31, మార్చి 2022, గురువారం

ఐ.ఏ.ఎస్. అధికారులకు జైలు శిక్ష

 వార్త: ఐ.ఏ.ఎస్. అధికారులకు జైలు శిక్ష

వ్యాఖ్య: ఎప్పుడో అయిదేళ్ళ క్రితం TIMES OF INDIA పత్రికలో వచ్చిన వ్యాసానికి నా స్వేచ్చానువాదం
నిజాయితీకి ఇచ్చే నజరానా ఇదా? – పార్ధ సేన్ శర్మ ఐ.ఏ.ఎస్.
(ఒక ఐ.ఏ.ఎస్.అధికారి అంతరంగ ఆవిష్కరణ)
అతనొక నిఖార్సయిన అధికారి. ప్రభుత్వంలో కార్యదర్శి హోదా కలిగిన సీనియర్ అధికారి. అయితే మాత్రమేం ఒక ట్రయల్ కోర్టులో ముద్దాయిగా నిలబడక తప్పలేదు. తప్పు లేదు, చట్టం ముందు అందరూ సమానులే. కానీ ఇతడి విషయం వేరు. కోర్టులో నిలబడి న్యాయమూర్తిని ఏమి కోరాడో తెలుసా? “కోర్టు ఖర్చులు భరించగల స్థోమత లేదు, నన్ను జైలుకు పంపించండి’ అని.
అయితే ఏ దశలోనూ ఆ అధికారి మీద నేరం రుజువు కాలేదు. అంటే ఏమిటి అర్ధం? యావత్ దేశం తలవంచుకోవాల్సిన సందర్భం. అలా జరిగిందా. లేదు. ఎందుకంటే మనది మహాత్ములు పుట్టిన పుణ్యభూమి. సీనియర్ అధికారులు, మీదు మించి సమర్ధులు, నిజాయితీపరులు ఇలా కోర్టు గుమ్మాలు ఎక్కాల్సిన స్తితి దాపురించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానమైనది ఒక చట్టం. దానిపేరు అవినీతి నిరోధక చట్టం, 1988. ఎంతో సమున్నత లక్ష్యం కలిగిన ఈ చట్టాన్ని లోతుగా పరిశీలిస్తే అందులో దాగున్న ‘విషపు కోరలు’ కానవస్తాయి. మరీ ముఖ్యంగా ఈ చట్టంలోని 13 వ సెక్షన్. ఒక అధికారి తీసుకునే నిర్ణయం వల్ల ఎవరయినా లబ్ది పొందితే ఆ అధికారి కూడా నేరంలో భాగస్వామి అవుతాడని ఈ సెక్షన్ నిర్దేశిస్తోంది. ప్రభుత్వం అంటేనే పనులు చేసిపెట్టడం. ఎవరికీ ఎలాంటి ప్రయోజనం కలగని పనులంటూ వుండవు. ఉదాహరణకు ఒక ఋణం మంజూరు చేసినా, భూమిని కేటాయించినా, ఒక కాంట్రాక్టు ఇచ్చినా, కొనుగోలు ఒప్పందం చేసుకున్నా ఎవరో ఒకరు ఖచ్చితంగా లబ్ది పొందడం ఖాయం. అలా జరగకుండా పనులు చేయాలంటే అసలు పనులనేవే జరగవు. పాలన స్థభించి పోతుంది. ఇటువంటి సందర్భాలలో ఒక పదం వాడుతుంటారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని. మరి ఇలా తీసుకునే ఈ నిర్ణయాలన్నీ ప్రజా ప్రయోజనాలకోసమేనా అంటే అదొక సమాధానం రాని ప్రశ్న. అంతకంటే జవాబు లేని ప్రశ్న అంటే సముచితంగా ఉంటుందేమో! యావత్ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తున్న తరుణం. రాజకీయ వైరుధ్యాలు, నా మాటే చెల్లుబడి కావాలనే తత్వాలు, మీడియా పరిశోధనలు, నైతికపరమైన సంశోధనలు, న్యాయపరమైన అంశాలు ఈ దారిలో ఎదురై ఒక రకమైన అపనమ్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. దానితో అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయం పరీక్షకు గురవుతోంది. ఆ నిర్ణయం వెనుక ఉద్దేశ్యాలను ఆపాదించడం జరుగుతోంది.
క్రికెట్ మైదానంలో నిలబడ్డ బాట్స్ మన్ ప్రతి బంతినీ సిక్స్ గా ఎందుకు మలచడం లేదు అని గేలరీలనుంచి చూస్తూ ప్రశ్నించడం తేలికే. అదే ఇరవై రెండు గజాల దూరంలో బ్రెట్ లీ బంతిని విసురుతున్నప్పుడు అది ఎంతకష్టమైన కార్యమో అర్ధం అవుతుంది. ఇప్పుడు దేశంలోని సివిల్ సర్వీసు అధికారులు కోరుతున్నది ఒక్కటే. వారు తీసుకునే నిర్ణయం వల్ల అయాచిత ప్రయోజనం ఎవరికయినా కలిగిందని సందేహం కలిగినప్పుడు, అతడిమీద క్రిమినల్ కేసు పెట్టడానికి ముందు, ఆ నిర్ణయం కారణంగా ఆ అధికారికి వ్యక్తిగత ప్రయోజనం లభించిందని రుజువు చేయాలి. యిందుకు అనుగుణంగా అవినీతి నిరోధక చట్టాన్ని సవరించాలి. సమర్దుడయిన, నిజాయితీ పరుడయిన అధికారి ఎవరయినా సరే తన విధులను, కర్తవ్యాలను నిర్భయంగా నిర్వహించాలంటే చట్ట సవరణ ఒక్కటే మార్గం. నిబద్దతతో వ్యవహరించే అధికారులు అనవసరమైన వేధింపులకు గురికాకుండా చూడాలంటే ఇది తప్పనిసరి. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ఇప్పటికే ఇందుకు సంబంధించి ఒక నివేదికను రూపొందించి సభకు సమర్పించింది కూడా. సెక్షన్ పదమూడును మార్చాలని ఈ కమిటీ సూచించింది. 2013లోనే ఈ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కానీ ఇంతవరకు దానికి మోక్షం సిద్దించలేదు. సివిల్ సర్వీసుకు ఎన్నికయిన యువ అధికారులకు సీనియర్ అధికారులు ఒక సలహా ఇస్తుంటారు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోమనీ, ప్రజల ప్రయోజనాలకోసం తీసుకునే ఏ నిర్ణయమైనా మంచి నిజాయితీ కలిగిన అధికారులకు ఎలాంటి హాని చేయదనీ, వారి నిబద్దతే వారిని కాపాడుతుందని. వాస్తవంగా అలా జరుగుతోందా అంటే అనుమానమే. ఇంకొక విచిత్రం ఏమిటంటే, ఇలా నిర్ణయాలు తీసుకుని చిక్కుల్లో పడ్డ అధికారులలో ఎక్కువమంది మంచి నిజాయితీపరులు వుండడం.
(COURTESY: TIMES OF INDIA)

NOTE: మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వీ. సుబ్రహ్మణ్యం ఇప్పుడే తెలియచేసారు. ఈ పోస్టులో నేను ఉటంకించిన చట్ట సవరణ జరిగిందని. అయిదేళ్ళ నాటి పోస్టు ఇది. అంచేత సమాచార లోపం. క్షంతవ్యుడిని.
(25-02-2017)

30, మార్చి 2022, బుధవారం

ఇడ్లీల గొప్పతనం ఇంతింత కాదయా!

ఈరోజు ఇడ్లీల దినోత్సవం అంటున్నారు. కాబట్టి ఒక కధ చెప్పుకుందాం.

భారత దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు.

