26, జులై 2012, గురువారం

కొత్త కుటుంబం



కొత్త కుటుంబం

‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే  నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ పనికి పూనుకుంది కూడా ఎవరో కాదు నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
కధలెలా రాయాలి అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే  పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా  అంతే  వుంటుంది.
ఆరుద్ర గారిలా కాకపోయినా నేను చెప్పబోయే  ఈ  కధ ముగింపు  బాగానే ఉంటుందనుకుంటున్నాను.
నా చిన్నతనంలో  మా ఇంటికి ఓ  కొత్త అతిధి ఒకరు వచ్చారు. వచ్చారు అనడం కంటే తీసుకు వచ్చారు అంటే బాగుంటుందేమో. ఆ రోజుల్లో మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద వెళ్ళినప్పుడు  కనబడిన ఈ అతిధి మా నాన్నను ఇట్టే ఆకర్షించాడు. రోజూ ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని  చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు.
 ఆ రోజుల్లో మాది ఓ చిన్న బస్తీ. బజారు పనిమీద వెళ్ళినప్పుడు  కనబడిన ఈ అతిధి మా నాన్నను ఇట్టే ఆకర్షించాడు. రోజూ ఒకసారయినా పనిపెట్టుకుని బజారుకు వెళ్లి అతగాడిని  చూసివస్తుండేవాడు. అలాటిది ఒకరోజు ఏమయితే అయిందని అతడిని ఏకంగా ఇంటికే తీసుకువచ్చాడు. అంతే! అతడి రాకతో,  ఆ రోజునుంచి  మా ఇంటి వాతావరణం  పూర్తిగా మారిపోయింది.
అతిధి అంటే ఒకటి రెండు రోజులుండి పోయేవాడు. అదేమి  చిత్రమో కాని,  వచ్చిన వాడు వచ్చినట్టే  టంకంలా మా ఇంటికి అతుక్కుపోయాడు.ఇంట్లో అడుగు పెట్టిన కొత్త అతిధి, కొత్తా పాతా తేడాలేకుండా   ఇంటిల్లిపాదినీ ఇట్టే ఆకట్టుకున్నాడు. కధ అంతటితో ఆగలేదు.  ఇరుగింటి వాళ్ళు,పొరుగింటివాళ్ళు  చిన్నా పెద్దా  అంతా కట్టగట్టుకుని  అతడి ముచ్చట్లు వినడానికి మా ఇంటి మీదికి  ఎగబడేవారు. మొదట్లో ఉదయం  ఓ గంటా సాయంత్రం ఓ రెండు గంటలు కాబోలు అందరితో కలుపుగోలుగా మసలుకునేవాడు. ఆ తరువాత మాత్రం ముంగిలా ముసుగేసుకుని తొంగునేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. కొన్ని సార్లు అతడి మాటలు అర్ధం అయ్యేవి. మరికొన్నిసార్లు అర్ధం అయినట్టు వుండేవి. ఇంకొన్ని సార్లు అతడు ఏం మాట్లాడుతున్నాడో, యే భాషలో మాట్లాడుతున్నాడో తెలిసేది కాదు. అర్ధం కాకపోయినా అతడి మాట తీరు అందరికీ  నచ్చేది. ఇది అది అని లేకుండా   చరిత్ర, లెక్కలు, పురాణాలు ఏది కదిల్చినా వాటిల్లో అతడికున్న పరిజ్ఞానం మాత్రం  అమోఘం. సినిమా కబుర్లు మొదలు పెట్టాడంటే చాలు  ఇక వాటికి అంతూపొంతూ  వుండేది కాదు.
నాకయితే అతడు మంచి స్నేహితుడిగా మారిపోయాడు.మొదట్లో మాదిరిగా ఉదయం, సాయంత్రం అన్న పద్ధతికి స్వస్తి చెప్పి  పొద్దస్తమానం కబుర్లతో కాలక్షేపం చేసేవాడు.అలా అస్తమానం  అతడితో గడుపుతూ అతడు చెప్పే కబుర్లు వింటూ వుండడం మా అమ్మానాన్నకు పోను పోను నచ్చేది కాదు. ఎందుకంటే అతడు చిన్న పిల్లల కధలు మాత్రమే కాదు ఒక్కోసారి రాత్రి పొద్దుపోయిన తరువాత వీలుచూసుకుని   కొన్ని పెద్ద పెద్ద  ముచ్చట్లు కూడా చెప్పేవాడు. ముందు ఛీ పాడు అనుకునే దాన్ని. కానీ రానురాను   అతడు చెప్పే ఆ మాటల్లో నాకు   తెలియకుండానే ఆసక్తి పెరగడం  మొదలయింది. ఇదంతా మా అమ్మనాన్నకు రుచించేది కాదు. ‘అస్తమానం అతడితో ఏమిటా కబుర్లు. బుద్దిలేకపోతే సరి’ అని మా అమ్మ కసురుకునేది కూడా.
చూస్తుండగానే యాభయ్  ఏళ్ళు గడిచిపోయాయి. అతిధిగా ఇంట్లో కాలుమోపిన అతడు రోజులు గడుస్తున్నకొద్దీ అభ్యాగతి గా మారిపోయి  ఇప్పుడు అదే ఇంట్లో ఓ మూలన పడివున్నాడు. ఇప్పటికీ కబుర్లకు కొదవ లేదు. వినేవాళ్ళకే  కొరత. విశేషం ఏమిటంటే మొదట్లో విసుక్కున్న మా అమ్మ ఇప్పుడు అతడి రంధిలో పడిపోయింది. అతడు చెప్పే అత్తాకోడళ్ళ కధలంటే చెవికోసుకునేవరకు వెళ్ళిపోయింది. మా నాన్నా అంతే. అతడిని చూస్తే చిరాకుపడే వాడల్లా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. పేపరు చదవడం కూడా మానేసి అతడు చెప్పే రాజకీయాలు  వింటూ కూర్చుంటున్నాడు.  
ఇంతకీ పేరు చెప్పడం మరచిపోయినట్టున్నాను కదూ. అందరికీ తెలిసిన పేరే. అతడి  అసలు పేరు టీవీ. జాతకనామం  దూరదర్శన్. కాలం గడుస్తున్నకొద్దీ అర్జునుడి మాదిరిగానే  రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. పూటకో ఛానల్ పుట్టుకొస్తున్న ఈ రోజుల్లో ఇప్పుడు  రోజుకో పేరు.  కొద్దికాలం క్రితమే పెళ్లి చేసుకున్నాడు. అతడి భార్య పేరు కంప్యూటర్. ముగ్గురు పిల్లలు. పెద్దాడి పేరు ఇంటర్నెట్. రెండో సంతానం సెల్ ఫోన్. కొత్తగా ఓ మనవడు వచ్చాడు వాళ్ల కుటుంబంలోకి. అతడికి ముద్దుగా ఐ పాడ్ అని నామకరణం చేశారు.
మా పాత కుటుంబంలో ప్రవేశించిన ఈ కొత్త కుటుంబం తామరతంపరగా పెరిగిపోతూనే వుంటుందేమో. 
(26-07-2012) 

23, జులై 2012, సోమవారం

ఇలాగయినా అర్ధం చేసుకోండి!


ఇలాగయినా  అర్ధం చేసుకోండి!
 “నా వయస్సు కేవలం ఎనభై ఆరు  సంవత్సరాలు. గత అరవై ఏళ్లుగా మీ బాంక్ ఖాతాదారుగా వున్నాను. ఉద్యోగం చేసేటప్పుడు, ఇప్పడు రిటైర్ అయిన తరువాత కూడా అదే బ్యాంకు లో నా ఖాతా కొనసాగిస్తూ వచ్చాను.నేను ఖాతా తెరిచినప్పుడు మీది చాలా చిన్న బ్యాంకు. అయినా సర్వీసు చాలా గొప్పగా వుండేది. మీ బ్యాంకులో పనిచేసే సిబ్బంది అనేకమందితో నాకు వ్యక్తిగత పరిచయాలు వుండేవి. ఆ రోజుల్లో బ్యాంకు కు వచ్చినప్పుడల్లా అంతా ఆత్మీయ వాతావరణం కనబడేది. ఇప్పటిలా ఏసీలు లేవు. సోఫాలు లేవు. కంప్యూటర్లు లేవు. టోకెన్ తీసుకుని పిలుపుకోసం ఎదురు చూసేవాళ్ళం. మరి ఇప్పుడో – బ్యాంకు కు ఏదో పెద్ద పని వుంటే తప్ప రావాల్సిన పని లేకుండా చేశారు. అక్కడ పనిచేసేవారు ఎవరో, యెలా వుంటారో  నాకు తెలియదు. నేనెవరో వారికి తెలియదు.
“ఈ సొదంతా యెందుకు? అసలే మీరు మీ పనితో బిజీగా వుంది వుంటారు.  అసలు విషయానికి వస్తాను.
“మొన్నీమధ్య మా డ్రైవర్  కు జీతం చెక్కు ఇచ్చాను.అతను ఆ చెక్కు బ్యాంకులో ఇచ్చే సమయానికి నా ఖాతాలో సరిపడా డబ్బులు లేవనే సాకుతో దాన్ని తిరగగొట్టారు. మామూలుగా నా పెన్షన్ మీ బ్యాంకు కే నెలనెలా దానంతట అదే జమ అయ్యేలా ముందుగానే ఏర్పాటు చేసుకున్నాను.అయినా చెక్కు రిటర్న్ చేశారు. నా లెక్క ప్రకారం మా డ్రైవర్ నేనిచ్చిన చెక్కును  బ్యాంకులో జమ చేయడానికీ,  దాన్ని గౌరవించి మీరు డబ్బు చెల్లించేలా  సరిపడే  డబ్బు నా ఖాతాలోకి చేరడానికీ నడుమ  కొన్ని నిమిషాలకంటే ఎక్కువ వ్యవధి పట్టి  వుండదు. యేది ఏమయినా మీరు మీ రూల్స్ ప్రకారం దాన్ని తిరగ్గొట్టారు. ఏం చేస్తాం? కంప్యూటర్ తన పని తాను చేసుకుపోయింది.గత పదేళ్లుగా ప్రతి నెలా నా పెన్షన్ డబ్బులు ఒక్క రోజంటే ఒక్క రోజు  వార కూడా లేకుండా నా ఖాతాకు జమ అవుతున్నాయని దానికి తెలియదు కదా.           

“నేను నెట్లో సరి చూసుకున్నాను. నా పెన్షన్ డబ్బులు అదే రోజు నా ఖాతాకు జమ అయ్యాయి. అయినా డబ్బులు లేకుండా చెక్కు ఇచ్చి మీ బ్యాంకును ఇబ్బంది పెట్టినందుకు పరిహారంగా ఓ అయిదు వందలు  నా ఖాతా నుంచి మీరు వసూలు చేసిన సంగతి కూడా అప్పుడే తెలిసింది. ఇంత ఖచ్చితంగా పనిచేస్తున్నందుకు మీకూ మీ సిబ్బందికీ, మీ కంప్యూటర్లకూ నా  ధన్యవాదాలు.
“అయితే, ఈ సంఘటన వల్ల ఇన్నాళ్ళుగా  మీ బ్యాంకు పట్ల నేను అనుసరిస్తూ వచ్చిన విధానంలో మార్పు తీసుకురావాల్సిన అగత్యం బోధపడింది. అందుకు కూడా మీకు మరోసారి నా  ధన్యవాదాలు.
“ఏమయితేనేం !  ఇన్ని రోజులుగా మీ బ్యాంకు తో నాకున్న సంబంధ బాంధవ్యాలను ఓ సారి సమీక్షించు కున్నాను. దాన్నిబట్టి తెలిసిందేమిటంటే-
“నానుంచి మీరు ఏదయినా సమాచారం కోరినప్పుడల్లా నేను దాన్ని స్వయంగా బ్యాంకుకు వచ్చి తెలియచేస్తున్నాను. కానీ, నాకేదయినా అవసరం  వచ్చి మీ బ్యాంకు ఫోను చేసినప్పుడు మాత్రం  ముందుగా రికార్డు చేసివుంచిన ఓ  స్వరం బదులిస్తుంది. పైగా ఏదయినా అనుమానం వచ్చి దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఎంతో సమయం  వృధా చేసుకుంటూ, బుద్ధిమంతుడయిన రాముడి మాదిరిగా ఆ మానవాతీత స్వరం అడిగే  అనేక ప్రశ్నలకు జవాబులు ఇవాల్సివస్తోంది. ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అంటూ కంప్యూటర్ జారీ చేసే ఆదేశాలను అనుసరిస్తూ చిన్న పనికి కూడా నా పుట్టిన తేదీని, తలిదండ్రుల పేర్లతో సహా ప్రవర చెప్పుకుంటే కాని పని జరగని పరిస్తితితో రోజురోజుకూ విసుగెత్తి పోతోంది.
“అందుకే, ఇప్పుడు నేనొక నిర్ణయానికి వచ్చాను. అది తెలిపేందుకే ఈ ఉత్తరం.
“నేను కాని ఇతర ఖాతాదారులు కాని పడుతున్న ఇబ్బందులు మీకు తెలియాలంటే ఇంతకంటే నాకు వేరు మార్గం తోచడం లేదు. మా వూరికి మీ వూరెంత దూరమో, మీ వూరికి మా వూరంతా దూరం అనే సామెత మీరెరుగనిది కాదుకదా. ఇక చిత్తగించండి.    
“ఇన్నేళ్ళుగా మీ బ్యాంక్ కు నేను కట్టాల్సిన ఇంటి రుణం నెలసరి వాయిదాలు  ఇకనుంచి నేరుగా మీ బ్యాంకు కు  జమ అయ్యే పద్ధతికి స్వస్తి చెబుతున్నాను. వాటిని ముందు ముందు చెక్కు ద్వారానే  చెల్లిస్తాను.అది కూడా మీరు లిఖిత పూర్వకంగా నామినేట్  చేసిన మీ  బ్యాంకు ఉద్యోగి పేరిట రిజిస్టర్ పోస్ట్ లో  పంపిస్తాను. అతడు కాకుండా నేను పంపిన ఆ  కవరును మరెవ్వరూ తెరవడానికి పోస్టల్ రూల్స్ అంగీకరించవని నేను ముందుగానే  మీకు తెలియచేసుకుంటున్నాను.  
“నేను ఈ ఉత్తరంతో పాటు పంపుతున్న నమూనా దరఖాస్తులో ఆ ఉద్యోగి వివరాలు తిరుగు టపాలో పదిరోజుల లోపల నాకు పంపాలని కోరుతున్నాను. దరఖాస్తు ఏడెనిమిది పేజీలు వుందని భయపడకండి. కానీ  ఏమీ చేయలేను. బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు ఖాతాదారుడి గురించి మీరెంతగా తెలుసుకోవాలని అభిలషిస్తారో అదేమేరకు నేనూ మీ ఉద్యోగి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోగోరితే మీరు అభ్యంతర పెట్టాల్సిన విషయంగా నేను భావించడం లేదు.   
“ఇకపోతే, మరో విషయం. మీ ఉద్యోగి తెలియచేసే విషయాలు, అతగాడి ఆర్ధిక పరిస్థితులు ఇవన్నీ సక్రమంగా వున్నాయని ఓ గుర్తింపు పొందిన నోటరీ ధృవపరచాల్సివుంటుంది.
“ ఆ తరువాత, నేను నా వీలును బట్టి మీరు నామినేట్ చేసిన ఉద్యోగికి ఒక పిన్ నంబరు పంపుతాను. నాతో  ఏదయినా విషయం చరించాలని అనుకున్నప్పుడు అతడు విధిగా ఆ నెంబరును ముందు  పేర్కొనాల్సి వుంటుంది.
“మీలాగానే నేను కూడా మా ఇంట్లో ఫోనుకు కొన్ని ప్రత్యేకమయిన ఏర్పాట్లు చేసుకున్నాను.ఇకనుంచి మీ బ్యాంకు నుంచి నాకు ఫోన్ చేయాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి. ఇవేమీ కొత్తవి  కావు. అనేక సంవత్సరాలుగా మీ బ్యాంకు ఖాతాదారులం అందరం పాటిస్తూ వస్తున్నవే. ‘అనుసరణ పొగడ్తకు నమూనా’ అంటారనే నానుడి మీకు తెలియనిదని అనుకోను.        
“ప్రతి ఖాతాదారుడు ఎంతో ముఖ్యమయిన వ్యక్తి అని బ్యాంకుల్లో రాసిపెడుతుంటారు కదా. అందుకే,  నాకు ఫోను చేయాల్సిన అవసరం పడ్డప్పుడల్లా ఈ కింది సూచనలు పాటించండి. 
* ఇంగ్లీష్ లో మాట్లాడాలనుకుంటే * బటన్ ప్రెస్ చేయండి.
* నన్ను కలుసుకోవాలని అనుకుంటే ఒకటి నొక్కండి.
* నేను బకాయి పడ్డ వాయిదా గురించి తెలుసుకోవాలని అనుకుంటే ‘రెండు’ నొక్కండి.
* మీ ఫోను కాల్ నా మొబైల్ కి బదిలీ చేయాలనుకుంటే ‘మూడు’ నొక్కండి.

* నా మెయిల్ కు సమాచారం పంపాలి అనుకుంటే పాస్ వర్డ్ తప్పనిసరి.
·       ఒక్కోసారి నా నుంచి ఫోనులో జవాబు రావడం ఆలశ్యం అయితే మీరు కొద్ది సేపు రికార్డు చేసిన సంగీతాన్ని వినాల్సివుంటుంది. ముందు ముందు ప్రకటనలు కూడా వినాల్సిన పరిస్తితి ఏర్పడినా ఆశ్చర్య పోనక్కరలేదు.
·       ఈ ఏర్పాటుకు అయ్యే వ్యయంలో కొంత మీనుంచి నేను  వసూలు చేయాల్సివుంటుంది.ఇలాటి వ్యవహారాలు మీకు కొట్టిన పిండే కనుక మీరు విభ్రాంతికి గురి కానవసరం లేదు.
·       నూతన సంవత్సరానికి ముందు ఇలాటి ఉత్తరం రాయడం నాకూ ఇబ్బందిగానే వుంది. కాకపోతే, షరా మామూలుగా మీకూ, మీ బ్యాంకు సిబ్బందికీ, మానవాతీత స్వరంతో మాట్లాడే కంప్యూటర్లకూ కొత్త సంవత్సరం ఆనందదాయకంగా గడవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మరింత సౌభాగ్యవంతంగా కూడా గడవాలని కోరుకోవాలని వుంది. కానీ, నాలాటి కష్టమర్ల సంఖ్య మరింత పెరిగితే ఖర్చులు కూడా పెరిగి బ్యాంకు రాబడి తరిగి సౌభాగ్యం కొంత తగ్గే అవకాశం వుండగలదన్న భయంతో ఆ ఆకాంక్షను వ్యక్తం చేయకుండా అణచిపెట్టుకుంటున్నాను.
·        పీఎస్: దయచేసి ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ముసలివాళ్ళం కదా అని  మమ్మల్ని పిచ్చివాళ్లని కూడా  చేయాలని చూడవద్దు.
 (అమెరికాలో నివసించే ఎనభయ్ ఆరేళ్ళ వృద్ధురాలు తన బ్యాంకు మేనేజర్ కు రాసిన ఉత్తరం ఇది. సహజంగా హాస్యప్రియుడయిన  ఆ అధికారి ఆ ఉత్తరం చదివి, చిన్నబుచ్చుకోకుండా పెద్ద మనసుతో దాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’కు పంపితే ఆ పత్రిక దాన్ని యధాతధంగా ప్రచురించింది)
(23-07-2012)  

15, జులై 2012, ఆదివారం

‘ఈగ’ ఖరీదు



‘ఈగ’ ఖరీదు
‘ఈగ’ ఖరీదు అక్షరాలా నాలుగువేల ఎనిమిది  వందల ఎనభై రూపాయలు. ఇదెలాగంటారా! చిత్తగించండి.



హైదరాబాదులో థియేటర్ కు వెళ్లి సినిమా చూడడమనేది చాలా అరుదు. అధవా, ఎప్పుడయినా వెళ్ళామంటే గోకుల్ థియేటర్ కే. అదీ ఏదయినా కొత్త సినిమా మొదటి వారంలోనే. ఎందుకంటే ఆ సినిమాహాల్లో వారం వారం పిక్చర్లు మార్చి వేస్తుంటారు. ఆ థియేటర్ ఓనర్లలో ఒకడయిన శ్రీనివాస యాదవ్, మా రెండో అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ చిన్ననాటి స్నేహితులు కావడం మూలాన, టిక్కెట్లు దొరకవు అన్న బాధ లేకపోవడం మూలాన, మా అన్నదమ్ముల కుటుంబసభ్యులం అందరం కట్టగట్టుకుని వెళ్ళే సందర్భం కావడం మూలాన,  సాధారణంగా నేను కూడా ఇరవై నుంచి పాతిక వరకు వుండే ఈ ‘కొత్త సినిమా ప్రేక్షక వర్గంలో’ చేరుతూనే వుంటాను. అలా చూసిన సినిమా నాలుగు రోజులు గుర్తుండి పోయే సినిమా కావడం అన్నది సక్రుత్తు గా జరిగే విషయం.
నిన్న శనివారం కూడా అలాటి సందర్భం వచ్చింది. పెద్దా చిన్నా, పిల్లా మేకా, ముసలీ ముతకా  పాతికమందిమి కలిసి వెళ్లి ఆ థియేటర్లో ‘ఈగ’ సినిమా చూసాము. చూసినవాళ్లలో మెజారిటీ రాజమౌళి అభిమానులే కాబట్టి సినిమా గురించిన చర్చ హద్దులలోనే సాగింది. ‘ఈగ’ వీక్షణానంతరం ‘సాయి’ వాళ్లింట్లో భోజనాలు మొదలు పెట్టబోయేలోగా సెల్లు సుతారంగా మోగింది. చూస్తే బ్యాంకు నుంచి అలర్ట్  మెసేజి. ‘ఫలానా షాపులో మీరు ఇప్పుడే ఇంత తగలేశారు. తగలేయగా పోను మీకు ఇంకా తగలడివున్న బ్యాలెన్సు ఇంత’ అంటూ ఓ శ్రీముఖం. కార్డు సొంతదారునయిన నేను,  ఆ కార్డుకు  ‘యాడాన్’  కార్డు సొంతదారిణి ( అదేవిటో తెలుగు కూడా అలాగే తగలడి చస్తోంది సుమా) అయిన మా ఆవిడ వైపు ఓ చూపు పారేసి, సినిమా మధ్యలో కూడా లేచి వెళ్లి షాపింగు చేసి వచ్చిన ఆవిడ సామర్ధ్యాన్ని కంటి చూపుతోనే మెచ్చుకోబోయాను. కానీ నా వాలకాన్ని పసికట్టిన మా ఆవిడ ‘యేమయిందంటూ’ తన తరహాలో గుడ్లురిమి చూస్తూ నాకర్ధమయ్యే భాషలో ఇతరులకు తెలియకుండా అడిగింది. అలా నలుగురిలో పడ్డ పాము ఎవరిచేతిలో చావకుండా ‘ఇప్పుడేంచేయాల’న్న ప్రశ్నను మాముందుంచి తాను చల్లగా తప్పుకుంది. కార్డును డీయాక్టివేట్ చేయడం ఒక్కటే మార్గమని మా కుటుంబం యావత్తూ ఏకాభిప్రాయానికి వచ్చేలోగా చేతిలో సెల్లు మరోమారు మోగింది. చూస్తే ఏముంది. బ్యాంకు నుంచి మరో ఎస్సెమ్మెస్ ఎలర్ట్. ‘ఏంచేయాలేంచేయాలని అలా ఆలోచిస్తూనే వుండండి, ఈ లోగా మీ కార్డు కొట్టేసిన దొంగ గారు,   ‘విజిటింగు కార్డు బదులు క్రెడిట్ కార్డు నొక్కేస్తే పోయేద’న్న ‘ఈగ’ సినిమా డైలాగు పట్టుకుని ఇప్పటికప్పుడే మరో రెండువేల ఐదువందలకు దర్జాగా షాపింగు చేసి అంత దర్జాగా వెళ్లిపోయాడన్నది’ ఆ ఎలర్టు సారాంశం.
ఈ తరహా చర్చల్లో పడితే, ‘ఈగ’ సినిమా బడ్జెట్ పదికోట్లనుంచి ముప్పయి కోట్లకు పెరిగిపోయిన చందంగా దొంగ గారి షాపింగ్ స్ప్రీ అదే తరహాలో సాగిపోయే ప్రమాదాన్ని మేమందరం కొంచెం కొంచెం పసికడుతున్న  తరుణంలో ‘రాచ పీనుగ తోడు లేకుండా  కదలదు’ అన్నట్టు పోయిన కార్డుతో పాటు మరో బ్యాంకు కార్డు కూడా కనబడం లేదని మా శ్రీమతి చావుకబురు చల్లగా చెప్పింది. దాంతో అందరం ఎమర్జెన్సీ యమర్జెంటుగా ప్రకటించేసుకున్నాం.   తలా ఒక లాప్ టాప్ పట్టుకుని కొందరూ,  సెల్ ఫోన్లతో మరికొందరూ,  లాండ్ లైన్ సాయంతో ఇంకొందరూ ఒక్కుమ్మడిగా రంగంలోకి దిగి, ‘ఒకటి నొక్కండి, ఏడు నొక్కండి’ అనే బ్యాంక్ కస్టమర్ కాల్ సెంటర్ సూచనలను ఖచ్చితంగా  పాటించే పనిలో పడ్డాం.  ఆ కంగారులో ‘యాడాన్’ కార్డుతో పాటు నా ప్రైమరీ కార్డు లావాదేవీలను కూడా జయప్రదంగా స్తంభింపచేశాం.  దరిమిలా,  ‘మూడు వర్కింగు  డేస్ నుంచి  పదిహేను దినాలలోపల మీకు కొత్త కార్డు జారీ చేస్తామ’ని – మా పుట్టిన తేదీలు, మాతాపితరుల నామాలు వాళ్ల రికార్డులతో పోల్చుకున్న పిమ్మట కాల్ సెంటర్ వాళ్లు ప్రకటించారు.
‘అమ్మయ్య’ అని అనుకుంటున్న  సంతోషం కాస్తా కాసేపటిలోనే  ఆవిరావిరయిపోయింది.
అదేమిటంటే మేము మళ్ళీ ‘1975’ మోడల్ సంసారానికి మారిపోయాము. అంటే ఏమిటి? ‘చేతిలో క్యాషూ  లేదు, జేబులో  కార్డూ లేదు’ అనే పాత  రోజులకన్న మాట.
ఇంతకీ, ‘ఈగ’ సంగతేమిటంటారా!  ‘ప్రధమ కబళే మక్షికాపాతః’ అన్నట్టు ఈ కార్డు తస్కరణ ఉదంతం ‘ఈగ’ ను కమ్మేసింది.
ఇంటిల్లిపాదిదీ ఒకటే మాట. ‘సినిమా చాలా బాగుంది. రాజమౌళి హాట్స్ ఆఫ్’  సినిమాలు బాగా చూసేవారు కాబట్టి వాళ్ల మాటే  రైట్ అనుకోవాలి. అయితే-
విలన్ని  ఓసారి ‘ఈగ’  చంపేసినట్టుగా చూపించిన తరువాత కధానాయిక  కాల్చిన బాణసంచాలో ‘పని పూర్తయింది’ అనే సందేశం కనిపిస్తుంది. అక్కడితో సినిమా ఆపేసివుంటే బాగుండేదని నాకనిపించింది. అట్టే సినిమాలు చూడని నా అభిప్రాయం కరెక్టని నేనూ అనుకోవడం లేదు. బహుశా బడ్జెట్ ముప్పయి కోట్లని అంటున్నారు కదా. దానికోసం సినిమా నిడివి పెంచారేమోనని మాత్రం అనుకుంటున్నాను. (15-07-2012)

12, జులై 2012, గురువారం

నువ్వెవరివో నాకు తెలుసు




నువ్వెవరివో నాకు తెలుసు 

గొర్రెల కాపరి లొల్లాయి పదాలు పాడుకుంటూ గొర్రెల్ని కాసుకుంటూ వెడుతున్న సమయంలో ఓ పొడవాటి కారు అతడి పక్కగా వచ్చి ఆగింది. అందులోనుంచి ఓ పొడవాటి మనిషి సూటూ బూటూ వేసుకుని దిగాడు.
గొర్రెల కాపరిని చూడగానే అతగాడికి ఆట పట్టించాలని అనిపించింది. అనిపించి అతడితో ఇలా అన్నాడు.
ఇదిగో అబ్బీ! నీ దగ్గర చాలా గొర్రెలు వున్నట్టున్నాయి. అవి ఎన్ని వున్నాయో నేను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పాననుకో, వాటిల్లో ఒకదాన్ని నాకిచ్చేస్తావా?’
సూటు ఆసామీ మాటలు గొర్రెల కాపరికి వింతగా అనిపించాయి. తనను ఆట పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని తెలిసి కూడా కాపరి అతడి పందేన్ని ఒప్పుకున్నాడు.
సూటు దొరవారు వెంటనే కారులోనుంచి లాప్ టాప్ తీసాడు. మొబైల్ ఫోనుకు, ఫాక్స్ మిషన్ కు కలిపాడు.నెట్ కనెక్ట్ చేసి నాసా వెబ్ సైట్ లోకి వెళ్లి జీపీఆర్ ఎస్ సిస్టం తో గొర్రెలమంద వున్న ప్రదేశాన్ని స్కాన్ చేసాడు.  
          కంప్యూటర్లో ఏవేవో అంకెలు వేసాడు. ఎన్నెన్నో లెక్కలు కూడాడు. చివరికి ప్రింటర్ నుంచి నూటయాభై పేజీల ప్రింటవుట్ తీసాడు.అంతాచేసి చివరికి గొర్రెల లెక్క తేల్చాడు. అయ్యా! కాపరిగారూ! మీవద్ద వున్న గొర్రెలు చిన్నా పెద్ద ఆడా మగా అన్నీ కలిపి అక్షరాలా పదిహేనువందల నలభై మూడుఅన్నాడు.
అతడంత ఖచ్చితంగా గొర్రెల సంఖ్యను చెప్పడంతో ముందు కంగారు పడ్డా కాపరి తొందరగానే తేరుకున్నాడు.
 అయ్యా దొరవారూ! చాలా బాగా లెక్క చెప్పారు. పందెం ప్రకారం నా మందలోనుంచి మీకు నచ్చిన గొర్రెను తీసుకెళ్లండి
దొర తన తెలివితేటలకు తానే మురిసిపోతూ మంద నుంచి ఓ బలిసిన గొర్రెను ఎంపిక చేసుకుని తన కారు వెనుక సీటు కింద పెట్టుకున్నాడు.   
           కారు స్టార్ట్ చేసి వెళ్ళబోయేలోగా వెనుకనుంచి గొర్రెల కాపరి స్వరం వినిపించింది.
అయ్యా! మీరెవరో ఏంచేస్తుంటారో నాకు తెలవదు. కానీ నేనూ మీలాగే మీ వృత్తి ఏమిటో వూహించి చెప్పగలను. సరిగ్గా చెబితే నా గొర్రెను నాకిచ్చి వెడతారా?’
పందెం గెలుచుకున్న సంతోషంలో దొర వెంటనే దానికి ఒప్పుకున్నాడు.
గొర్రెల కాపరి కాసేపు ఆలోచించినట్టు   నటించి మీరు ఆడిటర్ అయివుంటారు. అవునా! నా అంచనా కరెక్టే కదా!అన్నాడు.
దొరకు మతిపోయినంత పనయింది.
అవును. నేను ఆడిటర్నే. అంత సరిగ్గా యెలా చెప్పగలిగావుఅడిగాడు గొర్రెను తిరిగి ఇచ్చేస్తూ.  
            కాపరి ఇలా జవాబు చెప్పాడు.
అదేమంత పని. చాలా సులభం.
నేను అడగకుండానే ముందు మీరే నా వద్దకు వచ్చారు. అది మొదటి సంగతి.  నాకు తెలిసిన విషయం నాకే చెప్పడానికి పందెం రూపంలో ఫీజు అడిగారు చూసారు అక్కడ దొరికిపోయారు.  మూడో పాయింటు ఏమిటంటే  నా వృత్తి గురించి  మీకు ఎంతమాత్రం తెలియదని మీకు మీరే రుజువు చేసుకున్నారు. మీరు ఆడిటర్ అని చెప్పడానికి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి.

(నెట్ ఇంగ్లీష్ కధనానికి అనువాదం) 

12-07-2012

9, జులై 2012, సోమవారం

ఒరులేయవి యొనరించిన........


ఒరులేయవి యొనరించిన........
క్షౌర శాలలకు మంగళవారం సెలవు. సంప్రదాయాల ప్రకారం మంగళ వారం మంగళకరమైనదంటారు. అలాటి శుభకరమయిన రోజున క్షౌర శాలలకు మాత్రమే సెలవెందుకు ఇస్తారు? సరే! ఆ సంగతి వొదిలేద్దాం. కానీ జవాబు దొరకని మరికొన్ని ప్రశ్నలు కూడా తరచూ నా మదిలో రొద చేస్తూంటాయి.
బార్బర్ షాపుకు వెళ్ళేవారిలో చాలామంది పాత దుస్తులు ధరించి వెడుతూ వుండడం కద్దు. మడత నలగని ఇస్త్రీ బట్టలు వేసుకుని క్షౌరానికి వెళ్ళే వాళ్లు బహు కొద్ది మంది మాత్రమే కానవస్తుంటారు. ఎందుకిలా? అన్నది మరో ప్రశ్న.
స్నానం చేసి క్షౌరానికి వెళ్ళేవాళ్ళు కలికానికి కూడా దొరకరేమో. బహుశా క్షౌర కార్యక్రమం అన్నది ఒక రకం  మైలగా భావించే మనస్తత్వం చాలామందిలో వుండడమే దీనికి కారణమేమో.
క్షౌరం సంగతి పక్కనపెట్టండి. ఇల్లు వూడ్చేటప్పుడు కానీ, కడిగి తుడిచేటప్పుడు కానీ శుభ్రమయిన దుస్తులు ధరించకుండా వుండడం కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఎందుకంటే ఇల్లు వూడ్చేటప్పుడు ఎలాగూ మురికి అంటుకుంటుంది. అందుకని ఆ పని పూర్తి చేసిన తరువాతే కాళ్ళూ  చేతులు కడుక్కుంటే పోలా అన్న భావన మనల్ని ఆ పని చేయిస్తుంది.
ఇదేదో మన దేశానికి మాత్రమే పరిమితమయిందన్న నా ఆలోచన తప్పని ఈ మధ్యనే తెలుసుకున్నాను. అమెరికాలో సెటిల్ అయిన నా భారతీయ మిత్రుడొకరు ఇటీవల మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో నేను బార్బర్ షాపుకు వెళ్ళే పనిలో వున్నాను. శుభ్రంగా గడ్డం చేసుకుని, స్నానం చేసి బార్బర్ షాపుకు బయలుదేరుతున్న నన్ను చూసి అతగాడు రవ్వంత ఆశ్చర్యపోయినట్టు అతడి ముఖ కవళికలను బట్టి అర్ధం అయింది.
అయితే, ఈ విషయంలో నా అభిప్రాయాలు నాకున్నాయి.
క్షౌర శాలలో కూర్చున్నప్పుడు నా వొంటినుంచి వెలువడే చెమట వాసన వల్ల  నాకు క్షౌరం చేస్తున్న వ్యక్తికి ఇబ్బంది కలిగించరాదన్నదే నా ఉద్దేశ్యం. అలాగే జుట్టును కత్తిరించే క్రమంలో, మాసిపోయిన నా కాలర్ ను వెనక్కి మడిచేటప్పుడు దాని దుర్గంధం అతగాడికి సోకరాదని కూడా నేననుకుంటాను.  మనం ఏవయితే  అసహ్యించుకుంటామో వాటిని  ఇతరులు  కూడా ఏవగించుకునే అవకాశం వుంది. మహాభారతంలోని  – ‘ఒరులేయవి యొనరించిన’  పద్యపాదం మనకు బోధించిన నీతి ఇదే.

బార్బర్ షాపుకు వెళ్ళేటప్పుడు శుభ్రంగా వెళ్ళాలన్న జ్ఞానోదయంకలగడానికి  మరో  అంశం కూడా  దోహదం చేసింది.
కొన్నేళ్ళక్రితం ఓ మాగజైన్ లో ఓ  విషయం చదివాను.
జపానులో ఓ కార్ల తయారీ సంస్త యజమాని తన కంపెనీకి సర్వీసింగ్ కోసమో మరమ్మత్తుల కోసమో   వచ్చే వాహనాలను  ఆయా విభాగాలకు  పంపేముందు వాటిని శుభ్రంగా కడిగించేవాడు.
ఇలా చేయడం అవసరమా? రిపైర్  చేసేటప్పుడో, సర్వీసింగ్ చేసేటప్పుడో ఎలాగో మురికి అవడం తధ్యం. మళ్ళీ వాటిని శుభ్రంగా కడగడం కూడా తప్పనిసరి. అలాంటప్పుడు ముందుగా కడిగి పంపడం అనే కంచి గరుడ సేవ ఎందుకనే డౌటేహంకలగడం కూడా అంతే తధ్యం.
ఈ రకం సందేహాత్ములకు ఆయన ఇచ్చే వివరణ ఈ విధంగా వుంటుంది.
నా కంపెనీలో పనిచేసే వారికి నేను ఇచ్చే గౌరవం అది. వారు పనిచేసే వాతావరణం పని చేయడానికి అనువుగా  వుండాలన్నది నా అభిప్రాయం. దీనితో విభేదించేవారు సర్వీసింగు నిమిత్తం వచ్చే వాహనాల అడుగు భాగాన్ని చూసివుండరని నా ఉద్దేశ్యం. బురద, మట్టి కొట్టుకుని  నానా చండాలంగా వుంటుదది. అక్కడ బిగుసుకుపోయిన నట్లు,బోట్లను వొట్టి చేతులతో వూడదీసి బిగించడం అనే ప్రక్రియ యెంత  దుర్భరమో తెలిసినవాళ్లెవరూ ఈ రకమయిన  ప్రశ్నలు వేయరు.’
ఈ వార్త చదివినప్పటినుంచి  బార్బర్ షాపుకు వెళ్ళేటప్పుడు నా తీరు పూర్తిగా మారిపోయింది. స్నానాదులను ముగించుకుని, శుభ్రమయిన దుస్తులు ధరించి ఆఫీసుకు యెలా వెడుతున్నామో, అలాగే బార్బర్ షాపుకు కూడా వెళ్లాలనే నియమాన్ని ఆ రోజు నుంచి  ఖచ్చితంగా పాటిస్తూ వస్తున్నాను.
అద్దంలో  ముఖ సౌందర్యం ఎలావుండాలని  మనం కోరుకుంటామో ఆవిధంగా మనల్ని తీర్చి దిద్దే బార్బర్లకు,  ఎంతో కొంత టిప్పుఇచ్చి సరిపుచ్చుకోవడం  మాత్రమే కాకుండా, చెమట వాసన వేయని కాలర్ ను, మెడను వారికి అప్పగించడంలో వున్న తృప్తి ఎలాటిదో  అప్పటినుంచి నాకు అనుభవం లోకి వచ్చింది.  నేను క్రమం తప్పకుండా నెలనెలా  క్షౌరం చేయించుకునే  మహేష్’ - నాలో వచ్చిన ఈ మార్పుని గమనించాడో లేదో నాకు తెలియదు. అయితే నాకు క్షౌరం చేసేటప్పుడు, తోటి పనివారిని చూస్తూ గర్వంగా కాలర్ ఎగరేయడం ఓసారి నా కళ్ళబడింది. ఆ క్షణంలో అతడి కళ్ళల్లో కానవచ్చిన కాంతిని నేను నేరుగా చూడలేకపోయినా నా అంతర్నేత్రంతో పరికించగలిగాను.  ఇతరుల శ్రమను, ఇబ్బందులను గుర్తించి నడుచుకోవడంలో ఎంతో తృప్తి  వుంది అన్న వాస్తవం  తెలుసుకోగలిగాను. అది బోధ పడిన తరువాత ఈ విషయంలో  నేను కొంత అధికంగా పడుతున్న శ్రమలెక్కలోకి రావడం లేదు.  
(18-03-2012)
(‘నెట్లో’ చదివిన ఆంగ్ల మూలానికి స్వేచ్చానువాదం. – భండారు శ్రీనివాసరావు)                 

