ఈ ఇంగ్లీషు వాడున్నాడే ఎంతయినా గొప్పవాడు. పంతాలు, పట్టింపులు, అహంభావం, నేనే గొప్ప అనే రకరకాల భావనలను అన్నీ కలిపి ఎంచక్కా ఈగో అనే ఒక్క చిన్న మూడక్షరాల (EGO) పదంలో గుది గుచ్చాడు.
ఈ మధ్య ఏ పేపరు తిరగేసినా అధికారులు, అనధికారులు, నాయకులు మంత్రులు, ముఖ్యమంత్రులు, చివరాఖరికి రాజ్యాంగ పదవుల్లో వున్నవాళ్ళు అందరూ (ఈ అందరిలో కొందరు జర్నలిస్టులు కూడా వున్నారు) ఈగో అనే విషవలయంలో చిక్కుకుని సంచలన వార్తలకు కేంద్ర బిందువులు అవుతున్నారు.
నిజానికి ఇవన్నీ కొత్తవేమీ కాదు. ‘ఎవరు ముందు, నేనే ముందు’ అనే అహానికి మహాభారతంలోనే దృష్టాంతం వుంది. పాండవోద్యోగ విజయాలు నాటకంలో ‘ముందుగ వచ్చితీవు ..’ అనే కృష్ణుడి పద్యానికి దుర్యోధనుడి ఈ ఈగోనే కారణం.
మచ్చుకు ఓ ఉదాహరణ చెప్పుకుందాం. ఇది చాలా పాత రోజుల సంగతి, ఈనాటి తరం వారికి. మరి నా అనుభవాలు అన్నీ ఎప్పటివో కదా!
అప్పుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి. మోహన్ కందా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. స్వర్ణజిత్ సేన్ పోలీసు డైరెక్టర్ జనరల్. దినేష్ రెడ్డి హైదరాబాదు నగర పోలీసు కమిషనర్.
ఆ రోజుల్లో ఒకసారి రాష్ట్రపతి ఏ.పీ.జే. అబ్దుల్ కలాం హైదరాబాదు వచ్చారు. బేగం పేట విమానాశ్రయంలో స్వాగతం. ఏర్పాట్లు అన్నీ జరిగాయి. రాష్ట్రపతికి స్వాగతం చెప్పడానికి అందరూ వరసగా నిలబడ్డారు. పోలీసు కమిషనర్ దినేష్ రెడ్డి ప్రోటోకాల్ ప్రకారం కొంత వెనుక నిలబడాల్సి వచ్చింది. అది ఆయనకి నచ్చలేదు. వరుస తప్పించి ముందుకు వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు.
సరే ఆ కార్యక్రమం ముగిసింది. కానీ దినేష్ రెడ్డి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని ప్రోటోకాల్ విషయంలో తనకు జరిగిన లోపాన్ని ఎత్తి చూపుతూ చీఫ్ సెక్రెటరీకి ఓ ఉత్తరం రాశారు.
“సీనియారిటీ రీత్యా నాకంటే జూనియర్ అయిన ఓ ఐ.ఏ.ఎస్. అధికారి (సీ.ఆర్. బిస్వాల్, ప్రిన్సిపాల్ సెక్రెటరి పొలిటికల్) వెనక నేను నిలబడడం కుదరదు. నగర పోలీసు కమిషనర్ గా నేను ఆయనకంటే ముందు వుండాలి” అంటూ ఆయన తన మనసులో మాట బయట పెట్టారు.
దీనికి జవాబుగా ఆయనకు చీఫ్ సెక్రెటరి నుంచి మెమో వచ్చింది. “రాష్ట్రపతి స్వాగత కార్యక్రమంలో మీరు ప్రిన్సిపల్ సెక్రెటరి పొలిటికల్ ని దాటుకుని వెళ్లి డీజీపీ పక్కన నిలబడ్డారు. ఇది ప్రోటోకాల్ ఉల్లంఘన కిందికి వస్తుంది’ అనేది ఆ మెమో తాత్పర్యం.
ఈ మెమో ముఖ్యమంత్రి ఆదేశం ప్రకారం ఇచ్చింది అని తెలియక, దినేష్ రెడ్డి చీఫ్ సెక్రెటరీకి మరో ఘాటయిన లేఖ రాశారు, “నాకు మెమో ఇవ్వడానికి మీకెంత ధైర్యం? హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ గా నా స్థాయి (హోదా) చీఫ్ సెక్రెటరీకి సమానం’ అంటూ.
ఇది చిలికి చిలికి గాలివాన అయింది. స్టేట్ ఐ.పి.ఎస్. అధికారుల సంఘం కార్యవర్గం అత్యవసర సమావేశం జరిపి ప్రోటోకాల్ విషయంలో తమను కూడా ఐ.ఏ.ఎస్. అధికారులతో సమానంగా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఈ సంఘానికి దినేష్ రెడ్డి కార్యదర్శి కావడం కాకతాళీయం కావచ్చు.
తాను 1977 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారినని, ప్రోటోకాల్ వ్యవహారాలు చూసే అధికారి 1981 బ్యాచ్ ఐ.ఏ.ఎస్. కాబట్టి అతడు తనకు జూనియర్ అవుతాడు అనే ధోరణితో దినేష్ రెడ్డి ఉత్తరం రాసారు.
నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఈ వివాదం కొనసాగుతోంది కానీ ప్రభుత్వం పెదవి విప్పలేదు. కారణం నగరంలో గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాల్సి వుంది. ఆ కార్యక్రమం సజావుగా అలా పూర్తయిందో లేదో నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటికి ఆయన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టి పది నెలలు కూడా కాలేదు. నగర పోలీసు కమిషనర్ ను బదిలీ చేస్తున్న సమాచారం డీజీపీకి కూడా తెలియదని వార్తలు గుప్పుమన్నాయి.
ఏదో కక్ష కట్టినట్టు బదిలీ చేసినట్టు కాకుండా అదే రోజు మరో ఆరుగురు ఉన్నత పోలీసు అధికారులకు కూడా స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అప్పుడు అలా అర్ధాంతరంగా కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాల్సివచ్చిన దినేష్ రెడ్డి, ఆద్యతన కాలంలో పోలీసు డైరెక్టర్ జనరల్ అయ్యారు. సంబంధిత మంత్రికి కూడా తెలియకుండా ఆయన ఒకే ఒక్క రోజున రాష్ట్ర వ్యాప్తంగా యాభయ్ మంది డీ.ఎస్.పి. లను బదిలీ చేయడం ఓ కొసమెరుపు.
మరో కొసమెరుపు కూడా వుంది. అది ఇక్కడిది కాదు. ఇప్పటిదీ కాదు, పాతదే. (ఇప్పటి విషయాలు ఇలా స్వేచ్ఛగా రాసుకునే రోజులు ఎప్పుడో పోయాయి)
కమ్యూనిస్ట్ చైనా అధినేత అమెరికా సందర్శించినప్పుడు ఆయనకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా జీ. 20 అధినాయక సదస్సులో పాల్గొనడానికి బీజింగ్ వెళ్ళారు. అక్కడ విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ మాట అటుంచి కనీస హోదా కలిగిన అధికారి కూడా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం చెప్పడానికి రాలేదు. ప్రెసిడెంట్ ఎయిర్ క్రాఫ్ట్ ‘ఎయిర్ ఫోర్స్ వన్’ లో అమర్చిన ఒక ప్రత్యేక ద్వారం (యుద్ధ సమయాల్లో వాడే అత్యవసర ద్వారం) తెరుచుకుని చిన్న ఇనుప నిచ్చెన సాయంతో విమానం దిగి ఒబామా నడుచుకుంటూ వెళ్లి కారెక్కి బసకు వెళ్ళిపోయారు.
తరువాత విలేకరులు ఈ అంశాన్ని ప్రస్తావిస్తే, ఒబామా ‘అది చాలా చిన్న విషయం’ అన్నట్టు కొట్టి పారేశారు.
‘అనేక అంతర్జాతీయ వ్యవహారాలను చర్చించడానికి ఈ సదస్సు జరుగుతోంది. వాటి ప్రాముఖ్యతను తగ్గించే ఇటువంటి అత్యల్ప విషయాలను మాట్లాడడం నాకిష్టం లేదు’ అనే ధోరణిలో ఒబామా హుందాగా జవాబిచ్చారు.
ఇందులో ఇంకో కొస మెరుపు ఏమిటంటే ఒబామాకు తగిన రీతిలో స్వాగతం పలకని చైనా ప్రభుత్వం, ఈ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఇతర దేశాల అధినాయకులకు సముచిత రీతిలో ఎర్ర తివాచీ పరచి మరీ స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసింది.
(ఇంకావుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి