9, జులై 2017, ఆదివారం

అవినీతి వేలం పాటలు తగ్గించాలి


నిన్న సాయంత్రం (శనివారం) మహా టీవీ ‘ఎడిటర్స్ టైం’ ప్రోగ్రాం లో మాట్లాడాలని పిలిచారు. ఫోన్ ఇన్ కాబట్టి బయటకు పోవాల్సిన పని లేదు, వర్క్ ఫ్రం హోం లాగా. మహా టీవీ ఎడిటర్ ఐ. వెంకట్రావు గారు, నేను, ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం బెజవాడ ఆంద్రజ్యోతిలో కలిసి పనిచేసాము. నాపట్ల ఇప్పటికీ అప్పటి వాత్సల్యం చెక్కు చెదరలేదు. ఫేస్ బుక్ లో నేను రాసే వాటిని ఆయన శ్రద్ధగా చదువుతారు. ముందు కాసేపు ఆ విషయాలనే ప్రస్తావిస్తారు. ఇవ్వాళ మా పెద్దన్నయ్య పర్వతాల రావు గురించి రాసింది చదివినట్టున్నారు. ఆయనతోనే మా సంభాషణ మొదలయింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరకుండా వుంటే పర్వతాల రావుగారు తెలుగు ప్రజలు గర్వించే రచయిత అయ్యేవారనేది వెంకట్రావు గారి అభిప్రాయం.
తరువాత సంభాషణ రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఇంబర్స్ వైపు మళ్ళింది. ముఖ్యమంత్రులతో సాన్నిహిత్యం గురించి అడిగినప్పుడు నేను ‘వివరణ’గా చెప్పాను. ఆకాశవాణి విలేకరిగా ప్రభుత్వాధినేతలతో మంచి సంబంధాలు ఉండేవని, అయితే వారిలో అంజయ్య, చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురితో వ్యక్తిగత పరిచయం ఎక్కువని, కారణం వారు చేపట్టిన కొన్ని కార్యక్రమాలు నాకు బాగా నచ్చడం వల్ల కావచ్చునని చెప్పాను. వైఎస్ తరువాత ఏర్పడ్డ ప్రభుత్వాలు ఆరోగ్య శ్రీ మొదలయిన పధకాలను యథాతధంగా కొనసాగించి ఉన్నట్టయితే ఈ సరికి తెలుగు రాష్ట్రాలలో అట్టడుగు ప్రజలు బాగుపడి వుండేవారన్నాను. ఇంజినీర్ అనిపించుకోవడం వల్ల బడుగువర్గాలకు చెందిన వారికి ఉద్యోగం వచ్చినా రాకపోయినా సమాజంలో వారి స్థాయి పెరిగి, వారిలో ఆత్మన్యూనతా భావం తగ్గిపోతుందని, ఈ పధకం వల్ల ఇతరత్రా లభించే లబ్దికంటే ఇది చాలా ముఖ్యమని అన్నాను. దీనికి ఉదాహరణలు ఇచ్చాను. ఇవన్నీ గతంలో నేను నా బ్లాగులో రాసుకున్నవే. అమల్లో కొన్ని లోపాలు వున్నాయని, పెద్ద పెద్ద ప్రాజెక్టులలో జరిగే అవినీతితో పోల్చినా, ఈ పధకాల వల్ల బడుగు,బలహీన వర్గాలకు జరిగే ప్రయోజనాలతో పోల్చి చూసుకుంటే వీటిల్లోని లొసుగులు చాలా స్వల్పమని చెప్పాను. తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పధకాలను సరిగా పట్టించుకోకపోవడం వల్ల పేద ప్రజలు బాగా నష్ట పోయారని అన్నాను.
తరువాత సహజంగానే టాపిక్ వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్లీనరీ మీదకు మళ్ళింది. చంద్రబాబు ప్రభుత్వంపై ప్రచురించిన అవినీతి చక్రవర్తి పుస్తకం ప్రస్తావన వచ్చింది. గతంలో జగన్ లక్ష కోట్ల అవినీతి గురించి విస్తృత ప్రచారం జరిగిందని, లక్ష కోట్లు, లక్ష కోట్లు అంటూ పదేపదే చెబుతూ పోవడంతో అదే నిజమని జనం నమ్మే పరిస్తితి వచ్చిందని, అంతిమంగా వేసిన చార్జి షీట్లలో పేర్కొన్న అవినీతి ఆ స్థాయిలో కనబడలేదని, ఇటువంటి ప్రచారాల వల్ల ప్రత్యర్ధి పార్టీలకు రాజకీయ ప్రయోజనం లభించవచ్చేమో కానీ ప్రజలకు రాజకీయ పార్టీల పట్ల ఏహ్యభావం పెంచుకునే అవకాశం ఉంటుందని అన్నాను. ఇప్పుడు వై.ఎస్.ఆర్.సీ.పీ. అదే పల్లవి ఎత్తుకుని చంద్రబాబును అవినీతి చక్రవర్తి గా అభివర్ణిస్తూ, గత మూడేళ్ళ కాలంలో ఆయన అవినీతి మూడుకోట్ల డెబ్బయి లక్షల స్థాయిలో వుందని సాక్ష్యాధారాలతో ఒక పుస్తకం వేసారని చెబుతూ, ఇలా అవినీతి లక్షల కొట్లలో జరుగుతున్నట్టు పై పాటలు పాడుతూ పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పొతే ప్రజలకు రాజకీయ నాయకులు అంటేనే విరక్తి కలిగే ప్రమాదం ఉంటుందని, అది ప్రజాస్వామ్యానికి మేలు చేయదని చెప్పాను.
ఆంద్ర ప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీలు ఎదుటివారిని విమర్శలతో ఎండగట్టె క్రమంలో ముందుకు వెడుతున్నాయని, ప్లీనరీలో జగన్ పక్షం వాళ్ళు ‘చంద్ర నామస్మరణ’ చేస్తే, ప్లీనరీ వెలుపల టీడీపీ మంత్రులు మూకుమ్మడి ‘జగన్నామ స్మరణ’ చేసారని చెప్పాను.
(విచిత్రం ఏమిటంటే ఈ రోజు (ఆదివారం) ఉదయం TV-5 News Scan లో కూడా విజయ్ నారాయణ్ ఈ అంశాల మీదనే నా అభిప్రాయం అడిగారు. దాదాపు ఇదే మోస్తరు జవాబులు చెప్పాను)

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

సర్ నిజం చెప్పారు ఇప్పటికే రాజకీయ నాయకులమీద నమకం పొయంది కుల రాజకీయముల కంటే పాట రాజకీయం నయము ఏమో ఎమలఎ ముందు తర్వాత వారి అస్తిలు చూస్తె రాళ్ళలో బియం ఎరాలి