7, జులై 2012, శనివారం

రామోజీరావు మొదటి ఓటమి


రామోజీరావు మొదటి ఓటమి
(వెటరన్ జర్నలిస్ట్  శ్రీ వి.హనుమంతరావు రాసిన ‘జర్నలిస్ట్ అంతర్వీక్షణం’ పుస్తకం నుంచి కొన్ని భాగాలు)



“యు.ఎన్.ఐ. నుంచి రాజీనామా చేసి హైదరాబాదులో కొత్తగా ప్రారంభించిన ‘ఈనాడు’ ఎడిషన్ లో చేరాను. నాతో  కలిపి మరో ముగ్గురు ఎడిటర్లు – ఏబీకే ప్రసాద్, పొత్తూరి వేంకటేశ్వర రావు, టీవీ కృష్ణ పనిచేసేవారు. రామోజీ రావు చీఫ్ ఎడిటర్. వ్యాసాలూ, సంపాదకీయాలు రాయటం రాకపోయినా, ‘ఈనాడు’ అన్ని ఎడిషన్లు చదివి ఆయనకు తప్పు అని తోచినవన్నీ ఎర్ర పెన్సిల్ తో మార్క్ చేసేవారు. ప్రముఖ ఇంగ్లీష్ పత్రికల్లో  వచ్చే ఆసక్తికరమయిన వ్యాసాలను అనువాదం చేయించి ‘ఈనాడు’లో ప్రచురించేవారు. హిందూ పత్రిక స్తాయిలో తెలుగులో పత్రిక తేవడం తన లక్ష్యం అని చెప్పుకునేవారు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చేవరకు  ఒకరకంగా బాగానే వుందనిపించేది. ఆ తరవాత రామారావును, తాజాగా చంద్రబాబును భుజాన వేసుకుని పత్రికను నడిపించిన వైనం పాఠకులకు చిరపరిచితమే.”  
“ఈనాడులో ఉద్యోగం అంటే ఎన్నాళ్ళు వుంటుందో ఎప్పుడు వూడుతుందో తెలవదు. హైదరాబాదులో నలుగురు పాత్రికేయులు ఎక్కడయినా కలిస్తే అందులో ఇద్దరు ‘ఈనాడు’ మాజీలు. వ్యాపార రీత్యా ఆయన (రామోజీరావు) యెంత ప్రతిభ చూపించారో, ఉద్యోగుల విషయంలో అంత కాఠిన్యం ప్రదర్శించారు. వేజ్ బోర్డు సిఫారసులను అమలుచేయాలని కోరుతూ కార్మికులు ఇచ్చిన విజ్ఞప్తిని వారి ఎదుటే చెత్తబుట్టలో పడేసారు. సిబ్బంది సమ్మెతో ఇరవై మూడు రోజులు ‘ఈనాడు’ పత్రిక  ప్రజల ముఖం చూడలేదు. సుప్రీం కోర్టు -  సమ్మె చట్ట బద్ధమే అని ఇచ్చిన తీర్పుతో రామోజీ రావు సుమారు కోటి రూపాయలు చెల్లించుకోవాల్సివచ్చింది. రామోజీ రావుకు అది మొదటి  ఓటమి.”
“పత్రికల్లో ప్రచురించే వార్తను అనుకూలంగాను, ప్రతికూలంగాను మలచి ప్రచురించవచ్చు. కాబట్టి పాఠకులకో చిన్న హెచ్చరిక. నల్లటి అక్షరాలన్నీ నిజాలని నమ్మకండి. పూర్తిగా అబద్ధమనీ అనుకోవద్దు.”
“పత్రిక ప్రకటనల వ్యవహారాలు చూసే మేనేజర్ ఇంకో గంటలో పత్రిక అచ్చవుతుందనగా వెళ్లి, అరపేజీ,లేదా పావు పేజి వ్యాపార ప్రకటన ప్రచురించి తీరాలి అంటే, సంపాదక వర్గం ఆ మేరకు వార్తలు తీసేసి ఆ వ్యాపార ప్రకటనను ప్రచురించి తీరాలి.”
“నేను ఈ వృత్తి (జర్నలిజం) లో ప్రవేశించినప్పటి ఆర్ధిక పరిస్థితులు ఇప్పడు తలచుకుంటే నవ్వొస్తుంది. బస్తా బియ్యం ఎనిమిది రూపాయలు. అణాకు నాలుగు ఇడ్లీలు. ముప్పై కిలోమీటర్ల బస్సు ప్రయాణానికి నాలుగణాలు. పూటకూళ్ళమ్మ హోటల్లో మూడుపూటల నెల భోజనానికి నాలుగున్నర రూపాయలు.”
“1955  మధ్యంతర ఎన్నికలు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల నడుమ అతి భీకరంగా జరిగాయి. కమ్యూనిష్టులు అధికారంలోకి వచ్చేస్తున్నారు; పుచ్చలపల్లి సుందరయ్య ముఖ్యమంత్రి, రాజేశ్వర రావు హోం మంత్రి అనే వాతావరణం రాష్ట్రంలో నెలకొంది. కాని, చివరకు కమ్యూనిష్టులు ఓడిపోయారు. రాష్ట్రంలో పార్టీ పత్రిక విశాలాంధ్ర తప్ప మిగతా పత్రికలన్నీ కాంగ్రెస్ కొమ్ము కాశాయి. ప్రముఖ సంపాదకుడు నార్ల వేంకటేశ్వర రావు సంపాదకత్వంలో ఆంధ్రప్రభ ముందు వరసలో నిలబడి కమ్యూనిష్టులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. విశాలాంధ్ర, ఆంధ్రప్రభల మధ్య కార్టూన్ల యుద్ధం హోరాహోరీగా నడిచింది. ప్రతి కార్టూనుకు  జవాబుగా మరో కార్టూన్ ప్రభలో వచ్చేది. అప్పటికీ, ఇప్పటికీ రాష్ట్రంలో పత్రికల సత్య నిష్ఠ గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్ర ప్రభ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అనుకూలంగా రాస్తే, దాని తమిళ్ ఎడిషన్ దానికి వ్యతిరేకంగా రాసేది. ఇదంతా పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవడం కోసమే.”
“హైదరాబాదులో  (యు.ఎన్.ఐ.) వార్తా సంస్థలో నాకు ముందు పనిచేసిన డి. సీతారాం కు వున్న  కాంటాక్టులు (పరిచయాలు) అన్నీ ఇన్నీ కావు. నేను బాధ్యతను స్వీకరించిన తరువాత ఒక రాత్రి ఎవరో ఫోను చేసి ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక విమానం వచ్చిందని చెప్పి ఫోను పెట్టేసారు. బహుశా నా పాత మిత్రుడి (సీతారాం) కాంటాక్ట్ అయివుంటుంది. మరుసటి రోజు బ్యాంకుల జాతీయకరణ వార్త పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. ఆ రోజున రాష్ట్రపతి సికిందరాబాదులోని రాష్ట్రపతి నిలయంలో బస చేసి వున్నారు. అంటే సంతకం కోసం విమానంలో ప్రత్యేక దూత వచ్చాడన్న మాట.”
 “రాజకీయ నాయకులకు పత్రికలతో చాలా అవసరం వుంది. దానికోసం  జర్నలిష్టుల ప్రాపకం కావాలి. అందుకోసం ఏం చేయాలన్న చేస్తారు. ఫ్లాట్లు, స్కూటర్లు, కార్లు, మందు  సీసాలు ఏదీ కాదనర్హం. యాభయ్యవ దశకంలో నేను ఢిల్లీ లో విలేఖరిగా పనిచేసేటప్పుడు ఒక విదేశీ రాయబార కార్యాలయం ప్రతినెలా ఒక స్కాచ్ బాటిల్  ని  ఎంపిక చేసుకున్న జర్నలిష్టుల ఇళ్లకు పంపేది. అందుకు ప్రతిఫలంగా ఏమీ అడిగే వారు కాదు. కొన్ని నెలలు గడిచిన తరువాత తమకు ఫలానా ప్రభుత్వ సమాచారం కావాలని మెల్లగా బయట పెట్టేవారు. సీసాలు సీసాలు పట్టించిన తరువాత కాదనే ధైర్యం ఎవరికి వుంటుంది?”
(జర్నలిష్ట్ అంతర్వీక్షణం – పాత్రికేయ జీవితంలో ఆరు దశాబ్దాల అనుభవాలు – అనుభూతులు – రచన : శ్రీ వి.హనుమంత రావు – ప్రచురణ : డేటా న్యూస్ ఫీచర్స్, హైదరాబాద్ – 500 084)
07-07-2012.

6, జులై 2012, శుక్రవారం

మరో ఆకాశ ‘వాణి’ మూగబోయింది


మరో ఆకాశ ‘వాణి’ మూగబోయింది
‘ఆకాశవాణి విజయవాడ కేంద్రం – ప్రాంతీయ వార్తలు చదువుతున్నది – కొప్పుల సుబ్బారావు’
దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రతిరోజూ ఉదయం ఆరూ నలభయ్ అయిదు కల్లా ఠంచనుగా వినిపిస్తూ వస్తున్న స్వరం నిన్న గురువారం రాత్రి  శాశ్వితంగా మూగబోయింది.
విజయవాడ కేంద్రంలో న్యూస్ రీడర్ ఉద్యోగంలో చేరకముందు కూడా సుబ్బారావు న్యూస్ రీడరే. చేరిన తరువాత న్యూస్ రీడరే. ఉద్యోగ విరమణ అనంతరం కూడా న్యూస్ రీడరే. తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివినప్పుడూ అదే నిబద్ధత. ఉద్యోగం శాశ్వితమై, చకచకా మెట్లెక్కి పై మెట్టు చేరుకున్న తరువాత కూడా వార్తలు చదవడం అంటేనే అతడికి ఇష్టం. అరవైయేళ్ళు నిండి ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా వార్తలు చదవడానికే అతడిష్టపడ్డాడు. బహుశా, గుండె జబ్బు రాకుండా వుంటే, అతడలా వార్తలు చదువుతూనే వుండేవాడేమో.
తలలో నాలుక అంటే సుబ్బారావే అని అతడి సహోద్యోగులు చెబుతుంటారు. సాధారణంగా ఉద్యోగంలో హోదాలు పెరుగుతున్నకొద్దీ, అంతకు ముందు చేసిన ఉద్యోగం పట్ల చిన్న చూపు కలిగివుండడం కద్దు. కానీ, కొప్పుల సుబ్బారావు తరహానే వేరు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేదాకా ఆయన అడ్డా ఆకాశవాణే! వార్తా విభాగంలో పనిలేకపోతే, మరో విభాగంలో ప్రత్యక్షం. అక్కడి వారికి, అడగకుండానే, డబ్బింగులో సాయపడడం అతడి నైజం. డబ్బింగు ప్రస్తావన వచ్చింది కాబట్టి సుబ్బారావు గురించి మరో కోణాన్ని గుర్తు చేసుకోవాలి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రూపొందించిన అనేక కార్యక్రమాలకు జాతీయ స్తాయిలో పురస్కారాలు లభించాయి. వాటిల్లో చాలా వాటికి డబ్బింగు బాధ్యత నిర్వహించింది సుబ్బారావే అన్న సంగతి చాలామందికి తెలియదు. ఎందుకంటే అతడు పేరు కోసం ఎప్పుడూ చూసుకోలేదు. పని మీదనే దృష్టి.
కొప్పుల సుబ్బారావుతో కలసి విజయవాడ ఆకాశ వాణి కేంద్రంలో న్యూస్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్వీవీ కృష్ణారావు గారు సుబ్బారావుతో తన సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు.
‘విజయవాడలో దాదాపు పదకొండేళ్లపాటు కలసి పనిచేశాము. సుబ్బారావుకు ఆఫీసే సర్వస్వం. స్టుడియో లో అడుగుపెట్టేముందు బయటనే చెప్పులు వొదిలేసి వెళ్ళేవాడు. ఒక్కరోజు కూడా ఈ నియమాన్ని దాటలేదు. వార్తలు చదివే గదే అతడికి గుడి. వృత్తిపట్ల అంతటి నిబద్ధతత వున్న ప్రభుత్వ ఉద్యోగిని నేను చూడలేదు. అలాగే, తనకు సాయం చేసిన వారిని ఎన్నడూ మరచిపోయేవాడు కాదు. అతడు ఆకాశవాణిలో ప్రవేశించడానికి అప్పటి డైరెక్టర్ బాలాంత్రపు రజనీకాంత రావు గారు మాట సాయం చేశారన్నది అతగాడి నమ్మకం. అందుకు కృతజ్ఞతగా తన కుమార్తెకు ‘రజని’ అని పేరు పెట్టుకున్నాడు.’
సుబ్బారావు మరణవార్త విని ఈ ఉదయం  ఫోనులో కృష్ణారావు గారు చెప్పిన మాటలివి.
అతను పనిచేసేది విజయవాడలో. నేనేమో  హైదరాబాదు రేడియోలో. ఉదయం, మధ్యాహ్నం వార్తలకోసం ఫోను చేసేవాడు. అడిగినప్పుడల్లా ఏదో ఒక వార్త లేదనకుండా చెప్పేవాడిని. అంతే! దాన్ని యధాతధంగా రాసుకుని ముక్కునపట్టి ఒప్పచెప్పినట్టు వెంటనే వార్తల్లో చదివేసేవాడు.  
హైదరాబాదు ఎప్పుడు వచ్చినా వెంటనే నాకు ఫోను చేసేవాడు. ఏమాత్రం వీలున్నా వచ్చి కలిసి వెళ్ళేవాడు. గత పాతికేళ్ళుగా మా నడుమ ఈ సంబంధం కొనసాగుతూ వచ్చింది.
అదేమిటో మొన్నీ మధ్య హైదరాబాదు వచ్చాడట. ఫోను చేయలేదు. వచ్చి కలవ లేదు.
ఎందుకంటే అతడు హైదరాబాదు రాలేదు. తీసుకువచ్చారు.
నన్ను కలవలేదు. ఎందుకంటే ఆసుపత్రిలో చేర్చారు.
ఇక కలవడు కూడా. ఎందుకంటే కలవలేనంత దూరతీరాలకు తరలిపోయాడు.
అతడు రాలేడు.  నేనే వెళ్ళాలి.
(కలసి ఎప్పుడూ పని చేయకపోయినా, మనసు కలిపి స్నేహం చేసిన  కొప్పుల సుబ్బారావుకు ఆత్మశాంతి కలగాలని మనసారా కోరుకుంటూ – భండారు శ్రీనివాసరావు)
(06-07-2012)  

5, జులై 2012, గురువారం

నీళ్ళ యుద్ధాలు – ఫలించని జోస్యాలు – భండారు శ్రీనివాసరావు


నీళ్ళ యుద్ధాలు – ఫలించని జోస్యాలు – భండారు శ్రీనివాసరావు

“ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో,ముడి చమురు  వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం ‘నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు.”
దాదాపు పదిహేనేళ్ళ క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఈ జోస్యం చెప్పారు. ఆయన వరల్డ్ బ్యాంకు వైస్ ప్రెసిడెంటుగా వున్నప్పుడు భవిష్యత్తు గురించి చేసిన ఈ అంచనా అప్పట్లో ప్రపంచ రాజకీయ నాయకులను ఎంతగానో కలవర పరచింది. అదృష్టవశాత్తు ఇస్మాయిల్ గారి జోస్యం నిజమవలేదు కాని సాగు నీరు, తాగు నీరు అవసరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న దృష్ట్యా తలెత్తుతూ వచ్చిన నీటి  తగాదాలు మాత్రం  అనేక దేశాల నడుమ ఉద్రిక్తతల పెరుగుదలకు దోహదం చేసిన మాట వాస్తవం.
ఆసియా ఖండంలో ఇరిగేషన్ డాముల కింద నీరు పంచుకునే విషయంలో బోలెడు,బొచ్చెడు  తగాదాలు. భారత దేశం పాకిస్తాన్ నడుమ జలవిద్యుచ్చక్తి పంపిణీ విషయంలో ముదిరి పాకాన పడుతున్న వివాదాలు, మరోపక్క  చైనా, నేపాల్, బంగ్లాదేశ్ ల నడుమ నదీ జలాల వివాదాలు. జీవ నదులన్నా ఎండిపోతాయేమో కాని ఈ తగాదాలకు మాత్రం ముగింపు  అంటూ వున్నట్టులేదు.
పోతే, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, కీర్గిజిస్తాన్ ల వ్యవహారం కూడా విభిన్నంగా లేదు. అము దారియా, సర్ దారియా నదులు, అలాగే నీటిమట్టం స్తాయి బాగా పడిపోతున్న అరల్ సీ విషయంలో ఈ దేశాల నడుమ సాగుతున్న నీటి పంచాయతీలు రోజు రోజుకూ ముదిరిపోతున్నాయి.
ఇక, అర్జెంటీనా, ఉరుగ్వేలు - ప్లేట్ నదీ జలాలను పంచుకునే విషయంలో తలెత్తిన వివాదాన్ని హేగ్ లోని అంతర్జాతీయ న్యాయ స్తానం వరకూ తీసుకువెళ్ళాయి. రియో గ్రాండే, కొలరాడో నదీ జలాలు గురించి అమెరికా, మెక్సికో లు జుట్లు పట్టుకుంటున్నాయి.           

తిగ్రిస్ నదిలో తన వాటా నీళ్ళను ఇక ముందు వాడుకోవడానికి వీల్లేదని ఇరాక్ సిరియాను డిమాండ్ చేసి ఎంతో కాలం కాలేదు. మధ్యప్రాత్యంలో పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాలు, ఇరాన్, ఇరాక్ దేశాలు టర్కీ డాం లనుంచి వచ్చే నీటి సరపరాల విషయంలో అవగాహన కుదరక తలలు పట్టుకుంటున్నాయి.
ఆఫ్రికాలో జమ్బెజీ నది ఉపనది అయిన చోబే నది, బోత్స్వానా, మొజాంబిక్ దేశాల నడుమ చిచ్చు రేపింది.
ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం వివిధ దేశాల నడుమ జలాల పంపిణీ జరిగే నదులు దాదాపు రెండు వందల యాభయ్ కి పైగా వున్నాయి. ఈ నదుల పరీవాహక ప్రాంతాన్ని లెక్క వేస్తే, అది ఈ భూగోళం ఉపరితలంలో సగానికి పైగా  వుంటుంది. అంతర్జాతీయంగా నదీ జలాల వివాదాలు వున్న దేశాలు మూడు వందలకు పైగా వున్నాయి కాని, వీటిల్లో సాయుధ సంఘర్షణలకు దారితీసే వివాదాలు చాలా తక్కువనే చెప్పాలి. గత శతాబ్ద కాలంలో నీళ్ళ కోసం జరిగిన యుద్ధాలు కేవలం ఏడు మాత్రమే లెక్క తేలాయి.
నీరే ప్రాణాధారమన్నారు శతకకారులు. సేద్యానికయినా, పరిశ్రమలకయినా, తాగ డానికయినా నీళ్ళు అవసరం. నానాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని 2025 నాటికి  మానవాళి అవసరాలు తీర్చడానికి  ప్రపంచ వ్యాప్తంగా వున్న నదుల్లో పారే నీటిపై అపరితమయిన వొత్తిడి ఏర్పడగలదని ఐక్యరాజ్య సమితి (ఐ.ఎన్.డి.పి.) అంచనా. ఈ నేపధ్యంలో నీళ్లపై హక్కులు, నీటి  కేటాయింపులు గురించిన ఉద్రిక్తతలు బాగా పెరిగే అవకాశం వుందని వరల్డ్ వాటర్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. రానున్న కాలంలో ప్రపంచ రాజకీయాల్లో నీటి  తగాదాలు ప్రధానాంశంగా మారే వీలుందని అమెరికా రక్షణ శాఖ హెచ్చరించింది. దేశాల నడుమ సరిహద్దు వివాదాల్లో నదీ జలాల పంపిణీ అంశం కీలకం కాగలదని పేర్కొన్నది. చాద్, సోమాలియా, యెమెన్ దేశాల మధ్య సంఘర్షణలకు నీటి తగాదాలకు సంబంధం వుందన్నది పెంటగాన్ అభిప్రాయం.                  
ఈ పంచాయతీలు కేవలం దేశాలకే పరిమితం కాలేదు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని నీటి వినియోగదారులు కూడా వీటికి అతీతం కాదన్నది జగమెరిగిన సత్యం.
మన దేశంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య రగిలిన చిచ్చుకు కావేరి నదీ జలాలు కారణం. అలాగే, ఆంధ్ర, ఒడిశాల నడుమ వంశధార నదీ జలాల  వివాదం.
పోతే, పొలాల్లో నీరు కావిడి తగాదాలు, వీధి కొళాయిల వద్ద ఆడంగుల  కొట్లాటలు పాత సినిమాలు చూసేవారందరికీ  అనుభవైకవేద్యం.
ఇదంతా ఇప్పుడెందుకంటారా! కృష్ణాజిల్లాలో ఎండిపోతున్న నారుమళ్లకు నీరిస్తే తెలంగాణా వాదులకు కోపం. శ్రీశైలం నుంచి నీరు వొదిలితే సీమ నాయకులకు ఆగ్రహం.
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. చిక్కల్లా నీటితోనే. ఆ నీటిని తమ స్వార్ధానికి వాడుకునే మనుషులతోనే. (05-07-2012)