27, మార్చి 2022, ఆదివారం

ప్రజల మనిషి బండారు దత్తాత్రేయ – భండారు శ్రీనివాసరావు

 “మనిద్దరం చుట్టాలం అనుకుంటున్నారు చాలామంది” అన్నారు హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ.

“కాకపోతే ఏమైంది, మీరు నాకు అంతకంటే ఎక్కువే” అన్నాను నేను.

పదేళ్లు అయిందో, పదిహేను ఏళ్ళు అయిందో  గుర్తు లేదు, దత్తాత్రేయ గారిని నేను కలిసి.

ఈరోజు ఆదివారం సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో జరిగిన  ఒక కార్యక్రమం అనంతరం వేదిక దిగివస్తున్నప్పుడు మా నడుమ నడిచిన ముచ్చట ఇది.

నలభయ్ ఏళ్ళ పై చిలుకు సాగిన పాత్రికేయ జీవితంలో ప్రజల మనిషి అనదగ్గ రాజకీయ నాయకులు ఇద్దరు కనబడ్డారు. ఒకరు మాజీ  ముఖ్యమంత్రి శ్రీ. టి. అంజయ్య, రెండోవారు శ్రీ దత్తాత్రేయ. ప్రజల నడుమ ఉంటేనే ఆక్సిజన్ అందుతుంది అనేట్టు జనంతో మమేకమైన రాజకీయ జీవితాలు వీరిద్దరివి. మనుషులను మనుషులుగా గుర్తిస్తారు కనుకనే సామాన్య జనంలో వీరిరువురికీ అమితమైన ఆదరణ. ఈ కారణం చేతనే ఇన్నేళ్ళు గడిచిన తర్వాత కూడా నన్ను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించారు. వయసులో నాకంటే ఆయన ఏడాది చిన్న. ‘గట్టిగానే వున్నావు సుమా ‘ అన్నారు నా చేయి తన చేతిలోకి తీసుకుని చిన్నగా నొక్కుతూ.

ఆరోగ్యంగా వున్నాను అని దత్తాత్రేయ గారెకి అనిపించింది అంటే అది మాత్రం దేవుడి దయే అనుకున్నాను మనసులో.

నాదేముంది, దత్తాత్రేయ గారి లాంటి ప్రజాసేవకులు నాలుగు కాలాల పాటు చల్లగా వుంటే సమాజానికి  మంచి జరుగుతుందని కూడా అనుకున్నాను.



27-03-2022

కామెంట్‌లు లేవు: