4, మార్చి 2022, శుక్రవారం

గౌరవం హోదాకే ప్రతిభకు కాదు – భండారు శ్రీనివాసరావు

 


చిన్నప్పుడు స్కూళ్ళల్లో మోరల్ క్లాస్ అని ఓ పీరియడ్ వుండేది. వారానికి ఒకటో రెండో తరగతులు.
నీతి కధలు, నీతి పాఠాలు బోధించేవాళ్లు.

ఆ రోజుల్లో విన్న కధ ఒకటి జ్ఞాపకం వుంది. ఓ పేద బ్రాహ్మణుడు. వేదవేదాంగాలు చదివాడు. తగిన గుర్తింపు లేకపోగా మాసిపోయిన దుస్తులతో ఉన్న అతడ్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.
పొరుగూళ్ళో పండిత సత్కారం జరుగుతోందని తెలిసి వెడతాడు. మాసిన దుస్తులతో ఉన్న అతడ్ని లోపలకు పోకుండా అడ్డుకుంటారు.
ఇలా పని కాదనుకుని తెలిసిన వారి ఇంటి నుంచి కొత్త బట్టలు అడిగి తీసుకుని వాటిని ధరించి వెడితే అతడికి ప్రవేశం సులభంగా దొరుకుతుంది. అతడి పాండిత్యానికి అక్కడివారు ముగ్ధులు అవుతారు. భోజనాలు చేసేటప్పుడు అడిగి అడిగి మరీ లడ్డూలు వగైరా వడ్డిస్తుంటారు. అతడు వాటిని చేతిలోకి తీసుకుని తను ధరించిన వస్త్రాలకు తినిపించే ప్రయత్నం చేస్తుంటాడు. అక్కడి వాళ్లకి అతడి ప్రవర్తన విచిత్రంగా అనిపించి అతడినే కారణం అడుగుతారు.
“మీరు నాకిచ్చిన గౌరవం నా పాండిత్యానికి కాదు, నేను ధరించిన ఈ దుస్తులకి. కాబట్టి వాటికి తినిపించే ప్రయత్నం చేస్తున్నాను” అని బదులిస్తాడు. దానితో అందరికీ కళ్ళు తెరిపిళ్ళు పడతాయి.
స్థూలంగా ఇదీ కధ.
ఓసారి కారులో వెడుతున్నప్పుడు మా అన్నయ్య భండారు రామచంద్రరావు గారు చెప్పిన కొన్ని విషయాలు విన్నప్పుడు, చిన్నప్పుడు విన్న ఈ నీతి కధ గుర్తుకు వచ్చింది.

మా అన్నయ్య చెన్నై లో స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నప్పుడు, ఆయనకంటే ముందు అదే హోదాలో అదే బ్యాంకులో పనిచేసిన అధికారి ఒకరు రిటైర్ అయిన తర్వాత చెన్నై వచ్చి, చూసిపోదామని మా అన్నయ్య ఇంటికి వచ్చారట. బ్యాంకు టైం కావడంతో ఆ రిటైర్డ్ అధికారిని కూడా వెంటబెట్టుకుని ఆఫీసుకు తీసుకు వెళ్ళారు. సీజీఎం వస్తున్నారు అని తెలియగానే అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయి లిఫ్ట్ ఆపి, ఆయన్ని రిసీవ్ చేసుకోవడం కోసం కొందరు సిబ్బంది వెయిట్ చేస్తూ వుండడం ఆనవాయితీ. లిఫ్ట్ లో వెడుతున్నప్పుడు తన వెంట వచ్చిన రిటైర్డ్ అధికారిని ఎవరూ గుర్తించక పోవడం మా అన్నగారికి విచిత్రంగాను, బాధగాను అనిపించింది. కొన్నేళ్ళ క్రితం ఇదే ఉద్యోగం ఆయన చేశారు. తనకు జరిగిన మర్యాదలే ఆ రోజుల్లో ఆయనకు జరిగివుంటాయి. ఇప్పుడు ఆయన పదవిలో లేరు. పదవినిబట్టి, హోదాను బట్టి అందుకునే మర్యాదలు చాలా తాత్కాలికం అని మా అన్నగారికి అనిపించిందట.
నిజమే అనిపించింది.

1 కామెంట్‌:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“అధికారాంతమందు చూడవలె గదా ఆ అయ్య సౌభాగ్యముల్” అని ఏనాడో చెప్పిన సూక్తి.