30, జూన్ 2025, సోమవారం

అయాం ఎ బిగ్ జీరో (187) : భండారు శ్రీనివాసరావు

 శత వసంత పాత్రికేయస్ఫూర్తి దాసు కృష్ణమూర్తి

హాయిగా, ఎంచక్కా రాసుకుంటూ, చదువుకుంటూ నిండు నూరేళ్లు జీవించగలిగిన అదృష్టవంతులు అరుదుగా వుంటారు. వారిలో ఒకరు దాసు కృష్ణమూర్తి గారు. వందేళ్ళ చరిత్ర వారి వెనక వుందని అర్ధం.  

పదమూడేళ్ల క్రితం నాకు అమెరికా నుంచి ఒక మెయిల్ వచ్చింది. అప్పటికి నేను బెజవాడ గురించి నా బ్లాగులో రాసిన పోస్టు విస్తృత ప్రచారంలో వుంది. ఆ మెయిల్లో ఇలా వుంది.

శ్రీనివాసరావు గారు

నమస్కారం

నేను నా జీవిత జ్ఞాపకాలను అక్షరబద్ధం చేసే పనిలో వున్నాను. పెరుగుతున్న దశలో బెజవాడకు సంబంధించి ఎన్నో ఎన్నెన్నో అనుభవాలు వున్నాయి. మీ బ్లాగులో వాటిని కొంతవరకు చేర్చగలిగితే సంతోషం.

ధన్యవాదాలు

కృష్ణమూర్తి.

అప్పటికి కృష్ణమూర్తి గారు అంటే ఎవరో తెలియదు. ఆ మాటకు వస్తే ఇప్పటికీ వారితో వ్యక్తిగత పరిచయం లేదు. ఆ మెయిల్లో వారు రాసిన మొదటి వాక్యమే నన్ను ఆకట్టుకుంది.

“ఈ లోకంలో మిగిలిన అందరి మాదిరిగానే నా తలితండ్రులను కానీ, పుట్టే ప్రదేశాన్ని కానీ ఎంపిక చేసుకునే అవకాశం నాకు కూడా లేదు. నా పుట్టుక సమయంలో ఆ పరమాత్మ ప్రత్యక్షమై, ‘ఇదిగో ఈ వీసా ఇస్తున్నా, తీసుకో, తీసుకుని వెళ్లి అదిగో ఆ భూప్రపంచంలో జీవించు అన్నాడు. అన్నాడే కానీ ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు  అని నాకు చెప్పలేదు. ఆయన మాట ప్రకారం, జులై మాసంలో ఒక రోజు సాయంత్రం వర్షం కురుస్తున్న వేళ, మా తాతగారి ఇరవై ఒక్క గదుల విశాలమైన భవంతిలో మా అమ్మ కడుపున జన్మించి, ఈ పుడమిపై పడ్డాను”

ఇటువంటి రచనా చమత్కారాలతో కృష్ణమూర్తిగారు నాకు ఇంగ్లీష్ లో పంపిన మెయిల్లో బెజవాడ గురించిన అనేక విశేషాలు వున్నాయి. నేను క్షణం ఆలస్యం చేయకుండా వాటిని తెనుగు చేసి నా బ్లాగులో పోస్టు చేయడం మొదలుపెట్టాను. వాటి ద్వారానే వారెవరన్నదీ, వారి వయసు ఎంతన్నదీ మొదలైన వివరాలు తెలిశాయి.  ఇంత గౌరవంగా నాకు ఉత్తరం రాసిన పెద్దమనిషి గొప్పతనం అవగతమైన తర్వాత  జర్నలిస్టు అనే వాడు ఎంత వినమ్రంగా వుండాలో బోధపడింది.

2025 జులై ఒకటిన దాసు కృష్ణ మూర్తిగారు వందో ఏట అడుగుపెడుతున్నారు. నూరు వసంతాల పండుగ జరుపుకుంటున్న శుభ సమయంలో వారిని గురించి ఏమని రాయను. అందుకే ఆయన బెజవాడ గురించి నాకు ఏమి చెప్పారో, ఏమి రాశారో వాటి తెలుగు అనువాదాన్ని వారికి తిరిగి పుట్టిన రోజు  కానుకగా ఇస్తున్నాను. స్వేచ్ఛగా అనువాదం చేసే అవకాశం ఇచ్చిన దాసు కృష్ణమూర్తి గారికి శతసహస్ర ధన్యవాదాలు.

నాకు రాసిన లేఖలో  కృష్ణమూర్తి గారు తనని తాను పరిచయం చేసుకుంటూ, ‘నేను అమెరికాలో ఉంటున్నాను. వలస పక్షిని. ఒకచోట కాదు, మూడు ప్రదేశాలకు వలస వెళ్లాను. ముందు బెజవాడ నుంచి హైదరాబాదు. బెజవాడలో 27 ఏళ్ళు. హైదరాబాదులో 29 ఏళ్ళు. రెండోది ఢిల్లీ. అక్కడ 20 ఏళ్ళు.   ఇక ముచ్చటగా మూడోది అమెరికా. అదీ ఎప్పుడు. నా డెబ్బయి ఐదో ఏట. నా భార్య గతించిన తర్వాత నా కూతురు తామ్రపర్ణి దగ్గరకు వెళ్ళాను. అప్పటి నుంచి అమెరికాలోనే. ఆ దేశం వెళ్ళడానికి ముందు ఇండియన్ ఎక్స్ ప్రెస్, పేట్రియాట్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ ఇలా అనేక ఆంగ్ల పత్రికల్లో, మీదు మిక్కిలి  సోవియట్ యూనియన్ వున్న కాలంలో అత్యంత భారీ సర్క్యులేషన్ కలిగిన ప్రావ్డా పత్రికలో కూడా సుదీర్ఘ కాలం పనిచేశాను’  అని రాశారు. దీనిని బట్టి ఇక వారి వయస్సునుఅనుభవాన్ని అర్ధం చేసుకోవచ్చు.

పొతే,  బెజవాడ గురించి దాసు కృష్ణ మూర్తి గారి ఇంగ్లీష్ మాటలు నా తెలుగులో:  

“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.

అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే  కృష్ణ మూర్తి గారి ఉద్దేశ్యం దుర్గాకళా మందిరం కావచ్చేమో!) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.

 

“సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి  బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ  చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం మాకు సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.

 

1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత -  కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.    

“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం నాకు బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.

 

“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు  రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు  అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో  తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం  బెజవాడలోనే.

 

“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.

        

“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.

 

“బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు  పట్టి బట్టలు తడిసిపోయేవి.

 

“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక  తరగతి వుండేది. ఆ క్లాసులో  పైన నేల మీద  కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్  కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.

 

1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో  లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో  సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.

     

“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-

 

“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు.  చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.      

 

”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే!  మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని  ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి  బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు  శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల  ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్  రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి  గుంటూరుకూ, ,తెనాలికీ  బస్సు సర్వీసు వుండేది కాదు. 

అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.

“మా ఇల్లు గవర్నర్ పేటలో వుండేది. ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. మాకు వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం  గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు. 

 

“బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే  గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.

“జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూబిగ్గరగా  కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది  స్టేషను ఫుట్ బ్రిడ్జ్  మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.

“ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పుపడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్  డంకర్లీ అండ్ కంపెనీ,  రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు  భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు.  ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమోపోవడమో జరిగేది. రైలు గేటు  వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.  

“ఆ రోజుల్లో  నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలుస్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.

“బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు  చెందిన  విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది.

“దుర్గ గుడిలో ఈ రోజుల్లో కనబడుతున్న భక్తుల రద్దీ అప్పట్లో లేదు. నలభయ్యవ  దశకంలో ఎప్పుడు చూసినాఒక్క నవరాత్రులను మినహాయిస్తేగుళ్ళో  పది పన్నెండు మంది కంటే ఎక్కువ కానవచ్చేవారు కారు. బెజవాడకు లాండ్ మార్క్ లాటి దుర్గ గుడి వల్లే విజయవాడ అనే పేరు వచ్చిందని చెబుతారు. కాళి మాత  రాక్షసుల మీద సాగించిన పోరులో విజయం సాధించిన కారణంగా ఆ విజయానికి సంకేతంగా విజయవాడ అన్న పేరు వచ్చిందని స్తల పురాణం  చెబుతుంది.  అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసింది  దుర్గ గుడి  కొలువైవున్న ఇంద్రకీలాద్రి అనే పర్వతంపైనే అనే మరో ఐతిహాసం వుంది. బంగాళాఖాతంలో సంగమించడానికి ఉరుకులు పరుగులు పెడుతూ కృష్ణమ్మ ఈ కొండ పక్కగా  బిరా బిరా పారుతూ వుంటుంది.

“వేసవి కాలంలో బందరు కాలువరైవస్ కాలువఏలూరు కాలువల లాకులు కట్టేసేవారు. నీళ్ళు లేకపోవడంతో ఆ కాలువలన్నీ ఇసుక మేటలుగా కానవచ్చేవి. మళ్ళీ సీజనులో కాలువలకు నీళ్ళు  వొదిలేటప్పుడు చూడాలివందలాదిమంది ఆ కాలువల  వంతెనల మీద చేరేవారు. సుళ్ళు తిరుగుతూ కృష్ణ నీళ్ళు కాలువల్లోకి ఒక్కమారుగా నురుగులు కక్కుతూ  జారిపోయే దృశ్యం చూస్తూ పరవశించి పోయేవారు. ఇలాటివి మరపురాని దృశ్యాలయితే,  మరచిపోవాలనుకునేవి  మరికొన్ని లేకపోలేదు. ఆ రోజుల్లో చాలామంది కాలవ గట్లనే కాలకృత్యాలకు వాడేవారు. పరిస్తితి  ఇప్పుడెలావుందో తెలవదు.

“గవర్నర్ పేటలో వున్నప్పుడు ఇంద్రకీలాద్రి ఎక్కే ప్రయత్నం చేయలేదు కానిఏడెనిమిదేళ్ళ వయస్సులో వర్జిన్ మేరీ హిల్ అనే కొండ ఎక్కుతూ వుండేవాళ్ళం. అలా ఎక్కేటప్పుడు కాలు జారితే ఇంతే సంగతులు. పడిపోకుండా పట్టుకోవడానికి చిన్న చిన్న పొదలు తప్ప వేరే ఏ ఆధారం వుండేది కాదు.

“ఒక జీవ నదిమూడు కాలువలుఅనేక కొండలు ఇవన్నీ బెజవాడకు సహజ సిద్ధంగా వున్న అలంకారాలు. సక్రమంగా అభివృద్ధి చేసివుంటే,  జార్జియాలోని అందమయిన  తిబ్లిసీ నగరానికి ఏమాత్రం తీసిపోయేది కాదన్నది వాస్తవం.”

కొండంత దేవుడికి గోరంత పత్రి మాదిరిగా శత వసంత పాత్రికేయ దిగ్గజం దాసు కృష్ణ మూర్తి గారికి వారి  పుట్టినరోజున సమర్పించుకుంటున్న నా చిరుకానుక ఇది.

తోకటపా: నా నడిచివచ్చిన దారి, బిగ్ జీరో సీరియల్ లో ఇది 187 వ భాగం. విశేషం ఏమిటంటే ఇది మొదలు పెట్టినప్పుడు, నా బ్లాగు,   వ్యూయర్స్ సంఖ్య పద్నాలుగు లక్షలు. ఇప్పుడు అది పదహారు లక్షలు దాటింది. ఇదంతా పాఠక మిత్రుల పుణ్యం. ధన్యవాదాలు.  

కింది ఫోటో:

అమెరికా, న్యూ జెర్సీలో కుమార్తె తామ్రపర్ణి గారింట, తన వందో ఏట  హాయిగా పుస్తక పఠనంతో కాలక్షేపం చేస్తున్న దాసు కృష్ణ మూర్తిగారు.

నా బ్లాగు వ్యూయర్స్ సంఖ్య










(ఇంకావుంది)

(01-07-2025, Camp: Seattle, USA)

కామెంట్‌లు లేవు: