30, జులై 2020, గురువారం

ఇదిగో ఇలాంటి రచనలే ఈనాటి అవసరం

 భయపెట్టే సమాచారం ఎందుకు? ‘భయపడకండి, నిబ్బరంగా ఎదుర్కోండి, నన్ను చూడండి’ అని ఉత్తేజపరిచే ఇటువంటి అనుభవాలు మీడియాలో ప్రముఖంగా, పత్రికల్లో మొదటిపుటల్లో రావాలి. గతంలో ఇద్దరి ముగ్గురి అనుభవాలు ఫేస్ బుక్ లో చదివాను. వారితో పెద్ద పరిచయం లేకపోవడం వల్ల, వాళ్ళు మహిళలు కావడం వల్ల షేర్ చేయలేకపోయాను. ఇతరుల పోస్టులను సాధారణంగా నేను షేర్ చేయను. కానీ ఇలాంటి రచనలు నలుగురికీ చేరాలి.
రామకృష్ణ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరగానే నాకూ ఒక మెస్సేజ్ పెట్టాడు. ‘నీ అనుభవాలు షేర్ చేయి రామకృష్ణా’ అని అడిగాను. చాలా సంతోషం అనిపించింది, ఇది చదవగానే.
ఇదిగో ఇలాంటి రచనలే ఈనాటి అవసరం. భయపెట్టే సమాచారం ఎందుకు? ‘భయపడకండి, నిబ్బరంగా ఎదుర్కోండి, నన్ను చూడండి’ అని ఉత్తేజపరిచే ఇటువంటి అనుభవాలు మీడియాలో ప్రముఖంగా, పత్రికల్లో మొదటిపుటల్లో రావాలి.
రామకృష్ణ ఆసుపత్రి నుంచి ఇంటికి చేరగానే నాకూ ఒక మెస్సేజ్ పెట్టాడు. ‘నీ అనుభవాలు షేర్ చేయి రామకృష్ణా’ అని అడిగాను. చాలా సంతోషం అనిపించింది, ఇది చదవగానే.

రామకృష్ణ కధనం:

“ఇంట్లోకి వచ్చి ఇంటిల్లిపాదినీ చుట్టేసింది
కరెక్ట్ గా నెల రోజుల క్రితం నాకు జ్వరం రావడంతో మొదలైన మా పాట్లు ఇవాళ్టి తో
తీరాయి.
మా ఇంటిల్లిపాదీ అనుభవించిన ఆర్డియల్ అంతా ఇంతా కాదు.
నెల రోజుల క్రితం నాకు జ్వరం రావడంతో మొదలైన మా టెన్షన్.. నాకు టెంపరేచర్ తగ్గకపోగా మరో మూడు రోజుల్లో నా భార్య శ్రీదేవి, అబ్బాయి రాహుల్ కి కూడా జ్వరం సోకడంతో పడిన హైరానా అంతా ఇంతా కాదు.
మరెందుకు జాప్యం చేయడం ఎందుకనుకుని నేను, శ్రీదేవి, రాహుల్, ఏ అనారోగ్య లక్షణాలు లేకపోయినా మా కోడలు సోనాలి.. టెస్ట్ లకు సిద్ధం అయ్యాం. అసలైన ఆర్డియల్ మొదలైంది.
ఈ నెల 2న టెస్ట్, రెండు రోజుల తరువాత నలుగురికీ పాజిటివ్, పాజిటివ్ అని తెలిసిన రోజు రాత్రి పడిన టెన్షన్, హాస్పటల్ అడ్మిషన్ కోసం ఎంత మందిని అడిగానో.. ఎవరూ నో అనరు కానీ సాయం చెయ్యలేని పరిస్థితి..మా ఆఫీసు వాళ్లు ఒక వైపు, నా చిరకాల మిత్రుడు దేవులపల్లి అమర్ ఇంకో వైపు, నా సోర్సెస్ ద్వారా నేను మరోవైపు.. ప్రయత్నాలు ఫలించకపోవడంతో నిరాశ.. పెరుగుతున్న టెన్షన్..
మా రమణ అన్నయ్య (Asian Institute of Gastroentrogy -AIGలో పేషెంట్స్ కేర్ మేనేజర్)పట్టు వదలకుండా చేసిన ప్రయత్నం ఫలించి వాళ్ల గచ్చిబౌలి హాస్పటల్ లో నాకు, శ్రీదేవికి అడ్మిషన్ ఇస్తామంటే.. రాహుల్, సోనుని వదలి ఎలా వెళ్లాలని మరో టెన్షన్.. మర్నాడు వాళ్లకు అడ్మిషన్ ఇప్పిస్తానని అన్నయ్య భరోసా ఇచ్చాక హాస్పటల్ కి బయలుదేరాం.
ఇంత టెన్షన్, బాధ, నిస్సహాయత మధ్య ఏదో ఒకటి తినాలికదా.. ఏ లక్షణాలు లేకపోయినా తనకు పాజిటివ్ వచ్చిందన్న షాక్ లో ఉన్న సోను తేరుకుని, అప్పటికప్పుడు మా ఇద్దరికీ అట్లు పోస్తే ఎలా తిన్నామో? హాస్పటల్ కి ఏమేమి తీసుకు వెళ్లాలి, మేం రెంట్ కి ఉంటున్న ఇంటి వాళ్లకి ఎలా చెప్పాలి.. వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో.. హాస్పటల్ కి వెళ్లేందుకు ట్రాన్స్ పోర్ట్ ప్రయత్నాలు.. మా ఆఫీసు వాళ్లు కూడా పాజిటివ్ కదా.. టాక్సీ వాళ్లు రారేమో (అప్పటికి రాత్రి తొమ్మిది) అన్న అనుమానం..
మరోవైపు.. రాహుల్.. మా ఇంటివాళ్ల అబ్బాయికి విషయం చెబితే.. అతగాడు పెద్ద మనసుతో అలాగా.. అనడమే కాకుండా ఏమైనా సాయం కావాలంటే చెప్పమంటే.. అతడిలో భగవంతుడు కనిపించాడు.. అరగంట లో వెహికిల్ (టాక్సీ ఏర్పాటు చేసుకున్నాం) రావడం.. తో బయలుదేరాం.
ఏఐజి గచ్చిబౌలిలో అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతూంటే మరేమీ చెయ్యలేక నేను, శ్రీదేవి బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలు.. ఇద్దరికి రూం ఇవ్వమని కోరితే... వేర్వేరు వార్డుల్లో ఇస్తున్నామని కోఆర్డినేటర్ చెప్పిన క్షణం పడిన వేదన.. ఆ వెంటనే తేరుకుని ఒకే రూం ఇచ్చే విషయం కన్సిడర్ చేయమని బతిమిలాడు కోవడం...అర్థరాత్రి దాటి ఒకటిన్నర సమయంలో ఓకే ఇద్దరికీ ఒకే రూం ఇస్తున్నట్టు చెప్పడంతో హమ్మయ్య అనుకుంటూ వదిలిన నిట్టూర్పు...అడ్మిట్ అయిన మరు క్షణం నుంచి ట్రీట్మెంట్ కి అవసరమైన వైద్య ప్రక్రియ మొదలుకావడంతో కాస్త కుదుటపడ్డా ఇద్దరి ఆలోచనలు ఇంట్లో ఉన్న అబ్బాయి, కోడలు గురించే... పాపం ఎలా ఉన్నారో అనే...
మా అదృష్టానికి మర్నాడు వాళ్లిద్దరికి అడ్మిషన్ ఇవ్వడమే కాదు.. ఒకరికొకరు తోడు ఉండడానికి వీలుగా ఓకే రూం అలాట్ చేయడం తో ముందు రోజు రాత్రి నుంచి పడిన టెన్షన్ తగ్గింది.
ఏఐజి ది గ్రేట్.. సర్వీస్, అటెన్షన్.. ట్రీట్మెంట్.. మెడికల్ టీం మిరాకిల్.. వెంటనే కోలుకోవడం మొదలైంది..మా అబ్బాయి, కోడలు నాలుగు రోజుల్లో డిశ్చార్జి అయితే నేను, శ్రీదేవి పూర్తిగా కోలుకుని తొమ్మిది రోజుల్లో ఇంచక్కా ఇంటికి వచ్చేశాం.
మేం హాస్పటల్ ఉండగానే మా ఆరోగ్యం గురించి ఫోన్ చేసి వాకబు చేసిన మాతో పాటు మా బిల్డింగ్ లో మరో రెండు పోర్షన్స్ లో రెంట్ కు ఉంటున్న కుటుంబాల వారు..మా పట్ల ఎంతో కన్ సర్న్ చూపించి.. ఏ హెల్ప్ కావాలన్నా తామున్నామని ఇచ్చిన భరోసా మర్చిపోలేనిది.
డాక్టర్స్ సూచించిన15 రోజుల హోం క్వారంటైన్ ఈ సోమవారం తో ముగియడంతో, కట్టడి చేసిన కరోనాని తరిమి కొట్టేమా లేదా నిర్ధారించుకోవడానికి నిన్న మరోమారు కోవిడ్ పరీక్ష లు చేయించుకున్నాం. ఇవాళ ఉదయం మా నలుగురిని ఆవరించిన కరోనా కనుమరుగైందంటూ.. నెగిటివ్ ఫలితం రావడంతో.. ఆ సంతోషం అందరితో పంచుకుంటున్నాను.
బిఎస్ రామకృష్ణ (BSR).
30-07-2020 – గురువారం”

Image may contain: 4 people, including Ramakrishna Buddhavarapu, people standing

29, జులై 2020, బుధవారం

పేర్ల పురాణం –

ప్రభుత్వాలు మారినప్పుడల్లా పధకాల పేర్లు మారడం అందరికీ తెలిసిందే. పధకాలు కాకుండా ప్రభుత్వ శాఖల పేర్లు కూడా మారిపోవడం కూడా కొత్తేమీ కాదు. కొత్తగా మోడీ ప్రభుత్వం కేంద్రంలోని మానవ వనరుల అభివృద్ధి శాఖను విద్యా మంత్రిత్వ శాఖగా మారుస్తూ నిర్ణయించింది. సమగ్ర జాతీయ విద్యా విధానానికి రూపకల్పన చేసిన పిమ్మట దాని అమలుకోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఒకరకంగా చెప్పాలంటే ఈ శాఖకు దాని పూర్వ నామమే దక్కింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి విద్యా మంత్రిత్వ శాఖగా ఉంటూ వస్తున్న ఈ శాఖ పేరును రాజీవ్ గాంధి ప్రధానమంత్రి అయినప్పుడు మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. అప్పటికే అనేక కీలకమైన శాఖలు నిర్వహించిన పీవీ. నరసింహారావు గారిని ఈ శాఖకు మంత్రిని చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు, పీవీ గారంతటి సీనియర్ కు ఇంతటి అప్రధాన శాఖ ఏమిటని. రాజీవ్ గాంధి ఆ శాఖ పేరును కూడా  మానవ వనరుల అభివృద్ధి శాఖగా మార్చారు. పీవీ గారు ఆ శాఖను ఎంత సమర్ధవంతంగా తీర్చిదిద్దారు అంటే చివరకు అది కేంద్ర ప్రభుత్వంలోని అతి కీలక మంత్రిత్వ శాఖల్లో ఒకటిగా మారిపోయింది.

ఇటువంటి ఘటనలు పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జరిగాయి. సమాచార, పౌర సంబంధ శాఖను ఉన్నట్టుండి సమాచార, జన సంబంధ శాఖగా మార్చారు. అంటే పౌర అనే పదం తీసేసి జన అనే పదం చేర్చారు. కానీ రాజధాని నుంచి జిల్లాల వరకు ఆ శాఖ కార్యాలయాల బోర్డులను, లెటర్ హెడ్లను, ఆఖరికి అధికారిక స్టాంపులను మార్చాల్సి వచ్చింది.

మళ్ళీ చాలా కాలం  తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభువులకు ఆ పేరు నచ్చలేదు. తిరిగి సమాచార, పౌర సంబంధ శాఖగా మారిపోయింది.

చిత్రం ఏమిటంటే ఆ శాఖ పేరులోనే పౌర సంబంధాలు. నిజానికి ఆ అధికారులు నెరిపేది పత్రికా సంబంధాలు.

(29-07-2020)

27, జులై 2020, సోమవారం

వీళ్ళను భయపెట్టడం నా వల్ల కాదు - కరోనా మన్ కి బాత్


కరోనా రాకచూసి మిగిలిన వ్యాధులన్నీ సర్దుకు కూర్చున్నాయి.

‘ఏమిటలా వున్నావు’ ధైర్యం చేసి అడిగింది కలరా నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ.

‘ఎలా ఉండను? నిన్న మొన్నటిదాకా మొత్తం ప్రపంచాన్ని గడగడలాడించానని విర్రవీగాను’

‘ఇప్పుడు మాత్రం ఏమైంది? నీ నామ స్మరణ చేయకుండా భూలోకవాసులకు క్షణం గడవడం లేదు కదా!’ అన్నది హెచ్.ఐ.వి.

‘నేనూ అలాగే అనుకున్నాను. ఈ సృష్టి ప్రారంభం అయిన తర్వాత యావత్ ప్రపంచ ప్రజల నోళ్ళలో నా పేరు ఎన్ని కోట్లమారు మారుమోగుతున్నదో చూసి నేనూ పులకరించిపోయాను. వాళ్ళు నా పేరు వింటేనే ఎంతగా భయపడుతున్నారో కళ్ళారా చూసి పొంగిపోయాను. కానీ అది భయం కాదనీ, వాళ్ళు నాతో పరాచికాలు ఆడుతున్నారనీ ఇపుడిప్పుడే గ్రహింపుకు వచ్చి సిగ్గుపడుతున్నాను’

‘అదేమిటే అలా అంటున్నావు. నువ్వు కదా మా అందర్నీ చూస్తుండగానే మించిపోయావు.  నీ పేరు వింటేనే వణికిపోయేలా మానవుల్ని మార్చగలిగావు అని మేమిక్కడ అసూయతో రగిలిపోతుంటే ఏమిటిది ఇలా నీ ఈ మాటలతో మమ్మల్నిలా మళ్ళీ  సంతోషపెడుతున్నావు’ అంది ఎబోలా.

‘అలానా! నేను రంగ ప్రవేశం చేసిన తర్వాత మీకెవ్వరికీ సరైన పనిపాటలు లేకుండాపోయాయి కదా! ఆ ఖాళీ టైములో మీరు కాస్త పత్రికలు చదివితే, కొంచెం టీవీలు చూస్తే విషయం బోధపడేది’

‘పత్రికలూ, టీవీలు అంటూ మమ్మల్ని భయపెట్టకు. మేము ఇంతమందిమి కలిసి చేయలేని అపకారాన్ని అవి ఒంటిచేత్తో మానవాళికి చేస్తున్నాయి. అసలేం జరిగిందో నువ్వే చెప్పు, వింటాం’ అంది కేన్సర్.

‘మనుషులకు చావు భయాన్ని మించిన భయం వుండదు అనే ధీమాతో నేను భూలోకంలో అడుగుపెట్టాను. మొదట్లో నా అభిప్రాయం నిజమే అనిపించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళు మళ్ళీ తమ మునపటి వ్యవహారాల్లో మునిగి తేలుతున్నారు. చావు ముంగిట్లో వుందని తెలిసి కూడా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తూనే వున్నారు. చనిపోతే కట్టుకుపోయేది ఏమీ ఉండదని తెలిసికూడా ఆన్ లైన్ మోసాలతో ఇతరులని దోచుకుంటూనే వున్నారు. కరోనా బారిన పడితే రేపు మనది కాదు అనే భయం ఎటు పోయిందో తెలవదు ఎప్పుడో నాలుగేళ్ళకు వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎలాగా, ప్రత్యర్ధిని ఓడించడం ఎలాగా అని మల్లగుల్లాలు పడుతున్నారు. దొంగతనాలు, దోపిడీలు జరుగుతూనే వున్నాయి. భూఆక్రమణలు మునుపటి కంటే ఎక్కువయ్యాయి. డబ్బు పోగేసుకోవడం ముమ్మరమయింది. మరణభయంతో జనంలో అత్యాశ లేకుండా పోతుంది అనుకుంటే ఆ కక్కుర్తి మరీ ఎక్కువయింది. తింటున్నారు, తాగుతున్నారు, క్వారంటైన్లలో చిందులేస్తున్నారు. వైద్యం చేయడానికి లక్షలు గుంజుతున్నారు. చనిపోతే శవాన్ని అప్పగించడానికి డబ్బులు లాగుతున్నారు. నిజం చెప్పాలంటే నా రాకకు ముందుకంటే కూడా ఇప్పుడు ప్రపంచం మరీ పాడయిపోయింది.

ఇన్నిరోజుల అనుభవంతో చెబుతున్నా వినండి. కరోనా అంటే భయం కంటే డబ్బు అంటే మమకారమే వాళ్లకు ఎక్కువ అని తేలిపోయింది’              


26, జులై 2020, ఆదివారం

వీరీ వీరీ గుమ్మడిపండు వీరీ పేరేమీ



ఫేస్ బుక్ మిత్రులు కప్పగంతు శివరామ ప్రసాద్ గారు వస్తుతః రేడియో అభిమాని. రేడియో అంటే ఆకాశవాణి. దానికి సంబంధించిన చాలా సమాచారం సేకరించి పెట్టుకున్నారు. ఈ మధ్య నాకు వాట్సప్ లో ఓ పాత గ్రూపు ఫోటో పంపారు. అది 1969 నాటి ఫోటో. అలనాటి రేడియో ధిగ్గజాలు అనేకమంది అందులో వున్నారు. శివరామ ప్రసాద్ గారికి తెలిసిన  పుణ్యాత్ములు, ఫిరంగిపురానికి చెందిన టి. శ్యాం నారాయణ గారు ఈ తెలుపు నలుపు ఫొటోకు రంగులు అద్దారు. దాన్ని నేను ‘ఒకనాటి స్వరచరులు’ అనే రేడియో గ్రూపులో షేర్ చేసాను. విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన ప్రయాగ వేదవతి గారు  తమ సహజ ధోరణిలో వేగంగా స్పందించారు. ఆ ఫొటోకు సంబంధించిన వివరాలు తెలియచేశారు.

అరవై ఒక్క ఏళ్ళ క్రితం బెజవాడ రేడియో స్టేషన్ లో పనిచేసిన  కందుకూరి రామభద్రరావు గారు, ప్రయాగ నరసింహ శాస్త్రి గారు (వేదవతి గారి తండ్రి) పదవీ విరమణ సందర్భంగా తీసిన ఫోటో అది. వేదవతి గారి సమాచారం ప్రకారం ఈ కింది ఫోటోలో :

ముందు వరసలో కింద కూర్చున్న వారు (ఎడమ నుంచి): ఏ. కమల కుమారి, వి.బి. కనకదుర్గ, శ్రీరంగం గోపాల రత్నం, వి. నాగరత్నం, వింజమూరి లక్ష్మి, బీ.టీ. పద్మిని, పద్మినీ చిత్తరంజన్  గార్లు.

కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు (ఎడమ నుంచి) : అన్నవరపు రామస్వామి, ఎల్లా సోమన్న, ఓలేటి వెంకటేశ్వర్లు, కందుకూరి రామభద్రరావు, ప్రయాగ నరసింహ శాస్త్రి, జి.వి. కృష్ణారావు, రాచకొండ నరసింహమూర్తి, ఎన్.సి.హెచ్. కృష్ణమాచార్యులు గార్లు.

వారి వెనుక నిలబడిన వారు (ఎడమనుంచి): రామవరపు సుబ్బారావు, కనకారావు (అని గుర్తు), ఏ.ఎస్.వి. కుటుంబయ్య, దండమూడి రామ్మోహన రావు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, ఉషశ్రీ, ఎం.వి. వాసుదేవమూర్తి, సి. రామ్మోహనరావు, జి.ఎం. రాధాకృష్ణ, కనకారావు, చల్లపల్లి కృష్ణమూర్తి, వి. చార్లెస్, క్రొవ్విడి సీతారాం గార్లు.

వారి వెనుక చివరివరసలో నిలబడిన వారు: (ఎడమనుంచి): మొదటి వ్యక్తి తెలియదు. నండూరి సుబ్బారావు, పాండురంగరాజు, సుందరపల్లి సూర్యనారాయణ, ఎన్.సీ.వీ. జగన్నాధాచార్యులు, ఏ. లింగరాజు శర్మ, ఏ.బీ. ఆనంద్, వై. సుబ్రహ్మణ్యం (ఫ్లూట్), వై. సత్యనారాయణ రావు (వీరు కొద్ది రోజులు అనౌన్సర్ గా పనిచేసారు) ఈ వరసలో కూడా చివరి వ్యక్తి తెలియదు.

చాలా కాలం అయినందువల్ల కొందరి పేర్లు పొరబాటు పడితే మన్నించమని కూడా వేదవతి గారు కోరారు.

గమనిక : నేను విజయవాడ రేడియోలో ఎప్పుడూ పనిచేయలేదు. అప్పుడప్పుడూ వార్తావిభాగానికి వచ్చి పనిచేసినా ఉదయం వార్తల వరకే. కాబట్టి నా టైపింగులో ఏమైనా పొరబాటు దొర్లితే క్షంతవ్యుణ్ణి (తప్పులు ఎత్తి చూపితే దిద్దుబాటుకు అవకాశం వుంటుంది.