27, మార్చి 2022, ఆదివారం

ఆదివారం ఆంధ్రప్రభ – భండారు శ్రీనివాసరావు

 

గత నాలుగయిదు వారాలుగా ఆదివారం ఆంధ్రప్రభ దినపత్రికలో గతకాలపు అసెంబ్లీ ముచ్చట్లు రాస్తూ వుండడంతో ఉదయం పూట అందుకునే ఫోన్ కాల్స్ తో ఓ కొత్త కాలక్షేపం అవుతోంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ శ్రీ మండలి బుద్ధప్రసాద్ ఫోన్ చేసి అభినందించారు. దానితో పాటు ఆయన కూడా కొన్ని సంగతులు పంచుకున్నారు.
ప్రసిద్ధ సినీ కవి శ్రీ వేటూరి సుందర రామ మూర్తి తన పూర్వాశ్రమంలో ఆంధ్రప్రభ విలేకరిగా పనిచేసే రోజుల్లో రాసిన ఓ వార్త అసెంబ్లీలో సంచలనం కలిగించింది. ఆ విలేకరిపై వెంటనే చర్య తీసుకోవాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. ఈ వార్తకు నేపధ్యం ఏమిటంటే:
హైదరాబాదు లక్డి కా పూల్ లోని ద్వారక హోటల్ అసెంబ్లీకి దగ్గరలో వుండడం వల్ల, సమావేశాలు జరిగే రోజుల్లో జిల్లాల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు, వారి అనుయాయులు అందులో బస చేసేవారు. అప్పుడు కాంగ్రెస్ ఏకపక్ష పాలన. హోటల్లో దిగిన కాంగ్రెస్ సభ్యులు, వారి అనుయాయులు తెల్లటి ఉడుపుల్లో బయలుదేరి వెళ్ళడం వేటూరిగారికి వార్తకు ముడి సరుకుగా అనిపించింది. అనిపించి వార్తకు ఇలా మకుటం పెట్టారు. “అదిగో ద్వారక! ఆలమందలవిగో!” (ద్వారక హోటల్, తెల్లటి దుస్తుల్లో ఎమ్మెల్యేలు)
“మమ్మల్ని ఆలమందలు అంటూ గొడ్డూ గోదాతో పోలుస్తారా! ఎంత ధైర్యం ఠాట్!” అని హడావిడి చేశారు. అయితే అది తాటాకు మంటలా వెంటనే చల్లారి పోయింది, సభలో పెద్దలు కలగచేసుకుని నచ్చచెప్పడంతో.
ఈ వృత్తాంతం చెప్పి అన్నారు బుద్ధప్రసాద్ నిర్వేదంగా.
“అప్పుడు ఆలమందలు అంటేనే సభాగౌరవానికి భంగం కలిగిందని బాధ పడ్డారు. ఇప్పుడు ఓ పార్టీ నాయకుడు అసెంబ్లీని రెడ్ లైట్ ఏరియాతో పోల్చి హేళన చేసినా కిమ్మిన్నాస్తి”
(27-03-2022)

కామెంట్‌లు లేవు: