30, జూన్ 2020, మంగళవారం

వేణీ దానం అను సతీ పూజ – భండారు శ్రీనివాసరావు

చాలా ఏళ్ల క్రితం మేము సకుటుంబంగా అంటే దాదాపు ముప్పైమందిమి కాశీయాత్ర చేసాము. మార్గమధ్యంలో ప్రయాగ త్రివేణీ సంగమం వద్ద తర్పణ కార్యక్రమాలకు ముందు మా బృందంలోని దంపతుల చేత ఈ వేణీ దానం (పూజ) చేయించారు.
త్రివేణీ సంగమం దగ్గర గంగా, యమునా, సరస్వతి (అంతర్వాహినిగా) మూడు నదులు కలుస్తాయి. ఆడవారి పొడవైన తల వెంట్రుకలను మూడు పాయలుగా చేసి జడ అల్లడం తెలిసిందే. దానికీ దీనికీ ముడిపెట్టి ఈ పూజలు చేయిస్తారు. ఏడుజన్మల పాపాలు కొట్టుకుపోతాయని ఐతిహ్యం. సరే అదలా ఉంచుదాము.
నాకు ఈ పూజలో నచ్చినదేమిటంటే మొగుడి చేత భార్యకు సపర్యలు చేయించడం. అది చూసిన తర్వాత ఈ జన్మలో మొగుళ్ళు చేసిన పాపాలకు ప్రక్షాళన జరగడం ఖాయం అనిపించింది.
ఈ ప్రక్రియలో భర్త తన ఇల్లాలిని తొడపై కూర్చుండబెట్టుకోవాలి. ఆమె మొహాన్ని కడిగి తుడవాలి. కుంకుమ బొట్టు పెట్టాలి. వధువుగా మరి కొన్ని అలంకరణలు చేయాలి. లాలనగా మాట్లాడుతూ, భార్య జుట్టును మూడు పాయలుగా చేసి జడ అల్లాలి. ఇలా కొన్ని పనులు చేయించి మగవాడి ఆధిపత్య, అహంకార ధోరణికి అడ్డుకట్ట వేసే విధానం నాకీ క్రతువులో కనిపించింది.

నవ్వు మొహం చెదిరిపోయింది

 

నాకు ఎరుక తెలిసే వయసు వచ్చినప్పటి నుంచి ఆమె నాకు తెలుసు. పైగా మా మేనత్త కూతురు. నాకంటే పదేళ్ళు పెద్ద. అయినా ఇంతవరకు ఆమె అసలు  పేరు తెలియదు అంటే నమ్మశక్యం కాని విషయమే. మా చిన్నప్పటి నుంచీ ఆమెను చిట్టెత్తయ్య అనే పిలిచేవాళ్ళం వరస కాకపోయినా. ఈరోజు ఉదయం నల్గొండలో  కొలిపాక రత్నావతి (82) మరణించారు అనే విషయం తెలిసినప్పుడు మా చుట్టాల్లో ఎవరో పోయారు అనుకున్నా కానీ ఆ చనిపోయింది మా మేనత్త కూతురు  చిట్టెత్తయ్య అనే సంగతి చప్పున స్పురణకు  రాలేదు.

గత అరవై ఏళ్ళుగా చూస్తూ వస్తున్నాను. నవ్వు మొహం లేకుండా ఏనాడూ ఆమె నాకు  కనపడలేదు. నోరారా నవ్వడం, మనసారా ఆప్యాయంగా ఏరా బాగున్నావా అనడం ఆమె ట్రేడ్ మార్క్.

నిరుడు మా ఆవిడ చనిపోయినప్పుడు ఫోన్ చేసి పరామర్శించింది. గొంతులో ఎక్కడలేని దుఖం తన్నుకు వస్తున్నట్టు, బలవంతంగా ఆపుకుంటున్నట్టు అర్ధం అవుతున్నది. తర్వాత విషయం తెలిసి నిర్ఘాంతపోయాను. అప్పటికే ఆమె భర్త చనిపోయి మూడు రోజులు అవుతోంది. మా ఇంట్లో పరిస్తితి చూసి నాకు ఆ కబురు తెలపలేదు. ఒక పక్క భర్తను పోగొట్టుకుని మరో పక్క భార్య పోయిన నన్ను ఓదార్చిన ఆమె ఔన్నత్యానికి జోహార్లు.

వాళ్ళిద్దరిదీ ఆదర్శ దాంపత్యం. కొన్ని దశాబ్దాలపాటు సాగిన సంసారంలో నిరుడు మొట్ట మొదటి శరాఘాతం తగిలింది కొమర్రాజు మురళీధరరావు గారి ఆకస్మిక మరణం రూపంలో.

ఏడాది తిరగకుండానే మళ్ళీ ఈ కబురు. అదీ లాక్ డౌన్ కాలంలో.

ఆమెకు ఆత్మశాంతి కలగాలని ప్రార్ధిస్తూ, ఆ కుటుంబ సభ్యులు అందరికీ నా సానుభూతి.

Image may contain: Prema Prasad, outdoor, text that says 'శివైక్యం చేందినారు'

(30-06-2020)    


29, జూన్ 2020, సోమవారం

పీవీనా! మజాకా!

“పెళ్ళయి పదేళ్ళవుతున్నా, పెళ్ళానికి ఇంకా ఆమె పుట్టింటి పేరు మీదే ఉత్తరాలు వస్తున్నాయి అంటే, ఆ మొగుడు ఉత్త నస్మరంతి అన్నమాట అని భాష్యం చెప్పారు ముళ్ళపూడి వెంకట రమణ గారు. నస్మరంతి అనే పదానికి  అర్ధం, ‘ఎవరూ  తలచుకోనివాడు’ అని వారి తాత్పర్యం.

ఇప్పుడు దాన్ని మొబైల్ ఫోన్లకు వర్తింప చేయలేమో. రోజుకి ఒకసారన్నా తన ఉనికిని చాటుతూ సెల్లు మోగకుండా మూగనోము పట్టిందంటే దాని ఓనరు కూడా నస్మరంతి బాపతే అనుకోవాలి.

ఒకరకంగా సెల్ ఫోన్ కి సంబంధించి నేను ఇదే తరహా మనిషిని. రోజు మొత్తం మీద అయిదారు సార్లు మోగితే అదే ఘనం. అందులో కొన్ని మార్కెటింగు కాల్స్.

అలాంటిది, నిన్నా ఈరోజూ ఓ రెండు గంటల పాటు నేనే బలవంతంగా దాని నోరు కుట్టేయాల్సివచ్చింది అంటే నాకే ఆశ్చర్యంగా వుంది. దీనికి కారణం పీవీ గారు. ఆయన మీద నేను సాక్షిలో రాసిన వ్యాసం చదివిన వాళ్ళు పదేపదే అదేపనిగా ఫోన్లు చేస్తూ ఉండడంతో కాలకృత్యాల కోసం రెండు గంటలు సైలెన్స్ మోడ్ లో పెట్టాల్సి వచ్చింది. బహుశా నేను సెల్ ఫోన్ వాడడం మొదలు పెట్టిన నాటి నుంచి అలా చేయడం ఇదే మొదటి సారి.

తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ విదేశాల్లో ఉంటున్న అనేకమంది ఫోన్లు చేసారు. పీవీ గారికి ఇంతమంది అభిమానులు వున్నారా అని ఆశ్చర్యపోతూ ఆనందించిన క్షణాలు ఎలా మరిచిపోగలను?

మచ్చుకి కొన్ని:

‘పీవీ గారికి మా వూళ్ళో శిలావిగ్రహం వేయాలని తీర్మానించాం. ఈరోజు నుంచే ఆ పనిలో ఉంటున్నాం’ – చామర్తి శ్రీధర్, వినుకొండ.

‘పీవీ గారు సీఎం గా వుండగా తీసుకొచ్చిన భూసంస్కరణల చట్టం గురించి అనకాపల్లిలో జడ్జిగా వున్నప్పుడు నేనిచ్చిన ఒక తీర్పులో ప్రస్తావించాను. దానికోసం వెతుకుతున్నాను. దొరకగానే మీకు పంపుతాను” – నరసింహాచారి, హైదరాబాదు.

“ మా వూళ్ళో ఉంటున్న తెలుగు వాళ్ళం అందరం కలిసి ఈరోజు పీవీ గారి జయంతి వేడుకలను నిర్వహిస్తున్నాం” – అవ్వలరాజు కామేశ్వర రావు, ఆస్ట్రేలియా.

“పీవీ గారు ప్రధానిగా వున్నప్పుడు బనగానపల్లికి వచ్చారు. అప్పుడు నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ని. వారికి సప్లయి చేసిన నీళ్ళ బాటిల్ ని నేను ఇప్పటికీ భద్రంగా దాచుకున్నాను” – చిన్న మద్దప్ప నాయుడు, రిటైర్డ్ డిప్యూటీ తాసిల్దార్, ధోన్.

“కాశ్మీర్ లో ఎన్నికలు జరిపించి మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేలా చూడడం అన్నది ఒక్క పీవీగారికే సాధ్యం అయింది, ఏ నాయకుడూ ఆ సాహసం చేయలేకపోయారు” - డాక్టర్ ఎం. జైనుల్లావుద్దీన్, ఎడిటర్, విజ్ఞానసూచిక, నంద్యాల.  

“వైజాగ్ నుంచి ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ వ్యాసం గురించి చెప్పాడు. మనిషిని పంపించి పేపరు తెప్పించాను. చాలా బాగుంది. ఓసారి బెజవాడ నుంచి శాతవాహనలో హైదరాబాదు వస్తున్నాను. ఖమ్మంలో ఇద్దరు స్వతంత్ర సమరయోధులు రైలెక్కారు. హైదరాబాదు చేరిందాకా వాళ్ళిద్దరూ పీవీ ముచ్చట్లతోనే గడిపారు. పీవీ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకున్నారు. కలం, కాగితాలు తెచ్చుకుని వుంటే బాగుండేదే అని బాధ పడ్డాను” – ఉపేంద్ర బాబు, సీనియర్ జర్నలిస్ట్, విజయవాడ.   

“నవోదయా స్కూల్స్. పీవీ గారి హయాములో మొదలయిన ఈ పధకం చాలా గొప్పది. ప్రతి గ్రామంలో నవోదయా స్కూళ్ళు పెట్టి వుంటే చదువు సంధ్యల నాణ్యత విషయంలో మనకు ప్రపంచంలో పోటీ వుండేది కాదు” – శ్రీమతి మణి ప్రసాద్, రిటైర్డ్ ప్రిన్సిపాల్, దిల్ సుఖ్ నగర్.  

 “కాకతాళీయం కావచ్చు. అంతకు ముందు రాత్రి మీ అన్నగారు రాసిన నమో నరసింహాయ పుస్తకం బాగా పొద్దు పోయేదాకా చదువుతూ పోయాను. పొద్దున్నే పీవీ గారినోట మీ అన్నగారి ప్రస్తావన వచ్చిన విషయం మీ వ్యాసంలో వుంది” – కే. లక్ష్మీనారాయణ, ఐ.ఏ.ఎస్. (రిటైర్డ్)  

ఫోన్లో ఇన్ కమింగ్ కాల్స్ లెక్క పెట్టి చూస్తే ఇప్పటికి రెండు వందల నలభయ్ ఎనిమిది లెక్కతేలాయి. ఫోన్ ఎంగేజ్డ్ గా వుండడం వల్ల మరో పాతిక దాకా నేను రెస్పాండ్ కావాల్సిన కాల్స్ మిగిలి వున్నాయి. ఎస్సెమ్మెస్ లకు జవాబు ఇవ్వడం ఇంకా పూర్తి కాలేదు.

వీటన్నిటి బట్టి నాకు అర్ధం అయింది ఏమిటంటే పీవీ మరణించలేదు, జనం గుండెల్లో బతికే వున్నారని.

(29-06-2020)



(భార్య శ్రీమతి సత్యమ్మ గారితో పీవీ గారు)




28, జూన్ 2020, ఆదివారం

అచ్చమైన భారత రత్నం




(జూన్ 28 న  పీవీ శతజయంతి ఉత్సవాలు మొదలవుతున్న సందర్భంగా సాక్షి దినపత్రిక ప్రచురించిన నా వ్యాసం)

ఈరోజు అంటే జూన్ ఇరవై ఎనిమిది మాజీ ప్రధానమంత్రి శ్రీ పీవీ నరసింహారావు జయంతి. ఇప్పటినుంచి  మొదలు పెట్టి ఒక ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ముదావహం. 
అత్యంత అదృష్టవంతుడు, బహు దురదృష్టవంతుడు అయిన  రాజకీయనాయకుడు ఎవరయ్యా అంటే చప్పున తట్టే పేరు  పీవీ నరసింహారావు.
ఆయన  ప్రధానిగా వున్నంతకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు.
పీకలలోతు  సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్ధిక వ్యవస్థను నూతన
సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తించారు. సంఖ్యాబలం  బొటాబొటిగా
వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై వుంచిన
‘అపర చాణక్యుడ’ని  వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయి, పదవి
నుంచి దిగిపోయిన తరువాత  పొగిడిన  ఆ నోళ్లతోనే  ఆయన్ని  తెగడడం
ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం
కాగానే వాళ్ళూ దూరం జరిగారు. పోనీ  ఆయన తరవాత కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన
వ్యక్తి సీతారాం కేసరికి పీవీని  మించిన గొప్ప లక్షణాలేమీ లేవు. కానీ
‘పదవే’ సర్వస్వమయిన  కాంగ్రెస్ వారికి  ‘కేసరి భజనే’ సర్వస్వమయిపోయింది.
మాజీగా మారిన పీవీపై విమర్శల దాడి మొదలుపెట్టిన కాంగ్రెస్  పార్టీ
‘పత్తిత్తులకు’ ఆయన దేశానికి చేసిన ‘మేళ్ళు’ కానరాలేదు.

అయిదేళ్ళు ‘తెలుగువాడి’ లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన
‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’
నిలబడినప్పుడు,  ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోక పోగా ఏమీ
తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’  మూసుకున్నారు. ప్రధానిగా ఆయన హయాములో
జరిగిన తప్పులనో, పొరబాట్లనో  సమర్ధించడం ఈ వ్యాసకర్త వుద్దేశ్యం కాదు.
రాజకీయాల్లో ‘కృతజ్ఞత’, ‘విధేయత’  అనే పదాలకి  తావు లేకుండా పోయిందన్న
విషయాన్ని విశదం చేయడానికే ఈ వివరణ. గాంధీ, నెహ్రూల కుటుంబానికి చెందని ఒక కాంగ్రెస్ నాయకుడు  భారత ప్రధానిగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని తన తెలివితేటలతో, మేధస్సుతో పూర్తికాలం అయిదేళ్ళు నడపడమే కాదు, అప్పటికే ఆర్ధికంగా కునారిల్లుతున్న దేశాన్ని ఒడ్డున పడేసిన కృతజ్ఞత కూడా ఆయనకు తన సొంత పార్టీ నుంచి లభించలేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీలో కృతజ్ఞతకు వున్న స్థానం. ఇదీ ఆ పార్టీలో విధేయతకు లభించే ప్రాధాన్యం. 
ఒక సాధారణ నాయకుడు చనిపోయినా అతడి పార్దివదేహాన్ని  పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు దర్శించి  కడపటి వీడ్కోలు ఇచ్చేందుకు వీలుగా పార్టీ ఆఫీసులో కొంత సేపు వుంచడం అనేది అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన పట్ల ఆ మాత్రం కనీస మర్యాద చూపాలన్న సోయికూడా  లేకుండాపోయింది.      


పీవీ ప్రధానమంత్రిగా వున్నప్పుడు ప్రతి ఏటా  బేగంపేటలోని
ఒక సందులో వున్న స్వామి రామానంద తీర్ధ ట్రస్టు కార్యాలయానికి వచ్చేవారు.
ఇక అక్కడ చూడాలి అధికారులు, అనధికారుల హడావిడి. ప్రధాని పదవి నుంచి
దిగిపోయిన తరువాత అక్కడ జరిగిన ట్రస్టు సమావేశాలకు కూడా ఆయన
హాజరయ్యేవారు. వాటిని కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు 'అధికారాంతమునందు...'
అనే పద్యపాదం  జ్ఞాపకం చేసుకోవాలో, 'ఈ కర్మభూమిలో పదవి, అధికారం ముందు
అన్నీ దిగదుడుపే' అనే నిజాన్ని హరాయించుకోవాలో  అర్ధం అయ్యేది కాదు.
పీవీ గురించిన మరో జ్ఞాపకం నా మదిలో పదిలంగా వుండిపోయింది.
పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాదు వచ్చారు. మాజీ ప్రధాని
హోదాలో రాజ్ భవన్ గెస్టు హౌస్ లో బస చేసారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ
దిగినప్పుడు కనబడే హడావిడి ఎలా వుండేదో  ఒక విలేకరిగా నాకు తెలుసు.  ఆయన
చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా  అధికారులు, అనధికారులు, మందీ
మార్బలాలు, వందిమాగధులు,  ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయనాయకులు.
ఆ వైభోగం వర్ణించ తరమా? అన్నట్టు వుండేది.
మాజీ ప్రధానిగా పీవీ  రాజభవన్ లో వున్నప్పుడు, నేనూ , ఆకాశవాణిలో నా
సీనియర్ కొలీగ్   ఆర్వీవీ కృష్ణారావు గారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం
వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్నతరవాత,  రాజ్ భవన్  గెస్ట్ హౌస్ మీదుగా
తిరిగి  వెడుతూ అటువైపు తొంగి చూసాము. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు
మినహా రాజకీయుల హడావిడి కనిపించక పోవడంతో మేము లోపలకు వెళ్ళాము.  ‘పీవీ
గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భధ్రతాదికారిని  అడిగాము.
అతడు తాపీగా  'లోపలకు వెళ్ళండి' అన్నట్టు సైగ చేసాడు. ఆశ్చర్యపోతూనే
లోపలకు అడుగు పెట్టాము.

పెట్టిన తరవాత, మా ఆశ్చర్యం రెట్టింపు అయింది. పీవీ ఒక్కరే కూర్చుని
టీవీలో ఫుట్ బాల్  మాచ్  చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న
ఫీలింగుతోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను
మాత్రమే వేసుకునివున్న పీవీగారు  నా వైపు చూస్తూ, 'మీ అన్నయ్య
పర్వతాలరావు  ఎలావున్నాడయ్యా !' అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది.
ఎప్పుడో  దశాబ్దాల క్రితం,  పీవీగారు ముఖ్యమంత్రి గా వున్నప్పుడు,
రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు
ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీ గారు  ముఖ్యమంత్రిగా
ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన  అవసరం
ఆయనకు లేదు.  అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ
పీవీగారి గొప్పతనం.  ఆ తరవాత కూడా  ఆయన ఏదో మాట్లాడుతున్నారు  కానీ మాకు
‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగావుంది. మేము కలసి కూర్చుంది,  కొన్నేళ్ళ
క్రితంవరకు దేశాన్ని వొంటిచేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ వుండడం
వల్ల  కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరవాత, కొణిజేటి రోశయ్య
గారు వచ్చారు. ఆయన్ని చూడగానే  పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది.
రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి
ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఈ చక్కని జ్ఞాపకం మాత్రం మా గుండెల్లో ఇంకా
తాజాగానే వుంది.
మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిసాను. రేడియో
మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్రమంత్రిగా అత్యంత
ఉచ్ఛస్థానంలో వున్న  పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా
నీరవ నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే 'పీవీ గారిని కలవడానికి
వీలుంటుందా' అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది
చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు.
ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు
ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు.
'పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది' అన్నారు ఆయన తన మొహంలో
భావాలు ఏమీ తెలియకుండా.
‘మాస్కో ఎందుకయ్యా! వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా ? బాగా చలిదేశం.
పెళ్ళాం పిల్లలతో ఎలావుంటావు' అని అడిగారు. చాలా ముక్తసరిగా
మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను వూహించని విధంగా చనువుగా ఆ రెండు
ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను.
కనీసం ఆయన శతజయంతి సంవత్సరంలో అయినా కేంద్ర ప్రభుత్వం పీవీకి భారత రత్న ప్రకటిస్తే, ఆ అత్యున్నత పురస్కారానికే శోభస్కరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ విధంగా  ఆ మహనీయుడికి జాతి యావత్తూ కృతజ్ఞత తెలిపినట్టవుతుంది కూడా.     

26, జూన్ 2020, శుక్రవారం

కరోనా అంటే భయం ఎందుకు? – భండారు శ్రీనివాసరావు

 

“నేలతో నీడ అన్నది నను తాకరాదని,

పగటితో రేయి అన్నది నను తాకరాదని,

నీరు తన్ను తాకరాదని గడ్డిపరక అన్నది,

నేడు భర్తనే తాకరాదనీ... ఒక భార్య అన్నది”

(మంచి రోజులు వచ్చాయి సినిమాలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గీతం)

కరోనా అంటే భయం ఎందుకు అంటే ఇందుకే.  ఇది అన్ని రోగాలవంటిది కాదు. చావుకు దగ్గర చేసే జబ్బులు దీనికంటే అనేకం వున్నాయి. ఉదాహరణకు కేన్సర్. ఇది వచ్చిన వాళ్ళను శారీరకంగా, ఇంట్లో వారిని ఆర్ధికపరంగా చావగొడుతుంది.ఇల్లూవళ్ళూ గుల్ల చేస్తుంది. రోగి కోలుకునే అవకాశాలు తక్కువ. కుటుంబం చితికి పోవడం మాత్రం ఖాయం.

ఇంత భయంకరమైన రోగం అయినా కానీ కేన్సర్ వచ్చిందంటే సాటివాళ్ళు ఆ వ్యక్తి పట్ల సానుభూతి చూపుతారు. అయ్యో పాపం అనుకుంటారు.  ఆసుపత్రిలో వుంటే వెళ్లి చూస్తారు. కర్మకాలి జరగరానిది ఏదైనా జరిగితే చుట్టపక్కాలు అందరూ అంతిమ సంస్కారాల్లో పాల్గొని  కుటుంబ సభ్యులకు సానుభూతి చెబుతారు. స్వాంతన కలిగిస్తారు.

కానీ కరోనా అలా కాదే.  శారీరకంగా అది పెట్టే బాధ అంత లెక్కలోనిది కాదు. కానీ మానసికంగా పెట్టే బాధకు లెక్కే లేదు. సొంత కుటుంబంలోని వాళ్ళే, బాగా  దగ్గర వాళ్ళే దూరం అవుతారు. ‘ఎవరూ రారూ నీకోసం’ అంటూ ఏదో ఆసుపత్రిలో రేయింబవళ్ళూ ఒంటరిగా కుమిలిపోవాలి. చికిత్సకు లొంగి కరోనా అనే రోగం శరీరాన్ని వదిలినా దాని తాలూకు ‘అంటరానితనం’ అనే అవలక్షణం ఇంగువ కట్టిన గుడ్డలా అంత తేలిగ్గా వదలదు. అపార్ట్ మెంటు వాళ్ళు, కాలనీ వాళ్ళ చూపుల్లో తొంగిచూసే అనుమానం రోగిని సెల వేసినట్టు బాధ పడుతుంది. తానేమీ ఎయిడ్స్ రోగి కాదే! మరెందుకీ శిక్ష అనే బాధ మనసులో తొలుస్తుంటుంది. సొంత మనుషులు కూడా రోగం నయమై వచ్చిన రోగిని తాకడానికి సందేహిస్తున్నారు అనే కధనాలు వింటున్నప్పుడు ఈ బాధ ఎన్నాళ్ళో అనే బాధ ఎక్కువ అవుతుంది.

ఇక ఖర్మ కాలి కరోనాకు బలయితే ఇక ఆ కష్టాలు చెప్పతరం కాదు. అయినవాళ్ళు రాలేరు. చితికి నిప్పు పెట్టాల్సిన వాళ్ళు కూడా రాలేని పరిస్తితి. ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అనిపించే మరణం. దిక్కుమాలిన చావు అంటారే అది.

ప్రజల్ని మరింత భీతావహుల్ని చేసేందుకు ఇదంతా రాయడం లేదు. ఈ రోగం పట్ల సమాజంలో ఆవరించివున్న అనుమానాలను తొలగించకపోతే పరిస్తితి నిజంగా ఇలాగే తయారవుతుంది.

ఇదొక కొత్త జబ్బు. ఎవరికీ దీని గురించి పూర్తిగా తెలియదు. మిడిమిడిజ్ఞానంతో చెప్పే కబుర్లు పరిస్తితులను మరింత దిగజారుస్తాయి. ఈ విషయంలో సమాజాన్ని, ప్రజలను జాగృతం చేయాల్సిన మాధ్యమాలు రాజకీయాలు అనే కరోనాను మించిన రోగంతో కునారిల్లుతున్నాయి. నిన్ననే అనుకుంటా మురళీకృష్ణ గారు ఫోన్ చేశారు, మీడియా ద్వారా ఏమైనా చేయొచ్చా అని. దావానలంలా వ్యాపిస్తున్న కరోనా అని రాస్తే  టీఆర్పీ రేటింగులు పెరుగుతాయేమో కాని, సామాజిక బాధ్యత తీసుకుని ప్రజలకు ధైర్యం చెప్పే కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేయగల  తీరిక వున్నవాళ్ళు కలికానికి కూడా కానరావడం లేదంటే నిజంగా బాధపడాల్సిన, కాదు కాదు, సిగ్గుపడాల్సిన  విషయమే.

ఈ జబ్బుకు ఈ స్థాయిలో సాంఘిక బహిష్కరణ అవసరమా కాదా అన్నది సరయిన వైద్య నిపుణుల ద్వారా సేకరించి ప్రజలను చైతన్యం చేయకపోతే ముందు ముందు ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో!

కింది ఫోటో మిత్రుడు జగన్ మోహన్ పోస్ట్ చేసారు. ఒక కరోనా రోగికి ఓ స్టార్ హాస్పిటల్ లో వేసిన బిల్లు. అక్షరాలా మూడు లక్షల నలభయ్ వేల రూపాయలు. నిజానికి హోం క్వారంటైన్ లో ఈ చికిత్స తీసుకోవచ్చు. కానీ చిన్న చిన్న అపార్ట్ మెంట్లలో నివసించేవారి పరిస్తితి ఏమిటి? రోగం వచ్చిందని తెలియగానే ముందు ఇల్లు ఖాళీ చేయాలనే వొత్తిళ్ళు వస్తున్నాయని అంటున్నారు. ప్రభుత్వ వైద్య శాలల్లో పెద్ద సంఖ్యలో రోగులకు వసతి కల్పించడం కూడా అసాధ్యమే. అందరూ స్టార్ ఆస్పత్రుల ఖర్చు భరించలేరు.

కిం కర్తవ్యమ్?         

(26-06-2020)


No photo description available.

అయస్కాంతంగా మారిన రాజకీయం – భండారు శ్రీనివాసరావు

రాజకీయం శక్తివంతమైన అయస్కాంతం వంటిది. అమిత జనాదరణ కలిగిన సినీరంగ ప్రముఖులూ, కోట్లకు పడగెత్తిన వ్యాపార, వాణిజ్య శ్రేష్ఠులు, తమ కత్తికి ఎదురేలేదని భ్రమించే సంఘ వ్యతిరేకశక్తులూ, ఉద్యోగంలో వున్నన్ని రోజులూ అధికార చక్రం తిప్పిన ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులు ఇలా అందరూ కట్టగట్టుకుని తీయ నీటికి ఎగబడే చేపల మాదిరిగా రాజకీయ అరంగ్రేట్రం కోసం తహతహలాడేది అందుకే.

‘మాకు ప్రజల్లో అత్యంత ఆదరణ వుంది. కన్నెత్తి చూస్తే చాలు, పన్నెత్తి పలకరిస్తే చాలనుకుని మాకోసం జనాలు గంటలు గంటలు పడిగాపులు కాస్తుంటారు. ఎంతో శ్రమపడి, మరెంతో ఖర్చుపెట్టి  అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసుకుంటాం. ఆఖరి నిమిషంలో మా ఆశల మీద నీళ్ళు చల్లడానికి ఒక్క కానిస్టేబుల్ చాలు. అంత చిన్న ఉద్యోగి అధికారం ముందు మా యావత్తు ప్రజాకర్షణ బూడిదలో పోసిన పన్నీరే. అదే ఓ చోటా మోటా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే చాలు కస్టడీలో ఉన్న మనిషికూడా బయటకు వస్తాడు. ఇక ఈ సంపాదన, ఈ సంపద, ఈ ఆకర్షణ ఏం చేసుకోను. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నాను’ – ఓ ప్రముఖ సినీ నటుడి మన్ కీ బాత్.

‘ముఖ్యమంత్రి గదిలోకి అయినా తలుపు తోసుకుని పోయేవాళ్ళు వుంటారు. అదే మా సంగతి చూడండి. ఇంచుమించుగా ముప్పయి అయిదేళ్ళు అనేక హోదాల్లో పనిచేసాము. ఏ ఒక్క రోజయినా మా అనుమతి లేకుండా చీమ కూడా మా ఛాంబర్ లోకి అడుగుపెట్టలేదు. ఒక్క సంతకం చేస్తే చాలు కోట్ల రూపాయల లాభాలు తెచ్చే ఫైళ్ళు క్లియర్ అవుతాయి. కానీ ఏం లాభం. పైనుంచి ఫోన్ వస్తే చాలు మేము కిక్కురుమనకుండా సంతకం చేసి పంపేయాల్సిందే. అయినా మొండికేసి పై వాడు చెప్పిన పని చేయం. అంతరాత్మ చెప్పిన విధంగానే, రూలు ప్రకారమే చేస్తాం. సాయంత్రానికల్లా ఆ అంతరాత్మని వెంటబెట్టుకుని ఓ చెత్త పోస్టులోకి వెళ్ళమంటారు. ఇంత సర్వీసు చేసి అలాంటి పోస్టులు చేసేబదులు, అంతరాత్మ పీక నొక్కేసి అక్కడే వుంటే పోలా! కొన్నాళ్ళు బీరాలకు పోయినా కాలం గడుస్తున్నకొద్దీ సర్దుకుపోవడమే మేలనే పరిస్తితికి చేరుకుంటాము. కానీ ఎక్కడో బాధ. ఇంతచదువు చదివాము. ఇంత గొప్ప శిక్షణ పొందాము. చివరికి ఎవరో ఒక అంగుష్ఠమాత్రుడు చెప్పినట్టు చేయాల్సివస్తోంది. అంటే ఏమిటి? మనం అనుకున్న అధికారం మా ఉద్యోగాల్లోలేదు. అసలయిన అధికారం రాజకీయంలో వుంది. కాబట్టి రిటైర్ అయిన తర్వాత అందులోనే దూరితే పోలా!’ – ఒక సీనియర్ అధికారి అంతరంగ మధనం.

‘దేశ విదేశాల్లో వ్యాపారాలు వున్నాయి. నెలకు కోటి రూపాయలు కాంపెన్సేషన్ తీసుకునే సీయీఓలు డజను మంది తన చేతికింద పనిచేస్తున్నారు. క్రమం తప్పకుండా పనులు చక్కబెట్టుకునేందుకు సొంత విమానాలు వున్నాయి. రాజప్రసాదాలను తలదన్నే భవంతులు ప్రపంచంలోని అన్ని ప్రధాన నగరాల్లో వున్నాయి. తనని కలవాలంటే నెల ముందు అపాయింటు తీసుకోవాలి. మరి ఇంత ఐశ్వర్యం కూడా ప్రభుత్వాలతో పనిపడినప్పుడు ఎందుకూ కొరకాకుండా పోతోంది. కోట్ల లాభం కళ్ళచూడడానికి అవకాశం ఉన్న ఫైలును ఓ చిన్ని గుమాస్తా మోకాలు అడ్డు వేసి అపగలుగుతున్నాడు. అతడి  ఏడాది సంపాదన మొత్తం కలిపినా తను తాగే సిగార్ల ఖర్చుకు సరిరాదు.అదే ఓ ఎమ్మెల్యే ఫోను చేస్తే అదే ఫైలు పరుగులు కాదు ఎగిరి గంతులు వేసుకుంటూ చేరాల్సిన చోటికి, చేరాల్సిన టైముకు చేరుతుంది. లాభం లేదు, ఎంత ఖర్చయినా సరే ఈసారి ఒక రాజ్యసభ సభ్యత్వం సంపాదించి తీరాలి. లేకపోతే ఇంత సంపాదనా శుద్ధ దండగ’ – ఓ పారిశ్రామికవేత్త మనోవేదన

‘తనను చూస్తే పసిపిల్లలు నిద్రపోరు. తన మాట వినబడితే బడా వ్యాపారాలు చేసేవాళ్ళు కిమ్మనరు. తన చేతుల్లో లక్షలు మారుతున్నా పన్ను కట్టే పనే లేదు. తన మోచేతి నీళ్ళు తాగుతూ డజన్ల కొద్దీ గూండాలు పొట్టపోసుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వెళ్ళగానే మాట్లాడి అడిగిన పని చేసి పంపిస్తారు. కానీ ఓ పోలీసువాడు వచ్చి ఇంటితలుపు తడితే బిక్కుబిక్కుమనాల్సివస్తోంది. అదే రాజకీయ నాయకుడు ఎవరైనా కబురు చేస్తే చాలు ఠానాలో అందరూ సరే సార్ అంటారు. ఎన్నాళ్ళీ ముష్టి బతుకు. ఎవరి చేతికిందో పనిచేసి వాళ్ళని నాయకులుగా చేసేబదులు నేనే ఒక నాయకుడిని అయితే....’ – ఓ వీధి రౌడీ అంతరంగం.

ఇదిగో ఇలా వివిధ రంగాల వాళ్ళు రాజకీయాలవైపు పరుగులు తీస్తూ వుండడం వల్లనే ఈ పరిస్తితులు దాపురించాయి.

ఆప్తవాక్యం: రాజకీయాల్లో ఉన్నవారిని వారి రాజకీయాలు వారిని చేసుకోనివ్వండి. నిజానికి రాజకీయులు జనాలు అనుకున్నంత స్వార్ధ పరులేమీ కాదు. సమాజం ద్వారా సకల సంపదలు సంపాదించుకున్న వాళ్ళు వాటిని పరిరక్షించుకోవడం కోసం లేదా వాటిని మరింత పెంచుకోవడం కోసం  ప్రజాసేవ పేరుతొ రాజకీయాల్లోకి చేరుతూ వుండడం వల్లనే ఆ రంగం సహజంగానే కలుషితం అవుతూ వచ్చింది. సేవ చేయడానికి రాజకీయాలు అక్కరలేదు. ఒక మనిషిగా మీరున్న పరిధిలోనే మీకు చేతనైన సేవ చేయవచ్చు.

(26-06-2020)      

            


24, జూన్ 2020, బుధవారం

గోపీ చెప్పిన తీర్పు

‘హోటల్ భేటీ మీద మీ అభిప్రాయం ఏమిటి?’

‘శ్రీ సుజనా చౌదరి, శ్రీ కామినేని శ్రీనివాస్ ఇద్దరూ ఒకే  పార్టీ వాళ్ళు. వారిద్దరూ ఎక్కడ కలుసుకున్నా, ఎప్పుడు కలుసుకున్నా  ఎవరికీ ఎలాంటి అభ్యంతరం వుండనక్కరలేదు. ఇక శ్రీ నిమ్మగడ్డ రమేష్ కుమార్  విషయానికి వస్తే, ఆయన అక్కడికి వెళ్ళడం ఔచిత్యమా కాదా అన్నది ఆయన ప్రస్తుత హోదా మీద ఆధారపడిఉంది. ఇంతవరకు అంటే ఈకలయిక జరగడానికి ముందు వరకు  వైసీపీ వాళ్ళు చేస్తున్న వాదనల ప్రకారం నిమ్మగడ్డ ఆ పదవీ బాధ్యతలు స్వీకరించనట్టే లెక్క. అంటే ఆయన ప్రస్తుతం ఒక స్వేచ్చాజీవి. కాబట్టి హోటల్లో కలవడంలో తప్పులేదు. కానీ ఆయనే తన ముందరి కాళ్ళకు బంధాలు వేసుకున్నారు. ఆయన తొలగింపుపై  రగడ నడుస్తున్నప్పుడు ఆయన స్వయంగాను, ఆయన లాయరు కూడా సుప్రీం మధ్యంతర ఆదేశాలు వచ్చిన మరుక్షణం నుంచీ నిమ్మగడ్డే  ఎస్.ఈ.సి. అని పలుమార్లు పలు టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో స్పష్టం చేశారు. అదే నిజమని అనుకున్నప్పుడు అలా రాజ్యాంగ బద్ధమైన హోదాలో ఉన్న వ్యక్తి వేరేవారిని అదీ రాజకీయ నాయకులను అలా  హోటలుకు వెళ్లి  కలవడం నైతికంగా పొరబాటే అవుతుంది.

ఈ నెల పదమూడో తేదీ నాటికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏపీ ప్రభుత్వంలో ఎస్.ఈ.సి. అవునా కాదా (రాజ్యాంగబద్ధమైన పదవిలో వున్నారా లేదా) అన్నదానిబట్టి ఈ కలయికలోని మంచిచెడ్డలను విశ్లేషించుకోవాల్సివుంటుంది. వైసీపీ తరపున వాదించేవాళ్ళు, నిమ్మగడ్డ తరపున వాదించేవాళ్ళు ఈ విషయాన్ని ముందు నిర్దారించుకోవాల్సివుంటుంది’.

అంటే ఏమిటన్నమాట! నిమ్మగడ్డ ఆ పదవిలో కొనసాగుతున్నారని వైసీపీ వారయినా ఒప్పుకోవాలి. లేదా ఆయన ఆ పదవిలో లేరని నిమ్మగడ్డ మద్దతుదారులు అయినా అంగీకరించాలి’    (24-06-2020)   


ఇందిరాగాంధీకి తన మరణం గురించి ముందుగా తెలుసా!

హిందూ రెసిడెంట్ ఎడిటర్ గా పనిచేసిన సీనియర్ పాత్రికేయుడు దాసు కేశవరావుగారు రాత్రి  ఫోను చేసారు. ఆయన గుర్తు చేసిన దాకా నాకు జూన్ 23  సంజయ్ గాంధి విమాన ప్రమాదంలో మరణించిన రోజని జ్ఞాపకం రాలేదు. నిజానికి దాన్ని ప్రమాదం అనడం కంటే స్వయంకృతాపరాధం అనడం సరి ఏమో! ఎందుకంటే విమానాలు నడపడంలో సంజయ్ కి ఆసక్తి ఉన్న మాట నిజమే కానీ ప్రావీణ్యం లేదు. ఇందుకు సాక్ష్యం ఆయన భార్య మనేకా గాంధి. ఆ దుర్ఘటన జరగడానికి ఒక్క రోజు ముందు సంజయ్ ఆమెను వెంట తీసుకుని ఆ చిన్ని విమానంలో చక్కర్లు కొట్టారు. సంజయ్ విమానం నడుపుతున్న తీరు గమనించిన మనేకా గాంధి ఆ క్షణంలో భయంతో తల్లడిల్లిపోయారు. ఇంటికి రాగానే ఆమె ఇందిరాగాందీతో ఆ విషయం చెప్పారు. ‘దయచేసి మీ అబ్బాయికి చెప్పండి, విమానాలు నడపొద్దని. ఒకవేళ నడిపినా నన్ను తీసుకువెళ్ళిన ఆ చిన్న విమానాన్ని అసలు నడపొద్దని”.

మరునాడే సంజయ్ అదే విమానం నడిపి, అది కూలిపోవడంతో మరణించారు.

ఈ విషయాన్ని మనేకా గాంధి, సంజయ్ అకాల మరణం తర్వాత   టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు.     

శ్రీమతి ఇందిరాగాంధీ ఆంతరంగికుడు పోతేదార్ రాసిన ఆత్మకధలో మరో విషయం  వెల్లడించారు.
భారత దేశపు తొలి మహిళా ప్రధాని శ్రీమతి గాంధి, 1984, అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో తన అధికార నివాసం ప్రాంగణంలోనే అంగరక్షకుల తుపాకీ కాల్పులకు బలయ్యారు. ఈ దుర్ఘటన జరగడానికి కొద్ది రోజులముందుగానే తన తుది ఘడియలు దగ్గర పడుతున్నాయని ఆవిడకు తెలిసి వచ్చింది. దీనికి కారణం ఆవిడకు ఒక గుళ్ళో కనబడిన ఓ అపశకునం. హత్య జరిగిన అక్టోబర్ మాసంలోనే శ్రీమతి ఇందిరాగాంధీ చాలా మనసుపడి కాశ్మీర్ పర్యటన పెట్టుకున్నారు. కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం అంటే ఆవిడ తెగ ముచ్చట పడేవారు. అంతేకాదు, కాశ్మీర్ లోయలోని ఒక హిందూ దేవాలయాన్ని, అలాగే ముస్లింల ప్రార్ధనా మందిరం అయిన ఒక ప్రముఖ మసీదును సందర్శించాలన్న కోరికతో కూడా ఆమె ఆ పర్యటనకు బయలుదేరివెళ్ళారు. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆవిడకి ఒక అపశకునం కనబడింది. అది చూడగానే తన రోజులు దగ్గర పడ్డాయని ఆమెకు  తోచింది. ఆ సమయంలోనే ప్రియాంకా గాంధి తన రాజకీయ వారసురాలయితే బాగుంటుంది అని కూడా ఆమెకు అనిపించింది. కాకతాళీయం కావచ్చు కానీ, ఇది జరిగిన కొద్ది రోజుల్లోనే ఆవిడ హఠాత్ మరణానికి గురయ్యారు. ప్రియాంక రాజకీయ వారసత్వం గురించి శ్రీమతి గాంధీ మనసులోని ఈ మాటను తదనంతర కాలంలో సోనియా గాంధి చెవిలో వేసినా, ఆవిడ దానికి ఇష్టపడలేదు.” (శ్రీమతి ఇందిరాగాంధీ మరణించే నాటికి ప్రియాంక గాంధి వయస్సు కేవలం పన్నెండేళ్ళే. మరి రాజకీయ వారసత్వం గురించిన ఆలోచన ఎలా వచ్చిందో!)


22, జూన్ 2020, సోమవారం

పీవీ గారి రెండో కోరిక – భండారు శ్రీనివాసరావు

(శ్రీ పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని)

‘ఏమయ్యా! కృష్ణారావ్! నా కేసెట్ల సంగతేమిటి” అని అడిగారు పీవీ నరసింహారావు గారు మాజీ ప్రధాని హోదాలో అని చెప్పుకున్నాం కదా! ఆ కధే ఇది.

పీవీ గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తెలుగులో అనేక రేడియో ప్రసంగాలు చేశారు. వాటిని గురించి చేసిన వాకబు ఇది.

అసలే గతకాలపు ముచ్చట. ఈ ముచ్చట చెప్పుకునే ముందు అంతకు ముందు గతం కొంత చెప్పుకోవాలి. అంటే గతంలోని గతం అన్నమాట, మూగమనసులు సినిమాకి మల్లె.

ఆర్వీవీ కృష్ణారావు గారు. రాయసం వీర  వెంకట  కృష్ణారావు గారు. పేరులో రాయసమే కానీ మనిషిలో ఆ రాజసం కనపడదు.  సాదాసీదా మనిషి. ఇక వీర అనే పేరులోని  మాట పేరులోనే దాగిపోయేలా ఇంటి పేరు ఆర్వీవీ అని రాసుకునేవారు. ఆయనా నేనూ ఆలిండియా రేడియో ప్రాంతీయ వార్తావిభాగంలో బహుకాలం కలిసి పనిచేసాము. మాకు కృష్ణార్జునులు అని పేరు. నేనొకసారి అమెరికా వెళ్ళినప్పుడు అప్పటి ప్రసార భారతి సీఈఓ కంభంపాటి సుబ్రమణ్య శర్మగారు ఆర్వీవీని పట్టుబట్టి హైదరాబాదు దూరదర్శన్ న్యూస్ ఎడిటర్ గా బదిలీ చేశారు. ఆరు మాసాల అనంతరం అమెరికా నుంచి రాగానే నన్నూ అక్కడికే వేశారు. పుట్టిపెరిగిన రేడియో విడిచి రానని నేను  పట్టుబట్టాను. ‘ఈ పోస్టుకోసం ఢిల్లీ వెళ్లి పైరవీలు చేసుకుంటారు. నువ్వేమిటి అయాచితంగా వేసినా పోనంటావ’ని హితులు, స్నేహితులు పోరుపెట్టారు. వున్న ఊళ్లోనే ఉన్న డీడీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ మూడు నెలలు చేతిలో పెట్టుకుని సంక్షేపించిన నేను చివరికి దూరదర్శన్ లో చేరిపోయాను. అయితే ఇంటికి ఆఫీసుకి చాలా దూరం. ఆఫీసు వాహన సౌలభ్యం ఉన్న కారణంగా అదో ఇబ్బంది అనిపించక, అప్పటి  రాష్ట్ర (చంద్రబాబు) ప్రభుత్వం కేటాయించిన ఎర్ర మంజిల్ క్వార్టర్స్ లోనే వుండిపోయాను. ఆఫీసు దూరం అనే మాటలు చెవిన పడ్డాయేమో తెలియదు శర్మ గారు ఆలిండియా రేడియో ఆవరణలోనే ఒక చిన్న ఆఫీసు ఏర్పాటు చేశారు. ఉదయం డీడీ వార్తలు తయారు చేయడం, తర్వాత నుంచి నగరంలో వార్తలు సేకరించడం, ఇందుకోసం రేడియో ఆఫీసులో ఒక కెమెరా యూనిట్, ఈ వైభోగం బాగానే వుందనిపించింది.

ఇక సొంత గోల పక్కనబెట్టి అసలు విషయానికి వస్తాను. ఆర్వీవీకి దూరదర్శన్ ఆవరణలోనే ఒక పెద్ద క్వార్టర్ కేటాయించారు. ఆయనకు ఒక పాత అంబాసిడర్ కారు బెజవాడ రోజుల నుంచి వుండేది. ఆ కారు పెట్టుకోవడానికి   

చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఆ క్వార్టర్ లో ఒక కారు షెడ్డు కూడా వుంది. అందులో ఏదో పాత సామాను వేసి తాళం వేశారు. తీసి చూస్తే ఎన్నో అపూర్వమైన కేసెట్లు. మంచి సంగీత కచ్చేరీల రికార్డులు. అవన్నీ అలా పాత సామాను మాదిరిగా పారేయడం చూసి సంగీతం పట్ల మక్కువ ఉన్న కృష్ణారావు గారు చాలా బాధ పడ్డారు. తీరా విచారిస్తే తేలిందేమిటంటే అవన్నీ పాత కాలపు డెక్కులు. అవి ఈరోజుల్లో పనికిరావు. పైగా ఆ పాత రికార్డులను డిజిటలైజ్ చేసి భద్రపరచినట్టు సమాచారం.

ఈ నేపధ్యంలో పీవీ గారు ‘ఏవయ్యా నా కేసెట్లు’ అని అడిగారు. దూరదర్శన్లో, రేడియోలో గాలించారు. అవి దొరికాయా, పీవీ గారికి అందచేసారా అనే వివరాలు తెలవ్వు. ఎందుకంటే తర్వాత కొన్నాళ్ళకే ముందు నేను, తర్వాత ఆర్వీవీ రిటైర్ అయ్యాము.   


పీవీ గారి రెండు కోర్కెలు – భండారు శ్రీనివాసరావు


(శ్రీ పీవీ నరసింహారావు శత జయంతిని పురస్కరించుకుని)

పీవీ గారు మాజీ ప్రధానమంత్రిగా పాల్గొన్న ఒక సదస్సు హైదరాబాదులోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగింది. వారికి ఔషధ మూలికలపై ఆసక్తి  మెండు. నిజానికి ఆయన పట్టుదల కారణంగానే ఆ అంశానికి సంబంధించి ఆ జాతీయ సదస్సు ఏర్పాటయింది.

మధ్యాన్నం భోజన విరామ సమయంలో విలేకరులు ఒక్కొక్కరుగా కలుస్తున్నారు. ఆలిండియా రేడియో ప్రాంతీయ విభాగంలో పనిచేసే ఆర్వీవీ కృష్ణారావు గారు నేనూ కాస్త వెనగ్గా నిలబడివున్నాం.

చివరికి ఆయనే మమ్మల్ని దగ్గరకు పిలిచారు.

‘ఏమయ్యా కృష్ణారావూ. ఢిల్లీలో పద్మనాభరావుకి కూడా చెప్పాను. ఏవయ్యా నా టేపులు?”

కృష్ణారావు గారు ఏదో  చెప్పారు. (ఈ టేపుల విషయం మరోసారి విడిగా)

ఆయన నా వైపు తిరిగారు.

‘మీ అన్నయ్య (కీర్తిశేషులు పర్వతాలరావు గారు) పుట్టపర్తిలో ఉంటున్నాడట కదా! ఏం చేస్తున్నాడు?”

‘నరసింహావతారం గురించి పుస్తకాలు రాస్తున్నాడు’

‘అలా అయితే నేనడిగానని చెప్పు. మనిషి శారీరకంగా సింహం  కంటే బలహీనుడు. ఆ అవతారంలో సింహం తలా, మనిషి శరీరం ఏమిటో రాయమని చెప్పు’

నమస్కారం పెట్టి మేము వచ్చేశాము.

పీవీ గారి సందేహానికి మా అన్నయ్య ఆ పుస్తకంలో చాలా పెద్ద వివరణే ఇచ్చారు.

ఓపిక ఉన్న వారు చదువుకోవడానికి పూర్తి పాఠం ఇస్తున్నాను.

“హిరణ్యకశిపుడు స్వతహాగా మహాబలుడు. దానికి తోడు తపశ్శక్తితో పొందిన వరాలు. అతడిని చంపేందుకు వెళ్ళే విష్ణువు నర  సింహ మిశ్రమ రూపం ధరించాల్సి వుంటుంది. అలాంటప్పుడు రెంటిలోనూ గల బలమైన అంశాలనే స్వీకరించాల్సి వుంటుంది. నరుని మేధ సింహపు మేధ కన్నా చురుకు. సింహపు శరీరం నరుడి దేహం కన్నా బలమైనది. కనుక నరుని తల, సింహపు శరీరం కలిస్తే రెండు బలమైన అంశాలను స్వీకరించినట్టు అయ్యేది. కాని విష్ణువు ఈ అవతారానికి సింహపు తల, మనిషి శరీరం ఎన్నుకున్నాడు. రెండు బలహీనమైన అంశాల మిశ్రమం అది. మరి విష్ణువు అలా ఎందుకు చేశాడు? కొందరు కరాటే ఉదాహరణ చెప్పారు. కరాటేలో చేయి బలహీనంగా వుండడంకన్నా ఆ చేయిని ప్రయోగించడంలో చూపే వేగం, గురి, ఏకాగ్రత ప్రధానం. కనుక బలహీనమైన శరీరాన్ని ఎన్నుకున్నా ఇబ్బంది లేదని వారి అభిప్రాయం. అలా అనుకున్నా అట్టి ఏకాగ్రత నరుని మేధ సాధించినట్టు సింహపు మెదడు సాధించగలదా! మానసిక పటుత్వాన్ని సాధించడం నరునికే సాధ్యం కాని సింహానికి కాదు. జంతువు కావాలంటే సింహమే ఎందుకు? జిత్తులమారి నక్క తల అయితే ఇంకా ఎక్కువ ప్రయోజనకారిగా వుండేదేమో! మరి స్వామి సింహపు తలనే ఎందుకు ఎన్నుకున్నట్టు!

హిరణ్యకశిపుడు యావత్ ప్రకృతిని తన కనుసన్నలలోకి తెచ్చుకున్నాడు. అసలు హిరణ్యకశిపుడు అంటే అర్ధం ఏమిటి? కళాప్రపూర్ణ వేదుల సూర్యనారాయణ శర్మగారీ విషయాన్ని తమ ‘అంతరార్ద భాగవతం’ లో చెప్పారు. హిరణ్యం అంటే ప్రకృతి (బంగారం కూడా). కశిపుడు అంటే హింసించేవాడు. ప్రకృతిని తన దోవన పోనీయకుండా, తాను  చెప్పిన దోవనే అది నడవాలని కట్టడి చేసినవాడు. ప్రకృతిని అలా నిర్బందించడమే హింస. ఆ రాక్షసుడి కట్టడిలో ప్రకృతి విలవిలలాడిపోయింది.

‘అస్మదీయంబగు నాదేశమున గాని

మిక్కిలి రవి మింట మెరయ వెరచు’

అని ప్రగల్భాలు పలికిన వాడు ఆ రాక్షస రాజు.

అలాగే ఇంద్రుడు, యముడు, అగ్ని, వాయువు అంతా గడగడలాడారు.

పృధు చక్రవర్తి కాలంలో కూడా ప్రకృతి అన్నివిధాల ఆయనకు అనుకూలంగా నడిచింది. దున్నకుండానే పంటలు పండేవి. పృధువు పట్ల భక్తీ గౌరవం వల్లనే కాని చండశాసనుడు అనే భయంతో కాదు. రెంటికీ ఎంత తేడా! నియంతృత్వానికి, ఆదర్శ ప్రజాస్వామ్యానికి ఉన్నంత తేడా.

