104 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
104 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, మే 2018, బుధవారం

ఇలా గుర్తుకు వస్తుంటాయి – భండారు శ్రీనివాసరావు


దాదాపు పుష్కరం దాటింది అనుకుంటా డాక్టర్ రంగారావు గారికి ఈ ఆలోచన వచ్చి. అప్పటికే ఆయన రూపకల్పన చేసిన 108, 104 సర్వీసులు ఉమ్మడి రాష్ట్రంలో కుదురుకుంటున్నాయి. గత నెలలోనే ఆయన మరణించారు. కనుక  ఆయన మదిలో కదిలిన ఆ కొత్త ఆలోచనను ఎవరు ముందుకు తీసుకు పోతారో తెలియదు. ఈ గతం గుర్తుకు రావడానికికల  వర్తమానం గురించి చెప్పాలి.
నిన్న మమ్మల్ని ఒక సమస్య ఎదుర్కుంది. నిజానికి చాలా చిన్న సమస్య. కానీ పరిష్కారం వెనువెంటనే కనబడక పోవడంతో అది క్షణక్షణానికి పెరిగి పెద్దదయింది.
ముందే చెప్పినట్టు పెద్ద సమస్యేమీ కాదు. ఇంట్లో కరెంటు పోయింది. ‘ఇంట్లో’ అని ఎందుకు అంటున్నాను అంటే అపార్ట్ మెంట్లో వుంది. మా ఫ్లాట్ లోనే పోయింది. పోయిందా అంటే పూర్తిగా పోలేదు. ‘వస్తావు పోతావు నాకోసం’ అన్నట్టు ఒక క్షణం పోతుంది. మరు నిమిషం వస్తుంది. ఇలా దాగుడుమూతలు ఆడే కరెంటుతో, ఆ కరెంటుతో నడిచే ఉపకరణాలకు నష్టమని పూర్తిగా మెయిన్ ఆఫ్ చేసి చెమటలు కక్కుతూ నేనూ మా ఆవిడా అవస్థ పడుతూ పరిష్కారం ఎలా అని ఆలోచించాము. ఈ మధ్య కరెంటు అవస్థలు లేకపోవడంతో ఆపద్ధర్మ లైట్లు, కొవ్వొత్తులు ఇంట్లో కనబడకుండా పోయాయి. ఏ ఎలక్ట్రీషియన్ కు ఫోను చేసినా బిజీ బిజీ. ఎవ్వరూ దొరకలేదు. ఈ వచ్చీ రాని కరెంటుతో రాత్రి గడపడం యెట్లా అనుకుంటూ వుంటే మా వాచ్ మన్ ఎవరో ఇద్దర్ని వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్ళు మా పక్క అపార్ట్ మెంట్లో మొన్నీ మధ్యనే దిగారట. ఏదో కంపెనీలో పనిచేస్తున్నారు. వాళ్లకి ఆ ఇల్లు మా వాచ్ మనే కుదిర్చిపెట్టాడుట. ఆ పరిచయంతో వాళ్ళని రాత్రి పదిగంటలకు వెంట బెట్టుకు వచ్చాడు. ఆ ఇద్దరు కాసేపు చూసి ఏం మాయ చేసారో కాని, మా ఇన్వర్టర్ లో ఒక లోపాన్ని పసికట్టారు. దాన్ని సరిచేసి ఇంట్లో వెలుగు నింపారు.
మా సమస్య తీరింది కానీ మరో సమస్య. చూడబోతే వాళ్ళు మంచి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళలా వున్నారు. చేసిన పనికి డబ్బులు ఇవ్వడం అంటే చిన్నబుచ్చినట్టు అవుతుందేమో. ఇవ్వకుండా ఉత్త చేతులతో పంపడం ఎలా!
చివరికి మా ఆవిడే కల్పించుకుని మాకు నిన్ననే ఎవరో ఇచ్చిన ఖరీదైన పళ్ళ బుట్టను వాళ్ళ చేతుల్లో పెట్టి సాగనంపింది.
మరి దీనికీ, రంగారావు గారి ఆలోచనకూ లంకేమిటంటారా!
ఆయన సరిగ్గా ఇదే ఆలోచించారు. మనుషులను ఎదురయ్యే పెద్ద సమస్యల్లో ఒకటి టెన్షన్. దానివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. చిన్న సమస్య పెద్దదిగా కనబడి మరింత పెద్దది అవుతుంది.
ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న చిన్న సంసారాలు ఏర్పడుతున్న తరుణంలో ఎదురయిన సమస్యలని ఎవరికి వారే పరిష్కరించుకోవాల్సి వుంది. మునుపటి రోజుల్లో ఇంట్లోనే ఎవరో ఒకరు చేయి వేసేవాళ్ళు. ఫోను చేస్తే 108 అంబులెన్స్  వచ్చినట్టు, ఒక ఏకీకృత వ్యవస్థ ద్వారా మనకు కావాల్సిన ప్లంబర్లను, ఎలక్ట్రీషియన్లను మొదలయిన పనివాళ్ళని ఫోను చేసి ఇంటికి పిలిపించుకునే సౌకర్యం అన్నమాట. ఇలాటి వాళ్ళ వివరాలను ఆ రోజుల్లోనే ఏరియా వారిగా వారి టెలిఫోన్ నెంబర్లతో సహా సేకరించడం జరిగింది. 108, 104 లాగానే ఈ సర్వీసులకు కూడా ఒకే  టోల్ ఫ్రీ నెంబరు వుంటుంది. ప్రభుత్వం లేదా ఒక గుర్తింపు పొందిన వ్యవస్థ ఆధ్వర్యంలో కాబట్టి వచ్చిన వాళ్ళు వచ్చిన పని కాకుండా ఇంట్లో ఉన్న ముసలీ ముతక మీద అఘాయిత్యానికి పూనుకునే అవకాశం వుండదు. చిన్నా చితకా పనులు పెద్ద అవస్థలు పడకుండా జరిగిపోతూ ఉండడంలో జనంపై మానసిక ఒత్తిళ్ళు తగ్గుతాయి.
అయితే అనేక మంచి పధకాల మాదిరిగానే ఇది కూడా అటకెక్కింది.
ఇతి వార్తాః              

7, నవంబర్ 2017, మంగళవారం

మరో మంచి లక్ష్యం దిశగా తెలంగాణా ప్రభుత్వం

నేను రేడియోలో పనిచేసే రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తుమ్మల నాగేశ్వర రావు గారు రోడ్లు, భవనాల శాఖ మంత్రి. అయితే అందరికీ తెలియని విషయం ఏమిటంటే ఆయన మా రేడియోకు ప్రధాన శ్రోత. రోడ్డుమార్గాన  ఖమ్మం జిల్లాకు వెళ్లి వస్తున్నప్పుడు, మధ్యాన్నం 1.10  లేదా  సాయంత్రం  6.15  అయితే చాలు, మంత్రి గారు ప్రయాణిస్తున్న మోటారు వాహనం రోడ్డు పక్కన నిలిచిపోయేది. ప్రాంతీయ వార్తలు పూర్తిగా విన్న తరువాత మళ్ళీ బయలుదేరేది. (అప్పట్లో ఇప్పటి నాలుగు లేన్ల రహదారి లేదు, అంచేత ఎక్కడపడితే అక్కడ కారు ఆపుకునే వెసులుబాటు వుండేది)

ఇప్పుడు  కూడా నాగేశ్వర రావు గారు తెలంగాణా ప్రభుత్వంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు గారు ఈ మధ్య వేసిన మంత్రివర్గ ఉపసంఘానికి ఆయన చైర్మన్. లోగడ 108, 104 పధకాల రూపకల్పనలో పాలుపంచుకున్న తెలంగాణా బిడ్డలు డాక్టర్ ఏ.పీ.రంగారావు, డాక్టర్ బాలాజీ ఊట్ల, ‘క్రియ’ సంస్థ ఆధ్వర్యంలో గత కొద్ది కాలంగా హైదరాబాదు, విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సాయం అందించేందుకు 1033 అంబులెన్స్ సర్వీసుకు రూపకల్పన చేసి నూతన సాంకేతికపరిజ్ఞానంతో రోడ్డు ప్రమాద మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. తుమ్మల నాగేశ్వర రావు గారు ఈ ప్రయోగ వివరాలను తెలుసుకుని వారిద్దరినీ క్యాబినెట్ ఉపసంఘం సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరు కావాల్సిందని కోరారు. ఈ నెల పదో తేదీన జరిగే తొలి సమావేశంలో తగిన చర్చలు జరిగి,  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశించిన ఫలితాల సాధన దిశగా అడుగులు పడాలని ఆశిద్దాం.    

8, జులై 2016, శుక్రవారం

ఒక దార్శనికుడి కరిగిన కల

(ఈ రోజు వై.ఎస్.ఆర్. జయంతి)

(PUBLISHED IN "SAKSHI" TELUGU DAILY ON 09-07-2016, SATURDAY)

చీకటి చిక్కబడుతున్న కొద్దీ సుశీలకు కంగారు ఎక్కువయింది. కారు నడుపుతున్న భర్త వున్నట్టుండి కారు పక్కకు తీసి స్టీరింగుపై వాలిపోయాడు. జన సంచారం లేదు. దగ్గరలో ఊరున్న దాఖలాలు కనబడడం లేదు?  దిక్కులేని ప్రదేశంలో దిక్కుతోచని స్తితి ఆమెది. ఏం చెయ్యాలి?
పీతాంబరం స్తితిమంతుడు. ఆయన వున్న ఊరూ సంపన్న గ్రామమే. మనుమడికి నీళ్ళ విరోచనాలు మొదలై పూట గడిచిపోయింది. ఊళ్ళో ఫోనులు వున్నాయి. ఆసుపత్రే లేదు. అది వున్నచోటికి పోవడానికి రోడ్డు వుంది. కానీ ఆ రాత్రివేళ వెళ్ళడానికి బస్సులు లేవు. ఏం చెయ్యాలి?
ఏకాంబరానిది మరో పరిస్తితి. ఊళ్ళో ఆసుపత్రి వుంది. డాక్టరు ఉండడు. ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పోయేది ఆయనకే తెలియదు.  రోగం రొష్టూ వస్తే మళ్ళీ నాటు వైద్యమే గతి.
సోమయ్య ఊళ్ళో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వుంది. డాక్టరు కూడా మంచివాడు. ఊళ్లోనే ఉంటాడు. అయితే  రక్త పరీక్షకు అయినా, ఎక్స్ రే తీయించుకోవాలన్నా బస్సెక్కి పక్కన వున్న బస్తీకి వెళ్ళాలి. తీరా వెడితే కరెంటు వుండదు. అది వున్నా ఎక్స్ రే తీసేవాడు వుండడు. ఆరోగ్యం ఎటూ చెడింది. పూట తిండి పెట్టే పని కూడా చెడింది. ఏం చెయ్యాలి?
అన్నీ చిన్న సమస్యలే. వెంటనే పరిష్కరించకపోతే పెద్దవి అయ్యే సమస్యలు. ఆరోగ్య సమస్యల్లో అనేక రకాలు. వైద్యుడికి చూపించేవి. వైద్యుడి దగ్గరకు వెళ్ళే లోగా అనారోగ్యంలోని తీవ్రతను వైద్యుడి సలహాతో తగ్గించుకోగలిగేవి.
ఇవన్నీ సమస్యలే. కాని పరిష్కారం లేని సమస్య అంటూ వుండదు. ఇది అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నమ్మకం. స్వయానా డాక్టరు కావడం మూలాన పరిష్కారం దిశగా ఆలోచన చేశారు. ప్రజారోగ్యం విషయంలో ఆదర్శాలు కలిగిన మరికొంతమంది వైద్యులు జత కలిశారు. అనుకున్నది అనుకున్నట్టు చేసే అధికారులు తోడయ్యారు.
ఆ విధంగా అప్పటికే జనాదరణ పొందిన 108 తోడుగా  104 రూపుదిద్దుకుంది.
అయితే వై ఎస్ ఆర్ కల అంతటితో ఆగలేదు. దానికి సంపూర్ణత్వం కలిగించాలనుకున్నారు.
గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్నవాళ్ళు ఏమైపోవాలి? వాటికి వైద్యం చేయిన్చుకోగల వెసులుబాటు వారికి ఎలా కలిగించాలి. అంతే! మరో అపురూప వ్యవస్థ ‘ఆరోగ్య శ్రీ’ కి అంకురార్పణ జరిగింది. 



చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో వుండే  104 ఉచిత కాల్ సెంటరు. వ్యాధి నివారణ కంటే నివారణ మేలు. అందుకోసం  నిర్దేశిత దిన వైద్య పరీక్షలు నిర్వహించే 104 సంచార వాహనం.  అత్యవసర వైద్య సాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి పెద్ద రోగాల పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం ఆరోగ్యశ్రీ.
పైగా,  ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.
నిజానికి వై ఎస్ ఆర్ కల అంతటితో ఆగలేదు.
ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటేకేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పైనా, వారిచ్చే నాటు మందుల పైనా  ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలులంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరురక్త పోటుఉబ్బసంకీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి  ఏపక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీవున్నట్టు కూడా తెలియదు.

వైద్య ఆరోగ్య శాఖ ఎన్ని నిధులు ఖర్చుచేస్తున్నా ఫలితాలు ఆశాజనకంగా వుండడం లేదు. ఈ శాఖ పేరులో వైద్యం ముందు ఆరోగ్యం తరువాత వున్నాయి. వైద్యం చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడడం అనే అర్ధం వుంది. అసలు ప్రజలు ఆరోగ్యంగా వుంటే వైద్యంతో నిమిత్తం ఏముంటుంది. ఇదిగో ఈ ఆలోచనలోనుంచి పురుడు పోసుకున్నదే 104 పధకం.

108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలనుబాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. తగు మందులు, పోషకాలు ఇస్తారు. నెలనెలా పరీక్షలు చేసి పురుడు వచ్చే సమయాన్ని నిర్ధారిస్తారు. పురిటి ఘడియలు దగ్గర పడ్డప్పుడు 108 కి తెలియచేసి వారిని దగ్గరలోని ప్రభుత్వ వైద్య శాలకు చేరుస్తారు. సుఖ ప్రసవం తరువాత తగిన జాగ్రత్తలు చెప్పి, తిరిగి అంబులెన్సులో ఇంటికి చేరుస్తారు.
ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేవారు. “కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి  తిరిగి తల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తలితండ్రుల బాధ్యత. ఇక నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్లు. వాళ్ళ బాధ్యత ప్రభుత్వానిదే”

ఇంతే కాదు.

104 కాల్ సెంటర్ కు ఇంకా విస్తృతమైన లక్ష్యాలు నిర్దేశించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శాలలు, నర్సింగు హోములు, ప్రైవేటు క్లినిక్కులు, ఔషధ దుకాణాలు, బ్లడ్  బ్యాంకులు ఇలా వైద్య రంగానికి సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేసారు. అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా రాష్ట్రంలో ఏమూల నుంచి ఫోను చేసినా వారు వుండే ప్రదేశానికి ఇవన్నీ యెంత దూరంలో వున్నాయి, ఏ సమయాల్లో పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడానికి వీలుగా ఈ ఏర్పాటు. ఇక  వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో ఏ  ప్రాధమిక వైద్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో ఉన్నదీ, సెలవు మీద వెళ్లిందీ ఆన్ లైన్లో తెలుసుకుని ఆ సమాచారాన్ని అటు అవసరమైన రోగులకూ, ఇటు పర్యవేక్షణ జరిపే అధికారులకూ ఎప్పటికప్పుడు ఈ కేంద్రం తెలియచేస్తూ వుంటుంది. అలాగే విద్యుత్ అధికారులతో సంప్రదించి ఈ వూర్లో ఏ సమయంలో కరెంటు వుంటుందీ, ఏ వూరి ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్లు పనిచేయడం లేదు మొదలయిన వివరాలను సంసిద్ధంగా వుంచుకుని అడిగిన వారికి అడిగినట్టుగా  సమాచారం అందించే వ్యవస్థకు రూపకల్పన చేసారు.
ఒక్క ముక్కలో చెప్పాలంటే  నాణ్యత కలిగిన వైద్య చికిత్సలను కేవలం కలిగిన వారికే కాదు, పేదసాదలకు కూడా  అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఆరోగ్య శ్రీ లక్ష్యం.
ఆ దార్శనికుడు కన్న కల సాకారం అయ్యే కృషి మొదలయింది. ప్రజలకు అందులోని  వైశిష్ట్యం ఎలాటిదో ప్రజలకు క్రమంగా అవగతమవుతోంది.
దురదృష్టం.  అప్పుడే విధి వక్రించింది. దొంగచాటుగా  మృత్యుపాశం విసిరింది.
కల కన్న మనిషి అర్ధంతరంగా అంతర్ధానమయ్యాడు. కంటున్న కల ఆయన కనురెప్పల్లోనే కరిగిపోయింది. ఒక గొప్ప స్వప్నం  ఆవిష్కారానికి ముందే ఆవిరి అయిపోయింది. అంత చక్కటి పధకం అరకొరగా మిగిలి పోయింది. రాజకీయ విషక్రీడకు బలయిపోయింది.  కార్పొరేట్ ఆసుపత్రులకు దోచి పెట్టే పధకంగా ముద్రవేసి,  అసంపూర్తిగా దాన్ని  అటక ఎక్కించారు.

కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. మరి కొందరి స్వార్ధాలకు బలయిపోయింది. ఇంకొందరి ఆహాలను చల్లార్చడానికి మాడి మసయిపోయింది. రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి  ఎత్తులు పైఎత్తులకు  చిత్తయిపోయింది.

ఇప్పుడీ పధకం ఉందా అంటే వున్నట్టు, లేదా అంటే లేనట్టుగా వుంది.
ఆయన అదృష్టవంతుడు, దాటిపోయాడు. ఊళ్లకు దూరంగా, వైద్య సౌకర్యాలకు నోచుకోకుండా కొండలు, కోనల్లో నివసించే వారు దురదృష్టవంతులు. వారి బతుకుల్ని మార్చే గొప్ప పధకానికి వారు దూరం అయ్యారు.   (06-07-2016)      


20, సెప్టెంబర్ 2015, ఆదివారం

ఎందరో మహానుభావులు – వారిలో ఒకరికి నా నమస్కారం


సెప్టెంబరు  ఇరవై – ఈ రోజున అనేకమంది పుట్టివుంటారు. వాళ్ళల్లో కొందరు పెట్టి పుట్టినవాళ్ళు వుంటారు. వాళ్ళని గురించి తెలిసిన విషయాలను తెలియని వారికి చెప్పే అనేక వ్యాసాలు గట్రా అనేక పత్రికల్లో వస్తుంటాయి. కొందరికి అలాటి ప్రచారం దొరకదు. ఎందుకంటె ప్రచారం కోసం వాళ్ళు ఏపనీ చేయలేదు కనుక.
ఈ రెండో బాపతు మనిషి ఒకాయన కూడా ఎన్నో ఏళ్ళ క్రితం ఇదే రోజున పుట్టాడు. మాతామహుల గ్రామం కంభంపాడులో పుట్టినప్పటికీ ఆయన స్వగ్రామం మాత్రం ఖమ్మం జిల్లా వల్లభి. పుట్టిన తరువాత అక్కడ ఎన్నాళ్ళు ఉన్నాడో తెలవదు కానీ ఖమ్మం, హైదరాబాదు ఆపైన ఇంగ్లండు, ఇలా చదువుల నిమిత్తం, అలాగే ఉద్యోగపర్వంలో బూర్గుంపాడు, భద్రాచలం, హైదరాబాదు ఇలాగే రోజులు  గడిచిపోయాయి. ఒక ప్రభుత్వ డాక్టరుగానే జీవితం గడిపివుంటే ఆయన్ని గురించి రాయాల్సిన అవసరం ఉండేదే కాదు. వైద్య విద్యార్ధిగా తొలి పాఠం నేర్చుకున్నప్పుడే డాక్టర్లకు నేర్పే మరో నీతి పాఠాన్ని ఆయన ఒంటపట్టించు కున్నాడు.  జీవితాంతం దాన్నే పాటిస్తూ వస్తున్నాడు. ‘రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదు’ అన్నది ఆ పాఠం.

108, 104 అంటే ఏమిటో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో యావన్మందికీ  తెలుసు. వాటి రూపశిల్పి ఈ డాక్టరు గారే. హైదరాబాదులో ఉంటున్నా, నెలలో చాలా రోజులు  వాళ్ళ సొంతూరు వల్లభిలో గడిపే ‘శ్రీమంతుడు’  డాక్టర్ అయితరాజు పాండు రంగారావు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు.  

(డాక్టర్ ఏపీ రంగారావు)
      


8, జులై 2011, శుక్రవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! – భండారు శ్రీనివాసరావు

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి! – భండారు శ్రీనివాసరావు


(08-07-2011 తేదీ సాక్షి దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.
ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?

అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సు ధ్వనిని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు

ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ

సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే - వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.


ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే,108 అంబులేన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు , ఇతర పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే! దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

కానీ, రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఇప్పుడు ఆయనా లేరు. ఆ పధకాలూ ఆయన లాగానే అంతర్ధానం అయిపోతున్నాయి. ఇవ్వాళో రేపో వాటిని పూర్తిగా అటకెక్కించినా ఆశ్చర్యంలేదు.

(ఈ రోజు కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి)

25, మే 2010, మంగళవారం

మీలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి? – భండారు శ్రీనివాస రావు

మీలో పాపం చేయనివాడు ఎవరో చెప్పండి? – భండారు శ్రీనివాస రావు











గత కొద్ది రోజులుగా తెలుగు చానళ్ళలో – వైఎస్సార్ సంక్షేమ పధకాల భవిష్యత్తు గురించి చర్చోపచర్చలు సాగుతున్నాయి.

నిధుల లేమి సాకుతో ఈ పధకాలకు గండి కొట్టే ప్రయత్నం జరుగుతోందని పాలక పక్షం లోనే కొందరు బాహాటంగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. రాజశేఖరరెడ్డి ప్రజలకిచ్చిన వాగ్దానాలను తోసిరాజంటే- వచ్చే ఎన్నికల్లో తిరిగి ఆ జనమే పార్టీకి ‘మొండి చేయి’ చూపిస్తారని హెచ్చరిస్తున్నారు.


అయితే, ఈ సంక్షేమ పదకాలకే కాదు – అసలు ప్రభుత్వం పూనిక వహించిన ఏ పదకానికయినా పూచీకత్తు వహించాల్సిన ముఖ్యమంత్రి రోశయ్య గారు మాత్రం – ఎటువంటి పరిస్తితుల్లోను సంక్షేమ పధకాలను నిలుపుచేసే ప్రసక్తే లేదని పదే పదే ఘంటాపధంగా చెబుతూ వస్తున్నారు. అయినా కూడా అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో – ఈ చర్చ రచ్చరచ్చగా తయారవుతోంది. ‘తప్పు చేస్తే సోనియానయినా నిలదీస్తాం’ అనేవరకు ఇది సాగి చివరకు ఈ సెగ డిల్లీ వరకూ పాకింది. ముఖ్యమంత్రి,- పీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్ ఇద్దరు ఒకేరోజు హస్తిన ప్రయాణం పెట్టుకోవడంతో – అధిష్టానం ఆగ్రహంతోవుందన్న పుకార్లకు కూడా పట్టుచిక్కింది.
మూడు ముఠాలు , ఆరు వర్గాల సంస్కృతి కలిగిన కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీకి ఈ ‘కలహాల కాపురాలు’ కొత్తేమీ కాదు. వీటన్నిటినీ పిల్లకాయల ఆటలుగా కొట్టేయడం డిల్లీలో పెత్తనం చేసే పెద్దల అలవాటు. అవసరం అనుకునేవరకూ – పట్టించుకోనట్టుగా వ్యవరించగల దీమంతం ఆ పార్టీ సొంతం. పైగా మీడియాలో సాగే ఈ రకమయిన చర్చలూ రచ్చలూ ఒక రకంగా ఆ పార్టీకి బలమూ, బలహీనతా రెండూ కూడా. కాకపొతే ముఠాభక్తి మరింత ముదిరి, ఏకంగా అధినాయకత్వానికే కాక తగిలే రీతిలో మాటల తూటాలు ప్రయోగించినప్పుడే వస్తుంది ఇలాంటి తంటా. గల్లీ గోలలన్నీ డిల్లీ చేర నంతవరకే అంతర్గత ప్రజాస్వామ్యాన్ని అధిష్టానంవారు అనుమతిస్తారన్నది జగమెరిగిన సత్యం.

రాజశేఖరరెడ్డి మరణం వరకూ నివురుగప్పిన నిప్పులా వున్న ముఠా తగాదాలు ఆ తరవాత ఒక్కసారిగా పెచ్చరిల్లి బజారున పడుతున్నాయి. సహజంగానే ఈ పరిణామాలన్నీ మీడియాకు వండి వార్చిన సిద్దాన్నం కావడంలో అసహజమేమీ లేదు.
‘మాట్లాడుకోవడానికి పార్టీ వేదికలున్నాయి. ఇలా త్వరపడి మీడియాకెక్కడం మంచిదికాదంటూ’ ఓ పక్క సన్నాయి నొక్కులు నొక్కుతూనే – మరో పక్క అదే నోటితో అనాల్సిన నాలుగు మాటలూ అనేసి చేతులు దులుపుకోవడం నిత్యకృత్యంగా మారుతోంది. ఇలా ఖండన ముండనలూ, విమర్సలు ప్రతి విమర్సలూ, ఆరోపణలు ప్రత్యారోపణలతో కూడిన టీవీ ప్రోగ్రాములతో తెలుగులోగిళ్ళు అన్నీ దద్దరిల్లిపోతున్నాయి. వీటి హోరులో – సదసద్వివేక చర్చలకూ, పూర్వాపరాల పరిశీలనకూ ఎంతమాత్రం అవకాశం లేకుండాపోతోంది. బహుశా ఈ కారణం వల్లనే కావచ్చు – కాంగ్రెస్ పార్టీలోని ముఠా తగాదాలు ఇంతింతై వటుడింతయ్ అన్నట్టు బుల్లి తెరలపై ‘ ఐమాక్స్’ అనుభూతిని అందిస్తున్నాయి. వొడ్డున వుండి తమాషా చూస్తున్న కొన్ని ప్రతిపక్షాలు ‘ఇవన్నీ కాంగ్రేస్ వాళ్ళ అంతర్గత వ్యవహారం’ అని కొట్టేస్తూనే – అగ్నికి ఆజ్యం చందంగా తమ వ్యాఖ్యానాలను జోడించి కధను రక్తి కట్టిస్తున్నాయి. బాలకృష్ణ సింహ గర్జనలనుంచి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి తెలుగుదేశానికి సంక్షేమ పధకాల రచ్చ అక్కరకు వచ్చింది.

 వైఎస్సార్ సంక్షేమ పధకాలను తూర్పారపడుతూ వచ్చిన ఆ పార్టీకి ఇప్పడు అవే ఆదుకునే అస్త్రాలుగా కానవస్తున్నాయి. పేదలకు పనికివచ్చే ఈ సంక్షేమ పధకాలను అమలుచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి వుండాలే కానీ మనసుంటే మార్గముండదా అంటూ – కాంగ్రెస్ కోర్టు లోకి ఒక కొత్త బంతిని విసిరింది.

‘గత ఆరేళ్ళలో కాంగ్రెస్ నాయకులు, మంత్రులు కూడబెట్టిన అక్రమాస్తులూ, దోచుకున్న సొమ్మూ స్వాధీనం చేసుకుంటే ఎన్ని పధకాలనయినా నిక్షేపంగా అమలు చేయవచ్చని’ ఆ పార్టీ ఇచ్చిన సలహాతో తేనెతుట్టిని కదిపినట్టయింది.

రాష్ట్రంలో రాజకీయ అవినీతికి అసలు మూలాలు టీడీపీలోనే వున్నాయని, ఆ పార్టీ అధికారంలో వున్నప్పుడు ఆ పార్టీ నాయకులు పోగేసుకున్న నల్ల ధనంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయవచ్చని ఎదురుదాడి ప్రారంభం కావడంతో ఈ రగడ కొత్త మలుపు తిరిగింది.

అవినీతి భాగోతంలో అన్ని పార్టీలకు అంతో ఇంతో భాగం వుంది కనుక అంతా కలసి ఈ పని చేస్తే - మరో పాతికేళ్ళ వరకూ ప్రజలపై పైసా కూడా పన్ను వేయాల్సిన పని వుండదని మరి కొందరు మేధావులు విశ్లేషణల్లో వాకృచ్చారు.

ఇదంతా వినడానికి ఎంతో సొంపుగా వుంది. వూహించుకున్నంత మాత్రానే ఆహా అనాలనిపించేదిగా వుంది.

కానీ ఇది జరిగే పనేనా?

కోట్లు ఖర్చుపెట్టి వేలల్లో ఎన్నికల పద్దులు చూపే ప్రజ్ఞాశీలురు- అడ్డదోవలో అక్రమగా ఆర్జించిన సొమ్మును సినిమాల్లో చూపించినంత సులభంగా వొదులుకోగలరా?

పోనీ – అలాగే జరిగిందనుకున్నా – మళ్ళీ ఆ డబ్బుని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సింది తిరిగి వీళ్ళే కదా! ఈ అధికార యంత్రాంగమే కదా!

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు – అతి సాధారణ అధికారి ఇంటిపై ఏసీబీ దాడిజరిగినా – బ్యాంకు స్ట్రాంగ్ రూముల్లోమాదిరిగా కరెన్సీ నోట్ల కట్టలు బయటపడుతున్న ఈ రోజుల్లో – ప్రజాధనం పక్క దారులు పట్టకుండా ఖర్చుకాగలదని ఆశించడం అత్యాశ కాదా!
ఇలాటి పరిస్థితుల్లో పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు?

ఎవరు వీరిలో పవిత్రులు?

అందుకే ఒక సినీ కవి చెప్పినట్టు –

ఒకరిపై రాయి విసిరేముందు -
‘మీలో పాపం చెయ్యనివాడు ఎవరో చెప్పండి?’

(24-05-2010)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.

2, మార్చి 2010, మంగళవారం

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!


దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

"అయాం సోల్డ్" - అన్నారు ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు.

ముఖ్యమంత్రి అమ్ముడుపోవడమా!అందులోను వైఎస్సార్? ఎవరికి అమ్ముడుపోయారు? ఎంతకు అమ్ముడుపోయారు?



అది డిసెంబరు నెల. 2007 వ సంవత్సరం.

అప్పటికే -108- అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సుని అనుకరిస్తూ దాని ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే - సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది.అదే ఎఫ్ డీ హెచ్ ఎస్. -'ఫిక్సెడ్ డేట్ హెల్త్ సర్వీస్' - నిర్దేశిత దిన వైద్య సేవలు. ఇందుకు పూర్వ రంగం గురించి కొంత ప్రస్తావించాల్సివుంటుంది.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను తీరుస్తున్నప్పటికీ- డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే మిగిలిపోతున్నది. మన రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు దూరంగా వున్న పల్లెల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయా దాక్షిణ్యాల పయినా, వారిచ్చే నాటు మందుల పయినా ఆధారపడాల్సిన దీన స్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా అరణ్య ప్రాంతాలలో - అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి తండాల్లో వుండే పేద వారికి రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు. అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటె ఎలాటి వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా తెలియదు.

ఈ నేపధ్యంలో -

అప్పటికే - ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి, పనిచేస్తున్న -104- ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు - హె చ్ ఎం ఆర్ ఐ (హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ సమస్యపై దృష్టి సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు- నెల నెలా క్రమం తప్పకుండా వెళ్లి - వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే ఈ 104 సంచార వైద్య వాహనం - పేద పల్లె ప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది.ఇంతా చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే- ఒక్కొక్కరిపై పెట్టె ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

ఈ వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు ఏ ఎన్ ఎం లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు.అవసరమని భావిస్తే, ఫోన్ చేసి ఆసుపత్రిలో చేర్పిస్తారు.రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెహ్ ఎం ఆర్ ఐ నిర్వాహకులు ముఖ్యమంత్రి అప్పాయింట్మెంట్ తీసుకుని ఆనాడు సచివాలయానికి వెళ్ళారు.ఇప్పటి ముఖ్యమంత్రి, ఆనాటి ఆర్ధిక మంత్రి అయిన రోశయ్య గారు కూడా పాల్గొన్న ఆ సమావేశం మొదలయి మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో- రాజశేఖరరెడ్డి గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హటాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్ ఐడియా) అనేసారు.

అంతే!

దాదాపు ఏడాదికి నూరు కోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్ డాక్టర్ రాజశేఖరరెడ్డి!

___________________________________________________________________________________________

-భండారు శ్రీనివాసరావు (02-03-2010)

____________________________________________________________________________________________

--(హెలికాప్టర్ దుర్ఘటనలో రాజశేఖర రెడ్డి గారు కన్నుమూసి ఆరు మాసాలు గడిచిన సందర్భంలో 02-03-2010 తేదీన సాక్షి దినపత్రికలో ప్రచురితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All the images in this blog are copy righted to their respective owners.