30, మార్చి 2020, సోమవారం

వెలుగు చూడని వార్తలు - 2 -


రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రెండో దఫా ఎన్నికలకు సిద్ధం అవుతున్న రోజులు.
ఏదో కార్యక్రమానికి వెళ్లి బేగంపేట లోని సీఎం క్యాంపు ఆఫీసుకు తిరిగివస్తున్నారు. ముందు సీట్లో కూర్చుని వున్న వై.ఎస్. ఆర్., యదాలాపంగా వెనక సీట్లో కూర్చున్న వ్యక్తిగత సిబ్బందిని అడిగారు రాష్ట్రంలో పరిస్తితి ఎలావుందని. ఐ.ఏ.ఎస్. అధికారి తడుముకోకుండా చెప్పేశారు, పరిస్తితులు పాలక పక్షానికి అనుకూలంగా వున్నాయని.
‘ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్సులు జనంలోకి బాగా వెళ్ళాయి. అలాగే సేద్యపు నీటి ప్రాజెక్టులు. ప్రజల్లో రవంత కూడా వ్యతిరేకత ఉన్నట్టుగా నాకనిపించడం లేదు. ధైర్యంగా ఉండొచ్చు’
మాట్లాడుతుండగానే క్యాంపు ఆఫీసు వచ్చింది. కారు దిగబోతుండగా ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయకుడు రవిచంద్ ఇలా అన్నారు.
‘దేనికయినా బుల్లెట్ ప్రూఫ్ వుంటుంది, పొగడ్తలకు తప్ప’
వై.ఎస్.ఆర్. కి రవిచంద్ మాటల్లో భావం బోధపడింది.
పెద్దగా నవ్వేశారు, తనదయిన స్టైల్లో.

వెలుగు చూడని వార్తలు – 1 -


అప్పుడు రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక సభలో మాట్లాడుతూ సీపీ ఎం నాయకుడు రాఘవులు ఒక ఆరోపణ చేశారు. ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులో వంద కోట్ల రూపాయల అవినీతి చోటుచేసుకుందన్నది ఆ ఆరోపణ సారాంశం.
మర్నాడు ఒక ప్రముఖదినపత్రిక ఒక కార్టూన్ ప్రచురించింది. వై ఎస్ బొమ్మ పెద్దగా, పక్కనే చంద్రబాబు బొమ్మ చిన్నగా వుంటుంది. ఆయన వై ఎస్ ని ఉద్దేశించి ఏదో అంటుంటాడు. సీపీఎం నాయకుడు రాఘవులు వైఎస్ఆర్ నోట్లో చేయిపెట్టి ఒక డబ్బు మూట బయటకు తీస్తుంటాడు. వై ఎస్ ఆర్ అవినీతిని టీడీపీ కన్నా సీపీఎం బాగా బయట పెడుతోందన్న అర్ధం అందులో అంతర్లీనంగా వుంది.
అది చూసిన వై ఎస్ కి పట్టరాని కోపం వచ్చింది. దాన్ని ఆయన దాచుకోలేదు. ఆ కార్టూన్ వేసిన పత్రిక యజమానిపై మండిపడ్డారు. అప్పుడు అక్కడే వున్న కిరణ్ కుమార్ రెడ్డి, కేవీపీ నచ్చ చెప్పబోయినా ఆయన వినిపించుకోలేదు. ఆ పత్రిక రాసేవన్నీ అభూత కల్పనలు అనే పద్దతిలో ఎదురు దాడి మొదలు పెట్టడమే మంచిదని వైఎస్ నిర్ధారణకు వచ్చారు. ఎన్నికలకు ఇంకా చాలా వ్యవధి వున్నప్పుడు ఇప్పటి నుంచే పత్రికలతో తగాదా ఎందుకన్నదికిరణ్, కేవీపీ ల అభిప్రాయం. కానీ వైఎస్ ఒప్పుకోలేదు. ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎన్నికల నాటికి ప్రజలు నమ్మే పరిస్తితి వస్తుందని ఆయన నమ్మకం. అప్పటి నుంచి వైఎస్ సందర్భం వచ్చినప్పుడల్లా ఆ పత్రిక రాతల్ని ఎండగట్టే ప్రయత్నం ప్రారంభించారు. తరువాత అది ఆ రెండు పత్రికలూ..అంటూ రెండు తెలుగు దిన పత్రికలని ఎద్దేవా చేసే ప్రచార కార్యక్రమంగా రూపు దిద్దుకుంది.

జస్ట్ ఫర్ చేంజ్


రాత్రి అమెరికా నుంచి మా పెద్దవాడు సందీప్ నుంచి వీడియో కాల్. చూస్తే వేరే మనిషి లాగా వున్నాడు.
‘నేనే డాడ్. ఎలా వున్నారు?’
‘ఇదేం వేషంరా!’
‘వేషం కాదు ఇదే ఒరిజినల్. సెల్ఫ్ ఐసొలేషన్. అందరం వర్క్ ఫ్రం హోం. పిల్లల చదువులు కూడా ఇంటి నుంచే కంప్యూటర్ లో. మొదటి వారం రోజులు మాత్రం ఆఫీసుకు పోయేవాళ్ళ లాగా పొద్దున్నే లేచి తయారై కంప్యూటర్ ముందు కూచునే వాళ్ళం. పోను పోను విసుగనిపించింది. జస్ట్ ఫర్ చేంజ్. గడ్డం పెంచుతున్నాను. కాదు అదే పెరుగుతోంది’ అన్నాడు వాడు నవ్వుతూ.

ఎలా వున్నారు?


పొద్దున్నే వెంకట్రావు గారి నుంచి ఫోను, ‘ఏం శ్రీనివాసరావు గారు ఎలా వున్నారు?” అని.
వెంకట్రావు గారు నేను 1970 ప్రాంతాల్లో విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్ ఎడిటర్లుగా కలిసి పనిచేశాం. లబ్బీ పేటలో మా ఇద్దరి ఇళ్లు కూడా దగ్గరిదగ్గరగానే ఉండేవి. వారి భార్య నిర్మల, నా భార్య నిర్మల సైతం మంచి స్నేహితులు.
తర్వాత నేను హైదరాబాదులో ఆలిండియా రేడియోలో చేరాను. ఆ తర్వాత వెంకట్రావు గారు కూడా హైదరాబాదు వచ్చేశారు ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ గా. కొన్నేళ్ళకు ఆ పత్రిక ఎడిటర్ అయ్యారు. ప్రెస్ అకాడమి చైర్మన్ అయ్యారు. మహా టీవీ చీఫ్ ఎడిటర్ అయ్యారు. ఆయన ఎన్ని మెట్లెక్కినా  మా స్నేహం కొనసాగుతూనే వుంది.
నా జీవితంలో కొన్ని నెలల క్రితం ఎదురయిన గొప్ప కష్టం తర్వాత ఐవీఆర్ అప్పుడప్పుడూ ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కుంటూ వుంటారు.
“సెల్ఫ్ ఐసోలేషన్ కి అలవాటు పడ్డారా?” ఐవీఆర్ అడిగారు.
ఏ ప్రశ్నకీ సూటిగా జవాబు చెప్పననే పేరు నాకు ఎలాగూ వుంది.
“ఒకడు జీవితంలో అష్టకష్టాలు పడుతూ జాతకంలో మంచి రోజులు వస్తాయేమో అనే ఆశతో జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్లి చేయి చూపించుకుంటాడు. యాభయ్ ఏళ్ళు వచ్చేవరకు అన్నీ కష్టాలే రాసి వున్నాయి అన్నాడా జ్యోతిష్కుడు. “ఆ తర్వాత” అడిగాడు ఆశగా మనవాడు. “తర్వాత ఏముంది ఆ కష్టాలకు అలవాటు పడిపోతావు”
గత కొన్ని నెలలుగా నాది ఒక రకంగా ఐసొలేషన్ జీవితమే. ఇప్పుడు కొత్తగా కొరానా వల్ల వచ్చిన తేడా ఏమీ లేదు. ఆల్రెడీ అలవాటు పడిపోయాను”
నా జవాబుకి ఆయన నవ్వేశారు. కానీ అందులో బాధ మిళితమై వుందని నాకు తెలుసని ఆయనకీ తెలుసు.           

దుగ్గిరాల పూర్ణయ్య ఇక లేరు


ఢిల్లీ నుంచి తెలుగు వార్తలు చదివినవారిలో ప్రసిద్ధులు దుగ్గిరాల పూర్ణయ్య
ఆరోజుల్లో రేడియో కళాకారులకు, న్యూస్ రీడర్లకు సినీ రంగంతో పాటు దీటైన ఆకర్షణ వుండేది. వారిని సాంస్కృతిక కార్యక్రమాలకు, వేడుకలకు ముఖ్య అతిధులుగా ఆహ్వానించి సత్కరించేవారు. అయితే స్వతహాగా నిరాడంబర జీవితం గడిపే పూర్ణయ్య వీటన్నిటికీ దూరంగా వుండేవారు. ప్రముఖులతో సాన్నిహిత్యం పెంపొందించుకోగల అవకాశాలు వృత్తిపరంగా ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మాత్రం తన పనేదో తనేమో అన్నట్టు జీవితం సాగించారు.
సినిమా రంగంలో ఒక మాట వినబడుతూ వుంటుంది. డాక్టర్ కాబోయి యాక్టర్ అయినాడని. దుగ్గిరాల వారిది కూడా ఓ మోస్తరుగా ఇదే కధ. కృష్ణా జిల్లా నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీ వెళ్ళిన పూర్ణయ్య గారికి ఒక చిన్న కొలువు దొరికింది. బీజేపీ అగ్ర నాయకుడు ఎల్.కే.అద్వాని (అప్పుడు జనసంఘం) నడిపే ఒక పత్రికలో పనిచేస్తున్నప్పుడు పూర్ణయ్య గారి పనితీరు వారికి నచ్చింది. వారిరువురి నడుమ సాన్నిహిత్యం పెరిగింది. అద్వానీ గారి మాట సాయంతో ఆలిండియా రేడియోలో ఉద్యోగం వచ్చింది. ఆ విధంగా ఆయన న్యూస్ రీడర్ కాగలిగారు.
రేడియో ఉద్యోగం కొత్త. అయినా ఆయన త్వరగానే ఆ కొత్త కొలువులో ఒదిగిపోయారు. ఇంగ్లీష్ నుంచి వార్తల్ని తెలుగులోకి తర్జూమా చేసి, స్టూడియోలో లైవ్ చదవడంపై పట్టు సాధించారు. మనిషి పీలగా కనిపించినా వారిది కంచు కంఠం. వేరే ధ్యాసలు లేకుండా కేవలం వృత్తి ధర్మాన్ని నిర్వహించే స్వభావం కావడం వల్ల దుగ్గిరాల పూర్ణయ్య గారికి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాలేదని బాధ పడే అభిమానులు కూడా వున్నారు.
నేను మాస్కో వెళ్ళేటప్పుడు ఢిల్లీలో పూర్ణయ్య గారిని కలుసుకున్నాను. మాస్కో రేడియోలో పనిచేసే అవకాశం ఆయనకే ముందు వచ్చినా ఆయన కాదనుకుని ఢిల్లీలోనే వుండిపోయారు.
ఎనిమిది పదులు దాటిన పూర్ణయ్య గారు, అనేక దశాబ్దాల క్రితం వదిలి వెళ్ళిన స్వగ్రామం, గుడివాడ దగ్గర అంగలూరులో భార్య శ్రీమతి లక్ష్మితో కలిసి ఇప్పుడు శేష జీవితం గడుపుతూ ఈరోజు ఆదివారం (29-03-2020) మధ్యాహ్నం కన్నుమూశారు.

29, మార్చి 2020, ఆదివారం

ఓ తుపాను ముచ్చట

ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!
దివి తుపాను సంగతి చాలామందికి తెలిసిన సంగతే. నేనైతే అప్పటికే యాక్టివ్ రిపోర్టింగ్ లోనే వున్నాను.
ఈ తుపాను అదికాదు. దివి తుపానుకు చాలా ఏళ్ళ ముందే  నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి ఎవరికీ తెలియలేదు.
ఓసారి వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో  హడావిడిగా వుంటే వంటింట్లో మా అమ్మ కట్టెల పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.
ఒకరోజు ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు. మా అక్కయ్యలు ఇంట్లో ఓ  మూలన పడేసిన లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆరాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు. వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు. సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! ఆ పూటకి కొంత కిరసనాయిలు వాడి పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.
తుపాను కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. పంచదార పరవాలేదు కానీ కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు మిగిలినవాళ్ళు వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.
అలా పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి ఇచ్చింది.
వాన వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి. బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. వాళ్లకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు. వాళ్ళంతా బిక్క చచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్ట కాలంలో వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన  తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.
మా ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.
తిట్టడానికి గవర్నమెంటు ఒకటుందని అప్పుడు  తెలవదు.     

28, మార్చి 2020, శనివారం

ప్రెసిడెంట్ ట్రంప్ ప్రెస్ మీట్


గంటలు గంటలు ప్రెస్ బ్రీఫింగ్ అనగానే మనదగ్గర నవ్వులాటగా చెప్పుకుంటారు కానీ, అమెరికాలో కరోనా వైరస్ విస్తరించినప్పటినుంచి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్,  వైట్ హౌస్ లో  ప్రతిరోజూ సాయంత్రం రెండుగంటల పాటు విలేకరులతో మాట్లాడడం అనేది ఒక రొటీన్ అయిపొయింది. ప్రెసిడెంట్ తో పాటు అమెరికా వైస్ ప్రెసిడెంట్ కూడా పాల్గొనే ఈ ప్రెస్ బ్రీఫింగ్ లో ఒకరిద్దరు వివిధ రంగాల నిపుణులు కూడా పక్కనే వుంటారు. మనకు విచిత్రంగా అనిపించే  విషయం ఏమిటంటే వీళ్ళు ఒక్కోసారి బహిరంగంగానే ప్రెసిడెంట్ చెప్పేదానితో తాము ఏకీవభించడం లేదంటూ బహిరంగంగానే తమ అనంగీకారం తెలియచేస్తుంటారు. ఈ రెండూ రెండున్నర గంటలసేపు ప్రెసిడెంట్ నిలబడే ఉంటాడు. ఇటీవల అంటే మార్చ్ 23 న జరిగిన ప్రెసిడెంట్ ప్రెస్ బ్రీఫింగ్ ని క్లుప్తీకరిస్తే ఇదిగో ఇలా వుంటుంది. మరో విచిత్రం ఏమిటంటే ఆ నాటి ప్రెస్ బ్రీఫింగులో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ గారికి కోపం వచ్చి మధ్యలోనే అంటే గంటన్నర కూడా కాకుండానే వెళ్ళిపోయారు. వైట్ హౌస్ లో మీడియా విభాగం అధికారి జేమ్స్ ఎస్. బ్రాడి జారీ చేసిన అధికారిక ప్రకటనకు ఇది సంక్షిప్త రూపం. అసలుది ఇరవై వేల పదాలకు పైగా వుంది. ప్రెస్ బ్రీఫింగ్ ఇలా సాగింది.
ప్రెసిడెంట్: మంచిది ధన్యవాదాలు. అందరూ వచ్చినట్టులేదు. బహుశా వైరస్ సమస్య కావచ్చు. సాధారణంగా అయితే చాలామందికి ఈ గదిలో స్థలం సరిపోయేది కాదు.
ఈ వైరస్ మీద పోరాటానికి మన సమాజంలో ప్రతి ఒక్కరినీ కలుపుకుపోయే ప్రయత్నాన్ని అమెరికా ఇక ముందు కూడా కొనసాగిస్తుంది. ఈ పోరాటంలో మనం విజయం సాధిస్తామని అమెరికన్లు విశ్వసించాలని నేను కోరుకుతున్నాను. మళ్ళీ సాధారణ పరిస్తితులు వస్తాయి. కష్టాలు ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయి. మన ఆర్ధిక వ్యవస్థ కూడా బాగా కోలుకుంటుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఈ జాతీయ విపత్తు నడుమ చిక్కుకుపోయిన మనందరం  ఈ పోరాటంలో విజయం సాధించడంపైనే దృష్టి కేంద్రీకరించాలి.
ప్రతి ఒక్క అమెరికన్ ఒక సంగతి గమనంలో పెట్టుకోవాలి. ఈ సమయంలో మనం చేస్తున్న త్యాగం అనేకమంది ప్రాణాలు కాపాడుతుందని తెలుసుకోవాలి.
అమెరికాలోని అమెరికన్లతో సహా, ఇతర ఆసియా అమెరికన్ల ప్రాణాలను కాపాడడం చాలా చాలా ముఖ్యం. ఈ వ్యాధి /వైరస్ విస్తరించడానికి వాళ్ళు కారణం కాదు.
ఈ వైరస్ తలెత్తినప్పటి నుంచి దేశంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటూ  ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ వైరస్ ని తుదికంటా నిర్మూలించేవరకు ఈ కృషి కొనసాగుతుంది. మన ప్రజారోగ్య నిపుణులు ఎప్పటికప్పుడు పరిస్తితిని గమనిస్తూ దేశంలో ఈ వ్యాధి విస్తరిస్తున్న పోకడను అధ్యయనం చేస్తూ తగిన సమయంలో దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అహరహం పనిచేస్తున్నారు. తరువాత ఏం చేయాలి? మన తదుపరి అడుగులు  ఏమిటి అనే విషయంలో పెద్దపెద్ద బృందాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఒక్కసారి వాళ్ళు  ఓకె చెబితే మళ్ళీ మనం మన పాత జీవన విధానం వైపు మళ్లిపోతాము.
మన దేశాన్ని నిర్మించుకున్నది షట్ డౌన్ చేయడానికి కాదు.
లక్షలాదిమంది అమెరికన్ శ్రామికులకు, చిన్న వ్యాపారులకి, ప్రపంచంలో అమెరికాకు ఒక సమున్నత స్థానం కల్పించిన బడా పారిశ్రామిక వేత్తలకు  ఈ సంక్షుభిత సమయంలో సత్వర సాయం అందించే బిల్లు విషయంలో ఏకాభిప్రాయ సాధనకోసం నా ప్రభుత్వం డెమోక్రాట్లతో, రిపబ్లికన్స్ తో కలిసి పనిచేస్తుంది.
మూడు నాలుగు మాసాలు లేదా అంతకంటే ముందుగానే, ఇంకా త్వరగానే  అమెరికా తన వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తుంది. వీలయితే ఇంకా ముందుగానే. సమస్యకంటే పరిష్కారం ప్రమాదకరమయ్యే పరిస్తితిని అమెరికా కొనితెచ్చుకోదు.
 రెండు వారాల క్రితమే ప్రజలకు జీతంతో కూడిన సిక్ లీవ్, ఫ్యామిలీ లీవ్ ఇవ్వడానికి ఎనిమిది బిలియన్ల డాలర్లు ఖర్చయ్యే బిల్లు ఆమోదానికి రికార్డు స్పీడ్ తో పనిచేసాము. ఇందులో వైద్యం ఖర్చులు, వాక్సిన్ల ఖర్చులు కూడా వున్నాయి. కాబట్టి ఈ బిల్లును ఆమోదింప చేయడంలో పార్టీలకి అతీతంగా అమెరికన్ కాంగ్రెస్ పనిచేయాలి.
వైరస్ వ్యతిరేక పోరాటంలో ఏం జరుగున్నదో చెబుతాను. ఎనిమిది లక్షల N95 మాస్కులను, కోటీ ముప్పయి లక్షలకు పైగా సర్జికల్ మస్కులను  పంపిణీ చేస్తున్నాము. ఈ బృహత్తర కార్యక్రమంలో ఫెడరల్ ప్రభుత్వంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు పార్టీలకి అతీతంగా చేయీ చేయీ కలిపి పనిచేస్తున్నారు.
నా ఆదేశాల ప్రకారం క్లోరోక్విన్ మందును పెద్ద పెద్ద పరిమాణాల్లో తెప్పించడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి ఏ నిమిషంలో నైనా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాలు న్యూయార్క్ చేరతాయి.
మీరు కూడా ఈరోజు వచ్చిన వార్తల్ని చదివారనుకుంటా. ఒక పెద్దమనిషి ప్రాణాపాయంలో పడ్డాడు. బతికే చాన్స్ లేదని అతడూ నమ్మాడు, ఆయన కుటుంబమూ నమ్మింది. ఏదో ఉపశమన వైద్యం కింద అతడి కుటుంబం అతడికి ఆ మాత్ర వేసింది. అందరూ అంతా అయిపోయిందనే అనుకున్నారు. కానీ కొన్ని గంటలు గడవక ముందే అతడులేచి కూర్చున్నాడు. అతడిప్పుడు మామూలుగా వున్నాడు. ఈ వ్యాధికి ఈ మందు పనిచేస్తుంది అని ఆమోదం తెలిపే ప్రక్రియకు మేము ఎక్కువ సమయం తీసుకోనందుకు అతడిప్పుడు సంతోషిస్తున్నాడు.
మలేరియా వ్యాధితో కునారిల్లిన దేశాల్లో ఈ మందును ఆ వ్యాధి నిరోధానికి వాడారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆదేశాల్లో ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువగా వుంది.
మరో విషయం. ఈ రోజు ఉదయమే నేను అధ్యక్షుడిగా నాకున్న అధికారాలను ఉపయోగించుకుని ఒక ఆర్డరు మీదసంతకం చేసాను. ముఖ్యమైన వైద్య పరికరాలను, మాస్కులను  అక్రమంగా దాచిపెట్టడాన్ని నిషేధించే ఉత్తర్వు ఇది.
ఈ సమావేశంలో ప్రెసిడెంట్ ట్రంప్ ప్రశ్నలు అడిగేందుకు ప్రతి ఒక్కరికీ అవకాశం ఇచ్చారు. విలేకరులను పేరుతో పిలిచి ప్రశ్న వేయమని కోరారు. ఒక్కొక్కరూ ఒకటి కంటే ఎక్కువగానే అడిగారు. “వ్యాధి కంటే చికిత్స ప్రమాదకరం కాకూడదు” అంటూ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యపై విలేకరులు బాణాలు సంధించారు.

26, మార్చి 2020, గురువారం

రాజకీయాలకు ఇంకా టైముంది


దయచేసి వినండి – భండారు శ్రీనివాసరావు
కరోనా విషయంలో ఎవరి విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు. నిజం చెప్పాలంటే ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమంలో కొన్ని లొసుగులు అనివార్యం. వాటిని మనం భూతద్దంలో చూసి, మరింత పెద్దవి చేసి ప్రపంచానికి చూపించే ప్రయత్నమే ఫేస్ బుక్ వంటి సాంఘిక మాధ్యమాలలో ఎక్కువగా జరుగుతోంది.  ఇంట్లో ఫ్యాను కింద కూర్చుని ఈ క్షణంలో నేనిది టైప్ చేస్తున్నాను అంటే ఈ పని చేయడానికి ఎందరో ఎక్కడో ఈ పరిస్తితుల్లో కూడా  నాకోసం పనిచేస్తున్నారని అర్ధం.
అది మరచిపోయి, ఏదేదో లేనిపోని నీలివార్తలు షేర్ చేస్తూ పోతుంటే నేనెంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నట్టు. మీరు కంటితో చూసిన విషయం ఏదైనా వుంటే, దాన్ని సంబంధిత అధికారులకి చేరవేయడానికి ఈ మాధ్యమాన్ని వాడుకుంటే అంతకంటే కావాల్సింది లేదు. ఉదాహరణకు నీలయపాలెం విజయకుమార్ ఒక పోస్ట్ పెట్టారు. వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఓ సూపర్ మార్కెట్లో జనాలు ఎగబడి సరుకులు కొంటున్న సంగతి రాసారు. ప్రతి వీధిలో చిన్నవో పెద్దవో కిరాణా షాపులు వుంటే, వాటిల్లో  ధరకాస్త  ఎక్కువే కావచ్చు,  వాటిని వదిలిపెట్టి దూరంగా ఉన్న సూపర్ మార్కెట్ పై దండెత్తడం ఎందుకని వారి ప్రశ్న. “It appears that, people are yet to relise the gravity” అని ఆవేదన వెలిబుచ్చారు. వాస్తవానికి విజయకుమార్ టీడీపీ నాయకుడు. విమర్శ ప్రధానం అనుకుంటే ఆయన పోస్ట్ వేరేగా వుండేది. ఇదీ సంయమనం అంటే.
డిసెంబరు ముప్పయి ఒకటి వరకు మనకెవరికీ కరోనా అంటే తెలవదు. అది ఎలా వస్తుందో తెలవదు. ఇంతవరకు అంటు వ్యాధులు ఈగలు, దోమలు, ఇతర క్రిముల నుంచి మనుషులకు సోకేవి. వాటిని నిర్మూలిస్తేనో, అదుపు చేస్తేనో  రోగాలు తగ్గేవి. మరి కొన్నింటి  నిరోధానికి టీకాలు వున్నాయి. ఇది అలా కాదే. మనుషుల నుంచి మనుషులకు పాకే వ్యాధి. మొదటి దశలో నయం చేయడానికి వీలుంటుంది. రెండో దశ కొంత నయం. మూడో దానికి చేరితే ఇక ఇంతే సంగతులు. కేన్సర్ కూడా ఇంతే కదా అనవచ్చు. కానీ కేన్సర్ రోగిని తాకడానికి ఎవరూ సందేహించరు. చుట్టూ భార్యాపిల్లలను ఉంచుకుని ప్రశాంతంగా ప్రాణాలు విడవొచ్చు. కానీ ఇది అలా కాదే. రోగం వచ్చిందని నిర్ధారణ కాగానే బయట ప్రపంచంతోనే కాదు, కుటుంబ సభ్యులు, చుట్టపక్కాలతో కూడా సంబంధాలు తెగిపోతాయి. అందుకే మనిషికీ మనిషికీ మధ్య దూరం వుండాలని హెచ్చరిస్తోంది. మొదట్లో ప్రభుత్వాలు ప్రదర్శించిన  నిర్లిప్తత కంటే ఇప్పుడు ప్రజల చూపుతున్న  నిర్లక్ష్యం మరింత ఆందోళన కలిగిస్తోంది. అదే ప్రమాదం అనుకుంటే ఇళ్ళల్లో తీరి కూర్చుని, కంప్యూటర్లు ముందేసుకుని, ఘడియకో నీలివార్త వండి వార్చే వారితో మరింత పెద్ద ముప్పు ఎదురవుతోంది.
చూస్తుండగానే కేవలం మూడే మూడు నెలల్లో కరోనా రోగం ఇంతింతై, అంతింతై  తన విశ్వరూపం ప్రదర్శిస్తోంది. అది భారత దేశంలో కాలుమోపినప్పుడు  కేంద్రంలో మోడీ, తెలంగాణాలో కేసీఆర్, ఏపీలో జగన్ అధికారంలో వుండడం అనేది యాదృచ్చికం. ఇదే ఏడాది కిందనో, పదేళ్ళ కిందనో జరిగుంటే పాలకులు వేరుగా వుండేవారు. మీరు అనొచ్చు వారి వారి సమర్ధతను బట్టి వ్యవహరించే తీరు మారొచ్చని. కాదనను. కానీ ఈ యుద్ధం మానవాళి చేస్తున్న ప్రచ్చన్న యుద్ధం. కంటికి కనబడని శత్రువుతో చేస్తున్న యుద్ధం. మనకంటే అన్నింటా ఉచ్చస్థాయిలో ఉన్న  దేశాలే ఈ కరోనా కాటుకు విలవిలలాడుతున్నాయి. ఈ ముప్పు ఏ ఒక్క ప్రాంతానికో, లేదా ఏ ఒక్క ప్రదేశానికో పరిమితమైంది కాదు. గతంలో మనం చూస్తూ వచ్చిన ప్రకృతి వైపరీత్యాలకి దీనికి చాలా తేడా వుంది. ఒక చోట వరదలు వస్తాయి. మరో చోట వర్షాలే వుండవు. ఒక చోట భూకంపాలు సంభవిస్తాయి. మరో చోట ప్రశాంతంగా వుంటుంది. కానీ ఈ కరోనా అనేది ఒకేసారి యావత్ ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉక్కిరిరిబిక్కిరి చేస్తోంది. ఎవరికి వారు తమకు సాయం చేసుకోవడంలోనే బిజీబిజీ. ఇతరులవైపు కన్నెత్తి చూసి పరామర్శించే తీరిక ఈనాడు ఎవరికీ లేదు.  బ్రిటన్ దేశానికి కాబోయే చక్రవర్తే దీని పాలిటపడి చికిత్స తీసుకుంటున్నాడు.
అంచేత చెప్పేది ఏమిటంటే, కొన్నాళ్ళు ఇంటి గడప దాటకుండా ఉండడమే దేశానికి మనం చేసే సేవ. ప్రకృతి కన్నెర్ర చేసిన కొన్ని సందర్భాలను గుర్తు చేసుకుంటే ఇళ్ళల్లో వుండడం పెద్ద విషయం ఏమీ కాదనిపిస్తుంది. తుపానులు సంభవించినప్పుడు వారాల తరబడి కరెంటు వుండదు. భూకంపాలు సంభవిస్తే ఆసుపత్రులే నేలమట్టం అవుతాయి. వరదలు వచ్చినప్పుడు తాగడానికి మంచి నీళ్ళు కూడా దొరకవు.
అదే ఇప్పుడు చూడండి.  కొన్ని కుటుంబాలకు, కొందరు వ్యక్తులకు జరిగే వ్యక్తిగత ఇబ్బందులను మినహాయిస్తే ఇంట్లో వుండి పోవడం అన్న ఒకే ఒక్క అసౌకర్యం మినహా ఇక ఏ లోటు లేదు. అధికారులు కరెంటు సరఫరాలో లోపం లేకుండా చూస్తున్నారు. నెట్ పుణ్యమా అని ఇళ్ళల్లోనే కావలసినంత కాలక్షేపం. చుట్టపక్కాలతో ముచ్చటించడానికి ఎలాగూ మొబైల్స్ వున్నాయి.  నిత్యావసర వస్తువుల కొరత అనేది సమస్యే. కానీ కొంత సంయమనం పాటిస్తే అంటే పానిక్ బయింగ్ కు స్వస్తి చెప్పగలిగితే  కాసిన ఉపశమనం లభించవచ్చు. ఇవన్నీ మన చేతుల్లో వున్నవే. ప్రభుత్వాలను విమర్శించి ప్రయోజనం లేదు. వాళ్ళని వాళ్ళ పని చేసుకోనివ్వండి. మూడు వారాలు ఓపిక పట్టగలిగితే ఆ తర్వాత మరింత ఘాటుగా  రాజకీయ విమర్శలు చేయడానికి ఎంతో సమయం లభిస్తుంది. ఈలోగా బాధ్యత కలిగిన పౌరులుగా  మనం చేయాల్సింది మనం చేద్దాం!              

25, మార్చి 2020, బుధవారం

బయట తిరక్కండిరా!



‘అలా ఎండలో తిరిగితే వడ దెబ్బ తగులుతుంది’
‘వానలో తడిస్తే జలుబు చేస్తుంది’
‘చలిగాలిలో తిరగకండి వంటికి మంచిది కాదు’
ఇలా ఆరుగాలమూ ఆంక్షలే! అందుకే పెద్దవాళ్ళ కళ్లుగప్పి బజార్న పడే వాళ్ళం. వాళ్ళ కళ్ళబడితే ఇంతే సంగతులు! వీపు విమానం మోతే!
ఇప్పటి పెద్దవాళ్ళ చిన్నప్పటి సంగతులన్నీ  ఈ మోస్తరుగానే వుంటాయి.
పొద్దున్న ఖమ్మం నుంచి మా సావిత్రక్కయ్య ఫోను. ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి. చెప్పడానికి మా ఇంట్లో ఉగాదులు లేవు, ఉషస్సులు లేవు. అందుకే కాబోలు మాటమార్చి అంది.
“బయట తిరక్కురా! రోజులు బాగా లేవు”
ఎనభయ్ తొమ్మిది నిండి తొంభయ్యవ పడిలో అడుగుపెట్టిన అక్కయ్య, డెబ్బయి నాలుగేళ్ల తమ్ముడికి ఇలా సుద్దులు చెబుతుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

కనపడని శత్రువుతో ఎడతెగని యుద్ధం – భండారు శ్రీనివాసరావు


(Published in ‘నమస్తే తెలంగాణ’ on 25-03-2020)
ప్రస్తుతం  సమస్త మానవాళినీ కలవరపరుస్తున్నది కరోనా అనే మూడక్షరాల పదం. సాధారణంగా, ఈగలు, దోమలు, లేదా ఇతర క్రిమికీటకాల ద్వారా అంటువ్యాధులు వ్యాపిస్తాయి. ఈ కరోనా అనే మాయరోగం మాత్రం మనుషుల నుంచి మనుషులకు పాకుతుంది. ఈ విలక్షణ తత్వమే ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపట్ల ప్రజల భయాందోళనలు ఒక స్థాయికి మించి ప్రబలడానికి కారణమయింది.
‘పనిచేసే ప్రభుత్వం కావాలని అందరం కోరుకుంటాం. అయితే ప్రభుత్వం నిశ్శబ్దంగా పనిచేస్తోంద’ని ఎవరైనా అంటే ఓ పట్టాన నమ్మం. ఇది మానవ మనస్తత్వం.
‘ఈ వ్యాధి మహమ్మారిలా చుట్టుముడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది’ అనేది ఇలాంటి సందర్భాలలో సాధారణంగా వినబడే మాట.
ఈ మాటలు అనేవాళ్ళు ముందు అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే. ఎవరూ ఈ వ్యాధి రావాలని కోరుకోలేదు. ఎక్కడో చైనాలో పుట్టి చుట్టుపక్కల దేశాలకు పాకి, రోజుల వ్యవధిలోనే  ప్రపంచమంతటా విస్తరించింది. ప్రభుత్వాల అలసత్వం వల్లనో, నిర్లక్ష్యం వల్లనో ఈ కరోనా వ్యాధి మనదేశంలో పురుడు పోసుకోలేదు. విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వ్యాధి మన దేశంలో కాలుమోపింది.
ఈ కరోనా అనేది సరికొత్త అంటు వ్యాధి. దీనిని గురించి ఎవరికీ తెలియదు. ఎలా వస్తుందో తెలియదు. ఎలా పోతుందో తెలవదు. విరుగుడు ఏమిటో అసలే  తెలియదు.  కలరా మొదలైన అంటు వ్యాధులకు రోగ నిరోధక టీకాలు వున్నాయి. కొత్తగా పుట్టుకొచ్చిన ఈ  కరోనా వ్యాధిని అరికట్టడానికి ఆ అవకాశమూ లేదు.
ఇతరేతర వ్యాధులు ప్రబలినప్పుడు ఆ వ్యాధి పీడితులకు బాసటగా వారి బంధుమిత్రులు వుంటారు. చికిత్సచేయడానికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు అనేకం అందుబాటులో  వుంటాయి. ఇవ్వడానికి వాక్సిన్లు, వాడడానికి  మందులు వుంటాయి. కానీ కరోనా విషయం పూర్తిగా విభిన్నం. ఈ వ్యాధి సోకిన లేదా సోకినట్టు అనుమానం ఉన్న రోగిని బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా, కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోనివ్వకుండా వారిని   ఐసొలేషన్ గదుల్లో ఉంచాలి. చికిత్స పెద్ద ఖరీదైనది కాకపోవచ్చుకానీ ఇన్ని రకాల  ఏర్పాట్లు చేయడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. మొదటి రెండు దశల్లో వ్యాధిని  గుర్తించి చికిత్స చేయగలిగితే ప్రాణ హానికి ఆస్కారం వుండదు. కానీ మూడో దశకు చేరుకుంటే ఇక ఆ రోగిని కాపాడడం కష్టం అంటున్నారు వైద్యులు.
మిగిలిన వ్యాధులు వ్యాపించినప్పుడు బాహ్య ప్రపంచం అంతా మామూలుగానే వుంటుంది. ఆఫీసులు  పనిచేస్తాయి. దుకాణాలు, మార్కెట్లు తెరుస్తారు. రైళ్ళు, బస్సులు, కార్లు  విమానాలతో సహా అన్నీ మామూలుగా రాకపోకలు సాగిస్తాయి. ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం అతి స్వల్పంగా వుంటుంది. అదే కరోనా విషయం తీసుకుంటే పరిస్తితి వేరు. మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి  సోకే ప్రమాదం కారణంగా ఈ వైరస్ అతి త్వరితంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. అంచేత ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే స్వచ్చంద స్వీయ గృహ నిర్బంధం మినహా మరో దారి లేదు.
అందుకే, ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే పెను ముప్పు ఓ పక్క  పొంచి ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు సాహసం చేసి లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. ప్రజలు గుంపులుగా తిరుగుతూ, వారికి తెలియకుండానే ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధిని  సంక్రమింప చేసే ప్రమాదం ఉన్నందున, కర్ఫ్యూ వంటి తీవ్రమైన చర్యలను అమలు చేయాల్సిన పరిస్తితి దాపురించింది. మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే ఈ రోగం శరీరంలో ప్రవేశించిన రెండు వారాల వరకు ఆ విషయం గుర్తించడం సాధ్యం కాదు. ఇప్పటివరకు బయటకు వచ్చిన సమాచారాన్ని బట్టి విదేశాల నుంచి వచ్చిన వారివల్లనే ఈ వ్యాధి వ్యాపిస్తోందని తెలుస్తోంది. విదేశాల్లో బయలు దేరినప్పుడు వ్యాధి సోకినా ఆ విషయం వారికి తెలియదు. స్వదేశం చేరిన తర్వాత అలాంటివాళ్ళు ఎంతో మందిని కలిసి వుంటారు. అలాంటివారినందరినీ ఇప్పుడు వెతికి పట్టుకుని పరీక్షలు చేయాల్సిన బృహత్తర కార్యక్రమం ప్రభుత్వ భుజస్కంధాలపై పడింది. ఇది సాధారణ విషయం కాదు. సముద్రపు ఒడ్డున ఇసుకలో పడిపోయిన సూదిని వెతకడం వంటిది. అయినా ప్రభుత్వం వెనుకాడడం లేదు.
శాంతా బయోటిక్ వ్యవస్థాపకులు శ్రీ వరప్రసాదరెడ్డి ఒక టీవీ ఇంటర్వ్యూ లో చెప్పారు. వారి అమ్మాయి ఆ మధ్య కేరళ రాష్ట్రము నుంచి హైదరాబాదు వచ్చారు. ఇటీవల ఒక వైద్య బృందం వారి ఇంటికి వెళ్లి ఆవిడ ఆరోగ్యం గురించి విచారించి తగిన పరీక్షలు చేసి, కరోనా వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారించుకు వెళ్లిందట. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ జాగ్రత్తలు చూసి ఆయన ఆశ్చర్యపోయారట.  అలాగే హైదరాబాదు నగరంలోని హఫీజ్ పేటలో వున్న ఒక కాలనీకి అధికారుల బృందం వెళ్ళింది. పలానా పేరు కలిగిన వ్యక్తులు పలానా రోజున పలానా దేశం నుంచి వచ్చి మీ కాలనీలో వుంటున్నారు, వారికి తక్షణం పరీక్షలు చేయాలని కాలనీ అధ్యక్ష, కార్యదర్శులను అడిగితే వాళ్ళు నివ్వెర పోయారట. విదేశాలనుంచి ఎవరు వచ్చారో అప్పటిదాకా వారికే తెలియదు. వెళ్లి చూస్తే అది నిజమని తేలింది. వెంటనే ఆ వ్యక్తులకు పరీక్షలు చేసి వారిని స్వీయ గృహనిర్బంధంలో వుండాలని చెప్పారట. అప్పటి నుంచి ప్రతిరోజూ ఫోనులో వారిని సంప్రదించి వారి ఆరోగ్య పరిస్తితి గురించి వాకబు చేస్తున్నారట. ఏదో మొక్కుబడిగా కాకుండా ప్రతిరోజూ అలా కనుక్కుంటూ వుండడం  చూసి విదేశాలనుంచి వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట.
గత పదిహేను రోజుల్లో వివిధ దేశాలనుంచి వేలమంది హైదరాబాదు వచ్చి వుంటారు. అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం వుండడం ఒక కారణం కావచ్చు. అలా వచ్చిన వాళ్ళు కార్లలోనో, బస్సుల్లోనో, రైళ్ళలోనో తమ గమ్యస్థానాలకు వెళ్లి వుంటారు. ఈ క్రమంలో వారిలో ఎవరికయినా ఈ వ్యాధి సోకి వుంటే అది ఇతరులకు అంటుకునే ప్రమాదం వుంది. కానీ ఆ ‘ఇతరులు’ ఎవరని గాలింఛి కనిపెట్టడం  సామాన్యమైన విషయం కాదు. నగరాలూ, పట్టణాలు, గ్రామాలు ఇలా అన్నిచోట్లా ప్రభుత్వ యంత్రాంగం అలా వచ్చిన వారికోసం జల్లెడ పట్టి గాలిస్తోంది.
కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తోంది అని మెటికలు విరిచేవాళ్ళు ఈ విషయాలను గమనంలో వుంచుకోవాలి. ఈ వ్యాధిని అరికట్టడం అన్నది ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో లేదు. సమస్త ప్రజానీకం సహకరించినప్పుడే సాధ్యం అవుతుంది. అదే ఆయన చెబుతున్నారు. అదే ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అనవసరంగా రోడ్లమీద తిరగ వద్దంటున్నారు. ఇంటిపట్టునే వుండమంటున్నారు. నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తామంటున్నారు. కొద్ది రోజులు ఓపిక పడితే పరిస్తితి సర్దుకుంటుందని చెబుతున్నారు.
వినడం మనందరి ధర్మం! ఎందుకంటే ఈ మహమ్మారిని అరికట్టగలిగిన సులువు మన చేతుల్లోనే వుంది. మన చేతల్లోనే వుంది.   (EOM)          

24, మార్చి 2020, మంగళవారం

కేటీఆర్ ది గ్రేట్ – భండారు శ్రీనివాసరావు


ఈ సాయంత్రం ఒక బ్లాగు మిత్రులు శ్యామల రావు గారు ఫోన్ చేసారు. వారి శ్రీమతికి వారానికి రెండు సార్లు డయాలిసిస్ చేయించాలి. భార్యాభర్తలు ఇరువురూ వృద్ధులు. ఆసుపత్రికి తీసుకువెళ్ళడానికి  మధ్యలో కొరానా కర్ఫ్యూ. ఆయనకి కాళ్ళూ చేతులు ఆడక నాకు ఫోన్ చేశారు. నేను మాత్రం ఏం చేయగలను? ఆలిండియా రేడియో నుంచి రిటైర్ అయి ఇప్పటికి పుష్కరం గడిచింది. నా మాట ఎవరు వింటారు. అంచేత ఓ సలహా ఇచ్చాను. కేటీఆర్ గారికి ట్వీట్/ వాట్సప్ చేయండని. ఆయన అలాగే చేశారు. నిమిషం గడవక ముందే ‘Will take care’ అని జవాబు వచ్చింది. మరి కాసేపటిలో కానుగుల శ్రీనివాస్ గారు అనే ఆయన వారికి ఫోన్ చేసి చిరునామా నోట్ చేసుకున్నారట. ఆ ముసలి దంపతుల ఆనందం ఇంతా అంతా కాదు.
“ముందు మీ సలహా విని తప్పించుకోవడానికి అలా చెప్పారని అనుకున్నా. కానీ ఫోన్ వచ్చేసరికి నా చెవులను నేనే నమ్మలేకపోతున్నా. మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం. ప్రభుత్వ స్పందన అద్భుతం” ఫోనులో చెబుతున్నారాయన, కానీ ఆయన కంటి వెంట కారుతున్న ఆనంద భాష్పాలు ఆ మాటల్లో  నాకు కనబడుతూనే వున్నాయి.
సామాన్యులు కృతజ్ఞత తెలిపే విధానం ఇలాగే వుంటుంది.
‘నేనున్నాను’ అని భరోసా ఇచ్చే ప్రభుత్వాన్ని వారెప్పుడు మరచిపోరు.  

ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయరా?


ప్రభుత్వ ఉద్యోగులు సరిగా పనిచేయరనే అపోహ చాలామందిలో వుంది.  అది అపోహ మాత్రమే, వాస్తవం కాదు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, రాత్రీ  పగలు అనకుండా, కుటుంబాలకు దూరంగా ఉంటూ, అహరహం పనిచేసేవారు ప్రభుత్వ ఉద్యోగులలోనే కనబడతారు. సీనియర్ ఐ.ఏ.ఎస్. అధికారి శ్రీ బి. దానం, ఉమ్మడి రాష్ట్రంలో  ఉత్తరాంధ్రలో పనిచేసే సమయంలో అక్కడే శ్రీకాకుళంలో శ్రీ విశాఖ గ్రామీణ బాంక్ చైర్మన్ గా ఉన్న మా రెండో అన్నగారు రామచంద్రరావుతో అనేవారట.
‘ఎవరెన్నయినా అననివ్వండి, గవర్నమెంటు వాళ్ళు పనిచేసే పద్దతే వేరు. తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు చూడండి,  సరైన రోడ్లు లేకపోయినా దెబ్బతిన్న ప్రతి గ్రామానికి వెడతారు. బియ్యం మూటలు తీసుకువెళ్ళి బాధితులకు పంచిపెడతారు. ఎన్నికలు వస్తే పార్వతీపురం వంటి ప్రాంతాలలోని  సుదూర గ్రామీణ ప్రాంతాలకు బ్యాలెట్ పెట్టెలు మోసుకుని వెడతారు. ఆవూళ్ళల్లో వారికి సరైన భోజనం దొరకదు, వసతి వుండదు. అయినా పై అధికారులు చెప్పిన టైముకు అక్కడ హాజరు అవుతారు. కొన్ని ఊళ్లల్లో కక్షలు కార్పణ్యాలు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలవదు. అయినా వాళ్ళు అన్నిటికీ సిద్ధపడి విధులు నిర్వహిస్తారు. మరి అలాంటప్పుడు, ‘ఏమీ పనిచేయరు, జీతాలు తీసుకోవడం తప్ప’ అని వాళ్ళని నిందించడం సబబేనా?’ దానం గారి ప్రశ్న.     

దినపత్రికల లాక్ డౌన్ ???


కర్ఫ్యూ నుంచి మీడియాకు మినహాయింపు ఇచ్చారు కానీ కొన్ని మీడియా సంస్థలు (పత్రికలు) ఈ వెసులుబాటు ఉపయోగించుకోవాలనే ఉద్దేశ్యంలో లేనట్టు కానవస్తోంది. హైదరాబాదు నుంచి వెలువడుతున్న కొన్ని ప్రధాన పత్రికలు ఈ నెలాఖరువరకు ముద్రణ నిలిపివేసే ఆలోచనలో వున్నాయి. ఇందుకు ప్రధాన కారణం పత్రికలను ఇళ్ళకు చేరవేసే వ్యవస్థ (వెండర్లు, పేపర్ బాయిస్) లో కరోనా కారణంగా కొన్ని అడ్డంకులు తలెత్తడం, రవాణా వ్యవస్థలో ఏర్పడ్డ అవరోధాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిన న్యూస్ ప్రింట్ సకాలానికి రాకపోవడం, రోజులో చాలాభాగం సిబ్బంది పనిచేసే అవసరం ఉన్న కారణం వల్ల ఉద్యోగులకు కలిగే ఇబ్బందిని తగ్గించాలనే నిర్ణయం ఇలా అనేక కారణాలతో పత్రికాముద్రణ నిలిచి పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ఆన్ లైన్ లో పత్రికలను పాఠకులకు అందించే వెసులుబాటును అందిపుచ్చుకునే ఉద్దేశ్యం కూడా మరో కారణం. ఏతావాతా తెలుగు పత్రికలలో చాలావరకు ముద్రణకు స్వస్తి చెప్పే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ దిశలో డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి చొరవ తీసుకుంటున్నాయని, ఈ గ్రూపు తమ రెండు పత్రికల ముద్రణకు నేడో రేపో స్వస్తి చెప్పబోతోందని విశ్వసనీయ వర్గాల భోగట్టా. మరికొన్ని అదేబాటలో వున్నాయని, అయితే ఉగాది పండుగ రోజున ప్రకటనల రూపంలో వచ్చే అదనపు రాబడి విషయం గురించి మీనమేషాలు లెక్కబెడుతున్నట్టు తెలుస్తోంది.       

19, మార్చి 2020, గురువారం

జగమే మాయ – భండారు శ్రీనివాసరావు


“కింది వరుసలో అక్షరాలు చదవండి”
 “ఏ ఓ సి ఓ”
“లాభం లేదు ఓ సి లాగా, సి ఓ లాగా కనిపిస్తోంది అంటే అద్దాల పవర్ మార్చాల్సిందే”
అలా అన్నాడంటే అతడు కంటి డాక్టరు.
“ఇవి ఎన్ని వేళ్ళు?”అడిగాడు కంటి ముందు తన రెండు వేళ్ళు ఆడిస్తూ.
“మూడు”
“కాదు సరిగా చూడు మళ్ళీ”
“నిజమే రెండే”
“మళ్ళీ పొరపడ్డారు, ఇప్పుడు చూడండి నాలుగు వేళ్ళు, అవునా!”
అలా మాయ చేసేవాడు  మెజీషియన్.
“పలానా మంత్రి రాజీనామా చేసాడు”
“చేయలేదు”
“కాదు చేశాడు ఇదిగో రాజీనామా లేఖ”
“అలాగా”
‘ఆ లేఖ నాది కాదు, గిట్టని వాళ్ళ సృష్టి, అని అంటున్న పలానా మంత్రి”
అలా కనపడ్డా, వినపడ్డా అది టీవీ   
  


18, మార్చి 2020, బుధవారం

రేవంత్ రెడ్డి కి సొంత పార్టీ వల్లే వెన్ను పోటు..! | Revanth Reddy Latest...

సుప్రీం తలుపు తట్టి జగన్ ప్రభుత్వం సాధించింది ఏమిటి? – భండారు శ్రీనివాసరావు


స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేస్తూ ఏపీ ఎలక్షన్ కమిషనర్  ఎన్. రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయ స్థానం ధృవీకరిస్తుందని  జగన్ మోహనరెడ్డికి తెలియదని అనుకోలేం. మరి కేసును అక్కడిదాకా ఎందుకు తీసుకువెళ్ళినట్టు. తీర్పు తమ ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే అంతకంటే కావాల్సింది లేదు. అనుకున్న విధంగా ఎన్నికలను  ఈ నెలాఖరుకల్లా పూర్తిచేయవచ్చు. రాకుంటే..
ఏ ముఖ్యమంత్రి అయినా తాను అనుకున్న విధంగా పధకాలను, ప్రణాలికలను అమలుచేసే వెసులుబాటు వుండాలని కోరుకుంటారు. అది సహజం. అయితే,  ఇలా ఎన్నికల పేరుతొ కోడ్ అమల్లో వున్నప్పుడు, పైగా అది నిరవధికంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నప్పుడు ఏదో విధంగా ఆ ఆంక్షల పరిధి నుంచి బయటపడాలని చూస్తారు. ఆ కోణంలో చూసినప్పుడు, ఎన్నికల కోడ్  ఎత్తివేస్తూ సుప్రీం ఇచ్చిన  తీర్పు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి కొంత ఊరట కలిగించే వుండాలి.
ఇక్కడ గతాన్ని కొంత గుర్తు చేసుకుందాం. సరిగ్గా ఇలాగే కాకపోయినా చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఇదే రకమైన పరిస్తితి ఆయన అనుభవంలోకి వచ్చింది.
అలిపిరి దుర్ఘటన తర్వాత ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని తలపోశారు. కేంద్రంలో కూడా అనుకూల ప్రభుత్వం వుంది. అయినా చంద్రబాబు భావించినట్టు ఎన్నికలు వెంటనే రాలేదు. రాకపోగా ఆయనది ఆపద్ధర్మ పరిపాలన అయింది. దాదాపు నాలుగు మాసాలపాటు ఉడ్డుగుడుచుకున్నట్టు అయింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేకుండా ఆంక్షలు. వేసవి తోసుకువచ్చింది. నీళ్ళ కరువు. మరోపక్క కరెంటు కష్టాలు. కాళ్ళూ చేతులూ కట్టేసి కబడ్డీ ఆడమన్నట్టు అయింది.
తర్వాత ఏం జరిగిందో తెలిసిన చరిత్రే.       

Sr journalist Bandaru Srinivasa Rao Reveals 10 Reasons For TDP Failure I...

17, మార్చి 2020, మంగళవారం

YS Jagan Fallen in Trap of Chandrababu Naidu ? | Sr Journalist Bandaru S...

Sr Journalist Bandaru Srinivas Rao Reveals Secrets About SEC Nimmagadda ...

Sr Journalist Bandaru Srinivas Rao Secrets About Chandrababu & Nimmagadd...

YS Jagan Fallen in Trap of Chandrababu Naidu ? | Sr Journalist Bandaru S...

12, మార్చి 2020, గురువారం

ఓటు ఖరీదు – భండారు శ్రీనివాసరావు

ప్రస్తుత ప్రజాస్వామ్య వ్యవస్థను కుళ్ళబొడుస్తున్న సమస్త రుగ్మతలకు డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు ఓటరు గురవుతూ ఉండడమే కారణమని చాలామంది అభిప్రాయం. నిజానికి అది నిజం కూడా. ఎందుకంటే ఈ అభిప్రాయం కలిగివున్న వాళ్ళు కూడా ఓటర్లే. ఆ విషయాన్ని ఈ సిద్దాంతకర్తలు మరచిపోకూడదు.
‘పక్క వూళ్ళో ఓటుకి రెండువేలు ఇస్తున్నారు, మాకు కూడా అలాగే ఇవ్వండి’ అని డిమాండ్ చేసి మరీ పుచ్చుకుని ఓట్లను తెగనమ్ముకుంటున్నారు అనేది మరో ఆరోపణ. అంటే ఏమిటన్న మాట. ఒకరిని చూసి మరొకరు నేర్చుకుంటున్నారని ఒప్పుకుంటున్నట్టే కదా!
అదే నిజమైనప్పుడు ఓట్ల కోసం ఎమ్మెల్యేలను విమానాల్లో తరలించి పంచ నక్షత్రాల హోటళ్ళలో రాజభోగాలు అమర్చి రాజకీయ పార్టీలు ఇవ్వచూపుతున్న అనేకానేక ప్రలోభాలను గురించి సామాన్య జనం కూడా పత్రికల్లో చదువుతున్నారు, టీవీల్లో చూస్తున్నారు. కదా! మరి, రెండు వేలు పెట్టి కొనుగోలు చేసిన వారి ఓట్లతో నెగ్గిన ఆ ప్రజాప్రతినిధులు, అదే ఓటును గంటకు వేలాది రూపాయల ప్రలోభాలకు తాకట్టు పెడుతున్న సంగతి తెలిసినప్పుడు వారికి ఎలా అనిపిస్తుంది. రెండు పెద్ద కరెన్సీ నోట్లు, ఓ సీసాడు మద్యంతో కొన్న ఓటు విలువ తమ కళ్ళముందే కొన్ని వేలరెట్లు పెరిగిపోవడం చూసి వారి కడుపు రగలకుండా ఉంటుందా!
కాబట్టి ఓటును మద్యానికి అమ్మినా, కరెన్సీ నోట్లకు అమ్మినా, మహారాజ భోగాలకు, మంత్రి పదవులకు అమ్ముకున్నా ఒకటే అని సూత్రీకరించండి, అప్పుడు వాదన సబబుగా వుంటుంది. న్యాయం అందరికీ ఒకటే.


ఇలా అని, ఓటర్లను ప్రలోభపెట్టడాన్ని నేను సమర్ధిస్తున్నాను అని అనుకోవద్దు. నిజం నిష్టూరంగానే వుంటుంది.అది మరవద్దు.

షేర్ ఖాన్ లు – సింద్ బాదు


చిన్నప్పుడు చందమామ పత్రికలో ‘సింద్ బాద్ సాహస యాత్రలు’ అనే పేరుతో సీరియల్ కధలు వచ్చేవి.
సింద్ బాద్ అనే వర్తకుడు పడవల్లో సరుకులు నింపుకుని వేరే దేశాల్లో విక్రయించి అపార ధన రాశులతో తిరిగివస్తుంటే ప్రచండమైన తుపాను గాలులు చుట్టుముట్టడం, నడిసముద్రంలో నౌకలు మునిగిపోయి, సర్వస్వం కోల్పోయి ఈదుకుంటూ ఏదో వడ్డుకు చేరి భయంకరమైన దీవుల్లో నరరూప రాక్షసుల మధ్య రోజులు గడుపుతూ ఎన్నో సాహస కార్యాలు చేసి తిరిగి తన ఊరు చేరుకోవడం ఈ సీరియల్ కధల్లోని ప్రధాన ఇతివృత్తం.
ఇప్పుడు స్టాక్ మార్కెట్లు కుదేలై, లక్షల కోట్ల రూపాయల మేరకు మదుపరుల పెట్టుబడులు ఆవిరై పోతున్నాయనని అనుదినం పత్రికల్లో చదువుతున్నప్పుడు ఈ సింద్ బాద్ గుర్తుకువచ్చాడు. తుపాను వచ్చి సింద్ బాద్ సర్వస్వం కోల్పోతే, ఇప్పుడు కరోనా దెబ్బకు షేర్ల ధరలు దారుణంగా పడిపోతున్నాయట.
ఎక్కడో కొడితే, మరెక్కడో తగలడం అంటే ఇదేనేమో!
గమనిక: ఈ షేర్ మార్కెట్లకు సంబంధించి ఇసుమంత అవగాహన కూడా నాకు లేదు.

ఇలా గుర్తుంచుకుంటారన్న మాట:

మందలపర్తి వారు, గతంలో నేను ఏదో ఒక సందర్భంలో చెప్పిన (రాసిన) సంగతిని ఇలా గుర్తు చేశారు.
“అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు.
ఒకామె పేరు రసజ్ఞత; మరొకామె విజ్ఞత.
రసజ్ఞత, చాలాకాలం తర్వాత, ఓ రోజున విజ్ఞత ఇంటికివెళ్ళింది. విజ్ఞత ఆమెని ఇల్లంతా తిప్పి బాల్కనీలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టింది.
టీ-బిస్కెట్ మర్యాదలయ్యాక, రసజ్ఞత తృప్తిగా ఇలా అంది:
'ఏమో అనుకున్నా కానీ, పర్వాలేదే! నువ్వూ, కష్టపడి, బాగానే పోగేశావ్!'
మిత్రురాలి మాటలకు చిన్నగా నవ్వి, విజ్ఞత ఇలా బదులిచ్చింది.
'అబ్బే! ఇందులో మనకష్టం ఏముంది? అంతా అయాచితంగా వచ్చిపడిందే!!
మన రాజకీయుల త్యాగనిరతి వల్ల ఇది సాధ్యమైంది, అంతే! ప్రతి రాజకీయనాయకుడూ, సర్వం ప్రత్యర్థి విజ్ఞతకే వదిలేస్తున్నాడు. అతగాడికేమో అది అక్కర్లేదు. అన్నీ అలా మన వొళ్ళో వచ్చి పడిపోతున్నాయి!'
"!!!!"

6, మార్చి 2020, శుక్రవారం

పొత్తూరి ఇక లేరు

తెలుగు పాత్రికేయ దిగ్గజం పొత్తూరి

(Published in Andhra Prabha  daily on 06-03-2020) 

‘ఒక పత్రిక ఎడిటర్ అనేవాడు ఎలావుంటాడు? ఎలా వుండాలి?’ అని కళ్ళుమూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ నెమ్మదిగా కళ్ళు తెరిచినప్పుడు కనబడే రూపమే శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు. 
ముఖ్యమంత్రి కేసీఆర్ సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు నేనూ  కలిసి ఒకసారి  పొత్తూరి వారి ఇంటికి వెళ్లాం. వారు రాసిన ‘బులేనా’ పుస్తకం సంతకం చేసి ఇచ్చారు. ‘ఎలా వున్నారు, ఆరోగ్యం ఇప్పుడు కులాసా కదా’ అని మేము అడగడం తప్పిస్తే ఆయన అంతట ఆయన తన అనారోగ్యం గురించి ఒక్క మాటా మాట్లాడలేదు. ఎంతో ఖరీదయిన వైద్యం. మామూలు మందులు కాక అదనంగా మూడు వారాలపాటు రోజుకొక కాప్స్యూల్ వేసుకోవాలి. ఒక్కొక్కటి అక్షరాలా వెయ్యి రూపాయలు. సాదా సీదా అట్టపెట్టెలోవున్న ఆ మాత్రల బాటిల్ ఇరవై వేల రూపాయలు అంటే నమ్మ బుద్దికాలేదు, కానీ కళ్ళెదుట కనబడుతున్న వాస్తవం అది.
వున్న ఆ కొద్ది సమయంలోనే  ఆయన ఎన్నో కబుర్లు చెప్పారు. ప్రత్యేకతెలంగాణా ఉద్యమం కొన్ని దశాబ్దాల క్రితం సికిందరాబాదులోని ఒక హోటల్లో  ఎలా ఊపిరి పోసుకున్నదో చెబుతూ ఆనాటి విశేషాలు వివరించారు.
ఇంట్లో పెంచుకుంటున్న ఈశ్వర నామం కలిగిన ఒక మొక్కను చూపించారు. పచ్చటి వర్ణం కలిగిన ఆకులు. వాటి మీద కపిల వర్ణంలో ‘నాగుపాము పడగ’ మీద వుండే కృష్ణ పాద ముద్రలు. ఆ మొక్క చాలా అరుదుగా దొరుకుతుందట. ఆ మొక్క వుంటే పాములు ఆ దరికి కూడా రావట. ఆయుర్వేద వైద్యులు మాత్రమే ఈ మొక్కను గుర్తించగలరట. ప్రాచీన ఔషధీ శాస్త్రంలో ఇటువంటివి ఎన్నో వున్నాయని చెప్పారు.
నిజం కావచ్చు. నిజం కాదని నమ్మే వాళ్ళూ వుంటారు.
నమ్మేవారు మొక్కితే  రాయే సాయి, నమ్మనివారు  తొక్కితే అదే రాయి.
అదలా ఉంచి వెంకటేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన కొన్ని విశేషాలు నెమరు వేసుకుందాం.
ఈనాటి పత్రికారంగం వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశాలు వాటిల్లో వున్నాయి.
పత్రిక యజమానికి తన పత్రిక గురించి ఆరా తీసే అధికారం ఉంటుందా?
ఇప్పటి రోజుల్లో అయితే ఇదొక ప్రశ్నే కాదు. ఆరా తీయడమేమిటి, వార్తలను  అదుపు చేసే అధికారం కూడా వుంటుంది.
అయితే దాన్ని గురించి ఒక పాత విషయం చెప్పారు. కొంచెం అటూ ఇటూగా  మూడు దశాబ్దాల నాటి సంగతి.
అప్పటి ఆంద్రప్రభ దినపత్రికకు పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్.
విజయవాడలో రంగా హత్య దరిమిలా జరిగిన విధ్వంస కాండపై,  రామోజీరావు గారు చైర్మన్ గా ఉన్న ఎడిటర్స్ గిల్డ్  ఒక నిజనిర్ధారణ కమిటీ వేసింది. కుల్ దీప్ నాయర్,  చెన్నై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ జగన్నాధన్ తో  పాటు  ఆంధ్రప్రభ ఎడిటర్ హోదాలో పొత్తూరి వెంకటేశ్వర రావు గారు కూడా అందులో ఒక సభ్యులు.  పొత్తూరివారు విడిగా బెజవాడ వెళ్లి పరిస్తితులను పరిశీలించి   ఒక నివేదిక  పంపారు. అది ఎలా చేరిందో ఇండియన్ ఎక్స్ ప్రెస్   అధినేత రామనాద్ గోయంకాకు చేరింది. అది ఆయనకు రుచించినట్టు లేదు. వెంటనే వెంకటేశ్వర రావు గారికి ఒక లేఖ పంపారు. ‘మీ  నివేదిక నాకు దిగ్భ్రాంతితో కూడిన నిరుత్సాహాన్ని కలిగించింది’ అన్నది దాని సారాంశం. గోయంకా యజమాని. పొత్తూరి వారు ఆయన దగ్గర ఒక ఉద్యోగి. అయినా అలా ఉత్తరం రాయడం ఆయనకు నచ్చలేదు. వెంటనే నిరసనగా రాజీనామా లేఖ గోయంకాకు పంపించారు.
గోయంకా నుంచి పిలుపు వచ్చింది, మద్రాసు వస్తున్నాను అక్కడికి రమ్మని. పొత్తూరిగారు వెళ్ళారు.
 “నా ఎడిటర్ అభిప్రాయంతో విబేధించే స్వేచ్చ నాకు లేదా?” అని సూటిగా అడిగారు, రాజీనామా విషయం ప్రస్తావించకుండా గోయంకా.
ఇంకా ఇలా అన్నారు.
“మన పత్రికలో పాఠకుల ఉత్తరాలు ప్రచురిస్తాము కదా. పత్రిక విధానాలతో విబేధించే ఉత్తరాలు కూడా వేస్తుంటాం. యజమానిగా ఒక విషయం మీ దృష్టికి తెచ్చాను. అది మీకు నచ్చలేదు. సరే! ఒక సాధారణ పాఠకుడికి వుండే ఈ వెసులుబాటు కూడా ఒక యజమానిగా నాకు లేదా చెప్పండి”
ఇలాంటి యజమానికి ఏ సంపాదకుడు అయినా ఏం జవాబు చెబుతారు.
అందుకే గుంభనగా వుండిపోయారు. రాజీనామా విషయం పట్టుబట్టలేదు.
గోయంకానే స్వయంగా రాజీనామా లేఖ పొత్తూరి వారి చేతిలో పెట్టి సాదరంగా సాగనంపుతూ అన్నారు.
“మీరు ఎడిటర్ గా ఉన్నంత కాలం మీరు మీ అభిప్రాయాలనే రాస్తూ వుండండి”
పొత్తూరివారి ఆరోగ్యం బాగాలేదని జ్వాలా ద్వారా తెలుసుకున్న తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖరరావు స్వయంగా పొత్తూరి వారిని చూడడానికి విజయనగర్ కాలనీలోని వారి ఇంటికి వెళ్ళారు. అక్కడి పరిస్తితిని ఓ కంట గమనించిన కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. వారికి పూర్తి స్వస్థత చేకూరేవరకు ఆ బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు అయినప్పటికీ, సుదీర్ఘ కాలం  ప్రాంతీయ ఉద్యమాన్ని నడిపిన నేత అయినప్పటికీ ప్రాంతీయతత్వం ఏ కోశానా లేని కేసీఆర్, పొత్తూరి వారిని  ఒక పాత్రికేయుడుగా గుర్తించారు కాని, అయన ఏప్రాంతం వారనే వివక్ష చూపలేదు. ఆయనలోని ఈ విలక్షణత్వం పొత్తూరివారికి కూడా తెలుసు. కానీ మొదటే చెప్పినట్టు విలువలకు కట్టుబడి జీవిస్తూ వచ్చిన పాత్రికేయుడాయన. అంచేత కేసీఆర్ సాదరంగా ఇవ్వచూపిన సాయాన్ని వారు సున్నితంగా తిరస్కరించారు. అయితే వారిరువురి నడుమ సాగిన సంభాషణలో పొత్తూరి వారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
“రెండో ప్రపంచయుద్ధంలో నాయకత్వం వహించిన నాటి బ్రిటన్ ప్రధానమంత్రి విన్ స్టన్ చర్చిల్ ఆ తరువాత జరిగిన బ్రిటన్ ఎన్నికల్లో ఆట్లీ చేతిలో ఓడిపోయారు. కానీ సుదీర్ఘకాలం ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి సారధ్యం వహించిన కేసీఆర్, తెలంగాణా రాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికలలోనే విజయబావుటా ఎగురవేసి తన నాయకత్వ పటిమను నిరూపించుకున్నారు”   
తెలుగు పత్రికా రంగంలో తరాల నడుమ నడుమ వారధిలా ఉంటూ వచ్చిన పొత్తూరివారి మరణం పాత్రికేయ లోకానికి ఎన్నటికీ తీరని లోటే.


4, మార్చి 2020, బుధవారం

మాడపాటి సత్యవతి గారు ఇక లేరు

(Published in Andhra Jyothy Daily on 07-03-2020, Saturday)
నాలుగు మాసాల క్రితం...
ఫోన్ మోగింది...
AIR Madapati Satyavati
ఫోన్ చేసినవారి పేరు డిస్ ప్లే అయింది. ఏం చెయ్యాలి. మాట్లాడాలా! వదిలేయాలా!
మూడు నెలల నుంచీ ఆవిడ అడపాదడపా ఫోన్ చేస్తూనే వున్నారు.
“శ్రీనివాసరావు గారూ. మీకు పెద్ద కష్టం వచ్చిపడింది. మీకు కుడి భుజం పడిపోయింది. నిర్మల పోయినప్పుడు రాలేకపోయాను. మిమ్మల్ని వెంటనే చూడాలి. ఇంట్లో ఉంటారా?”
ఆవిడ వుండేది గాంధీ హాస్పిటల్ వెనుక. నేనుండేది ఎల్లారెడ్డి గూడా. పైగా మాడపాటి సత్యవతి గారి వయసు ఎనభై ఎనిమిదేళ్ళు.
అంత దూరం నుంచి ఆవిడను రమ్మని అంటే నేను తప్పు చేస్తున్నట్టే లెక్క. ఎలా! నేను పోలేను. రమ్మని చెప్పలేను. అందుకే ఫోన్ ఎత్తకపోవడం. అంతేకాని ఆవిడను అవమానించడం కాదు.
నేనే ఫోన్ చేశాను. ‘సత్యవతి గారూ. ఈ సాయంత్రం వెంకట్రామయ్య గారిని తీసుకునే నేనే మీ ఇంటికి వస్తాను”.
‘అంతకంటేనా! తప్పకుండా రండి” అన్నారావిడ ఎంతో సంబరంగా. మొహం కనిపించకపోయినా ఆ స్వరంలోనే తెలుస్తోంది ఆ ఆనందం.
అనుకున్న సమయానికి కారులో వివేకానంద నగర్, ఈనాడు కాలనీకి వెళ్లాను. అక్కడ ఉంటున్న డి.వెంకట్రామయ్య గారిని ఎక్కించుకుని సికింద్రాబాదు బయలుదేరాము.
సత్యవతి గారింటికి వెళ్ళాము.
మా ఇద్దర్నీ చూడగానే ఆవిడ మొహం వెలిగి పోయింది. మళ్ళీ ఏమి గుర్తుకువచ్చిందో ఏమిటో వదనంలో విచారం తొంగి చూసింది.
‘మనం లోగడ వెంకట్రామయ్య గారింట్లో కలిసాము. అప్పుడు మీ వెంట నిర్మల వచ్చారు’ అన్నారు. తర్వాత ఏమీ మాట్లాడలేకపోయారు. నా సంగతి సరే.
వెంకట్రామయ్యగారు కల్పించుకుని సంభాషణ మార్చారు. పాత రేడియో రోజులు నెమరేసుకున్నాం. నేను రాస్తున్న రేడియో రోజుల ప్రసక్తి వచ్చింది. ‘ఏమిటండీ నన్నలా ఆకాశానికి ఎత్తేశారు’ అన్నారు తన గురించి రాసిన వ్యాసాన్ని ప్రస్తావిస్తూ.
చాలా సేపు కూర్చున్నాం. చాలా విషయాలు మాట్లాడారు. మాటలో అదే నెమ్మదితనం. ఎనభయ్ ఎనిమిదేళ్ళ వృద్ధాప్యపు ఛాయలు శరీరంలో కానవస్తున్నా ఆవిడ కంఠం మాత్రం అలాగే మునుపటి మాదిరిగానే శ్రావ్యంగా వుంది.
మళ్ళీ వీలు చిక్కినప్పుడు వస్తామని చెప్పి వచ్చాము.
పాత పరిచయస్తులను, స్నేహితులను ఇలా కలుస్తుంటే అదో తృప్తి. కానీ ఈ వేగయుగంలో మనసులో అనుకున్నాకుదరని విషయాల్లో ఇదొకటి.
ఇప్పుడు ఆ వెంకట్రామయ్య గారూ లేరు. సత్యవతి గారూ లేరు.


(మాడపాటి సత్యవతి)

1, మార్చి 2020, ఆదివారం

ఇది నా జీవితం. కధకాదు.



అంచేత సాఫీగా ఎలాంటి ముడులు లేకుండా చెబుతాను.
నా భార్య చనిపోయి ఏడో నెల నడుస్తోంది. పెద్దవాడు సందీప్ అమెరికాలో తల్లి మాసికాలు భార్య భావనతో కలిసి ప్రతినెలా శ్రద్ధగా పెడుతున్నాడు. రెండోవాడు సంతోష్ బెంగళూరులో ఓ మల్టి నేషనల్ కంపెనీలో పనిచేస్తాడు. రెండో కోడలు నిశ నాకు తోడుగా ఉంటోంది. తనదీ విసుగూ విరామంలేని మల్టీ నేషనల్ ఉద్యోగమే. కాకపొతే వర్క్ ఫ్రం హోం వెసులుబాటు వుంది. ఇన్నాళ్ళుగా సంతోష్ ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఆదివారం సాయంత్రం తిరిగి వెడుతుండేవాడు. ఈ నెలలో ఆ ఉద్యోగం హైదరాబాదుకే మారింది. వాళ్ళ సామాను సదిరే కార్యక్రమంలో ఓ కపిలకట్ట బయట పడింది. అందులో ఏముంటాయో నాకు తెలుసు కాని వాళ్లకు తెలియదు. దాన్ని నేను పదిలంగా తీసుకుని భద్రపరచుకున్నాను. మా ఆవిడకు అదంటే ప్రాణ సమానం. మేము మాస్కో వెళ్ళినా మాతోటే వచ్చింది. తిరిగి మాతోటే ఇండియా వచ్చింది. హైదరాబాదులో ఎన్నో ఇళ్ళు మారినా అది మాత్రం తను మరచిపోకుండా వెంట తెచ్చుకునేది. అందులో బంగారం ఏమీ లేదు. బంగారం లాంటి ఉత్తరాలు ఉన్నాయి. యాభయ్ రెండేళ్ళ క్రితం మా పెళ్ళికి పూర్వం రెండు మూడేళ్ళ పాటు మా మధ్య ఉత్తరాయణం నడిచింది. నేను రాసినవన్నీ ఆవిడ దగ్గర భద్రంగా వున్నాయి. తను రాసిన వాటిలో కొన్నే నా దగ్గర మిగిలాయి.
మిమ్మల్ని ఇలాంటి వ్యక్తిగత విషయాలతో విసిగించడం నా ఉద్దేశ్యం కాదు. ప్రేమించిన ఆడదాని హృదయం ఎంత గొప్పదో, అది ఎంతటి ఉదాత్త ప్రేమో చెప్పడం కోసమే ఈ ప్రయత్నం.
ఆమె రాసిన వాటిల్లో అణువణువూ ప్రేమమయం. నా ఉత్తరాలు అన్నీ డాబుదర్పం. పెళ్ళయిన తర్వాత ఎలా మెలగాలి, అత్తగారు, ఆడబిడ్డలతో ఎలా వుండాలి ఇలా అన్నమాట. నిజానికి అలా నిర్బంధించే అధికారం నాకేమి వుంది. ఆమె నన్ను ప్రేమిస్తోంది. నేను ఆమెను ప్రేమిస్తున్నాను. అంతే! అలాంటప్పుడు నా ఈ పేను పెత్తనం ఏమిటి? అవి చదివి ఎంత నొచ్చుకుని వుంటుంది. అయినా నన్ను పెళ్ళాడింది అంటే అది ఆమె గొప్పతనమే. ఇప్పుడు తలచుకుంటే చాలా చిన్నతనం అనిపిస్తుంది.
నన్ను మన్నించు! నన్ను క్షమించు ! అని ఎంతగా గొంతు చించుకున్నా నా మాటలు వినబడనంత దూరానికి వెళ్ళిపోయింది.


(భండారు నిర్మలాదేవి)