అలా ప్రకృతిని తన కనుసన్నల్లో పెట్టుకోవడం ఎందుకు? ఇంద్రియ సుఖాలను అనుభవించడానికే. ప్రకృతి అందరికీ అవసరమైన మేరకు ఇస్తుంది. కానీ ఆశ పడ్డంత కాదని గాంధీజీ చెప్పారు.

నరసింహావతారంలో విష్ణువుకి మనిషి తల పనికి రాకపోవడానికి ఈ ఆబే (అత్యాశే) కారణం. మనిషికి ‘ఆశాపాశము తా కడున్ నిడుపులేదంతంబు’. అట్టి ఆశలమారి మేధ ఆబను, కక్కుర్తిని మరింత పెంచుతుంది. తృప్తి చెందదు. సింహం అలా కాదు. అది మృగరాజు. దానికి లేకితనం, పేరాశ లేవు. ఏ పూటకు ఎంత అవసరమో ఆ పూటకు అంతే వేటాడి సంపాదించుకుంటుంది. ఆ పైన దాచుకోవడం ఎరగదు. రేపుమాపు అన్న చింత దానికి లేదు. అన్ని జంతువులూ అలా కాదు. పులీ, చిరుతపులి కూడా వేటాడిన జంతువును దాచుకుని తింటాయి. సింహానికి అది పనికిరాదు. తన కడుపు నిండితే పక్క నుంచి పోయే జంతువులను కూడా అది పట్టించుకోదు. రేపుతో లంకె పెట్టుకొని తత్వం. ఆధ్యాత్మికంగా చూసినప్పుడు అంతకన్నా నిస్సంగత్వం లేదు. ఇలాంటి తత్వం సమాజానికి ఎంతో అవసరం. అట్టి సంస్కృతి వుంటే ప్రస్తుత పర్యావరణం ఇంత దెబ్బతినేది కాదు. అనేక పక్షి, జంతుజాలాలు అంతరించిపోయేవి కావు. మనిషిలో ఆబ  పెరగడం వల్లనే ఈ వినాశనమంతా.

అట్టి ఆబ (GREED) లేని సింహం తలను స్వామి ఎంచుకోవడం హిరణ్యకశిపుని ఆబ (GREED) కు వ్యతిరేకంగా వుండే సమాజాన్ని ఆవిష్కరించడం కోసమే. మనిషి శరీరాన్ని ఎంచుకున్నా దాని బలహీనత వల్ల స్వామికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. స్వామిది సంకల్పబలం. నిజానికి తాను ఎలాంటి చావు చావాలో హిరణ్యకశిపుడే కోరుకున్నట్లయింది. అతడు కోరిన కోర్కెలే, అతడు పెట్టిన నిబంధనలే అతడిని సంహరించే వ్యక్తి ఎలా ఉండాలో, ఏ సమయంలో ఎక్కడ ఎలా అతడిని చంపాలో నిర్దేశించాయి”

(ఓం నమో శ్రీ నారసింహాయ, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దివ్య చరిత్ర, ప్రధమ సంపుటం, రచన: కీర్తిశేషులు భండారు పర్వతాలరావు, సమర్పణ: శ్రీ వేదభారతి, హైదరాబాదు)

(22-06-2020)          


పృచ్చకుడిగా ప్రధానమంత్రి


(శ్రీ పీవీ నరసింహారావు శతజయంతిని పురస్కరించుకుని)

శ్రీ పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదులో నాగఫణి శర్మ గారి మహా శతావధానం జరిగింది. అందులో శ్రీ పీవీ పృచ్చకుడిగా ఒక ప్రశ్న వేయాల్సి వచ్చింది. అప్పుడాయన చెప్పిన మాటలు:

“కొందరు తుపాను బాధితులు, మరికొందరు వర్షాభావ బాధితులు. నేను సమయాభావ బాధితుడిని. ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్ననాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

దానికి నాగఫణి శర్మ గారి సమాధానం :

”సకల భారతమును శాసింపగల రేడు

ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె

ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన

ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”      పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో హైదరాబాదులో నాగఫణి శర్మ గారి మహా శతావధానం జరిగింది. అందులో శ్రీ పీవీ పృచ్చకుడిగా ఒక ప్రశ్న వేయాల్సి వచ్చింది. అప్పుడాయన చెప్పిన మాటలు:

“కొందరు తుపాను బాధితులు, మరికొందరు వర్షాభావ బాధితులు. నేను సమయాభావ బాధితుడిని. ఎటు చూసినా ప్రశ్నలే. నిద్రావస్థలో కూడా ప్రశ్నలే కనపడుతున్ననాకు, ఇన్ని ప్రశ్నల నుంచి ఏ ఒక్క ప్రశ్ననో వేరు చేసి అడగడం అంటే గడ్డివాములో పడిన సూదిని వెతకడమే. అందుకని, కవికి తన భావనను అనుసరించి ఈ క్షణంలో తన మనః స్తితికి తట్టిన విధంగా అన్నింటికన్నా పెద్ద ప్రశ్న ఏది స్పురిస్తుందో దానికి జవాబు చెప్పాలని కోరుతున్నాను”

దానికి నాగఫణి శర్మ గారి సమాధానం :

”సకల భారతమును శాసింపగల రేడు

ప్రశ్న వేయకుండ ప్రశ్న వేసె

ప్రశ్న ఏది నాకు ప్రశ్నా సమూహాన

ప్రశ్న మిగిలె నాకు ప్రశ్నగాను”     


20, జూన్ 2020, శనివారం

మంచివాళ్ళు మనచుట్టూ వున్నారు

 

రాజకీయాల్లో నిజాయితీ, నిబద్దత గురించి రాస్తూ శ్రీయుతులు పిల్లి సుభాష్ చంద్ర బోస్, చిక్కాల రామచంద్ర రావులను గుర్తు చేసుకున్న పోస్టులు చదివిన పాత్రికేయ మిత్రుడు ఫోన్ చేసి మరి ఇద్దరి ప్రస్తావన తీసుకుకువచ్చాడు. ఒకరు బత్తిన సుబ్బారావు గారు, మరొకరు చప్పిడి వెంగయ్య గారు. సుబ్బారావు గారు గోదావరి జిల్లానుంచి శాసన సభకు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఒకానొక కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. అతి పేద దళిత కుటుంబం నుంచి మంత్రి స్థాయికి ఎదిగినా ఆయన ఆర్ధిక పరిస్తితిలో ఏమార్పూ లేదు. ఆయన తల్లిగారు కూలీపని చేసుకుని జీవనం గడిపేవారు. రాజ్యసభ ఎన్నికల్లో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా డబ్బు తీసుకుంటారని ప్రచారం సాగే రోజుల్లో, అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో వుండి కూడా వీల్ చైర్ మీద వెళ్లి పైసా తీసుకోకుండా ఓటు వేసి వచ్చారు. చివరకు ఎంతటి గర్భదారిద్య్రంలో కూరుకు పోయారంటే చనిపోయినప్పుడు దహనం చేయడానికి డబ్బులు లేని దౌర్భాగ్య స్తితి.
ఈ విషయాన్ని అప్పటి బీజేపీ శాసనసభ్యులు శ్రీ వేమా, మరికొందరు గోదావరి జిల్లాల సభ్యులు అసెంబ్లీలో ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించి ప్రభుత్వం తరపున కొంత ఆర్ధిక సాయం ప్రకటించిన విషయాన్ని దివాకర్ గుర్తు చేసుకున్నాడు.
అలాగే, ప్రకాశం జిల్లాకు చెందిన చప్పిడి వెంగయ్య గారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలా సింపుల్ గా వుండేవారు. ‘ఎన్నిసార్లు మొత్తుకున్నా ఫలితం వుండడం లేదు, కనీసం ఈసారయినా నా పేరు సరిగా రాయండయ్యా’ అని అసెంబ్లీ కవరేజ్ కి వెళ్ళే పాత్రికేయులతో అనేవారు సరదాగా. ఆయన పేరు చప్పిడి వెంగయ్య. అది పొరబాటు అనుకుని విలేకరులు చప్పిడి వెంకయ్య అని రాసేవారు.
వెంగయ్య గారి ఎన్నికల ప్రచారాన్ని కవర్ చేయడానికి హైదరాబాదు నుంచి డెక్కన్ క్రానికల్ తరపున సుశీల్ కుమార్ (ప్రస్తుతం హైదరాబాదు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నతోద్యోగంలో వున్నారు) ప్రకాశం జిల్లాకు వెళ్ళారు. వెంగయ్య గారి ఇల్లు చూసి ఆశ్చర్యపోయారు. రెండే గదులు. టీవీ కాదుకదా, కనీసం రేడియో కూడా లేదు. కాలినడకనే ప్రచారం. అయినా గెలిచారు. కాదు ప్రజలు గెలిపించారు. సుశీల్ ఆ రోజుల్లో వెంగయ్య గారి గురించి క్రానికల్ లో రాసిన రైటప్ చాలా సంచలనాన్ని సృష్టించింది.
‘మరోసారి ఎన్నికల్లో పార్టీ ఫండ్ స్వయంగా అందచేయడానికి ఒక మంత్రిగారు వెళ్ళారు. కానీ ఆయన పైసా కూడా తీసుకోలేదు. చిత్రం! ఆ ఎన్నికల్లో ఓడిపోయారు’ దివాకర్ అన్నాడు. (20-06-2020)

రాజకీయాల్లో కృతజ్ఞత – భండారు శ్రీనివాసరావు

ఈరోజు రాజ్యసభకు ఎన్నికయిన శ్రీ పిల్లి సుభాష్ చంద్ర బోస్  చాలా సౌమ్యులు. రేడియో విలేకరిగా నాకు కొంత పరిచయం వుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన రోజుల్లో కూడా ఆయన నిరాడంబరంగా వుండడం నాకు తెలుసు. వై.ఎస్.ఆర్.కు, ఆయన కుటుంబానికి బాగా కావాల్సిన వారు. గతంలో జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరిపోయారు. 

రాజ్యసభకు ఎన్నిక అయిన అనంతరం సుభాష్ చంద్ర బోస్ మాట్లాడిన విషయాలు విన్నప్పుడు తనని రాజకీయాల్లో ప్రోత్సహించిన వారిని ఆయన ఎలా గుర్తుంచుకున్నదీ తెలిసి ఆశ్చర్యం వేసింది. ఇలాంటి సందర్భాలలో ఎవరయినా సరే, ముందు తమ పార్టీ నాయకుడిని పొగడ్తలతో ముంచెత్తిన తర్వాతనే ఇతరులను తలుచుకుంటారు.

ఆయన ఈరోజు ముందుగా తలచుకున్న రాయవరం మునసబు ఎవరన్నది ఈ తరం వారికి తెలియదు. ఆయనే  తనకు రాజకీయాల్లో ఓనమాలు నేర్పించారన్నారు. ఒకానొక కాలంలో రాయవరం మునసబు అంటే జిల్లామొత్తానికి తెలిసిన పేరు. ఆయన జిల్లా దాటి రాజకీయాలు చేసింది లేదు. కానీ రాష్ట్ర రాజధానివరకు ఆయన ఎవరో తెలుసు.

తర్వాత తలచుకున్న పేరు వై.ఎస్. ఆయన తనను  రాజకీయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ని చేశారని సుభాష్ చంద్ర బోస్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆ పిదప వై.ఎస్. జగన్ వల్లనే తనకు ఇన్ని రాజకీయ పదవులు వచ్చాయని చెప్పుకొచ్చారు.

పదవిని అనుభవించిన రోజుల్లో నాయకుడే తమ అధినాయకుడని ప్రస్తుతించి పదవి పోగానే అతడెవరో తెలియనట్టుగా ప్రవర్తించే రాజకీయ నాయకులు కోకొల్లలుగా ఉన్న నేటి రాజకీయాలు మాత్రమే తెలిసిన ఈనాటి తరానికి ఈ రకం నాయకులు నిజంగా కొత్తే.

ఈ విధేయతలు అనేవి పార్టీ వ్యవహారాలు. అవి పక్కన పెడదాం. మరి ఆయన నిరాడంబరత్వం. దాన్ని గురించి  తప్పనిసరిగా చెప్పుకోవాలి.

గతంలో పిల్లి సుభాష్ చంద్ర బోస్ మంత్రిగా వున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు మా  వదినె గారితో కలిసి వైజాగ్ నుంచి హైదరాబాదు రైల్లో వస్తున్నారు. ఇద్దరికీ ఏసీ సెకండ్ క్లాసులో అప్పర్ బెర్తులు దొరికాయి. కింద బెర్తులు ఖాళీగా వుంటే టీసీని అడిగారు. రాజమండ్రిలో ఒక మంత్రి గారి కోసం రిజర్వ్ అయ్యాయి, లాభం లేదు అన్నాడాయన. మంత్రి గారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వుంటుంది కదా, ఈ సెకండ్ ఏసీ ఎందుకు అనేది మా అన్నయ్య అనుమానం.

రాజమండ్రి వచ్చేసరికి తొమ్మిది దాటింది. మంత్రిగారు భార్యతో కలిసి బోగీలోకి వచ్చారు. సామాన్లు సర్దుకున్న తరువాత ఆయన మా అన్నయ్యని అడిగారట. మీ మిసెస్ పైకి ఎక్కి పడుకోవడం కష్టం, ఆవిడ, మా ఆవిడ కింద బెర్తుల్లో పడుకుంటారు, మనం పైన సర్డుకుందాం అన్నారట ఆ మంత్రిగారు. ఇది విని మా అన్నయ్య ఎంతో ఆశ్చర్యపోయారు.

ఆయన ఎవరో కాదు, ఈరోజు రాజ్యసభ సభ్యులు అయిన పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారు.

“మంత్రిగారికి ఫస్ట్ ఏసీ ఎలిజిబిలిటీ వున్న మాట నిజమే. కానీ మా మేడం గారు ఆయనతో ప్రయాణం చేస్తే మాత్రం సెకండ్ ఏసీ బుక్ చేయమంటారు”

మర్నాడు ఉదయం సికిందరాబాదులో  రైలు దిగిన తర్వాత మంత్రిగారి పియ్యే మా అన్నగారి అనుమానం తీర్చారు.

(19-06-2020)           


18, జూన్ 2020, గురువారం

హైదరాబాదులో కాళేశ్వరం గోదావరి జల?

 


 కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పారుతున్న గోదావరి జలాలతో భూగర్భ జలాల మట్టం బాగా పెరిగిందని తెలంగాణా మంత్రి శ్రీ కే.టీ.ఆర్. అన్నట్టు ఆ మధ్య పత్రికల్లో చదివాను. అది నిజమే అనిపిస్తోంది.

హైదరాబాదు ఎల్లారెడ్డి గూడాలో మేముంటున్న మధుబన్ అపార్ట్ మెంట్ బోరు బావి ఎండిపోయి ఏళ్ళు గడుస్తున్నాయి. వున్నవి పన్నెండు కుటుంబాలు మాత్రమే కావడంతో దాని రిపేరు ఖర్చులు భరించలేక అలాగే వదిలేసి మునిసిపల్ వాటర్ తోనూ, రెండ్రోజులకోసారి కొనే మునిసిపల్ వాటర్  టాంక్ లతోను నెట్టుకుంటూ వస్తున్నాము.

ఈసారి వర్షాలు ముందుగానే వచ్చినా కన్నూ మిన్నూ ఏకమయ్యే భారీ వర్షాలు ఏవీ పడలేదు. అయితే ఆశ్చర్యకరంగా అపార్ట్ మెంట్ కమిటీ వాళ్ళు ఒక చల్లని కబురు చెవిన వేసారు. ఎవరి ప్రమేయం లేకుండా బోరు బాగుపడిందనీ, ఇకనుంచీ ఇరవై నాలుగు గంటలు నీళ్ళ సప్లయి ఉంటుందని, వాటర్ ట్యాంకుల అవసరం కూడా ఉండదనీ తెలియచేశారు.

కేటీఆర్ చెప్పినట్టు భూగర్భ జలాల మట్టం కానీ పెరగలేదు కదా! (17-06-2020)


17, జూన్ 2020, బుధవారం

కొన్ని సరికొత్త పాత సంగతులు

  

అదేమిటో చాలా మందికి, నాతో సహా, ఈ మధ్య జరిగిన విషయాలు గుర్తుండడం లేదు. కొందరు చెబుతుంటే కానీ జ్ఞాపకం రావడం లేదు.

ఇప్పుడు అలా విన్న సంగతులు చెప్పుకోవడానికే ఈ ప్రయత్నం. ఇవన్నీ ఏ క్రీస్తు పూర్వం నాటి విషయాలో  కాదు. మహా అయితే ఏడాది, రెండేళ్ళ లోపు సంగతులే.

2019 ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ప్రధాన ప్రత్యర్దులమని చెప్పుకునే పార్టీలు ఎన్ని వున్నా నిజానికి పోటీ రెండింటి మధ్యనే. అంటే టీడీపీ, వైసీపీ నడుమనే అసలయిన పోటీ అనేది చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేవాళ్ళు.

ఈ రెండు పార్టీలు ఓటర్ల అభిమానం చూరగొనడానికి రకరకాల పధకాలు ప్రకటిస్తూనే మరో పక్క చాణక్య నీతిని కూడా ప్రదర్శించాయి. ఆ క్రమంలోనే మొదలయ్యాయి పార్టీ మార్పిళ్ల కార్యక్రమం. కాకపోతే ఈ విషయంలో జగన్ మోహన రెడ్డికి ప్రశాంత్ కిషోర్ రూపంలో చక్కని సలహాలు, సూచనలు దక్కాయి. అపర చాణక్యుడిగా తెలుగు రాజకీయాల్లో పేరు పొందిన చంద్రబాబు కొంచెం వెనక పడ్డట్టే లెక్క. (2014లో ఆయన ఈ విషయంలో ముందంజలో వున్నారు).  2019 నాటి ఎన్నికల సమయానికి  ఆయన ఊహించని రీతిలో టీడీపీ నుంచి వైసీపీకి ఎన్నికల ముందే వలసలు సాగాయి. వీటిల్లో చెప్పుకోతగ్గవి  కొన్ని వున్నాయి.

ఆదాల ప్రభాకరరెడ్డి గారు. వీరికి టీడీపీ టిక్కెట్టు కన్ఫర్మ్ అయింది. బీ ఫారం కూడా ఇచ్చినట్టు వున్నారు. ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. సరిగ్గా పదిహేను రోజులముందు ఆయన టీడీపీ అధిష్టానానికి ఫోనులో కూడా దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళడం వెళ్ళడం నేరుగా వైసీపీ గూటికే కావడం, ఆయనకు ఆ పార్టీ సీటు ఇవ్వడం అన్నీ మెరుపు వేగంతో జరిగిపోయాయి. టీడీపీ అధిష్టానం అప్పటికప్పుడు ప్రభాకరరెడ్డి స్థానంలో మరొక అభ్యర్ధిని వెతుక్కోవాల్సి వచ్చింది. బీద మస్తాన్ రావుగారిని  ఎంపిక చేసారు. ఆయన గట్టి అభ్యర్దే. కానీ ఫలితం దక్కలేదు. ఆ సీటును టీడీపీ కోల్పోయింది. సీటునేకాదు, చివరి క్షణంలో ఎంపిక చేసి నిలబెట్టిన అభ్యర్ధిని కూడా. ఎన్నికలు కాగానే బీద మస్తాన్ రావుగారు  టీడీపీకి గుడ్ బై చెప్పి తనను ఓడించిన వైసీపీలోకి  చేరిపోయారు.

ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఈయన కూడా టీడీపీని చివరి రోజుల్లో ఒదిలిపెట్టారు. కాకపోతే కాస్త మర్యాదగా. భార్య, పిల్లలతో సహా వెళ్లి అధినాయకుడిని కలిసి టీడీపీ తరపున పోటీ చేయలేను అని ఒక నమస్కారం పెట్టి వచ్చారు. తరువాత కొద్ది రోజులకే లోటస్ పాండులో జగన్ మోహన రెడ్డిని కలిసి ఆ పార్టీ సభ్యత్వాన్ని, పార్టీ టిక్కెట్టును కూడా సంపాదించుకున్నారు. వైసీపీ తరపున నిలబడి  గెలిచారు.

పొతే, రఘురామ కృష్ణంరాజుగారు. వై ఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తవర్గంలోని మనిషి. వై ఎస్ ఆర్ కు అత్యంత ఆత్మీయుడైన కేవీపీ కి స్వయానా  వియ్యంకులు. ఆ బాంధవ్యం పిల్లల ప్రేమ వివాహం  వల్ల ఏర్పడింది కాదు. ఉభయపక్షాల పెద్దలు కలిసి కుదుర్చుకున్న సంబంధం. పైగా పెద్ద కాంట్రాక్టరు. అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం పెద్ద విషయమూ కాదు, పెద్ద కష్టమూ కాదు. వీటికి తోడు ఎమ్మెల్యే కావాలని రాజుగారికి ప్రబలమైన ఆకాంక్ష వుందని కూడా చెప్పుకునేవారు. ఇన్ని హంగులు ఉన్నప్పటికీ ఎన్నికల బరిలో నిలబడే అవకాశం 2019 దాకా రాకపోవడం విచిత్రం.

వై.ఎస్. మరణించేవరకు కాంగ్రెస్ ను అంటిపెట్టుకుని వుండి, తర్వాత జగన్ వైసీపీతో కలిసివున్నారు. ఆయన జైలుకు పోయిన తర్వాత వైసీపీని వదిలి బీజేపీతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఆ పార్టీకి  కూడా ఎంపీ టిక్కెట్టు ఆయనకు ఇవ్వాలనే ఆలోచన ఉండడంతో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ కృష్ణంరాజు గారు ఆ నియోజకవర్గంపై పట్టు పెంచుకునే ప్రయత్నం చేసారు. అయితే చివరి క్షణంలో  బీజేపీ అగ్రనాయకత్వం ఆ సీటును గోకరాజు గంగరాజు గారికి కేటాయించడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇండిపెండెంటుగా నామినేషన్ కూడా వేసి ఉపసంహరించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ విజయం  దరిమిలా ఆయన ఆ పార్టీకి దగ్గరయ్యారు. చంద్రబాబునాయుడు ఆయన్ని తమ పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టాలని బలంగా కోరుకున్నారు. ఆమేరకు రాజుగారికి మాట ఇవ్వడం ఆయన తన నియోజకవర్గంలో పనులు చేసుకోవడం మొదలయింది కూడా. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ రాజుగారికి టిక్కెట్టు ఖాయం చేసింది. ఏం జరిగిందో తెలియదు కానీ, చివర్లో ఆయన టీడీపీని వదిలిపెట్టి వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ టిక్కట్టు మీద లోకసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. (ఇందులో ప్రశాంత్ కిషోర్ పాత్ర వుందని ఇప్పుడు స్వయంగా ఆయనే చెబుతున్నారు). ఏదైతేనేం మొత్తం మీద చట్టసభ సభ్యుడు కావాలనే రాజుగారి కోరిక నెరవేరింది.

పొతే, గత వారం పది రోజులుగా బుల్లితెరలపై సాగుతున్న మరో అంకం గురించి చెప్పాల్సిన పనిలేదనుకుంటా.

(17-06-2020)           


రాజాకీయాల్లో కావాల్సింది విధేయతా అవకాశం వెతుక్కోవడమా


“రాజకీయాల్లో విధేయత చూపాలా, అవకాశం చూసుకోవాలా?” అంటే తలపండిన ఓ రాజకీయ నాయకుడు చెప్పిన మాట ఇది:
“ఈ రెండూ అవసరమే. కానీ ఎన్నాళ్ళు విధేయత చూపాలి, ఎప్పుడు అవకాశం వెతుక్కోవాలి అనే సంగతి క్షుణ్ణంగా తెలిసిన వాడే రాజకీయాల్లో రాణిస్తాడు. లేకుంటే ఇదిగో ఇలా నాలాగా అడిగిన వాళ్లకి, అడగని వాళ్లకి సలహాలు ఇచ్చే పాత్రకు పరిమితమవుతాడు”  
పార్టీలతో, వాటి గుర్తులతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేసి నెగ్గిన వావిలాల గోపాల కృష్ణయ్య వంటివారు అరుదు. కానీ అటువంటి నిస్వార్ధ నాయకులుకూడా తరువాత కాలంలో ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం సాధించలేకపోయారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన అతిరధ మహారధులు ఓటమిపాలయ్యారు. 
ఒక్కోసారి పార్టీ గుర్తు చాలా మేలుచేస్తుంది అభ్యర్దులకి. 1978 ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు ఎన్నికలకు ముందు కేటాయించారు. అభ్యర్ధి ఎవరు అనేదానితో నిమిత్తం లేకుండా ఓటర్లు చేతి గుర్తుకు ఓటు వేశారు. టీడీపీ సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ కారు గుర్తు అలాంటివే. తమ గెలుపు మీద అపారమైన  నమ్మకం ఉన్న వారు కూడా ఎదో ఒక పార్టీ పంచన చేరడం అందుకే.
తమిళనాట నెడు౦జెలియన్ (తెలుగు పత్రికల్లో పనిచేసేవారికి ఈయన పేరు రాయడం చాలా ఇబ్బందిగా వుండేది. ఇప్పుడు నేను రాసింది కూడా కరక్టు కాదు అని తెలుసు కానీ ఏం చెయ్యలేం) అనే ద్రావిడ నాయకుడు వుండేవారు. ఈయన వరసగా పదమూడు సంవత్సరాలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పని చేశారు. ప్రధానమైన శాఖలు వీరి అధీనంలోనే  ఉండేవి. పార్టీలో ఈయన మాట సుగ్రీవాజ్ఞ. అన్నాదొరై కాలంనుంచి మంత్రిగా పనిచేసిన సీనియర్. ముఖ్యమంత్రి కరుణానిధితో ఏర్పడ్డ విబేధాల కారణంగా ఆయన డీఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండిపెండెంటుగా పోటీ చేసారు. ఫలితం చెప్పక్కరలేదు. డిపాజిట్ కూడా దక్కలేదు.
రాజకీయాల్లో గెలుపోటములు కూడా చిత్రంగా వుంటాయి.
తమిళనాడు అసెంబ్లీకి ఒకసారి జరిగిన ఎన్నికల్లో జయలలిత అసాధారణ విజయం సాధించారు. ప్రత్యర్ధి పార్టీ డీఎంకే నుంచి ఒకే ఒక్కడు కరుణానిధి ఒక్కరే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతకంటే దారుణమైన పరాజయం మరోటి ఉండదని అంతా అనుకున్నారు. అదే కరుణానిధి మరో ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తిరిగి ముఖ్యమంత్రి కాగలిగారు.
(17-06-2020)        

13, జూన్ 2020, శనివారం

పోలీసులకు ‘నో ఎంట్రీ’ – భండారు శ్రీనివాసరావు


సాధారణంగా ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారం పోలీసుల చేతుల్లో వుంటుంది. వాళ్ళు బేరికేడ్లు కట్టి ప్రజల్ని వాటిని దాటి రావద్దని ‘నో ఎంట్రీ’ బోర్డులు పెడుతుంటారు. ఇప్పుడు అది తిరగబడింది. తమ ప్రాంతంలోకి పోలీసులకు ప్రవేశం లేదంటూ తమది పోలీస్ ఫ్రీ జోన్ అని పౌరులే ప్రకటించుకున్నారు.
ఈ చిత్రాతిచిత్రం అమెరికాలోని సియాటిల్ నగరంలో క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో చోటుచేసుకుంది.
ప్రతిరోజూ రాత్రి సియాటిల్ నుంచి మా పెద్ద కోడలు భావన క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి ఫోన్ చేస్తూ వుంటుంది, ఎలా వున్నారు బాగున్నారా అంటూ. ‘మీ దగ్గర కరోనా పరిస్తితి ఏమిటనేది మామూలుగా నా ఆరా.
‘కరోనాని బ్లాక్ ఎపిసోడ్ ఏనాడో కప్పివేసింది. ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది ఈ సంగతే’ అన్నది కోడలు.
అమెరికాని ఆ దేశపు ఆర్ధిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తున్న కరోనా మొదట తన కుడి కాలు పెట్టింది సియాటిల్ లోనే. సియాటిల్ నగరం ఉన్న వాషింగ్టన్ రాష్ట్రం డెమొక్రాట్ల ఏలుబడిలో వుంది. అంటే ఆ రాష్ట్రపు గవర్నర్ డెమోక్రాటిక్ పార్టీ. నగర మేయర్ డెమొక్రాట్. దాంతో కరోనాను మించిన రాజకీయాలు నడుస్తున్నాయి. రిపబ్లికన్ అయిన ప్రెసిడెంట్ ట్రంప్ కీ వీళ్ళకీ చుక్కెదురు. ఒక నల్ల జాతీయుడు పోలీసుల చేతుల్లో మరణించిన దరిమిలా అమెరికా అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. ఆ సంఘటనకు సంఘీభావం తెలిపేవారి సంఖ్య ఆ దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. “A day of action in solidarity” అనే పేరుతొ నిన్న సియాటిల్ నగరంలో బంద్ పాటించారు. శాంతియుత ప్రదర్శనలు నిర్వహించారు. కరోనా ప్రభావం నుంచి బయటపడి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్న దుకాణాలు ఈ బంద్ తో పూర్తిగా మూతపడ్డాయట. అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు.
ఈ సంఘీభావ నిరసన కార్యక్రమంలో భాగంగానే కావచ్చు క్యాపిటల్ హిల్ అటానమస్ జోన్ లో పోలీసులకు ‘నో ఎంట్రీ’.
ఒక నల్ల జాతీయుడి హత్యకు దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో శ్వేత జాతీయులు ఎక్కువగా పాల్గొంటూ వుండడం అమెరికా ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతున్న మాట నిజమే అయినప్పటికీ, రాజకీయాల రంగూ రుచీ వాసనా ప్రపంచ వ్యాప్తంగా ఒకటే అనిపిస్తుంది ఈ ‘నో ఎంట్రీ’ వ్యవహారాలు గమనిస్తుంటే.

11, జూన్ 2020, గురువారం

కరోనా లేకపోతే కోటి వదిలేది (సరదా గల్పిక)

“ఈరోజు మా మనురాలి పెళ్లి. ఇంట్లో కూర్చుని చూస్తున్నాము”

ఆయనెప్పుడూ అంతే! చాలా సరదా మనిషి. దేన్నీ సమస్యగా తీసుకుని బాధపడరు, బాధ పెట్టరు. అది ఆయన నైజం. పైగా ప్రతిదాన్నీ చాలా తేలిగ్గా తీసుకుంటారు. అందుకే వయసు మీద పడ్డా కూడా ఆరోగ్యంగా, చలాకీగా ఉండగలుగుతున్నారు.

“కరోనాకు ముందు ఇదిగో ఇదే మనవరాలి ఎంగేజ్ మెంట్ ధూమ్ ధాంగా గోవాలో చేశారు. నేనూ మా ఆవిడా ఇంకా అనేకమంది బంధుమిత్రులం గోవా వెళ్లాం. చాలా సరదాగా గడిపాము. మా అల్లుడి చేయి పెద్దది. చాలా గ్రాండుగా చేసాడు. పెళ్లి ఇంకా ఘనంగా చేయాలని ప్లాన్ చేశారు.

“ఈలోగా ఇదిగో ఈ కరోనా పిలవని పేరంటంలా దిగబడింది. పెళ్ళికి యాభయ్ మంది కన్నా ఎక్కువమందిని పిలవకూడదు. అంచేత మగపెళ్ళివారికి ప్రిఫరెన్స్ ఇచ్చి మేము సర్దుకున్నాము. స్టార్ హోటల్లో పెళ్లి. అందరికీ లింకులు పంపారు. అవి పెట్టుకుని ఇంటి నుంచే వివాహ వేడుకలు చూస్తున్నాం.”

“ఇంకో మాట. ఈ కరోనా లేకపోతే ఈ పెళ్ళికి ఒక కోటి వదిలేది మా అల్లుడుకి” అన్నాడాయన నవ్వుతూ.

(June, 2020)