25, మార్చి 2022, శుక్రవారం

నేను – తెలుగుదేశం

 

1982 లో నాటి ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు  తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో నాకు మొదట పరిచయం అయిన వ్యక్తి కంభంపాటి రామ్మోహన్. ఆయన ఇంటిపేరు మా ఊరి పేరు (కంభంపాడు) ఒకటి కావడం కాకతాళీయం అయినా మా నడుమ ఏర్పడ్డ పరిచయం చక్కని స్నేహంగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. దీనికి మరో కాకతాళీయ కారణం నేను రేడియో విలేకరిగా పనిచేస్తూ వుండడం, ఆయన టీడీపీలో పత్రికా వ్యవహారాలు చూస్తూ వుండడం.

తదనంతర కాలంలో టీడీపీ అధికారంలోకి వచ్చి  ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడం, తరువాత జరిగిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో  చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ వదిలేసి టీడీపీలో చేరడం, పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత రామ్మోహన్, చంద్రబాబు నేతృత్వంలో పార్టీ పత్రికా వ్యవహారాలు చూడడం,  ఈ క్రమంలో రామ్మోహన్ తో నా పరిచయం కొత్త చిగుళ్లు తొడిగింది. దాదాపు ప్రతిరోజూ ఫోన్లో మాట్లాడడం, నిత్యం హిమాయత్ నగర్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కలవడం నాకే కాదు, నాటి తోటి పత్రికా విలేకరులు అందరికీ అనుభవైకవేద్యం.

పార్టీకోసం పడిన శ్రమ ఊరికే పోలేదు. నేను మాస్కో వెళ్ళే ముందో లేక కొద్ది రోజుల తర్వాతో గుర్తు లేదు,  ఆయన పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. తరువాత రాజ్యసభ సభ్యత్వం. ఆ తర్వాత ఢిల్లీలో  క్యాబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఇలా యుక్తవయసులోనే మంచి పదవులు. బహుశా పదవి వున్నా లేకపోయినా పార్టీని అప్పటినుంచి ఇప్పటివరకు అంటిపెట్టుకుని ఉన్న అతి కొద్దిమంది నాయకుల్లో రామ్మోహన్ ఒకరు అంటే అతిశయోక్తి కాదు.

ఇలాంటి వ్యక్తికి పార్టీతో ఎన్నో అనుభవాలు వుంటాయి.  గ్రంధస్థం చేస్తే బాగుంటుంది అని నేను ఎన్నోసార్లు ఇచ్చిన సూచనకు అన్నిసార్లు చిరునవ్వే సమాధానం.

ఇన్నాళ్ళకు ఆయన మనసులో ఈ ఆలోచన పుట్టినట్టుంది. నేను – తెలుగు దేశం అనే పేరుతొ ఒక పుస్తకం రాసారు.

ఈనెల 28 వ తేదీన పుస్తకం ఆవిష్కరణ. అదీ హైదరాబాదులో. ముఖ్య అతిధులు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ, టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు.

All the best Rammohan



(25-03-2022)

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...


కర్ణాటక సంగీత రత్న త్రయములోని శ్రీ శ్యామాశాస్త్రి పూర్వీకులు కూడా కంభం వారేనటండి