10, జులై 2021, శనివారం

రంగస్థల కృష్ణ మూర్తి పీసపాటి నరసింహ మూర్తి

(ఈరోజు జులై 10, ఆయన జయంతి)

కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహ మూర్తి గారు.
విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయ మైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన వరకే సంగీతం పద్యంలో చొప్పించి పాడే వారు. ఎంత గొప్పగా ఉండేదో.
ఆయన నాటకం చూడలేకపోతే జీవితంలో వో మంచి అవకాశం పోగొట్టుకున్నట్టే. తెలుగు వారంతా బ్రహ్మరథం పట్టడంతోపాటు, నటుడిగా ఆయనకు రావల్సిన గౌరవాలన్నీ దక్కాయి వొక్క పద్మ అవార్డు మినహా.
ఓసారి తిరుపతి వెంకట కవుల సమక్షంలో ‘ఉద్యోగ విజయాలు’ పోటీలు జరిగాయి. అందులో కృష్ణ పాత్రధారి పీసపాటి బంగారు కీరీటం బహుమతిగా పొందారు. 'మామా సత్యవతీ పౌత్రా! ధాత్రరాష్ట్రులకు పాండవులకు సంధి చేసి ఈ రాజలోకమ్మును కాపాడుమని యాచించుటకయి పాండవదూతగా నీ వద్దకు వచ్చితి’ అంటూ ఆయన రాయబారం సీన్ లో ప్రవేశించడం ఓ మధురాతి మధురమైన జ్ఞాపకం. ‘పతితులు కారు నీయెడల భక్తులు, శుంఠలు కారు విద్యలన్ చతురులు’ అని పాండవుల గొప్పతనం గురించి కౌరవుల సభలోచెప్పడం కూడా ఎంతో రమ్యంగా వుండేది. ‘ఒన్స్ మోర్’ లు పట్టించుకునే వారు కాదు. ఇక తప్పని సరి అయితే సంభాషణలు మార్చి కొత్తదనంతో అదే పద్యాన్ని కొద్దిగా మార్చి పాడేవారు. ప్రేక్షకులంతా హర్ష ధ్వానాలు చేసేవారు.
తెలుగు నాటకరంగాన్ని కొన్నేళ్ళ పాటు ఏలిన నటుడు పీసపాటి నరసింహ మూర్తి.



1 కామెంట్‌:

Surya Mahavrata చెప్పారు...

పీసపాటివారు రావికొండలరావు గారి కన్యాశుల్కం టెలీ సీరియల్ (99టీవీ) లో లుబ్ధావధాన్లుగా అద్భుతంగా నటించారు.