ఆ రోజుల్లో ఒక అయ్యరు గారు మద్రాసు నుంచి కలకత్తాకు హౌరా మెయిల్లో వెడుతున్నారు. అదే బోగీలో ఓ ఆంగ్లేయుడు కూడా ప్రయాణం చేస్తున్నారు. తెల్లారేసరికి రైలు బెజవాడ స్టేషన్ చేరుకుంది. ఉన్నత తరగతిలో ప్రయాణించే వారికి రైల్వే వారు స్పెన్సర్ బ్రేక్ ఫాస్ట్ ఉచితంగా అందించేవారు. ఆ బ్రిటిషర్ దాంతో కడుపు నింపుకున్నారు. అయ్యరు గారు మాత్రం ఇంటి నుంచి తెచ్చుకున్న నాలుగు గిన్నెల టిఫిన్ క్యారియర్ విప్పి అందులో ఒక గిన్నెలోని రెండు ఇడ్లీలు తీసి తినడం ఆ ఆంగ్లేయుడు గమనించాడు. తెల్లగా, గుండ్రంగా ఉన్న ఆ పదార్ధం ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత ఆయనలో మొదలయింది. అయితే అడగడం మర్యాదగా ఉండదని మిన్నకుండిపోయాడు.

మధ్యాన్నానికల్లా రైలు వాల్తేరు చేరుకుంది. రైల్వే వాళ్ళు ఆంగ్లేయుడికి చక్కటి, రుచికరమైన భోజనం అందించారు. అయ్యరు గారు రైల్వే భోజనాన్ని మృదువుగా తిరస్కరించి తన క్యారియర్ తెరిచి రెండో గిన్నెలో వున్న మరో రెండు ఇడ్లీలు కమ్మగా తినడం ఆ బ్రిటిష్ వ్యక్తి గమనిస్తూనే వున్నాడు. యెంత ఆలోచించినా తోటి ప్రయాణీకుడు తింటున్నవేమిటి అనేది ఆయనకు అర్ధం కాలేదు. దాంతో ఆయన ఉత్కంఠ మరింత పెరిగింది.

రైలు బెర్హంపూరులో ఆగింది. మళ్ళీ అదే సీను.

బ్రిటిషర్ ఇక తట్టుకోలేక నేరుగా అడిగేశాడు.

అయ్యా! ఇలా అడగడం మర్యాద కాదని తెలిసీ అడుగుతున్నాను. మీరు తింటున్న ఆ తెల్లటి పదార్ధాలను నేను ఎప్పుడూ చూడలేదు. అవేమిటో తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా వుంది”

అయ్యరు ఇలా జవాబిచ్చారు.

ఇవి ఐ.క్యు. టాబిలెట్స్. అర్ధం మీకు తెలుసుగా. మేధస్సు పెంచడానికి వీలైన పోషకాలు వీటిలో వున్నాయి. వీటిని తిని, భోజనం గట్రా ఏమీ లేకుండా మేము రోజులతరబడి వుండగలం”

వీటిని ఎలా తయారు చేస్తారు” బ్రిటిషర్ ఆరా.

అయ్యరు గారు ఇడ్లీలు తయారు చేయడానికి కావాల్సిన సంభారాలు గురించీ, తయారు చేసే విధానం గురించీ వివరంగా చెప్పారు.

మంచి సంగతులు మీనుంచి తెలుసుకున్నాను. మీకు అభ్యంతరం లేకపోతె నాకూ ఓ రెండు టాబ్ లెట్లు ఇవ్వగలరా! వూరికే కాదు, మీరు చెప్పిన మొత్తాన్ని నేను చెల్లించుకుంటాను” అని ఆంగ్లేయుడు అభ్యర్ధించాడు.

అయ్యరు ఒక క్షణం ఆలోచించి చెప్పాడు.

నా దగ్గర ఇంకా మూడే మిగిలాయి. కలకత్తాలో నేను మా చుట్టాల ఇంటికి వెడుతున్నాను, కనుక నాకు ఇబ్బంది లేదు. మీరే చెప్పారు కాబట్టి ఇడ్లీకి ఓ ఇరవై రూపాయల చొప్పున ఇవ్వండి చాలు”

బ్రిటిషర్ యెగిరి గంతేసినంత పనిచేసి అరవై రూపాయలు అయ్యరుకు ఇచ్చి మూడు ఇడ్లీలు తీసుకుని తిన్నాడు.

మర్నాడు ఉదయానికల్లా హౌరా స్టేషన్ వచ్చింది.

రైలు దిగి ఎవరి దారిన వారు విడిపోయే సమయంలో బ్రిటిషర్ అడిగాడు. “ఈ టాబ్ లెట్లు తయారు చేసే విధానం చెప్పారు. అంతా చెప్పారా! ఏమైనా మరచిపోయారా!”

చెప్పేందుకు ఏమీ లేదు, అంతా వివరంగా చెప్పాను”

మరి ఈ టాబ్ లెట్ల ఖరీదు అంత వుండకూడదే”

చెప్పాను కదా ఇవి మేధస్సును వికసింప చేసే ఐ.క్యు. ట్యాబ్ లెట్లని. మీరు మూడే తిన్నారు. రాత్రికి ఇప్పటికీ మీలో యెంత తేడా వచ్చిందో చూడండి. అంటే అవి పనిచేయడం మొదలయిందన్న మాట” అని అంటూ అయ్యరు తన హోల్డాలు, టిఫిన్ క్యారియర్ చేతబుచ్చుకుని చక్కాపోయాడు.


(Courtesy Image Owner)


(ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేచ్చానువాదం)

 


29, మార్చి 2022, మంగళవారం

చంద్రబాబు నాయుడు – నేను.

 

చాలాకాలంగా కలవని వాళ్ళు తటస్థపడి పలకరించినప్పుడు కలిగే ఉత్సాహం తీరే వేరు.
మొన్నటికి మొన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో పెద్దలు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు కలిసారు. వారిని కలవక దాదాపు పదిహేను సంవత్సరాలు పైనే అవుతోంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన నన్ను గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించడమే ఒక గొప్ప అనుభవం. ఎప్పటివో నా రేడియో జీవితం నాటి కబుర్లు గుర్తు చేయడం ఇంకా గొప్ప విషయం.
మళ్ళీ నిన్న సాయంత్రం హోటల్ దసపల్లాలో మిత్రుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రాసిన, నేను- తెలుగుదేశం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వెళ్లాను. దత్తాత్రేయ గారితో కలిసి అప్పుడే సభామందిరంలోకి ప్రవేశిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెనక వరసలో కూర్చొన్న నన్ను చూసి, ఆగి పలకరించారు.
‘ఎలా వున్నారు, ఆరోగ్యం బాగుంది కదా! కరోనా ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా!’ అంటూ భుజం మీద చేయి వేసి ఆత్మీయంగా మాట్లాడారు. చివర్లో ఒక మాట అన్నారు, అయాం వాచింగ్ యు అని. ఎందుకలా అన్నారని ఆలోచించుకోవడం నావంతయిది.
నేను చంద్రబాబుగారిని ఆఖరు సారి కలిసింది 2013, ఆగస్టు 20వ తేదీన. ఇంత ఖచ్చితంగా ఎలా గుర్తుంది అంటే దానికి ఒక కారణం వుంది.
ఆరోజు సాయంత్రం ఒక టీవీ ఛానల్ నుంచి తిరిగి వస్తుంటే ఫోను.
చిరపరిచితమైన నెంబరు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుంచి ఆ ఫోను. అయిదేళ్ళ క్రితం వరకు ఆ నంబరు నుంచి రోజూ అనేక ఫోన్లు వచ్చేవి. అప్పుడు నేను దూరదర్శన్/ ఆకాశవాణిలో విలేకరిగా పనిచేస్తున్నాను.
‘ఎడ్వైజర్ కృష్ణయ్య గారు మాట్లాడుతారు’ ఆపరేటర్ పలకరింపు.
టీటీడీ ఈవోగా, సీనియర్ ఐఏఎస్ అధికారిగా జర్నలిస్టులందరికీ కృష్ణయ్య గారు చిరపరిచితులు. ఉన్నత ఉద్యోగం వొదులుకుని రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
‘రేపు నాలుగు గంటలకు బాబుగారు మీడియా విశ్లేషకులు కొందరితో ఇష్టాగోష్టిగా ముచ్చటించాలని అనుకుంటున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది’.
కాస్త ఆశ్చర్యం అనిపించింది ఈ పిలుపు.
2005లో దూరదర్సన్ లో పదవీ విరమణ చేసినప్పటి నుంచి మళ్ళీ ఏనాడు ఏ పార్టీ గుమ్మం ఎక్కలేదు.
అయితే ఈ ఆహ్వానం కాదనడానికి కూడా కారణం కనిపించలేదు. ఎందుకంటే అది విలేకరుల సమావేశం కాదు. పార్టీ ఆఫీసులో కూడా కాదు. చంద్రబాబునాయుడి గారి ఇంట్లో.
ఇంతకీ ఆయన ఏం అడుగుతారు ? ఏం చెప్పాలి ?
ఇప్పటికే మీడియా విశ్లేషకుల మీద సోషల్ మీడియాలో అనేక రకాల వ్యాఖ్యలు వెలువడుతున్నాయి, వీళ్ళు విశ్లేషకుల రూపంలో, చక్రాంకితాలు బయటకు కనబడకుండా టీవీ చర్చల్లో పాల్గొనే వివిధ పార్టీల అనధికార ప్రతినిధులంటూ.
ఏదిఏమైనా, చంద్రబాబు గారిని ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకోబోతున్నాను.
షరా మామూలుగా ఆయనే చెబుతారా లేక ఎవరైనా చెప్పింది వింటారా ? అనుకుంటూనే వెళ్లాను.
జూబిలీ హిల్స్ లో చంద్రబాబు నివాసం. పాతికేళ్ళకు పైగా చిరపరిచితమైన ప్రదేశం. మాజీ ముఖ్యమంత్రి అయినా, జెడ్ కేటగిరి భద్రత కలిగిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావడం మూలాన సెక్యూరిటీ హడావిడి ఎప్పటి మాదిరిగానే వుంది.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న దరిమిలా తెలంగాణా ఏర్పాటు తధ్యం అనుకుంటున్న నేపధ్యంలో ఏర్పాటయింది ఈ సమావేశం.
టీవీల్లో తరచూ కానవచ్చే విశ్లేషకులు, నాగేశ్వర్, ఘంటా చక్రపాణి, సి. నరసింహారావు, జ్వాలా నరసింహారావు, తెలకపల్లి రవి, ఎల్. రామానాయుడు ఇత్యాదయః అందరం ఆసీనులమైన అనంతరం చంద్రబాబుగారు వచ్చి కూర్చుని, పేరుపేరునా అందర్నీ పలకరిస్తూ వారి అభిప్రాయాలను స్వీకరించే పనిలో పడ్డారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబుగారు మాట్లాడింది తక్కువ, విన్నది ఎక్కువ.
మొత్తం మీద పెద్ద విశేషంగా నాకనిపించింది ఇదొక్కటే.
పొతే,
హైదరాబాదు జర్నలిష్టుల్లో చాలామందికి కళ్ళ ముందు పుట్టి పెరిగిన పార్టీ తెలుగుదేశం. ఆ పార్టీ నలభయ్ వసంతాల ఉత్సవం జరుపుకుంటున్న సందర్భంలో పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు
(29-03-2022)

28, మార్చి 2022, సోమవారం

లోనారసి

(నమస్తే తెలంగాణా పత్రికలో ప్రచురితం)

ఒక పక్క యాదాద్రి అంటూ ఇదేమి తెలుగు అనుకుంటున్నారా! లేదు. ఇది అచ్చ తెలుగు పదం. దీని సంగతి తర్వాత చెప్పుకుందాం.
ఈరోజు నాకు తెలిసి తెలంగాణలో అన్ని లోగిళ్ళలో అందరి కళ్ళు టీవీల్లో చూపిస్తున్న యాదాద్రి వైభవం చుట్టూనే అల్లుకు పోయి వున్నాయని చెబితే అతిశయోక్తి కాదు.
తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గారు యాదగిరి గుట్ట దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం స్థాయిలో పునర్నిర్మించడానికి ఏ ముహూర్తం లో నిర్ణయించారో కానీ, ఆ సుమూహర్తం ఈనాటికి నిజమైంది. గతంలో ఆ గుడినీ, ఆ పరిసరాలను చూసిన వారు ఇప్పుడు కనిపిస్తున్న బ్రహ్మాండమైన కట్టడాలను, శిల్పాలను చూసి ఆశ్చర్యచకితులు కాక మానరు.
వేల కోట్ల ధనం, వందలాదిమంది శిల్పులు, అహరహం ప్రత్యక్ష పర్యవేక్షణలో తలమునకలయిన వందలాది అధికారులు, సిబ్బంది శ్రమ ఫలితం ఈనాడు మనం అక్కడ సుందర అద్భుత నిర్మాణాల రూపంలో చూస్తున్నాం. ఇదంతా కేవలం ఆరేళ్ల కాలంలో జరిగింది అంటే నమ్మశక్యం కాని సంగతి.
ఇందుకు కర్తా, కర్మా, క్రియా యావత్తు ముఖ్యమంత్రి కేసీఆరే. అనుమానం లేదు. ఆయన సంకల్ప బలం ఫలితమే ఈనాటి మహాకుంభ సంప్రోక్షణ క్రతువు.
ఆలయ పునర్నిర్మాణంలో సహకరించిన, కృషి చేసిన స్థపతులను, ఇతరులను ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు సముచిత రీతిన సత్కరించారు.
ఈ కార్యక్రమాన్ని టీవీలో లోనారసిగా వీక్షిస్తే (లోనారసి అనే పదాన్ని లోతుగా (లోతులకు వెళ్లి పరీక్షగా చూడడం) అనే అర్ధంలో వాడతారు) అప్పుడు కనబడ్డారు, ఓ పక్కగా అంతవరకూ కనబడని జి. కిషన్ రావు గారు. ముఖ్యమంత్రి చైర్మన్ గా ఉన్న యాదాద్రి టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ఆయన. ఈ బృహత్ కార్యానికి ముఖ్యమంత్రి సర్వస్వం అయితే, కిషన్ రావు మాత్రం నేపధ్యంలోనే ఉంటూ, ముఖ్యమంత్రి మనసులో యేమని అనుకుంటున్నారో అచ్చం ఆవిధంగానే ఆచరణలో చేసి చూపించారు. దండలో దారంలాగా ఈ పునర్నిర్మాణ క్రతువులో ఆయన నిర్వహించిన పాత్ర చిన్నదేమీ కాదు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు శాలువా కప్పి తగిన రీతిన సత్కరించారు.
ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే ఆయనకు సమీపంలో వుండాలని, ఫోటోల్లో పడాలని, టీవీల్లో కనబడాలని చోటా మోటా నాయకులు, చిన్నా పెద్దా అధికారులు తెగ తాపత్రయపడడం కొత్తేమీ కాదు. అయితే ఈనాడు జరిగిన యావత్ కార్యక్రమంలో కిషన్ రావు అలా ఎక్కడా కనబడలేదు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంటే ఈయన ఎక్కడికి పోయారు అని సందేహించిన వాళ్ళు వున్నారు. కానీ ఆయన తత్వం తెలిసిన వారికి ఇదేమీ ఆశ్చర్యం అనిపించదు. ఎందుకంటే ఆయన ప్రచారాలకు దూరం. అప్పగించిన కర్తవ్యమ్ తప్పిస్తే ఆయనకు ఏదీ పట్టదు.
కిషన్ రావు గారిని తెలియని జర్నలిష్టు ఉండడేమో. ఎందుకంటే ఆయన చేసిన ఉద్యోగాలు అలాంటివి. పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రులు అందరూ ఆయన సేవలను అడిగి మరీ ఉపయోగించుకున్నారు. ఆనాటి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాటి కేసీఆర్ వరకు ఇదే వరస. వయసు ఎనభయ్ దాటినా ఆయనలో ఆయనకు అలసట అనేది లేదు. పని లేకపోతె జ్వరం వచ్చినట్టు వుంటుంది అనే సీనియర్ ఐఏఎస్ అధికారి కిషన్ రావు గారు తన పెన్షన్ డబ్బులు తప్ప, రిటైర్ అయిన తర్వాత చేసిన, చేస్తున్న ఏ ఉద్యోగానికి జీతం తీసుకోరు.
కొత్తగా నిర్మించిన యాదాద్రి ఆలయం ఆ నారసింహుడు కిషన్ రావు గారికి ఇచ్చిన జీవన సాఫల్య పురస్కారం.
ఒకప్పుడు శిల్పారామం అంటే గుర్తుకు వచ్చే కిషన్ రావు గారి పేరు, యాదాద్రి వెళ్ళినప్పుడల్లా స్పురణకు రావడం ఖాయం.







(28-03-2022)

27, మార్చి 2022, ఆదివారం

ప్రజల మనిషి బండారు దత్తాత్రేయ – భండారు శ్రీనివాసరావు

 “మనిద్దరం చుట్టాలం అనుకుంటున్నారు చాలామంది” అన్నారు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ.

“కాకపోతే ఏమైంది, మీరు నాకు అంతకంటే ఎక్కువే” అన్నాను నేను.

పదేళ్లు అయిందో, పదిహేను ఏళ్ళు అయిందో  గుర్తు లేదు, దత్తాత్రేయ గారిని నేను కలిసి.

ఈరోజు ఆదివారం సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో జరిగిన  ఒక కార్యక్రమం అనంతరం వేదిక దిగివస్తున్నప్పుడు మా నడుమ నడిచిన ముచ్చట ఇది.

నలభయ్ ఏళ్ళ పై చిలుకు సాగిన పాత్రికేయ జీవితంలో ప్రజల మనిషి అనదగ్గ రాజకీయ నాయకులు ఇద్దరు కనబడ్డారు. ఒకరు మాజీ  ముఖ్యమంత్రి శ్రీ. టి. అంజయ్య, రెండోవారు శ్రీ దత్తాత్రేయ. ప్రజల నడుమ ఉంటేనే ఆక్సిజన్ అందుతుంది అనేట్టు జనంతో మమేకమైన రాజకీయ జీవితాలు వీరిద్దరివి. మనుషులను మనుషులుగా గుర్తిస్తారు కనుకనే సామాన్య జనంలో వీరిరువురికీ అమితమైన ఆదరణ. ఈ కారణం చేతనే ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా నన్ను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించారు. వయసులో నాకంటే ఆయన ఏడాది చిన్న. ‘గట్టిగానే వున్నావు సుమా ‘ అన్నారు నా చేయి తన చేతిలోకి తీసుకుని చిన్నగా నొక్కుతూ.

ఆరోగ్యంగా వున్నాను అని దత్తాత్రేయ గారెకి అనిపించింది అంటే అది మాత్రం దేవుడి దయే అనుకున్నాను మనసులో.

నాదేముంది, దత్తాత్రేయ గారి లాంటి ప్రజాసేవకులు నాలుగు కాలాల పాటు చల్లగా వుంటే సమాజానికి  మంచి జరుగుతుందని కూడా అనుకున్నాను.



27-03-2022

మిత్రుల మనసుల్లో బతికున్న విద్యారణ్య – భండారు శ్రీనివాసరావు

 మిత్రుడు, పాత్రికేయుడు ఇటీవలే ఆకస్మికంగా మరణించిన విద్యారణ్య సంస్మరణ సభ ఈరోజు ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఎంతో బలమైన ఆత్మీయ బంధం లేనిదే అంతమంది అటువంటి సభలకు రారు. చిన్న వయసులోనే చనిపోయాడు అనే బాధ మినహాయిస్తే తన జీవితకాలంలో సంపాదించుకున్న మంచి పేరే అంతమందిని అక్కడకు చేర్చింది. ఒక్క పాత్రికేయ రంగం నుంచే కాదు అనేక రంగాలకు చెందిన విశిష్ట వ్యక్తులు హాజరై విద్యారణ్య దివ్య స్మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ విషయంలో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం తీసుకున్న చొరవ హర్షణీయం.

అక్కడ ప్రసంగించిన వారి పలుకులు వింటుంటే నాకు తెలిసిన విద్యారణ్యలో నాకు తెలియని ఇన్ని కోణాలు దాగున్నాయా అనిపించింది. హర్యానా గవర్నర్  శ్రీ బండారు దత్తాత్రేయ తదితరులు విద్యారణ్య గురించి సొంత అనుభవాలు చెబుతుంటే విద్యారణ్య ఎవరన్నది నాకు బోధపడింది. 

విద్యారణ్యతో మూడు దశాబ్దాలకు పైగా పరిచయం. ముందు అంధ్రపత్రిక విలేకరిగా ఉన్నప్పటి నుంచి. మా మధ్య  వృత్తిలో పోటీ లేదు కానీ, చేసే పనిలో కొంత  సారూప్యత వుంది. నేను సాయంత్రం ఆరుంబావు  వార్తల సమయానికి అప్పటికి పోగుచేసిన వార్తలు అందివ్వాలి. విద్యారణ్య పరిస్థితి ఉడ్డుగుడుచుకున్నట్టు వుండేది.   డాక్ (సాయంత్రం) ఎడిషన్ కల్లా ఏదైనా బ్యానర్ వార్త పట్టుకోవాలి. ఆ తాపత్రయంలో అతడు ఉండేవాడు.

రేడియోలో ఏదైనా వార్త మిస్ కాకుండా వుండాలంటే విద్యారణ్య లాంటి మితృలు వుండాలి. ఎప్పుడు ఏ వార్త వివరాలు అడిగినా విసుక్కోకుండా వివరంగా చెప్పేవాడు.  రీజినల్ న్యూస్ యూనిట్ లో విద్యారణ్య వేలు దూర్చని విభాగం లేదు. రేడియో సిబ్బంది  బయట గేటు దగ్గర సెంట్రీ నుంచి అందరూ విద్యారణ్యని చప్పున పోల్చుకునేవారు. అక్కడ పనిచేసే నాకు అలాంటి భాగ్యం లేదు.  చాలాసార్లు మా గేటు దగ్గర కాపలా మనిషి నన్ను ఆపి,  లోపల ఎవరితో మీకు పని, వివరాలు రాయండని  గౌరవించిన అనుభవాలు  కోకొల్లలు. ఎందుకంటే నేను ఆఫీసుకు వెళ్ళే సందర్భాలు చాలా తక్కువ. బయట తిరగడాలు బాగా  ఎక్కువ.

ఎన్ని మాట్లాడినా ఎన్ని చెప్పినా ఒకటి మాత్రం వాస్తవం. విద్యారణ్య మా మధ్య లేడు. ఇక ఉండడు.

మరో నిజం ఏమిటంటే విద్యారణ్య ఇక నుంచి మా మనసుల్లోనే ఉంటాడు.  


   

(27-03-2022)

ఆదివారం ఆంధ్రప్రభ – భండారు శ్రీనివాసరావు

 

గత నాలుగయిదు వారాలుగా ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో గతకాలపు అసెంబ్లీ ముచ్చట్లు రాస్తూ వుండడంతో ఉదయం పూట అందుకునే ఫోన్ కాల్స్ తో ఓ కొత్త కాలక్షేపం అవుతోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఫోన్ చేసి అభినందించారు. దానితో పాటు ఆయన కూడా కొన్ని సంగతులు పంచుకున్నారు.
ప్రసిద్ధ సినీ కవి శ్రీ వేటూరి సుందర రామ మూర్తి తన పూర్వాశ్రమంలో ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేసే రోజుల్లో రాసిన ఓ వార్త అసెంబ్లీలో సంచలనం కలిగించింది. ఆ విలేకరిపై వెంటనే చర్య తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వార్తకు నేపధ్యం ఏమిటంటే:
హైదరాబాదు లక్డి కా పూల్ లోని ద్వారక హోటల్ అసెంబ్లీకి దగ్గరలో వుండడం వల్ల, సమావేశాలు జరిగే రోజుల్లో జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, వారి అనుయాయులు అందులో బస చేసేవారు. అప్పుడు కాంగ్రెస్ ఏకపక్ష పాలన. హోటల్లో దిగిన కాంగ్రెస్ సభ్యులు, వారి అనుయాయులు తెల్లటి ఉడుపుల్లో బయలుదేరి వెళ్ళడం వేటూరిగారికి వార్తకు ముడి సరుకుగా అనిపించింది. అనిపించి వార్తకు ఇలా మకుటం పెట్టారు. “అదిగో ద్వారక! ఆలమందలవిగో!” (ద్వారక హోటల్, తెల్లటి దుస్తుల్లో ఎమ్మెల్యేలు)
“మమ్మల్ని ఆలమందలు అంటూ గొడ్డూ గోదాతో పోలుస్తారా! ఎంత ధైర్యం ఠాట్!” అని హడావిడి చేశారు. అయితే అది తాటాకు మంటలా వెంటనే చల్లారి పోయింది, సభలో పెద్దలు కలగచేసుకుని నచ్చచెప్పడంతో.
ఈ వృత్తాంతం చెప్పి అన్నారు బుద్ధప్రసాద్ నిర్వేదంగా.
“అప్పుడు ఆలమందలు అంటేనే సభాగౌరవానికి భంగం కలిగిందని బాధ పడ్డారు. ఇప్పుడు ఓ పార్టీ నాయకుడు అసెంబ్లీని రెడ్ లైట్ ఏరియాతో పోల్చి హేళన చేసినా కిమ్మిన్నాస్తి”
(27-03-2022)

తెలుగు నాటకం – భండారు శ్రీనివాసరావు

 ( మార్చి, 27, ప్రపంచ రంగస్థల దినోత్సవం)


అప్పటికి ఇప్పటికి తెలుగులో పౌరాణిక నాటకం అంటే తిరుపతి వెంకట కవుల పాండవోద్యోగ విజయాలే. వాస్తవానికి వారు ఈ రెండూ విడివిడిగా రాశారు, పాండవోద్యోగం, పాండవ విజయం అని. ఈ రెండు కలిపి, మరికొన్ని నాటకాలలోని పద్యాలు జోడించి ‘కురుక్షేత్రం’గా ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఎన్ని వేలసార్లో, వేలేమిటి లక్షసార్లు అని కూడా చెప్పొచ్చు ఈ నాటకాన్ని తెలుగునాట నాలుగు చెరగులా వేసి వుంటారు. కొన్ని వేలమందికి ఈ నాటకం ఉపాధి కల్పించింది. పేరు తెచ్చి పెట్టింది.
బలిజేపల్లి వారి ‘హరిశ్చంద్ర’, చిలకమర్తి వారి ‘గయోపాఖ్యానం’ కూడా ప్రసిద్ధి పొందినవే.
తర్వాత వచ్చినవి కాళ్ళకూరి నారాయణ రావు గారి ‘చింతామణి’, తాండ్ర సుబ్రహ్మణ్యం గారి ‘రామాంజనేయ యుద్ధం’. అడపా తడపా వల్లూరి వెంకట్రామయ్య చౌదరి గారి ‘బాల నాగమ్మ’. మిగతావన్నీ చెదురుమదురుగా ఆడేవి, ‘పాదుకా పట్టాభిషేకం’ వంటివన్న మాట.
బెజవాడ గాంధీ నగరంలో హనుమంతరాయ గ్రంధాలయం వుంది. పేరుకు గ్రంధాలయంకానీ, అక్కడి రంగస్థలం నాటకాలకు ప్రసిద్ధి. అనేక నాటక సమాజాలకు అది ఆటపట్టు. జేవీడీఎస్ శాస్త్రి 'జంధ్యాల' గా ప్రసిద్ధులు కాకపూర్వం, ఎస్సారార్ కాలేజీ విద్యార్ధిగా వున్నప్పుడు రాసిన నాటకం ' సంధ్యారాగంలో శంఖారావం' ఇక్కడే ప్రదర్శనలు ఇచ్చింది. అదే కాలేజీలో ఆయనతో కలిసి చదువుకున్న నేనూ ఆ రిహార్సల్స్ కు వెళ్ళేవాడిని.
పౌరాణిక నాటకాలకు నిజానికి పెద్ద పెద్ద సెట్టింగులూ అవీ వుండాలి. కానీ, పద్యం రాగం ముఖ్యం కావడంతో హంగులను ఎవరూ పట్టించుకొనేవారు కాదు. గుంటూరు అరండల్ పేటలో గుళ్ళపల్లి ఆదిశేషయ్య అని వొకాయన నాటకానికి కావాల్సిన డ్రెస్సులు, తెరలు సప్లయి చేస్తూవుండేవాడు. అన్ని ప్రాంతాలకి, అన్ని నాటక సమాజాలకి ఈయనే దిక్కు. అలాగే బెజవాడ గవర్నరుపేటలో జైహింద్ లాడ్జ్, జైహింద్ ప్రెస్ ఉండేవి. నాటకాల్లో వేషాలు వేసేవారందరికి ఇదే స్థావరం. ఇక్కడ నుంచే నాటకాలు, నటులను బుక్ చేసుకొనేవారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇక్కడే ప్రింట్ చేసేవారు. ‘జైహింద్’ సుబ్బయ్యగారు వీటన్నిటికి కంట్రాక్టర్.
స్టేజి కూడా పెద్ద ప్రాముఖ్యం లేనిదే. కావాల్సిందల్లా మంచి మైకు సెట్టు. మైకు బాగా లేకపోతే జనం గోల చేసేవారు. లైటింగ్ కూడా పట్టించుకునేవారుకాదు. వెనక వైపు ఓ తెరా, ముందు మరో తెరా వుంటే చాలు నాటకం వేయడానికి. ముందు తెరను కప్పీ మీద లాగడానికి వీలుగా కట్టేవారు. చూసిన ఏ నాటకాలలోను అది సరిగా పని చెయ్యగా చూడలేదు. దాంతో నాటకం ట్రూపులో ఒకడు స్టేజి ఎక్కి ఈ మూల నుంచి ఆ మూలకు చేత్తోనే తెరను లాగేవాడు. నాటకం మొదలు పెట్టడానికి కొద్ది నిమిషాల ముందు హార్మొనీ వాయించే ఆయన వచ్చేవాడు. తొక్కుడు హార్మొనీ. పెట్టెలోంచి పీకి లేపి క్లిప్పులు పెడితే వాయించడానికి వీలుగా తయారయ్యేది. ఆయన కూర్చోడానికి ఓ మడత కుర్చీ. ఇక నాటకం ఏదయినా, ఎవరు వేసినా ‘పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద’ అనే ప్రార్ధనతో మొదలు పెట్టేవారు. ఇది రాసిన మహాను భావుడెవడో ఎవరికీ తెలియదు. ఎంతో మందిని అడిగినా లాభంలేక పోయింది. ఆ మధ్యన ఓ అష్టావధానం లో కూడా ఈ ప్రశ్నవేసారు. సమాధానం ఏమి వచ్చిందో గుర్తు లేదు. ఎవరికయినా తెలిస్తే తెలిస్తే చెప్పండి. రెండు మూడు నిమిషాల ప్రార్ధన తర్వాత, ‘శ్రీకృష్ణ పరమాత్మకీ జై!’ అంటూ నాటకం ఆడేవాళ్ళ సమాజం పేరు చెప్పుకుని దానికి కూడా జై కొట్టే వారు. ప్రార్ధన సమయానికి కొందరు వేషాలు పూర్తి గా వేసుకుని, మరికొందరు సగం వేషాలతోనో, లేదా లుంగీ పంచెలతోనొ పాడేవారు. ఇంత ముద్ద హారతి కర్పూరం వెలిగించి. పాడడం అవగానే ఓ కొబ్బరికాయ స్టేజి మీద గట్టిగా కొట్టేవారు. అప్పడప్పుడు సగం చిప్ప యెగిరి వెళ్లి జనంలో పడేది. ఈ తెరవెనక భాగోతం అంతా మసగ మసగ్గా బయట ప్రేక్షకులకు కనపడుతూనే వుండేది. బెజవాడ ఏలూరు రోడ్ సెంటర్లో ‘రామకృష్ణ మైక్ సర్వీసు’ అని వుండేది. ఆయన దగ్గర మంచి మైకులు ఉండేవి. వాటిని ష్యూర్ మైకులు అనేవాళ్ళు. బాగా లాగుతాయని చెప్పుకునేవాళ్ళు. అంటే ఎంతో దూరం వరకు వినబడతాయన్న మాట, ఇబ్బంది పెట్టకుండా. కరపత్రాల్లో కూడా వేసుకొనే వారు, పలానా వారిదే మైక్ సెట్ల సప్లయి అని.
బెజవాడలో ఇప్పటి నవరంగ్ థియేటర్ని 1960 – 1970 మధ్య షహెన్ షా మహల్ అనే వారు. యాజమాన్యంలో ఏవో గొడవలవల్ల అప్పట్లో థియేటర్ ని మూసేశారు. దానిని నాటకాలకు వుపయోగించుకునేవారు. అలాగే గాంధీ నగర్ లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంధాలయం హాలు. అప్పడప్పుడు రామ్మోహన్ గ్రంథాలయం పైన వున్నచిన్న హాలు. నాటకాలన్నీ శనివారం నాడే వేసేవారు. తెల్లవార్లు నడుస్తుంది కనుక మర్నాడు ఆదివారం పడుకోవచ్చని కాబోలు.
(విషయ సేకరణలో సహకరించిన ఆర్వీవీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు)

అలనాటి అసెంబ్లీ ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు

 (Published in Andhra Prabha today, Sunday, 27-03-2022)

1958 - 59 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీలో చర్చ జరుగుతోంది. అంటే దాదాపు అరవై ఏళ్ళ కిందటి ముచ్చట.
ఒక సభ్యుడు లేచి అన్నారు. ' పన్నులన్నీ తెలంగాణపై రుద్దుతున్నారు' అని.
ఆర్ధిక మంత్రి వెంటనే స్పందించారు, 'గౌరవ సభ్యులు వాడిన 'రుద్దుతున్నారు' అనే పదం బయట పర్వాలేదు. కానీ సభలో 'కర్ణ కఠోరం'గా వుంటుంది'
ఆ సభ్యుడు లేచి 'అలా అన్నందుకు' విచారం వెలిబుచ్చారు.
ఆ ఆర్ధిక మంత్రి పేరు బెజవాడ గోపాల రెడ్డి.
ఆ పదం వాడి, తరువాత విచారం వ్యక్తం చేసిన సభ్యుడు ఎవ్వరో కాదు, తదనంతర కాలంలో యావత్ భారత దేశానికి అయిదేళ్ళ పాటు ప్రధాన మంత్రిగా పనిచేసిన పీ.వీ. నరసింహారావు.
అవీ ఆ రోజులు.
అలనాటి, అంటే ఓ నలభయ్, యాభయ్ ఏళ్ళక్రితం జరిగిన శాసన సభ సమావేశాల్లో, తీవ్రమైన చర్చల నడుమ వాతావరణాన్ని చల్లబరచడానికి కొన్ని చలోక్తులు కూడా వినబడేవి.
తెలుగు పత్రికల్లో ఈ ఛలోక్తులను 'బాక్స్' కట్టి మరీ ప్రచురించేవారు. చదువుకోవడానికి తమాషాగానే కాకుండా ఆహ్లాదకరంగా కూడా ఉండేవవి.
1958 లో కళా వెంకటరావు గారు రెవెన్యూ మంత్రి. రాములు అనే సభ్యుడు (ఇంటి పేరు గుర్తు రావడం లేదు) మంత్రిని తమాషా పట్టించాలని 'మంత్రిగారు మాట్లాడుతున్నది కొండ నాలుకతోనా లేక కొన నాలుకతోనా' అని జోకబోయారు. అంటే మంత్రిగారు చెప్పేవన్నీ పై పై మాటలు, ఒక్కటీ కరెక్టు కాదు అనేది ఆ సభ్యుడి ఉద్దేశ్యం.
కళా వెంకటరావు గారు సామాన్యుడు కాదుకదా! వెంటనే తిప్పికొట్టారు.
'మనిషి అనేవాడు ఎవరయినా నాలుకతోనే మాట్లాడుతాడు. కొండ నాలుకతో ఎవ్వరూ మాట్లాడరు. మరి రాములు గారు కొండ నాలుకతో మాట్లాడుతారేమో నాకు తెలియదు'
ఆ దెబ్బతో రాములుగారు కిమ్మిన్నాస్తి. గమ్మున కూర్చుండిపోయారు.
1976 లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో దాదాపు నలభయ్ యాభయ్ మంది సభ్యులు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడినంత సేపు ముఖ్యమంత్రి సభలో తన స్థానం నుంచి కదల లేదు. మౌనంగా సీట్లో కూర్చుని సభ్యులు ప్రస్తావించిన వివిధ అంశాలపై నోట్స్ రాసుకుంటూ పోయారు. తరువాత తన సమయం రాగానే లేచి సుమారు గంటన్నరపాటు అన్ని అంశాలను స్పృశిస్తూ సమాధానం చెప్పారు. సభలోని యావన్మందీ వెంగళరావు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు.
సరే! ముఖ్యమంత్రిగా ఉంటూ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన డాక్టర్ రాజశేఖర రెడ్డికి సయితం పద్యాలు వచ్చన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వున్నప్పుడు ఏకంగా ఒక పద్యం మొత్తం సభలో చదివి వినిపించారు. 2001- 2002 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్ పై జరిగిన చర్చను ప్రారంభిస్తూ చంద్రబాబు పరిపాలనలో వున్న రాష్ట్రాన్ని ఆ భగవంతుడే కాపాడాలని, భారతంలో తిక్కన విరచిత పద్యం - 'సారపు ధర్మమున విమల సత్యము ....' అని మొదలెట్టి ఒక పద్యం చదివి వినిపించారు.
"ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు దక్షత కలిగిన భీష్మ, ద్రోణుల వంటి వారు కూడా మౌనంగా వుండిపోయారు. అలా ఉపేక్షిస్తే అది వారికే చేటవుతుంది. కానీ ఏదో ఒకరోజున భగవంతుడే కల్పించుకుని సత్యాన్ని, ధర్మాన్ని నిలబెడతాడు. ఈ రాష్ట్రాన్ని కూడా ఆ దేవుడే కాపాడాలి" అని ప్రసంగం ముగించారు రాజశేఖర రెడ్డి.
మరోసారి 2003 ఫిబ్రవరిలో గవర్నర్ ప్రసంగంపై జరిగిన చర్చలో పాల్గొంటూ, దేవరకొండ బాలగంగాధర తిలక్ రాసిన గేయభాగాన్ని వై.యస్.ఆర్. చదివి వినిపించారు.
'ఒక్క నిరుపేద ఉన్నంతవరకు, ఒక్క మలినాశ్రువు బిందువు ఒరిగినంతవరకు, ఒక్క శుష్క స్థన్య సన్నిధిని క్షుదార్తి ఏడ్చు పసిబాలిక ఉన్నంతవరకు, నాకు శాంతి కలుగదింక నేస్తం ..... ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు, ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు' అంటూ 'పేదవాడి ఆర్తిని వినే ప్రయత్నం చేయండి ముఖ్యమంత్రిగారు, చేయండి ముఖ్యమంత్రిగారు' అని తనదైన శైలిలో ప్రసంగం ముగించారు.
చంద్రబాబు నాయుడుగారిది మరో తరహా. శాసనసభలో ఆయన చేసే ప్రసంగాలలో పద్యాలు, గేయాలు వుండవు. కానీ ఆర్ధిక అభ్యున్నతి గురించి, సంస్కరణలు గురించి, కొందరు ప్రముఖులు ఆయా సందర్భాలలో చేసిన కొటేషన్లు బాగా చోటుచేసుకుంటాయి. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తాను చేపట్టిన వివిధ అభివృద్ధి పధకాలు గురించి ప్రతిపక్షనాయకుడిగా చేసే ఉపన్యాసాలలో సయితం వివరించే ప్రయత్నం చేస్తారు. అలాగే, ముఖ్యమంత్రిగా సభలో మాట్లాడేటప్పుడు కూడా ఈ పధకాల వివరాలు ఎక్కువగా ఉండే విధంగా జాగ్రత్త పడతారు.
1999 నవంబరు 16 వ తేదీన గవర్నర్ ప్రసంగంపై చర్చకు చంద్రబాబు ఇచ్చిన సమాధానంలో కొన్ని భాగాలు ఇలా సాగాయి.
"నేను రాష్ట్రం అభివృద్ధిని కోరుకుంటున్నాను. నా పట్ల ప్రజలకున్న అభిమానాన్నే నమ్ముకున్నాను. అందువల్లే ఎన్నికల్లో మీ అంచనాలు తారుమారయ్యాయి. ప్రజల ఆశీర్వాదం నాకుంటుంది అని మొదటినుంచీ చెబుతున్నాను. అదే ఈనాడు నిజమైంది. కుల్ దీప్ నాయర్ మాట్లాడుతూ, 'నేను ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిని అభినందించడం లేదు, ఆంద్ర ప్రదేశ్ ఓటర్లని అభినందిస్తున్నాను. ఒక విజ్ డమ్ ని వాళ్ళు వ్యక్తం చేసారు. చాలా మెచ్యూరిటీ ప్రదర్శించారు. కర్నాటక, మహారాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా ఆంద్ర ప్రదేశ్ మాకు ఆదర్శం అంటున్నారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా గట్టిగా చెప్పారు. 'దేనికయినా ఆంద్రప్రదేశ్ కొలమానం' అని. 'అభివృద్ధి విషయంలో అన్ని రాష్ట్రాలు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అనుసరించాలి' అని. ఇంటర్నేషనల్ మీడియా కూడా అదే చెబుతోంది. దేశంలో బెస్ట్ విజన్ వున్న వ్యక్తి ఎవరంటే ఆంద్రప్రదేశ్ సీ.ఎం. అని విద్యార్ధులు కూడా చెప్పే పరిస్తితి వుంది.
'ఈ నడుమ ఒక ఎకానమిస్టు చెప్పాడు. ఆంద్రప్రదేశ్ లో నాయుడు కోరుకుంటున్న విప్లవం ఊహల్లో ఊహించుకునేది కాదు, చేసి చూపించగలిగేది, అని. ఇప్పుడు దేశానికి కావాల్సిన సరయిన నాయకుడు చంద్రబాబే అని కూడా ఆయనే చెప్పారు.
'ఆంద్రప్రదేశ్ ని స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నాము. స్మార్ట్ స్టేట్ అంటే అర్ధం దక్షతతో కూడిన నైపుణ్యం ఆ స్టేట్ కి దిశానిర్దేశం చేస్తుంది. పరిజ్ఞానం దానికి ఇంధనం మాదిరిగా ఉపయోగపడుతుంది. ఇక విజ్ డమ్ దాన్ని ముందుకు నడిపిస్తుంది. అదీ మా ధ్యేయం.
'మహాత్మా గాంధీ అన్నారు. ఒకరికి ఆదర్శం బోధించాలి అంటే ఆ ఆదర్శాన్ని మనమూ పాటించాలి అని. అప్పుడే ఒకళ్ళకు చెప్పినా వాళ్ళు వినే పరిస్తితి వుంటుంది. మా ప్రభుత్వం దరిద్రాన్ని రూపుమాపడానికి కంకణం కట్టుకుంది'
'ప్రతిపక్ష నాయకులు (వై.యస్.ఆర్.) చాలా స్పష్టంగా చెప్పారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే తప్పకుండా సహకరిస్తామని. వారిని మనః స్పూర్తిగా అభినందిస్తున్నాను. వాళ్ళు సభలో వన్ తర్డ్ వున్నారు. అందుకే అందర్నీ కలుపుకుని ముందుకు పోవాలని అనుకుంటున్నాను.'
శాసనసభ ఆవరణలోని గ్రంథాలయానికి వెళ్లి చదవాలని ఆసక్తి ఉండాలే కానీ ఇలాంటి విషయాలు కోకొల్లలుగా తెలుస్తాయి.
అసెంబ్లీ లోపలా వెలుపలా తమ ప్రసంగాలతో జనాలను ఆకట్టుకున్న నాయకులకు కూడా తెలుగు రాష్ట్రాల్లో కొదవలేదు.
తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఏ పద్యం అయినా రాగయుక్తంగా కాకపోయినా ఎలాటి స్ఖాలిత్యాలు దొర్లకుండా పండిత ప్రకాండులు మెచ్చే విధంగా పాడగలరనేది జగమెరిగిన సత్యం. భారత భాగవతాల్లోని అనేక పద్యాలు కేసీఆర్ కి కంఠోపాఠం. దాశరధి, నారాయణ రెడ్డి వంటి కవుల గేయాలు ఆయన ప్రసంగంలో ఆశువుగా దొర్లుతుంటాయి. శాసన సభలోనే కాదు బయట కూడా కేసీఆర్ ప్రసంగాల తీరు ఇదే. ఒకసారి రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో సినారె పక్కన ఉండగానే కేసీఆర్, నారాయణరెడ్డి గారు రాసిన తొలి సినిమా పాటను యధాతధంగా వినిపించి శ్రోతలను అలరించారు. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దామోదరం సంజీవయ్య గారు బహిరంగ సభల్లో కూడా పద్యం ఎత్తుకునేవారు. ఆయన ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షులుగా వున్నప్పుడు ఢిల్లీలో సంజీవయ్య గారు వుండే బంగళా సాహిత్య గోష్టులకు వేదికగా ఉండేదని 'కలం కూలీ' జీ. కృష్ణగారు తన అనుభవాల్లో రాసారు.
ఇలాటి జ్ఞాపకాలు ఎన్నో.
తోకటపా:
1975లో నేను రేడియో విలేకరిగా మొదటిసారి శాసన సభ ప్రెస్ గ్యాలరీలో అడుగుపెట్టాను. అప్పటినుంచి 2005లో దూరదర్సన్ లో రిటైర్ అయ్యేవరకు అసెంబ్లీ ఇంచుమించు నా రెండోఆఫీసు అయింది. దాని ఎదురుగానే నేను పనిచేసే ఆకాశవాణి వుండడం వల్ల అనుబంధం మరింత పెరిగింది.
“ఆ రోజుల్లో అసెంబ్లీ పాత భవనంలో వుండేది. సభ్యులకు, ప్రెస్ గేలరీలోని విలేకరులకు నడుమ కొయ్యతో చేసిన గోడ మాత్రమే అడ్డం. మాట్లాడుకోవడానికి కూడా వీలుండేది. అప్పుడప్పుడు ఆఖరి వరుసలోని సభ్యులు తల వెనక్కు తిప్పి విలేకరులతో గుసగుసలాడేవారు. స్పీకర్ చూస్తున్నారు అనే అనుమానం కలగగానే తల ముందుకు తిప్పేవారు. సభలో క్రమశిక్షణ ఎలా ఉండేదో తెలియచెప్పడానికే ఇది చెప్పాల్సి వస్తోంది.
“ఇక్కడ మరో మాట కూడా చెప్పాలి.
“సరిగా వినకుండా రాంగ్ రిపోర్ట్ చేస్తే సభాహక్కుల తీర్మానం ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే భయం విలేకరులకు వుండేది. అలాగే, సభలో వున్న సభ్యులు కూడా భయపడేవారు. ఏదైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే స్పీకర్ తమ మాటలను రికార్డుల నుంచి తొలగిస్తే చిన్నతనంగా ఉంటుందని గుంజాటన పడేవారు.
“యాభయ్ ఏళ్ళ ముందు శాసన సభ నడిచిన తీరు అది. యాభయ్ ఏళ్ళ తరువాత ఎలా నడుస్తున్నాయో ప్రత్యక్ష ప్రసారాల్లో జనం చూస్తూనే వున్నారు కదా!
“ఏం రాసినా చెల్లుతుందని వీళ్ళూ, ఏం మాట్లాడినా ఏమీ కాదని వాళ్ళూ.
“స్థూలంగా చెప్పాలి అంటే అప్పటికీ ఇప్పటికీ నాకు కనబడుతున్న తేడా ఇదే”



(25-03-2022)

26, మార్చి 2022, శనివారం

ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు

 దృశ్యం ఒక్కటే.

చూసేవారికి రెండు రకాలుగా కనిపిస్తుంది.
వైద్య పరిభాషలో ఈ జబ్బుని ఏమంటారో జనాలకు తెలవదు.
కానీ, ఒకే వార్త వివిధ పత్రికల్లో వేర్వేరు రూపాల్లో వస్తే మాత్రం – అందుకు కారణాలేమిటో ఇప్పుడు ప్రజలు అర్ధం చేసుకోగలుగుతున్నారు.
ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి – వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో - వార్తలు వండి వారుస్తున్న తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. యే ఛానల్ మార్చి చూసినా ఇదే వరస.
తాము చదివే పత్రిక, తాము చూసే ఛానల్ వైవిధ్య భరితంగా వుండాలని ఎవరయినా కోరుకుంటారు. అందుకే, ప్రభుత్వ ఆజమాయిషీ లోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేట్ ఛానల్ల శకం ప్రారంభమయినప్పుడు జనం ఆ మార్పుని సాదరంగా ఆహ్వానించారు. కానీ కోరుకున్న మార్పు కోరిన విధంగా కాకుండా గాడి తప్పుతున్నదేమో అన్న పరిణామాన్ని వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.
ఇరవై నాలుగ్గంటల వార్తా ఛానళ్ళ పుణ్యమా అని ఈనాడు సమాచారం టన్నుల లెక్కల్లో జనాలకు చేరుతోంది. ఇందులో అవసరమయినదెంత? అన్నది ప్రశ్నార్ధకమే! ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు యే మేరకు హరాయించుకోగలదన్నది ఛానళ్ళ వాళ్ళే చెప్పాలి. ఎన్ని విన్నా మెదడు తనకు చేతనయినంతవరకే తనలో నిక్షిప్తం చేసుకుని మిగిలినవి వొదిలేస్తుందని అంటారు. ఇదే నిజమయితే – టీవీ ఛానళ్ళ ద్వారా ప్రజలకు చేరుతున్న సమాచారంలో సింహభాగం వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే రాసిందీ, రాసిన దానికంటే చూసిందీ ఎక్కువకాలం గుర్తు వుంటుందని ఓ సూత్రం. కానీ ఈ సిద్ధాంతానికి సయితం ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తోంది. ‘పీపుల్స్ మెమోరి షార్ట్’ – అంటే ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తు వుండదు అనే ధీమాతోనే రాజకీయనాయకులు స్వవచన ఘాతానికి పూనుకుంటూ వుంటారు. బహుశా ఈ సూత్రాన్నే ఛానల్స్ పాటిస్తున్నాయని అనుకోవాలి.
ఇంతకీ విషయం ఏమిటంటే- సృష్టికర్త జనాలకు ‘మరపు’ అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించి ఎంతో మేలు చేసాడు. లేకపోతె, ఒకే రోజు ఒకే వార్తను భిన్న కోణాల్లో చదివి చదివి – ఒకే ప్రకటనలోని సారాంశాన్ని వేర్వేరు రకాలుగా చూసి చూసి – ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతుండేవారు.
వెనుకటి రోజుల్లో పత్రికల్లో ‘ఘాటుగా విమర్శించారు’ అని రాస్తే అక్కడికి అదే గొప్ప. ఇక ఇప్పుడో- ‘నిలదీశారు. నిప్పులు చెరిగారు. మండిపడ్డారు’ ఇలాటి విశేషణాలు కోకొల్లలు.
పోతే, టీవీ చర్చల్లో పాల్గొనే వారిని పరిచయం చేయగానే వారు ఏం మాట్లాడబోతున్నారో ఇట్టే తెలిసిపోవడం మరో దౌర్భాగ్యం. ఒక అంశాన్నివిశ్లేషించాల్సివచ్చినప్పుడు అందులోని వివిధ పార్శ్వాలను ప్రస్తావించడం సహజం. కానీ సంబంధం లేని విషయాలను ఎత్తుకుంటూ, చర్చను పక్క దోవ పట్టించేవారిని కట్టడి చేయలేకపోవడాన్నే వీక్షకులు ప్రశ్నిస్తున్నారు.
వీటికి జవాబు దొరకదు. అయితే, ఇష్టం లేకపోతే ‘కట్’ చేయడానికి ‘ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం’ అనే పడికట్టు పదం మాత్రం సదా సిద్ధం.

తోకటపా:
టీవీ చర్చల్లో పాల్గొనేవాళ్ళు పౌరాణిక నాటకాలనుంచి నేర్చుకోవాల్సిన పాఠం.
"కృష్ణుడు రాగయుక్తంగా పద్యం పాడడం పూర్తయ్యేదాకా సుయోధనుడు తన పద్యం ఎత్తుకోడు"


25, మార్చి 2022, శుక్రవారం

నేను – తెలుగుదేశం

 

1982 లో నాటి ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు  తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో నాకు మొదట పరిచయం అయిన వ్యక్తి కంభంపాటి రామ్మోహన్. ఆయన ఇంటిపేరు మా ఊరి పేరు (కంభంపాడు) ఒకటి కావడం కాకతాళీయం అయినా మా నడుమ ఏర్పడ్డ పరిచయం చక్కని స్నేహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దీనికి మరో కాకతాళీయ కారణం నేను రేడియో విలేకరిగా పనిచేస్తూ వుండడం, ఆయన టీడీపీలో పత్రికా వ్యవహారాలు చూస్తూ వుండడం.

తదనంతర కాలంలో టీడీపీ అధికారంలోకి వచ్చి  ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం, తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో  చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వదిలేసి టీడీపీలో చేరడం, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత రామ్మోహన్, చంద్రబాబు నేతృత్వంలో పార్టీ పత్రికా వ్యవహారాలు చూడడం,  ఈ క్రమంలో రామ్మోహన్ తో నా పరిచయం కొత్త చిగుళ్లు తొడిగింది. దాదాపు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడడం, నిత్యం హిమాయత్ నగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కలవడం నాకే కాదు, నాటి తోటి పత్రికా విలేకరులు అందరికీ అనుభవైకవేద్యం.

పార్టీకోసం పడిన శ్రమ ఊరికే పోలేదు. నేను మాస్కో వెళ్ళే ముందో లేక కొద్ది రోజుల తర్వాతో గుర్తు లేదు,  ఆయన పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. తరువాత రాజ్యసభ సభ్యత్వం. ఆ తర్వాత ఢిల్లీలో  క్యాబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఇలా యుక్తవయసులోనే మంచి పదవులు. బహుశా పదవి వున్నా లేకపోయినా పార్టీని అప్పటినుంచి ఇప్పటివరకు అంటిపెట్టుకుని ఉన్న అతి కొద్దిమంది నాయకుల్లో రామ్మోహన్ ఒకరు అంటే అతిశయోక్తి కాదు.

ఇలాంటి వ్యక్తికి పార్టీతో ఎన్నో అనుభవాలు వుంటాయి.  గ్రంధస్థం చేస్తే బాగుంటుంది అని నేను ఎన్నోసార్లు ఇచ్చిన సూచనకు అన్నిసార్లు చిరునవ్వే సమాధానం.

ఇన్నాళ్ళకు ఆయన మనసులో ఈ ఆలోచన పుట్టినట్టుంది. నేను – తెలుగు దేశం అనే పేరుతొ ఒక పుస్తకం రాసారు.

ఈనెల 28 వ తేదీన పుస్తకం ఆవిష్కరణ. అదీ హైదరాబాదులో. ముఖ్య అతిధులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు.

All the best Rammohan



(25-03-2022)

‘ఈగ’ ఖరీదు

 


ఇంతవరకు పరాజయం అంటూ  ఎరుగని  రాజమౌళి దర్సకత్వంలో  ఈరోజు విడుదల అయిన ట్రిపుల్  ఆర్  సినిమా గురించి  సాంఘిక  మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న పోస్టులు గమనించిన తర్వాత  ఎప్పుడో 2012 లో జులై 15 వతేదీన చూసిన ఈగ  సినిమా గురించిన ఓ జ్ఞాపకం ఇది)

 

ఈగ’ ఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.

హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన, సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సక్రుత్తు గా జరిగే విషయం.

నిన్న శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ‘ఈగ’ వీక్షణానంతరం ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్ మెసేజి. ‘ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను, ఆ కార్డుకుయాడాన్’ కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మాముందుంచి తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు, ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం.

ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న తరుణంలో ‘రాచ పీనుగ తోడు లేకుండా కదలదు’ అన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం. తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ, సెల్ ఫోన్లతో మరికొందరూ, లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా పాటించే పనిలో పడ్డాం. ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం. దరిమిలా, ‘మూడు వర్కింగు డేస్ నుంచి పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని – మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.

అమ్మయ్య’ అని అనుకుంటున్న సంతోషం కాస్తా కాసేపటిలోనే ఆవిరావిరయిపోయింది.

అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ లేదు, జేబులో కార్డూ లేదు’ అనే పాత రోజులకన్న మాట.

ఇంతకీ, ‘ఈగ’ సంగతేమిటంటారా!ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను కమ్మేసింది.

ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’ సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే రైట్ అనుకోవాలి.



(15-07-2012)