17, మే 2024, శుక్రవారం
గతం గుర్తులు
16, మే 2024, గురువారం
ఏకాక్షర పద్యం
విలేకరిగా జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు
13, మే 2024, సోమవారం
నిమేషకాలంలో పూర్తయిన పౌరధర్మం పాటింపు - భండారు శ్రీనివాసరావు
ఈరోజు ఉదయం పోలింగు ప్రక్రియ ప్రారంభం అయినప్పటి
నుంచి టీవీలు ఓటర్ల ఉత్సాహం గురించి కధనాలు ప్రారంభించాయి. పోలింగు కేంద్రాల
ముందు బారులు తీరిన ఓటర్లు,
కిలోమీటర్ల మేర క్యూలు అంటూ బుల్లి తెరలపై
స్క్రోలింగులు బారులు తీరడం మొదలెట్టాయి. తయారై వెళ్ళబోయేవాడిని కాస్తా వాటిని
చూసి ఆగిపోయాను. మధ్యాన్నం వరకు సేం టు
సేం స్క్రోలింగులు. మార్పు లేకుండా, అక్షరం పొల్లుపోకుండా. బయలుదేరడం, మళ్ళీ
ఆగిపోవడం. ఇలా చాలా సార్లు జరిగిన తర్వాత, ఓ వాటర్ బాటిల్ చేత పట్టుకుని నడకకు ఎక్కువా, ఆటోకి
తక్కువా అయిన పోలింగు కేంద్రానికి మధ్యాన్నం మూడు గంటలకి మా కోడలు, నేనూ వెళ్ళాము. దారిలో ఇరుపక్కల దుకాణాలు అన్నీ మూసి వున్నాయి. పెద్ద క్యూలు ఉంటాయని అనుకుని పొతే, పోలింగు
కేంద్రం ఉన్న ప్రాంతం అంతా నిర్మానుష్యంగా వుంది. ఒక పోలీసు,
ఇద్దరు మహిళా సిబ్బంది కనబడ్డారు. మొబైల్ ఉందా అని అడిగి నా జవాబు కోసం ఎదురు చూడకుండా
ఆ బాటిల్ అక్కడ పెట్టి అల్లా వెళ్ళండి, అన్నారు. నన్ను చూసిన పోలింగు సిబ్బంది అమ్మయ్య ఎట్టకేలకు
ఒకడు వచ్చాడు అని గుసగుసలాడుకున్నట్టు అనిపించింది. తలకిందుల సంతకం ఒకటి
చేయించుకుని, ఎడమ చేతి చూపుడు వేలు మీద సిరా మరక అంటించి, పోయి ఓటు వేయండి
అన్నారు. పోలింగు ఛాంబరులో పొడవాటి ఈవీఎం లు రెండు కనిపించాయి. ఇంతమంది పోటీలో
వుంటే, ఇదేమిటి ఇక్కడ పరిస్థితి ఇలా వుంది అనుకున్నా. భారత పౌరుడిగా
నా ప్రధమ కర్తవ్యాన్ని పూర్తిచేసుకుని బయట పడ్డాను. మొత్తం ప్రక్రియ అంతా నిమిషం
కంటే తక్కువ వ్యవధిలో పూర్తయింది. ప్రత్యేక విమానంలో ప్రయాణించినట్టు, నా ఒక్కడి కోసమే ఈ కేంద్రం ఏర్పాటు చేశారేమో అనే
భావన కలిగింది. పక్కనే కొంచెం దూరంలో ఉన్న మరో కేంద్రంలో ఓటువేసి వచ్చిన మా కోడలు
అప్పటికే కారు దగ్గర నాకోసం ఎదురు
చూస్తోంది. అంటే అక్కడ పరిస్థితి కూడా డిటో అన్నమాట. ఇంటికి
వచ్చి టీవీ పెడితే మళ్ళీ ఉదయం ఎనిమిది గంటల సమయంలో వేసిన అవే స్క్రోలింగులు, అక్షరం పొల్లుపోకుండా, బారులు తీరిన ఓటర్లు. మండుటెండను కూడా
లెక్కచేయకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని తాపత్రయపడుతున్న ఓటర్లు అంటూ టీవీలు
ఊదరకొడుతున్నాయి. ఎందుకిలా ఓటర్లని నిరుత్సాహపరుస్తున్నారో తెలియదు.
తర్వాత గుర్తుకు వచ్చిన విషయం ఏమిటంటే, మన ఓటువున్నది
సికిందరాబాదు. హైదరాబాదు నగరంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ. ఓటు హక్కు గురించి
ఇతరులకి చెప్పేవాళ్ళ శాతం మరీ ఎక్కువ. కానీ, ఓటు వేసే వాళ్ళ శాతం మాత్రం అతి తక్కువ. ఇంకా నయం. ఈరోజు పగటిపూట ఐ పి ఎల్ మ్యాచ్ లేదు.
అందుకే ఈ మాత్రం అయినా.
ఇంకో విషయం ఏమిటంటే హైదరాబాదులో ప్రధాన కార్యాలయాలు వుండే ప్రధాన టీవీ చానళ్ళ
లోనే ఈ హడావిడి అంతా. ఇదంతా ఏపీ ఎన్నికలు గురించి అనుకోవాలేమో!
ఇతి వార్తాః !
(13-05-2024)
11, మే 2024, శనివారం
విద్య వైద్యం ఉచితంగా ఇవ్వండి
8, మే 2024, బుధవారం
అర్ధరాత్రి జ్ఞానోదయం - భండారు శ్రీనివాసరావు
ఏదైనా సాపేక్షమే, కష్టమైనా, సుఖమైనా!
1971 ఇండో
పాక్ యుద్ధ సమయంలో బ్లాకౌట్ అనే మాట వినపడేది. శత్రుదేశపు యుద్ధవిమానాలు ఆకాశవీధి
నుంచి, కింద భూతలంపై తమ లక్ష్యాలను
గుర్తించకుండా ఆ రోజుల్లో అధికారులు, రాత్రివేళల్లో అనేక నగరాల్లో బ్లాకౌట్ ప్రకటించి ప్రజలచేత స్వచ్చందంగా కరెంటు
దీపాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. వీధి దీపాలు వెలగకుండా చూసేవారు. ఆ యుద్ధసమయంలో
ప్రజలనుంచి కూడా స్వచ్చంద సహకారం లభించేది. అత్యవసరంగా దీపాలు వాడాల్సిన పరిస్థితి
వస్తే, ఆ
వెలుగు బయటకి ప్రసరించకుండా ఇంటి తలుపులు, కిటికీలు మూసివేసేవారు. అప్పుడు నేను
బెజవాడ ఆంధ్రజ్యోతిలో పని చేస్తుండేవాడిని. దేశం కోసం కాబట్టి ప్రజలు ఆ ఇబ్బందులని
కష్టంగా భావించేవారు. సర్దుకుపోయేవారు.
అందరికీ
సుపరిచితం అయిన దివి సీమ తుపానుకు ముందు, నేను స్కూల్లో చదువుకునే రోజుల్లో ఒక తుపాను వచ్చింది. దానికి నేను ప్రత్యక్ష
సాక్షిని. ఆ తుపాను సృష్టించిన భీభత్సం కారణంగా వందలాది గ్రామాల్లో రోజుల తరబడి
కరెంటు సరఫరా నిలిచిపోయింది. అప్పటికి వార్తా ప్రచార సాధన సంపత్తి ఇంతగా లేకపోవడం వల్ల ఆ తుపాను సంగతి చాలామందికి తెలియలేదు.
అప్పుడు
వేసవి సెలవులకు మా వూరు వెళ్ళాము. మామూలుగా సెలవులు ఇవ్వగానే ఖమ్మం నుంచి, రెబ్బారం నుంచి పక్కనే ఉన్న
పెనుగంచిపోలు నుంచి మా అక్కయ్యల పిల్లలు అందరూ కంభంపాడు చేరడం ఆనవాయితీ. ఆసారి మరో
ప్రత్యేకత ఏమిటంటే మా ఇంటి చిన్న అల్లుళ్ళు ఇద్దరూ కుటుంబాలతో వచ్చారు. ఇల్లంతా
పిల్లల ఆటపాటలతో, పెద్దవాళ్ళ చతుర్ముఖ పారాయణాలతో, అమ్మలక్కల పచ్చీసు ఆటలతో హడావిడిగా వుంటే, వంటింట్లో మా అమ్మ కట్టెల
పొయ్యి ముందు కూర్చుని ఇంతమందికీ వండి వారుస్తుండేది.
ఒకరోజు
ఉన్నట్టుండి మబ్బులు కమ్మి వర్షం మొదలైంది. వేసవి వాన కావడం కారణంగా అందరం
సంతోషపడ్డాము. సాయంత్రం అయినా తగ్గలేదు. కరెంటు పోయింది. ఎప్పుడు వస్తుందో తెలవదు.
మా అక్కయ్యలు ఇంట్లో ఓ మూలన పడేసిన
లాంతర్లు, బుడ్లు బయటకు తీసి శుభ్రం చేసి దీపాలు
వెలిగించారు. ఆ వెలుగులోనే అన్నాలు. ఆ రాత్రి గడిచింది. కానీ వాన తెరిపివ్వలేదు.
వంటింట్లో నుంచి యధాప్రకారం కాఫీలు, టిఫిన్లు.
సాయంత్రమయింది. పొద్దుగూకింది. అయినా వర్షం ఆగలేదు. ఆడవాళ్ళు
గుసగుసలాడుకుంటున్నారు. విచారిస్తే తెలిసింది ఏమిటంటే వంటింట్లో పొయ్యి పైకి
వున్నాయి. పొయ్యిలో పెట్టడానికే కట్టెలు తడిసిపోయాయి. ఎల్లా! కొంత కిరసనాయిలు వాడి
పొయ్యి వెలిగించారు. ఆ పూట ఎలాగో గడిచింది. మర్నాడు కూడా ముసురు తగ్గలేదు. పెరట్లో
కూరగాయలు అయిపోయాయి. మూడు పాడి బర్రెల్లో ఒకటి ఇవ్వలేదు, మేత సరిగాలేక కావచ్చు.
తుపాను
కష్టాలు మెల్లిమెల్లిగా అర్ధం అవుతున్నాయి. ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి.
పంచదార పరవాలేదు కానీ, కాఫీ పొడుముకు కటకట. అల్లుళ్ళు ఇద్దరికీ సరిపోతే చాలు
మిగిలినవాళ్ళు, వాళ్ళే సర్దుకుంటారు అని తీర్మానించారు.
అలా
పగలూ రాత్రీ తెలవకుండా వర్షం ధారాపాతంగా కురుస్తూనే వుంది. ఐదో రోజున కాస్త తెరిపి
ఇచ్చింది.
వాన
వెలిసిన తర్వాత దాని బీభత్సం కొద్దికొద్దిగా తెలుస్తూ వచ్చింది. మధిర రైల్వే వంతెన
వరదల్లో కొట్టుకు పోయింది. హైదరాబాదు బెజవాడ మధ్య రైళ్ళ రాకపోకలు నిలిచి పోయాయి.
బెజవాడ దగ్గరలో ఒక పాసింజరు రైలు పట్టాలమీద నిలిచిపోయింది. అప్పటికి ఇప్పటిలా జంట
రైలు మార్గాలు లేవు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడానికి.
రైలు ప్రయాణీకులకు ఆహార పానీయాలు లేవు. రైలు ఎప్పుడు కదులుతుందో తెలవదు.
వాళ్ళంతా బిక్కచచ్చి రైల్లోనే వుండిపోయారు. పక్క వూరి గ్రామస్తులు ఆ కష్టకాలంలో
వాళ్ళని ఆదుకున్నారు. తుపాను హడావిడి తగ్గిన
తర్వాత కేంద్ర రైల్వే శాఖవారు ఒక స్టేషనుకు ఆ ఊరి పేరు పెట్టారు.
మా
ఒక్క కుటుంబమే కాదు, మా ఒక్క ఊరే కాదు, అనేక గ్రామాల వాళ్ళు మేము పడ్డ కష్టాలే
పడ్డారు. ఏం చేస్తాం మన ఖర్మ అనుకున్నారు.
తిట్టడానికి
గవర్నమెంటు ఒకటుందని అప్పుడు తెలవదు.
నిన్న
మళ్ళీ హైదరాబాదులో మేము ఉంటున్న ఎల్లారెడ్డిగూడా ప్రాంతంలో రాత్రి ఏడుగంటల సమయంలో
కరెంటు పోయింది,
భీకరంగా కురిసిన వర్షం కారణంగా. కరెంటు పోయినా ఊరు చల్లపడింది అదే పది వేలు
అనుకున్నాం. ఇంట్లో ఇన్వర్టర్ కారణంగా చాలాసేపటి వరకు కరెంటు లేదన్న సంగతి
తెలియలేదు. పుష్కర కాలంగా దాన్ని పట్టించుకోకుండా ఉన్నామన్న కసితో అది పగ
తీర్చుకుని ఉండేదే. ఎందుకో ఏమో తెలియదు, రెండు రోజుల కిందటే మా కోడలు నిషా,
ఎర్రటి ఎండలో బయట బాల్కనీలో వున్న ఇన్వర్టర్ లో
కొని తెచ్చిన డిస్టిల్ద్ వాటర్ నింపిన కారణంగా కలిగిన అల్ప సంతోషంతో అది
పనిచేసిన ఫలితంగా మేము కొన్ని గంటలు సుఖపడిన మాట వాస్తవం. ఈ లోపున తెలివి తెరిపిన
పడి, ఇన్వర్టర్ స్థాయి, స్థోమత గుర్తుకు వచ్చి, ఉన్న మూడు గదుల్లో ఫ్యాన్లు, లైట్లు ఆపేసి అందరం ముందు హాల్లో చేరి
ఒక లైటు, ఒక
ఫ్యానుతో కాలక్షేపం చేయడం మొదలు పెట్టాము. ముందు వాకిలి తెరిస్తే చల్లటి గాలి
వచ్చింది. దాంతో చంటి పిల్ల మా మనుమరాలు జీవిక భయపడకుండా లైటు ఒక్కటి వుంచి ఫ్యాను
ఆపేసాము. రైస్ కుక్కర్ కరెంటుది కావడంతో
అటక ఎక్కించిన ప్రేస్తీజ్ కుక్కరే దిక్కయింది. సరే ఏదో విధంగా భోజనాలు అయ్యాయి అనిపించాము.
రాత్రి పది గంటల ప్రాంతంలో ఒక్కసారి వరండాలో లైట్లు వెలిగి ఆరిపోయాయి. ఇలా జరిగితే
కరెంటు త్వరగా వస్తుందని సూతుడు శౌనకాది మునులతో చెప్పినట్టు చిన్నప్పుడు మా
వూళ్ళో కరెంటు డిపార్ట్ మెంట్ హెల్పర్ చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చి, ఎవరి గదుల్లో
వాళ్ళం ఇన్వర్టర్ తో నడిచే ఫ్యాన్లు వేసుకుని ధీమాగా పడుకున్నాము. ఓ రెండు గంటలు
ఇన్వర్టర్ ముక్కుతూ మూలుగుతూ పనిచేసి సెలవు తీసుకుంది. అప్పటికి కరెంటు లేని
జీవితం కొంత అలవాటయి అలాగే పడుకున్నాము. తెల్లవారుఝామున మూడుగంటల సమయంలో హఠాత్తుగా
కరెంటోదయం అయింది. అదే సమయంలో జ్ఞానోదయం
కూడా అయింది.
ఇంట్లో
కరెంటు పోయినా మనం మన ఇంట్లోనే ఉన్నాము. కానీ ఆ కరెంటు వాళ్ళు ఇల్లు, సంసారాన్ని వదిలి, ఆ నిశీధిలో, వర్షంలో బద్దకించకుండా పనిచేయబట్టే
కదా మనకు మూడు గంటలకో , నాలుగు గంటలకో కరెంటు వచ్చింది. ఈ స్పృహ కలగగానే అంతవరకూ వాళ్ళమీద
పెంచుకున్న అసహనంతో పాటు, పడ్డ ఇబ్బందులు కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి.
ముందే
చెప్పినట్టు సుఖదుఖాలు సాపేక్షాలు.
(08- 05-2024)