18, జనవరి 2021, సోమవారం

పీవీ కోసం తీహార్ జైల్లో నెంబర్ వన్ గది సిద్ధం : సమీక్ష ఎనిమిదో భాగం

 పీవీ కోసం తీహార్ జైల్లో నెంబర్ వన్ గది సిద్ధం చేసిన అధికార్లు! 

విప్లవ తపస్వి పీవీ  సమీక్ష ఎనిమిదో భాగం 

పుస్తక రచన : శ్రీ ఏ. కృష్ణారావు : సమీక్ష : భండారు శ్రీనివాసరావు


ఎన్నికల్లో పరాజయం దరిమిలా  ప్రధాన మంత్రి పదవికి పీవీ రాజీనామా చేసిన రెండు వారాలకు రవీంద్ర కుమార్ చేసిన పిటిషన్ ఆధారంగా  1996 మే 24న ఎఫ్ ఐ ఆర్ దాఖలు చేయమని ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించడంతో పీవీని ఏ వన్ గా పేర్కొంటూ సీ బి ఐ నిందితులపై దశల వారీగా చార్జ్  షీట్లు దాఖలు చేస్తూ  పోయింది. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నలుగురు జే ఎం ఎం ఎంపీలకి కోట్లాది రూపాయలు చెల్లించారని ఆరోపించింది.

2000 సెప్టెంబర్ 29 వ తేదీన పీవీ, బూటా సింగ్ లకు శిక్ష విధిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అజిత్ బరహోఖ్ చారిత్రాత్మక తీర్పు వెలువరించారు. నేరపూరిత కుట్ర, అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారని జడ్జి తీర్మానించారు.

79 సంవత్సరాల పీవీని జైలుకు తరలిస్తారని సంచలనాత్మక వార్తా కధనాలు ప్రచురించారు. తీహార్ జైలులో నెంబరు వన్ జైలులో ఏర్పాట్లను కూడా చేసినట్టు అధికారులు చెప్పారు. పీవీ కటకటాల వెనుక వున్నట్టు ఒక పత్రికలో  ఫోటో కూడా ప్రచురించారు. 

కింది కోర్టు తీర్పును పీవీ సవాలు చేస్తూ అప్పీల్ చేసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఆర్.ఎస్.సోధి కింది కోర్టు తీర్పును కొట్టేసి పీవీ, బూటా సింగ్ లకు కేసు నుంచి విముక్తి కలిగించారు.

పీవీ కేసుల గురించిన ప్రస్తావనలో రచయిత కృష్ణా రావు సీ.బి.ఐ. గురించి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

“సీ.బి.ఐ. చాలా కుట్రలు, కుహకాలు, వ్యూహ, ప్రతివ్యూహాలతో కూడిన సంస్థ. ఉత్తరాదివారయితే ఇలాంటి కేసుల్లో తిమ్మిని బమ్మి చేయగలరు. ఢిల్లీ పోలీసులతోను, న్యాయమూర్తులతోను వారికి సంబంధాలు వుంటాయి. సీ.బి.ఐ. డైరెక్టర్ విజయరామారావుకు ఆ మాయాజాలాలు అంతగా తెలియవు. సుప్రీం ఆదేశాలతో ఆయనకు ఏమి చేయాలో పాలుపోలేదు. ‘ఒక పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ చేయగలిగిన పని కూడా సీ.బి.ఐ. చేయడం లేదు’ అని ఒకసారి వ్యాఖ్యానించింది.

జైన్ హవాలా కేసుల్లో వివిధ పార్టీల నేతల పేర్లు బయటకు రావడంతో పీవీ రాజకీయ పరమైన ఒత్తిడికి గురయ్యారు. బీజేపీ  నాయకుడు ఎల్.కె. అద్వాని తనను నిర్దోషిగా ప్రకటించేవరకు సభలో అడుగు పెట్టాను అని ప్రకటించి లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. శరద యాదవ్ కూడా సభ్యత్వం ఒదులు కొన్నారు. యశ్వంత్ సిన్హా బీహారు శాసన సభకు రాజీనామా చేశారు.

ఈ కేసు వల్ల జరిగే రాజకీయ నష్టం గమనించి పీవీ అనేకసార్లు విజయరామారావుతో మాట్లాడారు. కానీ కోర్టు వెంటపడుతోందని అంటూ విజయరామారావు తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఒకరోజు కాంగ్రెస్ నేత బలరాం జాఖడ్ తెలుగు మీడియాను చూసి ‘ ఆప్ కా రావ్ బర్ బాద్ కర్ దియా. హం సబ్ కో జైల్ బిజ్వానే కా కోషిష్ కియా’ ( మీ రావు మమ్మల్ని దుంప తెంచారు. మమ్మల్ని జైలుకు పంపించే ప్రయత్నం చేశారు) అని వ్యాఖ్యానించారు.  

జైన్ హవాలా కేసు దరిమిలా ప్రజాప్రయోజనాల వ్యాజ్యాల ద్వారా ఎవరినైనా బజారుకు ఈడ్వవచ్చు అన్న అన్న సంగతి తెలిసిందని రచయిత అభిప్రాయ పడ్డారు.      

కోర్టులు కేసులు నుంచి గట్టెక్కడానికి, ప్రధాని పదవిని కాపాడుకోవడానికి పూజలు చేయించాలని పీవీ మీడియా సలహాదారు పీవీఆర్ కె ప్రసాద్ సూచిస్తే పీవీ పెద్దగా నవ్వారు. ‘నాకు ప్రధాన మంత్రి పదవి ఏ పూజలు చేస్తే వచ్చిందయ్యా ? పోయే రోజు వస్తే పూజలు చేస్తే ఆగుతుందా?” అని పీవీ అన్నట్టు పీవీఆర్ కె ప్రసాద్ తన పుస్తకం ‘అసలేం జరిగిందంటే’ లో రాయడం గమనార్హం. పూజలు, యాగాలు, హోమాలు ఎన్నో చేయించి కూడా ఇందిరా గాంధి ఓడిపోయిన విషయాన్ని పీవీఆర్ కేకు గుర్తు చేశారు. 

పీవీ పూజలు చేసేవారు కాదని ఆయన సోదరుడు మనోహరరావు చెప్పారు. అయితే ఆధ్యాత్మికత మాత్రం ఆయనలో ఉండేదని ఆయన అన్నారు. కనీసం బయటకు వెళ్ళేటప్పుడు దండం పెట్టుకుని వెళ్ళిన సందర్భాలు కూడా లేవు. అయితే పూజలు, పునస్కారాలను ఆయన ఎప్పుడూ విమర్సించలేదని మనోహరరావు పేర్కొన్నారు. చంద్రస్వామితో సన్నిహిత పరిచయం ఉన్నప్పటికీ ఆయనతో ఎన్నడూ పీవీ పూజలు, యజ్ఞాలు చేయించిన దాఖలాలు లేవు. 

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: