20, జులై 2026, సోమవారం

అనగనగా ఒక ఇరాన్ – భండారు శ్రీనివాసరావు

 


ఇలాంటి వాళ్ళు ఉంటారా? 

 

ఇది నా రచనా కాదు, ఈ కాలం నాటిదీ కాదు. ఎప్పుడో ఓ పదమూడేళ్ల నాడు, ఈనాడు పత్రికలో  ఇది నా కంట పడింది. చదివిన తర్వాత నా మనసులో మెదిలిన ప్రశ్న ‘ఇలాంటి వాళ్ళు ఉంటారా?’ 


“ఆ దేశానికా? అక్కడేముందిరా!” అన్నాను ఠక్కున.

“ప్రపంచంలోకెల్లా చెప్పుకోదగ్గ  మంచి మనుషుల్ని, మంచి మనసుల్ని చూపిస్తాను రండి నాన్నా!” అన్నాడు మా అబ్బాయి శ్రీహర్ష.”


సురేంద్రనాథ్ మాజేటి, అనే పెద్ద మనిషి  తన  విదేశీ  పర్యటన అనుభవాలను, ఇలాటి చదివించే ఎత్తుగడతో  ప్రారంభించి  నాలుగే నాలుగు  పేజీల్లో వాళ్ల అబ్బాయి చెప్పిన మంచి మనుషుల దేశాన్నీ, మంచి మనసుల దేశాన్నీ మనకు ఎంచక్కా పరిచయం చేశారు.


మరో విషయం. వాళ్ల అబ్బాయి ఆదేశంలో  ఏదో ఉద్యోగమో, వ్యాపారమో చేస్తూ తల్లిదండ్రులను అక్కడికి ఆహ్వానించలేదు. అతగాడికో చక్కటి కోరిక వుంది. దేశాలు చుట్టిరావడం. ఉద్యోగరీత్యా కొన్నాళ్ళు లండన్ లో వున్నాడు. ఏడాది తరువాత దానికి రాజీనామా చేసాడు. సామాన్లు ఇండియా పంపేసాడు. 


ఒక సైకిల్ కొనుక్కున్నాడు. తోడుకోసం చూసుకోకుండా, తోడెవరూ లేకుండా సైకిల్ మీద వొంటరిగా బయలుదేరి వరసగా దేశాలు చుట్ట బెట్టాడు. పోర్చుగల్, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, గ్రీసు, టర్కీ, జార్జియా, ఆర్మీనియా, అల్లా తిరుగుతూ తిరుగుతూ ఇదిగో ఈ ‘మంచి మనుషుల దేశం – ఇరాన్’  చేరుకున్నాడు.

ఇండియా తిరిగివచ్చేముందు వెళ్ళాల్సిన దేశాల జాబితా కూడా తక్కువేమీ  కాదు.

తుర్కుమేనియా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ ఇందులో వున్నాయి.  ఈ పర్యటనలో శ్రీహర్ష  ఎక్కడా యే దేశంలో కూడా  హోటల్లో బస చేయలేదు. అంతర్జాలంలో పరిచయం అయి, స్నేహితులుగా మారినవారి  ఆతిధ్యం స్వీకరిస్తూ ఆయా దేశాలు చుట్టబెడుతూ, స్తానిక ఆచారవ్యవహారాలు అధ్యయనం చేస్తూ, అక్కడివారితో మమేకం అయిపోతూ మధ్యలో తనకు  ఎదురయిన అద్భుత అనుభవాలను, వ్యక్తులను  తలిదండ్రులకు కూడా పరిచయం చేయాలని  ఫోను చేసి వారిని కూడా రమ్మన్నాడు.

    

తమ పిల్లవాడు దేశం కాని దేశంలో ఇల్లు కొనుక్కునో, కట్టుకునో గృహప్రవేశానికి రమ్మనలేదు. అతడే ఒక అంతర్జాల మిత్రుడి ఇంట్లో మకాం పెట్టి వారితో కలిసి వుంటున్నాడు. అలాటి పరిస్తితిలో ఏ తలిదండ్రులు కూడా అలాటి ప్రయాణం పెట్టుకోవడానికి అంత సుముఖంగా వుండరు.

కానీ సురేంద్రనాథ్ దంపతుల తీరే వేరు. తండ్రి సురేంద్రనాథ్ ది కూడా విభిన్నమైన వ్యక్తిత్వం.   అందుకే ఠక్కున ఒప్పేసుకున్నారు.


అందుకే పెద్ద మనసుతో  వారి అబ్బాయి ఆహ్వానాన్ని మన్నించి భార్యాబిడ్డల్ని తీసుకుని ప్రయాణమై ఆ దేశానికి వెళ్ళి వచ్చారు. వెళ్ళి రావడంతో సరిపెట్టుకోకుండా నాలుగంటే నాలుగు పేజీల్లో తమ అనుభవాలను రంగరించి తమ సన్నిహితులతో పంచుకున్నారు.


ఈ రచన పీడీఎఫ్ లో వుండడం వల్ల ఇలా క్లుప్తంగా పరిచయం చేసి చేతులు దులుపుకోవాల్సి వస్తోంది. పూర్తి పాఠం కావాల్సిన వారు సురేంద్రనాథ్ గారి మిత్రుడు దేవినేని మధుసూదనరావు గారిని సంప్రదిస్తే బాగుంటుంది. వారి చిరునామా -<mdevineni@gmail.com>


గమనిక: ఇది దశాబ్దానికి పూర్వం సమాచారం  

(కింది ఫోటో ఈనాడు సౌజన్యంతో )




కామెంట్‌లు లేవు: