25, జులై 2017, మంగళవారం

వార్తా వంటకాలు



విషయం ఒక్కటే. కానీ చూసే  ఇద్దరికీ రెండు రకాలుగా కనిపిస్తే,  వైద్య పరిభాషలో ఆ జబ్బుని యేమని పిలుస్తారో తెలియదు. ఒకే వార్త, వివిధ పత్రికల్లో వివిధ రూపాల్లో వస్తే, అందుకు కారణాలు ఏమిటో చదువరులకు  యిట్టే తెలిసిపోతున్నాయి. ఒక సభ కానివ్వండిఒక సంఘటన కానివ్వండి,  ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి, వేర్వేరు పత్రికలు, వేర్వేరు కోణాల్లో, వార్తలు 'వండి వారుస్తున్నతీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. ఏ ఛానల్ మార్చి చూసినా యిదే వరస.
ఎవరయినా తాము చదివే పత్రికచూసే ఛానల్ వైవిధ్య భరితంగా ఉండాలనే కోరుకుంటారు. మూసపోసినట్టుగా వుండాలనుకోరు. అందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేటు ఛానళ్ళ శకం మొదలయినప్పుడు, జనం ఆ మార్పుని సాదరంగా స్వాగతించారు. కానీ తాము కోరుకున్న మార్పు తాము కోరిన రీతిలో కాకుండా గాడి తప్పుతున్న పద్దతిని మాత్రం వారు జీర్ణించుకోలేకపోతున్నారు.

యిరవై నాలుగ్గంటల నిరంతర న్యూస్ ఛానళ్ళ పుణ్యమా అని ఈ రోజుల్లో పనికొచ్చే సమాచారం, పనికిరాని సమాచారం టన్నుల లెక్కల్లో ప్రజలకు చేరుతోంది. ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు ఏ మేరకు హరాయించుకోగలదో ఆ టీవీ ఛానల్ల వాళ్ళే ఒక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేస్తే బాగుంటుందేమో. ఎన్ని విషయాలు విన్నా మెదడు మాత్రం దానికి వీలయినంతవరకే నిక్షిప్తం చేసుకుని మిగిలింది  వొదిలేస్తుందంటారు. యిదే నిజమయితే, టీవీ ఛానళ్ళ ద్వారా క్షణక్షణానికీ జనాలకు అందుతున్న సమాచారంలో చాలా భాగం గుర్తుకు రానంతగా వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే చూసిందీ ఎక్కువ కాలం  గుర్తుండి పోతుందనే సిద్దాంతానికి,  సమాచార విస్పోటనం చిల్లులు  పొడుస్తుందనే అనుకోవాలి. ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తుండదు అన్న ధీమాతో, రాజకీయ నాయకులు తరచూ స్వవచనఘాతానికి పూనుకుంటూ ఉండడానికి కూడా బహుశా యిదే కారణమేమో!

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

ఇన్ని పుట్టగొడుగు చానెళ్ళు వాళ్ళ బుచికి చర్చలు అవసరమా సార్.