే. శాస్త్రవేత్తలు కూడా చాలా అరుదుగా వాడే పదం ఇది. అలాంటి శాస్త్రీయ పదాల పట్ల అవగాహన లేనివాళ్లు నిజమే, అది ప్రమాదకరం  కాబోలు అనుకుంటారు అమాయకంగా. ఇలా తమ ప్రజ్ఞతో సాధారణ విషయాలను కూడా మసిపూసి మారేడు కాయ చేసే వ్యవహారాలు ఈనాటి మీడియా చేస్తోందనేది ఆ మితృడి అభిప్రాయం. అందుకే ‘పేపర్లు చదవను, టీవీ చర్చలు చూడను అనే నిర్ణయానికి ఆయన వచ్చాడు.

కానీ మీడియా మీద ఎంత చెడుగా అనుకున్నా, అది necessary evil అంటాడు మరో మిత్రుడు. మొన్నీమధ్య ఆయన ఓ అయిదు రోజుల పాటు నగరానికి దూరంగా వున్న ఫాం హౌస్ లో గడిపివచ్చారు. ఆయనకీ పొద్దున్నే పత్రిక చూడనిదే గడవదు. అక్కడ పత్రిక దొరకదు. ఫాం హౌస్ లో ఉన్న టీవీకి నెట్ సమస్య వచ్చి మౌన ముద్రదాల్చింది. మొదటి రోజు కష్టంగా గడిచింది. మర్నాడు మనసుకు ప్రశాంతంగా వున్నట్టు తోచింది. ఆ మర్నాడు అప్పుడే రెండు రోజులు గడిచిపోయాయా అనిపించింది. అక్కడే అలానే వుండిపొతే బాగుండు ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా అని కూడా అనిపించిందట. షుగర్, బీపీ అదుపులో వుందని పరీక్ష చేసుకుంటే తెలిసిందట.

అయితే ఇంటికి తిరిగి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే, గుమ్మం  ముందు పడి వున్న పత్రికలను అన్నింటినీ వరసపెట్టి  తిరగేయడం.

మరొక మిత్రుడు మరీ విచిత్రమైన విషయం చెప్పాడు. నిరుడు ఫిబ్రవరిలో కరోనా గురించిన సమాచారం అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న రోజులు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన పేపరు మొహం చూడలేదు. పొరబాటున కూడా పత్రికను చేతితో తాకలేదు. పుట్టడమే పత్రికాసమేతంగా పుట్టాడని ఆయన చుట్టపక్కాలు చెప్పుకొనేవారు. ప్రతిరోజూ  రోజూ మూడు నాలుగు పత్రికలు చదివే అలవాటు చిన్నప్పటి నుంచీ వుంది. అలాంటి మనిషి దాదాపు ఏడాదిగా పేపరు చేత్తో పట్టుకోలేదు, ముట్టుకోలేదు అంటే ఆశ్చర్యమే మరి.

ఈ విషయాలన్నీ తలచుకుంటూ వుంటే ఎప్పుడో జ్వాలా చెప్పిన ఓ విషయం జ్ఞాపకం వచ్చింది.

అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి కుముద్ బెన్ జోషీ గవర్నర్. తెలుగు దేశం అధికారంలో వుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో. కాంగ్రెస్ గవర్నర్ కాబట్టి  టీడీపీ అనుకూల పత్రికలు కొన్ని గవర్నరు ఏం చేసినా వాటిని తూర్పార పడుతూ కధనాలు రాసేవి. ఆవిడ వ్యవహార శైలి కూడా అందుకు దోహదం చేసి వుంటుంది. అది రాజ్ భవన్ కాదు, గాంధీ భవన్ (కాంగ్రెస్ పార్టీ కార్యాలయ భవనం) అనే వారు. కాంగ్రెస్ నాయకులు చాలామందికి రాజ్ భవన్ ఓ అడ్డాగా మారింది అని గుసగుసలు వినిపించేవి.

ఒకసారి ఉపరాష్ట్రపతి వెంకట్రామన్ గారు హైదరాబాదు వచ్చి రాజ భవన్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. గవర్నర్ కుముద్ బెన్ జోషీ, గవర్నర్ కార్యదర్శి చంద్రమౌళిగారు వెళ్లి ఉపరాష్ట్రపతిని   మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

మాటల సందర్భంలో వెంకట్రామన్ అడిగారు జోషీ గారెని, ‘ఏమిటి అలా వున్నారు ఒంట్లో బాగుండలేదా అని.

చంద్రమౌళిగారు గారు కల్పించుకుని అసలు విషయం చెప్పారు, ఆరోజు ఉదయమే ఒక పత్రిక గవర్నర్ కు వ్యతిరేకంగా ఒక కధనం ప్రచురించిందని.

అప్పుడు వెంకట్రామన్ గారు ఇచ్చిన సలహా ఇది.

‘ఓ మూడు రోజులు పత్రికలు చదవడం మానేసి చూడండి, మనసుకు ఎంతటి ప్రశాంతత లభిస్తుందో అర్ధం అవుతుంది”     

(30-01-2021)

 

29, జనవరి 2021, శుక్రవారం

సెంఛురీ దాటిన పెట్రోలు ధర – భండారు శ్రీనివాసరావు

 

 

పెట్రోలుకు మండే గుణం వుంది. గులాబీ సువాసన గులాబీ ముల్లుకు అంటినట్టు ఈ మండే గుణం పెట్రోలుతో పాటు దాని ధరకు కూడా అబ్బింది. అందుకే  పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా పెట్రో మంటలు అని మీడియాలో చమత్కరిస్తుంటారు.

పెట్రోలు ధర వంద రూపాయలు దాటిందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంకా పెరగడానికి అవకాశం ఉన్న నిత్యావసర వస్తువుల్లో ఇదొకటి. అంచేత ఆశ్చర్యం అనిపించలేదు.

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటి. నిజానికి ఈ ధరవరల వ్యవహారం ప్రభుత్వం చేతిలో లేకపోయినా ఆ నింద మోయక తప్పదు. ఎందుకంటే ఎంత చేతిలో లేని సంగతి అయినా, ప్రభుత్వం తలచుకోకుండా ఇలాంటివి జరగవు అని స్కూల్లో చదివే పిల్లాడు కూడా చెబుతాడు.

గతంలో ప్రభుత్వాలు ఈ విమర్శలు ఎదుర్కున్నాయి. ఇప్పటి ప్రభుత్వానికీ తప్పని తల నొపప్పే.

ఈ విమర్శకులు సాధారణంగా తమ వాదనకు మద్దతుగా చెప్పే విషయం ఒకటుంది. అది క్రమంగా ఓ పడికట్టు పదంగా మారిపోయింది. అదేమిటంటే అంతర్జాతీయ చమురు ధరలు, తగ్గుతున్నప్పుడు, లేదా మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధరలు పడిపోతున్నప్పుడు, పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఎలా పెరుగుతున్నాయి? ఎవరూ వంక పెట్టడానికి వీల్లేని వాదన.

ఒకానొక కాలంలో (అప్పటికే ఈ ఆటోమేటిక్ ధరవరల విధానం అమల్లోకి వచ్చింది, ఇదేమీ కొత్త విషయం  కాదు) అంటే నేను రేడియోలో విలేకరిగా పనిచేస్తున్నప్పుడే నేనూ ఇలాంటి వాదన నెత్తికెత్తుకుని పెట్రోలియం శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారిని అడిగాను.

ఆయన ఏం చెప్పారు అంటే:

“దేశం ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాదా దిశలో వెడుతోంది. ముడి చమురు వెలికి తీయడానికి, దాన్ని శుద్ది చేయడానికీ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఈ పెంచిన ధరల్లో కొంత మొత్తాన్ని ఆ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఒక్కసారి ఈ లక్ష్యం నెరవేరితే ఇక దిగుమతుల భారం లక్షల కొట్లలో తగ్గే అవకాశం వుంటుంది”

అంటే అప్పటిదాకా ప్రజలు ఈ పెంచిన ధరలు భరిస్తూ కొంత త్యాగం చేయాల్సి వుంటుంది.

‘బాగానే వుంది మీరు చెప్పిన సంగతి. కానీ భారతీయ పెట్రో సంస్థలు వ్యయ నియంత్రణ పాటిస్తున్నట్టు కనపడదు. పలానా బ్రాండు చమురు (వాహనాల్లో వాడేది) కొనండి అని పత్రికల్లో, మీడియాలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుంటారు. ఆ ఖర్చు అవసరమా! ఏ ప్రచారం లేకపోయినా, అవసరానికి  కొనే ఉత్పత్తులు అవి. ఇది సరే! ఇంత పేద దేశంలో ఇన్ని రకాల ప్రభుత్వ సంస్థలు అవసరమా! చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు సిబ్బంది, ఇవన్నీ వ్యయాన్ని పెంచేవే కదా!’

ఆ అధికారి నుంచి మందహాసం తప్ప సమాధానం లేకపోవడంతో నేను కాస్త రెచ్చిపోయాను.

‘పెట్రోలు బ్యాంకుల ఆధునీకరణ పేరుతొ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్లు మారినప్పుడల్లా లోగోలు దేశ వ్యాప్తంగా మారుస్తున్నారు. ఇవన్నీ అవసరమా! పెట్రో ధరలు పెంచడానికి ఇలాంటి అనవసరపు ఖర్చులు కారణం అని ఎవరైనా అనుకుంటే తప్పు పట్టగలరా”

సరే! ఆయన మాత్రం ఏం చెప్పగలరు?  

పదేళ్ల క్రితం అంటే 2010 లో ఒక పత్రికలో వచ్చిన నా వ్యాసంలో పేర్కొన్న మరికొన్ని విషయాలు. 

పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. కాదు పెంచారు. వడ్డన కూడా కొంత భారీగానే వుంది.ఒక్క పెట్రోలుతో సరిపెట్టకుండా, పనిలో పనిగా డీసెలు, కిరోసిన్, గ్యాస్ ధరలను కూడా ఒకేసారి పెంచి అనేకసార్లు ఆందోళనలకు దిగే పని లేకుండా ప్రతిపక్షాలకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ ఛానల్లకే కొంత నిరాశ. పలుమార్లు చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ధరల పెరుగుదల ఈ నాలుగింటితో ఆగిపోదు, ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితం, అలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు. పొతే, ఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపిన వాళ్ళు, తమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసినవాళ్ళు యధావిధిగా టీవీ స్తుడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలు, రాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీ, ఇది ఎవరికీ పట్టదు.

 

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. దరిమిలా, పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయి, ఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీ, యెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఆనవాయితీగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదనని, ఎడ్ల బళ్ళు, రిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు, వెచ్చాలు కొనని ఆడంగులు కొందరు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు-ఏమీ కొనేట్టులేదుఅంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడంఅన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండి, పెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

 

ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు.

 

ఇదంతా ఎందుకు జరుగుతోంది ?

 

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల.

 

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమె కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాత తరం నుంచి, వున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరో తరం నుంచి, ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకో తరం నుంచి, అలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన దారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలి, కొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి. ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయి, ఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా అనే ఆటో డ్రైవర్ సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటే, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది. ఇది సమాజం లోని అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కాణీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప. (25-06-2010)

 

27, జనవరి 2021, బుధవారం

థాంక్స్ చెప్పడం మినహా ఏం చేయగలను ?

థాంక్స్ చెప్పడం మినహా ఏం చేయగలను ?

నేను ఆకాశవాణి/ దూరదర్శన్ నుంచి రిటైర్ అయి అప్పుడే పదిహేను  ఏళ్ళు గడిచిపోయాయా!  నాకయితే గుర్తు లేదు. కానీ కంప్యూటర్ గుర్తు పెట్టుకుంది.

ఉద్యోగ విరమణ చేసే సమయంలో పింఛన్ మొత్తం నుంచి కొంత కమ్యుటేషన్ కింద తగ్గించి ఇస్తారు. ఓ పదిహేను ఏళ్ళ తరువాత మళ్ళీ పింఛన్ లో ఆ మొత్తం కలుపుతారు.

నేను రిటైర్ అయింది 2005 డిసెంబరు 31వ తేదీన. 2021 జనవరికి పదిహేను సంవత్సరాలు  పూర్తవుతాయి. అంటే ఆ ఏడాది జనవరి నెల పెన్షన్ లో ఈ మొత్తం కలపాలి.

పదిహేను ఏళ్ళు అంటే మాట కాదు. నిన్నా మొన్నా జరిగిన విషయాలే గుర్తుండి చావడం లేదు. మరి ఇంతకాలం అయిన తర్వాత ఈ విషయాన్ని గుర్తు చేయడానికి ఎన్ని మహజర్లు పెట్టుకొవాలో, ఎన్ని ఆఫీసుల చుట్టూ  తిరగాలో  అని అనుకున్న మాట కూడా నిజం.

ముందే చెప్పినట్టు ఈ విషయాలు ఏవీ నాకు గుర్తు లేవు, ఈరోజు ఉదయం పెన్షన్ మెసేజ్ వచ్చిన దాకా.

ఎప్పుడో అలారం పెట్టిన గడియారం ఆ సమయానికల్లా ఖచ్చితంగా అలారం కొట్టినట్టు, పదిహేను ఏళ్ళు గడవగానే పించను కార్యాలయంలోని కంప్యూటర్లు ఠంచనుగా ఈ  కమ్యుటేషన్ మొత్తాన్ని నా బ్యాంకు ఖాతాకు జత చేసాయి. ఆ  విషయాన్ని ఈరోజు ఉదయం ఆరుగంటలకల్లా ఒక ఎస్సెమ్మెస్  రూపంలో తెలియచేశాయి.

అద్భుతం అనిపించింది.

రిటైర్ అయి పని లేకుండా ఉన్న  మా బోంట్ల కోసం ఎవరో ఎక్కడో బాగానే పనిచేస్తున్నారు. వారందరికీ థాంక్స్. (27-01-2021)

 

 

  

26, జనవరి 2021, మంగళవారం

సంగీతమే ప్రాణంగా జీవిస్తున్న అన్నవరపు వారికి 'పద్మ శ్రీ'

 

"నేనూ  మారలేదు, నా ఇల్లూ  మారలేదు"

(Published in SAKSHI daily on 27-01-2021. Wednesday)

ఆలిండియా రేడియో వార్తావిభాగంలో నా సీనియర్ సహోద్యోగి ఆర్వీవీ కృష్ణారావుగారికి ఓ కన్ను వార్తలమీద, ఓ చెవి సంగీతం మీద. ఒక చెవి అని ఎందుకు అంటున్నానంటే సంగీతం అంటే చెవి కోసుకునే అభిమాని కాబట్టి.

ఓసారి బెజవాడ నుంచి మంచి నడి ఎండాకాలంలో వస్తున్న వారి అమ్మగారిని రిసీవ్ చేసుకోవడానికి సికిందరాబాదు స్టేషన్ కు వెళ్ళారు. గోల్కొండ రైలులో ఆవిడ దిగారు. అదే రైలులో ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామి గారు కూడా వచ్చారు. ఆయన్ని చూడగానే కృష్ణారావు గారు వారి అమ్మగారిని ఓ సిమెంటు బెంచి మీద కూర్చోబెట్టి, ఇప్పుడే వస్తానని చెప్పి రామస్వామిగారివద్దకు వెళ్ళారు. ఆయన వయొలిన్ పెట్టె ఒక చేతిలో, మామిడి పళ్ళ బుట్ట మరో చేతిలో పట్టుకుని రైలు దిగారు. సూటు కేసు పట్టుకోవడానికి మరో చేయి లేక అటూఇటూ చూస్తుంటే కృష్ణారావు గారు ఆయన్ని పలకరించి వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లి హోటల్లో దిగబెట్టారు. ఇంతలో తల్లి గుర్తుకువచ్చి మళ్ళీ స్టేషన్ కు వెడితే ఆవిడ గాభరాగా ఈయన కోసం వెతుక్కుంటూ ఉన్నారట. అలా వుంటుంది కృష్ణారావు గారికి సంగీతం మీద అనురక్తి, సంగీతకారులు అంటే గౌరవ ప్రతిపత్తి.

రామస్వామి గారు బెజవాడ రేడియో స్టేషనులో హై గ్రేడ్ ఆర్టిస్టుగా చాలా సంవత్సరాలు పనిచేశారు. అక్కడే న్యూస్ ఎడిటర్ గా పనిచేసిన కృష్ణారావు గారికి అలా రామస్వామి గారితో పరిచయం.

1968లో హైదరాబాదు రవీంద్ర భారతిలో 150వ త్యాగరాయ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి. జంట నగరాలలోని ప్రభుత్వ సంగీత కళాశాలల ప్రిన్సిపాల్స్ గా పనిచేస్తున్న శ్రీ నూకల సత్యనారాయణ, శ్రీ దంతాలే ఈ ఉత్సవాల నిర్వాహకులు. అనేక ప్రాంతాల నుంచి ఉద్దండులైన సంగీత విద్వాంసుల కచ్చేరీలు ఏర్పాటు చేశారు. వీరిలో అన్నవరపు రామస్వామి గారు కూడా వున్నారు. కచ్చేరీ సమయానికి ముందుగానే ఆయన ఓ అంబాసిడర్ కారులో రవీంద్రభారతికి చేరుకున్నారు. వయొలిన్ పెట్టె ఆయనకు ప్రాణం. దాన్ని ఎవరి చేతికీ ఇవ్వరు. స్వయంగా దాన్ని పట్టుకుని కారు దిగి డోరు వేస్తుంటే ఆయన చేతి వేలు నలిగిపోయింది. అయినా సరే బాధ ఓర్చుకుంటూ వేదిక మీదికి వెళ్లి కచ్చేరీ ప్రారంభించారు. వేలు బాగా వాచిపోయింది. కచ్చేరీ ఎలాగా అని నిర్వాహకులు కంగారు పడుతుంటే రామస్వామి గారు తన వయొలిన్ తో సభికులను ఉర్రూతలూగించారు. సంగీతం పట్ల ఆయన నిబద్ధత అలాంటిది.

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి రామస్వామి గారు అనేక కచ్చేరీలలో వయొలిన్ సహకారం అందించారు. వారిద్దరినీ సంగీత అభిమానులు ‘రామకృష్ణులు’ అనేవారు.

అలాగే విజయవాడ రేడియో స్టేషనులో అన్నవరపు రామస్వామి గారు (వయోలిన్), దండమూడి రామమోహనరావు (మృదంగం) చాలా పేరుపొందిన కళాకారులు. వారికి బయట నుంచి కచ్చేరీలకు ఆహ్వానాలు వస్తుండేవి. ఆఫీసులో వీరి మీద ఆజమాయిషీ చేసే అధికారికి అది నచ్చేది కాదు. అందుకని కార్యక్రమాల జాబితా రూపొందించేటప్పుడు, బయట ప్రోగ్రాములకి వీలు కుదరకుండా వీరిద్దరికీ కలిపి రేడియోలో డ్యూటీ వేసేవారు.

మాండలిన్ శ్రీనివాస్ కి మొదట్లో ప్రోత్సాహం ఇచ్చింది రామస్వామి గారే. తన మనుమరాలిని శ్రీనివాస్ కు ఇచ్చి పెళ్లి కూడా చేశారు.

ఏలూరు సమీపంలోని సోమవరప్పాడు గ్రామంలో అతిపేద మంగళ వాయిద్య కళాకారుల కుటుంబంలో జన్మించిన అన్నవరపు రామస్వామి గారు వారాలు చేసుకుంటూ మొదట మాగంటి జగన్నాధం చౌదరి గారి వద్దా, ఆ తరువాత పారుపల్లి వారి వద్దా శిష్యరికం చేసి వయొలిన్ వాయిద్యంలో మెళకువలు అభ్యసించారు. వారి సోదరులు అన్నవరపు గోపాలం గారు కూడా ఘటం విద్వాంసులుగా ఆకాశవాణిలో పనిచేశారు. తండ్రి పెంటయ్య గారు సోమవరప్పాడు గ్రామంలో నాదస్వర కళాకారుడు.

కృష్ణారావు గారు ఒకసారి, బహుశా రెండు మూడేళ్ల క్రితం కాబోలు, విజయవాడ వెడుతూ రామస్వామి గారికి ఫోన్ చేసి ‘మీ ఇల్లు సూర్యారావు పేటలోనేనా, మారారా’ అని అడిగారుట. ‘నేనూ మారలేదు, ఇల్లూ మారలేదు’ అనేది అన్నవరపువారి జవాబు.

కృష్ణారావు గారు వెళ్ళే సరికి ఆ వీధివీధంతా బహుళ అంతస్తుల భవనాలతో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించింది. వెతుక్కుంటూ వెడితే రామస్వామి గారు ఇల్లు కనపడింది. ఆ ఒక్క ఇల్లే ఆ వీధిలో ఎలాంటి మార్పు లేకుండా అలాగే వుంది. వీధి గుమ్మానికి ఒక పక్కన గుండ్రటి అక్షరాలతో ‘అన్నవరపు రామస్వామి’ అనీ, మరో వైపు ‘రామకృష్ణ నిలయం’ అని రాసి వున్న బోర్డులు కూడా ఎలాంటి మార్పు లేకుండా వున్నాయి. ఎప్పుడో యాభయ్ ఏళ్ళ క్రితం సాదా సీదాగా కట్టుకున్న ఆ ఇంటికి తన గురువుగారయిన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి పేరు పెట్టుకున్నారు.

పారుపల్లి వారు త్యాగరాయ గురు శిష్య పరంపరలోని వారు. ‘సంగీతాన్ని నమ్ముకోండి, అమ్ముకోకండి’ అనే త్యాగరాజు గారి బోధనలను వంటబట్టించుకున్నవారు.

అందుకే, రామస్వామి గారు కూడా వందలాదిమంది శిష్యులను తయారు చేసినప్పటికీ, తన గురువు గారి అడుగుజాడల్లోనే నడుస్తూ ఏనాడు ఎవరినుంచీ గురుదక్షిణ తీసుకోకుండా సంగీత సేవ చేస్తున్నారు.

రేడియో స్టేషన్లో ఉద్యోగం చేసేటప్పుడు ఆయన ప్రతిరోజూ సైకిల్ మీదనే వచ్చేవారు. గోచి పోసిన పంచె లాల్చీ ఆయన ఆహార్యం.

సంగీతం అంటే ప్రాణం పెడుతూ, సంగీతమే సర్వస్వంగా భావిస్తూ, సంగీత సేవ చేస్తూ వస్తున్న తొంభయ్ అయిదేళ్ళ అన్నవరపు రామస్వామి గారిని గుర్తించి భారత ప్రభుత్వం ఈ ఏడాది పద్మ శ్రీ పురస్కారం ప్రకటించడం ముదావహం. (26-01-2021


Clipping of Sakshi Telugu Daily - Telangana




22, జనవరి 2021, శుక్రవారం

నాడు అయోధ్యలో ఏం జరిగింది?

 

 


విప్లవ తపస్వి పీవీ సమీక్ష : పదో భాగం  

రచన: శ్రీ ఏ. కృష్ణారావు : సమీక్ష : భండారు శ్రీనివాసరావు

మాజీ  ప్రధాని పీవీ నరసింహారావు గురించి రాసేవారు ఎంత చేయి తిరిగిన రచయిత అయినప్పటికీ పీవీ జీవితంలో ప్రధాన అధ్యాయంగా మారిన ‘అయోధ్య కాండ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు, ఒకింత సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడం ఖాయం. వున్నది ఉన్నట్టుగా రాసినా, లేనిది ఉన్నట్టుగా రాసినా చదివేవారి మనస్తత్వాన్ని బట్టి మార్కులు పడతాయి. అటు  పొగడ్తలకు, ఇటు తెగడ్తలకు  సిద్ధపడి వుండాలి. ఎందుకంటే  ఈ అంశం ఒక్క  రాజకీయంతో కలగలిసినది మాత్రమే  కాదు, మరో పక్క మతంతో ముడిపడిన విషయం కూడా  కావడమే ఇందుకు ప్రధాన కారణం.

రచయిత, అందులోను ఒక పత్రికారచయిత,  చదివేవారు ఏమనుకుంటారో అనే కోణం నుంచి ఆలోచించి  రాస్తారు అని నేను అనుకోను. కానీ ఆధునిక  భారతీయ చరిత్రలో జరిగిన ఒక చారిత్రక సంఘటన గురించి రాసేటప్పుడు  నిజమైన పత్రికారచయిత కొంత సంయమనం పాటించే తీరాలి. అది పత్రికా రచయిత నైతిక ధర్మం కూడా. అఖిల సమాజ శ్రేయస్సు దృష్ట్యా  కొన్ని సందర్భాలలో  ఇది అత్యంత ఆవశ్యకం.

అయోధ్య సంఘటన ఎప్పుడో క్రీస్తుకు పూర్వం జరిగింది కాదు, ఆ నాటి విషయాలు అన్నీ ఇప్పటి కాలంలో చాలామందికి తెలిసిన విషయాలే. అయినాసరే, మాట పడకుండా, అదే సమయంలో మొహమాట పడకుండా వాస్తవాలు  కాగితం మీద పెట్టడం అనేది కత్తి మీది సామే! ఎందుకంటే అప్పటికీ ఇప్పటికీ  రాజకీయ వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఆనాటి పరిస్థితులను గమనంలో పెట్టుకోకపోతే, ఈనాడు చదివే అంశాలు  అపార్థాలకు దారితీసే ప్రమాదం కూడా వుంది.  మరీ ముఖ్యంగా  నవతరం పాఠకులు  అంటే నాడు అయోధ్యలో ఏమి జరిగింది అనే విషయంపై  కర్ణాకర్ణిగా వినడం తప్పిస్తే లోతులకు వెళ్లి  పరిశీలించే అవకాశం లేని నేటి తరానికి కొన్ని వాస్తవాలు చేదుగా అనిపించవచ్చు. అసలు ఈ కారణంతోనే ఈ అంశాన్ని నేను  ఈ పుస్తక  సమీక్షలో చివరి అధ్యాయంగా ఎంచుకోవడం జరిగింది.

రచయిత కృష్ణారావు  కూడా బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ‘ప్రత్యక్ష సాక్షి’ కధనం రాసేటప్పుడు తన మనసులోని మాటను ఇలా  పేర్కొన్నారు.

“ఒక అసాధారణ సంఘటనను ప్రత్యక్షంగా చూడడం, దాన్ని గురించి రాయడం అదే మొదటిసారి. నా ఆలోచనా ధోరణి, నా భావజాలం, నా అభిప్రాయాలు ఏవైనా, వృత్తికి సంబంధించి రాసే వార్తల్లో అవి చొరబడకూడదని భావించేవారిలో నేనొకడిని

దీన్నిబట్టి నాటి అయోధ్య సంగతులను ఒక జర్నలిస్టుగా రికార్డు చేయడానికి ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్ధం అవుతుంది. ఎందుకంటే  ముందే చెప్పినట్టు ఇది రాజకీయాలతో, మతాలతో ముడిపడిన సున్నితమైన అంశం కనుక.

ఇది రాస్తూ వుండగా ఒక ఫోన్ వచ్చింది.

కొత్త నెంబరు. ఆయన పరిచయం చేసుకున్నారు. ఈ పుస్తకం పబ్లిషర్.

“ఏమండీ మీరిలా పుస్తకం మొత్తం రివ్యూ పేరుతో యధాతధంగా రాస్తూ పొతే ఎలాండీ. కాస్త మా విషయం కూడా ఆలోచించండి” అన్నారు చాలా సౌమ్యంగా, ఇంకా చాలా మర్యాదగా.

“ఏమైనా మీకు నా థాంక్స్. మేము పబ్లిష్ చేసిన మరికొన్ని పుస్తకాలు మీకు పంపుదామని అనుకుంటున్నాను. మీ అడ్రసు చెబుతారా!” అన్నారు అవతలనుంచి  శ్రీ రాఘవేంద్ర పబ్లికేషన్స్ రాఘవేంద్రరావు గారు.

నాకు అందులో అపహాస్యం ఏమీ కనిపించలేదు, అభిమానం తప్పిస్తే.

పుస్తకాలు ప్రచురించడంలో ఉన్న సాధక బాధకాలు తెలిసిన వాడిని కనుక, సున్నితంగా, పరోక్షంగా రాఘవేంద్రరావు గారు చేసిన అభ్యర్ధనని కాదనలేక ఈ సమీక్షని ఇంతటితో ముగిస్తున్నాను.

రచయితకి క్షమాపణలతో, ప్రచురణ కర్తలకి కృతజ్ఞతతో ...భండారు శ్రీనివాసరావు