12, డిసెంబర్ 2017, మంగళవారం

దొరకని పుస్తకంలో విజయవాడ – భండారు శ్రీనివాసరావు (మూడో భాగం)


(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)
మితృడు రమణ ఈ పుస్తకానికి విజయవాడ వీధుల కధలు అని ఎందుకు పేరు పెట్టాడో తెలియదు కానీ ఇందులో విజయవాడ విశేషాలే ఎక్కువగా వున్నాయి. ఇందులో బెజవాడ వద్ద కృష్ణానదిపై కట్టిన ఆనకట్టతో మొదలయిన ప్రకాశం బరాజ్  కధ ప్రధానమైనది. అదిలా సాగింది.
“ప్రధానమైన నిర్మాణాలన్నీ మాయా మంత్రాలతో నిర్మించినవి కావు. వాటి వెనుక అనేకమంది త్యాగం వుంది. చిందించిన స్వేదం వుంది. కాటన్ దొర కృష్ణపై ఆనకట్ట నిర్మించిన నూరేళ్ళకు ప్రకాశం బరాజ్ కధ మొదలయింది. 1855 లో ఆ ఆనకట్టను కాటన్ మహాశయుడు నిర్మించి ఇచ్చాడు. దరిమిలా దానికింద ఆయకట్టు విస్తీర్ణం అయిదు లక్షల ఎనభయ్ వేల ఎకరాల నుంచి బాగా పెరుగుతూ వచ్చింది. తదనుగుణంగా ఆనకట్ట ఎగువన ఏర్పాటు చేసిన మూడు అడుగుల  తలుపుల ఎత్తును ఆరడుగుల వరకు పెంచుతూ పోయారు. అవి 1925 నుంచి 1954 వరకు నమ్మకంగా  పనిచేశాయి. ఎనిమిది అడుగులకు పెంచాలని ఆలోచన చేస్తున్న సమయంలో 1954 సెప్టెంబరులో కృష్ణకు వరదలు వచ్చాయి. ఆ నెల నాలుగో తేదీ సాయంత్రం ఆనకట్ట బయట గోడకు పెద్ద గండి పడింది. క్రమంగా గండి వెడల్పు 70 అడుగుల నుంచి  134 అడుగులకు పెరిగింది. దిగువ ప్రాంతాలన్నీ ఆకస్మిక వరద ముంపుకు గురయ్యాయి. అప్పటి సూపరింటెండింగ్ ఇంజినీరు వేపా కృష్ణ మూర్తి గారు ఉన్నతాధికారులతో చర్చలు జరిపి గండి స్వరూప స్వభావాలు తెలుసుకునేందుకు పడవలో వెళ్లాలని నిర్ణయించారు. ఇంజినీర్లు, లస్కర్లు అంతా ఒక పెద్ద పడవలో బయలుదేరారు. తిన్నగా గండి వద్దకు చేరుకున్నారు కానీ ఏమైందో ఏమో పడవతో సహా అందరూ వరదలో కొట్టుకు పోయారు. అయినా ఇంజినీర్లు ప్రయత్నం మానలేదు. చీఫ్ ఇంజినీరు జి.ఏ. నరసింహారావు గారు పెద్ద పెద్ద పంటుల మీద బ్రహ్మాండమైన బండ రాళ్ళు పెట్టి, గండికి ఎగువన ఫర్లాంగు దూరంలో లంగరు వేసిన స్టీమరుకు పంటును కట్టాలని,  సమయం చూసి పంటుకు రంధ్రాలు పెట్టి, అది మునిగిపోయేలోగా ఇనుప తాళ్ళను తెంచి వేయాలనీ అలా చేస్తే పంటు సరిగ్గా గండి వద్దకు వచ్చి మునిగి పోతుందనీ ఆ విధంగా గండికి అడ్డుకట్ట వేయవచ్చనీ నిర్ణయించారు. చివరికి వారి ప్రయత్నం ఫలించింది. గండిని పూడ్చి వేయడం జరిగింది.
అరవై ఏళ్ళకు పూర్వమే తెలుగు ఇంజినీర్లు ప్రదర్శించిన అసమాన ప్రతిభకు ఇది తార్కాణం.

(ఇంకా వుంది)      

దొరకని పుస్తకంలో విజయవాడ – (రెండో భాగం)


(విజయవాడ వీధుల కధలు – రచన: లంక వెంకట రమణ)
“బోధిసత్వ మైత్రేయుడు  బెజవాడ దగ్గర ఒక కొండపై జ్ఞానోదయం కోసం తపస్సుచేసి, అక్కడే శరీరం వదలివేసాడని రాబర్ట్ సువెల్, రాయల్ ఏషియాటిక్ సొసైటీ (లండన్) 1884 పత్రికలో రాశాడు.
బుద్ధుడు నిర్యాణం చెందిన తర్వాత మంజుశ్రీ గా జన్మించాడని, మైసోలియా (నేటి మచిలీపట్నం) నగరానికి త్రిపిటకాలు సంపాదించడం కోసం వెళ్లి తిరిగివస్తూ, దారిలో కొండ మీద గొప్ప తేజస్సు చూసాడని మంజుశ్రీ మూలకల్పంలో వుంది. శిష్యులు కనుగొనలేని ఆ రహస్యాన్ని చేధించేందుకు మంజుశ్రీ యోగమార్గంలో ఆ కొండ మీద వెలుగు వచ్చిన ప్రదేశానికి వెడతాడు.
ఆ క్రమంలో ఇంద్రకీలం మీద కొలువున్న కనకదుర్గాదేవి అంతరాలయం చేరతాడు. అక్కడ ఆ మహాపురుషుడికి తారాదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ తల్లిని చూడగానే ధ్యానం మొదలుపెడతాడు. కానీ, మనసు నిలవదు. మన్మధ ప్రకోపం మొదలవుతుంది. ధ్యాన యోగులకు ఇటువంటి అవక్షేపం సహజమే! మహాయోగి అయిన మంజుశ్రీ మన్మధ లీలను చూసి మార దమన మంత్రాన్ని చదువుతాడు. మన్మధుడు కనబడగానే ‘ఈ కొండ మీద ధ్యానం చేసుకునే యోగుల మనస్సులను వికారం చేయకుండా ఈ కొండలోనే బందీవై పోవాల’ని శపిస్తాడు. నిజానికి ఇది హిందూ పురాణాలలోని ఇంద్రనీలుని కధను పోలివుంది. ఆ సంగతి ఎలా వున్నా మంజుశ్రీ తన ధ్యానాన్ని ముగించుకుని పోతాడు. ఈ వృత్తాంతం మంజుశ్రీ మూలకల్పంలోని మార దమన సూత్రాలలో వుంది. ఆచార్య నాగార్జునుడు కూడా బెజవాడ వచ్చి ఈ కొండ మీద తారాదేవిని దర్శించాడని లంకావతార సూత్రాలకు వ్యాఖ్యానం చేసిన మహాయాన ఆచార్యులు తమ కారికల్లో పేర్కొన్నారు.
ఏతావాతా తేలేదేమిటంటే, 1300 సంవత్సరాలకు పూర్వం బెజవాడలో బౌద్దుల ప్రాబల్యం బాగా వుండేది. దుర్గామాత తారాదేవిగా పూజలు అందుకునేది.
ఏ పండితుడు ఏమన్నా, బెజవాడ నగరాన్ని హువాన్ చాంగ్ సందర్శించి అద్భుతమైన భావావేశం పొందాడు. ‘తారా తారా తత్తారా తారం తారం తత్తారం తారం’ అంటే ఏమిటో మంత్రోపదేశం పొందిన వారికి తెలుస్తుంది. ఎవరి నుంచి ఎప్పుడు ఆయన ఆ ఉపదేశం పొందాడో తెలియదు కాని, బెజవాడ మాత్రం హువాన్  చాంగ్  ని మరిచిపోయింది.
ఈ సందర్భంలోనే నేటి కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో లభించిన నాగార్జునాచార్యుని శాసనం గురించి, ఘంటసాల శాసనం గురించీ చెప్పుకోవాలి. ఈ రెండింటి లోను భదంత నాగార్జునుడి ప్రస్తావన వుంది. ‘స్వస్తి భదంత నాగార్జునా చార్యస్య’ అంటూ ప్రారంభం అయ్యే ఈ శాసనం ద్వారా ఆయన బౌద్ధ మతాచార్యుడని స్పష్టమౌతున్నది.”
(ఇంకా వుంది)

11, డిసెంబర్ 2017, సోమవారం

దొరకని పుస్తకంలో విజయవాడ


నాలుగున్నర దశాబ్దాల క్రితం. విజయవాడ లబ్బీపేట ఆంద్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. లంక వెంకట రమణ నా సహోద్యోగి. ఏమి చదివాడో తెలియదు కాని ఆంద్ర ఆంగ్ల భాషల్లో కొట్టిన పిండి. మధ్యాన్న భోజన సమయంలో దగ్గరలో వున్న మా ఇంటికి పోయే వాళ్ళం. ఒక్కటే గది. కుర్చీలు, మంచాలు ఉండేవి కావు. ఆ గదిలోనే  నా భోజనం. ఆయన అక్కడే చాప మీద  వరద రాజస్వామిలా పడకేసి, తలకింద మోచేయి పెట్టుకుని  అనేక కబుర్లు చెబుతూ ఉండేవాడు. ఆ భాషణలో చక్కని ఇంగ్లీష్ పద ప్రయోగాలు దొర్లేవి.
ఆఫీసులో గుర్రపు నాడా ఆకారంలో ఒక బల్ల వుండేది. పనిచేసుకుంటూ ప్యూన్ నాగేశ్వర రావుతో చీటీలు పంపుకునే వాళ్ళం. “ఒక పాతిక సర్దుతారా, ఇరవైన అడ్వాన్స్ తీసుకోగానే ఇచ్చేస్తాను” అనే అభ్యర్ధనలు వాటిల్లో  ఉండేవి. అంతమాత్రం డబ్బు ఎవరి దగ్గరా ఉండదని తెలుసు. అయినా అడక్క తప్పని అవసరాలు. అందరివీ ఒకే అవసరం కనుక ఒకరంటే మరొకరికి జాలి. అందుకని, ‘లేదు’ అనకుండా మరో చీటీ మీద “ఓ యాభయ్ సర్దుతారా” అని రాసి దాన్ని సీనియర్ సబ్ ఎడిటర్ ఉపేంద్ర బాబుకు పంపేవాళ్ళం. ఆయన ఆ చీటీలోనే ఓ యాభయ్ నోటు వుంచి తిరిగి పంపేవాడు. అందులో సగం వుంచేసుకుని మిగిలిన పాతిక ముందు అడిగిన వాడికి సర్దుబాటు చేసేవాళ్ళం. ఈ చక్రభ్రమణం ప్రతినెలా సాగేది. ఇదిగో! ఈ ‘లేని’ తనమే మా స్నేహాన్ని గట్టిగా నిలిపి ఉంచింది. అందరం ఇదే బాపతు కనుక ఇక అసూయలకు ఆస్కారమే వుండేది కాదు.


Image may contain: 1 person

ఇక అసలు విషయానికి వస్తాను. తరువాత మా దారులు వేరయ్యాయి. నేను హైదరాబాదులో రేడియోలో, ఆయన విజయవాడలోనే ఆంద్రప్రభలో కొత్త జీవితాలు మొదలు పెట్టాము. దరిమిలా పాతికేళ్లలో మేమిద్దరం కలుసుకున్నది ఒకటి రెండు సార్లే.
ఈ మధ్య ఇల్లు మారినప్పుడు పుస్తకాలు సర్దుతుంటే రమణ రాసిన ‘విజయవాడ వీధుల కధలు’ అనే పుస్తకం కనబడింది. చిన్న పుస్తకం అయినా చదవదగిన ఎన్నో విశేషాలు వున్నాయి. 2000 సంవత్సరంలో  ‘భారతి’ సాంస్కృతిక సంస్థ వారు ప్రచురించారు. ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలవదు. (రేడియోలో నా సీనియర్ సహచరులు ఎం.వి.ఎస్. ప్రసాద్ గారు చెప్పాలి, ఎందుకంటే ఇందులో వారి ప్రస్తావన వుంది)
ఈ పుస్తకం నుంచి కొన్ని ఆసక్తికర విషయాలు కింద పొందుపరుస్తున్నాను.
“హువాన్ చాంగ్ చూసిన బెజవాడ”
చైనా యాత్రీకుడు హువాన్ చాంగ్ క్రీస్తు శకం 730లోభారత దేశానికి వచ్చాడు. దేశంలో పర్యటిస్తూ 739లో బెజవాడ చేరుకున్నాడు. తను చూసిన ప్రతిదీ ఆయన గ్రంధస్తం చేసారు. అప్పుడు బెజవాడ ‘తె – న – క – చ – క’ అనే దేశంలో ఉండేదట. ఈ తెనకచక చాళుక్య రాజ్యంలో వుండేది. ‘తె – న – క – చ – క’ ను సంస్కృతీకరిస్తే ధాన్యకటకం అవుతుంది. అంటే నేటి అమరావతి (ప్రస్తుతం రాజధాని అమరావతి కాదు). అప్పటి  తెనకచక దేశానికి బెజవాడ రాజధాని. హువాన్ చాంగ్ ప్రకారం అప్పటి మనుషులు చాలా బలిష్టంగా, నల్లగా, మొరటుగా వుండేవాళ్ళు. బౌద్దోపాసకులు బెజవాడ, సీతానగరం, ఉండవల్లి గుహల్లో నివసించేవాళ్ళు. రాత్రి వేళల్లో ఆ సంఘారామాలు బారులు తీరిన దీపాలతో కనుల పండుగగా కానవచ్చేవని చైనా యాత్రీకుడు వర్ణించారు. దక్షిణంగా ఉన్న కొండపై భావ వివేక స్వామి తపస్సు చేసుకున్నాడని ఆయన రాసారు. భావ వివేకుడు కృష్ణా జిల్లా వాడు. ఆయన ధారణి సూత్రాలు తెలుసుకున్నాడని బౌద్ధ గ్రంధాలు చెబుతాయి.  
ఇంకో విచిత్రమైన విషయం నూట యాభయ్ ఏళ్ళ క్రితం బెజవాడ జనాభా ఎనిమిది వేలకు పై చిలుకు. అదే పదిహేను వందల ఏళ్ళకు పూర్వం ఆ పట్టణ జనాభా లక్షకు పైమాటే. విదేశీ వర్తకులతో కిటకిట లాడిన వాణిజ్య నగరం. కృష్ణలో విదేశీ నౌకలు బెజవాడ వరకు వచ్చేవి. రోమన్, గ్రీకు నాణేలు పలుచోట్ల లభించడం ఇందుకు దృష్టాంతంగా చెబుతారు. ఇక్కడి నుంచి విదేశాలకు తోళ్ళు, రత్నాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి అయ్యేవి.
ఈ పట్టణానికి అనేక పేర్లు ఉండేవి. బిజియివాడ, విజియివాడ, బెజవాడ, కనకవాడ, బీజవాడ, బెజ్జంవాడ, వెచ్చవాడ, పెచ్చవాడ, విజయవాటిక, మల్లికార్జున మహాదేవ పురం, విజయవాడ ఇలా ఎన్నో. అయినా చరిత్రలో చిరకాలం బెజవాడ అనే పేరే నిలిచింది. విజయవాడ అనే ఇప్పటి పేరు కూడా పన్నెండవ శతాబ్దంలో వాడుకలో వుండేది. ఇక్ష్వాకులు, శాలంకాయనులు, విష్ణు కుండినులు, రాష్ట్ర కూటులు, చాళుక్యులు, చోళులు, తెలుగు చోడులు, రెడ్డి రాజులు, కాకతీయులు, గజపతులు, దుర్జయులు, నరపతులు, నవాబులు, మండలేశ్వరులు, మహా  మండలేశ్వరులు, త్యాగి వంశీయులు, ఇంకా అనేకానేక రాజవంశాల ఏలుబడిలో ఉండేది.
హువాన్ చాంగ్ తో పాటు, ఫాహియాన్, భావదేవర, దిగ్నాగ, మహాపద్మనంద, ఆదిశంకరాచార్య, మహాత్మా గాంధి వంటి వారు ఈ నగరాన్ని దర్శించారు.

(షేర్ చేసే వారికి ఒక ప్రగాఢ విజ్ఞప్తి. రమణ గారు ఎంతో కష్టపడి శ్రమించి, తన శక్తికి మించిన కార్యం నెత్తికెత్తుకుని పూర్తి చేసారు. ఆయన ఏమీ కలిగిన వాడు కాదు. ఇది చెప్పడానికే   ముందు ఉపోద్ఘాతం రాశాను. రమణ గారు ఇప్పుడు ఎలాగూ లేరు, కనీసం ‘కీర్తి’ అయినా ఆయనకు దక్కనివ్వండి)       

సత్సంగంలో సమస్యాపూరణం

  
“అహం వైశ్వానరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః  పచామ్యన్నం చతుర్విధం”
(శ్రీ మద్భగవద్గీత, పంచ దశాధ్యాయం,  పురుషోత్తమ ప్రాప్తి యోగము)   
తాత్పర్యం: నేను వైశ్వానరుడు అను పేరు గల జఠరాగ్నినై, సకల ప్రాణుల శరీరములయందు ప్రవేశించి, జఠరాగ్నిని  ప్రజ్వలింప చేసే ప్రాణాపానములనే వాయువులతో కలిసి, భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యములనే నల్లుగు విధములైన ఆహారమును పచనము చేయుచున్నాను.
ఇప్పుడీ గీతా ప్రవచనం ఎందుకంటే నేను ఓ యాభయ్ అరవై ఏళ్ళు వెనక్కి పోవాలి.


(కీర్తిశేషులు భండారు రుక్మిణమ్మ గారు)

నా చిన్నతనంలో మా బామ్మగారు రుక్మిణమ్మ గారు ప్రతిరోజూ అపరాహ్ణకాలంలో భోజనానికి కూర్చున్నప్పుడు మొదటి ముద్ద చేతిలో పట్టుకుని ఈ గీతా వాక్యాన్ని చదివేది. అది ఎందుకు చదివేదో నాకు అర్ధం అయ్యేది కాదు. ఆ శ్లోకం పూర్తి పాఠం కూడా నాకు గుర్తులేదు, అక్కడక్కడ ఒకటి రెండు పదాలు మినహా.
నిన్న మా మేనల్లుడు రామచంద్రం ఇంటికి వెళ్ళినప్పుడు నాకు గుర్తున్న ఆ ఒకటి  రెండు పదాలు ( ‘అహం వైశ్వా..... పచామ్యన్నం...... చతుర్విధం...) గురించి అడిగాను. అతడు వెంటనే ఈ పదాలు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినవని చెప్పి టీకాతాత్పర్యాలు వివరించాడు.

అరవైఏళ్ళుగా నా మనసును తొలుస్తున్న సమస్యకు పరిష్కారం దొరికింది.                     

7, డిసెంబర్ 2017, గురువారం

జర్నలిష్టులకు మొదటి పాఠం


1970. అంటే నలభయ్ ఏడేళ్ళ నాటి ముచ్చట.
బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరిన తొలి రోజులు. ఎడిటర్ నార్ల గారు హైదరాబాదుకు మకాం మార్చడంతో నండూరి రామమోహన రావు గారే పత్రిక బాధ్యతలు చూస్తున్నారు.
“ఏం రాయమంటారు?”
నండూరి వారికి నా ప్రశ్న.
“ఏదైనా రాయండి, ఏమి రాసినా అది  మీకు  ముందు అర్ధం అయిందా లేదా చూసుకోండి”

నండూరి వారి జవాబు. 

26, నవంబర్ 2017, ఆదివారం

పిల్లి శాపాలకు ఉట్లు తెగుతున్నాయి – భండారు శ్రీనివాసరావు


మూడేళ్ళ క్రితం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆ యాత్రానుభవాలను గురించి నాడు ‘సూర్య’ దినపత్రికలో రాసిన వ్యాసం నుంచి చిన్న పేరా:
“ తిరుమల గర్భ గుడి నుంచి బయటకు వచ్చిన తరువాత భక్తుల అసలు కష్టాలు మొదలవుతాయి. అధికారులువీ ఐ పీ లను తీసుకువచ్చి మళ్ళీ తీసుకుపోయే వాహనాలు గుడి దరిదాపుల దాకా వస్తాయి. కానీ సామాన్య భక్తులు  మాత్రం పాదరక్షలతో  ఎండలో, వానలో మాడ వీధులలో తిరుగాడరాదు. ఇందులో తప్పు పట్టేది ఏమీ లేదు. గుడిలోకి ప్రవేసించే భక్తులు పాదరక్షలు విడిచే ప్రదేశం ఒకటి, బయటకు వచ్చే చోటు మరొకటి. గుడి బయట పరచిన బండలనండిఇంకోటి అనండి వాటిమీద నడుస్తుంటే అరికాలిమంట నెత్తికెక్కుతుంది. పాలకమండలి సభ్యులుఅధికారులు ఒక్కటంటే ఒక్కసారి చెప్పులు లేకుండా గుడి చుట్టూ తిరిగివస్తే బాగుంటుంది అని కూడా  అనిపిస్తుంది.
అయినా పిల్లి శాపాలకు ఉట్లు రాలవు కదా!

కానీ రాలుతున్నట్టున్నాయి.  నిన్న పత్రికలో ఒక  వార్త వచ్చింది. కొత్తగా వచ్చిన ఈ ఓ యాత్రీకులకు ఎండావాన నుంచి కాస్త ఉపశమనం కలిగించడానికి అక్కడ యేవో కదిలే చలవ పందిళ్ళు శాశ్వత ప్రాతిపదికపై వేయిస్తున్నారని. సంతోషం మూడేళ్ళ తర్వాత అయినా నా గోడు ఏలిన వారి చెవిన పడినందుకు.    
No automatic alt text available.

24, నవంబర్ 2017, శుక్రవారం

థాంక్యూ డాక్టర్! – భండారు శ్రీనివాసరావు


సోషల్ మీడియాలో ఏదైనా రాస్తే ఎవరు చదువుతారు అనే అనుమానం చాలామందితో పాటు నాకూ వుంది. కేన్సర్ హాస్పిటల్  లో వైద్య నిపు ణుడు డాక్టర్ సెంథిల్ రాజప్ప నాకు ఈ రోజు పంపిన ఈ సందేశం ఆ సందేహాన్ని పటాపంచలు చేసింది. ఇప్పటివరకు వారెవ్వరో నాకు ఛాయా మాత్రంగా కూడా తెలియదు.
పొత్తూరి వారి అనుభవాన్ని నేను నా మాటల్లో రాసాను. అంతే!  నందిరాజు వంటి మిత్రులు స్పందించారు. అది అంతటితో ముగిసింది అనుకున్నాను. కానీ అది చేరవలసిన వారికి చేరింది. వారికి తెలుగు చదవడం రాదు, అయితే భావం అర్ధం అయినట్టుంది. అందుకే ఇలా స్పందించారు.
Dear Srinivas, Thank you so much for the kind gesture. I shall  ask someone to read it for me. Blessed to be able to take care of a noble soul like Venkateswara Rao garu.”
థాంక్యూ డాక్టర్!


22, నవంబర్ 2017, బుధవారం

గీత దాటుతున్న సోషల్ మీడియా - భండారు శ్రీనివాసరావు


నిజం నోరు దాటే లోపలే పుకారు ఊరు దాటుతుందంటారు. సోషల్ మీడియా ప్రవేశం తరువాత ఈ వదంతుల వేగం మరింత పెరిగింది.
కొందరు రాజకీయ నాయకుల గురించి, లేదా సినీ, సామాజిక రంగాల్లో ప్రముఖుల గురించి ఫోటో షాపో, మరో ప్రక్రియ ఏదో తెలియదు కానీ, అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫోటోలు ఈ మీడియాలో విచ్చల విడిగా హల్ చల్ చేస్తున్నాయి. వారి గురించిన కాకమ్మ కబుర్లు వంతులవారీగా గిరికీలు కొడుతున్నాయి. వాటిల్లో నిజమెంతో వాటిని షేర్ చేసే వారికి తెలవదు. వాస్తవాన్ని నిర్దారించుకోకుండానే వాటిని షేర్ చేస్తూ పోతుండడంతో ఆ నీలివార్తలు ప్రచండ వేగంతో ప్రపంచాన్ని చుట్టబెడుతున్నాయి. విన్న వింత చదివినప్పుడు వాస్తవంగా అనిపిస్తుందన్న మాట ప్రకారం అవన్నీ నిజమేనేమో అన్న భ్రాంతికి కూడా కొందరు అమాయకులు గురవుతున్నారు.
మీడియా, అది ప్రింటు కావచ్చు విజువల్ కావచ్చు, ఏదైనా విషయాన్ని రచనల ద్వారా లేదా చిత్రాల ద్వారా ఇతరులతో పంచుకోవడానికి కొన్ని పద్దతులు వున్నాయి. ఈ విధానాలకు చట్ట స్వరూపం లేకపోవచ్చు, కానీ లక్ష్మణ రేఖ వంటి స్వయం నియంత్రణలు వున్నాయి.
సోషల్ మీడియాకు ఈ పరిమితులు, స్వయం నియంత్రణలు లేవు. వున్నట్టు నిబంధనలు చెబుతున్నా వాటిని పాటిస్తున్న దాఖలా లేదు. నూటికో, కోటికో ఎప్పుడో ఎవ్వరో పోలీసులకు పిర్యాదు చేస్తే కంటి తుడుపు చందంగా చర్యలు తీసుకున్న వార్తలు సకృత్తుగా కానవస్తాయి. సోషల్ మీడియా రంగ ప్రవేశం తరువాత చోటుచేసుకుంటున్న రకరకాల వికృత పోకడల్లో నీలివార్తల వ్యాప్తి ప్రధానమైనది. ఈ మీడియాలో వేగం ముఖ్యమైన వెసులుబాటు కావడంతో ప్రచారకర్తల కన్ను కూడా ఈ మీడియాపై పడుతోంది. రాజకీయ నాయకులు సయితం ప్రజలకు చేరువగా వుండడానికి ఈ ‘మీడియం’ పైనే దృష్టి పెడుతున్నారు. వెనుకటి రోజుల్లో పత్రికా ప్రకటనల మీద ఆధారపడే పరిస్తితి క్రమంగా తగ్గి పోతోంది. కేవలం ట్వీట్లతో అటు మీడియా దృష్టిని, ఇటు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకే ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నారు. విలేకరుల సమావేశంలో అయితే ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన తలనొప్పి వుంటుంది. ఈ ట్వీటింగులో ఆ గొడవ లేదు. ట్వీట్ చేసి కూర్చుంటే చాలు, కాగల కార్యం మీడియానే చూసుకుంటుంది అనేది వారి ధీమా.
ఇక అన్ని రాజకీయ పార్టీలు ఈ సోషల్ మీడియా ప్రభావాన్ని గుర్తించి తమ ప్రచారాలకు ముఖ్య సాధనంగా మార్చుకుంటున్నాయి. తమ పార్టీ గురించి, తమ నేతల గురించీ సానుకూల సమాచారాన్ని మార్పిడి చేసుకుంటూ వుంటే అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు. కానీ దానికి తోడు, అధికారికంగానో, అనధికారికంగానో కొన్ని గ్రూపుల ద్వారా ప్రత్యర్ధులపై దుష్ప్రచారానికి ఈ మీడియాను వాడుకునే ధోరణితో అవి ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో వ్యక్తిగత నిందారోపణలు, వ్యక్తిత్వ హననాలు ఆకాశమే హద్దుగా సాగుతున్నాయి. మార్ఫింగ్ చేసిన చిత్రాలతో ప్రత్యర్ధులపై బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక సందర్భాలలో శృతిమించి రాగాన పడుతున్న మాట కూడా వాస్తవం.
నిజానికి వెనుకటి తరానికి తెలియని ఈ సోషల్ మీడియా, నేటి తరానికి, రానున్న తరానికి ఓ వరప్రసాదం. భావవ్యక్తీకరణకు సులభతరమైన మార్గం. వెనుకటి రోజుల్లో జనాలు తమ అభిప్రాయాలు తెలుపుకోవడానికి ఎటువంటి అవకాశమూ వుండేది కాదు, పత్రికల్లో ప్రచురించే పాఠకుల లేఖలు తప్ప. ఇప్పుడలా కాదు ఇలా మెదడులో ఆలోచన రావడం ఆలస్యం, చేతికి పనిచెప్పడం, చేతిలో వున్న మొబైల్ ద్వారా దాన్ని క్షణాల్లో ప్రపంచానికి తెలపడం. అది రాజకీయం కావచ్చు, సాహిత్య అంశం కావచ్చు, గృహసంబంధమైన విషయం కావచ్చు, కంటికి కనబడ్డ విషయం కావచ్చు, కెమేరాకు చిక్కిన దృశ్యం కావచ్చు, చెవిన పడ్డ సంగతి కావచ్చు అదీ ఇదీ అని లేదు, ఉచ్చమూ నీచమూ అన్నతేడా లేదు, ఎవరేమనుకుంటారో అనే సంకోచం లేదు అలా వున్నపళంగా ఆ ఆలోచనలను, ఆ భావాలను, ఆ స్పందనలను, ఆ విమర్శలను, ఆ మెచ్చుకోళ్ళను, ఆ వేళాకోళాలను అక్కడికక్కడే, అప్పటికప్పుడే వెళ్ళగక్కి మనసులో భారాన్ని తగ్గించుకోగల గొప్ప సాధనం ఇది. సరిగా వాడుకుంటే సత్ఫలితాలను ఇచ్చే ఓ మహత్తర సాంకేతిక ప్రక్రియ ఇప్పుడు అందరికీ ఓ కాలక్షేప సాధనంగా మారిపోయింది. సమాచార మార్పిడికి, ముక్కూమొహం తెలియని వ్యక్తుల నడుమ కూడా సాంఘిక సంబంధాలను ఏర్పరచడానికి ఎంతగానో వీలుకల్పిస్తున్న ఈ సోషల్ మీడియా క్రమంగా నీలివార్తల ఉత్పత్తి, పంపిణీ కేంద్రంగా మారిపోతోంది. నిజంగా ఇదొక పెను విషాదం.
ముందే చెప్పినట్టు, వెనుకటి తరానికి చెందిన వాళ్ళు మొదటిసారి ఈ కొత్త ప్రపంచంలో తొలి అడుగు పెట్టినప్పుడు వాయువేగ మనోవేగాలతో సాగుతున్న సమాచార మార్పిడిని చూసి మాన్ప్రడి పోతున్న మాట వాస్తవం. జరుగుతున్న సాంఘిక, రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ యువతరం చురుగ్గా, భేషుగ్గా స్పందిస్తున్న తీరుని గమనిస్తూ మౌన ప్రశంసలు గుప్పించివుంటారనుకోవడంలో కూడా సందేహం లేదు. చిన్న చిన్న వాక్యాలతో, తేలికయిన పదాలతో నేటితరం వెల్లడిస్తున్న అభిప్రాయాలను చూసి ‘నేర్చుకోవాలనే తపన ఉండాలే కానీ, వాటిని చిన్నవయసు వారి నుండి కూడా నేర్చుకోవడానికి పెద్ద వయస్సు పెద్ద అడ్డంకి ఏమీ కాదనుకుని సమాధానపడుతున్నది కూడా వాస్తవ దూరం కాదు. పాత సంగతులు గురించి, వెనుకటి రోజుల్లోని సంప్రదాయాలు, ఆహార విహారాలు గురించీ నవతరం రాస్తున్న విధానాలు గమనిస్తూ, విస్తుపోతూ, మురిసిపోతున్న మాట కూడా అంతే నిజం.
అయితే, దురదృష్టం, ఈ సోషల్ మీడియాలో కొందరి నిర్వాకం వీరి ఆశలపై నీళ్ళు చల్లుతోంది. కొందరు వాడే పద ప్రయోగాలు వెగటు పుట్టిస్తున్నాయి. వీధి రౌడీల భాషను మరిపిస్తున్నాయి. రాజకీయ, సినీ రంగాల్లోని అభిమాన,దురభిమానాల క్రీ నీడలు మరింత ముదిరిపోయి ఈ మీడియాలో ఊడలు దించాయి. వెనుకటి రోజుల్లో సినీ అభిమానులు తమ అభిమాన నటుడి ప్రత్యర్హుల సినిమా పోస్టర్లపై పేడ కొడుతుండేవారు. అదే ఇప్పుడు తీరు మార్చుకుని సోషల్ మీడియా గోడలపై బురద చల్లే రూపం సంతరించుకుంది. వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యల స్థాయిని మించి, విమర్శలు, ప్రతి విమర్శల హద్దును అధిగమించి, ఆరోపణలు, ప్రత్యారోపణల చెలియలికట్ట దాటి ఈ సోషల్ మీడియా మూల స్వరూపాన్నే ఈ విష సంస్కృతి మార్చివేస్తోంది.
ఈ మాట ఎవరి మనసుకయినా నొప్పి కలుగుతుందేమో, ఈ వ్యాఖ్య ఎవరినయినా మానసికంగా గాయపరుస్తుందేమో అన్న విచక్షణ చాలామందిలో కానరావడం లేదు. ‘ నా ఇష్టం, నేను ఇలానే రాస్తాను,మీకిష్టమైనది మీరు రాసుకోండి’ అనే తెంపరితనం కట్లు తెచ్చు కుంటోంది.
ఈ సందర్భంలో తిక్కన భారతంలో రాసిన ‘ఒరులేయవి ఒనరించిన...అనే పద్యం గుర్తుకువస్తోంది. ‘ఇతరులు ఏది చేస్తే మీకు ఇష్టం వుండదో, అదే పని మీరు ఇతరుల విషయంలో చేయకండి’ అని బోధించే ఈ పద్యం అరణ్య పర్వంలో వస్తుంది. ఈ నాటి సోషల్ మీడియాకు నూటికి నూరుపాళ్ళు వర్తించే నీతి ఇది. నిప్పుతో వంట చేసుకోవచ్చు, ఒళ్ళు కాల్చుకోవచ్చు. అలాంటి నిప్పులాంటిది ఈ సోషల్ మీడియా. అంతా వాడుకోవడంలోనే వుంది.


వేళాకోళానికి వ్యంగ్యానికీ తేడా వుంది. వ్యంగానికీ సునిశిత హాస్యానికీ బేధం వుంది. అవి తెలుసుకోకుండా వాడితే జోకు మేకవుతుంది.

21, నవంబర్ 2017, మంగళవారం

సంకల్పబలం - భండారు శ్రీనివాసరావు

సంకల్పానికి చిత్తశుద్ధి తోడయితే దానికి ఒనగూడే బలం గురించి, రేడియోలో విన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి అనుగ్రహ భాషణం నుంచి (యధాతధంగా కాకపోయినా, మూలభావం దెబ్బతినకుండా) “నిప్పు రాజేయడానికి అగ్గిపెట్టె కోసం వెతుకులాడేవాడికి అది దొరకొచ్చు, దొరక్కపోవచ్చు. కానీ, నిమ్ముకున్న రెండు కర్ర ముక్కల్ని, రెక్కలు విరిగేలా రాపాడిస్తూ సంకల్పబలంతో నిప్పు పుట్టించాలని ప్రయత్నించేవాడికి విజయం తప్పక సిద్ధిస్తుంది. “సంకల్పబలంతో ముందుకు సాగేవాడిని విమర్శించేవాళ్ళు, అవహేళన చేసేవాళ్ళు ఈ లోకంలో ఎలాగూ వుంటారు. అది లోక సహజం. హంస కాళ్ళపై నేలపై నడిచినంత మాత్రాన అది హంస కాకుండా పోదు. కాకి ఆకాశంలో ఎగురుతూ వెడుతున్నంత మాత్రాన అది హంస కానేరదు. కాకి కాకుండా పోదు.” "కృతజ్ఞత అనేదానికి అర్ధం చెప్పాలంటే ముందు కొబ్బరి మొక్క గురించి తెలుసుకోవాలి. చారెడు నీళ్ళు పోసి ఆ మొక్కని పెంచితే, అది పెరిగి పెద్దది అయి, చిన్నప్పుడు తన దాహం తీర్చిన వాళ్ళు, తీర్చని వాళ్ళు అనే తేడా లేకుండా చల్లని, పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన కొబ్బరి నీళ్ళను జీవితాంతం అందిస్తుంది"

20, నవంబర్ 2017, సోమవారం

కాగితాన్వేషణ – భండారు శ్రీనివాసరావు


రిటైర్ అయి పుష్కరం దాటింది. ఆ కాలంనాటి రాతలు, కోతలు ఇప్పుడు లేవు. అంతా హైటెక్. అన్నీ కంప్యూటర్ల మీదే. అయినా ప్రతిదానికీ ఆఫీసులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు మాత్రం తప్పడం లేదు. అదృష్టం! ఎవరూ దక్షిణలు అడగడం లేదు.




మొన్న పెన్షన్ స్లిప్ మెయిల్ లో పంపారు. వివరాలు అన్నీ సరిగానే వున్నాయి. కానీ పెన్షన్ నామినీ కాలంలో మా ఆవిడ పేరు లేదు. పెళ్లి నాడు కూడా ఇద్దరం కలిసి ఫోటో దిగలేదు కానీ, రిటైర్ అయ్యేముందు పెన్షన్ పుణ్యమా అని ఇద్దరం పొలోమని స్టూడియోకి వెళ్లి మరీ ఫోటో తీయించుకుని ఆఫీసులో ఇచ్చాము. తీరా ఇప్పుడు చూస్తే నామినీ పేరు గల్లంతు. ఇలాటి విషయాల్లో కాలయాపన పనికిరాదు అనే మా మాజీ స్టేషన్ డైరెక్టర్ శాస్త్రి గారి మాట విని కోటీలోని స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయానికి వెళ్లాను. 1975లో రేడియోలో చేరినప్పటి నుంచి నా అక్కౌంటు అక్కడే, అప్పట్లో అన్నీ మానవ సంబంధాలు. స్లిప్పు రాయడం, టోకెన్ తీసుకోవడం, మన నెంబరు పిలిచినదాకా ఆ ముచ్చటా ఈ ముచ్చటా చెబుతూ కాలక్షేపం చేయడం, లేదా బ్రాంచి మేనేజర్ దగ్గర భేటీ వేయడం అలా కాస్త కాలక్షేపం కాస్త స్వకార్యం. ఇప్పడు అలా లేదు. ఒక పెద్ద అధునాతన ఎయిర్ పోర్ట్ మాదిరిగా వుంది. అన్నీ కంప్యూటర్లు, వాటి వెనక కనీకనపడక సిబ్బంది తలకాయలు. పనిచేస్తున్నారో, సెల్ ఫోన్లు చేస్తున్నారో తెలవదు. అంతా హడావిడి. బయట కస్టమర్లది కూడా అదే తంతు. ఒకరికొకరు తెలవదు, ఎవరికి వారికి తమ పని ముందు చక్కబెట్టుకుని చక్కా పోవాలనే ఆత్రుత. ‘చివరికి ఇక్కడ కాదు, పెన్షనర్ల విభాగం మరో పక్కన అదే ఆవరణలో వుంది, అక్కడికి వెళ్లండని చల్లగా కబురు. ఆ బిల్డింగు పెద్ద పెద్ద పొడవాటి మెట్ల వరుసతో చాలా అందంగా, అధునాతనంగా వుంది. మొదటి అంతస్తులో వుంది ఈ విభాగం. మా ఆవిడను తీసుకుని వెళ్ళిన రోజు జనం లేరు, ఖాళీగా వుంది. బయట రిసెప్షన్ లో ఎవరూ లేరు. గాజు తలుపు నెట్టుకుని లోపలకు వెళ్లి అక్కడ ఒకర్ని వాకబు చేసాను. అతడు ఆశ్చర్యంగా నా వంక చూసి, ‘ఇక్కడి దాకా ఎలా వచ్చారు. లోపలకు ఎవరూ రాకూడదు, బయట రిసెప్షన్ వరకే మీకు అనుమతి’ అంటూ నాకు ఓ క్లాసు పీకాడు. బయటకు వచ్చి చూస్తే రిసెప్షన్ సీటు ఖాళీగా వుంది. కాసేపటికి ఒకావిడ వచ్చి అక్కడ నిల్చుంది. ఆవిడ ఉద్యోగా, నాలాగా వచ్చిన మనిషా అని తేరిపార చూస్తుంటే ఆవిడ కళ్ళు విప్పార్చి ‘ఏం కావాలి’ అని అడిగింది. వెళ్లి చెప్పాను. పేరు, అక్కౌంట్ నెంబరు వివరాలు అడిగి తెలుసుకుంది. నేను, ‘మా ఆవిడ మా ఆవిడే’ అనడానికి నాదగ్గర ఉన్న అన్ని ఆధారాలు అంటే ఆధార్ కార్డు, పెన్షనర్ కార్డు, ఏళ్ళతరబడి అదే బ్యాంకులో ఉన్న బ్యాంకు జాయింటు అక్కౌంట్ వివరాలు, పాసుపోర్టు ఇలా అన్నీ ఆవిడ ముందు పెట్టాను. ‘పెన్షన్ పేమెంటు ఆర్డరు ఏదీ’ అని అడిగింది. రిటైర్ అయిన తరువాత నాలుగిళ్ళు మారాను. ఈ సంధి కాలంలో ఏటీఎంలు, ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు వగైరాలు వచ్చిపడి కొన్ని పాత కాగితాలకు కాలం చెల్లిపోయిందని నిర్లక్ష్యం చేసిన జాబితాలో ఈ కాగితం కూడా చేరి పోయివుంటుంది. కానీ ఆ కాగితం లేనిదే పని జరగదు అనే తెలివి తెచ్చుకుని ఇంటికి చేరి ఇంటిల్లిపాదీ ఆ కాగితాన్వేషణ కార్యక్రమంలో తలమునకలు అయ్యాము. ఇల్లంతా చిందర వందర కావడం తప్పిస్తే కాగితం జాడ లేదు. అతి ముఖ్యమైన వాటిని అతి జాగ్రత్తగా దాచే నైపుణ్యం కలిగిన మా ఆవిడే వాటి పత్తా కనుక్కుంది. పాండవులు ఆయుధాలను జమ్మి చెట్టు కొమ్మల్లో దాచినట్టు, పెన్షన్ పత్రాలను ఒక సీనా రేకుల పెట్టెలో పెట్టి ఆ పెట్టెను భద్రంగా అటక ఎక్కించింది.దాన్ని దింపి చూస్తే ఎప్ప్పుడో పుష్కరం నాడు దిగిన మా దంపతుల ఫోటో ఉన్న పెన్షన్ పేమెంటు ఆర్డరు బుక్కు కనిపించింది. తెల్లారగానే దాన్ని పట్టుకుని, దారి మధ్యలో జిరాక్స్ కాపీలు తీయించి, ఈరోజు అక్కడికి పడుతూ లేస్తూ వెళ్లాను.



పోయి చూస్తె, ఆ రిసెప్షన్ హాలు మొత్తం పెన్షనర్లతో కిటకిట లాడుతోంది. నా మొహం చూసి నాలాగే పనిమీద వచ్చిన ఒకాయన, ‘సోమవారం మాస్టారు, సోమవారం రష్ ఇలాగే వుంటుంది’ అన్నాడు. కాసేపటి తరవాత ఆయనే కలిగించుకుని ‘అలా నిలుచుండి పొతే అలాగే వుంటారు. ముందు ఆ రిసెప్షన్ బల్ల మీద ఉన్న రిజిస్టర్ లో మీ వివరాలు రాయండి’ అన్నాడు. “ఇక్కడ నిఘా కెమెరాలు వున్నాయి, కాస్త నవ్వు మొహం పెట్టండి’ అనే బోర్డులు వున్నాయి కానీ, ఈ ముఖ్యమైన సంగతి తెలిపే సమాచార సూచిక అక్కడ ఏమీ కనబడలేదు.
రిజిస్టర్ లో వివరాలు రాసి ఓ పక్కన నిలుచున్నాను. ఈసారి సీట్లో మరో అమ్మాయి కూర్చుని వుంది. ప్రతి ఒక్కరి కేసు తన కేసే అన్నంత శ్రద్ధగా వచ్చిన వారికి విసుక్కోకుండా పని చేసి పెడుతోంది. లైన్లో ఉన్న వాళ్లకు ఈ ఆలస్యం కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆ పని తీరు నాకు బాగా నచ్చింది. ఇంతలో ఒక వృద్ధుడు వచ్చాడు. అప్పుడే నా వంతు వచ్చింది. ఆ అమ్మాయి నాతో అన్నది, ‘చూడండి. నిజానికి వరసలో మీరే వున్నారు. ఈయన రిజిస్టర్ లో రాయలేదు. కానీ పెద్దాయన కదా! మీరు ఒప్పుకుంటే ముందీ పెద్దమనిషి విషయం కనుక్కుంటాను’
ఈ రకంగా వృత్తి ధర్మం నెరవేరుస్తున్న ఒక ఉద్యోగిని చూడడం చాలా అరుదు. ఆ పెద్ద మనిషి పని పూర్తి చేసిన తరువాత నన్ను పిలిచింది. వివరాలు అన్నీ మరో మారు పరిశీలించింది. నేను రిటైర్ అయినప్పుడు నామినీ విషయంలో పుట్టిన తేదీ పట్టింపు లేదు. కానీ అదిప్పుడు తప్పనిసరి. నేను ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఒక వైద్యుడు రోగికి చెప్పినంత వివరంగా చెప్పింది. ఆ అమ్మాయి పనిచేసే విధానం చూసిన తరువాత నాకు నా పని కాలేదన్న విచారం కలగలేదు. ధన్యవాదాలు చెప్పి వచ్చేసాను.
నిజానికి ప్రస్తుతం దేశానికి కావాల్సింది ఇలాంటి ఉద్యోగులే.

13, నవంబర్ 2017, సోమవారం

“ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం, ప్రాంతీయ వార్తలు చదువుతున్నది చుండూరు వెంకట రంగారావు...”


ఈరోజు కార్తీక సోమవారం (13-11-2017) మధ్యాన్నం ఒంటిగంటా పది నిమిషాలకు రేడియోలో ఈ గొంతు వినపడింది. ఈ సాయంత్రం వార్తలు కూడా రంగారావు గారే చదవాలి. కానీ చదవడానికి ఆయన లేరు. సాయంత్రం బులెటిన్ కు సిద్ధం అవుతూ రేడియో స్టేషన్ లోనే కుప్పకూలిపోయారు. న్యూస్ రూమ్ లో పనిచేసే ఇతర సిబ్బంది వెంటనే ఆయన్ని దగ్గరలోని హైదర్ గూడా అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. కానీ ఫలితం దక్కలేదు. ఏ వార్తలు అయితే ఆయన చదవాలో ఆ బులెటిన్ లోనే రంగారావు గారి మరణ వార్తను ప్రసారం చేయాల్సి వచ్చిందని న్యూస్ సిబ్బంది బాధ పడ్డారు.
వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి



11, నవంబర్ 2017, శనివారం

‘మీలో పార్టీ మారని వారు ఎవరో చెప్పండి’ – భండారు శ్రీనివాసరావు


ఎవరయినా ఒక పెద్ద పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు మరో పార్టీలోకి జారిపోతే ఆ సందర్భాన్ని 'పార్టీ మార్పిళ్ళకు పరాకాష్ట’  అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తుంటారు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా ఉండడానికి సిద్ధపడి వుండాలి. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా అంతే  అవసరం.  ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి తప్పనిసరి అవసరం కాబట్టి.  ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై దుమారం సాగిపోతుంది, ఆ  తరువాత అది పాత పడిపోతుంది. కొత్తది తెర మీదికి వస్తుంది. చర్చ మళ్ళీ మొదలవుతుంది. ఇదో విష చక్ర భ్రమణం.       
'నిలకడగా  నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'   
పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.  
పార్టీలు ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి.
1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కమ్యూనిష్టు పార్టీలు వుండేవి కాని వాటి పాత్ర పరిమితంగా వుండేది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి.
2014 జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం  ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల చీలిక దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు ఒక్కటే ఒక్కటి,  పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది.
ఈ చిక్కుముళ్ళు ఎప్పుడూ విడివడతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్తితి. 'మీరంటే మీరే కారణం' అంటూ వివాదాలకు కేంద్ర బిందువులయిన రెండు ప్రధాన పార్టీలు వీధులకెక్కి వీరంగాలు చేస్తూ వుండడం, అటూ ఇటూ పార్టీల నాయకులు. కార్యకర్తలు, అభిమానులు వేర్వేరు పారావారాలుగా విడిపోయి వాదోపవాదాలకు దిగడంతో సామరస్య పరిష్కారం ఆశలు సన్నగిల్లుతున్నాయి.   దీనికి ముగింపు ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.
పోతే, ఇన్ని సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే  రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.     
సాధారణంగా  ప్రతిపక్షంలో వున్నవాళ్ళు పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.      
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న పార్టీల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర పార్టీ, జనసంఘం పేర్లు  ఈనాడు కొందరికి తెలిసి  వుండవచ్చునేమో కాని1952 లో జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా సోషలిష్టు పార్టీ,  నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్,  జస్టిస్ పార్టీ,  ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి ఒక్కటే) సరేసరి. వీటిల్లో కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి  వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న విషయం సులభంగానే బోధపడుతుంది.       
గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు.
పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే. కొందరికి లాభం. కొందరికి ఖేదం.
పార్టీ మారిన వెంటనే చేరిన పార్టీలో తారాజువ్వలా పైకి దూసుకు పోయిన సందర్భాలు వున్నాయి. పార్టీ మారి పుష్కరాలు గడిచినా వేసిన గొంగడి చందంగా చతికిలపడి పోయిన ఉదాహరణలు వున్నాయి. పేర్లు చెప్పుకుంటూ పొతే జాబితా కొండవీటి చేంతాడు అంత అవుతుంది.
పార్టీ మార్పిళ్లలో అర్ధం కానిది ఒకటే.   
రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే మనసా, వాచా, కర్మణా సిద్ధమైపోయారని చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు  పార్టీలు మారుతుంటారు.
ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.
ముక్తాయింపు :       
ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడుతున్న మాట:

"ఈరోజు ప్లస్సెంత ? మైనస్ యెంత?"

7, నవంబర్ 2017, మంగళవారం

మరో మంచి లక్ష్యం దిశగా తెలంగాణా ప్రభుత్వం

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తుమ్మల నాగేశ్వర రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆయన మా రేడియోకు ప్రధాన శ్రోత. రోడ్డుమార్గాన  ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు, మధ్యాన్నం 1.10  లేదా  సాయంత్రం  6.15  అయితే చాలు, మంత్రి గారు ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయేది. ప్రాంతీయ వార్తలు పూర్తిగా విన్న తరువాత మళ్ళీ బయలుదేరేది. (అప్పట్లో ఇప్పటి నాలుగు లేన్ల రహదారి లేదు, అంచేత ఎక్కడపడితే అక్కడ కారు ఆపుకునే వెసులుబాటు వుండేది)

ఇప్పుడు  కూడా నాగేశ్వర రావు గారు తెలంగాణా ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు ఈ మధ్య వేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆయన చైర్మన్. లోగడ 108, 104 పధకాల రూపకల్పనలో పాలుపంచుకున్న తెలంగాణా బిడ్డలు డాక్టర్ ఏ.పీ.రంగారావు, డాక్టర్ బాలాజీ ఊట్ల, ‘క్రియ’ సంస్థ ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించేందుకు 1033 అంబులెన్స్ సర్వీసుకు రూపకల్పన చేసి నూతన సాంకేతికపరిజ్ఞానంతో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. తుమ్మల నాగేశ్వర రావు గారు ఈ ప్రయోగ వివరాలను తెలుసుకుని వారిద్దరినీ క్యాబినెట్ ఉపసంఘం సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావాల్సిందని కోరారు. ఈ నెల పదో తేదీన జరిగే తొలి సమావేశంలో తగిన చర్చలు జరిగి,  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన ఫలితాల సాధన దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.    

“ఎవరా మేనకోడలు ఏమా కధ!”


అని చాలామంది అడుగుతున్నారు. నిరుడు జూన్ లో జరిగిన విషయం ఇది. నేనే మరచిపోయాను. కేటీఆర్ గుర్తుపెట్టుకున్నారు. అది ఆయన గొప్పతనం. తెలంగాణా పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి గారిని ఉద్దేశించి రాసింది. చివరి వాక్యం అందుకోసమే.
అప్పటి పోస్టింగు ఇదిగో!   

ఇలాగా కూడా జరుగుతుందా! – భండారు శ్రీనివాసరావు  

కొన్ని విషయాలు వింటుంటే నిజమా అనిపిస్తుంది.
మామేనకోడలుకు చెల్లెలు వరస అయిన అమ్మాయి బీటెక్ పాసయింది. ఎం టెక్ కూడా చేసింది. వాళ్ళు వుండేది నల్గొండలో.
సర్వీసు కమీషన్ వాళ్ళు  మునిసిపల్ ఇంజినీరింగ్ విభాగంలో టెక్నికల్ ఆఫీసరు పోస్టుకు పరీక్ష పెడితే రాసింది. ఇంటర్వూకు పిలిస్తే వెళ్ళింది. ఏదో మోటారు సైకిల్ కంపెనీ వారి ట్యాంకులో పెట్రోలు నింపండి, ఇక మరచిపొండిఅనే ప్రకటన తరహాలో ఆ విషయం మరిచిపోయింది.
నిన్ననో మొన్ననో ఆమెకు నియామక పత్రాలు పోస్ట్  లో అందాయి. ఆ అమ్మాయికి ఆనందం, ఇంట్లో వాళ్లకి ఆశ్చర్యం.  ఆ ఉద్యోగం కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు, ఏ రకం అయిన పైరవీలు చేయలేదు. అందుకే ఆ ఆనందం, అందుకే ఆ ఆశ్చర్యం.
ఆర్డరులో చూస్తే బోధన్ పోస్టింగు ఇచ్చారు. ఆ అమ్మాయే ధైర్యం చేసి ఆ విభాగం చీఫ్ ఇంజినీరును కలిసి ముందు థాంక్స్ చెప్పింది, తరువాత వచ్చిన పని చెప్పింది.
ఆ అమ్మాయికి ఈసారి ఆనందంతో పాటు ఆశ్చర్యం.
ఎందుకంటే క్షణాల్లో ఆ ఆర్డరు మార్చి బోధన్ బదులు నల్గొండకు పోస్టింగు  ఇచ్చారు.
పైరవీ లేదు, పైసా ఖర్చులేదు. ఆ కుటుంబం ఆనందమే ఆనందం.

(ఘంటా చక్రపాణి గారూ వింటున్నారా!)
27 జూన్, 2016.  

ఇది రాసి నేను మరచిపోయాను. కనీసం ఎవరికీ ట్యాగ్ కూడా చేయలేదు. అయినా ఇది పడవలసిన వారి కంట్లో పడింది. ఏడాది తరవాత కూడా గుర్తుంచుకుని కేటీఆర్   ఒక ఇంటర్వ్యూ లో కోట్ చేసారు. అందుకే నాకు కూడా ఆ అమ్మాయికి మల్లే ఆశ్చర్యంతో కూడిన ఆనందం.

అంతే! వేరే ఏమీ లేదు.

6, నవంబర్ 2017, సోమవారం

దిస్ ఈజ్ కేటీఆర్ - భండారు శ్రీనివాసరావు


“ప్రభుత్వం అన్నాక పొగిడే వాళ్ళు వుంటారు, తెగిడే వాళ్ళు వుంటారు. పూలూ వేస్తారు, రాళ్ళూ వేస్తారు. మా పార్టీ వాళ్ళు ఆహా ఓహో అంటారు, అది సహజం, దానికి పొంగి పోకూడదు. అలాగే ప్రతిపక్షాల వాళ్ళు విమర్శలు గుప్పిస్తారు. అదీ సహజమే. వాటికి కుంగి పోకూడదు. కానీ నిష్పాక్షికులయిన జర్నలిష్టులు ఏదైనా రాస్తే, అది ప్రతికూలంగా వున్నా విషయం ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.  అలాగే వాళ్ళు ఓ మాట మంచిగా రాస్తే ప్రశంసగా తీసుకోవాలి”
ఇలాగే కాకపోయినా ఇదే అర్ధం వచ్చే రీతిలో మాట్లాడారు తెలంగాణా పురపాలక, ఐ.టీ. శాఖల మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు(కే.టీ.ఆర్)
ఈరోజు అనుకోకుండా ఓ పుష్కరం తర్వాత అసెంబ్లీకి వెళ్లాను. నేను చూసిన అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిది. ఎన్నో ఏళ్ళ పాటు రేడియో విలేకరిగా ఆ భవనంతో, అక్కడ జరిగే కార్యకలాపాలతో నాకు అనుబంధం వుంది. అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ కమిటీ సభ్యుడిగా కూడా వున్నాను.  1975 నుంచి 2005 వరకు  ముప్పయి ఏళ్ళపాటు నిరాఘాటంగా  అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీ పాసు, అక్రిడిటేషన్ కార్డు కలిగిన  ఒక సీనియర్ జర్నలిష్టు అనే భావనతో కాబోలు తెలంగాణా  ప్రభుత్వం ఇంకా  వాటిని  కొనసాగిస్తోంది. ఈ ఉదారతకు నా  ధన్యవాదాలు.
మళ్ళీ అనేక సంవత్సరాల తర్వాత జ్వాలా పుణ్యమా అని తెలంగాణా అసెంబ్లీ భవనంలో కాలు మోపాను. వున్న కాసేపు ఆనందంగా గడిచింది.  మా కాలంలో పనిచేసిన కొందరు జర్నలిష్టులు (ఇండియా టుడే అమర్ నాద్ మీనన్, వార్త నాగేశ్వరరావు) అసెంబ్లీ కార్యదర్శి శ్రీ నరసింహాచారి మొదలయిన వారిని కలుసుకునే అవకాశం కూడా  దొరికింది.
నన్ను కూర్చోబెట్టింది సీఎం పేషీ అధికారులు కూర్చునే గది. సీఎం ఛాంబర్ ఆ పక్కనే వుంటుంది. మధ్యాన్నం అవుతోంది. అసెంబ్లీ ఇంకా కొనసాగుతోంది. అక్కడి టీవీలో చూస్తున్నాను. ప్రతిపక్ష నాయకుడు శ్రీ జానారెడ్డి, ఉప నాయకుడు మల్లు భట్టి తమదయిన శైలిలో  వాక్బాణాలు విసురుతుంటే ముఖ్యమంత్రి అంతకంటే పదునుగా  జవాబు ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే వెనకటి రోజులు గుర్తుకు వచ్చాయి. అప్పుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి. వై.ఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత. ఒకరికొకరు తీసిపోరు. ముఖ్యంగా అసెంబ్లీ చర్చల్లో. వాదమయినా, సంవాదమైనా హుందాగా సాగుతుంటే వినే వాళ్లకు చూడ ముచ్చటగా వుంటుంది.  మళ్ళీ తెలంగాణా అసెంబ్లీ జరిగే తీరు చూసి సంతోషం అనిపించింది.
ఇంతట్లో జామపండు తింటూ తెల్లటి దుస్తులు ధరించిన వ్యక్తి గదిలోకి వచ్చారు. ఒక పక్కకు వెళ్లి పండు తింటూనే పక్క వ్యక్తి చెప్పేది వింటున్నారు. తీరా చూస్తే ఆయన ఎవరో కాదు, మంత్రి కేటీఆర్.
ఢిల్లీలో ఈ మధ్య  బీబీసీకి ఇచ్చిన ఇంటర్వూలో నాపేరు ప్రస్తావించిన విషయం గుర్తు చేసి, కృతజ్ఞతలు చెప్పాను.
అప్పుడు కేటీఆర్ అన్న మాటల్నే నేను ఇందులో  నాందీ ప్రస్తావనగా పేర్కొన్నాను.
“నిష్పాక్షికులయిన జర్నలిష్టులు ఏదైనా రాస్తే, అది ప్రతికూలంగా వున్నా విషయం ఏమిటో అర్ధం చేసుకునే ప్రయత్నం చేయాలి.  అలాగే వాళ్ళు ఓ మాట మంచిగా రాస్తే ప్రశంసగా తీసుకోవాలి”

దిస్ ఈజ్ కేటీఆర్!  
కింది ఫోటో:  హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కేటీఆర్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న సందర్భంలో  

            


5, నవంబర్ 2017, ఆదివారం

దగ్గర పడుతున్న పెద్ద నోట్ల రద్దు ప్రధమ వార్షికోత్సవం – భండారు శ్రీనివాసరావు

నిరుడు నవంబరు ఎనిమిదో తేదీన ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అత్యంత నాటకీయంగా ప్రకటించారు. నిర్ణయం జరిగి ఏడాది కాలం గడిచి పోతున్న తరుణంలో కూడా ఈ నిర్ణయం మంచి చెడులను గురించి దేశ వ్యాప్త చర్చలు జరుగుతూ వుండడం విశేషం.
పెద్ద నోట్ల రద్దు దరిమిలా, ‘సూటిగా...సుతిమెత్తగా....’ అనే శీర్షికతో  నేను మొదటి రెండు నెలల్లోనే సుమారు పది వ్యాసాలు రాసి ప్రచురించాను. వాటిని ఒకపరి సింహావలోకనం చేసుకోవడమే ఈ రచన పరమార్ధం.
మోడీ ప్రయోగించిన  బ్రహ్మ శిరోనామకాస్త్రం (13-11-2016)
1978
 వ సంవత్సరం. జనవరి నెల. 14 వ తేదీ ఉదయం.
ముంబై (అప్పుడు బొంబాయి) లో వున్న రిజర్వ్ బ్యాంకు  చీఫ్ అక్కౌంట్స్ కార్యాలయంలో సీనియర్ అధికారి ఆర్. జానకి రామన్ ఇంట్లో ఫోను మోగింది. వెంటనే ఢిల్లీ రావలసిందని ఒక ప్రభుత్వ అధికారి ఆదేశం.
జానకి  రామన్ బొంబాయి నుంచి బయలుదేరి  ఢిల్లీ వెళ్ళీ వెళ్ళగానే అక్కడి ఉన్నతాధికారులు ఒక ఆర్డినెన్స్  ముసాయిదాను ఒకే ఒక్క రోజులో తయారు చేయాలని ఆయన్ని కోరారు. పెద్ద విలువకలిగిన  కరెన్సీ నోట్లని చెలామణి నుంచి తప్పించాలని ప్రభుత్వం సంకల్పించిందని, అందుకు తగిన ఆర్డినెన్స్ సిద్ధం చేయాలని, ఇదంతా చాలా గోప్యంగా జరగాలని  రామన్ ను ఆదేశించారు.
ఇప్పట్లా ఆరోజుల్లో సెల్ ఫోన్ వంటి కమ్యూనికేషన్ సదుపాయాలు లేవు. అయినా ఆర్బీఐ  కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం బయటకి పొక్కకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
అనుకున్న పద్దతిలోనే ఆర్డినెన్స్ ముసాయిదా తయారయింది. జనవరి 16 తెల్లవారుఝాముకల్లా రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి సంతకం కోసం పంపారు. అదే రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆకాశవాణి ద్వారా పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలకు తెలిసిపోయింది.  ముందు జాగ్రత్తగా జనవరి పదిహేడునాడు దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు, ప్రభుత్వ ట్రెజరీలు మూసివేశారు.
అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఐ.జీ. పటేల్ కు ఈ పెద్ద నోట్ల రద్దు వ్యవహారం నచ్చలేదు. సంకీర్ణ జనతా ప్రభుత్వంలోని కొందరు నాయకులు పెద్ద నోట్ల రద్దుకు పట్టుబట్టడం వల్ల ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందన్నది ఆయన అభిప్రాయం. అంతకు పూర్వం దేశాన్ని పాలించిన నాయకుల అవినీతి పనులను లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకుందని పటేల్ చెప్పారు.
భారతీయ ఆర్ధిక విధానాలు అనే అంశంపై పటేల్ రాసిన పుస్తకంలో ఇంకా ఇలా పేర్కొన్నారు.
పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయాలనే నిర్ణయం గురించి ఆర్ధిక మంత్రి హెచ్.ఎం.పటేల్ నాతొ ప్రస్తావించారు. అటువంటి సంచలన నిర్ణయాలతో అద్భుత ఫలితాలు రాబట్టడం చాలా అరుదుగా జరుగుతుందని నేను మంత్రితో స్పష్టంగా చెప్పాను.
సాధారణంగా అవినీతి, అక్రమ  పద్ధతుల్లో భారీఎత్తున  డబ్బు పోగేసుకునేవాళ్ళలో అత్యధికులు ఆ సంపదను  కరెన్సీ రూపంలో  ఎక్కువ కాలం దాచిపెట్టుకోరుఅన్నది నాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పటేల్ అభిప్రాయం.
నల్ల డబ్బును సూట్ కేసుల్లో, దిండ్ల కవర్లలో కుక్కి దాస్తారని అనుకోవడం అజ్ఞానమే అవుతుందిఅని కూడా పటేల్ మహాశయులు అభిప్రాయపడ్డారు.
ఇది జరిగి  38 ఏళ్ళు అవుతోంది.
నాడు  1978లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ శకం ముగిసిన తరువాత ప్రజల తీర్పుతో కేంద్రంలో  అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి కాంగ్రెసేతర జనత ప్రభుత్వం వెయ్యి, అయిదు వేలు, పదివేల రూపాయల నోట్లను రద్దు చేయాలని సంకల్పించి, ఆ నిర్ణయాన్ని వెంటనే అమలు చేసింది. అప్పుడు జనత ప్రభుత్వానికి నేతృత్వం వహించింది గుజరాత్  కు చెందిన మొరార్జీ దేశాయ్. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత అయిదువందలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లని రద్దు చేయాలని నిర్ణయించింది కూడా అదే రాష్ట్రానికి చెందిన నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇది కాకతాళీయం కావచ్చు. అలాగే ఈ రెండు నిర్ణయాలు కాంగ్రెసేతర ప్రభుత్వాలు కేంద్రంలో కొలువు తీరి వున్నప్పుడు తీసుకోవడం కొట్టవచ్చినట్టు కానవచ్చే మరో పోలిక.
కాకపొతే అప్పటికన్నా ఈసారి మోడీ ప్రభుత్వం  గోప్యతను మరింత పకడ్బందీగా పాటించినట్టు కనబడుతుంది.
గత మంగళవారం సాయంత్రం  ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది. అంతకు ముందు ప్రధాని త్రివిధ సైనిక దళాల అధిపతులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో ఇప్పటికే యుద్ధ వాతావరణం ఏర్పడి వుండడం చేత ప్రధాని అనుకు సంబంధించి ఏదో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. క్యాబినెట్  ఎజెండాలో ఈ నిర్ణయానికి సంబంధించి కానీ, సరిహద్దులలో తీవ్రత గురించిన   అంశం కానీ  ఏదీ లేదు. సమావేశం ముగిసే సమయంలో ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్ల చెలామణి రద్దు నిర్ణయాన్ని క్లుప్తంగా తెలియచేసి మంత్రులనందరినీ సమావేశ మందిరంలోనే కూర్చోబెట్టి ప్రభుత్వ  సంకల్పాన్ని రాష్ట్రపతికి తెలియచేడానికి వెళ్ళారు. ఆ తరువాత నేరుగా దేశ ప్రజల నుద్దేశించి రేడియో, దూరదర్సన్ లలో ప్రసంగించారు. ఆ సంస్థల అధికారులకికూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదు. మంత్రులు కూడా సమావేశ మందిరం నుంచే ప్రధాని ప్రసంగం విన్నారు.  ఆ తరువాతనే వారు బయటకు వెళ్ళారు.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోడీ ఆరుమాసాల క్రితమే తీసుకున్నారని, అప్పటినుంచి దాన్ని అమలు చేయడానికి దశలవారీ ప్రణాళిక రూపొందించుకున్నారని భోగట్టా. అందులో భాగమే మొన్నీ మధ్య అమలు చేసిన స్వచ్చంద ఆదాయ వెల్లడి పధకం. గోప్యత చాలా కీలకం అని భావించిన నరేంద్ర మోడీ, చాలా కాలంనుంచే మంత్రివర్గ సమావేశాలకు మంత్రులుఎవరూ తమవెంట సెల్ ఫోన్లు తెచ్చుకోకుండా కట్టడి చేసారు.
నోట్ల రద్దు నిర్ణయం గురించి మొత్తం దేశంలో తెలిసిన వాళ్ళు పది మంది మాత్రమే అని,  రిజర్వ్ బ్యాక్ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్న రఘురాం రాజన్ అందులో ఒకరని  తెలుసుకుని ఆశ్చర్యపోవడం మీడియా వంతయింది. మొత్తం వ్యవహారాన్ని అత్యంత రహస్యంగా ఉంచినా ఇలాంటిది ఏదో జరగబోతోందన్న సంకేతాలు మాత్రం గత కొద్ది కాలంగా వెలువడుతూనే వున్నాయి. కొత్త రెండువేల రూపాయల నోటు నమూనా తయారుచేయడం, ఆమోదించడం, ఆ నోట్లను పెద్ద మొత్తంలో ముద్రించడం జరిగిపోయాయి. అయితే ఆ విషయం తెలిసిన వాళ్ళు ఇది షరా మామూలుగా జరిగే నోట్ల ముద్రణగా భావించారు కానీ దీని వెనుక ఇంత భారీ నిర్ణయం వుందని అంచనా వేయలేకపోయారు.     
ప్రధాని ప్రసంగం ముగించిన వెంటనే దాన్ని విన్న ఆసేతుహిమాచలం ప్రజలందరికీ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్న నల్ల ధనం పిశాచి భరతం పట్టడానికి మోడీ ఎంతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్న ఒకే అభిప్రాయం కలిగింది. మొనగాడంటే మోడీ అనే రీతిలో సాంఘిక మాధ్యమాల్లో మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. కొద్ది రోజులు కటకటపడితే పడదాము, కష్టాలు శాస్వితంగా తీరిపోతున్నప్పుడు తాత్కాలిక ఇబ్బందులను పట్టించుకోవద్దుఅనే భావన సర్వత్రా కనబడింది.
రాత్రంతా సాగిన ఆ భావనలు మర్నాడు కూడా కొనసాగి, నిర్ణయ ప్రభావం కొద్దికొద్దిగా అనుభవంలోకి రావడం మొదలుకాగానే  అవి మనస్సులో నుంచి వైదొలగడం మొదలయింది.  సంపన్నులపై  ముఖ్యంగా నల్ల కుబేరులపై ప్రధాని మోడీ ప్రయోగించిన ఈ సర్జికల్ స్ట్రైక్  గురి తప్పి సామాన్యులను తాకిందేమో అనే సంశయం సన్నగా మొదలయింది. మీడియా వార్తలు దానికి ఆజ్యం పోసి మరింత పెంచాయి. మోడీ ఈ అస్త్రాన్ని యూపీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని వాడారనే ఆరోపణలు అనుమానాలను రగిలించాయి. బీజేపీ సహజంగా సంపన్న వర్గాల కొమ్ము కాస్తుందనే అపప్రధను ప్రత్యర్ధులు మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. ఏటీఎం లలో డబ్బు లేకపోవడం, బ్యాంకులకు సెలవు ప్రకటించడం, నోట్ల మార్పిడికి వ్యవధానం అతి తక్కువగా వుండడం వెరసి ఇవన్నీ మోడీ నిర్ణయాన్ని తప్పుపట్టే దిశగా సాగాయి. అయితే ప్రభుత్వం ముందే చెప్పినట్టు గంటలు గడుస్తున్న కొద్దీ పరిస్తితుల్లో ముందు కానవచ్చిన తీవ్రత  కొద్దికొద్దిగా తగ్గడం మొదలయింది. అనుకున్నంత కాకపోయినా కొద్ది కొద్ది మొత్తాలలో చెలామణీలో వున్న కరెన్సీ చేతుల్లో పడడంతో జనం ఊపిరి పీల్చుకోవడం మొదలెట్టారు. అయినా శంకలు పూర్తిగా తొలగిపోలేదు. జవాబు దొరకని ప్రశ్నలు కొన్ని జనం మెదళ్ళలో మెసులుతూనే వున్నాయి. ఒక చేత్తో వెయ్యి నోటు రద్దు చేసిన ప్రభుత్వం ఆ ఉత్తర్వుపై చేసిన  సంతకం తడి ఆరకముందే మరో చేత్తో రెండువేల రూపాయల నోటును చెలామణీ లోకి ఎందుకు తెచ్చినట్టు? అయిదు వందల పాత నోటును తీసేసి, కొత్త అయిదు వందల కరెన్సీ నోటు తేబోతున్నట్టు ప్రకటించడం ఎందుకు? జనాలను ఇంత లాయలాసకు గురిచేసి, దేశంలో నల్లధనం  మళ్ళీ రాశులుగా  పోగుపడడానికి ఉపకరించే రెండు వేల నోటు తేవడం ఎందుకు?
ఇవన్నీ జవాబు తెలియని ప్రశ్నలే కానీ నిజానికి సమాధానం లేనివి కావు. సమాధానం చెప్పేవాళ్ళు లేకపోతే అది సందేహంగా మారుతుంది. క్రమంగా అనుమానం రూపం సంతరించుకుంటుంది. ఆ క్రమాన్ని అడ్డుకోకపోతే ఆగ్రహంగా పరిణమిస్తుంది.
ప్రస్తుతానికి అయితే జనాల మనస్సులో ప్రశ్నలు మాత్రమే వున్నాయి.
బంతి ప్రభుత్వం కోర్టులోనే వుంది. 
ఉపశృతి:
మహా భారత యుద్ధ పరిసమాప్తి కాలంలో అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మశిరోనామకాస్త్రం, అభిమన్యుడి అర్ధాంగి ఉత్తర గర్భంలో పెరుగుతున్న పాండవ వంశాంకురాన్ని తుదముట్టించబోయేటప్పుడు కృష్ణుడు సుదర్శన చక్రం అడ్డువేసి తల్లీకొడుకులను కాపాడతాడు. అసలీ అస్త్ర మహత్యమే అద్భుతం. ప్రయోగించిన వీరుడు మంత్రశక్తితో ఆవాహన చేసి నిర్దేశించిన లక్ష్యానికి మినహా మరెవరికీ హాని కలిగించక పోవడం ఈ బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రత్యేకత. ఒకరకంగా చెప్పాలంటే, మోడీ పుణ్యమా అని ఈనాడు బహుళ  ప్రాచుర్యంలో వున్నసర్జికల్ స్ట్రైక్’  లాంటిదని  చెప్పుకోవచ్చు.
(11-11-2016)


NOTE: మరో వ్యాసం మరో సారి