26, డిసెంబర్ 2019, గురువారం

శిక్షలు లేని నేరాలు


ఘోరమైన తప్పులు చేసి కూడా శిక్షలు పడకుండా తిరిగే ఘరానా నేరగాళ్ళు కొందరు మన మధ్యనే దర్జాగా తిరుగుతుంటారు. అలాంటి వారి జాబితా తీస్తే మొదటి పేరు నాదే.
కొంచెం అటూ ఇటూగా ముప్పయ్ ఆరేళ్ళ కిందటి మాట. అప్పుడూ సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. మా ఆవిడ కడుపుతో వుంది. చీకటి గదిలో కదలకుండా పడుకోమని పెద్దవాళ్ళ మాట. అలా చేయకపోతే పుట్టే బిడ్డ అవకరంగా పుడుతుందని హెచ్చరిక లాంటి సలహా.  ఇంటి మొత్తంలో చిన్నవాడ్ని నేనే అయినా నా మాటే చెల్లితీరాలనే మొండి వాళ్ళలో నేనే పెద్దవాడిని. ఎలా వింటాను? కానీ ఈ పంతాలు, పట్టింపుల్లో మానసికంగా నలిగిపోయేది మా ఆవిడే అనే సంగతి నేను పట్టించుకోలేదు. గదిలో పడుకోవద్దు అనే దగ్గర ఆగిపోతే నేను నేనెలా అవుతాను. పట్టుబట్టి గోధుమ పిండి కలిపించాను. రొట్టెలు చేయించాను. ఆ రోజల్లా అవసరం లేని చాకిరీ చేయించాను. అంటే బట్టలు ఉతకడం, పిండి ఆరేయడం ఇలా అన్నమాట. నిజానికి ఈ పనులు చేయడానికి ఇంట్లో పని పిల్ల వుంది. కానీ నా యుద్ధం మూఢనమ్మకాలపైన. మా ఆవిడకు అది తొలి చూలు. సొంత బిడ్డపై ప్రయోగాలను ఏ ఆడది అయినా సహిస్తుందా! కానీ ప్రేమించి పెళ్ళాడినందుకు నేను పెట్టేఈ రకమైన క్షోభను అంతా పంటి బిగువన ఓర్చుకుంది. నేను చెప్పినట్టే నడుచుకుంది. చుట్టపక్కాలు నా దాష్టీకాన్ని తప్పుపట్టారు. కానీ నా దారి నాదే. ఆరోజు అలా గడిచిపోయింది. మొదటి పిల్లాడు పుట్టాడు ఎలాంటి శారీరక వైకల్యం లేకుండా. సూర్య గ్రహణం ఎలాటి ప్రభావం చూపనందుకు పెద్దవాళ్ళు సంతోషపడ్డారు. కానీ నా మానసిక వైకల్యం మాటేమిటి?
పెళ్లి అనే ఒక బంధంతో ఆడదానిపై మగవాడికి సర్వహక్కులు వచ్చేస్తాయా! ఆమెకు ఒక మనసు ఉంటుందని గ్రహించలేని మగాడు మూఢాచారాలపై పోరాటం చేస్తున్నానని గొప్పలకు పోవడం వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ రకమైన మానసిక చిత్ర హింసలకు శిక్షలు ఉండవా?
వుండవు. నేనే సజీవ సాక్ష్యం.      

20, డిసెంబర్ 2019, శుక్రవారం

రేడియో రోజులు -48- భండారు శ్రీనివాసరావు


నేటి తెలుగు ప్రసార మాధ్యమాలు అన్నింటికీ ఆకాశవాణి మూలపుటమ్మఅనవచ్చు. 
1954 దాకా మద్రాసు కేంద్రంలో లలిత సంగీత విభాగం ప్రత్యేకంగా ఏర్పడకపోయినా ప్రధానమైన నాలుగు దక్షిణ భారతీయ భాషల్లో లలిత  గీతాల ప్రసారం 1939 నుంచీ తరచుగానే సాగుతుండేది. బిల్హణీయంవిశేషమైన ఆదరణ పొందడంతో ప్రముఖులైన కవులతో రాయించిన సంగీత నాటకాలు ఎన్నింటినో  మద్రాసు కేంద్రం ప్రసారం చేసింది. వాటిలో కొన్ని:  కృష్ణ శాస్త్రి రాసిన శర్మిష్ట’, ‘వూర్వశి’,  ‘శబరి’, ‘గుహుడు’, ‘అతిధిశాల’, ‘దక్ష యజ్ఞం’, ‘కృష్ణాష్టమి’, విశ్వనాధ సత్యనారాయణ రాసిన కిన్నెరసాని’, ‘కోకిలమ్మపెళ్లి’, ‘సుమిత్ర’, ‘ఊర్మిళ’, ‘’మారీచుడు’, ‘గోదావరి’. అలాగే రజని (బాలాంత్రపు రజనీకాంతారావు రాసిన మధురానగర గాధ’, ‘చండీ దాసు’, ‘మేఘ సందేశం’, శివశంకర శాస్త్రి (స్వామి) రాసిన  ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’,  శ్రీ శ్రీ రాసిన  ‘వ్రేపల్లె’.
ఉమర్ ఖయ్యాం జీవితాన్ని, అతని తత్వాన్ని ఆవిష్కరించినది  ‘అతిధి శాల’.  ఉర్దూ, అరబ్బీ, పారశీక పదాలతో కృష్ణశాస్త్రి  సృష్టించిన మధ్య ప్రాచ్య వాతావరణాన్ని, అందుకు తగిన సంగీతాన్ని సమకూర్చి శ్రావ్యకావ్యంగా తీర్చిదిద్దినవారు రజని’. అలాగే కృష్ణ శాస్త్రి విరచిత దక్ష యజ్ఞం’ -  సాలూరి రాజేశ్వరరావు సంగీతంలో రూపుదిద్దుకున్న మరో అద్భుతం.
టేప్ రికార్డింగ్ సదుపాయాలు  లేని  ఆ రోజుల్లో రేడియో  కార్యక్రమాలన్నీ అప్పటికప్పుడు  ప్రసారం అయ్యేవి. (LIVE BROADCASTS). అందువల్ల ఎన్నో గొప్ప కార్యక్రమాలు రేడియో పరిభాషలో చెప్పాలంటే- ఇప్పుడు లభ్యం కాకుండా గాలిలో కలిసిపోయాయి.
శ్రీ శ్రీ రాసిన బలి’, ‘గ్రామఫోను రికార్డులా తిరుగుతాడుఅనే రేడియో నాటికలు  1939-40 లలో ప్రసారమయ్యాయి. రేడియో నాటక రచనలు యెలా చేయాలో తెలిసిన రచయితలు కొందరే. అటువంటివారిలో శ్రీ శ్రీ ఒకరు. మనకు లభిస్తున్న ఆధారాలనుబట్టి1939 నుంచి 1984 దాకా శ్రీ శ్రీ రేడియో కోసం  14 నాటికలు రాశారు. వీటిల్లో మరో ప్రపంచంఒకటి. అందులో ప్రధాన పాత్ర పేరు కనుపాప’. ఇరవై  ఒకటో శతాబ్దానికి చెందినవాడు. ఇరవై  ఐదో శతాబ్దంలోకి వెళ్ళబోయి యాంత్రికలోపంతో ఇరవయ్యవ శతాబ్దిలోకి వస్తాడు. ఆ పాత్ర చేత శ్రీ శ్రీ ఒకచోట ఇలా పలికిస్తాడు.  ‘భాష చాలా అసమగ్రమైన పనిముట్టు. ఏ వూహనీ అది విస్పష్టంగా, అసందిగ్ధంగా తెలియచెయ్యలేదు’.
పీవీ రాజమన్నార్, కొడవటిగంటి కుటుంబరావు, గోరాశాస్త్రి మొదలయిన వారు ఆ రోజుల్లో రేడియో కోసం నాటకాలు రాసేవారు.  1939 నాటికే మద్రాసు కేంద్రం స్త్రీలకోసం పిల్లల కోసం కార్యక్రమాలు మొదలుపెట్టింది. బాలల  కార్యక్రమాలను ఒక వారం దుర్గాబాయమ్మ (దుర్గాభాయి దేశముఖ్) నిర్వహిస్తే  మరో వారం న్యాయపతి కామేశ్వరి నడిపేవారు. కొన్నాళ్ళకు దుర్గాబాయమ్మ తమకున్న ఇతర పనుల తొందర వల్ల రేడియోకి రాలేకపోయేవారు. అప్పుడు కామేశ్వరితో పాటు ఆమె భర్త న్యాయపతి రాఘవరావు రేడియోలో బాలల  కార్యక్రమాల నిర్వహణకు పూనుకున్నారు. ఆ దంపతులు  ‘రేడియో అన్నయ్య’,  ‘రేడియో అక్కయ్యఅనే  పేర్లతో ప్రసిద్ధులయ్యారు. తెలుగులో బాల సాహిత్యం వర్దిల్లడానికి  వారిద్దరూ  చేసిన సేవ చిరస్మరణీయం. బాలలకోసం పాటలు, నాటికలు రాయడంతోపాటు వాటిని బాలలతోనే నిర్వహించడం ఆటవిడుపుఅనే ఆదివారం కార్యక్రమం సాధించిన విజయం అపూర్వం. ఆ తరువాత బాలానందం పేర శనివారాలలోను పిల్లల  కార్యక్రమాలు ప్రసారం చేసేవారు.
రెండు రోజులకోసారి ‘మహిళామండలి’ కార్యక్రమాలు మధ్యాహ్న సమయంలో ప్రసారం అయ్యేవి. ఆ కార్యక్రమాల చివర వినిపించే ‘మంగళ హారతి’ ని  ఆ రోజుల్లో చాలా ఇళ్ళల్లో శుభకార్యాల్లో పాడుతూ వుండేవారు. స్త్రీల పట్ల వివక్ష ఎక్కువగా వున్న ఆ కాలంలో ‘మహిళా మండలి’ ఎందరో స్త్రీలకు ‘వాణి’ కాగలిగింది.
అప్పటి ఉమ్మడి  మద్రాసు రాష్ట్రంలో వున్న తెలుగు జిల్లాలలో వున్న సంగీత కళాకారులెందరో మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమ సంగీతాన్ని వినిపించినవారే. తెలుగు పాట విలువను, ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ప్రముఖ గాయకుల   తొలి కార్యక్రమాలు మద్రాసు రేడియో కేంద్రం నుంచే  ప్రసారం అయ్యాయి. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ  పదకొండేళ్ళ వయస్సులో 1941  జులై రెండో తేదీన తమ మొదటి రేడియో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తరువాత కొన్నేళ్లకు ఆయన  విజయవాడ, మద్రాసు, హైదరాబాదు రేడియో స్టేషన్లలో ఉద్యోగం చేశారు. రేడియో సంగీత చరిత్రలో ఇదో గొప్ప అధ్యాయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఘంటసాల వేంకటేశ్వర రావు 1944  సెప్టెంబర్ ఇరవైన మొదటిసారి రేడియోలో పాడారు. ఆ తరువాత అనేక సార్లు ఆయన లలితసంగీత కార్యక్రమాల్లో, సంగీత నాటకాల్లో పాల్గొంటూ వచ్చారు. దీపావళి పండుగ కోసం సముద్రాల రాఘవాచార్యులు రాసిన ‘వెలుగు వెల్లువ’ అనే సంగీత నాటకంలో ఘంటసాల, భానుమతి ప్రధాన పాత్రధారులు. విశ్వనాధ రాసిన ‘కిన్నెరసాని’ సంగీత నాటకానికి ఘంటసాల సంగీతం సమకూర్చారు. ‘లైలా మజ్నూ’ నాటకంలో ఘంటసాల మజ్నూ పాత్ర పోషించారు. అందులో ఆయన పాడిన ‘గుడారమెత్తివేశారు’‘ఎందు చూచినగాని లైలా...’ అనే పాటలు ఎంతో ప్రాచుర్యం పొందాయి.(రచన: యండమూరి సత్యనారాయణ, సంగీతం : రజని). 1945 లో ఘంటసాల పాడిన రజని గేయం ‘ఘనాఘనా గర్జింపవొ..’ అనే పాట  ఢిల్లీ నుంచి జాతీయ కార్యక్రమంలో ప్రసారమయింది.
రెండో ప్రపంచ యుద్ధం రోజుల్లో మద్రాసు నగరం నుంచి షార్ట్ వేవ్ ట్రాన్స్ మిటర్ (ప్రసారిణి) ను ఢిల్లీ తరలించారు. 1942 నుంచి1945 దాకా తెలుగు, తమిళ కార్యక్రమాలు ఢిల్లీ నుంచి కూడా ప్రసారం అయ్యాయి. మద్రాసు నుంచి కొంత బలహీనపడిన ప్రసార వ్యవస్థ ద్వారా తెలుగు, తమిళ ప్రసారాలు కొనసాగినా, శ్రోతలు ఢిల్లీ నుంచి వెలువడే కార్యక్రమాలపట్ల ఎక్కువ ఆకర్షితులయ్యేవారు.
1947లో దేశం స్వాతంత్రం సాధించేనాటికి -  ఆలిండియా రేడియో  వ్యవస్థలో ఢిల్లీ, కలకత్తా (కోల్ కతా), బొంబాయి(ముంబై), మద్రాసు(చెన్నై), లక్నో, తిరుచిరాప్పళ్లి రేడియో కేంద్రాలు మాత్రమే వుండేవి. మద్రాసు నుంచే కాక డెక్కన్ రేడియో నుంచి, మైసూరు నుంచి(చాలా అరుదుగా) తెలుగు ప్రసారాలు జరిగేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సమాచార, ప్రసార శాఖల మంత్రి అయ్యారు. ఆయన పర్యవేక్షణలో దేశంలో రేడియో వ్యాప్తికి కృషి మొదలయింది.  
1948 అక్టోబర్ 12 నాడు విజయవాడలో రేడియో కేంద్రం మొదలయింది. దీనితో మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమాలు క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
(ఇంకా వుంది)
(సమాచార సేకరణలో తోడ్పడిన డాక్టర్ పి.ఎస్. గోపాల కృష్ణ గారికి కైమోడ్పులు)

19, డిసెంబర్ 2019, గురువారం

రేడియో రోజులు - 47 - భండారు శ్రీనివాసరావు




రేడియో అన్న మూడక్షరాలు కాలగర్భంలో కలిసి పోయాయేమో అన్న అనుమానాలన్నీ, రేడియో గురించి రాస్తున్న వ్యాసాలపై వస్తున్న అనూహ్య స్పందన చూసి పటాపంచలయిపోయాయి. గుర్తున్నంతవరకే కాకుండా, గుర్తు తెచ్చుకుని మరీరాయాలనీ, అవసరమయితే రేడియో గురించి తెలిసిన ప్రతి ఒక్కర్నీ తట్టిలేపయినాసరే ఇంకా ఇంకా రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయం లో అందరి సహకారాన్నీ మనస్పూర్తిగా కోరుతున్నాను. తప్పులు దిద్దుకోవడంలో, రాసిన విషయాలను మరింత సమగ్రం చేసుకోవడంలో, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించు కోవడంలో ఈ సహకారం ప్రయోజనకారిగా వుండగలదని నమ్ముతున్నాను.

ఆకాశవాణి న్యూస్ రీడర్లను పరిచయం చేసే క్రమంలో  శ్రీ శ్రీ ప్రసక్తి వచ్చిన సందర్భంలో సుజాత గారు ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి ప్రస్తావన తీసుకువచ్చారు. 90 దశకం పూర్వార్ధంలో కన్నుమూసిన సుబ్రహ్మణ్యం గారు నయాగరా కవిత్రయంలో ఒకరు. మిగిలిన ఇద్దర్లో ఒకరు బెల్లంకొండ రామదాసు గారు కాగా మరొకరు వచన కవి కుందుర్తి ఆంజనేయులు గారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారి తమ్ముడు ఏల్చూరి విజయ రాఘవరావు గారు ప్రముఖ వేణుగాన విద్వాంసులు. కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ లోని ఫిలిమ్స్ డివిజన్ లో చాలాకాలం మ్యూజిక్ కంపోజర్ గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం గారి కుమారుడు శ్రీధర్ న్యూఢిల్లీ లో ప్రొఫెసర్ గా వున్నారు. సుబ్రహ్మణ్యం గారు చాలాకాలం మద్రాసులో సోవియట్ భూమి తెలుగు విభాగంలో పనిచేశారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు గారు, శెట్టి ఈశ్వరరావు గారు, తాపీ మోహనరావు గారు (తాపీ ధర్మారావు గారి తనయుడు) ఆయనకు సహచరులు. శ్రీ శ్రీ, ఝరుఖ్ శాస్త్రి గార్లకు సుబ్రహ్మణ్యం గారు సన్నిహిత మిత్రులు. వారి నడుమ సంభాషణలు కవితాత్మకంగా, కొండొకచో రసాత్మకంగా వుండేవని చెప్పుకునేవారు. ఒకసారి శ్రీ శ్రీ  సుబ్రహ్మణ్యం గారి గురించి చెబుతూ ప్రాసక్రీడల్లో అనుకుంటాను

                                ఏ సోడా! ఏ నీళ్ళూ
                                 వీసం కూడా కలపక
                                సౌనాయాసంగా విస్కీ సేవించే ఏసుకు ...  అని ఆశువుగా ఆలపించారు. ఇక్కడ  సౌనాయాసంగా అంటే సునాయాసంగా, ఏసు అంటే ఏల్చూరి సుబ్రహ్మణ్యం. అలా వుండేదన్న మాట మహాకవితో ఆయనగారికున్న సాన్నిహిత్యం.

సుబ్రహ్మణ్యంగారు మద్రాసులో వున్నప్పుడు రాళ్ళభండి వెంకటేశ్వరరావు గారు పాస్ పోర్ట్ పనిమీద అనుకుంటాను అక్కడికి వెళ్లారు. తదనంతర కాలంలో రచయిత, గ్రంధకర్త, విమర్శకుడు అయిన రాల్లభండి వెంకటేశ్వర రావు గారు (ఆర్వీయార్) మాస్కోలోని రాదుగ ప్రచురణాలయంలో చాలాకాలం పనిచేశారు. మాస్కోలో చదువు కోవడానికి వచ్చే పిల్లలందరికీ ఆయనే అక్కడ పెద్దదిక్కు. మా కుటుంబం మాస్కోలో వున్నప్పుడు కూడా మా ఇళ్ళ నడుమ రాకపోకలు ఎక్కువ. సాయంకాలక్షేపాల సందర్భంలో ఆయన ఎన్నెన్నో కబుర్లు చెబుతుండేవారు.
ఆర్వీయార్ మద్రాసు వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్యం గారిని  కలిసారు. పక్కన వున్న శెట్టి ఈశ్వర రావుగారు జగమెరిగిన బ్రాహ్మణుడు అంటూ సుబ్రహ్మణ్యం గారిని ఆర్వీయార్ గారికి పరిచయం చేయబోయారు. అదేమిటండీ అలా అంటారు చొక్కా లోపలనుంచి జంధ్యం అలా కనబడుతుంటేనూ అని ఆర్వీయార్ గారు తన సహజ శైలిలో అనేసారుట,  జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యమేలా? అన్న నానుడిని గుర్తు చేస్తూ.

సుబ్రహ్మణ్యం గారి వియ్యంకులు ధనికొండ హనుమంతరావు గారికి మద్రాసులో తెలుగు ముద్రణాలయం వుండేది. ఎవరయినా రచయిత పుస్తకం అచ్చుపని ఎప్పుడు పూర్తవుతుందని అడిగితే  ఆయనకు చర్రున మండుకొచ్చేదిట. ఏమిటయ్యా హడావిడి. బట్టలు ఇస్త్రీకి ఇచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడే కట్టుకోవాలి కాని ఇలా వెంటపడితే ఎలా అనేవారని ఆర్వీయార్ గారు చెప్పారు.

అన్నట్టు, ఆర్వీయార్ గారు కూడా మాస్కో రేడియోలో ఆపద్ధర్మంగా వార్తలు చదివేవారు. రష్యన్-తెలుగు డిక్షనరీ కూడా తయారు చేసారు. ఆ రోజుల్లో పనులమీదా, ఇస్కస్ (ఇండో సోవియట్ కల్చరల్ సొసైటీ ) ఆహ్వానం మీదా సోవియట్ యూనియన్ సందర్శించే తెలుగువారికి ఈ పుస్తకం ఎంతో ఉపయుక్తంగా వుండేది.
(ఇంకా వుంది)


రేడియో రోజులు - 46 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 20-12-2019, Friday)
ఆకాశవాణి భక్తిరంజని
ఒకానొక రోజుల్లో తెలుగునాట ప్రతి లోగిలి రేడియోలో వచ్చే భక్తి రంజని కార్యక్రమంతో మారుమోగుతుండేది.
తెల్లవారేసరికి ఆ రోజుల్లో ప్రతి యింట్లోనూ, బయట కాఫీ హోటళ్లలోనూ ఎక్కడ విన్నా  భక్తరంజని పాటలే.
తూము నరసింహదాసు, ప్రయాగ రంగదాసు (బాలమురళీ కృష్ణ మాతామహుడు), నరసదాసు, నారాయణతీర్థులు, రామదాసు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, హనుమాన్ చాలీసా, సూర్యస్తుతి మొదలైనవి ఆ రోజుల్లో భక్తి రంజని ద్వారా  శ్రోతలకు సురపరిచితం.
ఈ విషయాలు చెప్పాలంటే మల్లాది సూరిబాబు గారే చెప్పాలి. ఆయన ఇలా అంటారు.
“ధనుర్మాసంలో డాక్టర్ మంగళంపల్లి, శ్రీరంగం గోపాలరత్నం పాడిన తిరుప్పావై, సప్తపది ఎంత ప్రసిద్ధి చెందినదో అందరికీ తెలుసు. ప్రభాతవేళ ఈ పాశురాలు చెవిని పడుతూంటే శ్రీరంగంలో స్వామి ఎదురుగా కూర్చున్న అనుభూతి కల్గుతుంది. ప్రతిరోజూ వోలేటి వెంకటేశ్వర్లు గానం చేసిన హనుమాన్ చాలీసా, పెమ్మరాజు సూర్యారావు, ఎం.వి.రమణమూర్తి పాడిన సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు సర్వం బ్రహ్మమయం, నహిరే నహి శంక, భజరే గోపాలంఎప్పుడు విన్నా మొదటిసారి విన్నట్లు అనిపించడం ఓ దివ్యమైన అనుభవం.
“వింజమూరి లక్ష్మి, వి.బి.కనకదుర్గ, పాకాల సావిత్రీదేవి, ఎన్‌సివి జగన్నాథాచార్యులు గానం చేసిన సుప్రభాతాలు, శ్రావ్యమైన లలిత గీతాలు, దేశభక్తిని ప్రచోదనం చేసే పాటలు, ఎన్‌సివి జగన్నాథాచార్యులు, కనకదుర్గ పాడిన శ్రీ సత్యనారాయణ స్వామి సుప్రభాతంరేడియోకే దివ్యాభరణాలై లక్షలాది శ్రోతలను అలరిస్తున్నాయి.
“మంగళంపల్లి బాలమురళీకృష్ణ విజయవాడ కేంద్రంలో లలిత సంగీత శాఖకు ప్రొడ్యూసర్‌గా ఉన్న రోజుల్లో మధురంగా పాడిన పిబరే రామరసం, స్థిరతా నహిరే, చేతః శ్రీరామంశ్రోతలు ఈ రోజుకీ ఎంతో ఆసక్తిగా వింటారు. అన్నమయ్య కీర్తనలు అప్పటికింకా వెలుగులోకి రాలేదు. భక్తిరంజని కోసం, బాలమురళీ పాడిన ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నదిఅన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యుల వారు రాసిన కీర్తనతో విజయవాడ కేంద్రం నుంచి అన్నమాచార్య కీర్తనల ప్రచారం ప్రారంభమైందంటారు” శ్రీ  సూరిబాబు.
ఒకప్పుడు రేడియో అంటే సంగీతం. నిజంగా ఆకాశవాణిలో పోగుపడిన సంగీత సంపద అంతాఇంతా కాదు. ఆర్కైవ్స్ పేరిట కొంత భద్రపరచినా ఎంతో అమూల్యమైన  సంగీత నిధి రికార్డుల్లో లేకుండా పోయింది. కొందరు సంగీత కారుల స్వార్ధం, మరికొందరు అధికారుల అజ్ఞానం ఇందుకు కారణాలు. కళాకారులు కొన్ని టేపులు దారిమళ్ళించి తమ స్వార్ధాలకు వాడుకుంటే, సంగీతం అంటే తెలియని కొందరు అధికారులు ప్రసిద్ధ విద్వాంసులు కచ్చేరీ ఇచ్చిన  కొన్ని టేపులను చెరిపివేశారని చెప్పుకోవడం విన్నాను.
మల్లాది సూరిబబుగారికి రజనీ గురుసమానులు. రజనీని అంటే బాలాంత్రపు రజనీకాంతరావుగారిని   సంగీత సాహిత్య సవ్యసాచిగా అభివర్ణిస్తారాయన. నిజంగా సూరిబాబు గారి ప్రసంశలో ఇసుమంతయినా అతిశయోక్తి లేదు.
“రజని  రేడియో కోసమే పుట్టిన వ్యక్తి. రేడియో ప్రాభవానికి ముఖ్య కారకుడై యింతింతై, వటుడింతయై మఱియు తానింతై నభోవీధిపై నంతై, జాతీయ అంతర్జాతీయ పురస్కారాలందుకున్న వాగ్గేయకారుడు. జాతీయ స్థాయిలో రేడియో పురస్కారాలందుకున్న మొదటి వ్యక్తి ఆయనే. శ్రీ సూర్యనారాయణా మేలుకోఎం.వి.రమణమూర్తి, శ్రీరంగం గోపాలరత్నం పాడిన ఈ సూర్యస్తుతికి సంగీత మాధుర్యం నింపినది రజనీయే” అంటారు మల్లాది సూరిబాబు గారు.
 ఇక హైదరాబాదు రేడియో కేంద్రానికి వస్తే పాలగుమ్మి విశ్వనాధం గారు, మల్లిక్, చిత్తరంజన్ గార్లు, మంచాల జగన్నాధ రావు గారు భక్తిరంజని కార్యక్రమానికి తమ సంగీత విభవంతో కొత్త సొగసులు అద్దారు. ఇక దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు రేడియో కోసమే రచించిన అనేక గేయాలు ఈనాటికీ ఈ కార్యక్రమంలో శ్రోతలను అలరిస్తూనే వున్నాయి. 1957 లో దేవులపల్లి కృష్ణ శాస్త్రి  హైదరాబాదు రేడియోలో ప్రయోక్తగా చేరిన కృష్ణశాస్త్రి గారు, ఎనిమిదేళ్ళపాటు అందులో ఉద్యోగం చేశారు. రేడియోవాళ్ళు నాచేత రాయించకపోతే నేను రాసిన దాంట్లో చాలా భాగం  రాసివుండే వాణ్ణి కాదుఅని ఆయన చెప్పేవారు.
1960 లో రజని సంగీత సంవిదానంతో కృష్ణ శాస్త్రి రాసిన క్షీర సాగర మధనం’, ‘విప్రనారాయణ’, ‘మాళవికయక్ష గానాలను హైదరాబాదు కేంద్రం ప్రసారం చేసింది.
 భక్తిరంజనిలో ప్రసారమయ్యే కీర్తనలన్నీ సంప్రదాయ సంగీత పరిధిలో ఉంటూ శ్రోతల్లో సంగీతాభిరుచిని కలిగించడం ఈ కార్యక్రమం విశిష్టత.
మల్లాది గారు మరికొన్ని విశేషాలు చెప్పారు. క్రైస్తవ, ముస్లిం భక్తిగీతాలు కూడా ఈ భక్తిరంజని కార్యక్రమంలో చోటు చేసుకున్నాయి.  
విజయవాడలో సువార్త వాణిఅనే రికార్డింగ్ స్టూడియో వుండేది. 1971-76 ప్రాంతాల్లో రెవరెండ్ సాల్మన్ రాజు ఆ ప్రసార కేంద్రానికి డైరెక్టర్‌గా ఉంటూ ఎన్నో క్రైస్తవ భక్తిగీతాలు కంపోజ్ చేసి పాడిస్తూ వుండేవారు. ఆ పాటలు రేడియో కేంద్రానికిచ్చేవారు.
చంద్రకాంత కొట్నీస్, ఎ.పి.కోమల, జి.ఆనంద్, గోవిందాచార్యులు (శ్రీరంగం గోపాలరత్నం అన్నగారు) పాడిన కొనియాడ తరమా.. కోమల హృదయాఅనే క్రైస్తవ భక్తిగీతం బహుళ ప్రసిద్ధమైంది.
ఆదివారాల్లో ప్రసారమయ్యే క్రైస్తవ భక్తిగీతాలకూ, శుక్రవారాల్లోని నాత్-ఎ నబీ, నాతియా కలాం వంటి భక్తిరస ప్రధానమైన రచనలకు ఆకర్షణ ఇంతవరకూ తగ్గలేదు. ఇళ్లల్లో, పూజా మందిరాల్లో ప్రశాంతమైన చక్కని ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించటానికి కారణం ఆకాశవాణి భక్తిరంజనియే అంటే అతిశయోక్తి కాదంటారు సూరిబాబు. ఆదివారాల్లో విధిగా ప్రసారవౌతుండే ఆధాత్మ రామాయణ కీర్తనలుభక్తిరంజనికే తలమానికం. కాళహస్తి సంస్థానంలోని మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఈ ఆధ్యాత్మిక రామాయణ కీర్తనలకో ప్రత్యేకతను అందించారు. శుద్ధ సంప్రదాయ సంగీత ధోరణితో ఉండే ఈ కీర్తనలు ఒకప్పుడు మన ఇళ్లల్లో మన అమ్మమ్మలు, బామ్మలు పాడుతూండేవారు.
సంప్రదాయ సంగీత సౌరభంతో నిండిన ఈ కీర్తనలు పాడిన శివశంకరశాస్త్రిని  విజయవాడ కేంద్రానికి పిలిచి రికార్డు చేసి, వాటికి నొటేషన్ తయారుచేసి నేదునూరి కృష్ణమూర్తి, ఎ.వి.ఎస్. కృష్ణారావు, నూకల చిన సత్యనారాయణ, ఎం.ఎస్.బాలసుబ్రహ్మణ్య శర్మ, ఎన్.సి.వి. జగన్నాథాచార్యులు, బలిజేపల్లి రామకృష్ణశాస్త్రి, శ్రీరంగం  గోపాలరత్నం, వి.బి.కనకదుర్గ, వింజమూరి లక్ష్మి మొదలైన సమర్థులైన విద్వాంసులతో నాలుగైదు రోజులపాటు బాగా రిహార్సల్స్ చేయించి, పాడించిన ఘనత వోలేటి వేంకటేశ్వర్లుకే దక్కుతుందంటారు మల్లాది సూరిబాబు గారు.
(సమాచార సేకరణలో ఉపయోగపడే వ్యాసాలు అందించిన మల్లాది సూరిబాబు గారికి కృతజ్ఞతలతో)
(ఇంకావుంది)

రేడియో కబుర్లు - 45 - భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 19-12-2019, Thursday) 

డెక్కన్ రేడియో
‘యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’
పాటల్లోనే కాదు మాటల్లో కూడా సంగీతం వినవచ్చు. ఉర్దూ భాషకు ఆ శక్తి వుంది.
డెబ్బయ్యవ దశకంలో హైదరాబాదు రేడియో కేంద్రం నుంచి సరిగ్గా సాయంత్రం అయిదు గంటల యాభయ్ నిమిషాలకు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు మొదలయ్యేవి.
‘యే ఆకాష్ వాణి హైదరాబాద్ హై. అబ్ ఆప్ వసీమక్తర్ సే ఇలాఖాయే ఖబ్రే సునియే’ అంటూ వసీం అక్తర్ చదివే వార్తలు ఉర్దూ తెలియని వాళ్లు కూడా వినడం నాకు తెలుసు. ఆయన వార్తలు చదువుతుంటే సంగీతం వింటున్నట్టుగా వుండేది. నేను ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేశాను. కొన్ని ఉద్యోగాలు చేయడం కూడా పూర్వజన్మ సుకృతం. చిన్నవా పెద్దవా అన్న మాట అటుంచి గొప్పగొప్ప వాళ్ళతో కలిసి పనిచేశామన్న తృప్తి కలకాలం మిగిలిపోతుంది.
దేశానికి స్వాతంత్రం రావడానికి ఓ పుష్కర కాలం కంటే చాలా ముందుగానే, అప్పటి నిజాం సంస్థానంలో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 1933 లో రెండువందల వాట్ల ట్రాన్స్మిషన్ శక్తితో, ‘డెక్కన్ రేడియో’ అనే పేరుతో ఒక ప్రైవేటు రేడియో స్టేషన్ ను హైదరాబాదులో ఏర్పాటు చేశారు. ఆ రేడియో ట్రాన్స్ మిటర్ ను స్తానికంగా రూపొందించడం విశేషం. వాస్తవానికి ఈ రేడియో కేంద్రం ఒక కుటుంబం ఆద్వర్యంలో ఏర్పడింది. ఆ కుటుంబసభ్యులే కేంద్రం నిర్వహణ బాధ్యత చూసుకునేవారు. చిరాగ్ ఆలీ లేన్ లోని ఆజం మంజిల్ భవనంలో ఈ రేడియో కేంద్రం పనిచేసేది.
ఉర్దూలో వార్తలతో పాటు గజల్స్, ఖవ్వాలీలు, పాటలు ప్రసారం అయ్యేవి. ఆ రోజుల్లో సినిమా పాటల రికార్డులు అంత సులభంగా దొరికేవి కావు. దానితో స్థానిక సంగీత కళాకారులు రేడియో కేంద్రానికి వచ్చి తమ కార్యక్రమాలను రికార్డ్ చేసేవారు. ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు రోషన్ ఆలీ డెక్కన్ రేడియోలో మొదటి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఆ తరువాత ఎం ఏ రవూఫ్ డెక్కన్ రేడియోలో స్టుడియో ఎక్జిక్యూటివ్ గా చేరారు. ఆయన పేరు పొందిన గజల్ గాయకుడు. తదనంతర కాలంలో రవూఫ్ ఈ కేంద్రానికి డైరెక్టర్ అయ్యారు.
మొహరం మాసంలో రేడియో కేంద్రానికి సెలవు ప్రకటించేవారు. ప్రసారాలు వుండేవి కావు.
ఆ తరువాత కొన్ని మార్పులు చేశారు. మొదటి పదమూడు రోజులు ప్రసారాలు నిలిపివేసేవాళ్ళు. మిగిలిన రోజుల్లో కూడా సంగీత కార్యక్రమాలు వుండేవి కావు. స్థానిక వార్తాపత్రికల్లో వెలువడిన వార్తల ఆధారంగా న్యూస్ బులెటిన్లు తయారయ్యేవి. రాష్ట్రానికి సంబంధించిన సమాచారమే వార్తల్లో చోటుచేసుకునేది.
రెండేళ్ళ తరువాత అంటే 1935 లో డెక్కన్ రేడియో కేంద్రాన్ని నిజాం స్వాధీనం చేసుకున్నారు. నిజాం సంస్థానంలోని వైర్ లెస్ విభాగం కింద డెక్కన్ రేడియో పనిచేయడం మొదలు పెట్టింది. నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఆధ్వర్యంలో డెక్కన్ రేడియో కేంద్రానికి మరిన్ని హంగులు సమకూరాయి. ఇంగ్లాండ్ లోని మార్కొనీ కంపెనీ తయారు చేసిన శక్తివంతమైన రెండువందల వాట్ల రేడియో ట్రాన్స్ మిటర్ ను దిగుమతి చేసుకున్నారు. రేడియో కేంద్రాన్ని చిరాగ్ ఆలీ లేన్ నుంచి ఖైరతా బాద్ లోని యావర్ మజిల్ అనే భవనంలోకి మార్చారు. కొత్త రికార్డింగ్ స్టుడియోలను నిర్మించారు. నగర పొలిమేరల్లోని సరూర్ నగర్ ప్రాంతంలో పెద్ద యాంటీనా నెలకొల్పారు. దానిమీద వున్న యెర్ర విద్యుత్ దీపాలు నగరంలో సుదూరంగా వుండే అనేక ప్రాంతాలకు కనబడేవని చెప్పుకునే వారు. డెక్కన్ రేడియోలో పనిచేసే ఒక ఉద్యోగిని లండన్ పంపించి బీబీసీ లో శిక్షణ ఇప్పించారంటే డెక్కన్ రేడియో పట్ల నవాబ్ ఆలీ యవార్ జంగ్ ఎంతటి శ్రద్ధ తీసుకున్నదీ అర్ధం అవుతుంది.
తరువాతి రోజుల్లో డెక్కన్ రేడియో సంగీత కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వాటికి శ్రోతల నుంచి విశేషమైన ఆదరణ లభించడం అందుకు కారణం. ఉస్తాద్ ఫయ్యాజ్ ఖాన్, ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్, హీరా బాయ్ బరడేకర్, ఆవిడ సోదరి సరస్వతీ రాణే వంటి సుప్రసిద్ధ సంగీతకారులు డెక్కన్ రేడియో కళాకారుల జాబితాలో వుండేవారు. మరో ప్రసిద్ధ సంగీత కారుడు ఉస్తాద్ అబ్దుల్ కరీం ఖాన్ రెండు పర్యాయాలు హైదరాబాదు వచ్చి డెక్కన్ రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చారు.
డెక్కన్ రేడియో నుంచి తెలుగు, కన్నడం, మరాఠీ భాషల్లో కూడా కొన్ని కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి కాని వాటి వ్యవధి చాలా పరిమితం.

(ఇంకా వుంది)

17, డిసెంబర్ 2019, మంగళవారం

రేడియో కబుర్లు -44- భండారు శ్రీనివాసరావు


“నేనిప్పుడు చెన్నపట్నం నుంచి మాట్లాడుచున్నాను. మీరెక్కడ నుంచి వినుచున్నారో చెప్పజాలను. కానీ అనేక స్థలములయందు వుండి వినుచున్నారని తలచుచున్నాను. నేనీ రోజున చెప్పవలసినది ఏమనగా ఆకాశవాణి యొక్క ఉపయోగములే. దీన్నే ఇంగ్లీష్ లో రేడియో అనెదరు.”
“1938 జూన్  16 నాడు మద్రాసు రేడియో కేంద్రం ప్రారంభం అయినప్పుడు తొలి తెలుగు ప్రసంగం చేస్తూ సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు చెప్పిన తొలి పలుకులు ఇవి. రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము -  రేడియో’ అనే విషయం గురించి  సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో చేసిన ప్రసంగాన్ని ప్రసారం చేశారు. జస్టిస్ పార్టీ నాయకులలో ఒకరయిన నాయుడు గారు కొంతకాలం ఉమ్మడి మద్రాసు ప్రధానిగా పనిచేశారు. మద్రాసు రేడియో స్టేషన్ నుంచి అదే మొదటి తెలుగు ప్రసంగం.
“రేడియోకు తెలుగు పర్యాయ పదంగా ‘ఆకాశవాణి’  వాడిన సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు తమ ప్రసంగం ముగింపులో చెప్పిన అంశాలు నేటికీ ప్రసార సాధనాలకు వర్తిస్తాయి.
“ఆయన ఇలా చెప్పారు.
“యెంత మంచి వస్తువయిననూ మంచిదే కాక చెడునకు కూడా ఉపయోగింపనగును. కొన్ని దేశములందు వివిధ రాజకీయ పక్షములవారు తమ పక్షముల గొప్ప చెప్పుకొనుటకు, వైరులను (విపక్షాలను) తక్కువచేసి చెప్పుకొనుటకు ఉపయోగింతురు. ప్రస్తుతము మన దేశము నందు అన్నింటికంటే విద్యావ్యాప్తి చాలా ముఖ్యము. కనుక, ఆకాశవాణిని సర్వజనోపయోగకరమైన విషయములందును, ఆనందము కలుగచేయు పనుల యందును స్వచ్ఛ మనసుతో ఉపయోగింపవలెనని నా హెచ్చరిక”
ఎప్పుడో ఎనభయ్ ఏళ్ళకు పూర్వం హెచ్చరిక రూపంలో నాయుడు గారు చేసిన మనవిని ఈనాటి ప్రసార సాధనాలవారు ఏమేరకు పాటిస్తున్నారన్నది సందేహమే.
“అంతకు ముందు అదే రోజు సాయంత్రం  మద్రాసు రేడియో కేంద్రాన్ని అప్పటి మద్రాసు గవర్నర్ ఎర్స్కిన్ ప్రభువు ( Lord Erskine) రాష్ట్ర ప్రధాన మంత్రి  (ఇప్పటి మాటల్లో చెప్పాలంటే ముఖ్యమంత్రి)  చక్రవర్తుల రాజగోపాలాచారి ప్రారంభించారు. అప్పటికే ఆల్ ఇండియా రేడియో అనే పేరుతొ ప్రభుత్వ వ్యవస్థలో ఏర్పాటుచేసిన ఆ సంస్థను వ్యవహరిస్తూ వస్తున్నప్పటికీ,  రాజాజీ మాత్రం ఆంగ్లంలో చేసిన తన  ప్రారంభోపన్యాసంలో ‘హిందూస్తాన్ ఆకాశవాణి’ అనే ప్రస్తావించారు.
“ప్రారంభోత్సవం రోజు సాయంత్రం ఐదున్నరకు సౌరాష్ట్ర రాగంలో శ్రీ త్యాగరాజ స్వామి వారు రచించిన ‘శ్రీ గణపతిని సేవింప రారే’ అనే తెలుగు కృతిని తిరువెణ్ కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై అనే విద్వాంసులు నాదస్వరంపై వాయిస్తుండగా మొదలయింది. రాజాజీ ప్రారంభోపన్యాసం తరువాత సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ గాత్ర కచేరీ, తిరిగి సుబ్రహ్మణ్యపిళ్ళై గారి నాదస్వర సభ ప్రసారం అయ్యాయి. ఆ వెంటనే రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ‘భారత దేశము - రేడియో’ అనే విషయం గురించి,  సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు తెలుగులో ప్రసంగించారు.
“ఎప్పుడో ఎనభయ్ ఏళ్ళకు పూర్వమే మద్రాసు రేడియో కేంద్రం అనేక తెలుగు కార్యక్రమాలను ప్రసారం చేసింది. రామమూర్తి పంతులు ‘సజీవమైన తెలుగు’ అనే విషయం గురించీ, ‘మన ఇళ్లు – వాని అందము చందము’ గురించి కోలవెన్ను కోటేశ్వరరావు,  ‘రవీంద్రుడు’ శీర్షికన బెజవాడ గోపాలరెడ్డిగారు రాసిన ప్రసంగా వ్యాసాలను ఆకేంద్రం నుంచి ప్రసారం చేశారు.
“అదే కేంద్రం నుంచి  తెలుగులో ప్రసారం అయిన తొలి రేడియో నాటకం ‘అనార్కలి’. ముద్దుకృష్ణ రాసిన ఈ నాటకాన్ని ఆచంట జానకీరాం  రూపొందించారు. నాయిక పాత్రను రేడియో భానుమతిగా ప్రసిద్దురాలయిన  పున్నావజ్జల  భానుమతి పోషించారు. నాయకుడు సలీం (జహంగీర్)పాత్రను దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి,  అక్బర్ పాత్రను  డాక్టర్ అయ్యగారి వీరభద్రరావు  పోషించారు. ఈ నాటకం   1938 జూన్  24 తేదీ రాత్రి ఎనిమిదిన్నరనుంచి  ప్రసారం అయింది.
“జానపద సంగీతం కూడా వినిపించాలనే ఉద్దేశ్యంతో అడపా దడపా ‘పల్లె పాటలు’ ప్రసారం చేసేవారు. అయితే ఈ పల్లెపాటలు పాడిన వారు నాగరీకులే కావడం విశేషం. వారు అసలు సిసలు జానపద కళాకారులు కాదు. శాస్త్రీయ సంగీతంలో కాస్త లలితమైనవిగా భావించే పదాలను. జావళీలను ప్రత్యేకంగా వినిపించేవారు. అట్లా వినిపించినప్పుడు తెలుగు రచనలతో పాటు తమిళ రచనలను కూడా ప్రసారం చేసేవారు.
“మద్రాసు రేడియో కేంద్రం నుంచి తమిళంలో కన్నా తెలుగులోనే ఎక్కువ ప్రసారాలు జరుగుతున్నాయనే ప్రచారం ఒకటి ఆ రోజుల్లో కొనసాగుతూ వుండేది.
“1939లో తిరుచినాపల్లి రేడియో కేంద్రం ఏర్పడి దక్షిణ తమిళ జిల్లాలపై దృష్టి నిలిపిందని అనుకునేవారు.
“అంతకు ముందే   హైదరాబాదులో, ఆ తరువాత మైసూరులో  రేడియో కేంద్రాలు ఏర్పాటయ్యాయి. మైసూరు విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్ర  ఆచార్యులుగా వున్న డాక్టర్ ఎం.వీ. గోపాలస్వామి మైసూరు రేడియో కేంద్రానికి సంస్థాపకులు. దానికి ఆయన ‘ఆకాశవాణి’ అని పేరు పెట్టారు. ఆ పేరును రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు సూచించారని చెబుతారు.    తిరువాన్కూర్ సంస్థానం 1937సెప్టెంబరు ఆఖరులో ఒక రేడియో కేంద్రాన్ని నెలకొల్పింది.
డెక్కన్ రేడియో పూర్వాపరాలు :
“1923లో మహబూబ్ ఆలీ అనే తపాలాశాఖ ఉద్యోగి హైదరాబాదులో చిరాగ్ ఆలీ సందులో
200 వాట్ల శక్తి కలిగిన చిన్న రేడియో కేంద్రం నెలకొల్పాడు. 1935 ఫిబ్రవరి నుంచి అది నిజాం నవాబు అధీనంలోకి వచ్చింది. ఆ రేడియో కేంద్రంలో ప్రసార భాష ఉర్దూ. ప్రసార శక్తి చాలా తక్కువ కావడం వల్ల ప్రసారాలు చాలా  పరిమితమైన దూరాలకే వినిపించేవి.
“1939 జులైలో అయిదు కిలోవాట్ల శక్తి కలిగిన రేడియో రిలే  కేంద్రాన్ని
 సరూర్ నగర్ లో ఏర్పాటు చేసి డెక్కన్ రేడియో పేరిట ప్రసారాలు
మొదలుపెట్టారు.  ఉర్దూతో పాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో ప్రసారాలు
చేసేవారు.  అయితే ఉర్దూతో పోలిస్తే తక్కిన భాషల ప్రసారాలు పరిమితంగా
వుండేవి. మొహర్రం మాసంలో ప్రసారాలు వుండేవి కావట. కొన్నాళ్ళకు స్టూడియోను
సరూర్ నగర్ నుంచి నగరంలోని ఖైరతాబాదులోవున్న యావర్ మంజిల్ కు మార్చారు.
రిలే స్టేషన్  మాత్రం సరూర్ నగర్ లో వుండేది. తెలుగులో ప్రసారాలు మొదట తక్కువ వ్యవధిలో ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా రోజుకు గంట సేపు ప్రసారాలు చేసేవారు. ఈ కేంద్రం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా, సాయంకాలం అయిదున్నర నుంచి రాత్రి పదిన్నర దాకా ప్రసారాలు చేసేది.
హిందూస్తానీ సంగీతానికి ప్రాధాన్యం ఇచ్చేవారు.  చాలా ఏళ్ళ తరువాత కర్నాటక సంగీతానికి కొంత సమయం కేటాయించసాగారు. ముస్లిం వనితలకోసం పరదా పధ్ధతి, వారికోసం విడిగా వాకిలి ఏర్పాటుచేశారు. వసీంఖాన్ అనే ఆయన  తెలుగు కార్యక్రమాల అధికారిగా పనిచేశారు. రాయప్రోలు రాజశేఖర్ సహాయ దర్శకులుగా, భాస్కరభట్ల కృష్ణారావు, దుర్గా చలం కార్యక్రమ నిర్వాహకులుగా పనిచేసేవారు.
కురుగంటి సీతారామయ్య, మహారధి సంభాషణలు, వార్తలు వంటివి రాసేవారు. కే.ఎల్. నరసింహారావు గ్రామీణ కార్యక్రమాలు నిర్వహించేవారు. లలిత, వెంకటేశ్వర్లు అనేవాళ్ళు  వార్తలు చదివేవాళ్ళు. మల్లి  పాటలు, ఎల్లి పాటలు మొదలయిన శీర్షికలతో జానపద గీతాలు ప్రసారం అయ్యేవి”
 (సమాచార సేకరణలో అమూల్య సహకారం అందించిన ఆకాశవాణి పూర్వ సంచాలకులు
డాక్టర్ పీ ఎస్ గోపాలకృష్ణ గారికి నా కైమోడ్పులు)
(ఇంకావుంది)

16, డిసెంబర్ 2019, సోమవారం

రేడియో కబుర్లు - 43- భండారు శ్రీనివాసరావు

రేడియో కబుర్లు - 43 - భండారు శ్రీనివాసరావు
(Published in SURYA daily on 17-12-2019, Tuesday)
రేడియో కధాకమామిషు
నిజానికి ఈ వ్యాసపరంపరను దీనితోనే మొదలు పెట్టాల్సింది కానీ నా రేడియో రోజులు గురించి రాయడం కోసం వేరే విధంగా ప్రారంభించాల్సి వచ్చింది.
నాకు బుద్ది తెలుస్తున్న తొలి రోజుల్లో రేడియోని చూసింది మా స్వగ్రామం కంభంపాడులోని చామర్తి వీరభద్రరావు మామయ్య గారింటిలో. వాళ్ళ ఇంటి మధ్యహాలులోని అల్మారాలో ఒక భోషాణం పెట్టె మాదిరిగా వుండేది. దానికిందనే మోటారు కార్లలో వాడే బ్యాటరీ మాదిరిగా పెద్దగా వుండేది. కార్లలో వాడే బ్యాటరీ కాదు గానీ రేడియో కోసం ప్రత్యేకమైన బ్యాటరీ. బాగానే పెద్దది. ఎవరెడీ కంపెనీ వారి బ్యాటరీ. ఆ కంపెనీ గుర్తు 9 అంకె. ఆ నెంబరు మధ్యలో నుండి దూకుతున్నట్లున్న పిల్లి బొమ్మ ఆ బ్యాటరీ మీద ఉండేది.
ఆ పెద్ద గదిలో పైన ఆ మూల నుంచి ఈ మూలకు నైలాన్ తో అనుకుంటా తయారు చేసిన ఒక జాలీ మాదిరి యాంటీనా కట్టి వుండేది. మా మామయ్యగారు రేడియో ఆన్ చేయగానే కింది భాగంలో పచ్చటి లైటు ముందుకూ వెనక్కూ సాగుతూ ఒక చోట ఆగిపోయేది. మా మామయ్యగారికి భానుమతి పాటలు అంటే చాలా ఇష్టం. ఆ పాటలు రేడియోలో ఎప్పుడు వస్తాయో ఆయనకు ముందుగా ఎలా తెలుసో నాకయితే తెలియదు. కానీ రేడియోలో అవే పాటలు వచ్చేవి. బహుశా ఆకాశవాణి ప్రచురించే వాణి పత్రిక తెప్పించేవారేమో. ఒక వేళ భానుమతి స్వరం వినబడకపోతే, వెంటనే గ్రామఫోన్ పెట్టె బయటకు తీసి బాసింపట్టు వేసుకు కూర్చుని భానుమతి పాట రికార్డు వేసుకుని వినేవాడు. మాకేమో రేడియో వినాలని. ఆయనకేమో భానుమతి పాట వినాలని. రేడియోలో అప్పుడప్పుడూ హరికధలు, ఆదివారాల నాడు తెలుగు సినిమా (సంక్షిప్త శబ్ద చిత్రం) వేసే వాళ్ళు. ఇక ఆరోజు ఆయన ఇల్లు తిరుణాల మాదిరిగా వూరి జనంతో నిండిపోయేది. ఎందుకంటే వూరి మొత్తానికి అదొక్కటే రేడియో. అలాంటి రోజుల్లో మా మామయ్య గారు ఆ రేడియోనుతీసుకుని వచ్చి పదిలంగా బయట వరండాలో ఓ బల్ల మీద వుంచి రేడియో పెట్టేవారు, వచ్చిన జనమంతా విననడానికి వీలుగా.
పొరబాటున ప్రసారంలో ఏదైనా అంతరాయం వస్తే ఆయన వెంటనే హార్మనీ పెట్టె బయటకు తీసి దానిపై వున్న మీటలపై చేతివేళ్ళను కదిలిస్తూ, మరో చేతితో ఆ పెట్టెకు వెనుకవైపు చెక్క పలకను వెనక్కీ ముందుకూ జరుపుతూ గొంతెత్తి ఏదో ఒక పద్యం అందుకునేవారు. కొంతమంది ఊరిజనం కూడా ఆయనతో గొంతు కలిపేవారు.
ఒక విధంగా మా మామయ్య గారిల్లు పొద్దుగూకే వేళకు వూరిజనాలకు వినోదకేంద్రంగా మారిపోయేది.
అదీ రేడియోతో నా మొదటి పరిచయం.
తర్వాత స్కూలు చదువుకోసం బెజవాడ వెళ్లి మా లాయరు బావగారు తుర్లపాటి హనుమంతరావు గారింట్లో ఉండేవాడిని. ఆయన ఇంట్లో ఆఫీసు గదిలో ఒక బీరువా మీద ఒక చిన్న సైజు రేడియో వుండేది. దానికి మా వూళ్ళో రేడియో మాదిరిగా యాంటీనా వున్నట్టు లేదు. కరెంటుతో పనిచేసేది. కాకపోతే ఆ రేడియో పెట్టే అధికారం మా బావగారికి మాత్రమే వుండేది. ఇంట్లో వాళ్ళం ఎవ్వరం దాని మీద చేయివేసే సాహసం చేసేవాళ్ళం కాదు. పొద్దున్నే భక్తి రంజని, ఇంగ్లీష్ వార్తలు అంతే! ఆ తర్వాత రేడియో నోరు తెరిచేది కాదు. అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ మొట్టమొదటిసారి చంద్రుడి మీద కాలుమోపినప్పుడు ఆ చారిత్రాత్మక సంఘటనను బీబీసీ కాబోలు ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆ రోజు మా బావగారు నిబంధనలను కాస్త సడలించి రేడియో పెట్టారు. గుర్రుబర్రు మంటూ ఇంగ్లీష్ లో ప్రసారం అయిన ఆ కార్యక్రమంలో ఒక్క ముక్క అర్ధం కాకపోయినా అందరం చెవులొప్పగించి విన్నాం.
బీసెంటు రోడ్డులో జంధ్యాల నారాయణ మూర్తి (సినిమా డైరెక్టర్ జంధ్యాల తండ్రి) గారి బుష్ రేడియో స్టోర్స్ వుండేది. మా బావగారు ఆయన గారు మంచి స్నేహితులు. అంచేత పిల్లలం అప్పుడప్పుడూ ఆ దుకాణంలో కాసేపు కూర్చుని రేడియో కొనడానికి ఎవరైనా వచ్చినప్పుడు పెట్టే ప్రోగ్రాములు కాసేపు వినేవాళ్ళం. ఆ విధంగా మా ముచ్చట తీర్చుకునేవాళ్ళం.
హైస్కూల్లో చేరిన తర్వాత సెలవుల్లో మా వూరికి వెళ్ళినప్పుడు ఊరిమద్యలో మైకులో వినిపించే పంచాయతీ రేడియో సెంటర్ మాకు ఆటవిడుపు. రోజూ సాయంత్రం వేళల్లో ఓ రెండు మూడు గంటలు రేడియో వినడానికి వూళ్ళో వాళ్ళు ఆ మైకు దగ్గరికి చేరేవాళ్ళు. అది కూడా ఒక్క విజయవాడ మెయిన్ స్టేషన్ మాత్రమే. వివిధభారతి పాటలు అవీ వినడానికి వీలులేదు. సాయంత్రం ప్రాంతీయ వార్తలు, ఢిల్లీ నుంచి వచ్చే తెలుగు వార్తలు, వ్యవసాయదారుల కార్యక్రమం, ఎప్పుడయినా ఓ హరికధా కాలక్షేపం. వివిధభారతి పాటలు అవీ వినడానికి వీలులేదు. మొదట్లో బాగున్నా సినిమాపాటలు వినే ఛాన్స్ లేకుండా పోయిందని బాధపడే వాళ్ళం.
ఈ లోపల మా ఇంటి పెత్తనం మా మూడో అన్నయ్య వెంకటేశ్వర రావు చేతికి వచ్చింది. ఆయన చేసిన మొదటి పనేమిటంటే విజయవాడ వెళ్లి నాలుగు బా౦డ్లో, అయిదు బా౦డ్లో తెలియదు, ఓ ట్రాన్సిస్టర్ రేడియో కొనుక్కొచ్చాడు. మా వూళ్ళో అడుగుపెట్టిన మొదటి ట్రాన్సిస్టర్ అదే. అంతకు ముందు బ్యాటరీతో పనిచేసే రేడియో మాత్రమే మేము చూశాము. ఎక్కడికిపడితే అక్కడికి తీసుకువెళ్ళే ఆ రేడియో ఆ రోజుల్లో వూళ్ళో వాళ్ళందరికీ చూడముచ్చటగానే కాకుండా విచిత్రంగా కూడా వుండేది. రేడియో సిలోన్ నుంచి మీనాక్షి పొన్ను దొరై సమర్పించే కార్యక్రమంలో వినిపించే తెలుగు పాటలు మొదటి సారి వినే భాగ్యం కలిగింది.
ఇక ఆ తర్వాత రేడియో యుగం. ప్రతి ఇంటా రేడియో. ప్రతి చేతిలో బుల్లి ట్రాన్సిస్టర్. క్రికెట్ కామెంటరీలు వింటుంటే అచ్చం క్రికెట్ గ్రౌండ్ లోనే వున్నామా అనే అనుభూతి కలిగేది. ఆ ఉత్సాహం రేడియో వినేవాళ్ళ మొహాల్లో చేతల్లో కేరింతల రూపంలో కనబడేది. రేడియో పుణ్యమా అని బుర్ర కధలు, హరి కధలు, పురాణ కాలక్షేపాలు, సంగీత కచ్చేరీలు అన్నీ ఇళ్ళ లోగిళ్ళలోకి తరలివచ్చాయి.
ఎప్పటికో అప్పటికి సొంతంగా రేడియో కొనుక్కోలేకపోతానా అనే కోరిక నాతోపాటే పెరిగి పెద్దయి రేడియో ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా తీరలేదు. ఎందుకంటే రేడియో వాళ్ళే మాకో రేడియో ఇచ్చారు. దాంతో కొనే అవసరం లేకుండా పోయింది. ఆ రేడియోకి కావాల్సిన బ్యాటరీ సెల్స్ కూడా నెలకోసారి ఆఫీసువాళ్ళే సప్లయి చేసేవాళ్ళు. బదిలీ అయినప్పుడో, రిటైర్ అయినప్పుడో ఆ రేడియో తిరిగిచ్చేయాలనేది కండిషన్. నా విషయంలో ఇది కూడా జరగలేదు. ఎందుకంటే ఏ బదిలీలు లేకుండా చేరిన చోటే, అంటే హైదరాబాదులోనే మూడు దశాబ్దాల తర్వాత పదవీవిరమణ చేశాను. ప్రభుత్వ సర్వీసులో ఇదొక రికార్డు అనేవాళ్ళు. మూడు దశాబ్దాల క్రితం ఇచ్చిన ఆ రేడియో ఏమైందో తెలియదు. మధ్యలో అయిదేళ్ళు దేశంలోనే లేను. రేడియో మాస్కోలో పనిచేయడానికి వెళ్లాను. తిరిగివచ్చిన తర్వాత కూడా ఆ రేడియో గురించి అడిగినవాళ్ళూ లేరు. ఆ రికార్డులు వున్నట్టూ లేదు.
ఉద్యోగం చేసిన రోజుల్లో పుట్టని యావ, అసలు రేడియో ఏమిటి, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి అనే మీమాంస రిటైరైన తర్వాత మొదలయింది. ఇటువంటి విషయాల్లో అవగాహన కలిగిన వాళ్ళు చాలామంది నాలాగే రిటైర్ అయ్యారు. చాలామంది జీవించి లేరు. ఉన్నవారిలో కూడా చాలామందికి కొన్ని కొన్ని జ్ఞాపకం. అక్కడక్కడా మతిమరపు. డాక్టర్ పద్మనాభ రావుగారి లాంటి వాళ్ళు విషయ సేకరణ చేసి రేడియోకి సంబంధించి కొన్ని పుస్తకాలు రాసారు. మరొక వ్యక్తి డాక్టర్ పి.ఎస్. గోపాల కృష్ణ. గతంలో ఆలిండియా రేడియో, హైదరాబాదు కేంద్రానికి డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన స్వయంగా రాసి అనేక సదస్సుల్లో సమర్పించిన పరిశోధనాపత్రాలు అనేకం వున్నాయి. ఆయన పనితీరు నాకు తెలుసు. పైగా ధారణ శక్తి అపారం. సాధికారత లేకుండా ఏదీ రాయరు. కాబట్టి ఆయన్నిఅడిగీ, ఫోనులో మాట్లాడి చాలా విలువైన సమాచారం సేకరించాను. ఆ ఆధారంగా మరికొన్ని రేడియో సంగతులు ఈ శీర్షిక ద్వారా తెలియచెప్పాలనేది సంకల్పం.
దానికి ప్రతి రూపమే ఈ రేడియో కబుర్లు.
(ఇంకా వుంది)






14, డిసెంబర్ 2019, శనివారం

రేడియో రోజులు - 42 - భండారు శ్రీనివాసరావు



జర్నలిస్టుల జీవితాల్లో పైకి కనిపించని ఓ  విషాద కోణం.
జర్నలిస్టు వృత్తి జీవితం తొలినాళ్ళలో నేను కలిసి తిరిగిన అనేకమంది మిత్రులు, తదనంతర కాలంలో స్వయంకృషితో ఎదిగి వాళ్ళు పనిచేస్తున్న పత్రికలకే ఎడిటర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉచ్చస్తితిలో వున్నప్పుడు వాళ్ళని కలుసుకోవాలంటే మహామహులకే దుర్లభంగా వుండేది. విజిటింగ్ కార్డు పంపి అనేకమంది బయట వెయిట్ చేస్తున్న సమయాల్లో కూడా వాళ్ళు,  నాతో గతకాలంలో గడిపిన రోజులు మరచిపోకుండా, నన్ను తమ సన్నిహిత వర్గంలోని వాడిగానే పరిగణించి ఆదరించేవారు. అది వారి గొప్పతనంగా నేను భావిస్తాను.
 విలేకరిగా వృత్తి జీవితం ప్రారంభించి విలేకరిగానే పదవీ విరమణ చేసినవాడిని నేను. నా బోటి వాళ్ళే  ఈ వృత్తిలో ఎక్కువగా వుంటారు. అతికొద్దిమంది మాత్రమే  తమ ప్రతిభతో పైమెట్లు  ఎక్కగలుగుతారు. నాది ఒక రకంగా సర్కారు ఉద్యోగం కనుక ఎక్కవలసిన మెట్లు తక్కువే. ఎక్కగలిగిందీ తక్కువే. గోదావరిలో ఎన్ని నీళ్ళున్నా, మనం బిందె తీసుకువెడితే బిందెడు నీళ్ళు, చెంబు తీసుకువెడితే చెంబెడు నీళ్ళు, మన ప్రాప్తాన్నిబట్టి తెచ్చుకోగలుగుతామని మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు చెప్పిన విషయం అహరహం గుర్తుండడం చేత ఈ మెట్లెక్కే గొడవ నా మనసుకు ఎక్కలేదు. అయినా ఈనాటి లోకంపోకడ ఇందుకు విరుద్దం. పొజిషన్ ను బట్టి పలకరింపులు, స్తాయిని బట్టి సాన్నిహిత్యాలు, హోదాని బట్టి ఆహాఓహోలు. కానీ నా అదృష్టం, నా మిత్రులెవ్వరు ఈ కోవలోకి రారు. అందుకే ఇన్నేళ్ళ తరవాత కూడా వారు నాతో  ప్రవర్తించే తీరులో ఇసుమంత తేడా లేదు.
కీర్తి శేషులు, శ్రీయుతులు జి కృష్ణ, నండూరి రామమోహన రావు, తుర్లపాటి కుటుంబరావు,  పీటీఐ కృష్ణ, శ్యాం రావు,  హిందూ రాజేంద్రప్రసాద్, లక్ష్మీపతి, ఆంధ్రపత్రిక ముక్కు శర్మ, పాపయ్య శాస్త్రి,  ఈనాడు శాస్త్రి, యుఎన్ఐ డి సీతారాం, పార్ధసారధి,  ఎక్స్ ప్రెస్ సుందరం, నీలంరాజు మురళీధర్, శ్రీకాంత్ విఠల్, ప్రభ దీక్షితులు, ఆంద్రజ్యోతి  ఆదిరాజు వెంకటేశ్వర రావు, కే. రామకృష్ణ, దామోదరస్వామి, సత్యారావు,  ప్రభ నంద్యాల గోపాల్, సలంద్ర,  పీటీఐ ఏ.హెచ్.వి. సుబ్బారావు, జమాల్ , ఉదయం అంజన్  కుమార్  వంటివారితో (వీరందరూ ఇప్పుడు లేరు) కలిసిమెలిసి తిరగగలిగే అదృష్టం నాకు దక్కింది. అలాగే, శ్రీయుతులు,  సుప్రసిద్ధ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఐ. వెంకట్రావు, కే. రామచంద్రమూర్తి, ఎంవీఆర్ శాస్త్రి, ఇండియా  టు డే అమరనాద్ మీనన్,  నరిశెట్టి ఇన్నయ్య, వేమూరి రాధాకృష్ణ, విశాలాంధ్ర శ్రీనివాసరెడ్డి, దేవులపల్లి అమర్, హిందూ కేశవరావు, ఎస్.నగేష్ కుమార్, కె. శ్రీనివాస రెడ్డి, సోమశేఖర్,  క్రానికల్ రబీంద్రనాధ్, పి.ఏ. రామారావు, సింహం అనే నరసింహారావు, పెద్ద బాబాయి సీహెచ్వీఎం కృష్ణారావు, కొమ్మినేని శ్రీనివాసరావు, కడెంపల్లి వేణుగోపాల్, పాశం యాదగిరి, ఎం. వేణుగోపాల్, ఔట్ లుక్  ఎం.ఎస్. శంకర్,  నందిరాజు రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసాద్, ఎక్స్ ప్రెస్ వాసు, ఆంధ్రపత్రిక శాస్త్రి, విద్యారణ్య, ప్రజాశక్తి వినయకుమార్, ఎన్.ఎస్.ఎస్. కొండా లక్ష్మారెడ్డి ఇలా ఒకరా ఇద్దరా జర్నలిజంలో కాకలు తీరిన అనేకమందితో చనువుగా మసలగలిగే అవకాశాన్ని నా రేడియో విలేకరిత్వం నాకు అందించింది. నిజానికి వీరిలో చాలామందితో నా సాన్నిహిత్యం, గారు వంటి గౌరవ పద ప్రయోగాలతో ముడిపడివుండలేదు. చాలా చనువుగా పలకరించుకోగల సంబంధబాంధవ్యాలు వుండేవి. దాదాపు ప్రతి రోజు సెక్రెటేరియేట్  లోని ప్రెస్ రూం లో కలుసుకునేవాళ్ళం. పత్రికా సమావేశాలు లేనప్పుడు కొన్ని గంటలపాటు మా నడుమ ముచ్చట్లు సాగేవి. పెద్దా చిన్నా తేడా లేకుండా ఒక కుటుంబంలోని సభ్యులమాదిరిగా గడిపేవాళ్ళం. ఇండియన్ ఎక్స్ ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్   సుందరం  కనపడగానే సుందరం మనమందరం అని ఏదో కవిత్వ ధోరణిలో పలకరించినా ఆయన  ఏమీ అనుకునేవాడుకాదు. పైగా నవ్వి వూరుకునేవాడు. మా ఇద్దరి నడుమా మరో బాదరాయణ సంబంధం వుండేది. గుజరాత్ గవర్నమెంటు వారి గిర్నార్ స్కూటర్ ను మేమిద్దరం ఒకే డీలర్ దగ్గర కొన్నాము.  హైదరాబాదులో అమ్ముడుపోయిన గిర్నార్ స్కూటర్లే బహు తక్కువ. వాటిల్లో రెండింటికి మేమిద్దరమే  ఓనర్లం. ఆ రోజుల్లో వెస్పా స్కూట ర్లకు పెద్ద గిరాకీ వుండేది. కొనుక్కోవాలంటే ఎన్నో సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వుండేవి. వాటిని ప్రభుత్వ సిఫారసుతో వెనువెంటనే పొందగల అవకాశం జర్నలిస్టులుగా మాకున్నప్పటికీ, వాటి ఖరీదులో కొంతమేరకు మేరకు  మాత్రమే బ్యాంకు రుణాలు పుట్టేవి. మిగిలిన మొత్తం చేతి నుంచి పెట్టుకునే ఆర్ధిక వెసులుబాటు లేకపోయేది.   అందుకే మరో మాట లేకుండా మేమిద్దరం గిర్నార్ స్కూటర్లు కొనుక్కున్నాము. అదీ ఏదో బ్యాంకు అధికారి జర్నలిష్టులమని అప్పివ్వబట్టి. ఆ అప్పు పుట్టడం కూడా విచిత్రంగా జరిగింది.


(గిర్నార్ స్కూటర్ పై  రచయిత)

కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను, హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని పత్రికా రచయితలు ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవధానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన  ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు.  ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావుగారు  జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఓ పది వేలు రుణం ఇవ్వడం అనేది ఆయనకు ఒక లెక్కలోనిది కాదు. ఆయన వెంటనే స్పందించి  అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి  లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం  తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం. రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను.  బాంకు అధికారి స్కూటరు  లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ  మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే,  గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. ఆ విధంగా నా జీవితంలో మొట్టమొదటి స్కూటరు మా ఇంట కాలు పెట్టింది. మా వైభోగం  ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు. కాకపొతే, చివరికి ఆ స్కూటరే నన్ను వార్తల్లోకి ఎక్కించింది.  హెల్మెట్ లేకుండా ఆ స్కూటర్ పై వెడుతుంటే పోలీసులు పట్టుకోవడం, స్టేషన్ కు తీసుకువెళ్ళడం, జర్నలిస్టుల ధర్నాతో ప్రభుత్వం దిగిరావడం మొదలైన అవాంఛిత సంఘటనలకు ఆ గిర్నార్ స్కూటరే నిర్జీవసాక్ష్యం.
ఇదలా ఉంచి అసలు విషయానికి వస్తే, 
 ‘ఐ నో సీఎం. ఐ నో పీఎం’ అనుకునే  జర్నలిస్టుల జీవితాలు పైకి కనిపించినంత గొప్ప కరెన్సీ కాగితాలేమీ కావు.  వారికి వృత్తి రీత్యా  సమాజంలో ఎంతోమంది తెలుస్తుంటారు. కానీ తోటి జర్నలిస్టుల కుటుంబ సభ్యులతో  పరిచయాలకు ఆస్కారం చాలా తక్కువ. అందుకే, కొందరు సాటి జర్నలిస్టులు  చనిపోయినప్పుడు  విషయం  తెలిసికూడా వాళ్ళ ఇళ్ళకు వెళ్లి పరామర్శించలేకపోవడానికి ఇదే కారణం. చనిపోయిన వ్యక్తి తప్ప ఇతర కుటుంబ సభ్యులు   వేరే ఎవ్వరు తెలవదు. తెలిసిన ఒక్కరికి మనం  వచ్చిన విషయం తెలియదు.
ఇది పైకి చెప్పుకోలేని ఓ  పెనువిషాదం.                               
(ఇంకా వుంది)