6, సెప్టెంబర్ 2014, శనివారం

అలనాటి బెజవాడ -2


దుర్గ గుడిలో ఈ రోజుల్లో కనబడుతున్న భక్తుల రద్దీ అప్పట్లో లేదు. నలభయ్యవ  దశకంలో ఎప్పుడు చూసినా, ఒక్క నవరాత్రులను మినహాయిస్తే, గుళ్ళో  పది పన్నెండు మంది కంటే ఎక్కువ కానవచ్చేవారు కారు. బెజవాడకు లాండ్ మార్క్ లాటి దుర్గ గుడి వల్లే విజయవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు. కాళి మాత  రాక్షసుల మీద సాగించిన పోరులో విజయం సాధించిన కారణంగా ఆ విజయానికి సంకేతంగా విజయవాడ అన్న పేరు వచ్చిందని స్తల పురాణం  చెబుతుంది.  అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసింది  దుర్గ గుడి  కొలువైవున్న ఇంద్రకీలాద్రి అనే పర్వతంపైనే అనే మరో ఐతిహాసం వుంది. బంగాళాఖాతంలో సంగమించడానికి ఉరుకులు పరుగులు పెడుతూ కృష్ణమ్మ ఈ కొండ పక్కగా  బిరా బిరా పారుతూ వుంటుంది.
వేసవి కాలంలో బందరు కాలువ, రైవస్ కాలువ, ఏలూరు కాలువల లాకులు కట్టేసేవారు. నీళ్ళు లేకపోవడంతో ఆ కాలువలన్నీ ఇసుక మేటలుగా కానవచ్చేవి. మళ్ళీ సీజనులో కాలువలకు నీళ్ళు  వొదిలేటప్పుడు చూడాలి, వందలాదిమంది ఆ కాలువల  వంతెనల మీద చేరేవారు. సుళ్ళు తిరుగుతూ కృష్ణ నీళ్ళు కాలువల్లోకి ఒక్కమారుగా నురుగులు కక్కుతూ  జారిపోయే దృశ్యం చూస్తూ పరవశించి పోయేవారు. ఇలాటివి మరపురాని దృశ్యాలయితే,  మరచిపోవాలనుకునేవి  మరికొన్ని లేకపోలేదు. ఆ రోజుల్లో చాలామంది కాలవ గట్లనే కాలకృత్యాలకు వాడేవారు. పరిస్తితి  ఇప్పుడెలావుందో తెలవదు.
గవర్నర్ పేటలో వున్నప్పుడు ఇంద్రకీలాద్రి ఎక్కే ప్రయత్నం చేయలేదు కాని, ఏడెనిమిదేళ్ళ వయస్సులో వర్జిన్ మేరీ హిల్ అనే కొండ ఎక్కుతూ వుండేవాళ్ళం. అలా ఎక్కేటప్పుడు కాలు జారితే ఇంతే సంగతులు. పడిపోకుండా పట్టుకోవడానికి చిన్న చిన్న పొదలు తప్ప వేరే ఏ ఆధారం వుండేది కాదు.
ఒక జీవ నది, మూడు కాలువలు, అనేక కొండలు ఇవన్నీ బెజవాడకు సహజ సిద్ధంగా వున్న అలంకారాలు. సక్రమంగా అభివృద్ధి చేసివుంటే,  జార్జియాలోని అందమయిన  తిబ్లిసీ నగరానికి ఏమాత్రం తీసిపోయేది కాదన్నది వాస్తవం. (సశేషం)

( అమెరికాలో వుంటున్న శ్రీ దాసు కృష్ణమూర్తిగారి ఇంగ్లీష్ జ్ఞాపకాలకు తెలుగు అక్షర రూపం)

కామెంట్‌లు లేవు: