18, జనవరి 2021, సోమవారం

విప్లవ తపస్వి పీవీ సమీక్ష ఏడో భాగం

 రాజకీయుల కోసం కోర్టుల్లో  రిట్లు వేసేవాళ్ళు రెడీగా వుంటారు   

విప్లవ తపస్వి పీవీ  సమీక్ష ఏడో భాగం 

పుస్తక రచన : శ్రీ ఏ. కృష్ణారావు : సమీక్ష : భండారు శ్రీనివాసరావు

“కాలం ఉనికిని ఏర్పాటు చేస్తుంది. కాలమే దాన్ని ధ్వంసం చేస్తుంది”

1996 జులై  9 వ తేదీన లఖూ బాయ్ పాథక్ కేసులో పీవీకి సమన్లు పంపుతూ న్యూ ఢిల్లీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ప్రేమ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

ఆ రోజున ఆయన  ఏ ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్యలు చేసారో తెలియదు కానీ, పీవీపై కేసులు కాలమే సృష్టించింది. మళ్ళీ ఆ కాలమే ఆ కేసులను తుత్తునియలు చేసింది.

“లఖూ బాయ్ పాథక్ సాక్ష్యంలో ఎన్నో తప్పుడుతడకలు వున్నాయి. దాన్ని నమ్మలేము.” అని 2003లో కోర్టు కొట్టివేసి పీవీని నిర్దోషిగా ప్రకటించింది. కాంగ్రెస్ నేతలు కనీసం ఆయనకు అభినందనలు కూడా తెలపడానికి ముందుకు రాలేదని కృష్ణారావు తన పుస్తకంలో రాశారు.

అంతకు ముందే సెయింట్ కిట్స్ కేసులో కూడా పీవీ నిర్దోషిగా బయట పడ్డారు.

పీవీకి శిక్ష పడిన జే.ఎం.ఎం ముడుపుల కేసు పూర్తిగా రాజకీయమైనది. 1993 లో పీవీ ప్రభుత్వం అవిశ్వాస పరీక్షలో గట్టెక్కేందుకు ముడుపులు చెల్లించారనే ఆరోపణలపై  1996 ఫిబ్రవరి  22 వ తేదీన రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే సంస్థ  తరపున రవీంద్ర కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అవిశ్వాస పరీక్ష జరిగిన మూడేళ్ల తర్వాత, సరిగ్గా ఎన్నికలకు ముందు అతడు పిటిషన్ దాఖలు చేయడం వెనుక మతలబు లేకపోలేదు. 

ఢిల్లీలో రాజకీయ పార్టీలు వేసే ఎత్తులు పై ఎత్తులకు అనుగుణంగా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసే ఎన్జీవోలు, రవీంద్ర కుమార్ లాంటి వ్యక్తులు ఎప్పుడూ సిద్ధంగా వుంటారు. ఎంపీల బంగాళాల గేరేజీల్లో, మారుమూల గల్లీల్లోని కార్యకర్తల ఇళ్ళల్లో వీరి అడ్రసులు వుంటాయి. పీవీకి కోటి రూపాయలు ఇచ్చాను అని హర్షద్ మెహతా చేసిన ఆరోపణలపై తక్షణం విచారణ జరపాలని  1993లో జన హిత్ అభియాన్ అనే ఎన్జీవో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. 

“న్యాయ వ్యవస్థ పనిచేసే తీరు ఎలా రాజకీయమయం అయిందో దేశం గమనిస్తోంది” అని వ్యాఖ్యానిస్తూ సుప్రీం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఎం. వెంకటాచలయ్య ఈ పిటిషన్ ను వెంటనే వినేందుకు నిరాకరించారు.

(ఇంకా వుంది)

కామెంట్‌లు లేవు: