30, అక్టోబర్ 2022, ఆదివారం

కహా గయే ఓ దిన్

(Published in ANDHRA PRABHA, on  30-10-2022, SUNDAY, Today)

మా తాతగారి కాలంనాటికి మా వూళ్లో కరెంటు లేదు. ఆముదపు దీపాలు మినహా,  కరెంట్‌ బల్బ్ ని కూడా చూడకుండానే ఆయన కాలం చేశారు.

మా నాన్నగారి కాలం వచ్చేసరికి కరెంట్‌ రాలేదు కానీ,  రేడియోలు, గ్రామఫోన్లూ ఉండేవి. కాకపోతే ఆ రేడియోలు, మోటారుకార్లలో వాడే పెద్దసైజు బ్యాటరీల సాయంతో పనిచేసేవి.

మావూరి మొత్తం జనాభాలో, యాభయి మైళ్ల దూరంలో వున్న బెజవాడకి వెళ్లి, సినిమా చూసొచ్చిన పెద్దమనిషి ఆయన ఒక్కరే. ఆ మాటకి వస్తే ఆయన తప్ప, రైలుని చూసిన వాళ్ళు కానీ, బస్సు ఎక్కిన వాళ్ళు కానీ మా వూళ్లో ఎవరూ లేరని కూడా చెప్పుకునే వారు.

ఇక మా అమ్మ,

పొగచూరిన వంటింట్లో, కట్టెల పొయ్యి ముందు కూర్చుని, ఒంటిచేత్తో  పదిమందికి వండి వార్చేది. ఆమె సామ్రాజ్యంలో రకరకాల పొయ్యిలు ఉండేవి. పాలు కాగబెట్టడానికి దాలిగుంట,  కాఫీ కాచుకోవడానికి బొగ్గులకుంపటి, వంట చేయడానికి మూడు రాళ్ల పొయ్యి, ఇలా దేనికి దానికి విడివిడిగా ఉండేవి. ఇక పెరట్లో బావి ప్రక్కన స్నానాలకోసం కాగులో నీళ్ళు మరగపెట్టడానికి మరో పెద్ద పొయ్యి సరేసరి. దాలిగుంట విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వంటింటి వసారాలోనే ఓ మూలగా ఉండేది. నిప్పంటించిన పిడకలను ఆ దాలిగుంటలో దొంతరగా వేసి, పాలకుండని వాటిపై ఉంచి,  పైన ఒక రాతిపలకని దాలిగుంటకు మూతలా కప్పేవారు. సన్నటి సెగపై ఆ పాలు తీరిగ్గా కాగేవి. ఎరగ్రా కాగిన ఆ పాలపై  అరచేతి మందాన మీగడ కట్టేది.  మర్నాడు  ఆ కుండలోని పెరుగుని నిలబడి వయ్యారంగా కవ్వంతో చిలికేవారు. మజ్జిగ నీటిపై తెట్టెలా కట్టిన తెల్లటి వెన్నని చేతుల్లోకి తీసుకుని, అరచేతిలో ఎగురవేస్తూ ముద్దగా చేసేవారు. పక్కన నిలబడి ఆశగా చూసే చిన్న పిల్లలకి చిన్న చిన్న వెన్న ముద్దలు పెట్టేవాళ్ళు. ఆహా ఏమి రుచి! అని లొట్టలు వేస్తూ తినేసి ఆటల్లోకి జారుకునే వారు. మగవాళ్ల సంగతేమో కానీ, ఆడవాళ్లకి ఆ రోజుల్లో చేతినిండా పనే. భోజనాలు కాగానే,  అంట్లగిన్నెలు సర్దేసి,  వంటిల్లు ఆవు పేడతో అలికేవారు. బాదం ఆకులతో విస్తళ్ళు కుట్టేవారు. రోకళ్లతో వడ్లు దంచేవారు. ఇంటికి దక్షిణాన ఉన్న రోటిపై కూర్చుని పప్పు రుబ్బేవారు. ఈ పనులు చేయడానికి విడిగా పనిమనుషులు ఉన్నా వారితో కలిసి ఈ పనులన్నీ చేసేవారు. శ్రమతెలియకుండా పాటలు పాడుతుండేవాళ్ళు. విలువ కట్టని వారి శ్రమా, విలువ కోరని వారి నిబద్ధతా చిన్న నాటి జ్ఞాపకాల దొంతర్లలో పదిలంగా ఉండిపోయాయి.

ఇక మా రోజులు వచ్చే సరికి,  రోజులు పూర్తిగా మారిపోయాయి. కట్టెల పొయ్యిలు పోయి  గ్యాస్‌ స్టవ్‌లు వచ్చాయి. నీళ్ల కాగుల్ని బాయిలర్లు భర్తీ చేశాయి. కరెంట్‌ దీపాలు వచ్చి లాంతర్లని వెనక్కి నెట్టేశాయి. కరక్కాయ సిరాలు,  పుల్ల కలాలు తరువాతి రోజుల్లో రూపాలు మార్చుకుని ఫౌంటెన్‌ పెన్నులుగా, బాల్‌పాయింట్‌ పెన్నులుగా అవతరించాయి. రూపాయికి పదహారణాలు అనే లెక్క కాస్తా మా చిన్నతనంలోనే నూరు నయాపైసలుగా మారిపోయింది. బేడలూ, అర్ధణాలూ, కానులూ, చిల్లికానులూ జేబుల్లోంచి జారిపోయి నిగనిగలాడే రాగి నయా పైసలు, నికెల్‌ నాణేలు చెలామణిలోకి వచ్చాయి. రామాయణ కాలంనుంచీ ఎరిగిన ఆమడలు, కోసులు, మైళ్ళు కాలగర్భంలో కలిసిపోయి, కిలోమీటర్‌ రాళ్ళు రోడ్లపై వెలిసాయి. ఏడాదికోమారు జరిగే తిరుణాళ్లు నిత్యకృత్యంగా మారి, అశ్లీల నృత్యాల వేదికలుగా మారిపోయాయి. కోలాటాలు, పందిరి నాటకాలు, హరికథలు, బురక్రథలు, పిట్టలదొర కథలు చరిత్రపుటల్లో చేరి కనుమరుగవుతున్నాయి.

ఆ రోజుల్లో సెలవులు ఇస్తే చాలు,  పిల్లలంతా పల్లెటూళ్లకి పరిగెత్తే వాళ్ళు. ఇన్ని రకాల ఆటలుంటాయా అనేట్టు అనేక రకాల ఆటలతో, పాటలతో కాలం గిర్రున తిరిగిపోయేది. అష్టాచెమ్మాలు, తొక్కుడు బిళ్లలు, వామన గుంటలు, వెన్నెలముద్దలు, వైకుంఠపాళీలు, పచ్చీసాటలు, చింతపిక్కలు, బావుల్లో ఈతలు, వాగు ఒడ్డున కబడ్డీ పోటీలు, ఒకటేమిటి, ఒక జీవితానికి సరిపడా ఆనందాన్ని గుండెల్లో నింపేసుకుని, ఇంకా ఇంకా ఇలాగే రోజుల్ని సరదాగా గడపాలన్న కోరికని మనసులోనే చంపేసుకుని, పాడు సెలవులు అప్పుడే అయిపోయాయా అని నిట్టూరుస్తూ బడిబాట పట్టేవాళ్ళు.

ఇక మా పిల్లల కాలం వచ్చేసరికి,  మాయాబజారు సినిమాలో మాదిరిగా, కళ్లముందు ప్రపంచం ఒక్క మారుగా మారిపోయింది. గతం తలచుకోవడానికే మిగిలింది. చిన్నతనంలో చూసినవేవీ, ఈనాడు కలికానికి కూడా కానరావడం లేదు. జీవితం, ఇంత చిన్నదా అనిపించేలా, విన్న పదాలు, చూసిన దృశ్యాలు, ఆడిన ఆటలు, పాడిన పాటలు కనురెప్పలకిందే కరిగిపోతున్నాయి. జ్ఞాపకాల పొరల్లోకి జారిపోతున్నాయి.

ఆ గురుతుల దారుల్లో వెనక్కి వెడుతుంటే,  జొన్న చేల నడుమ కాలిబాటలో పరుచుకున్న దోసతీగెలూ, లేత జొన్న కంకుల్ని వొడుపుగా కొట్టి తీసి వేయించిన ఊచ బియ్యం,

రోజూ తినే వరి అన్నానికి  ఎప్పుడో ఒకప్పుడు సెలవిచ్చేసి,  పని వాళ్ళు వండిన జొన్నన్నంతో కూడిన మృష్టాన్న భోజనం, వరికళ్లాల సమయంలో  కొత్త వడ్లు కొలిచి, కొనుక్కుతినే కట్టె మిఠాయి, సాయంత్రం చీకటి పడేవేళకు,  మైకులో ఊరంతా వినవచ్చే పంచాయితీ రేడియోలో సినిమా పాటలు, వెన్నెల్లో ఆరుబయట నులకమంచాలపై పడుకుని ఊ కొడుతూ వినే అమ్మమ్మ కథలూ,

ఏవీ ! అవేవీ! ఎక్కడా కనబడవేం! ఇవన్నీ ఒకనాడు వున్నాయని అన్నా,  కంప్యూటర్లతో ఒంటరిగా ఆడుకునే ఈనాటి పిల్లలు నమ్ముతారా? కళ్లతో చూసిందే నమ్ముతాం అని వాళ్లంటే మీరేం చేస్తారు?




28, అక్టోబర్ 2022, శుక్రవారం

మనసు పలికే పలుకు – భండారు శ్రీనివాసరావు

 

“నిజమని తెలిసినా నిర్ధారణ చేసుకునే వార్త ఇవ్వాలి” అనేది రేడియోలో బోధించిన మొదటి పాఠం.

ఇంగువకట్టిన గుడ్డకు వాసన ఎలా పోతుంది. అంచేత ఈరోజు  అధికారికంగా సర్కారు వారి నుంచి సమాచారం అందుకున్న తర్వాతనే ఈ పోస్టు పెడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మగారి పనుపున  ప్రిన్సిపల్ సెక్రెటరీ ముత్యాల రాజు గారు ఒక మనిషికి ఇచ్చి ఈరోజు ఒక లేఖను హైదరాబాదులోని మా ఇంటికి పంపారు.

నవంబరు ఒకటో తేదీన విజయవాడ లబ్బీపేటలోని  ‘A’ CONVENTION హాలులో జరిగే కార్యక్రమంలో గవర్నర్, ముఖ్యమంత్రుల సమక్షంలో మీడియా రంగంలో జీవిత సాఫల్య పురస్కారం నాకు అందచేస్తున్నట్టు  ఆహ్వానంతో కూడిన సమాచారం అందులో వుంది.

ఈ విషయం మీలో చాలామందికి ఈపాటికే తెలిసి వుంటుంది. అనేక మంది శుభాకాంక్షలు కూడా తెలిపారు. అయితే నేరుగా  ఈ విషయాన్ని  తెలియపర్చక  పోవడం  పొరబాటే. ఒప్పుకుంటున్నాను.  ఇదే అవార్డు వచ్చిన మరో ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు శ్రీయుతులు సతీష్ చందర్, మంగు  రాజగోపాల్, ప్రసాదరెడ్డి  గారలు  ఏ కోణంలోనుంచి చూసినా నాకంటే గొప్ప అనుభవం వున్న జర్నలిస్టులు. ఒక్క వయసులో తప్ప, వారితో పోలిస్తే నేను ఏ విషయంలో అధికుడిని కాను. వారికి నా అభినందన మందారమాల.

నన్నూ, నా పేరును సమాజానికి తెలియచేయడంలో తోడ్పడిన మన ఎమ్మెల్యే వారపత్రిక,  ఆంధ్రజ్యోతి, సూర్య, ఆంధ్రప్రభ, సాక్షి మొదలైన పత్రికలు, ఆకాశవాణి,  అన్ని తెలుగు న్యూస్ ఛానళ్లకు, అనేక వెబ్ ఛానళ్లకు,  ఫేస్ బుక్ వంటి మాధ్యమాలకు, ప్రత్యేకించి ఈ మాధ్యమంలో నన్ను అభిమానిస్తూ ప్రోత్సాహించిన మితృలకు, పెద్దలకు, మా కుటుంబ సభ్యులకు, బంధుమితృలకు ధన్యవాదాలు, నమోవాకాలు.

నన్ను ఎలా చూడాలని అనుకుందో ఆ క్షణం నా జీవితంలో తొలిసారి, ఆఖరిసారి వచ్చినప్పుడు నా తోడు వదిలి వెళ్ళిపోయిన నా భార్య నిర్మలకు, ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని నిండు మనసుతో అర్పిస్తున్నాను.  


 

(29-10-2022)  

23, అక్టోబర్ 2022, ఆదివారం

కట్టుబట్టలతో బయట పడ్డాం

 

కట్టుబట్టలతో

బయట పడడం అనేది కొద్దిసేపటి క్రితం అనుభవంలోకి వచ్చింది.

ఏడున్నర ప్రాంతంలో మనుమరాలితో ఆడుకుంటూ వుంటే కోడలు వచ్చి, పాపా జీవికను కిందికి తీసుకువెళ్లి ఒకటి రెండు మతాబాలు కాల్చి తీసుకువస్తాను అంది. నేనిక్కడ వుండి  చేసేదేమిటి నేనూ వస్తాను పదండి అంటూ లేచాను. నేను ఇంటి  కీ పట్టుకు వస్తాను మీరు వెళ్ళండి అని ద్రాయరులో వున్న  ఇంటి తాళం తీసుకుని నేనూ వారి వెంటనే కిందికి వెళ్ళాను. అప్పటికే ఒకటి రెండు చిచ్చు బుడ్ల వంటివి వాళ్ళు కాలుస్తున్నారు.  ఒక కాకర పువ్వొత్తి నాచేత కాల్పించారు. అందరం కలిసి పైకి వచ్చాము. తలుపు తెరవడానికి చూస్తే జేబులో తాళం చెవి లేదు. జేబులో వేస్తున్నప్పుడు  కింద పడివుంటుంది, నేను గమనించలేదు. నా దగ్గర వుందని చెప్పాను కనుక వాళ్ళూ తీసుకురాలేదు. అదేమో సెవెన్ లీవర్స్ గోద్రెజ్ లాక్. ఆ ఆటోమేటిక్  లాక్ పడితే ఇంతే సంగతులు. కొడుకూ కోడలు కారేసుకుని అమీర్ పేటలో చాబీవాలాలను వెతుకుతూ వెళ్ళారు. నేను పసిదానిని పెట్టుకుని ఇంట్లోనే, ఇంటి బయట  వుండిపోయాను.

తాళాలు తీసే వాడు ఈ రాత్రి దొరక్కపోతే అనే ఆలోచన చిన్నగా మొదలై కొద్దిసేపటిలో పెను భూతంగా మారింది.

పసిదానికి ఫీడింగ్ టైం అయితే ఏం చేయాలి? పెద్ద వాళ్ళ తిండీ తిప్పలు అంటే జొమాటో కాకపోతే మరోటో వున్నాయి. ఉన్నపాటున బయటకు వచ్చాము కాబట్టి పర్సులు, బ్యాంక్ కార్డులు లేవు. ఒక వేళ వున్నా,  ఈ ఆకారాల్లో వెడితే ఏ హోటల్ వాడు రూము కూడా ఇవ్వడు.  తెల్లవారితే మాకు దీపావళి హారతులు ఇవ్వడానికి మా అన్నయ్య పిల్లలు వస్తారు.

బాణాసంచా కాల్చడానికి కిందికి వెళ్ళాము కనుక ఫోటోలు తీయడానికి సెల్ ఫోన్లు మాత్రం చేతిలో వున్నాయి.

ఈ లోపల కోడలు ఫోన్ చేసింది. అమీర్ పేట లో వెతగ్గా వెతగ్గా ఓ షాపు దొరికింది. కానీ బాగుచేసేవాడు ఇంటికి వెళ్లి పోయాడు. అతడికి ఇలాంటి లాక్స్ తీయడంలో మంచి ప్రవేశం వుందని చెబుతూ అతడి నెంబరు ఇచ్చాడు షాపులోని వాడు. ఫోన్ చేస్తే అతడు అత్తాపూర్ లో ఉన్నాడని తెలిసింది. ఇప్పుడే ఇంటికి వచ్చాను మళ్ళీ అంత దూరం రాలేను అన్నాడు అతడు. అప్పుడు మా కోడలు ఫోన్ తీసుకుని చెప్పింది. చూడు భయ్యా. మాకు ఎనిమిది నెలల పాప, దాదాపు ఎనభయ్ ఏళ్ళ మామయ్య వున్నారు. ఈ రాత్రి చాలా కష్టం అవుతుంది. నీ కష్టం మేము వుంచుకోము, దయచేసి రమ్మని అడిగితె అతడు మెత్తబడి నేను వచ్చేసరికి గంట, గంటన్నర అవుతుంది, వెయిట్ చేయండి  అన్నాడు. ఈ లోపల మా అపార్ట్ మెంటు ఇరుగూ  పొరుగూ వచ్చి విషయం తెలుసుకుని  ధైర్యం చెప్పారు. ఏమీ పర్వాలేదు ఒకవేళ అవసరం అయితే మా ఇళ్ళల్లో వుండండి, సర్డుకుందాం అని భరోసా ఇచ్చారు. ఒకావిడ వెళ్లి మా మనుమరాలికి అరటి పండు మెత్తగా గుజ్జు చేసి ఇచ్చింది. ఒకళ్ళు చపాతీలు తెచ్చారు. మరొక ఇంటివారు పులిహోర తెచ్చారు.

ఈలోగా చాబీవాలా వచ్చాడు దేవుడిలా.

ఏం మంత్రం వేశాడో తెలియదు, చిన్న చేతి రంపం తీసుకుని తన దగ్గర వున్న తాళం చేతుల్లో  ఒకదాన్ని చిత్రిక పట్టాడు. పదే పది నిమిషాల్లో కొత్త తాళం చెవి తయారుచేసి తలుపు తెరిచాడు.

పది గంటలకి ఇంకా పది నిమిషాలు ఉందనగా మళ్ళీ కొడుకు, కోడలు, మనుమరాలితో కలిసి పునః గృహ ప్రవేశం చేశాను.

అంత దూరం నుంచి వచ్చిన ఆ చాబీవాలా మేము ఇస్తామన్న డబ్బు తీసుకోకుండా, తను తయారు చేసిన తాళం చెవిని మాకే ఇచ్చేసి  తన కూలీ మాత్రం తీసుకుని వెళ్ళిపోయాడు.

లోకంలో మంచి మనుషులు ఇంకా మిగిలే వున్నారు.   



23-10-2022

డబ్బు కావాలా? దరిద్రం పోవాలా? – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha on 23-10- 2022, SUNDAY, today)

పాత కాలపు తెలుగు నాటకాల్లో కాబూలీవాలా పాత్ర గుర్తుండే వుండాలి.  ఆ నాటకాల ప్రభావం కావచ్చు, కాబూలీవాలా అనే పేరు వినగానే  వడ్డీకి డబ్బులు అప్పులిచ్చి అసలు ఫాయిదాలను ముక్కుపిండి మరీ వసూలు చేసే ‘రౌడీ’రూపం కళ్ళల్లో మెదిలేది. అయితే ఒక్క వడ్డీ వసూళ్ళ విషయంలో తప్ప, కాబూలీవాలాలు చాలా మంచివాళ్ళన్న మంచి పేరు వారికి వుండేది. కాలక్రమంలో కాబూలీవాలాల శకం అంతరించి అప్పులిచ్చే మహారాజులు ఒకళ్ళయితే,  వాటిని గోళ్ళూడగొట్టి వసూలుచేసే వసూలు రాజాల పాత్రను  స్థానిక గూండాలు  పోషించడం మొదలు పెట్టారు. ఇక కార్పొరేట్ సంస్కృతి వూడలు దిగిన తరువాత ప్రైవేట్  బ్యాంకుల వాళ్ళు ఈ వసూలు రాజాలను మంచి ఆకర్షణీయమైన వేతనాలు, అలవెన్సులు ఇచ్చి పెంచి పోషిస్తూ రావడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారిపోయింది.

అసలు అప్పులు ఇవ్వడం వాటిని వసూలు చేసే క్రమంలో అనేక అవస్థలు పెట్టడం అనేది పురాణ కాలం నుంచి వింటున్న కధే. ఈ విషయంలో సత్య హరిశ్చంద్రుడు పడ్డ బాధలు అన్నీఇన్నీ కావు. ఎన్ని కష్టాలు పడ్డా చివరికి కధ సుఖాంతం అయ్యింది కాబట్టి పరవాలేదు.

యుగాలు మారినా మారని ఈ విషసంస్కృతి,  కాలక్రమంలో  బాగా ముదిరిపోయి, వూడలు దించుకుంటూ  రూపాలు మార్చుకుంటూ,  పేర్లు మార్చుకుంటూ  చివరకు తాజాగా  ‘మనీ యాప్ లు’  అనే నూతన నామం సంతరించుకుని   పేద, మధ్య తరగతి  ప్రజల ధన,మాన, ప్రాణాలతో ఆటాడుకునే అత్యంత హైన్య స్థితికి దిగజారి పోయింది. సరే! ఈ మనీ యాప్ ల కంటే ముందే కాల్ మనీ పేరుతొ  విచ్చల విడిగా సాగిన వ్యాపారపు ఉచ్చులో చిక్కుకుని అనేక నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోయాయి.  

మంచి విలువలతో కూడిన సమాజాలు విలసిల్లిన కాలంలో కూడా విలువలకు విలువ ఇవ్వని మనుషులు వుండేవాళ్ళు. మానవ సమూహాలు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ కూడా మంచి చెడుల సమ్మిశ్రితాలే. మంచి చెడుల నిష్పత్తి మాత్రమే  ఆ సమాజపు గుణగణాలను  అంతిమంగా నిర్ణయిస్తుంది.

అప్పు ఇవ్వడం, ఇచ్చిన అప్పుకు వడ్డీ వసూలు చేయడం అనేది అనాదిగా సమాజం అంగీకరించిన వ్యవహారమే. మా చిన్నతనంలో కూడా ఊళ్ళల్లో అప్పులు ఇచ్చే ఆసాములు వుండేవాళ్ళు. నగలు, వస్తువులు తాకట్టు పెట్టుకుని అవసరంలో వున్న  బీదాబిక్కీకి అప్పులిచ్చేవాళ్ళు. కొందరు ధర్మ ప్రభువులు ధర్మవడ్డీ  వసూలు చేస్తే, మరికొందరు అధిక వడ్డీలతో బాకీదారుల్ని పీల్చి పిప్పి చేసేవాళ్ళు. వర్తమాన కాలంలో కొన్ని ప్రైవేటు బ్యాంకులు కూడా అప్పుల వసూళ్ళ కోసం  గూండాల మాదిరిగా వ్యవహరించే సిబ్బందిని నియమించుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. 

ముందే చెప్పుకున్నట్టు అప్పులు, వడ్డీలు అనేవి చట్ట వ్యతిరేకం కావు. దేశాలు సయితం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తీసుకుంటాయి, వడ్డీ చెల్లిస్తాయి. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రుణాలు  తీసుకుంటాయి. ఐతే ఇవన్నీ చట్టం లేదా నిబంధనల పరిధిలో జరుగుతాయి. గ్రామీణ బ్యాంకుల ఆవిర్భావానికి పూర్వం, ఊళ్ళల్లో జనం తమ  రుణ అవసరాలకోసం స్థానిక వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడేవాళ్ళు. క్రమేణా, నోటి మాట మీద అప్పులిచ్చే రోజులు పోయి ప్రామిసరీ నోటు మీద సంతకం చేయించుకునో, వేలిముద్ర వేయించుకునో అప్పులిచ్చే కాలం  వచ్చింది. గతంలో కోర్టుల్లో చాలా కేసులు వీటికి సంబంధించినవే ఉండేవి. గ్రామీణ బ్యాంకులు రంగప్రవేశం చేసిన తరువాత చాలా చోట్ల వడ్డీ వ్యాపారుల ఆగడాలకు కళ్ళెం పడింది. అలా అని వారి పీడ పూర్తిగా విరగడ అయిపోయిందని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటె మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలు పెరిగిపోతున్నాయి, మారిపోతున్నాయి. లోగడ ప్రాణం మీదకు వచ్చిన సందర్భాల్లో అప్పులు చేస్తే ఇప్పుడు ఆడంబరాలకోసం అప్పులు చేస్తూ వుండడం రివాజుగా మారిపోయింది. 

నిజానికి ఇలాంటి దందాలతో పెద్ద పెద్ద వారికి ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అనుకోలేము. ఐతే వారి అండాదండా  తమకున్నదని చెప్పుకుంటూ , అలా నమ్మించే ఏర్పాట్లు చేసుకుంటూ ఇలాటి అక్రమ వ్యవహారాలకు తెర తీస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వుండడం రివాజుగా మారింది. ఈ స్థాయిలో ‘నేర ప్రవృత్తి’ రెక్కలు విప్పుకుంటున్నదంటే, పెద్ద తలకాయల ప్రమేయం అంతో ఇంతో లేకుండా, పోలీసుల దన్ను లేకుండా ఈవిధమైన తంతు సాగించడం అసాధ్యం అని నమ్మేవాళ్ళూ వున్నారు. అందుకనే పాలకపక్షానికి ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పక తప్పదు. అవసరాలకు కాకుండా ఆడంబరాలకోసం అప్పులు చేసే  మనస్తత్వం జనాల్లో పెరగడం కూడా మరో కారణం.  

ఉపశృతి: మా పెద్దన్నయ్య, కీర్తిశేషులు  భండారు పర్వతాలరావు చాలా సంవత్సరాలక్రితం ఒక వ్యాసం రాసారు. “డబ్బు కావాలా? దరిద్రం పోవాలా” అనేది దాని శీర్షిక.

ఒకానొక గర్భ దరిద్రుడు దేవునిగూర్చి గొప్ప తపస్సు చేస్తాడు.

ఆయన ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. భక్తుడు తన పరిస్తితి చెబుతాడు.

దేవుడప్పుడు చిరునవ్వు నవ్వి, ‘’డబ్బు కావాలా ? దరిద్రం పోవాలా ?’ అని అడుగుతాడు.

దాంతో భక్తుడికి కళ్ళు తెరిపిళ్ళు  పడతాయి.

దరిద్రం అంటే డబ్బు లేకపోవడం కాదు, డబ్బున్న దరిద్రులు కూడా లోకంలో చాలామంది వున్నారు. వాళ్ళకంటే తానే మిన్న అని భక్తుడు తెలుసుకుంటాడు.




17, అక్టోబర్ 2022, సోమవారం

నిశ్శబ్ద నిష్క్రమణ

 

కొద్ది నిమిషాల క్రితం ఫోను మోగింది.
‘నేనండీ సమతను’
ముందు పోల్చుకోలేక పోయాను. తటాలున గుర్తుకు వచ్చింది. సమత.
ముప్పయ్ అయిదు సంవత్సరాల క్రితం మేము మాస్కోలో వున్నప్పుడు సమత అక్కడ మెడిసిన్ చేస్తుండేది. మాస్కో వెళ్ళిన కొత్త రోజులు. మా ఆవిడకి గుండె వాల్వ్ లో జన్యు లోపం కారణంగా ప్రతి నెలా పెనిడ్యూర్ ఇంజెక్షన్ విధిగా తీసుకోవాల్సి వుంది. రష్యాలో వైద్యం ఉచితమే అయినా భాష సమస్య. ఈ సమస్యకు పరిష్కారం సమత రూపంలో వచ్చింది. ఆ విధంగా సమత, ఆమె ద్వారా పరిచయం అయిన అనేకమంది తెలుగు స్టూడెంట్స్ మా ఇంటి మనుషులుగా మారారు. శని ఆదివారాల్లో సందడే సందడి. భోజనాలు చేసి హాస్టళ్లకు వెళ్ళేవాళ్ళు.
‘హైదరాబాదు నుంచి రోజూ సిద్దిపేటకు షటిల్. ఉద్యోగం అక్కడ. నివాసం ఇక్కడ.నేను పనిచేసే చూట సిగ్నల్స్ సరిగా వుండవు. అందుకే ఇప్పుడు చేస్తున్నాను, మళ్ళీ రాత్రి ఏడు గంటలకి కానీ తిరిగిరాను’
సమత మాట్లాడుతూనే వుంది.
‘మీ లొకేషన్ షేర్ చేయండి. నిర్మల గారి చేతి వంట తిని చాలా ఏళ్ళు అయింది. వచ్చే ఆదివారం మీ ఇంట్లోనే భోజనం. ఒక సారి నిర్మల గారికి ఫోన్ ఇవ్వండి, సిగ్నల్ ఉన్నప్పుడే మాట్లాడాలి’
నాకు మాట పెగల్లేదు. సిగ్నల్ అందనంత దూరం వెళ్ళిపోయిందని ఎలా చెప్పను.
తేరుకుని విషయం చెప్పాను, మూడేళ్ల కిందట పోయిందని,
ఈసారి అటువైపు నుంచి మాట లేదు.
అవునూ! ఇంత నిశ్శబ్దంగా నిష్క్రమించిందా!
17-10-2022

పెద్దగీత

 

 

ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు.

ప్రాతఃస్మరణీయులు.

బీ.ఎస్.రామకృష్ణ.  జర్నలిస్ట్ సర్కిల్ లో బీ ఎస్ ఆర్ అంటారు.  ఫేస్ బుక్ లో  బుద్ధవరపు రామకృష్ణ. మంచి  జర్నలిస్టు. మంచి రాయసకాడు. చక్కని ధారణ శక్తి. నా కంటే వయసులో చిన్న అయినా, నేనూ జర్నలిస్టునే అయినా, అతనికి వున్న ఈ గొప్ప లక్షణాలు ఏవీ నాలో లేవు. నిన్ననో మొన్ననో ఫోన్ చేసి ఓ పెద్దగీత గీసి,  కొద్ది రోజులుగా నేను మధన పడుతున్న ఒక అంశాన్ని రబ్బరు పెట్టి చెరిపేసినట్టు చెరిపేసాడు. ‘ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారికే తప్పలేదు, ఈ ఇంటి పేరు గొడవ  ఇక మనమెంత’ అంటూ ఎంత పెద్దగీత  గీసి చూపెట్టాడో.

ఆంధ్రపత్రిక పెట్టిన కాశీనాధుని నాగేశ్వరరావు గారు భారతి సాహిత్య మాసపత్రిక మొదలుపెట్టి రెండు చేతులూ  మోచేతుల దాకా కాల్చుకున్నారు. మంచి సాహిత్య పత్రికని నడిపారనే మంచి పేరుతొ పాటు మంచి నష్టాలు కూడా ఆయన ఖాతాలో పడడానికి భారతి కూడా కారణమనేవారు. గొప్ప సాహితీవేత్త అయిన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు భారతి సాహిత్య మాస పత్రికకి అడపాదడపా  చక్కటి వ్యాసాలు రాస్తుండేవారు. అయితే ఆయన ఇంటిపేరును ఎప్పుడూ ఇంద్రగంటి బదులు ఇంద్ర కంటి అని ప్రచురిస్తూ వుండేవారు.  ఆయన ఇంటి పేరులో వున్నది ‘గంటి’ నా, ‘కంటి’ నా అని విడమర్చి చెప్పడానికి ఆయన కుమారుడు, ప్రసిద్ధ రచయిత అయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (గతంలో నేనూ శర్మగారు ఆంధ్రజ్యోతిలో సమకాలీకులం) ఇప్పుడు లేరు. అయితే అలనాటి భారతి పత్రిక సంచికలు కష్టపడి సేకరించానని రామకృష్ణ చెప్పాడు. చెబుతూ మరో మాట చెప్పాడు. మీ ఇంటి పేరు భండారు లేక  బండారు ఇలా ఎలా రాసినా చింతించడం అనవసరం  అంటూ గీతాబోధ చేశాడు.

ఇలాంటి సమాచారాలు బోలెడు సేకరిస్తూ వస్తున్నానని, ఎప్పుడో సమగ్ర  వ్యాసం రాస్తానని ఒక హామీ కూడా ఇచ్చాడు.

(17-10-2022)

 

 

16, అక్టోబర్ 2022, ఆదివారం

కొన్ని అంతే! ఊహకు అందవు

 కొన్ని అంతే! ఊహకు అందకుండా చకచకా జరిగిపోతుంటాయి. 

జర్నలిజంలో జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపిక చేసినట్టు ఏపీ ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఫోను చేసి చెప్పడం, ఆ మరునాడే మేనల్లుడు, మా ఇంటిల్లిపాదికీ పిలవకుండానే పలికే డాక్టరు,  డాక్టర్ మనోహర్ కుమార్తె ప్రియ కుటుంబం విదేశాల నుంచి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బంధు మిత్రుల సమావేశంలో నన్ను సత్కరించడం వెంటవెంటనే  జరిగిపోయాయి. ఈ మధ్యనే అస్వస్థతకు గురయి కోలుకుంటున్న నాకు, మా కుటుంబ సభ్యుల నడుమ జరిగిన ఈ  వేడుక కొత్త ఊపిరులు ఊదింది. 

అనుకోకుండా వచ్చిన అవార్డు కన్నా, అనుకోకుండా జరిగిన ఈ కార్యక్రమంలో మా  అన్నయ్య రామచంద్రరావు గారు, మేనకోడలు భర్త రావులపాటి సీతారామారావు, మిత్రులు  జ్వాలా నరసింహారావు, విజయ శంకర్, పింగిలి శ్రవణ్ కుమార్, టి.ఎస్.ఎన్. మూర్తి,  వదిన విమల, మేనకోడళ్ళు శారద, విజయలక్ష్మి  ఇంకా పలువురు    నా గురించి   మాట్లాడిన మాటలు నాకు నా జీవితంలో లభించిన అతి పెద్ద అవార్డుగా భావిస్తూ వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనః పూర్వక ధన్యవాదాలు.

ఈ మొత్తం కార్యక్రమానికి కర్తా కర్మా క్రియ గా వ్యవహరించిన ప్రియ, డాక్టర్ మనోహర్, జ్వాలా, మా కుటుంబంలో  ఏకైక మహిళా జర్నలిస్ట్ బుంటి అని మేము ముద్దుగా పిలుచుకునే ప్రేమ మాలిని – వీళ్ళకు ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా అవి సరితూగవు.

అలాగే, ఫేస్ బుక్ లో, ఇతర మాధ్యమాల్లో  మితృలు అనేకమంది శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో  మహానుభావులు, అందరికీ పేరుపేరునా  వందనాలు.




 

16-10-2022

ఇంకానా! ఇకపై సాగదు!- భండారు శ్రీనివాసరావు

 

రాను రాను,   సామాన్యుడనే వాడికి  ఓటు వెయ్యడం మినహా  ఏ ‘హక్కూ’ లేకుండా పోతోంది. కానీ, అతడ్ని అడ్డం పెట్టుకుని బతికేవారికి మాత్రం అన్ని హక్కులూ  హక్కుభుక్తమై పోతున్నాయి.

నిజానికి, పార్టీలూ, పార్టీల నాయకులు, అమాత్యులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు వీరందరూ ప్రజల్లో భాగమే. ప్రజల నుంచి వచ్చిన వీళ్ళే. ఎదిగో, ఎన్నికయ్యో  హక్కులు సాధించుకుని అధికారం చెలాయిస్తున్నారు. సామాన్యులు ఎలాంటి హక్కులూ లేకుండా కునారిల్లుతున్నారు. అదే తానులోనుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వృత్తుల పేరిటా, ఉద్యోగాల పేరిటా సంఘాలు పెట్టుకుని, హక్కుల పోరాటాల పేరుతో లేని అధికారాలు అనుభవిస్తున్నారు. పై పదవులకు నిచ్చెనలు వేసుకుంటున్నారు.

సంఘాల కుంపట్లు పెట్టుకోని వర్గాలు ఈనాడు కాగడాలు వేసి గాలించినా కనిపించవు. ఎన్జీవోలకు సంఘాలున్నాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పి.ఎస్. అధికారులకు అసోసియేషన్లు ఉన్నాయి. రిక్షాలు లాగేవారికే కాదు, విమానాలు నడిపేవారికీ యూనియన్లు ఉన్నాయి. అమ్మేవారికి, కొనేవారికి సమాఖ్యలున్నాయి. రాసేవారికి, ఆ రాసిన వాటిని  అచ్చేసేవారికీ సంస్థలు ఉన్నాయి. ఆడవారికీ, భార్యాబాధితులకు సయితం సమాజాలున్నాయి. వృత్తుల వారీగా, కులాలవారీగా, మతాలవారీగా ఎవరి సంఘాలు వారికి ఉన్నాయి. వీటన్న్టిటికీ, సొంతంగా ఏర్పరచుకున్న హక్కులు ఉన్నాయి. లేకపోయినా, వాటికోసం పోరాడగల యంత్రాంగ వ్యవస్తలున్నాయి. వారి భావాలను విప్పిచెప్పగల గళాలు ఉన్నాయి. వాటిని ప్రజలకు చేరవేసే మాధ్యమాలు ఉన్నాయి. హక్కుల సాధనకోసం సమ్మెలు, బంద్ లు, ఆందోళనలు, నిరసనలు, రాస్తారోఖోలు, రైల్ రోఖోలు, ఘెరావ్ లు, ముట్టడులూ, ఊరేగింపులూ, బైఠాయింపులూ, అటకాయింపులూ, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు, ఇలా ఎన్నో రకాలుగా, ఎన్నెన్నో రూపాల్లో.. సామాన్యుడి సాధారణ జీవనాన్ని అతలాకుతలం చేస్తూ, మరింత దుర్బరంగా మారుస్తూ,  పై పెచ్చు తాము పడుతున్న ఈ పడరాని పాట్లన్నీ ఆ సామాన్యుడి కోసమే అని చెప్పి నమ్మించగల టక్కుటమార విద్యలన్నీ వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నీ లేనివాడు, అసలేమీ లేనివాడు మాత్రం రాజ్యాంగం తనకు కల్పించిన అన్ని రక్షణలకూ తూట్లు పొడుస్తున్న ఈ అస్తవ్యస్త వ్యవస్థల  మధ్య చిక్కుకుపోయి నానా అవస్థలు పడుతూ దిక్కుతోచక విలవిలలాడుతున్నాడు.

కారణాలు ఏమైనా, హేతుబధ్దత ఎంత ఉన్నా, బంద్ ల వల్లా, రాస్తారోఖోల వల్ల నష్టపోతున్నదీ, కష్టపడుతున్నదీ సామాన్యులే అన్నది నగ్న సత్యం. నిరసనలూ, ఆందోళనల పేరుతో రాజకీయపార్టీలు, వాటి అనుబంధ సంస్థలు, కార్మిక సంఘాలు, ఇతర సంస్థలూ, ఇష్టారాజ్యంగా నడిరోడ్లపై చేస్తున్న ధర్నాలు, బైఠాయింపులు నిత్యకృత్యంగా మారి జనజీవితాన్ని నరకప్రాయంగా మారుస్తున్నాయన్నది కూడా  అంతే నిజం.

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఒత్తిడి తెచ్చే నెపంతో రోడ్డెక్కుతున్న రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు తమ వైఖరులనూ, విధానాలను పునస్సమీక్షించుకోవాలి. ఏ సామాన్య జనం కోసమైతే ఉద్యమాలు, ఆందోళనలూ, నిర్వహిస్తున్నామని ఆయా పార్టీలూ, సంఘాలు అనుకుంటున్నాయో, ఆ సామాన్య జనాన్నే తమ ఈ విధివిధానాలు మరింత చీకాకు పరుస్తున్నాయన్న వాస్తవాన్ని అర్దం చేసుకోవాలి. పోరాటాల పేరుతోనో, ఇతరేతర రాజకీయ కారణాలతోనో బడుగుజీవి నడుం విరుస్తున్న ఈ అపభ్రంశపు విధానాలు ఏ నాగరిక దేశంలోనూ కానరావు. సాటి పౌరులకు ఇబ్బంది కలగని రీతిలో నిరసనలు ప్రకటించే పద్ధతులను సభ్యసమాజం పాటించి తీరాలన్న ప్రాధమిక స్పృహ మనదేశంలో కలికానికి కూడా కానరాదు.

ఒకసారి, సూర్యాపేట మీదుగా బస్సులో ఖమ్మం వెడుతుంటే నడుమ దారిలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి. కారణం వాకబు చేయడానికి వెడితే కొంతదూరంలో ఏదో పార్టీకి చెందిన కార్యకర్తలు, పట్టుమని పదిమంది కూడా లేరు,  జండాలు పట్టుకుని, నినాదాలు చేస్తూ నడిరోడ్డుపై ధర్నా చేస్తున్నారు. ‘ఇలా ఎంతసేపు మీ తమాషా చూడాలని గద్దిస్తే‘, ‘ఒక్క అరగంట ఓపిక పట్టండి సార్! ఫలానా టీవీ వాళ్ళు దోవలో ఉన్నామని ఇప్పుడే సెల్ ఫోన్లో చెప్పారు’ అని వాళ్ళ నాయకుడు జవాబిచ్చాడు. ఇలాంటి చిన్నాచితకా  ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోఖోలు ససేమిరా చూపించేది లేదని ఛానళ్ళన్నీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోగల్గితే మెరుగయిన సమాజం కోసం నిజంగా కృషి చేసినట్టవుతుంది. ప్రచారం కోసం కాకుండా ప్రజాక్షేమాన్ని కోరుకునే సంస్థలు కూడా తమ కార్యకర్తల్ని తక్షణం రంగంలోకి దింపి ‘ఇలా ప్రజలని ఇబ్బందుల పాలు చేసే వారికి దయచేసి ఓట్లు వెయ్యవద్దు’ అనే ప్లకార్డులను పట్టుకుని మౌనంగా ఆ పక్కనే  నిలబడితే, నవ్యత్వం కోసం పాటుపడే ఛానళ్ళన్నీ ఆ దృశ్యాలను ఒక్కమారైనా ప్రసారం చేయగలిగితే, ఇంకోసారి ఏపార్టీ, ఏ యూనియన్ కూడా ఇలాంటి ఆందోళనలకు  సాహసించదు. కానీ సంచలనం ఒక్కటే సమస్తం అనుకునే ఈ పోటాపోటీ ప్రచార వ్యాపార యుగంలో ఇది నెరవేరని కలే.

కానీ, ఏదో ఒకరోజు ‘సామాన్యుడి రోజు’ కూడా వస్తుంది. నిరసనలని వ్యక్తం చేయడానికి ఎంచుకున్న విధానాల ద్వారా వేలాది మంది ప్రజలను అకారణంగా ఇబ్బంది పెట్టే హక్కు వీరికెవరిచ్చారన్న ప్రాధమిక ప్రశ్న ముందుకు వస్తుంది.

అర్భకుడు, అమాయకుడు అనుకున్న ఈ సామాన్యుడే తిరగబడి ‘ఇంకానా’ ఇకపై సాగదు!’ అంటూ హూంకరిస్తూ, తన జీవితంతో ఆటాడుకుంటున్న ‘వర్గాల’ మెడలు వంచే రోజు తప్పక వస్తుంది.

 తస్మాత్ జాగ్రత్త!




12, అక్టోబర్ 2022, బుధవారం

దరిద్రం యెలా వుంటుంది? – భండారు శ్రీనివాసరావు

 

ఈ ముచ్చట ఇప్పటిది కాదు, ఎప్పుడో పదేళ్ల క్రితం 2012 లో నిజంగా జరిగింది. ఆంగ్ల దినపత్రిక హిందూలో ఈ కధనం వచ్చింది. దానికి నా స్వేచ్ఛానువాదం అన్నమాట.
చెడి బతకొచ్చుకాని, బతికి చెడడం అంత మా చెడ్డ కష్టం మరోటి వుండదంటారు.
కానీ అలాటి కష్టం మాకొక లెక్కే కాదు పొమ్మని నిరూపించారు ఇద్దరు కుర్రాళ్ళు.
తుషార్ హర్యానాలో ఓ పోలీసు ఆఫీసర్ కొడుకు. అమెరికా వెళ్లి పై చదువులు పూర్తిచేసుకున్నాడు. అమెరికా, సింగపూర్లలో మూడేళ్లపాటు బ్యాంకు ఉద్యోగాలు చేసాడు. డబ్బుకు లోటులేని జీవితం గడిపాడు.
మరో కుర్రాడి పేరు మట్. పేరు చూసి వేరే దేశం వాడని పొరబడేవీలుంది. కానీ మన తోటి భారతీయుడే. తలిదండ్రులతో కలసి చిన్నతనంలోనే అమెరికా వెళ్లాడు. అక్కడే చదువుసంధ్యలు గట్రా పూర్తిచేసుకున్నాడు.
ఈ ఇద్దరికీ ‘ఇండియా దటీజ్ భారత్’ కు తిరిగిరావాలని చిరకాల కోరిక. చివరికి ఎలాగయితేనేం మాతృదేశానికి వచ్చేసారు. బెంగళూరులో ఓ ప్రాజెక్టులో చేరారు. ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ‘ఒకే కంచం ఒకే మంచం’ అనే తీరుగా కలగలసిపోయి ప్రాణ స్నేహితులుగా మారిపోయారు. ఇద్దరి ఆశలు ఒకటే. ఆశయాలు ఒకటే. ఇది మరో కారణం.
హాయిగా రోజులు గడిచిపోతున్నాయి. అలా గడవడం, గడపడం వారికి సుతరామూ ఇష్టంలేదు. అలా అయితే వారిని గురించి ఇంతగా రాయాల్సిన పనే లేదు.
ఒక ఐడియా జీవితాన్నిమారుస్తుందంటారు.
దేశంలో దారిద్యం గురించిన ఒక గణాంకం వారిని ఆకర్షించింది. అదేమిటంటే భారతదేశంలో పేదవారు చాలామంది రోజుకు అక్షరాలా ఇరవై ఆరు రూపాయల ఆదాయంతో బతుకు బండి లాగిస్తున్నారని. ‘అదెలా సాధ్యం?’ అన్నది వారి మదిలో మెదిలిన మొదటి ప్రశ్న. ‘అదెలా సాధ్యమో తెలుసుకోవాలన్నది’ కలిగిన కుటుంబంలో పుట్టిన వారిద్దరికీ కలిగిన మరో ఆలోచన.
అసలే మార్పు కోరే తత్వం. ఆలోచనలను అమలు చేయడంలో ఇద్దరిదీ ఏకత్వం. ఇక అడ్డేముంది. రాజభోగాలు వొదులుకుని సన్యసించిన బుద్ధుడిలా ఇద్దరూ కలసి సగటు భారతీయుడు యెలా బతుకుతున్నాడో అలా బతకాలని బయలుదేరారు. చదువుకున్నవారు కనుక ఈ ప్రయోగానికి ముందు అన్ని లెక్కలు వేసి చూసుకున్నారు.
సగటు భారతీయుడి సగటు ఆదాయం నెలకు 4,500 రూపాయలు. అంటే రోజుకు నూట యాభయ్ రూపాయలు. ప్రపంచ వ్యాప్తంగా జనం వారి నెలసరి ఆదాయంలో మూడో వంతు ఇంటి అద్దెకు ఖర్చు పెడతారు. ఆ లెక్కన రోజు రాబడి నూట యాభయ్ లో మూడో వంతు తీసేసి వందరూపాయలతో రోజు గడపాలనే ప్రయోగానికి పూనుకున్నారు. దేశ జనాభాలో 75 శాతం మంది ఇంతకంటే తక్కువ ఆదాయంతో జీవిస్తున్న విషయం వారికి తెలియంది కాదు.
ఖరీదయిన అపార్టుమెంటును వొదిలేసారు. ఇంట్లో పనిచేసే పనిమనిషిని వొప్పించి ఆమె వుంటున్న ఇరుకు గదిలోకి మారిపోయారు. మొదట ఈ ఇద్దరి తరహా చూసి పిచ్చివాళ్లనుకుంది. కానీ, వారి దీక్ష, పట్టుదల చూసి చలించి పోయింది.
కొత్త జీవితంలో వారికి ఎదురయిన ప్రధాన సమస్య చౌకగా తిండి సంపాదించుకోవడం ఎలాగా అన్నది. అంత తక్కువ ఆదాయంలో బయట భోజనం చేయడం అన్నది అసాధ్యం. దాబాల్లో తినాలన్నా కుదరని పని. పాలూ, పెరుగు, నెయ్యి, వెన్న అన్నింటికీ స్వస్తి చెప్పారు. విదేశాల్లో చదువుకున్నారు కనుక స్వయంపాకం వారికి వెన్నతో పెట్టిన విద్య. కానీ వంట వండడం వచ్చుకాని, వండడానికి వనరు లేదు. అందుకని చౌకకు చౌక, మంచి పోషక విలువలు వుండే గింజలను ఉడకబెట్టి ఆహారంగా తీసుకునే పద్దతికి శ్రీకారం చుట్టారు. అలాగే పార్లే బిస్కెట్లు. కేవలం ఇరవై అయిదు పైసలు పెడితే ఇరవై ఏడు కేలరీలు. అరటి పండు ముక్కల్ని వేయించి బిస్కెట్లతో కలిపి తింటే ఆరోజు విందు భోజనం చేసినట్టు.
రోజుకు వందలో బతకాలి కాబట్టి వారికి వారే కొన్ని బంధనాలు, పరిమితులు విధించుకున్నారు. అయిదు కిలోమీటర్లకు మించి బస్సులో ప్రయాణం భారం అని తెలుసు. అంతకంటే ఎక్కువ దూరం వెళ్ళాల్సిన పరిస్తితి వుంటే నటరాజా సర్వీసే గతి. నెలవారీ విద్యుత్ వాడకాన్ని బాగా తగ్గించుకున్నారు. రోజుకు అయిదారు గంటలే లైట్లు, ఫాన్ వాడేవారు. కొంత విద్యుత్ ను కంప్యూటర్లు, మొబైల్ ఫోనులు చార్జ్ చేసుకోవడానికి వీలుగా పొదుపు చేసుకునే వారు. ఒక్క లైఫ్ బాయ్ సబ్బు కొని, దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరు వాడుకోవాల్సిన పరిస్తితి. కోరి తెచ్చుకున్న కష్టాలే కనుక చింతించాల్సిన పరిస్తితి ఎదురు కాలేదు.
రోడ్డు వెంట వెడుతున్నప్పుడు అద్దాల అరమరాల్లోనుంచి అనేక రకాల వస్తువులను, దుస్తులను చూస్తూ వెళ్ళేవారు. వాటిని కొనగల తాహతు తమకు లేదని తెలుసు కనుక వాటిల్లో అడుగుపెట్టేవారు కాదు. ఇక సినిమాలు చూడడం అనేది స్తితికి మించిన పని. వారు కోరుకున్నది ఒక్కటే. అనారోగ్యం పాలు కాకుండా వుంటే చాలని.
వారు ఎదుర్కోవాల్సిన మరో పెద్ద సవాలు అలాగే వుండిపోయింది. అధికారికంగా ప్రణాళికా సంఘం సుప్రీం కోర్టుకు తెలియచెప్పిన వివరాల ప్రకారం దార్రిద్య్ర రేఖకు దిగువన వుండేవారి ఆదాయం పట్టణాల్లో రోజుకు 32 రూపాయలు అయితే, గ్రామాల్లో 26 రూపాయలు.
ఇదేదో తేల్చుకోవాలని ఇద్దరూ కలసి మట్ పూర్వీకుల గ్రామానికి వెళ్లారు. అది కేరళలో వుంది. రోజుకు 26 రూపాయలతో గడిపే జీవితాన్ని కరుకాచల్ అనే ఆ వూర్లో మొదలు పెట్టారు. చౌకగా దొరికే ఉప్పుడు బియ్యం, అరటి పండ్లు, పాలు కలపని బ్లాక్ టీ - ఇవే ఆహారం.
కానీ అంత తక్కువ డబ్బుతో జీవించడం చాలా కష్టమని వారికి తేలిపోయింది. అసలే అరకొరగా వున్న కొన్ని సౌకర్యాలను కూడా వొదిలేసుకున్నారు. దుస్తులు శుభ్రం చేసుకోవడానికి బట్టల సబ్బు కొనడం మానేశారు. మొబైల్, కంప్యూటర్ పక్కన పడేసారు. జబ్బున పడితే ఎలా అనే భయం ఒక్కటే వారిని అహరహం వేధించేది. సంపన్న కుటుంబంలో పుట్టి అల్లారు ముద్దుగా పెరిగిన ఆ ఇరవై ఆరేళ్ళ యువకులకి ‘దరిద్రంలో బతకడం’ అన్న ఈ అనుభవం భరించలేనిదిగా బాధించేది.
అయినా పట్టిన పట్టు విడవకుండా వారు తాము అనుకున్నది సాధించారు. దీపావళి నాడు వారి ప్రయోగం ముగిసింది. ఆ రోజున వారు తమ స్నేహితులకు ఉత్తరాలు రాశారు.
‘మేము మళ్ళీ మా మామూలు జీవితాల్లోకి అడుగు పెడుతున్నాం. మా ప్రయోగం ముగియడానికి ముందు రోజు, ఇన్నాళ్ళుగా మేము ఎవరితోనయితే కలసి మెలసి జీవించామో వారంతా కలసి మాకు వారి స్తాయిలో ‘విందు భోజనం’ ఏర్పాటు చేశారు. ఆ భోజనంలో ఎన్ని పదార్ధాలు వున్నాయో తెలియదు కాని ప్రతిదాంట్లో ప్రేమ, అభిమానం, ఆప్యాయతా కూరిపెట్టారని మాత్రం చెప్పగలం. ఇంతవరకు అలాటి భోజనం చేయలేదని కూడా చెప్పగలం.
‘కానీ, ప్రతి ముద్దా నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక వాస్తవం కనుల ముందు కదలాడేది. ఈ మాత్రం భోజనం అన్నది కలగా మిగిలిన మరో నలభయ్ కోట్ల మంది భారతీయులు ఈ దేశంలో మనతో పాటే జీవిస్తున్నారు. వారి కల నెరవేరడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుందో ఎవరికీ తెలియదు.
‘మేము మళ్ళీ మా విలాస జీవితాల్లోకి అడుగుపెడుతున్నాము. కానీ వాళ్లు మాత్రం ఆ ఆగర్భదారిద్ర్యంలోనే వుండిపోతున్నారు. రేపు గడవడం కాదు ఈ క్షణం గడవడం యెలా అన్న బతుకులు వాళ్లవి. తీరని కోరికలు, అపరిమితమయిన పరిమితుల నడుమ వారు తమ జీవన పోరాటాన్ని కొనసాగిస్తూనే వుంటారు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారి ఆకలి పెద్దది. తీరే మార్గం అతి చిన్నది.
‘ఈ ప్రయోగం తరువాత మా ఆలోచనల్లో మరింత మార్పు వచ్చింది.
‘ఇన్నేళ్ళుగా అనేక వస్తువులు జీవితావసరాలుగా భావించి వాడుతూ వచ్చాము.
‘మనిషి బతకడానికి ఇన్నిన్ని సబ్బులూ, షాంపూలు అవసరమా? వారాంతపు సెలవు దినాల్లో బయటకు వెళ్లి ఖరీదయిన హోటళ్ళలో అతి ఖరీదయిన విందు భోజనాలు చేయకపోతే బతుక్కి అర్ధం మారిపోతుందా? బ్రాండెడ్ దుస్తులు ధరించక పోతే జనం మనల్ని గుర్తించరా?
‘స్తూలంగా ఆలోచిస్తే మనం ఇంత సంపన్న జీవితాలకు అర్హులమా? ఇన్నిన్ని వైభోగాలు అనుభవించి ఆనందించే అర్హత వుందా? కొందరు గర్భ దరిద్రులుగా, మరికొందరు ఆగర్భ శ్రీమంతులుగా జన్మించడానికి కేవలం వారి వారి అదృష్టాలే కారణమా?
‘సౌకర్యాలు, సదుపాయాలూ నిత్యావసరాలుగా పరిగణించే జనం ఒక పక్కా, పూటగడవడం యెలా అని అనుక్షణం మధన పడే ప్రజలు మరో పక్కా వుండడం సృష్టి విచిత్రమా? ప్రకృతి వైపరీత్యమా?
‘ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పగల వయస్సు మాకు లేదు. కానీ వున్న పరిస్తితిని అవగాహన చేసుకోవాలనే తాపత్రయం మాత్రం మాకుంది.
‘చివరగా మరొక్క మాట. ఈ ప్రయోగం ద్వారా సాధించింది ఏముంది అంటే వుంది. ఒక కఠోర వాస్తవం మాకు బోధపడింది.
‘ఇన్నాళ్ళుగా, ఇన్నేళ్ళుగా మేము పేదవారిని పరాయివారిగా చూసాము. కానీ మేము వారితో గడిపిన రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా వారు మమ్మల్ని అలా చూడలేదు సరికదా అక్కున చేర్చుకుని ఆదరించారు. నిజానికి పేదలం మనమే. అన్నింటికన్నా ముందు చేయాల్సిన పని ఏమిటంటే, మనలో వున్న ‘ఈ పేదరికాన్ని’ రూపుమాపుకోవడమే!’
పదేళ్లు గడిచిన తర్వాత వాళ్ళ ఆలోచనల తీరు ఎలా ఉందన్నది మళ్ళీ ఆ పత్రికే రాస్తే బాగుంటుంది.

https://www.thehindu.com/opinion/columns/Harsh_Mander/barefoot-the-other-side-of-life/article2882340.ece

9, అక్టోబర్ 2022, ఆదివారం

వినేవారేరీ! - భండారు శ్రీనివాసరావు

(Published in Andhra Prabha on 09-10-2022, SUNDAY, today) 


ఇందుగలడందులేడని సందేహము వలదు అన్నట్టుగా రాజకీయం మకిలి సోకని రంగం అంటూ ఏదీ కనబడని రోజులివి. 'రాజకీయ రంగు' వంటి  కాస్తంత  ఉదాత్తమైన  పదం వాడకుండా రాజకీయ 'మకిలి' అనే పరుష పద ప్రయోగానికి పూనుకోవడానికి కూడా కారణం వుంది. ప్రజా సంఘాల  పేరుతొ ఏదయినా మంచీ చెడూ చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు వారిని 'నడిపేదీ నడిపించేదీ, కదిలేదీ కదిలించేదీ' ఏదో ఒక  రాజకీయ శక్తి అని సందేహిస్తున్న కాలంలో మనం జీవిస్తున్నాం. ధర్మాధర్మవిచక్షణతో కూడిన సద్విమర్శలకు, రాజకీయ కోణంతో చేసే ఆరోపణలకు నడుమ వున్న తేడాను గమనించకుండా వ్యవహరించడం ఈనాటి పాలకుల పద్దతిగా కానవస్తోంది.  

నిజమైన ప్రజాసంఘాలకీ, రాజకీయ నేపధ్యం కలిగిన ప్రజా సంఘాలకీ హస్తిమశకాంతరం తేడా వుంది. చాలా ఏళ్ళ క్రితం  ఉమ్మడి రాష్ట్రంలో  రాజధానీ నగరం హైదరాబాదులోని ఒక రద్దీ కూడలిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంవల్ల  కొద్దిసేపు  ట్రాఫిక్ సిగ్నల్స్  పనిచేయడం మానేశాయి. దాంతో  ఎవరి హడావిడిలో వాళ్ళు  పోవడం వల్ల  వాహనాలన్నీ అడ్డదిడ్డంగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది పరిస్తితిని సరిదిద్దడానికి నానా యాతన పడుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కాని ఒక స్వచ్చంద సంస్థకు చెందిన కొందరు వాలంటీర్లు రంగప్రవేశం చేయడం, ఎంతో చాకచక్యంగా వాహనాల రాకపోకల్ని సరిదిద్దడం నిమిషాల్లో జరిగిపోయింది. ఆ క్షణంలో అక్కడి జనం అందరూ ముక్త కంఠంతో ఆ స్వచ్చంద సంస్థ సేవలను కొనియాడారు. ఆ సంస్థ పేరు లోక్ సత్తా. సీనియర్ ఐ.ఏ.యస్. అధికారి అయిన జయప్రకాష్ నారాయణ  తన  పదవినీ, దానితో పాటు వచ్చే అధికారాన్నీ, హంగుల్నీ, అవకాశాలనీ ఒదులుకుని రాజకీయ కల్మషాన్ని కడిగిపారేసి, పరిశుద్ధ సమాజాన్ని ఆవిష్కరించే సదుద్దేశ్యంతో నెలకొల్పిన సంస్థ అది. దురదృష్టం ఏమో గాని కొన్నాళ్ళకి దాన్ని ఓ రాజకీయ పార్టీగా మార్చి వేసారు. ఇప్పుడదే సంస్థకు చెందిన రాజకీయ  కార్యకర్తలు మంచి మనసుతో ఏదయినా మంచి పని చేయబోయినా అదంతా ఓట్లకోసం ఆడే నాటకంగా కొట్టివేయడం తధ్యం. రాజకీయ మకిలి అంటుకోవడం వల్ల కలిగే దురదృష్టకర పరిణామం అది.

అధికారంలో ఉన్నవాళ్ళకి తాము చేసే ప్రతిపనీ మంచిగానే కనిపిస్తుంది. సమాజ శ్రేయస్సుకోసం తాము అహరహం కష్టపడుతున్నా విమర్శలు చేయడం తగదన్న భావన పాలకులది. నాకు తెలిసిన గతంలో ఆ పనుల్లోని లోటుపాట్లను పాలకులకు ఎత్తి చూపే అధికారులు వుండేవారు. ఇప్పటికాలంలో అలాటి అధికారులూ లేరు.  అధవా, ఏ అధికారి అయినా కల్పించుకుని చెప్పబోయినా చెవినబెట్టే పాలకులూ లేరు. చెబితే విననప్పుడు చెప్పడం దండగ అనుకునే వాళ్ళు కొందరయితే, పైవారికి హితవు కాని మాటలు చెప్పి, లేని తలనొప్పి తెచ్చిపెట్టుకోవడం ఎందుకని సర్దుకుపోయే వారు మరికొందరు.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారులకి ఆయన అంటే సింహ స్వప్నం. ఆయన మాట  వేదవాక్యం. ఎదురు చెబితే, నలుగురి ఎదుటా  ఏ మాట పడాల్సివస్తుందో అని బెదిరిపోయేవారు. ఆయన పేషీలో  ఎస్.ఆర్. రామమూర్తి అని నిజాయితీకి మారుపేరయిన ఓ ఐ.ఏ.యస్. అధికారి వుండేవారు. చెన్నారెడ్డి గారి వ్యవహార శైలి విలక్షణం. నిండు పేరోలగం మాదిరిగా, మంత్రులు, శాసన సభ్యులతో  కొలువుతీరి కూర్చునేవారు.  తన వద్దకు పనుల మీద వచ్చిన అనుయాయులను సంతృప్తి పరచడానికి 'ఖుద్దున ఆ పని పూర్తిచేయాల'ని అధికారులకి  తక్షణ ఆదేశాలు ఇచ్చేవారు. వాటిల్లో  నిబంధనల ప్రకారం చేయలేనివి కొన్ని వుంటాయి. తన నోటి మాటే 'జీవో' అని బాహాటంగా ప్రకటించిన ముఖ్యమంత్రి ఆయన. అంచేత అలాటి వ్యక్తి ఆర్డరు వేస్తె కాదనే దమ్ము ఏ అధికారికి  వుంటుంది. రామమూర్తిగారు తన 'బాసు' మనస్తత్వాన్ని కనిపెట్టి తదనుగుణంగా ప్రవర్తించేవారు.  చెన్నారెడ్డి గారు నలుగురిలో వున్నప్పుడు  ఒక పని చెప్పీ చెప్పగానే,  వెంటనే 'యస్. సర్. తప్పకుండా అలాగే చేద్దాము' అనేవారు. పని మీద వచ్చిన వాళ్ళు కూడా పనయిపోయిందన్న సంతోషంతో వెనక్కి మళ్లేవారు. అధికారులు తన మాట 'తూచ' తప్పకుండా వింటున్నారని ముఖ్యమంత్రి అనుకునేవారు. అయితే, తీరా  ఆ ఫైలు ముఖ్యమంత్రి సంతకం కోసం వెనక్కి వచ్చినప్పుడు, రామమూర్తిగారు అందులోని మర్మాలను, ఇబ్బందులను  ముఖ్యమంత్రికి విడమరచి చెప్పి, ఏ పరిస్తితుల్లోనూ సానుకూల ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని చెబుతూ, 'నో సర్! ఇది కుదరదు' అని నిక్కచ్చిగా చెప్పేవారు. చెన్నారెడ్డి గారు కూడా హుందాగా తల పంకించి ఊరుకునేవారు కానీ ఆ విషయం మీద మరింత పట్టుపట్టేవారు కాదు.  ఇవన్నీ చూసిన వారు యస్. ఆర్. రామమూర్తి గారిని పరోక్షంలో 'యస్.సర్, రామమూర్తి, నో సర్. రామమూర్తి' అని హాస్యోక్తిగా అనేవారు. అలాటి అధికారులు ఈనాడు అసలు లేరని చెప్పలేము కానీ అరుదని మాత్రం ఘంటాపధంగా చెప్పవచ్చు.        

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే, ఈ నాటి పాలకులకు ఎదురు చెబితే తట్టుకునే సహనం తక్కువయిపోతోంది. పాలకులే కాదు అధికార గణం సయితం ఇదే తంతు. అందరికీ మెచ్చుకోళ్ళే కావాలి తప్ప విచక్షణతో కూడిన విమర్శ పనికిరాకుండా పోతోంది. 'ఎవరు ఎందుకు చెబుతున్నారు, అలా ఎందుకు చెబుతున్నారు' అని ప్రశ్నలు వేసుకుని సరయిన సమాధానాలు రాబట్టుకోగలిగితే పాలనాసూక్ష్మాలు బోధపడతాయి.

అసలు విషయానికి వస్తే '

పాలక పక్షం ఒక విధానం ప్రకటిస్తుంది. ప్రతిపక్షం అందులో వున్న మంచిని పక్కనబెట్టి, కోడి గుడ్డు మీద ఈకలు పీకిన చందంగా  దాని వెనుక ఏదో పైకి కనిపించని  రాజకీయ వ్యూహం వుందని ఆరోపిస్తుంది. 

ప్రతిపక్షం ఒక ఆరోపణ చేస్తుంది. పాలక పక్షం అందులోని హేతుబద్ధత పట్టించుకోకుండా అదంతా  రాజకీయ కుట్ర అంటూ ఒక్క ముక్కలో  కొట్టి పారేస్తుంది.

చెడిపోయిన గడియారం సయితం రోజులో రెండు మార్లు సరయిన టైము చూపిస్తుంది. అలాగే ప్రభుత్వాలు చేసే నిర్ణయాలు అన్నీ సరైనవి కాకపోవచ్చు కానీ వాటిలో కొన్నయినా జన హితంకోసం చేసినవి వుంటాయి. కానీ ప్రతిపక్షాలు వాటిని గుర్తించవు. అభినందించవు.

ప్రతిపక్షాలు చేసే ఆరోపణలన్నీ నూటికి నూరుశాతం  ఆధారరహితం కాకపోవచ్చు. వాటిల్లో కొన్నయినా సహేతుకమైనవి  కావచ్చు. కానీ అంగీకరించడానికి పాలకపక్షాలు సంసిద్ధంగా వుండవు. 

కారణం ఒక్కటే. 'రాజకీయం'.                   

ఇక్కడే ప్రజాసంఘాల పాత్ర వస్తుంది. రాజకీయ పార్టీలు తమ తప్పుల్ని ఎలాగూ ఒప్పుకోవు. వాటిని ఒప్పించేలా చేయగలిగే సత్తావున్న ప్రజాసంఘాలు ఈనాడు లేవు. పత్రికలు, మీడియా  ఈ పాత్ర పోషిస్తున్నాయి. కానీ, రాజకీయ మరకలు పడి, వాటి  విశ్లేషణలకు, అభిప్రాయాలకు, సూచనలకు, సలహాలకు  ఒకనాడు వున్న గుర్తింపు మసకబారి పోతోంది. 

ఈ దుస్తితి తప్పాలంటే సమస్యతో సంబంధం వున్న అందరూ ఒక మెట్టు దిగాలి. ముందు వినడం నేర్చుకోవాలి. విన్నదాన్ని విశ్లేషించుకోవాలి. ప్రతి అంశాన్ని రాజకీయం చేయకూడదు. మంచిని మంచిగా చూడగలిగి, చెడును చెడుగా చెప్పగలిగే ధైర్యం అలవరచుకోవాలి. 

ఇది సాధ్యమా అని ప్రశ్నించుకుంటే సాధ్యం కాదు.

సాధ్యమే అని నిశ్చయించుకుంటే అసాధ్యం కాదు.




5, అక్టోబర్ 2022, బుధవారం

దేవుడే రక్షిస్తాడు నా దేశాన్ని – భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha on 02-10-2022 SUNDAY)

శ్రీ రామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తూ ఒకానొక ప్రదేశంలో ఓ శీతల తరుచ్ఛాయకు చేరి ధనుర్బాణాలను పక్కన బెట్టి విశ్రమించాడు. విశ్రాంతి అనంతరం లేచి కూర్చున్న రామునికి తన విల్లుకింద నలిగిపోతూ నెత్తురోడుతున్న ఒక మండూకం కనిపించింది. ఆ కప్ప దుస్తితికి తానే కారణం అని మధనపడుతూ ఆ చిరుజీవిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. తన వింటి బరువును మోస్తూ, అమితమయిన బాధను భరిస్తూ కూడా ఎందుకలా మౌనంగా వున్నావని ప్రశ్నించాడు. దానికా మండూకం జవాబు చెబుతూ - ‘సమస్త లోకాలను కాపాడే దేవదేవుడివి నువ్వు. ఏదయినా కష్టం వస్తే లోకులందరూ నీకే మొరబెట్టుకుంటారు. అలాటిది నీ బాణం కిందే నలిగిపోతున్న నేను, కాపాడవలసిందని ఇక ఎవర్ని వేడుకునేది?’ అని ఎదురు ప్రశ్న వేయడంతో శ్రీరాముడు అవాక్కయాడు.

మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బయి అయిదేళ్లు. స్వతంత్ర ఫలాలను భావితరాలకు భద్రంగా అప్పగించే పవిత్ర లక్ష్యంతో, బాబా సాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో సొంత రాజ్యాంగాన్ని రాసుకుని, దాన్ని కాపు కాయడానికి ఒకదానికి మరొకటి దన్నుగా మూడు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఇన్ని దశాబ్దాల స్వతంత్ర జీవనంలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా, ఎన్నెన్ని అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకున్నా, పార్లమెంటు, ఎక్జిక్యూటివ్, జ్యుడిషియరీ అనే ఈ మూడు వ్యవస్థలు రాజ్యాంగానికి లోబడి పనిచేస్తూ ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమన్న కలికితురాయిని భారత కీర్తి కిరీటానికి అమర్చిపెట్టాయి. ఈ మూడింటికీ చెదలుపట్టే పరిస్తితే దాపురిస్తే, నేనున్నానంటూ దీనజనానికి బాసటగా నిలబడే నాలుగో వ్యవస్థ మీడియా వుండనే వుంది. అందుకే దానికి ఫోర్త్ ఎస్టేట్ అన్న అనధికారిక నామం స్తిరపడింది.

అయితే, ఇటీవలి కాలంలో ఈ వ్యవస్థలన్నీ రాజ్యాంగం తమపై వుంచిన బాధ్యతలను పాటిస్తున్నాయా, కర్తవ్యాలను నెరవేరుస్తున్నాయా లేదా వాటినుంచి దూరంగా జరుగుతున్నాయా అన్న అనుమానం సామాన్య జనంలో కలుగుతోంది. బ్రోచేవాళ్ళే దోచేవాళ్ళుగా మారుతున్న విషాద పరిస్థితుల్లో భారతావని లోని అశేష జనావళి స్తితి రాముని కాలంనాటి కధలోని కప్పను తలపిస్తోంది.

ప్రజాధనాన్ని అప్పనంగా ఆరగిస్తున్న ప్రజాప్రతినిదుల అవినీతి కుంభకోణాలు తవ్విన కొద్దీ బయటపడడం, నియమనిబంధనల చట్రంలో వారిని వుంచాల్సిన బాధ్యత కలిగిన అధికారగణం సయితం అదే అవినీతి కూపంలో ఇరుక్కునిపోవడం, చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన న్యాయవ్యవస్త లోని కొందరు న్యాయకోవిదులు వృత్తి ధర్మానికి నిలువు పాతర చేసి చట్టానికి తమదైన రీతిలో భాష్యం చెబుతూ అవినీతి పరుల కొమ్ము కాయడం, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినప్పుడు వాటిని సరిదిద్దే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన మీడియా లోని అత్యధిక భాగం ఈ యావత్తు భాగోతంలో భాగం కావడం ఇవన్నీ అమృతోత్సవ్  జరుపుకున్న స్వతంత్ర భారతానికి అంటుకున్న మరకలు. కడిగినా వొదలని మురికి.

ఈనాటి పరిస్తితుల్లోని మరో విషాద కోణం ఏమిటంటే-

నిస్సిగ్గుగా లంచాలు మేస్తున్నవాళ్ళు అందుకు ఏమాత్రం సిగ్గుపడడం లేదు. ప్రజల డబ్బును తేరగా భోంచేసి త్రేనుస్తున్నవాళ్ళు అందుకు తత్తరపాటు పడడం లేదు. పైపెచ్చు అదొక హక్కుగా భావించి సమర్ధించుకుంటున్న తీరు మరింత బాధాకరం. విచారణ సంస్తల దర్యాప్తు క్రమంలో వెలుగు చూస్తున్న వాస్తవాలు జనాలను నివ్వెరపరుస్తున్నాయి. చివరకు నిగ్గుతేలే నిజాలు న్యాయస్తానాలలో ఏమేరకు నిలుస్తాయో ఆ దేవుడికే ఎరుక. ఎందుకంటె వ్యవస్థలోని లోపాలను పసికట్టి, వాటికి తగిన తరుణోపాయాలను కనిపెట్టి కాచుకోవడం ఎలాగన్నది అక్రమార్కులకు వెన్నతో బెట్టిన విద్య. ప్రజాధనం దోపిడీలో హెచ్చుతగ్గుల తేడాలే కాని అందరూ అందరే అన్న నగ్న సత్యాన్ని ఎవరికి వారే బయటపెట్టుకుంటున్నారు. కొన్ని అవినీతి పురాణాలు వెలుగు చూస్తున్న సందర్భాలను గమనిస్తుంటే, వాటివెనుకవున్న వ్యక్తులను చూస్తుంటే , వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి కంటే కూడా, తాముతిన్న దానికన్నా ఎదుటి పక్షం వారు నాలుగాకులు ఎక్కువ తిన్నారన్న దుగ్దే వారిని ఎక్కువగా బాధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలు ఒక స్తాయిని దాటిపోయి వెగటు కలిగిస్తున్నాయి. ఇక్కడ వ్యక్తులను పేరు పేరునా పేర్కొనాల్సిన పని లేదు. అందరూ ఓ తానులోని ముక్కలే. వీరందరూ ఈ గందరగోళ, అవాంఛిత పరిస్థితులు సృష్టించిన అష్టావక్రులే.

సమస్యతో సంబంధం వున్న పక్షాల్లో దేన్నో ఒకదానిని గుడ్డిగా సమర్ధించడం మినహా నిష్పక్షపాతంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి అవకాశం లేని స్తితి. మీడియాలో జరిగే చర్చల్లో కూడా అసలు అంశం వెనక్కు పోయి అనవసర విషయాలు తెరమీదకు వస్తున్నాయి. నిజాలకంటే నెపాలకు పెద్దపీట వేస్తున్నారు.

వీరంతా ఒకరిని మరొకరు నిందించుకుంటున్న తీరుతెన్నుల్ని చూసి ఆనందించడం కాదు ఈ రోజున మనం చేయాల్సింది. అందరం ఆలోచించాలి కూడా. ఎందుకంటె, మనం కూడా ఇలాటి అస్తవ్యస్త వ్యవస్థ నిర్మాణానికి ఏదో ఒకరూపంలో ‘రాళ్ళెత్తి’న కూలీలమే. ఈ దుర్దశ దాపురించడంలో మనకూ భాగం వుందని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన వాళ్ళమే.

ఈ సందర్భంలో, కొన్నేళ్ళక్రితం మన దేశానికి వచ్చిన ఒక విదేశీ యాత్రికుడు తన అనుభవాలను రాస్తూ పేర్కొన్న విషయాలను ప్రస్తావించడం సముచితంగా వుంటుంది.

భారత దేశానికి రాకముందు నేను నాస్తికుడిని. ఇక్కడకు వచ్చిన తరువాత క్రమక్రమంగా నా కళ్ళు తెరిపిళ్ళు పడడం మొదలయింది. ఈ దేశంలో బీదా బిక్కీ తాగుతున్న నీళ్ళు చూసిన తరువాత ఈ జనాలను ఏదో అదృశ్య శక్తి కాపాడుతోందన్న భావన నాలో ప్రబలింది. అలాటి మురికి నీళ్ళు తాగుతూ కూడా జనం ప్రాణాలతో మనగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఆ దేవుడి కృప లేనిది అది సాధ్యం కాదు. ఇక్కడి రోడ్లమీద వాహనాలు విచ్చలవిడిగా తిరుగాడుతున్న తీరుకు రోజూ ఎన్నో వందలమంది రోడ్డు ప్రమాదాలలో మరణిస్తూ వుండాలి. అలా జరగడం లేదంటే వీరిని భగవంతుడే కాపాడుతూవుండాలి.”

మచ్చలు పడ్డ ఇంతమంది రాజకీయ నాయకులు, లంచగొండిపరులయిన ఇంతమంది అధికారులు, భ్రష్టుపట్టిపోయిన ఇంతమంది న్యాయకోవిదులు, సంపాదనే లక్ష్యంగా కలిగిన ఇంతమంది మీడియా వారు, ఇందరు వున్నా కూడా దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా అంతో ఇంతో బతికే వుందంటే ఏదో అదృశ్య శక్తి మాత్రమే దేశాన్ని కాపాడుతున్నదని అనుకోవాలి.

కవికుల తిలకుడు  బాలగంగాధర తిలక్ తన కవితా ఖండిక ‘ప్రార్ధన’ లో కోరుకున్నట్టు,‘దేవుడా రక్షించు నా దేశాన్ని’.