నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వర
రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆయన మా
రేడియోకు ప్రధాన శ్రోత. రోడ్డుమార్గాన ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు,
మధ్యాన్నం 1.10 లేదా సాయంత్రం 6.15 అయితే చాలు, మంత్రి గారు
ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయేది. ప్రాంతీయ వార్తలు పూర్తిగా
విన్న తరువాత మళ్ళీ బయలుదేరేది. (అప్పట్లో ఇప్పటి నాలుగు లేన్ల రహదారి లేదు, అంచేత
ఎక్కడపడితే అక్కడ కారు ఆపుకునే వెసులుబాటు వుండేది)
ఇప్పుడు కూడా నాగేశ్వర రావు గారు తెలంగాణా ప్రభుత్వంలో
రోడ్లు, భవనాల శాఖ మంత్రి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే ఉద్దేశ్యంతో
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు ఈ మధ్య వేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆయన
చైర్మన్. లోగడ 108, 104 పధకాల రూపకల్పనలో పాలుపంచుకున్న
తెలంగాణా బిడ్డలు డాక్టర్ ఏ.పీ.రంగారావు, డాక్టర్ బాలాజీ ఊట్ల, ‘క్రియ’ సంస్థ
ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు
ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించేందుకు 1033 అంబులెన్స్ సర్వీసుకు రూపకల్పన చేసి నూతన సాంకేతికపరిజ్ఞానంతో రోడ్డు
ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. తుమ్మల నాగేశ్వర రావు
గారు ఈ ప్రయోగ వివరాలను తెలుసుకుని వారిద్దరినీ క్యాబినెట్ ఉపసంఘం సమావేశానికి
ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావాల్సిందని కోరారు. ఈ నెల పదో తేదీన జరిగే తొలి
సమావేశంలో తగిన చర్చలు జరిగి, ముఖ్యమంత్రి
కేసీఆర్ ఆశించిన ఫలితాల సాధన దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.