11, జులై 2017, మంగళవారం

అన్నయ్య గొప్పతనం మరోమారు తెలిసింది – భండారు శ్రీనివాసరావు


మహాత్ములు, స్వాములు తమ అనుగ్రహ భాషణల్లో సాధారణంగా ఆ సర్వేశ్వరుడిని తప్ప  మనుష్యమాత్రుల్ని ప్రశంసించడం జరగదని నా విశ్వాసం. తమ ధార్మిక సేవా కార్యక్రమాలకు అండదండలకొసం కొండొకచో రాజుల్ని, పాలకుల్ని పొగడడం కొత్తేమీ కాదు. అలాంటిది చనిపోయిన ఒక వ్యక్తిని, అందునా కేవలం వివేకసంపద మినహా ఏవిధమైన లౌకిక బాహ్య సంపదలను కూడబెట్టుకోకుండా ఈ లోకం నుంచి సెలవు తీసుకున్న వ్యక్తిని ఒక బహిరంగ సమావేశంలో బాహాటంగా ఒక ఆధ్యాత్మిక గురువు అదేపనిగా ప్రశంసించిన సందర్భాన్ని నేనెరుగను. ఆ వ్యక్తి మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు గారు కావడం మా కుటుంబం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఇంకేమీ కాదు.
దీనికి ముందు ఒక విషయం గురించి చెప్పుకోవాలి. మా అన్నయ్య తాను  జీవించి ఉన్నకాలంలో ఎంతో శ్రమకోర్చి, అనేక ప్రాంతాలు తిరిగి, కొండలు కోనల్లో ఉన్న అనేక నారసింహ క్షేత్రాలను సందర్శించి, ఆ క్షేత్రాల ప్రాశస్త్యాన్ని స్వయంగా అధ్యయనం చేసి కంప్యూటర్ల సాయం లేకుండా కేవలం చేతి రాతతో ఏడు సంపుటాలను ‘ఓం నమో శ్రీ నారసింహాయ’ అనే పేరుతొ రచించారు. వాటిల్లో మొదటి మూడు ప్రచురణకు నోచుకున్నాయి. మిగిలిన ఏడింటిని శ్రీ కే.ఆర్. పరమహంస గారు,  మిత్రవాత్యల్యంతో డిజిటలైజ్ చేయించి   నెట్లో భద్రపరిచారు. 
ఆ నాలుగు సంపుటాలను మా అన్నయ్య కుమార్తె కొలిపాక కృష్ణ వేణి పుస్తక రూపంలోకి తీసుకు వచ్చింది. వాటిని ఎలాటి లాభాపేక్ష లేకుండా, ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి, ఆసక్తి ఉన్న వారికి ఉచితంగా అందచేయాలని సంకల్పించింది. ఆమె సంకల్పానికి భర్త కొలిపాక రమేష్  కుమార్ సహకారం తోడవడంతో అనుకున్న కొద్దిరోజుల్లోనే నిర్విఘ్నంగా ప్రచురణ కార్యక్రమం పూర్తయింది. 

ఈలోగా అనుకోని ఒక విశేషం జరిగింది. మా అన్నగారి కుటుంబానికి పూజ్యులు అయిన శ్రీధర్ గురూజీ హైదరాబాదు వస్తున్నట్టు తెలిసి వారి శిష్యులను సంప్రదించారు. గురూజీ కూడా నరసింహోపాసకులు. ఆయన పాల్గొనే ఆ కార్యక్రమానికి నరసింహ భక్తులు అనేక మంది వస్తారు కాబట్టి గ్రంధావిష్కరణ అక్కడే చేయడం సముచితంగా ఉంటుందని ముంబైలో ఉంటున్న మా అన్నయ్య కుమారుడు రాఘవరావు అందుకు తగిన ఏర్పాట్లు చేసాడు. గురూజీ శిష్యులలో ఒకరయిన వడ్డాది వారి సహకారంతో గ్రందావిష్కరణకు గురూజీ అంగీకరించారు.
నిన్న (మంగళవారం) సాయంత్రం హైదరాబాదులోని ఆర్టీసీ కళా మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మేమెవరం ఊహించని విధంగా గురూజీ గ్రందావిష్కరణకి పెద్ద పీట వేసి ఆ సాయంత్రం యావత్ కార్యక్రమాన్ని దానితోనే ప్రారంభించారు. సభికులతో కిక్కిరిసిన ఆడిటోరియంలో గురూజీ చేసిన ఇంగ్లీష్ లో చేసిన ఉపన్యాసాన్ని మా రెండో అన్నయ్య భండారు రామచంద్ర రావు సంగ్రహంగా ఇలా పేర్కొన్నారు.
For  full  20 minutes, Sridhar  Guruji, spoke  about  Annayya  (BHANDARU PARVATALA RAO) in a largely  attended  meeting. He started his speech  like this.....
‘Normally we will  start  any  pravachanam  by  invoking  Lord  Ganesha. Today I will start with  mentioning  about  a great, good, knowledgeable  and highly  simple and dear friend Parvatalarao’  Like  this  he spoke  for 20 minutes, paying  glorious  tributes to Annayya. We were all deeply  touched.” - B.Ramachandra Rao
మా అన్నయ్య కుమారుడు సుభాష్ చంద్ర బోస్ అన్నట్టు “ మా అన్నయ్య పుట్టిన కుటుంబంలో పుట్టిన మేము కూడా అదృష్ట వంతులం అయ్యాము”
భర్తృహరి సుభాషితాల్లో ఒకదాన్ని ఏనుగు లక్ష్మణ కవి ఇలా అనువదిస్తారు:
“విద్య యొసగును వినయంబు వినయంబునను 
బడయు పాత్రత పాత్రత వలన ధనము 
ధనము వలనను ధర్మంబు దాని వలన 
నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు”
బాగా చదివే విద్యార్ధిని  ఒక క్లాసు చదవకుండానే పై క్లాసులోకి ప్రమోట్ చేసేవిధంగా, మా అన్నయ్య కూడా ‘పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు’ అనే పద్య పాదాన్ని తాకకుండానే (నిర్ధనుడు గానే) ‘నైహికాముష్మిక’ సుఖ ప్రాప్తి పొందాడు. ఇది సత్యం.    

                  

కామెంట్‌లు లేవు: